Friday, April 9, 2010

ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం

ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం -

ఇటీవలి ప్రపంచ ఆర్థిక సంక్షోభ ధాటికి యూరోపియన్‌ యూనియన్‌ దేశమైన గ్రీసు కుప్పకూలటం అందరికీ తెలిసిన విషయమే. ఈ దేశం 300 బిలియన్‌ యూరోల సార్వభౌమ ఋణ చెల్లింపు వైఫల్యాల సుడిగుండంలో ఇరుక్కున్నది. ఫలితంగా యూరోపియన్‌ యూనియన్‌ ఐక్యత, యూరో కరెన్సీ మనుగడ, ఆర్థిక ద్రవ్య సంఘ అస్థిత్వాలపై తీవ్రమైన విమర్శలు, చర్చలు చెలరేగుతున్నాయి.

యూరోపియన్‌ సంఘం (యూరోపియన్‌ యూనియన్‌-ఇ.యు)- మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలతో చవిచూసిన అపార నష్టాలనుండి రక్షించుకోవడం కోసం, ఆర్థిక పరిపుష్టిని పెంచుకొని ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన శక్తిగా యూరోపియన్‌ దేశాలు ఎదగడం కోసం యూరోపియన్‌ యూనియన్‌ ఆవిర్భవించింది. 1951లో పారిస్‌లో యూరప్‌ దేశాల ఐక్యతకు శ్రీకారం చుట్టబడి, 1952లో యూరోపియన్‌ బొగ్గు, ఉక్కు సమాజం పేర (యూరోపియన్‌ కోల్‌ Ê స్టీల్‌ కమ్యూనిటి) ఫ్రాన్స్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, బెల్జియం, పశ్చిమ జర్మనీ, లుగ్జెంబర్గ్‌ దేశాల మద్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యంతో యూరోపియన్‌ యూనియన్‌ స్థాపనకు పునాదులు పడ్డాయి. 1957 సం||లో ఈ దేశాలు యూరోపియన్‌ ఆర్థిక సమాజం (యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటి - ఇ.ఇ.సి) పేర ఒక కష్టమ్స్‌ యూనియన్‌ గాను, అణుశక్తిని అభివృద్ధి చేయటానికి యూరోపియన్‌ అణుశక్తి సమాజం (యూరోపియన్‌ అటామిక్‌ ఎనర్జీ కమ్యూనిటి) గాను ఏర్పడ్డాయి. 1967లో మెర్జర్‌ ఒప్పందం ద్వారా యూరోపియన్‌ సమాజం (యూరోపియన్‌ కమ్యూనిటి - ఇ.సి) ఏర్పడి, 1973లో అంతిమంగా మాస్ట్రీచ్ట్‌ ఒప్పందం ద్వారా యూరోపియన్‌ సమాజం (యూరోపియన్‌ యునియన్‌) ఆవిర్భవించింది. దీనిలో 27 యూరప్‌ దేశాలు సభ్య దేశాలుగా ఉండి 500 మిలియన్ల పౌరుల్ని కలిగివుంది. యూరప్‌ దేశాలలో ఏకీకృత మార్కెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి, తమ సభ్య దేశాలలోని ప్రజలు, సరుకులు, సేవలు, పెట్టుబడిరంగాలలో స్వేచ్ఛా చలనాన్ని యూరోపియన్‌ యూనియన్‌ ఏర్పరిచింది. ఫలితంగా స్థూల ప్రపంచ ఉత్పత్తిలో యూరోపియన్‌ యూనియన్‌ 30% వాటాని కలిగివుంది. యూరోపియన్‌ యూనియన్‌లో ఏ దేశాని కా దేశం అభివృద్ధి అవుతూ, యూరోపియన్‌ యూనియన్‌ సమగ్రాభివృద్ధికి దోహదపడుతున్నది. రాజకీయంగా యూరోపియన్‌ యూనియన్‌ ప్రపంచ చరిత్రలో మహత్తర శక్తిగా ఎదిగింది.


మొదటి భాగం

ఆర్థిక ద్రవ్య సంఘం(ఎకనామిక్‌ మానిటరీ యూనియన్‌ - ఇ.యం.యు)- యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు పటిష్టమై, ప్రపంచ వాణిజ్యంలో బలమైన శక్తిగా ఎదగటానికి సాధనంగా ''ఆర్థిక ద్రవ్య సంఘం భావన'' ఆవిర్భవించింది. యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ఏకీకృతం చేసే సాధనమే ఆర్థిక ద్రవ్య సంఘం. యూరోపేతర దేశాలతో పటిష్టమైన వాణిజ్యాన్ని నెరపడం కోసం, ఆర్థిక సంక్షోభాలనుండి ఆర్థిక వ్యవస్థల్ని రక్షించుకోవడం కోసం యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్ధల మధ్య అంతర్గత ఆర్థిక ద్రవ్య సమన్వయముండాలని 1969లో బర్‌ నివేదిక పేర్కొంది. ఈ కార్య సాధనకు ఆర్థిక ద్రవ్య సంఘం ఉండాలని భావించి అక్టోబర్‌ 1970 నాటికి వార్నర్‌ ప్రణాళిక పేర కార్యాచరణ బ్లూప్రింట్‌ తయారుచేయబడింది. అంతర్జాతీయ కరెన్సీ ప్రమాణంగా బంగారం స్థానంలో డాలర్‌ను అమెరికా ఏక పక్షంగా రుద్దిన సంక్షోభ ఫలితంగాను, 1972లో చమురు సంక్షోభంతో పెరిగిన ధరల మూలకంగాను ఈ ప్రణాళిక అమలుకు నోచుకోలేకపోయింది. కాని ఈ సంక్షోభం నుండి బయటపడటానికి 1973లో ''యూరోపియన్‌ ద్రవ్య సహకారనిధి'' ఏర్పాటు చేయబడింది. యూరప్‌ దేశాల సంఘీభావం నిలబెట్టబడింది. 1979లో ఏర్పడ్డ చమురు సంక్షోభంలో ఆర్థిక ద్రవ్య సంఘ భావన కంటె, ఏకీకృత మార్కెట్‌ భావన ప్రముఖంగా ముందుకొచ్చింది. 1987లో ఏర్పడ్డ ఏకీకృత మార్కెట్‌ చట్టం అమలుతో వివిధ యూరప్‌ దేశాల మద్య పన్నుల విధింపులో సామరస్యం, ఆరోగ్యకర పోటీ ఆవశ్యకతలు అనివార్యమయ్యాయి. వీటికి కొనసాగింపుగా ఏకీకృత మార్కెట్‌కు, ఏకీకృత కరెన్సీ దోహదపడుతూ పుష్కలంగా మార్కెట్లను చేజిక్కించుకోగలమనే విశ్వాసం యూరప్‌ దేశాలలో పెరిగింది

Monday, March 29, 2010

ధరల స్థిరీకరణ నిధి-పరిచయం

ధరలు ఆకాశాన్నంటుతూ, రెండంకెల ఆహార ద్రవ్యోల్భణం ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నది. మూలిగే నక్కపై తాటికాయలా కిరిట్‌ పారిఖ్‌ కమిటీ నివేదిక పెట్రోలియం ఉత్పత్తుల ధరలను సరళీకరించమంటూ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు అమలైతే పెట్రోలియం ఉత్పత్తులపై ఇప్పుడున్న సబ్సిడి తొలగింపబడి వంటగ్యాస్‌ ధర రూ. 100 లు, కిరోసిన్‌ లీటర్‌కు రూ. 6 లు, పెట్రోల్‌ లీటరుకు రూ. 3 లు, డీజిల్‌ లీటర్‌కు రూ. 3-4 లు పెరిగే అవకాశం ఉంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తన బడ్జెట్‌లో పెట్రోలు, డీజిల్‌ ధరలపై పెంచిన పన్ను ప్రతిపాదనలు మండే ధరల అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ నేపధ్యంలో ధరల అదుపు చర్యల పై చర్చిస్తున్న వివిధ ప్రత్యామ్నాయాలలో ''ధరల స్ధిరీకరణ నిధి'' ముఖ్యమైన అంశంగా ముందుకొచ్చింది. వామపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనకు సూత్రధారులుగా నిలబడ్డాయి.

ధరల స్థిరీకరణ నిధి(ప్రైసెస్‌ స్టెబిలైజెషన్‌ ఫండ్‌)

16వ శతాబ్దంలో సముద్రయాన అంతర్జాతీయ వాణిజ్యం అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటున్న కారణంగా ప్రాథమిక సరుకులైన వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల ధరలు తీవ్రమైన అనిశ్చితికి గురౌతుండేవి. ''అంతర్జాతీయ వాణిజ్యంలో సరుకుల ధరలలోని అనిశ్ఛితి, గొప్ప దురాచారంగా'' ఆ రోజుల్లో కీన్స్‌ వర్ణించారు. ఆ దశలో ''ధరల స్థిరీకరణ నిధి'' ప్రక్రియ ముందుకొచ్చింది. వాణిజ్యం ఉత్సాహంగా ఉండి ఎగుమతులు ఊపుగా ఉన్న సమయంలో, సరుకు ధరలలో కొంత భాగాన్ని ఈ నిధికి జమకట్టేవారు. వాణిజ్యం మందకొడిగా ఉండి, ఎగుమతుల ధరలు గిట్టుబాటుకాని రోజుల్లో ఈ స్థిరీకరణ నిధి నుండి కొంత భాగాన్ని నష్టపరిహారంగా ఎగుమతిదారులకు ముట్టజెప్పేవారు. ఈ ప్రక్రియ అంతిమంగా ఎగుమతి దారులు/ఉత్పత్తి దారుల ప్రయోజనాల్ని కాపాడటానికి వినియోగింపబడేది.

ధరల స్థిరీకరణ నిధి రూపంలో ఆయిల్‌ పూల్‌ ఖాతా

1970 దశకంలో నెలకొన్న చమురుషాక్‌కు గురైన వివిధ దేశాలలో నెలకొన్న పెట్రోలియం ధరల అనిశ్చితి నుండి ఆర్థిక వ్యవస్ధను కాపాడుకోవటానికి ధరల స్థిరీకరణ నిధి రూపంలో ఆయిల్‌ పూల్‌ ఖాతాను ఏర్పాటు చేసుకున్నారు. ప్రారంభంలో ఈ నిధికి కొంత ప్రభుత్వ సొమ్మును కేటాయించుకొని, అంతర్జాతీయ పెట్రోలియం ధరలు తగ్గినప్పుడు, తగ్గిన మేరకు సొమ్మును ఈ నిధికి జమ చేసేవారు. ధరలు పెరిగినప్పుడు నిధిలోని సొమ్ముతో పెరిగిన ధరలను స్థిరీకరించుకొని మార్కెట్‌ వడిదుడుకులతో నిమిత్తం లేకుండా చమురు ధరలు నియంత్రించుకొనేవారు. ఈ ఆయిల్‌ పూల్‌ ఖాతాకు అనుసంధానంగా నియంత్రిత ధరల యంత్రాంగం (అడ్మినిస్ట్రేటివ్‌ ప్రైస్‌ మెకానిజం) ఉండేది. ఈ రెండు స్తంభాలపై దశాబ్దాల పాటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూ పెట్రోలియం ధరలుండేవి.

నయాఉదారవాద విధానాల నీడలో పెట్రోలియం ధరలు-

1997 నుండి హైస్పీడ్‌ డీజిల్‌, విమాన టర్బైన్‌ చమురును, 2002 నుండి పెట్రోలును నియంత్రిత యంత్రాంగం నుండి తొలగించారు. అదే సందర్భంలో ఆయిల్‌ పూల్‌ ఎకౌంట్‌ లోని మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ కన్‌సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమచేసారు. ఈ చర్యలకు ఉపక్రమించిన ఆనాటి ఎన్డీయే ప్రభుత్వం ఆయిల్‌ పూల్‌ ఎకౌంట్‌ పరిధి నుండి వంట గ్యాస్‌, కిరోసిన్‌, డీజిల్‌, పెట్రోల్‌లను తొలగించింది. పెట్రోల్‌ డీజిల్‌ ధరలను మార్కెట్‌ శక్తులకు వదిలేసి, కిరోసిన్‌ వంటగ్యాస్‌ ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తున్నది. వీటిపై వచ్చే నష్టాలను చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు అప్పచెప్పింది. ప్రస్తుతం చమురు కంపెనీలను నష్టాలనుండి బయట పడవేయటమనే నెపంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను సరళీకరించటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొంది.

ఈ నేపథ్యంలో 2005 వ సం||లో వామపక్ష పార్టీల ప్రోద్బలంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖకు అనుబంధమైన స్టాండింగ్‌ కమిటీ పెట్రోలియం ధరల నియంత్రణపై సిఫార్సులు చేసింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 1.క్రూడ్‌ఆయిల్‌ పై విధిస్తున్న సెస్‌ను భారతదేశ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమచేయరాదు. ఆ సొమ్ముతో ''ప్రత్యేక ధరల స్థిరీకరణ నిధిని'' ఏర్పాటు చేసి, దీని ద్వారా పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌, కిరోసిన్‌ ధరలను నియంత్రించాలి. ప్రతి సంవత్సరం క్రూడ్‌ ఆయిల్‌పై వసూలు చేస్తున్న సెస్‌ను ఈ నిధికి అనివార్యంగా జమచేయాలి. 2. సామాన్యుడి ప్రయోజనం కోసం ప్రజా పంపిణి లోని కిరోసిన్‌, గృహవినియోగ వంట గ్యాస్‌ పై పూర్తి సబ్సిడీలను కొనసాగించాలి. 3. సామాన్యుడి జీవన ప్రమాణాలను నిర్దేశించే చమురు రంగం నుండి పన్నుల రూపంలో విచక్షణా రహితంగా రెవిన్యూను వసూలు చేయరాదు.

మార్చి 2004 నాటికి క్రూడాయిల్‌ పై రూ. 51,007 కోట్ల సెస్‌ వసూలు చేసినట్లు, ఇందులో ఆయిల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు రూ. 902 కోట్లు ఖర్చు చేసినట్లు స్టాండింగ్‌ కమిటి నిర్ధారించింది. ఈ సొమ్ముకు తదుపరి సంవత్సరాలలో పోగుపడే క్రూడాయిల్‌ సెస్‌ను కలుపుకుంటే పెరిగిన పెట్రోలియం ధరలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంవత్సరము సుమారు రూ.7500 కోట్ల క్రూడాయిల్‌ సెస్‌ వసూలు చేయబడుతున్నది.

ముగింపు

అనేక ఎగుమతి ఆధారిత రంగాలలో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేయబడింది. కొలంబియా, చిలీ, రష్యన్‌ ఫెడరేషన్‌ లాంటి దేశాలలో వివిధ సందర్భాలలో ఈ ప్రక్రియను ఈ మధ్య కాలంలో వినియోగించుకున్నారు. ఈ భావం ఆవిర్భావం నుండి మార్కెట్‌ ఒడుదుడుకుల నుండి ఉత్పత్తి దారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ధరల స్థిరీకరణ నిధి అమలు జరిగింది. ప్రపంచీకరణ కారణంగా సామాన్య ప్రజానీకం పై పెరుగుతున్న భారాల నుండి విముక్తి కోసం చమురు రంగంలో ధరల స్థిరీకరణ నిధి వినియోగదారుల ప్రయోజనాల రక్షణకు ఉపయోగపడింది. కాని చమురు ధరల నియంత్రణలో ధరల స్థిరీకరణ నిధి ప్రక్రియ ప్రయివేట్‌ పెట్టుబడుల లాభార్జనకు అడ్డంకిగా తయారయినందున ప్రయివేటీకరణ విధానాలతో మన దేశంలో ఈ వ్యవస్థను ధ్వంసం చేయపూనుకున్నారు.

Sunday, March 21, 2010

సార్వభౌమ రుణం - సంపన్న దేశాలు

దుబాయ్ తో మొదలై గ్రీస్‌ తదితర యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో నెలకొన్న తీవ్ర ఆర్థిక పరిణామాల నేపథó్యంలో ''సార్వభౌమ రుణం'' (సావరిన్‌ డెట్‌), దాని ప్రభావాల పై ప్రపంచ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది.

సార్వభౌమ రుణం అంటే - యుద్ధాల కోసం ఆర్థిక వనరులు, ఆర్ధికాభివృద్ధి కోసం పెట్టుబడులు, రోజువారి ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల కోసం వివిధ ప్రభుత్వాలు రుణ మార్గాన్ని ఎంచుకోవటం సర్వసాధారణమైనది. ఈ రుణ సేకరణలో దేశీయ వనరుల నుండి దేశీయ కరెన్సీలో పొందే రుణాల్ని ప్రభుత్వ రుణం (గవర్నమెంటు డెట్‌) అంటారు. ఈ ప్రభుత్వ రుణాన్ని బాండులు, సెక్యూరిటీలు తదితర సాధనాల ద్వారా సమీకరిస్తారు. ఈ రుణ సాధనాలు దేశీయ కరెన్సీలోనే చలామణి అవుతాయి. విదేశాలనుండి పొందే ఋణాలకు, కొన్ని దేశాలలో నెలకొనే అదుపు లేని ద్రవ్యోల్బణం, అనిశ్చిత మైన విదేశీ మారక విలువల కారణంగా స్ధిరమైన విదేశీ కరెన్సీలలోనే ఈ విదేశీ రుణ బాండులను జారీ చేస్తారు. వీటిని సార్వభౌమ బాండులు (సావరిన్‌ బాండ్‌లు) అంటారు. 1980లలో వీటికి మంచి గిరాకీ ఉండేది. ఈ సార్వభౌమ బాండులపై చెల్లించాల్సిన రుణ మొత్తాన్ని (సావరిన్‌ డెట్‌) ''సార్వభౌమ రుణం'' అంటారు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే జాతీయ ప్రభుత్వాలు, విదేశీ ప్రభుత్వాలు/సంస్ధల నుండి పొంది విదేశీ మారక ద్రవ్యంలో చలామణి అయ్యే రుణం ఇది. దీంతో పాటు వివిధ ప్రభుత్వాలు, ప్రవేట్‌ పెట్టుబడికి విదేశాలు/సంస్ధలనుండి పొందే రుణాలకు గ్యారంటీని స్తున్నాయి. ఇటువంటి రుణాల్ని కూడా సార్వభౌమ రుణాలుగా పరిగణిస్తారు. సార్వభౌమ బాండులపై అసలు గాని వడ్డీని గాని నిర్ణీత తేదిన తిరిగి చెల్లించలేక పోవటాన్ని సార్వభౌమ రుణ చెల్లింపు వైఫల్యం (సావరిన్‌ డిఫాల్ట్‌) అని అంటారు. సార్వభౌమ రుణ చెల్లింపు వైఫల్యాలు సార్వభౌమ రుణ సంక్షోభాలుగా పరిమాణం చెంది, అంతిమంగా ఆర్థిక సంక్షోభా లకు దారి తీయొచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో రుణ చెల్లింపు వైఫల్యాలు సాధారణ అంశంగా కూడా పరిగణించ బడుతున్నాయి.

సార్వభౌమ రుణ లక్షణాలు - 1. సార్వభౌమ రుణాలకు ప్రభుత్వ హామి ఉన్నందున, రుణాల తిరిగి చెల్లింపుపై రుణ దాతలకు అత్యంత విశ్వాసం ఉన్న కారణంగా రుణాలు సురక్షితాలుగా భావింపబడతాయి. దీని వల్ల రుణాలు పొందాల్సిన దేశాలకు రుణ సమీకరణ సులభతరమవుతుంది. 2. వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిన రుణాలు సక్రమంగా తిరిగి చెల్లింపబడనట్లయితే, రుణాన్ని రాబట్టుకోవడం కోసం కోర్టుల నాశ్రయించడం లేదా ఆస్తుల జప్తులాంటి చర్యలకు పాల్పడ టానికి వీలుంటుంది. కాని సార్వభౌమ రుణాలను సక్రమంగా చెల్లించని దేశాలపై ఇటువంటి చర్యలు చేపట్టటం సాధ్యపడక, రుణాల్ని రీ షెడ్యూల్‌ చేయడం గాని లేదా మాఫి చేయడం గాని అనివార్యమవుతుంది. అందువల్లే అంతర్జాతీయ ద్రవ్య సంస్ధలు రుణాలని ఇచ్చేటప్పుడు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ లను గుప్పెట్లో పెట్టుకొనే చర్యలకు పూనుకుంటాయి.3. ఒక దేశ రుణాన్ని స్థూల దేశీయోత్పత్తిలో (జి.డి.పి) శాతంగా కొలు స్తారు. యూరోపియన్‌ యూనియన్‌ ప్రమాణాలలో యూరప్‌ దేశాల సాధారణ రుణం (దేశీయ, విదేశీ రుణం) జి.డి.పిలో 60% మించితే ఆ దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిన ట్లుగా భావిస్తారు. గతంలో రుణ సంక్షోభంలో చిక్కుకున్న వివిధ దేశాల అనుభవాల ఆధారంగా, ఒక దేశం సార్వభౌమ రుణం ఆ దేశ స్థూలదేశీయోత్పత్తిలో 49.7 % మించితే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రుణ సంక్షోభంలో పడినట్లు నిపుణులు విశ్లేషి స్తున్నారు. 4. 1980లలో లాటిన్‌ అమెరికా దేశాలలో రుణాలు అందించే బూమ్‌ పూర్తయినాకా రుణాల చెల్లింపు వైఫల్యాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సర్వేలు తెలియచేస్తున్నాయి.

5. 1980లలో కొన్ని దేశాలలో రుణ సంక్షోభాలు విదేశీ మారక నిల్వల కరెంటు అకౌంటు ఖాతా అమితంగా పెరుగుతున్న కారణంగా ఏర్పడ్డాయి. కాని 1990లలో విదేశీ మారక నిల్వల పెట్టుబడి ఖాతా లోటు పెరుగుతున్న కారణంగా కూడా సార్వభౌమ రుణ సంక్షోభాలు నెలకొంటున్నట్లు ఆర్థిక నిపుణు లు గుర్తించారు. 6. ఇంత వరకు నెలకొన్న రుణ సంక్షో భాలలో అత్యధిక శాతం, కరెన్సీ సంక్షోభాలు మొదలైన తరువాత సార్వభౌమ రుణ సంక్షోభాలు తీవ్రమయ్యాయి. నయా ఉదార వాద విధానాల ప్రభావంగా పెట్టుబడుల ప్రవాహాలలోని అనిశ్చితి మాలకంగా కరెన్సీ విలువలు తీవ్ర అనిశ్చితికి గురి కావటం ఇందుకు ప్రధాన కారణంగా కొందరు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.7.ఇంత వరకు రుణ చెల్లింపుల వైఫ ల్యాలు వర్ధమాన దేశాలకే పరిమితమయ్యాయి 1824-2004 వరకు రుణ చెల్లింపు వైఫల్యాలలో అత్యధికంగా 126 చెల్లిం పుల వైఫల్యాలు గల చరిత్ర లాటిన్‌ అమెరికాకు దక్కింది. ఆ తరువాత ఆఫ్రికా 63 వైఫల్యాలతో 2వ స్థానంలో ఉంది.8.రుణాల రీ షెడ్యూలింగ్‌ తో వర్ధమాన దేశాల రుణ రేటిం గులు పడిపోయిన కారణంగా ఆయా దేశాలు సార్వభౌమ రుణాలను తీసుకోవడంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాయి. గత దశకంలో మార్కెట్‌లో పెరిగిన లిక్విడిటితో అభివృద్ధి చెం దిన దేశాల ప్రభుత్వాలకే రుణాలు అత్యధికంగా లభించాయి 9. వివిధ దేశాల ఆర్థిక స్థితిగతుల్ని అధ్యయనం చేస్తూ సార్వ భౌమ రుణ ప్రభావాలపై అంతర్జాతీయంగా 3 ప్రధాన రేటింగ్‌ ఏజెన్సీలైన స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌, మూడీ, పిట్చ్‌ తమ రేటిం గ్‌లను ప్రకటిస్తున్నాయి. సుదీర్ఘకాల పరిశీలనలో అభివృద్ధి చెందిన దేశాల రుణ రేటింగ్‌లు చాలా స్థిరంగా ఉన్నాయి.

మంచి రేటింగ్‌ పొందిన ఏ సంపన్న దేశం గత 15 సంవ త్సరాల కాలంలో రుణ చెల్లింపు వైఫల్యాలకు (డెట్‌ డిఫాల్ట్‌) పాల్పడలేదు. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. 10. 2007 వ సంవత్సరంలో జీ-20 ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థలలో సగటు ప్రభుత్వ రుణం సగటు జి.డి.పి లో 80% ఉండి వర్ధమానదేశాల రుణ నిష్పత్తి కంటే రెట్టింపు ఉన్నది. 2014 నాటికి జి-20 ధనిక దేశాల సగటు ప్రభుత్వ రుణం జి.డి.పిలో 120% ఉండొచ్చునని అంచనా వేస్తు న్నారు. సంపన్న దేశాల సాధారణ రుణం తీవ్రంగా పెరిగి పోతున్నది. జపాన్‌ అనేక సంవత్సరాలుగా అత్యధిక రుణ భారంతో కొనసాగుతున్నది. అమెరికా, బ్రిటన్‌ ప్రపంచ అత్యధిక రుణ గ్రస్థ దేశాల జాబితాలో చేరాయి. 11. ఈ దేశాలలో నూతనంగా జన్మించేవారి రేటు గణనీయంగా పడి పోయి, వృద్ధులలో పెరుగుదల అత్యధికమవుతున్నది. దీనిపై వెచ్చించాల్సిన వ్యయం కూడా గణనీయంగా పెరుగుతున్నది. 12. ఈ సంపన్న దేశాల రుణ విధానంలో మౌళిక మార్పులు చేపట్టకపోతే, వీరి రుణ పరిమాణం సమీప భవిష్యత్త్‌లో 3 రెట్లకు పైబడి పెరిగే ప్రమాదముందని రేటింగ్‌ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ముగింపు - విదేశీ రుణాలతో 1960 లలో వర్ధమాన దేశాలలో సంక్షేమ ఆర్థిక నమూనా అమలు చేయబడి వివిధ దేశాలు ఆర్థికాబివృద్ధిని సాధించాయి. 1970లలో ప్రపంచాన్ని కుదిపేసిన చమురు సంక్షోభంతో నెలకొన్న ఆర్థిక దుస్థితి నుండి పేద వర్ధమాన దేశాలను గట్టెక్కించడానికి పశ్చిమ దేశాల బ్యాంకింగ్‌ రుణాలు సహాయపడి, అంతిమంగా వర్ధమాన దేశాలను 1980లలో ''రుణ ఊబి'' లోకి దించాయి. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయబడ్డ ప్రపంచీకరణ విధానాలు పేద వర్ధమాన దేశాలను మరింత రుణ గ్రస్తం చేశాయి. 20వ శతాబ్దం చివరి నుండి సంపన్న దేశాలు తమ తమ దేశాలలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాల్ని అధిగ మించడం కోసం అందుబాటులోకి వచ్చిన సార్వభౌమ రుణాలను వినియోగించుకొని ప్రపంచంలోనే అత్యధిక రుణ గ్రస్త దేశాలుగా తయారయ్యాయి.

వివిధ దేశాల రుణ భారాలు పెరుగుతున్న కొద్దీ, రుణ చెల్లింపు వైఫల్యాలు పెరుగుతున్నాయి. నూతన రుణాలు దొరకని స్థితిలో వివిధ ప్రభుత్వాలు ఈ రుణ భారాల్ని సామాన్య ప్రజానీకంపై రుద్దుతున్నాయి. సామాన్య ప్రజానీకం అనుభవిస్తున్న సంక్షేమ పధకాల కత్తిరింపులకు పూనుకుం టున్నాయి. ఉద్యోగ, ఉపాధి భద్రతపై దాడులు పెరుగుతు న్నాయి. నిరుద్యోగం, దారిద్య్రం సంపన్న దేశాలలో అంతు లేకుండా పెరుగుతున్నది.

2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభ పర్యావసనంగా సార్వభౌమ రుణ సంక్షోభం తీవ్రమైం ది. ఈ ఆర్థిక సంక్షోభ నివారణకు వివిధ ప్రభుత్వాలు రించిన బ్యాంకుల నష్టాలు, సంపన్న వర్గాలకు కల్పించిన రాయితీలతో కూడిన ఉద్దీపన చర్యలు రుణ సమస్యను మరింత జటిలం చేశాయి. గ్రీస్‌ తదితర యూరప్‌ దేశాలలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు తాజా ఉదాహరణ.

Friday, March 5, 2010

బడ్జెట్‌ - పాలక వర్గాలు

ఆర్థిక వ్యవస్థపై బడ్జెట్‌ ప్రభావం గణనీయంగా ఉంటుంది. అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో బడ్జెట్‌ రూపకల్పన ప్రజాతంత్రయుతంగా నిర్వహింపబడాలి. సామాన్య ప్రజల ఆకాంక్షలకు, అభీష్టాలకు అనుగుణంగా ''ప్రజా బడ్జెట్‌'' రూపొందింపబడాలి. స్వతంత్ర భారతంలో ''ప్రజా బడ్జెట్‌''గా మన్ననలు పొందిన బడ్జెట్లు అరుదైనవే. మన దేశంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులే పాలక పక్షాలుగా చలామణి అవుతున్నారు. బడ్జెట్‌ పై పాలక వర్గాల ప్రభావం ఏమిటి? కొన్ని అంశాలను పరిశీలిద్దాం.పాలక వర్గాలు : అధికారం, ఆధిపత్యం ఉన్న రాజకీయ పార్టీలనే పాలక పక్షాలు, పాలక వర్గాలుగా సాధారణంగా పరిగణిస్తున్నారు. పెట్టుబడిదారి విధానంలో ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం, ఆధిపత్యం ఉన్న వర్గాలను పాలక వర్గాలుగా మార్క్సిజం సూత్రీకరిస్తుంది. బడ్జెట్‌పై సంప్రదింపులు-సంపన్న వర్గాలు : బడ్జెట్‌ రూపకల్పన విస్తృతమైన కసరత్తుతో కూడుకొని వుంది. వివిధ మంత్రిత్వ శాఖల ప్రతిపాదనలు, సమీక్షల నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వివిధ డిపార్టుమెంట్‌లు బడ్జెట్‌ ప్రతిపాదనలు తయారు చేయడంలో కీలక పాత్రను నిర్వహిస్తాయి. దీనితో పాటు బడ్జెట్‌ సమర్పణకు ముందు వివిధ సెక్షన్ల వత్తిడి బడ్జెట్‌పై కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందులో సంపన్న వర్గాల లాబీలు ప్రధాన భూమికను పోషిస్తాయి. వీరికి బడ్జెట్‌ పై సంప్రదింపులలో ఆర్థిక మంత్రి ప్రత్యేక సమయాన్ని కేటాయించి చర్చలకు ఆహ్వానిస్తారు.
వీరిలో పారిశ్రామికాధిపతులు, పారిశ్రామిక సంఘాలు, వ్యాపార వాణిజ్య మండలులు, కార్పోరేట్‌ రంగ నిపుణులు, వీరి ఆకాంక్షలను ఆశలను సమర్థించే ఆర్థిక నిపుణులు తదితరులు ప్రముఖంగా ఉంటారు. ఆర్థిక వ్యవస్థ రథసారథులుగా వీరి ప్రాబల్యం ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయాలపై తీవ్రమైన ప్రభావాన్ని కల్గివుంటుంది. దీనితో పాటు వీరి సంక్షేమమే జాతి సంక్షేమంగా, వీరి ప్రయోజనమే ప్రజల ప్రయోజనంగా టీవి ఛానళ్ళు, పత్రికా కథనాలు, వివిధ నిపుణల నివేదికలు ప్రచారం చేస్తుంటాయి. ఈ తతంగమంతా ఈ సంవత్సరం కూడా బడ్జెట్‌ సందర్భంగా కొనసాగింది
.

బడ్జెట్‌-సామాన్య ప్రజలు : భారతదేశాన్ని సంపన్న దేశాల సరసన నిలబెట్టాలనే తపనతో అమలు పరిచిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు సృష్టించిన అసమానతలు, సమాజంలోని అట్టడుగువర్గాల జీవితాలను ఛిద్రంచేసాయి. పారిశ్రామిక సంస్థలపై నియమించిన జాతీయ కమీషన్‌ పరిశీలనలో దేశ జనాభాలో 76.7% పేదలు, దుర్భరులు ఉన్నారు. వీరి రోజువారి ఆదాయం రూ.20 లకంటే తక్కువగా ఉన్నది. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులు. దళిత గిరిజనులలో 1% మాత్రమే అధిక ఆదాయం కలవారుగాను, 11.2% మధ్యస్ధ ఆదాయం కలవారుగాను, మిగిలిన 87.8% అల్పాదాయ వర్గాలుగాను ఉన్నారు. అగ్రకులాలలో 45.2% అధిక మధ్యస్ధ ఆదాయాలు కలిగి వుండగా 54.8% అల్పాదాయ వర్గాలుగా ఉన్నారు. ఇదంతా నయా ఉదారవాద విధానాల అమలు పుణ్యమే.

అయినప్పటికీ ఈ వాస్తవాలను కార్పొరేట్‌ రంగం అంగీకరించదు. ఈ వర్గాల సమగ్రాభివృద్ధే దేశాభివృద్ధిగాను, ధనిక వర్గాల సంపదకు ఈ వర్గాల స్వేదమే పునాదన్న సత్యాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ రూపకల్పనలో గుర్తించరు. బడ్జెట్‌ ప్రతిపాదనలను తయారు చేసే సమయంలో ఆర్థిక మంత్రి ఈ పేదవర్గాలను కాని, వారి ప్రతినిధులను కాని సంప్రదింపులకు ఆహ్వానించరు. వారి అభిప్రాయాలను స్వీకరించరు. గతంలో కేంద్ర కార్మిక సంఘాలను బడ్జెట్‌ సందర్భంగా సంప్రదింపులకు పిలిచేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని గాలికి వదిలేసారు.

బడ్జెట్‌ లో కేటాయించిన సామాజికరంగ నిధులు ఆచరణలో ఖర్చుపెట్టబడక మురిగిపోతున్నాయి. గత ఏడాది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కేటాయించిన నిధులలో సగానికి సగం వినియోగింపబడలేదు. మన రాష్ట్రంలో ఖర్చు పెట్టిన నిధులలో కనీసం 10శాతం అవినీతితో దుర్వినియోగమయ్యాయని అధికారిక సర్వేలు తెలియచేస్తున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14.48 శాతం మందికి మాత్రమే పూర్తి స్థాయి పనులు కల్పించారు. పేదరిక నిర్మూలనకు గత 4 ఏళ్ళుగా లక్షన్నర కోట్ల రూపాయలు కేటాయించామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, ఆచరణలో సాధారణ ప్రజనీకానికి అందింది అతి స్వల్పం. వెనుకబడిన ప్రజల అభ్యున్నతికి వారి జనాభా దామాషా పద్ధతిలో బడ్జెట్‌ నిధుల కేటాయింపు ఉండాలని, వాటిని పూర్తిగా ఖర్చు చేయాలనే రాజ్యాంగ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తున్నారు.

గత బడ్జెట్‌లో నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైబడిన రాయితీలను సంపన్న వర్గాలకిచ్చిన సందర్భంగా, అధిక ధరల నియంత్రణకై సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్ధకు 94 వేల కోట్ల రూపాయలు కేటాయించమన్న నిపుణుల సిపార్సులను, ప్రజాసంఘాల అభ్యర్థనలను అర్థిక మంత్రి త్రోసిపుచ్చారు. ఈ సంవత్సరం బడ్జెట్‌ సందర్భంగా అధిక ధరల నియంత్రణకు చర్యలు లేకపోగా నిత్యావసర వస్తువుల ధరలను మండిరచే పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచేసారు.దళితులలో 2.8 శాతం, గిరిజనులలో 1.4 శాతం మాత్రమే సాంప్రదాయ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. వీరిలో నైపుణ్యాన్ని పెంచటానికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు 2022 నాటికి 50 కోట్ల నైపుణ్యంగల ప్రజలను తయారు చేయటమన్నది సుదూర స్వప్నమే. ముగింపు : నయా ఉదారవాద విధానాల అమలును వేగవంతం చేసే బడ్జెట్‌ ప్రజల జీవన స్థితిగతులను మరింత అస్థిర పరుస్తుంది. సంపన్న వర్గాలకు బాధ్యతగా బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు చేస్తూ, సామాన్య ప్రజలకిచ్చే అరకొర కేటాయింపులను ఔదార్యంగా ఇస్తున్న ట్లుగా ఉన్నది ఆర్ధిక మంత్రి ధోరణి. బడ్జెట్‌ సమ యాన అర్ధిక మంత్రికి సంపన్న వర్గాల స్వరం తప్ప సామాన్య ప్రజల ఆక్రందనలు వినబడటం లేదు. చట్ట సభలలలోని అత్యధికులైన ప్రజా ప్రతినిధుల చర్యలు సంపన్న వర్గాల ప్రయోజనాలతో అంటకాగుతున్నాయి. అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా వీరంతా పాలక వర్గాలే.

Monday, February 22, 2010

బడ్జెట్‌ పై అవగాహన - పరిచయం

సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల బడ్జెట్‌ పై ఉత్కంఠకు నెలవైంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్‌లను ప్రవేశపెడుతుంటాయి. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 26 న సమర్పింపబడనున్నది. కేంద్ర బడ్జెట్‌ లోని కొన్ని అంశాలను స్ధూలంగా అర్ధంచేసుకోవటానికి ప్రయత్నిద్దాం

అంచనాలు :- ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి బడ్జెట్‌లో మూడు రకాల అంచనాలు తారసపడుతాయి. 1. బడ్జెట్‌ అంచనాలు 2. సవరించిన అంచనాలు 3. వాస్తవ లేదా తుది అంచనాలు. ''బడ్జెట్‌ అంచనాలు'' రాబోయే సంవత్సరానికి అంటే 2010-2011కు సంబంధించినవి. బడ్జెట్‌ సమర్పించే సమయానికి పూర్తి సంవత్సరపు వాస్తవ వివరాలు అందుబాటులో వుండని కారణంగా జనవరి 2010 వరకు వాస్తవ లెక్కలకు రాబోయే 2 నెలల కాలానికి సంబంధించిన అంచనాలను కలుపుకొని ''సవరించిన అంచనాలు'' తయారుచేస్తారు. అంటే ఇవి 2009-2010 సం||కు సంబంధించినవి. ''వాస్తవ లేదా తుది అంచనాలు'' 2008-2009 సం||రానికి సంబంధించినవి అంటే క్రిందటి సం||రానికి సంబంధించిన వివిధ ఖాతాల వాస్తవ గణాంకాలు. చట్టసభలు కేవలం బడ్జెట్‌ అంచనాలను మాత్రమే చర్చించి, ఆమోదిస్తాయి.

గమనించాల్సిన అంశాలు :- 1. బడ్జెట్‌ అంచనాలను సవరించిన అంచనాలతోగాని, తుది అంచనాలతో గాని పోల్చకూడదు. సామాన్యంగా ఏ ప్రభుత్వాలైనా బడ్జెట్‌ లో కేటాయించబడ్డ అంచనాల మేరకు పూర్తిగా ఖర్చుపెట్టరు. అందువల్ల ప్రస్తుత బడ్జెట్‌ అంచనాలను, క్రితం సం|| సమర్పించిన బడ్జెట్‌ అంచనాలతోనే పోల్చాలి. సాధారణంగా పాలక వర్గాలు బడ్జెట్‌ అంచనాలను సవరించిన అంచనాలతోగాని, తుది అంచనాలతో గాని పోల్చుతూ బడ్జెట్‌ భ్రమల్ని సృష్టిస్తుంటాయి. 2. ప్రస్తుత బడ్జెట్‌ అంచనాలను గత సం|| బడ్జెట్‌ అంచనాలతో పోల్చేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని లెక్కలోనికి తీసుకొని విశ్లేషించాలి. 3. పెరిగిన అవసరాలు, ప్రాధాన్యతలకు తగ్గట్టు కేటాయింపులు ఉండాలికాని కేవలం గత సం|| కేటాయింపుల కంటే ఈ సం|| కేటాయింపులలో పెరుగుదలను, బడ్జెట్‌లో పెరుగుదలగా భావించకూడదు. 4. ప్రతియేడాది ప్రభుత్వ ఆదాయం సహజంగా పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల కేటాయింపులలోను, రాబడిలోను ఈ పెరుగుదల తప్పనిసరిగా ప్రతిబింబింపబడాలి 5. ప్రభుత్వ ఆదాయ వ్యయాలను స్ధూలదేశీయోత్పత్తిలో శాతంగా చూడాలి. అదే సందర్భంలో మొత్తం ఆదాయ వ్యయాయలలో ప్రతి పద్దు యొక్క ఆదాయ వ్యయాలు ఎంత శాతం ఉన్నాయో విశ్లేషించి పోల్చుకోవాలి. 6. అత్యధికంగా ఉండే ప్రభుత్వ ఆదాయ వ్యయాలు సమాజంలోని ప్రజలపై సహజంగా గణనీయమైన ప్రభావాన్ని కల్గిస్తాయి. ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందనే దాని కంటే ఎలా ఖర్చు పెడుతున్నదో పరిశీలించడం ప్రధానమైనది. అందువలన ప్రభుత్వ వ్యయం పెరిగిందంటే ఎందుకు పెరిగిందో విశ్లేషించాలి. ప్రభుత్వ ఆదాయం పెరిగినా ఏఏ మార్గాల ద్వారా, ఏఏ ఖాతాలలో పెరిగిందో తెలుసుకోవటం కీలకమైంది.

ప్రభుత్వ ఆదాయాలు - పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయాలుగా ప్రభుత్వ ఆదాయాలను వర్గీకరించారు. పన్నుల ఆదాయం - ప్రత్యక్ష పన్నులు (సంపన్న వర్గాలపై విధించేవి - ఆదాయం పన్ను కార్పొరేట్‌ పన్ను వగైరా), పరోక్ష పన్నులు (సామాన్యులపై ప్రభావం కలిగించేవి - ఎక్సైజ్‌ సుంకం, కస్టమ్స్‌ సుంకం వగైరా) గా విభజించబడ్డాయి. పన్నేతర ఆదాయం - గ్రాంట్లు, వడ్డీలు, ప్రభుత్వ రంగ సంస్ధల ఆదాయం, యూజర్‌ చార్జీలు, సర్వీసు చార్జీలుగా ఉన్నాయి. యూజర్‌ చార్జీలు, సర్వీసు చార్జీలు పన్నుల భారం కంటే ఎక్కువగా ఉంటున్నది. సామాన్యంగా పన్నేతర ఆదాయం కంటే, పన్నుల ఆదాయాన్ని పరిశీలిస్తారు. ప్రస్తుతం పన్నేతర ఆదాయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది.

ప్రభుత్వ ఆదాయం ఎంత పెరిగింది అనే దాని కంటే రావాల్సిన ఆదాయం ఎంత పోయింది అనే అంశాన్ని పరిశీలించాలి ప్రభుత్వ ఆదాయంలో ప్రత్యక్ష పరోక్ష పన్నుల నిష్పత్తి చూస్తారు. ఇది సామాన్యంగా 70:30 గా ఉంటుంది. విశ్లేషించాలి పన్నులు పెంచినంత మాత్రాన తప్పని, తగ్గించినంత మాత్రాన భేష్‌ అని మెచ్చుకోలేము. సామాన్యుడి దృష్ఠిలో పన్నుల ప్రభావాన్ని పరిశీలించాలి. ఇదే గీటురాయి.

రెవిన్యూ, మూలధన ఖాతాలు :- ఈ రెండు ఖాతాలలో ఆదాయం, వ్యయం రెండు ఉంటాయి.

1. ప్రభుత్వం ఇప్పటికే కల్పిస్తున్న సదుపాయాలను కొనసాగించటానికి అయ్యే వ్యయం రెవిన్యూ వ్యయంగాను, అదనంగా కల్పించే సదుపాయాలకు అయ్యే వ్యయాన్ని మూలధన వ్యయంగాను పరిగణిస్తారు. 2. పన్నులు,పన్నేతర మార్గాల ద్వారా వచ్చేది రెవిన్యూ ఆదాయం అంటారు. మూల ధన ఆదాయంలోని రాబడి దాదాపు 90% ప్రభుత్వం తీసుకొనే అప్పుల ద్వారా సమీకరించబడుతుంది. మిగతా 10% ఆదాయం ప్రభుత్వం తానుగా అప్పుయిచ్చిన వారినుండి తిరిగి వచ్చే చెల్లింపులు, ప్రభుత్వరంగ సంస్ధల వాటాల ద్వారా వచ్చే రాబడి. అప్పులు, పెట్టుబడి ఉపసంహరణ విధానాలు ప్రధానంగా ఉండే బడ్జెట్‌ లో మూలధన ఖాతా ఆదాయ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. రెవిన్యూ ఆదాయానికి మించిన వ్యయాన్ని రెవిన్యూ లోటని, మూల ధన ఖాతా ఆదాయం కంటే పెరిగిన వ్యయాన్ని మూల ధన లోటని, మొత్తం ఆదాయాలకు మించిన వ్యయాన్ని మొత్తం లోటని అంటారు. 1980 వరకు రెవిన్యూ లోటు అధిక ప్రాధాన్యతను పొందేది. ఆ కాలంలో ప్రభుత్వ లోటు పెరిగితే ప్రభుత్వమే దివాళా అనుకునేవారు. 1997 వరకు బడ్జెట్‌ లోటు భావన ప్రధానంగా ఉంది. ఆ తరువాత కాలంలో ద్రవ్యలోటు అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం రెవిన్యూ, మూల ధన వ్యయాలకు, ఋణాలు మినహాయించిన మొత్తం రెవిన్యూ మూల ధన ఆదాయాల మధ్య ఉండే తేడాను స్ధూలద్రవ్య లోటు అంటారు. గత సం|| మునపటి వరకు ద్రవ్యలోటు ఆర్ధిక వ్యవస్ధకు గుదిబండగా వ్యవహరించేవారు. కాని ప్రపంచ ఆర్ధిక సంక్షోభ నేపధ్యంలో గత సంవత్సర బడ్జెట్‌లో ఈ ద్రవ్యలోటే ఆర్ధిక వ్యవస్ధ రక్షణకు కల్పతరువైంది.

అభివృద్ధి, అభివృద్దేతర వ్యయాలు :- ప్రభుత్వ వ్యయాన్ని రెవిన్యూ వ్యయం మూలధన వ్యయంగా కాకుండానే అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయంగా కూడా వర్గీకరిస్తున్నారు. ఆర్ధిక వ్యవస్ధలో ఉత్పత్తిని, ఆదాయాలను ఉత్పాదకతను పెంచేవ్యయాన్ని అభివృద్ధి వ్యయం అంటారు. ప్రజల సంక్షేమానికి, పేదరిక నిర్మూలనకు ఉపయోగపడి, ప్రత్యక్షంగా ఉత్పత్తికి దోహదం చేయని ఖర్చును అభివృద్ధేతర వ్యయం అంటారు. సబ్సిడిలన్నీ అభివృద్దేతర వ్యయం కాదు. సబ్సిడి బియ్యం పై ఖర్చును అభివృద్ధేతర వ్యయంగా వర్గీకరిస్తారు. కాని ఎరువులపై సబ్సిడిని అభివృద్ధి వ్యయంగా పరిగణిస్తారు.

ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు :- కేంద్ర ప్రభుత్వ వ్యయంలో అధిక భాగం ప్రణాళికేతర వ్యయంగా ఉంటుంది. ఈ ప్రణాళికేతర వ్యయంలో అత్యధిక భాగం వడ్డీల చెల్లింపులు. ఆ తరువాత స్ధానంలో రక్షణ , సబ్సిడి వ్యయాలుంటాయి. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికి ఖచ్చితమైన నిర్వచనం లేదు. ప్రభుత్వ అవగాహన ప్రకారం ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు మారుతుంటాయి. ప్రభుత్వం అతి ప్రధానంగా భావించే అంశానికి పెట్టే వ్యయాన్ని ప్రణాళిక వ్యయంగా చూపుతారు. అత్యధిక ప్రాధాన్యత లేని వ్యయం ప్రణాళికేతర వ్యయం. ఎయిడ్స్‌ పై ఖర్చు ఒక సంవత్సరం ప్రణాళికా వ్యయం అవుతుండగా మరో సంవత్సరం ప్రణాళికేతర వ్యయంగా మారవచ్చు. బడ్జెట్‌ లో చూపే ప్రణాళిక వ్యయం మాత్రమే ప్రణాళిక కేటాయింపులు కాదు. ప్రభుత్వ రంగ సంస్ధకు బడ్జెట్‌లో 1000 కోట్లు కేటాయించబడి, ఆ ప్రభుత్వ రంగ సంస్ధ తన సొంత వనరుల నుండి 500 కోట్లు కేటాయిస్తే మొత్తం ప్రణాళికా కేటాయింపు 1500 కోట్లు అవుతుంది. ప్రణాళిక వ్యయానికి, ప్రణాళిక కేటాయింపులకు మధ్య ఉన్న తేడాను గమనించాలి.


Tuesday, February 16, 2010

పెట్టుబడుల ఉపసంహరణ - ఫ్రెంచ్‌ వేలం పద్ధతి

ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ యుపిఏ రెండవ దఫా ప్రభుత్వ విధానాలలో కీలక స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభ నేపధ్యంలో కొంత ఆలస్యమైనప్పటికి, తిరిగి ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటున్న క్రమంలో ఈ ప్రక్రియ వేగంగా ముందుకు వస్తుంది. వాటాల ఉపసంహరణకు ప్రభుత్వం ఇంతవరకు ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపిఒ), ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పిఒ) పద్ధతులను పాటిస్తూ వచ్చింది. తాజాగా ఫ్రెంచ్‌ ఆక్షన్‌ పద్ధతిని పాటించనున్నట్లు పెట్టుబడుల ఉపసంహరణశాఖ కార్యదర్శి ప్రకటించారు.

ఫ్రెంచ్‌ వేలం పద్ధతి: అత్యధిక ఆదాయం పొందటం లక్ష్యంగా రూపొందించిన వేలం పద్ధతి ఇది. 1960వ దశకంలో ఫ్రాన్స్‌లో ఈ పద్ధతిలో వాటాల ఉపసంహరణ ప్రక్రియ విజయంతమైంది. అప్పటి నుండి దీనిని ఫ్రెంచ్‌ వేలం పద్ధతిగా పిలుస్తున్నారు. ఇతర పద్ధతులలో లాగా బిడ్‌లకు ఆఫర్‌ చేసే వాటాధరపై, వాటాల కేటాయింపుపై ఉండే పరిమితులు ఫ్రెంచ్‌ వేలం పద్ధతిలో ఉండవు. ఇతర పద్ధతులలో షేర్‌ ధర (ప్రైస్‌ బ్యాండ్‌) అందరికి సమానంగా ఉండగా, ఫ్రెంచ్‌ పద్ధతిలో షేర్‌ ధర మదుపుదారులందరికి సమానంగా ఉండదు. విభిన్న రకాల షేర్‌ ధరలు, విభిన్న షేర్ల పరిమాణంతో బిడ్‌లు, కేటాయింపులు ఉంటాయి. అత్యధిక ధరకు బిడ్‌ వేసిన వారికి కోరినన్ని వాటాలను మంజూరు చేస్తు, అవరోహణ క్రమంలో షేర్లకు ఆఫర్‌ చేసిన బిడ్‌ ధరల ప్రాతినిధ్యంలో వాటాలు కేటాయించబడుతాయి. సమర్ధత కలిగి, కంపెనీ శక్తి సామర్ధ్యాలను సరిగ్గా అంచనా వేయగలిగే ఆర్ధిక స్ధోమత కల్గినవారికే ఫ్రెంచ్‌ వేలం పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది. అదే సందర్భంలో వాటాలను జారీచేస్తున్న కంపెనీ అత్యధిక మొత్తాలలో పెట్టుబడుల ఆదాయం పొందకల్గుతుంది.

ఫ్రెంచ్‌ వేలం పద్ధతిలో యన్‌.టి.పి.సి అనుభవం: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలలో యన్‌.టి.పి.సి నవరత్న స్ధాయి కల్గిన సంస్ధ. విద్యుదుత్పత్తి రంగంలో అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు గడించిన దిగ్గజంగా ప్రసిద్ధికెక్కింది. 31-03-2009 నాటికి రూ. 49,000 కోట్ల రిజర్వ్‌ నిధులుండి, క్రిత సంవత్సరం నుండి రిజర్వ్‌ నిధులు రూ. 5,000 కోట్లు పెంచుకొని, రూ. 15,000 కోట్ల నగదు బ్యాంకు బాలెన్స్‌లు కలిగి ఉంది. ప్రభుత్వ విధానంలో భాగంగా యన్‌.టి.పి.సి తన వాటాలలో 5శాతాన్ని ఉపసంహరణకు ప్రకటించి అందులో భాగంగా 41.2 కోట్ల వాటాలను (షేర్లు) ఫాలోఆన్‌ ఆఫరింగ్‌ క్రింద అమ్మకానికి పెట్టింది. వీటిలో 20.4 కోట్ల వాటాలను రిటైల్‌ మదుపుదారులు, హైనెట్‌ వర్త్‌ వ్యక్తులకు, మిగిలిన వాటాలను ''క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్యర్స్‌'' (క్యూ. ఐ.బి)కు కేటాయించింది. రిటైల్‌ మదుపుదారులు హై నెట్‌వర్త్‌ వ్యక్తులకు మంత్రుల బృందం నిర్ణయించిన ఫ్లోర్‌ ధరకు అమ్మకానికి పెట్టింది. క్యూ.ఐ.బిలకు కేటాయించిన వాటాలను ఫ్రెంచ్‌ వేలం పద్ధతిలో విక్రయించటానికి నిర్ణయించింది. ఈ పరిణామాలు యన్‌.టి.పి.సి వాటాల ఉపసంహరణ పై దేశవ్యాప్తంగా పెట్టుబడి మార్కెట్‌లో తీవ్ర సంచలనాన్ని కలిగించాయి.

ఇంతటి సంస్ధ పబ్లిక్‌ ఆఫరింగ్‌కు వెళ్ళుతుండటంతో మదుపుదారులలో ఉత్సాహం,ఆసక్తి సహజంగా రేకెత్తుతాయి. డిశంబరు 2009లో ఫాలోఆన్‌ ఆఫర్‌కు సెబీలో నమోదు చేసుకొని రికార్డు సమయంలో జనవరి 2010లో పబ్లిక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 3-5 తేదిలలో బిడ్డింగ్‌ ప్రక్రియను సైతం పూర్తిచేసుకుంది.

కాని వివిధ అంచనాలకు భిన్నంగా రూ. 8,300 కోట్ల విలువ కలిగి, 41.2 కోట్ల షేర్లు ఆఫర్‌ చేసిన ఈ కంపెనీకి ఆచరణలో 49.36 కోట్ల షేర్లు మాత్రమే బిడ్డింగ్‌ అయ్యాయి. అంటే 1.2 రెట్లు మాత్రమే అదనపు గిరాకీ (ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌) పలికింది. యన్‌.టి.పి.సి కీర్తి ప్రతిష్టలకు ఈ స్ధాయి మదుపుదారుల స్పందన అందరిని నిరుత్సాహపర్చింది. రిటైల్‌, హైనెట్‌ వర్త్‌ వ్యక్తులకు కేటాయించిన 20.4 కోట్ల షేర్లకు గాను కేవలం 1.3 కోట్ల షేర్లు మాత్రమే బిడ్డింగ్‌(బిఎస్‌సి గణాంకాల ఆధారంగా) అయ్యాయి. క్యూ.ఐ.బి. కేటగిరి మదుపుదారులలో కూడా మొదటిరోజు ఉన్న ఉత్సాహం మిగిలిన 2 రోజులు కానరాకపోయినా యఫ్‌.పి.ఓలో నిధుల సమీకరణకు ఫ్రెంచ్‌ వేలం పద్ధతి కొంత మేరకు ఉపయోగపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముగింపు: ఆర్ధిక సంక్షోభం మొదలైన తరువాత 85% విదేశీ సంస్ధాగత మదుపుదారుల పెట్టుబడులు ప్రైమరీ మార్కెట్లలోనే కేంద్రీకరించబడ్డాయి. విదేశీ సంస్ధాగత మదుపుదారులను ఆకర్షించి అధిక ఆదాయం పొందాలనే లక్ష్యంతో విడుదల చేసిన యన్‌.టి.పి.సి ని దేశీయ ఆర్ధిక సంస్థలైన యల్‌.ఐ.సి., బ్యాంకులు అత్యధికంగా గట్టెకించాయి. సంస్ధాగత మదుపుదారులకు, రిటైల్‌ మదుపుదారులకు మధ్య సమతుల్యతను సాధిస్తూ, అధిక ఆదాయాలను ఆర్జించాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. అలాగని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(యన్‌.యం.డి.సి), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌(ఆర్‌.ఇ.సి)లలో పెట్టుబడుల ఉపసంహరణపై మార్చిలోగా నిర్మించుకున్న రోడ్‌ మ్యాప్‌ నుండి ప్రభుత్వం వెనుకంజ వేసే పరిస్థతి కనిపించటంలేదు. రాబోయే బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసే సూచనలు అధికంగా ఉన్నాయి. ఫ్రెంచ్‌ పద్ధతైనా, మరొకటైనా వాటాల అమ్మకం వలన లబ్ధి పొందుతున్నది స్టాక్‌మార్కెట్‌ను నియంత్రించే ప్రధాన శక్తులే తప్ప సామాన్యులు కాదు

Friday, February 5, 2010

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌- ఒక పరిశీలన

సామ్రాజ్యవాద ప్రపంచీ కరణ, సంక్షోభంలో కూరుకు పోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ బ్యాంకింగ్‌ గురించిన చర్చ తెరమీదకు వచ్చింది. ఈ చర్చలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కాలంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ప్రపంచ ప్రఖ్యాత బ్యాంకులు సైతం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ డివిజన్లను ఏర్పాటు చేశాయి. కాని పిడుగులా మీదపడ్డ దుబారువరల్డ్‌ ఉదంతంతో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ మనుగడపై కారుమబ్బులు కమ్ముకున్నాయి.

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఆవిర్భావం: ముస్లిం మత సూత్రాల ప్రాతిపదికన నిర్వహించబడే ఇస్లామిక్‌ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఉనికి లోనికి వచ్చింది. 1200 సంవత్సరాల క్రితం బాగ్దాద్‌, డెమస్కస్‌, ఫెజ్‌ మరియు కోర్డోబాలలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు జరిగిన ఆధారాలు ఉన్నాయి. మొదటి తరహా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ సంస్థలు 1960లో పిలిగ్రిమ్స్‌ ఫండ్స్‌ రూపంలో మలేషియాలోనూ, మిట్‌ఖమర్‌ సేవింగ్‌ బ్యాంక్‌గా ఈజిప్టులోనూ వెలిశాయి. 1970లలో సంభవించిన ''మొదటి చమురు సంక్షోభం'' పరిణామాలతో చమురు ఉత్పత్తి చేసే అరబ్‌ దేశాలు నడమంత్రపు సిరులని చేజిక్కించుకోవటంతో ఇస్లామిక్‌ ఫైనాన్స్‌, ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలు విస్తరించాయి. 1974లో దుబారు ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఆవిర్భవించింది. 1974లో ఏర్పాటు చేయబడ్డ ఇస్లామిక్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వివిధ దేశాలలోని ఇస్లామిక్‌ బ్యాంక్‌ల కార్యకలాపాలను అనుసంధానం చేస్తూ 1976 నుండి తన కార్యక్రమాలను విస్తృత పరచింది.

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ లక్షణాలు: ముస్లీం మతాచారాలను నిర్దేశిస్తున్న షరియత్‌ సూత్రాలననుసరించి వడ్డీ(రిబా) నిషేధంతో ఆ స్థానంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ రంగంలో ప్రత్యామ్నాయ పద్ధతులు సృష్టించబడ్డాయి. ప్రపంచంలోనే అన్ని ఇస్లామిక్‌ బ్యాంకులు వడ్డీరహిత సూత్రాన్ని విధిగా పాటిస్తున్నాయి. వివిధ దేశాలలోని చట్టాలు, బ్యాంకుల పరిమాణం, బ్యాంకుల లక్ష్యాలు, విదేశీ బ్యాంకుల పోటీ తట్టుకోవటంలాంటి పరిస్థితులలో రకరకాలుగా ఇస్లామిక్‌ బ్యాంక్‌ తీరుతెన్నులు మారుతున్నాయి. వడ్డీరహిత ఇస్లామిక్‌ బ్యాంకులలో అనుసరిస్తున్న కొన్ని సర్వసామాన్య అంశాల్ని పరిశీలిద్దాం.

1) కరెంట్‌ ఎకౌంట్‌ ఖాతాలు సాంప్రదాయ బ్యాంకులలోలాగా ఉండి, సేవింగ్స్‌ బ్యాంక్‌ల ఎకౌంట్లో మాత్రం స్థిరమైన లాభానికి హామీ ఇవ్వటం లేదు. డిపాజిట్‌దారుల అనుమతితో వారి సొమ్మును ఇతర రంగాలలో పెట్టుబడులు పెడుతుంది. పెట్టుబడి తిరిగిచ్చే గ్యారెంటీ ఉండదు కానీ తక్కువ రిస్కు కలిగిన ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టి నష్టాల భారాన్ని సాధ్యమైనంతగా అదుపు చేస్తున్నారు. లాభాలు వస్తే పంచుతున్నారు.

2) ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లో అత్యధిక ప్రాచుర్యం కలిగినవి ఇస్లామిక్‌ బాండ్‌లు. వీటిని సుకుక్‌లు అని అంటారు. మామూలు బాండ్‌లలో నిర్ణీత సమయంలో అసలు, వడ్డీ ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. కాని సుకుక్‌లలో పెట్టుబడి సొమ్ము ఖచ్ఛితంగా తిరిగి ఇచ్చే గ్యారెంటీ ఉండదు. ఆ సొమ్మును ఒక ఆస్తిలోనూ, వ్యాపారంలోనూ, పరిశ్రమలోనూ బ్యాంక్‌ అజమాయిషీతో పెట్టుబడి పెట్టటం జరుగుతుంది. డిపాజిట్‌దారులు ఆ సంస్థలలో వాటాదారులుగా ఉంటారు. సంవత్సరాంతానికి వచ్చిన లాభనష్టాలను డిపాజిట్‌దారులకు పెట్టుబడి నిష్పత్తిలో పంచుతారు. అందువల్ల లాభనష్టాలని డిపాజిట్‌దారులు విధిగా భరించాల్సి ఉంటుంది. షరియత్‌ సూత్రాలననుసరించి పెట్టుబడులను అత్యధిక రిస్కు కలిగిన విధంగా వినియోగించకూడదన్న షరియత్‌ సూత్రంతో కనీస రిస్కు కలిగిన రియల్‌ఎస్టేట్‌లలో ఈ పెట్టుబడులను పెడుతున్నారు. సుకుక్‌దారుల పెట్టుబడులు సురక్షితంగానూ, లాభదాయకంగానూ ఉంటాయనేది మదుపుదారుల అనుభవం, విశ్వాసం.

3) లీజింగ్‌ పద్ధతి: శక్తివంతమైన ఋణ గ్రహీతకు అతనికి కావలసిన ఆస్తులని/వస్తువులని కొని ఒక నిర్ణీత సమయానికి బ్యాంకు లీజుకిస్తుంది. ఋణ గ్రహీత నుండి వాయిదాలలో లీజు మొత్తాన్ని వసూలు చేస్తుంది. నిర్ణీత సమయం పూర్తిఅయినాక అంగీకరించిన మొత్తాన్ని వసూలు చేసుకున్నాక హక్కుని లీజుదారునికి బదలాయిస్తారు. సాంప్రదాయ బ్యాంకింగ్‌లో డబ్బును ఋణ గ్రహీతకు ఇవ్వటంలా కాకుండా ఆస్థిని ఏర్పరచటం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ప్రత్యేక లక్షణంగా చెపుతారు.

4) ముషరకా: ఇదొక జాయింట్‌ వెంచర్‌లాంటిది. వ్యాపార సంస్థతో బ్యాంక్‌ భాగస్వామ్యం కుదుర్చుకొని పెట్టుబడిని పెట్టి, ఆ వ్యాపార లాభాల నుండి పెట్టుబడిని, కొంత లాభాన్ని సంపాదించిన తరువాత బ్యాంకు ఒప్పందం నుండి నిష్క్రమిస్తుంది.

5) ముదరభా: ఈ పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానం, వనరుల కార్మికుల యాజమాన్యం, నైపుణ్యాలను వ్యాపార సంస్థ ఏర్పాటు చేస్తుంది. పూర్తి ఆర్థిక మద్ధతును బ్యాంకు అందిస్తుంది. లాభాల భాగస్వామ్యం ముందే నిర్ణయించబడుతుంది. నష్టాలు వస్తే బ్యాంకు భరిస్తుంది.

6) ఇవి కాక ఆధునిక బ్యాంకింగ్‌ పద్ధతులైన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌, హైర్‌ పర్చేజ్‌, సేల్‌ అండ్‌ బై బ్యాక్‌ లాంటి ప్రక్రియలను ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లో అమలు చేస్తున్నారు. వడ్డీ స్థానంలో లాభాలలో వాటాలను పొందుతున్నారు. ఇవే కాకుండా సర్వీస్‌ ఛార్జీలు విధిస్తూ వ్యక్తిగత ఋణాలను అందిస్తున్నారు. చిన్న వ్యాపారులు, వ్యవసాయదారులు, మత్స్య వృత్తిలోని అణగారిన ప్రజానీకంలోని కొందరికి సర్వీసు ఛార్జీలు లేకుండా వివిధ ఋణాల్ని విధిగా ఇస్లామిక్‌ బ్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది.

7) షరియత్‌ సూత్రాలననుసరించి జూద ప్రవృత్తి గల రంగాలలో పెట్టుబడులు నిషేధించిన కారణంగా బ్యాంకింగ్‌ పెట్టుబడులు డెరివేటీవ్‌లాంటి అత్యధిక రిస్కు కలిగిన రంగాలకు విస్తరించకపోవటం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌కు రక్షణగా ఉంది.

8) ద్రవ్యమంతా(డబ్బు) ఆస్తులలో మార్చటం మూలకంగా ఇస్లామిక్‌ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక పెట్టుబడికి పెద్దపీట వేయటం జరిగింది. దీని కారణంగా అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి నీలినీడలు ఈ వ్యవస్థపై పరిమితంగా పడ్డాయి.

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ అభివృద్ధి: 2008, 2009 ప్రథమార్ధంలో ప్రపంచవ్యాప్త ద్రవ్య సంక్షోభ తుపానుకు ఇస్లామిక్‌ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా ఉన్నాయని విశ్లేషకులు భావించారు. 2009 బ్యాంకు సర్వేలో 500 ఇస్లామిక్‌ ఫైనాన్షియల్‌ సంస్థల ఆస్తులు 2008 కంటే 28.6% అభివృద్ధిని సాధించాయి. ఈ పెరుగుదల గత 3 సంవత్సరాలుగా నికరంగా సాధించబడుతున్నది. అదే సందర్భంలో ప్రపంచంలోని వెయ్యి అతిపెద్ద బ్యాంకులు 2008లో 21.6% అభివృద్ధి చెంది 2009లో 6.8 శాతమే అభివృద్ధి నమోదు చేసుకున్నాయి. 3 సంవత్సరాల పాటు నికరంగా సాగిన ఇస్లామిక్‌ బ్యాంకుల ప్రగతిలో షరియత్‌ చట్ట పరిధిలో సృజనాత్మకంగా సృష్టించిన కొన్ని సాధనాలు ఉపయోగపడగా వాటి ఆవిష్కరణలో ఇస్లామిక్‌ మేధావుల పాత్ర కూడా ఉంది. ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ పెట్టుబడులు ఒక ట్రిలియన్‌ డాలర్ల స్థాయిని మించినా ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థలో దీని పాత్ర స్వల్పమైంది. ఎక్కువ భాగం ముస్లిం దేశాలకు పరిమితమైంది.ఇరాన్‌, సౌదీ అరేబియా, మలేషియా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లో ముందుండగా కువైట్‌, బెహ్రాన్‌, మలేషియా ఇస్లామిక్‌ ఫైనాన్షియల్‌ సంస్థల నిర్వహణలో ప్రాధాన్యతను వహిస్తున్నాయి.

నయా ఉదారవాద విధానాల ప్రభావాలు: ఆధునిక బ్యాంకింగ్‌ వ్యవస్థలో స్పెక్యులేషన్‌, జూద ప్రవృత్తి అధికంగా ఉంటున్నది. ఈ ధోరణలు ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లో అంతగా కనబడటంలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో రియల్‌ఎస్టేట్‌ రంగం కూడా అత్యధిక స్పెక్యులేషన్‌కు గురికావటంతో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌పై నయా ఉదారవాద విధానాల ప్రాబల్యం పడింది. దుబారు అనుసరించిన ఆర్థిక నమూనా ఈ చక్రబంధంలో చిక్కుకొని దుబారు వరల్డ్‌ సంస్థ 26 బిలియన్‌ డాలర్ల అప్పును తిరిగి చెల్లించటాన్ని వాయిదా వేసింది. వీటిలో 3.52 బిలియన్‌ డాలర్ల సుకుక్‌ బాండ్‌ల విలువలపై చెల్లించాల్సిన 4.5 బిలియన్‌ డాలర్ల అప్పు ఇరుక్కు పోయింది. సురక్షితంగానూ, లాభదాయకంగానూ ఇంతకాలం ఉన్న సుకుక్‌ల మనుగడ ప్రశ్నార్థకమవటంతో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ భవితవ్యం సందేహాల సుడిగుండంలోకి నెట్టబడింది. అదే సందర్భంలో సుకుక్‌ల నిర్మాణంలోనూ షరియత్‌ చట్టాల ఉల్లంఘన ఉన్నట్లు అనేక నివేదికలు బహిర్గతమయ్యాయి. ప్రముఖ షరియత్‌ మేధావి షేక్‌ మహమ్మద్‌ తఖి ఉస్మాని సుకుక్‌లలో 85% షరియత్‌ చట్టాలకు కట్టుబడి లేవని విమర్శించారు. అదే సందర్భంలో పశ్చిమ ఆసియాలోని ఇస్లామిక్‌ అధినేతలు తమ పెట్టుబడుల్ని లండన్‌లాంటి మెట్రో సెంటర్లకు తరలించటం కూడా వింటున్నాము. ప్రపంచ ద్రవ్య సంక్షోభంతో కుదేలైన బ్యాంకులు సైతం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ డివిజన్‌లను ఏర్పాటు చేసి ఆయిల్‌ సొమ్మును హస్తగతం చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ భవితవ్యం ప్రశ్నార్థకమైంది.