Saturday, May 15, 2010

క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ -

అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వేగవంతమైన విస్తరణకు వీలు కల్పిస్తు సృష్టించబడ్డ మరో నూతన ద్రవ్య ఉత్పత్తి ''క్రెడిట్‌ డిఫాల్ట్‌' శ్వాప్స్‌'' (సి.డి.యస్‌) లేదా రుణ చెల్లింపు వైఫల్య పరిహార ఒప్పందాలు. అమెరికా గృహ రుణ బూమ్‌ విజృంభణకు కొల్లెటరలైజ్‌డ్‌ డెట్‌ ఆబ్లిగేషన్స్‌ (సి.డి.ఒలు) తో పాటు క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ (సి.డి.యస్‌.లు) కీలకమైన పాత్రను పోషిం చాయి. గ్రీసు రుణ భారాన్ని తక్కువ చేసి చూపేందుకు గోల్డ్‌ మెన్‌ శ్యాక్స్‌ రూపొందించిన క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ తీవ్రమైన అంతర్జాతీయు ఆరోపణలకు గురికావటం ఈ మధ్య కాలంలో చూసాం.

క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ - వీటిని సి.డి.యస్‌లుగాను లేదా రుణ చెల్లింపు వైఫల్య పరిహార ఒప్పందాలుగాను పిలుస్తారు. ఇవి డెరివేటివ్‌ల స్వభావం కలిగినవి. వీటికి ఆధారమైన రుణ ఒప్పందాల నుండి ఇవి విలువను పొందుతాయి. సి.డి.యస్‌లలో ''హామి'' అనే సేవ సరుకుగా మారుతుంది. రుణ చెల్లింపు వైఫల్యాల ప్రమాదం (రిస్క్‌) నుండి రుణ దాతకు అందించే హామి ఇది. ఈ హామికి అమ్మకందారులు, కొనుగోలు దారులు ఉంటారు. హామి అమ్మకం దారులకు, హామి కొనుగోలు దారులకు మధ్య ఏర్పడిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్‌ (సి.డి.యస్‌) లేదా రుణ చెల్లింపు వైఫల్య పరిహార ఒప్పందం అని అంటారు.

వివరణ - హామి కొనుగోలుదారుడు, హామి అమ్మకం దారులకు నిర్ణిత కాల పరిమితులలో ప్రీమియం లాంటి వాయిదాలు చెల్లిస్తుంటాడు. దానికి ప్రతిఫలంగా కొనుగోలు దారుడు తన బాధ్యతలో ఉన్న రుణ బకాయిలను చెల్లించలేనప్పుడు హామి అమ్మకం దారుడు ఆ బాకీని తీరుస్తాడు. స్ధూలంగా సి.డి,యస్‌. నిర్వచన సారాంశం ఇది. ఉదాహరణకు ఒక ప్రభుత్వం తమ అవసరాల కోసం నిధుల సమీకరణకు బాండులను ప్రజలకు జారీ చేస్తుంది. ఆ బాండులను కొన్న రుణ దాత ఆ బాండులపై సి.డి.యస్‌ ఒప్పందం కుదుర్చుకొని వాయిదాలు కడుతూఉంటే, బాండులు జారీ చేసిన ప్రభుత్వం ఏదైన విపత్కర పరిస్థితులలో బాండు పరిపక్వ తేదీ నాటికి దానిపై చెల్లించాల్సిన ప్రతిఫలాన్ని చెల్లించలేనప్పుడు, ఆ బాధ్యతలను సి.డి.యస్‌ ను జారీచేసిన సంస్థ నిర్వహిస్తుంది. బాండులపై గాని, వాటి ఆధారంగా సృష్టించబడ్డ సి.డి.ఒల పై గాని హక్కులను కైవసం చేసుకొని ఈ సంస్థ మరొకరికి అమ్ము తుంది. అందువల్ల ఒక రుణం ఒప్పందం పై ఒకరికి మించిన రుణ దాతలు ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే సి.డి,యస్‌ అంటే ప్రధాన రుణదాత యొక్క రుణ చెల్లింపు వైఫల్య ప్రమాదానికి వర్తిరచే ఇన్సురెన్స్‌ లాంటిది. కాని సి.డి.యస్‌లకు, ఇన్సురెన్స్‌కు మౌలిక సూత్రాలలో తేడాలున్నాయి.

సి.డి.యస్‌, ఇన్సురెన్స్‌ల మధ్య తేడా- 1.ఇన్సురెన్స్‌లో ఇన్సురెన్స్‌ కొనుగోలుదారుడు అనివార్యంగా ఇన్సురెన్స్‌ చేయబడే రుణ ఒప్పందంలో ప్రత్యక్ష భాగస్వామి కావలసియుంటుంది. ఇది ప్రత్యక్ష ఒప్పందం. అతను ఇన్సురెన్స్‌ ప్రయోజనాలు పొందగలిగే హక్కు (ఇన్స్యూరబుల్‌ ఇన్‌టరెస్ట్‌) కలిగి వుండాలి. సి.డి.యస్‌లో అటువంటి నిబంధన ఏదీ లేదు. సి.డి.యస్‌లు పరోక్ష ఒప్పందాలు. సి.డి.యస్‌ కొనుగోలుదారుడికి సి.డి.యస్‌కు ఆధారమైన రుణ ఒప్పందంతో ఏ విధమైన సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. రుణ గ్రస్తుని ఆర్ధిక స్థోమతపై స్పెక్యూలేట్‌ చేస్తూ, సి.డి,యస్‌ను ఎవరైన కొనుగోలు చేయవచ్చు. రుణ ఒప్పందాలతో సంబంధం లేని వాళ్ళకు అమ్మే సి.డి.యస్‌లను ''నేకెడ్‌ క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌'' లేదా ''నగ రుణ చెల్లింపు వైఫల్య పరిహార ఒప్పందాలు'' అంటారు. ప్రపంచంలోని సి.డి,యస్‌ మార్కెట్‌లో నేకెడ్‌ క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ శాతం అత్యధికం. 2.ఇన్సురెన్స్‌ నియంత్రించబడి వుంటుంది. సి.డి.యస్‌లలో నియంత్రణ లేదు. 3. ఇన్సురెన్స్‌లో అమ్మకం దారుడికి రిజర్వ్‌ నిల్వలు ఉండాలి, సి.డి.యస్‌లలో అలాంటి రిజర్వ్‌ నిధుల అవసరం లేదు. దీని కారణంగా సి.డి.యస్‌ రంగంలో తరచు తీవ్ర అనిశ్చితి నెలకొంటుంది. సి.డి.యస్‌లు స్పెక్యూలేటివ్‌ సాధనాలయ్యాయి. 4. ఇన్స్‌రెన్సులో కట్టవలసిన ప్రీమియంలు ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి. బాండుల యాజమాన్యం మారితే ఇన్స్‌రెన్సు రద్దవుతుంది. అందువల్ల ఇన్స్‌రెన్సులో స్పెక్యూలేషన్‌ కు అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాని సి.డి.యస్‌లలో అలా కాదు బాండు యాజమాన్యం మారినప్పుడు సి.డి.యస్‌ వాయి దాలలో మార్పు ఉంటుంది. బాండు యాజమాన్యంతో నిమిత్తం లేకుండా అనేక మంది ఒకే రుణ ఒప్పందపై అనేక సి.డి.యస్‌లు కొనుగోలు చేసుకొనే అవకాశం ఉన్నందున, సి.డి.యస్‌లను మరొకరికి బదిలి చేసే అవకాశం ఉన్నందున ఈ రంగంలో అత్యధిక స్పెక్యూలేషన్‌కు, దురాశకు అవకాశం దొరికింది.

ప్రయోజనాలు- రుణ మార్కెట్‌ విస్తరణకు ప్రధాన అవరోధమైన రుణ చెల్లింపు వైఫల్య ప్రమాదాన్ని సి.డి.యస్‌లు వాయిదా చేస్తాయి. దీని కారణముగా రుణ మార్కెట్‌ విస్తరణ వేగవంతమై, చెల్లింపు సామర్ధ్యంతో నిమిత్తం లేకుండా వినియోగదారులకు రుణ సదుపాయాలు చేకూరుతాయి.

దుష్పలితాలు- రుణ చెల్లింపు వైఫల్యాల ప్రమాదం సి.డి.యస్‌ల మూలకంగా వాయిదా పడినందువల్ల, సి.డి.యస్‌లపై ఎటువంటి నియంత్రణలు లేనందువల్ల, రుణ దాతలు రుణ మంజూరులో స్వీయ రక్షణ ప్రమాణాలను గాలికి వదిలేసి బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల రుణ వైఫల్యాల సంఖ్య పెరగటం మొదలైంది. పెరిగిన మేరకు పరిహారాలు చెల్లింపలేని స్థితిలో ఉండి సి.డి.యస్‌ మంజూరు సంస్ధలు దివాలా తీయటంతో రుణ చెల్లింపు వైఫల్య ప్రమాదం బ్రద్దలై, ఆర్థిక సంస్థలను, వ్యవస్థలను దివాళా తీయించాయి. అమెరికా గృహ రుణ సంక్షోభంతో బేర్‌ స్టెరన్స్‌ దివాళా తీయగా, అమెరికా ఇన్సురెస్స్‌ గ్రూప్‌ సంస్థ జాతీయం చేయబడింది.

ముగింపు - క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ 1990 ప్రథమార్థంలో సృష్టించబడ్డాయి 1994లో జే.పి. మోర్గాన్‌ అండ్‌ కో తయారు చేసిన సి.డి.యస్‌లు ఈ రంగంలో ఒక మలుపుగా చెప్పుకోవాలి. 2003 సం||లో 3.7 ట్రిలియన్‌ డాలర్లు ఉన్న సి.డి.యస్‌ మార్కెట్‌ 2007 అంతానికి 62.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది.అమెరికాలో నెలకొన్న గృహరుణాల విజృంభణతో సి.డి,యస్‌ల మార్కెట్‌ పరిమాణం అత్యధికంగా పెరిగింది. 2008లో ఆ బుడగ పగిలిపోవటంతో ఆ మార్కెట్‌ 38 ట్రిలియన్‌ డాలర్లకు పడిపోయింది. సి.డి.యస్‌లు జారీ ఒక ఎక్స్ఛేంజ్‌ పరిధినుండి ఉండవు అనేక కంపెనీలు ఒవర్‌దికౌంటర్‌ జారీ చేస్తుంటాయి. వీటిపై నియంత్రణ లేదు. సి.డి.యస్‌ జారీ చేసే సంస్థలకు సాల్వెన్సీ ప్రమాణాలు అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఉవ్వెత్తున పెరుగుతున్న రుణ మార్కెట్‌తో సమానంగా సి.డి.యస్‌ మార్కెట్‌ పెరుగుతుంది. వివిధ ప్రభుత్వాలు చేదు అనుభవాలనుంచి గుణ పాఠాలను పరిమితంగానే తీసుకుంటున్నాయి. భారతదేశంలో కూడా కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ పెరుగుదల కోసం క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ను 2010లో అమలు చేయాలని రిజర్వ్‌ బ్యాంకు ఆరాటపడుతుంది. నియంత్రణలు లేని నూతన ద్రవ్య ఉత్పత్తుల వాణిజ్యం ఆచరణలో ఆర్థిక వ్యవస్థలకు వినాశకరమౌతుంది.

Saturday, April 24, 2010

యూరోజోన్‌ చక్రబంధంలో గ్రీస్‌

నయాఉదారవాద విధానాల అమలుతో తీవ్రంగా రుణగ్రస్తమై, అనేక ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొన్న మెక్సికో, అర్జెంటినా లాంటి అబివృద్ధి చెందుతున్న దేశాల అనుభవాలు గతంలో చూశాం. అమెరికా ద్రవ్య సంక్షోభ తదనంతర పరిణామాలలో భాగంగా అబివృద్ధి చెందిన దేశాలైయుండి, యూరోజోన్‌ ఆర్థిక క్రమ శిక్షణతో పరిపుష్టతను పెంచుకున్న పోర్చుగల్‌, ఇటలీ, ఐర్లాండ్‌, గ్రీస్‌, స్పెయిన్‌ లాంటి యూరో దేశాలు సార్వభౌమ రుణ సంక్షోభంలో కూరుకుపోవడం, వాటిలో గ్రీస్‌ ఆర్థిక దుస్ధితి మరింత దిగజారటం ప్రపంచవ్యాప్త చర్చ అయింది.

గ్రీసు వైభవం - 2001లో గ్రీస్‌ పట్టుబట్టి యూరోజోన్‌లో సభ్యదేశమైంది. ప్రపంచ వాణిజ్య సంస్థ, నల్ల సముద్ర ఆర్థిక సహకార సంఘం, ఆర్థిక సహకార, అభివృద్ధి సంఘం (ఒ.ఇ.సి.డి)లలోను సభ్య దేశంగా ఉంది. 1 కోటి 10 లక్షల జనాభా గలిగిన గ్రీస్‌లో 49 లక్షల మంది కార్మిక వర్గంగా ఉన్నారు. గ్రీసు స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి) లో సేవారంగం 75.7%, పారిశ్రామిక రంగం 20.6%, వ్యవసాయరంగం 3.7% గా ఉండి, ప్రభుత్వ రంగం 40% గా ఉంది. వివిధ ఏజెన్సీల అంచనాల ప్రకారం (2008) జి.డి.పి ప్రాతిపదికన ప్రపంచంలో 27వ అతి పెద్ద సంపన్న దేశంగాను, తలసరి జి.డి.పిలో 26వ దేశంగాను, అత్యధిక మానవాభివృద్ధి సూచిలో 25వ దేశంగాను, నాణ్యత గల జీవనప్రమాణాలు సూచిలో 22వ దేశంగాను గ్రీస్‌ ప్రసిద్ధికెక్కింది. గ్రీస్‌ ఎగుమతి, దిగుమతులలో దాదాపు 50% యూరోజోన్‌ దేశాలతోనే పరిమితమయ్యాయి. గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థలో టూరిజం, షిప్పింగ్‌ రంగాలు ప్రధానమైనవి. చైనా, ఆస్ట్రియా దేశీయులకు గ్రీస్‌ అత్యంత సందర్శనీయమైనది. యూరోపియన్‌ యూనియన్‌ సగటు జి.డి.పిలో గ్రీస్‌ 95% కలిగియున్నా, యూరోజోన్‌ దేశాల మొత్తం జి.డి.పిలో గ్రీస్‌ జి.డి.పి 3%నికి మించదు.

ఇంతటి ఆర్థిక పరిపుష్టి కలిగి సంపన్న దేశంగా చలామణి అవుతున్న గ్రీసు అతి స్వల్పకాలంలోనే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులకు ''అత్యంత ప్రీతి పాత్రమైన గమ్యదేశం''గా పరిణితి పొందింది. వేలాది కోట్ల డాలర్ల అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులు గ్రీస్‌ను ముంచేసాయి. ఆర్థిక ద్రవ్య సంఘంలోను, యూరోజోన్‌లోను సభ్య దేశంగా ఉన్నందున గ్రీస్‌ కు చెల్లించే రుణాలకు పూర్తి గ్యారంటీ ఉంటుందనే విశ్వాసంతో విదేశీ బ్యాంకులు, పెట్టుబడిదారులు అతి తక్కువ వడ్డీకి (2.25%) గ్రీస్‌ రుణ బాండులను కొన్నారు. ఈ రుణ బాండులను గ్యారంటీ చేయటానికి ''రుణ చెల్లింపు వైఫల్య పరిహార సాధనాలు'' (సి.డి.యస్‌) లాంటి డెరివేటివ్‌లు గ్రీస్‌ అర్థిక వ్యవస్థను కైవశం చేసుకున్నాయి (అమెరికా ద్రవ్య సంక్షోభానికి సి.డి.యస్‌.లు ఒక ముఖ్య కారణం). అమెరికా ఆర్థిక నమూనా తరహాలో పొదుపు కంటే వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ, వినియోగం పెరగటానికి రుణాల్ని పెంచారు. దీనితో ప్రభుత్వ వ్యయం అదుపులేకుండా పోయింది. అమెరికా ద్రవ్య సంక్షోభ తదనంతర కాలంలో గ్రీస్‌లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గింది. అందుచేత ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుండి రక్షించటానికి గాను ప్రభుత్వ వ్యయం మరింత పెరిగి, ద్రవ్య లోటు జి.డి.పిలో 12.7%నికి (2009) (యూరోజోన్‌ ప్రమాణం 3%) చేరటంతో గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థలో ప్రమాదఘటికలు మ్రోగాయి.

రుణ సంక్షోభంలో గ్రీస్‌ - ఈ నేపథ్యంలో జరిగిన గ్రీస్‌ సాధారణ ఎన్నికలలో ''జార్జి పాపస్‌ డ్య్రూ'' నాయకత్వంలోని సోషలిస్ట్‌ పాసక్‌ పార్టి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతామనే ప్రధాన వాగ్దానంతో విజయం సాధించి, అధికార పగ్గాలను చేజిక్కించుకున్నది (నవంబరు,2009). దివాళా చేరువకు చేరిన గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థను రక్షించటం కోసం ద్రవ్య లోటును 8.7%కి తగ్గించటానికి పూనుకొంది. అదే సందర్భంలో గ్రీస్‌ రుణ భారం జి.డి.పిలో 113.4% నుండి 121% (యూరోజోన్‌ ప్రమాణం 60%) చేరటం ప్రభుత్వానికి ఆందోళన కల్గించింది. గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలను బహిరంగపర్చింది. గత ప్రభుత్వం గోల్డ్‌మ్యాన్‌ శాక్‌ లాంటి పెట్టుబడి బ్యాంకులతో కుమ్మక్కై ''రుణ చెల్లింపు వైఫల్య పరిహార సాధనాల'' (క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్‌) చాటున అత్యధిక ప్రభుత్వ రుణాన్ని, ద్రవ్య లోటును కప్పి పుచ్చి, పెట్టుబడిదారులను తప్పుత్రోవ పట్టించిన వార్తలు, అవినీతి కార్యకలాపాల కథనాలు గుప్పుమన్నాయి. ప్రభుత్వ పారదర్శకత, విశ్వాసనీయత, రిస్క్‌లపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీనితో అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు గ్రీస్‌ రుణ బాండులపై విశ్వాసనీయ రేటింగ్‌ను తీవ్రంగా కుదించాయి. దీని ప్రభావంతో కొత్తగా వేలం వేసే రుణ బాండులతో పాటు పాత ఖాతాలపై కూడా చెల్లించాల్సిన వడ్డీ, రుణ వ్యయం, సి.డి.యస్‌లపై చెల్లించాల్సిన ప్రీమియం రెట్టింపై ఆర్థిక భారాన్ని తీవ్రంగా పెంచాయి. ద్రవ్య రేటు మరింత పెరిగింది. ఈ స్థితిలో విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. విదేశీ మారక విలువలుఅడుగంటి కరెన్సీ కరెంటు ఎకౌంట్‌ లోటు (యూరోజోన్‌ ప్రమాణం 4%) విపరీతంగా పెరిగింది. 2010లో గ్రీస్‌ చెల్లించాల్సిన 50 బిలియన్‌ యూరోల రుణం తిరిగి చెల్లించలేని స్థితికి దిగజారింది. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ గ్రీస్‌ ఆర్థిక దుస్థితిని తీవ్రంగా పరిగణించింది.

యూరోజోన్‌ చక్రబంధంలో గ్రీస్‌ - ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ప్రతి దేశానికి స్వతంత్రంగా అమలు చేయగల ద్రవ్య విధానాలు కావాలి. ఎగుమతులు పెంచుకోవటం కోసం కరెన్సీ విలువను తగ్గించుకోవాలి. కాని గ్రీస్‌ విషయంలో కధ అడ్డం తిరిగింది. యూరో విలువను తగ్గించటానికి యూరోజోన్‌ ఏకాభిప్రాయం కావాలి. ఇతర దేశాలనుండి ఆర్థిక సహాయం పొందటానికి యూరోజోన్‌ అంగీకారం కావాలి. ఇవన్నీ యూరో జోన్‌ పరిధిలో అసాధ్యాలు. గ్రీస్‌ లో జరిగిన ఆర్థిక అవకతవకలతో జర్మనీ, ఫ్రాన్స్‌ లాంటి యూరో దేశాలు ఆగ్రహించాయి. గ్రీస్‌కు సహాయమందిస్తే, ఇతర రుణ గ్రస్త యూరో దేశాలకూ ఆర్థిక సహాయమందించాల్సిన బాధ్యత మీద పడుతుందని, ఫలితంగా తమ ఆర్థిక వ్యవస్థలపై భారాలు పెరిగి తమ దేశాలు సైతం ప్రమాదపుటంచులకు లాగబడతాయని భయపడ్డాయి. సహాయం చేయకపోతే యూరోజోన్‌ భవితవ్యం ప్రశ్నార్ధకమౌతుందనే డోలాయమానం ఆ దేశాలను ఆవహించింది. ఆర్థిక సహాయం పొందాలంటే గ్రీస్‌ తన ద్రవ్య లోటును జి.డి.పిలో 3%నికి తగ్గించాలని యూరో దేశాలు షరతు పెట్టాయి. ద్రవ్య లోటు అదుపులో భాగంగా గ్రీస్‌, ప్రభుత్వ వ్యయాన్ని భారీగా తగ్గించి, ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలపై, సదుపాయాలపై తీవ్రమైన కోతను విధించాయి. ప్రజాగ్రహం మిన్ను ముట్టింది. తన సందిగ్ధ స్థితిలో యూరోజోన్‌ గ్రీస్‌ను సత్వరం ఆదుకోవటానికి ముందుకు రాలేదు. గ్రీస్‌ కష్టాలు మరింత పెరిగాయి. యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థ ఏకీకరణ అంతిమ లక్ష్యంగా ఏర్పడిన యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్య సంఘం, యూరోజోన్‌లకు క్లిష్టసమయాల్లో యూరోపియన్‌ యూనియన్‌ రాజకీయ మద్దతు లేకపోవటంతోనూ, సంక్లిష్ట పరిస్థితులలో ఉమ్మడి బాధ్యతలతో పాటు ద్రవ్య విధానాలలో స్వతంత్ర కార్యాచరణకు వెసులుబాటు లేకపోవటంతోనూ గ్రీస్‌ ఒంటరి పాలుకావటంతో, యూరోజోన్‌ మనుగడ ప్రశ్నార్ధకమైంది. యూరోజోన్‌ ఆర్థిక ప్రగతికి ఊపిరిలూదిన ఉమ్మడి కరెన్సీ భావన నయాఉదారవాద విధానాల నేపధ్యంలో గ్రీస్‌ ఆర్థిక సంక్లిష్టతను మరింతగా పెంచింది.

ముగింపు - తాజాగా యూరోజోన్‌ దేశాలు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ సంయుక్తంగా గ్రీస్‌కు రుణ సహాయాన్ని అందించటానికి సిద్ధమౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్జెంటినా రుణ సంక్షోభ సమయాన అంతర్జాతీయ ద్రవ్య సంస్థ పన్నిన కుయుక్తులు ఆ దేశాన్ని మరింత కష్టాల్లోకి దించింది. యూరోజోన్‌ ఆర్థిక సమస్యలలో, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ జోక్యం, యూరోజోన్‌లో కొత్త సమస్యలను సృష్టించనున్నది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి జీవనాధారంగా గల ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులు దినదిన గండాలే.

Sunday, April 11, 2010

యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం

యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం రెండో భాగం

యూరోపియన్‌ యూనియన్‌ స్థాపనకు, యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్య సంఘ నిర్మాణానికి, యూరో(యూరోపియన్‌ యూనియన్‌ ఏకీకృత కరెన్సీ) ఆవిర్భావానికి మాస్ట్రిచ్ట్‌ ఒప్పందం (1991) అతికీలకమైనది. ఈ ఒప్పందం ఆర్థిక ద్రవ్య సంఘాన్ని (ఇ.యం.యు) మూడు దశలలో నిర్మించదలచింది. మొదటి దశ 1990 జులై 1 నుండి ప్రారంభమై యూరోపియన్‌ సభ్య దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని సుగమం చేయగలిగే స్వేచ్ఛా పెట్టుబడుల చలనాన్ని ఆవిష్కరించింది. యూరోపియన్‌ యూనియన్‌ ఏర్పాటు ఒప్పందం (1993)లో అతి ముఖ్యమైన అంశంగా దీన్ని పరిగణించారు. 1994 నుండి మొదలైన రెండవ దశలో యూరోపియన్‌ యూనియన్‌ సభ్యదేశాలలో ఆర్ధిక ద్రవ్య సంఘానికి సంబంధించిన చట్ట పరమైన ఏర్పాట్లను పూర్తి చేసారు. 1999 జనవరి 1 నుండి ''ఆర్థిక ద్రవ్య సంఘం'' పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది. ఆర్థిక ద్రవ్య సంఘ లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి. 1. సభ్య దేశాల మధ్య ఆర్థిక విధివిధానాలలో సమన్వయ సాధన. 2.ప్రభుత్వ ఋణం, ద్రవ్య లోటులపై పరిమితులు విధించే ద్రవ్య విధానాలలో (ఫిస్కల్‌ పాలసీలు) సమన్వయ సాధన. 3. యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు (ఇ.సి.బి) ఆధ్వర్యంలో సభ్య దేశాలలో స్వతంత్య్ర మార్కెట్‌ మానిటరీ విధాన అమలు సాధన. 4. ఆర్థిక ద్రవ్య సంఘ సభ్య దేశాలలో ఏకీకృత కరెన్సీ ఏర్పాటు. 5. యూరోపియన్‌ యూనియన్‌ మొత్తాన్ని ఏకీకృత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటం.

యూరో ఆవిర్భావం- యూరోపియన్‌ దేశాలలో బాస్కెట్‌ ఆఫ్‌ కరెన్సీల ప్రాతిపదికన నిర్ణయించబడ్డ యూరోపియన్‌ కరెన్సీ యూనిట్‌ (ఇ.సి.యు) స్థానంలో 1999 జనవరి 1 నుండి ''యూరో'' అమలులోకి వచ్చింది. ఆర్థిక ద్రవ్య సంఘ ఏకీకృత కరెన్సీల యూరో చలామణి అవుతుంది. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలన్నీ ఆర్థిక ద్రవ్య సంఘ దేశాలైనప్పటికీ వాటిలో (27 దేశాలలో), 16 దేశాలు మాత్రమే యూరో అమలు దేశాలుగా ఉన్నాయి. ధరల స్థిరీకరణ, ప్రభుత్వ ఋణం (జి.డి.పిలో 60%), ద్రవ్య లోటు (జి.డి.పిలో 3%), కరెంట్‌ ఎకౌంటు ఖాతా లోటు (జి.డి.పిలో 4%)లపై నిర్దిష్ట పరిమితులు పాటించి ఆర్థిక వ్యవస్థ క్రమశిక్షణా ప్రమాణాలకు కట్టుబడగలిగిన యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో యూరో అమలు చేయబడింది. సభ్య దేశాలలో యూరో అమలు అర్హతను యూరోపియన్‌ కౌన్సిల్‌ నిర్ణయిస్తుంది. 1999లో బెల్జియం, జర్మనీ, ఐర్లాండ్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, లుగ్జెమ్‌బర్గ్‌, నెదర్లాండ్స్‌, ఆస్ట్రియా, పోర్చుగల్‌, ఫిన్‌లాండ్‌, 2001లో గ్రీసు, 2007లో స్లొవెనియా, 2008లో సైప్రస్‌, మాల్టా, 2009లో స్లొవాకియా దేశాలు యూరోను ఉమ్మడి కరెన్సీగా అంగీకరించాయి. బ్రిటన్‌, డెన్మార్క్‌ దేశాలు నిర్దిష్ట ఆర్థిక ప్రమాణాలు కలిగివున్నా వారివారి దేశీయ కరెన్సీలను అమలు చేసుకుంటూ యూరో చలామణిని అంగీకరించి ఆఫ్షన్‌ దేశాలుగా ఉన్నాయి. మిగిలిన 9 యూరప్‌ దేశాలు యూరో అమలు కాని నాన్‌ యూరోదేశాలుగా ఉన్నాయి. 1999 జనవరి 1 నుండి యూరో అమలులోకి వచ్చినా, అది 2001 డిశంబర్‌ 31 వరకు ''బుక్‌ కరెన్సీ''గానే చలామణి అయ్యింది. 2002 జనవరి 1 వ తేదీ నుండి యూరో నోట్లు, నాణాలు చలామణిలోకి వచ్చాయి. యూరో పూర్తి స్థాయిలో కరెన్సీగా రంగంలోకి దిగింది.

యూరోజోన్‌- ఆర్థిక ద్రవ్య సంఘంలో యూరోను ఏకీకృత కరెన్సీగా అంగీకరించిన 16 దేశాలను 'యూరోజోన్‌' అని, ఈ ప్రాంతాన్ని 'యూరో ఏరియా' అని అంటారు. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలన్నింటిలోను యూరో ఆమోదయోగ్యమైన కరెన్సీగా చలామణి అవుతుంది. యూరోజోన్‌ 329 మిలియన్ల ప్రజల్ని ప్రభావితం చేస్తున్నది. యూరోజోన్‌ దేశాలలో ప్రభుత్వ ఋణ విముక్తి కోసం బెయిల్‌ అవుట్‌ పథకాలు ఏదేశానికాదేశం అమలు చేయకూడదు. కరెన్సీ విలువను తగ్గించకూడదు. ఆర్థిక, ద్రవ్య వ్యవహారాలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఉమ్మడిగానే జరగాలి.

యూరోప్రాబల్యం - అవిచ్ఛిన్నంగా సాగుతున్న డాలర్‌ ఆధిపత్యానికి యూరో ఆవిర్భావం కొంత మేరకు అడ్డుకట్ట వేసింది.యూరో ప్రాంతానికే పరిమితం కాకుండా, అంతర్జాతీయ కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌ తరువాత రెండవ స్థానాన్ని యూరో అతి తక్కువ సమయంలో సాధించగలిగింది. 2006 మార్చి నాటికి అంతర్జాతీయ ఋణ మార్కెట్‌ లావాదేవీలలో అమెరికన్‌ డాలర్‌ 44% ఉండగా యూరో 33 శాతాన్ని, విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌ లావాదేవీలలో యూరో 40 శాతాన్ని కలిగి ఉంది. ప్రపంచంలోనే విదేశీ మారక నిల్వలలో యూరో నాల్గవ వంతు పొంది, వర్ధమాన దేశాల నిల్వలలో 30% కల్గివుంది. అమెరికా, ఇరాక్‌ మధ్య తలెత్తిన సంక్షోభం సందర్భంగా చమురు వాణిజ్యాన్ని డాలర్‌కు బదులు యూరోలో నెరుపుతానన్న సద్దాం హుస్సేన్‌ బెదిరింపు అమెరికాకు గంగవెర్రులెత్తించింది. ఇటీవలి ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రథమార్ధంలో యూరో ప్రాబల్యం అనూహ్యంగా పెరిగింది. అమెరికన్‌ డాలర్‌ను తలదన్ని యూరో అంతర్జాతీయ ప్రత్యామ్నాయ కరెన్సీ హోదాకు పరిశీలించగలిగిన స్థాయికి ఎదిగింది. కాని ద్వితీయార్ధంలో యూరోజోన్‌ ఎదుర్కొంటున్న కష్టాలు అనేకం. యూరోజోన్‌ చక్రబంధంలో గ్రీస్‌ తదితర యూరో దేశాలు ఇరుక్కుపోయి, సార్వభౌమ ఋణ సంక్షోభంలో పడ్డాయి. యూరోపియన్‌ యూనియన్‌ను ఏకీకృత ఆర్థిక వ్యవస్థగా మలచి మహత్తర శక్తిగా నిలబెట్టడం కోసం ఏర్పడ్డ యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్య సంఘం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నది.

Friday, April 9, 2010

ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం

ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం -

ఇటీవలి ప్రపంచ ఆర్థిక సంక్షోభ ధాటికి యూరోపియన్‌ యూనియన్‌ దేశమైన గ్రీసు కుప్పకూలటం అందరికీ తెలిసిన విషయమే. ఈ దేశం 300 బిలియన్‌ యూరోల సార్వభౌమ ఋణ చెల్లింపు వైఫల్యాల సుడిగుండంలో ఇరుక్కున్నది. ఫలితంగా యూరోపియన్‌ యూనియన్‌ ఐక్యత, యూరో కరెన్సీ మనుగడ, ఆర్థిక ద్రవ్య సంఘ అస్థిత్వాలపై తీవ్రమైన విమర్శలు, చర్చలు చెలరేగుతున్నాయి.

యూరోపియన్‌ సంఘం (యూరోపియన్‌ యూనియన్‌-ఇ.యు)- మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలతో చవిచూసిన అపార నష్టాలనుండి రక్షించుకోవడం కోసం, ఆర్థిక పరిపుష్టిని పెంచుకొని ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన శక్తిగా యూరోపియన్‌ దేశాలు ఎదగడం కోసం యూరోపియన్‌ యూనియన్‌ ఆవిర్భవించింది. 1951లో పారిస్‌లో యూరప్‌ దేశాల ఐక్యతకు శ్రీకారం చుట్టబడి, 1952లో యూరోపియన్‌ బొగ్గు, ఉక్కు సమాజం పేర (యూరోపియన్‌ కోల్‌ Ê స్టీల్‌ కమ్యూనిటి) ఫ్రాన్స్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, బెల్జియం, పశ్చిమ జర్మనీ, లుగ్జెంబర్గ్‌ దేశాల మద్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యంతో యూరోపియన్‌ యూనియన్‌ స్థాపనకు పునాదులు పడ్డాయి. 1957 సం||లో ఈ దేశాలు యూరోపియన్‌ ఆర్థిక సమాజం (యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటి - ఇ.ఇ.సి) పేర ఒక కష్టమ్స్‌ యూనియన్‌ గాను, అణుశక్తిని అభివృద్ధి చేయటానికి యూరోపియన్‌ అణుశక్తి సమాజం (యూరోపియన్‌ అటామిక్‌ ఎనర్జీ కమ్యూనిటి) గాను ఏర్పడ్డాయి. 1967లో మెర్జర్‌ ఒప్పందం ద్వారా యూరోపియన్‌ సమాజం (యూరోపియన్‌ కమ్యూనిటి - ఇ.సి) ఏర్పడి, 1973లో అంతిమంగా మాస్ట్రీచ్ట్‌ ఒప్పందం ద్వారా యూరోపియన్‌ సమాజం (యూరోపియన్‌ యునియన్‌) ఆవిర్భవించింది. దీనిలో 27 యూరప్‌ దేశాలు సభ్య దేశాలుగా ఉండి 500 మిలియన్ల పౌరుల్ని కలిగివుంది. యూరప్‌ దేశాలలో ఏకీకృత మార్కెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి, తమ సభ్య దేశాలలోని ప్రజలు, సరుకులు, సేవలు, పెట్టుబడిరంగాలలో స్వేచ్ఛా చలనాన్ని యూరోపియన్‌ యూనియన్‌ ఏర్పరిచింది. ఫలితంగా స్థూల ప్రపంచ ఉత్పత్తిలో యూరోపియన్‌ యూనియన్‌ 30% వాటాని కలిగివుంది. యూరోపియన్‌ యూనియన్‌లో ఏ దేశాని కా దేశం అభివృద్ధి అవుతూ, యూరోపియన్‌ యూనియన్‌ సమగ్రాభివృద్ధికి దోహదపడుతున్నది. రాజకీయంగా యూరోపియన్‌ యూనియన్‌ ప్రపంచ చరిత్రలో మహత్తర శక్తిగా ఎదిగింది.


మొదటి భాగం

ఆర్థిక ద్రవ్య సంఘం(ఎకనామిక్‌ మానిటరీ యూనియన్‌ - ఇ.యం.యు)- యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు పటిష్టమై, ప్రపంచ వాణిజ్యంలో బలమైన శక్తిగా ఎదగటానికి సాధనంగా ''ఆర్థిక ద్రవ్య సంఘం భావన'' ఆవిర్భవించింది. యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ఏకీకృతం చేసే సాధనమే ఆర్థిక ద్రవ్య సంఘం. యూరోపేతర దేశాలతో పటిష్టమైన వాణిజ్యాన్ని నెరపడం కోసం, ఆర్థిక సంక్షోభాలనుండి ఆర్థిక వ్యవస్థల్ని రక్షించుకోవడం కోసం యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్ధల మధ్య అంతర్గత ఆర్థిక ద్రవ్య సమన్వయముండాలని 1969లో బర్‌ నివేదిక పేర్కొంది. ఈ కార్య సాధనకు ఆర్థిక ద్రవ్య సంఘం ఉండాలని భావించి అక్టోబర్‌ 1970 నాటికి వార్నర్‌ ప్రణాళిక పేర కార్యాచరణ బ్లూప్రింట్‌ తయారుచేయబడింది. అంతర్జాతీయ కరెన్సీ ప్రమాణంగా బంగారం స్థానంలో డాలర్‌ను అమెరికా ఏక పక్షంగా రుద్దిన సంక్షోభ ఫలితంగాను, 1972లో చమురు సంక్షోభంతో పెరిగిన ధరల మూలకంగాను ఈ ప్రణాళిక అమలుకు నోచుకోలేకపోయింది. కాని ఈ సంక్షోభం నుండి బయటపడటానికి 1973లో ''యూరోపియన్‌ ద్రవ్య సహకారనిధి'' ఏర్పాటు చేయబడింది. యూరప్‌ దేశాల సంఘీభావం నిలబెట్టబడింది. 1979లో ఏర్పడ్డ చమురు సంక్షోభంలో ఆర్థిక ద్రవ్య సంఘ భావన కంటె, ఏకీకృత మార్కెట్‌ భావన ప్రముఖంగా ముందుకొచ్చింది. 1987లో ఏర్పడ్డ ఏకీకృత మార్కెట్‌ చట్టం అమలుతో వివిధ యూరప్‌ దేశాల మద్య పన్నుల విధింపులో సామరస్యం, ఆరోగ్యకర పోటీ ఆవశ్యకతలు అనివార్యమయ్యాయి. వీటికి కొనసాగింపుగా ఏకీకృత మార్కెట్‌కు, ఏకీకృత కరెన్సీ దోహదపడుతూ పుష్కలంగా మార్కెట్లను చేజిక్కించుకోగలమనే విశ్వాసం యూరప్‌ దేశాలలో పెరిగింది

Monday, March 29, 2010

ధరల స్థిరీకరణ నిధి-పరిచయం

ధరలు ఆకాశాన్నంటుతూ, రెండంకెల ఆహార ద్రవ్యోల్భణం ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నది. మూలిగే నక్కపై తాటికాయలా కిరిట్‌ పారిఖ్‌ కమిటీ నివేదిక పెట్రోలియం ఉత్పత్తుల ధరలను సరళీకరించమంటూ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు అమలైతే పెట్రోలియం ఉత్పత్తులపై ఇప్పుడున్న సబ్సిడి తొలగింపబడి వంటగ్యాస్‌ ధర రూ. 100 లు, కిరోసిన్‌ లీటర్‌కు రూ. 6 లు, పెట్రోల్‌ లీటరుకు రూ. 3 లు, డీజిల్‌ లీటర్‌కు రూ. 3-4 లు పెరిగే అవకాశం ఉంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తన బడ్జెట్‌లో పెట్రోలు, డీజిల్‌ ధరలపై పెంచిన పన్ను ప్రతిపాదనలు మండే ధరల అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ నేపధ్యంలో ధరల అదుపు చర్యల పై చర్చిస్తున్న వివిధ ప్రత్యామ్నాయాలలో ''ధరల స్ధిరీకరణ నిధి'' ముఖ్యమైన అంశంగా ముందుకొచ్చింది. వామపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనకు సూత్రధారులుగా నిలబడ్డాయి.

ధరల స్థిరీకరణ నిధి(ప్రైసెస్‌ స్టెబిలైజెషన్‌ ఫండ్‌)

16వ శతాబ్దంలో సముద్రయాన అంతర్జాతీయ వాణిజ్యం అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటున్న కారణంగా ప్రాథమిక సరుకులైన వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల ధరలు తీవ్రమైన అనిశ్చితికి గురౌతుండేవి. ''అంతర్జాతీయ వాణిజ్యంలో సరుకుల ధరలలోని అనిశ్ఛితి, గొప్ప దురాచారంగా'' ఆ రోజుల్లో కీన్స్‌ వర్ణించారు. ఆ దశలో ''ధరల స్థిరీకరణ నిధి'' ప్రక్రియ ముందుకొచ్చింది. వాణిజ్యం ఉత్సాహంగా ఉండి ఎగుమతులు ఊపుగా ఉన్న సమయంలో, సరుకు ధరలలో కొంత భాగాన్ని ఈ నిధికి జమకట్టేవారు. వాణిజ్యం మందకొడిగా ఉండి, ఎగుమతుల ధరలు గిట్టుబాటుకాని రోజుల్లో ఈ స్థిరీకరణ నిధి నుండి కొంత భాగాన్ని నష్టపరిహారంగా ఎగుమతిదారులకు ముట్టజెప్పేవారు. ఈ ప్రక్రియ అంతిమంగా ఎగుమతి దారులు/ఉత్పత్తి దారుల ప్రయోజనాల్ని కాపాడటానికి వినియోగింపబడేది.

ధరల స్థిరీకరణ నిధి రూపంలో ఆయిల్‌ పూల్‌ ఖాతా

1970 దశకంలో నెలకొన్న చమురుషాక్‌కు గురైన వివిధ దేశాలలో నెలకొన్న పెట్రోలియం ధరల అనిశ్చితి నుండి ఆర్థిక వ్యవస్ధను కాపాడుకోవటానికి ధరల స్థిరీకరణ నిధి రూపంలో ఆయిల్‌ పూల్‌ ఖాతాను ఏర్పాటు చేసుకున్నారు. ప్రారంభంలో ఈ నిధికి కొంత ప్రభుత్వ సొమ్మును కేటాయించుకొని, అంతర్జాతీయ పెట్రోలియం ధరలు తగ్గినప్పుడు, తగ్గిన మేరకు సొమ్మును ఈ నిధికి జమ చేసేవారు. ధరలు పెరిగినప్పుడు నిధిలోని సొమ్ముతో పెరిగిన ధరలను స్థిరీకరించుకొని మార్కెట్‌ వడిదుడుకులతో నిమిత్తం లేకుండా చమురు ధరలు నియంత్రించుకొనేవారు. ఈ ఆయిల్‌ పూల్‌ ఖాతాకు అనుసంధానంగా నియంత్రిత ధరల యంత్రాంగం (అడ్మినిస్ట్రేటివ్‌ ప్రైస్‌ మెకానిజం) ఉండేది. ఈ రెండు స్తంభాలపై దశాబ్దాల పాటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూ పెట్రోలియం ధరలుండేవి.

నయాఉదారవాద విధానాల నీడలో పెట్రోలియం ధరలు-

1997 నుండి హైస్పీడ్‌ డీజిల్‌, విమాన టర్బైన్‌ చమురును, 2002 నుండి పెట్రోలును నియంత్రిత యంత్రాంగం నుండి తొలగించారు. అదే సందర్భంలో ఆయిల్‌ పూల్‌ ఎకౌంట్‌ లోని మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ కన్‌సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమచేసారు. ఈ చర్యలకు ఉపక్రమించిన ఆనాటి ఎన్డీయే ప్రభుత్వం ఆయిల్‌ పూల్‌ ఎకౌంట్‌ పరిధి నుండి వంట గ్యాస్‌, కిరోసిన్‌, డీజిల్‌, పెట్రోల్‌లను తొలగించింది. పెట్రోల్‌ డీజిల్‌ ధరలను మార్కెట్‌ శక్తులకు వదిలేసి, కిరోసిన్‌ వంటగ్యాస్‌ ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తున్నది. వీటిపై వచ్చే నష్టాలను చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు అప్పచెప్పింది. ప్రస్తుతం చమురు కంపెనీలను నష్టాలనుండి బయట పడవేయటమనే నెపంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను సరళీకరించటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొంది.

ఈ నేపథ్యంలో 2005 వ సం||లో వామపక్ష పార్టీల ప్రోద్బలంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖకు అనుబంధమైన స్టాండింగ్‌ కమిటీ పెట్రోలియం ధరల నియంత్రణపై సిఫార్సులు చేసింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 1.క్రూడ్‌ఆయిల్‌ పై విధిస్తున్న సెస్‌ను భారతదేశ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమచేయరాదు. ఆ సొమ్ముతో ''ప్రత్యేక ధరల స్థిరీకరణ నిధిని'' ఏర్పాటు చేసి, దీని ద్వారా పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌, కిరోసిన్‌ ధరలను నియంత్రించాలి. ప్రతి సంవత్సరం క్రూడ్‌ ఆయిల్‌పై వసూలు చేస్తున్న సెస్‌ను ఈ నిధికి అనివార్యంగా జమచేయాలి. 2. సామాన్యుడి ప్రయోజనం కోసం ప్రజా పంపిణి లోని కిరోసిన్‌, గృహవినియోగ వంట గ్యాస్‌ పై పూర్తి సబ్సిడీలను కొనసాగించాలి. 3. సామాన్యుడి జీవన ప్రమాణాలను నిర్దేశించే చమురు రంగం నుండి పన్నుల రూపంలో విచక్షణా రహితంగా రెవిన్యూను వసూలు చేయరాదు.

మార్చి 2004 నాటికి క్రూడాయిల్‌ పై రూ. 51,007 కోట్ల సెస్‌ వసూలు చేసినట్లు, ఇందులో ఆయిల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు రూ. 902 కోట్లు ఖర్చు చేసినట్లు స్టాండింగ్‌ కమిటి నిర్ధారించింది. ఈ సొమ్ముకు తదుపరి సంవత్సరాలలో పోగుపడే క్రూడాయిల్‌ సెస్‌ను కలుపుకుంటే పెరిగిన పెట్రోలియం ధరలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంవత్సరము సుమారు రూ.7500 కోట్ల క్రూడాయిల్‌ సెస్‌ వసూలు చేయబడుతున్నది.

ముగింపు

అనేక ఎగుమతి ఆధారిత రంగాలలో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేయబడింది. కొలంబియా, చిలీ, రష్యన్‌ ఫెడరేషన్‌ లాంటి దేశాలలో వివిధ సందర్భాలలో ఈ ప్రక్రియను ఈ మధ్య కాలంలో వినియోగించుకున్నారు. ఈ భావం ఆవిర్భావం నుండి మార్కెట్‌ ఒడుదుడుకుల నుండి ఉత్పత్తి దారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ధరల స్థిరీకరణ నిధి అమలు జరిగింది. ప్రపంచీకరణ కారణంగా సామాన్య ప్రజానీకం పై పెరుగుతున్న భారాల నుండి విముక్తి కోసం చమురు రంగంలో ధరల స్థిరీకరణ నిధి వినియోగదారుల ప్రయోజనాల రక్షణకు ఉపయోగపడింది. కాని చమురు ధరల నియంత్రణలో ధరల స్థిరీకరణ నిధి ప్రక్రియ ప్రయివేట్‌ పెట్టుబడుల లాభార్జనకు అడ్డంకిగా తయారయినందున ప్రయివేటీకరణ విధానాలతో మన దేశంలో ఈ వ్యవస్థను ధ్వంసం చేయపూనుకున్నారు.

Sunday, March 21, 2010

సార్వభౌమ రుణం - సంపన్న దేశాలు

దుబాయ్ తో మొదలై గ్రీస్‌ తదితర యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో నెలకొన్న తీవ్ర ఆర్థిక పరిణామాల నేపథó్యంలో ''సార్వభౌమ రుణం'' (సావరిన్‌ డెట్‌), దాని ప్రభావాల పై ప్రపంచ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది.

సార్వభౌమ రుణం అంటే - యుద్ధాల కోసం ఆర్థిక వనరులు, ఆర్ధికాభివృద్ధి కోసం పెట్టుబడులు, రోజువారి ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల కోసం వివిధ ప్రభుత్వాలు రుణ మార్గాన్ని ఎంచుకోవటం సర్వసాధారణమైనది. ఈ రుణ సేకరణలో దేశీయ వనరుల నుండి దేశీయ కరెన్సీలో పొందే రుణాల్ని ప్రభుత్వ రుణం (గవర్నమెంటు డెట్‌) అంటారు. ఈ ప్రభుత్వ రుణాన్ని బాండులు, సెక్యూరిటీలు తదితర సాధనాల ద్వారా సమీకరిస్తారు. ఈ రుణ సాధనాలు దేశీయ కరెన్సీలోనే చలామణి అవుతాయి. విదేశాలనుండి పొందే ఋణాలకు, కొన్ని దేశాలలో నెలకొనే అదుపు లేని ద్రవ్యోల్బణం, అనిశ్చిత మైన విదేశీ మారక విలువల కారణంగా స్ధిరమైన విదేశీ కరెన్సీలలోనే ఈ విదేశీ రుణ బాండులను జారీ చేస్తారు. వీటిని సార్వభౌమ బాండులు (సావరిన్‌ బాండ్‌లు) అంటారు. 1980లలో వీటికి మంచి గిరాకీ ఉండేది. ఈ సార్వభౌమ బాండులపై చెల్లించాల్సిన రుణ మొత్తాన్ని (సావరిన్‌ డెట్‌) ''సార్వభౌమ రుణం'' అంటారు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే జాతీయ ప్రభుత్వాలు, విదేశీ ప్రభుత్వాలు/సంస్ధల నుండి పొంది విదేశీ మారక ద్రవ్యంలో చలామణి అయ్యే రుణం ఇది. దీంతో పాటు వివిధ ప్రభుత్వాలు, ప్రవేట్‌ పెట్టుబడికి విదేశాలు/సంస్ధలనుండి పొందే రుణాలకు గ్యారంటీని స్తున్నాయి. ఇటువంటి రుణాల్ని కూడా సార్వభౌమ రుణాలుగా పరిగణిస్తారు. సార్వభౌమ బాండులపై అసలు గాని వడ్డీని గాని నిర్ణీత తేదిన తిరిగి చెల్లించలేక పోవటాన్ని సార్వభౌమ రుణ చెల్లింపు వైఫల్యం (సావరిన్‌ డిఫాల్ట్‌) అని అంటారు. సార్వభౌమ రుణ చెల్లింపు వైఫల్యాలు సార్వభౌమ రుణ సంక్షోభాలుగా పరిమాణం చెంది, అంతిమంగా ఆర్థిక సంక్షోభా లకు దారి తీయొచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో రుణ చెల్లింపు వైఫల్యాలు సాధారణ అంశంగా కూడా పరిగణించ బడుతున్నాయి.

సార్వభౌమ రుణ లక్షణాలు - 1. సార్వభౌమ రుణాలకు ప్రభుత్వ హామి ఉన్నందున, రుణాల తిరిగి చెల్లింపుపై రుణ దాతలకు అత్యంత విశ్వాసం ఉన్న కారణంగా రుణాలు సురక్షితాలుగా భావింపబడతాయి. దీని వల్ల రుణాలు పొందాల్సిన దేశాలకు రుణ సమీకరణ సులభతరమవుతుంది. 2. వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిన రుణాలు సక్రమంగా తిరిగి చెల్లింపబడనట్లయితే, రుణాన్ని రాబట్టుకోవడం కోసం కోర్టుల నాశ్రయించడం లేదా ఆస్తుల జప్తులాంటి చర్యలకు పాల్పడ టానికి వీలుంటుంది. కాని సార్వభౌమ రుణాలను సక్రమంగా చెల్లించని దేశాలపై ఇటువంటి చర్యలు చేపట్టటం సాధ్యపడక, రుణాల్ని రీ షెడ్యూల్‌ చేయడం గాని లేదా మాఫి చేయడం గాని అనివార్యమవుతుంది. అందువల్లే అంతర్జాతీయ ద్రవ్య సంస్ధలు రుణాలని ఇచ్చేటప్పుడు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ లను గుప్పెట్లో పెట్టుకొనే చర్యలకు పూనుకుంటాయి.3. ఒక దేశ రుణాన్ని స్థూల దేశీయోత్పత్తిలో (జి.డి.పి) శాతంగా కొలు స్తారు. యూరోపియన్‌ యూనియన్‌ ప్రమాణాలలో యూరప్‌ దేశాల సాధారణ రుణం (దేశీయ, విదేశీ రుణం) జి.డి.పిలో 60% మించితే ఆ దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిన ట్లుగా భావిస్తారు. గతంలో రుణ సంక్షోభంలో చిక్కుకున్న వివిధ దేశాల అనుభవాల ఆధారంగా, ఒక దేశం సార్వభౌమ రుణం ఆ దేశ స్థూలదేశీయోత్పత్తిలో 49.7 % మించితే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రుణ సంక్షోభంలో పడినట్లు నిపుణులు విశ్లేషి స్తున్నారు. 4. 1980లలో లాటిన్‌ అమెరికా దేశాలలో రుణాలు అందించే బూమ్‌ పూర్తయినాకా రుణాల చెల్లింపు వైఫల్యాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సర్వేలు తెలియచేస్తున్నాయి.

5. 1980లలో కొన్ని దేశాలలో రుణ సంక్షోభాలు విదేశీ మారక నిల్వల కరెంటు అకౌంటు ఖాతా అమితంగా పెరుగుతున్న కారణంగా ఏర్పడ్డాయి. కాని 1990లలో విదేశీ మారక నిల్వల పెట్టుబడి ఖాతా లోటు పెరుగుతున్న కారణంగా కూడా సార్వభౌమ రుణ సంక్షోభాలు నెలకొంటున్నట్లు ఆర్థిక నిపుణు లు గుర్తించారు. 6. ఇంత వరకు నెలకొన్న రుణ సంక్షో భాలలో అత్యధిక శాతం, కరెన్సీ సంక్షోభాలు మొదలైన తరువాత సార్వభౌమ రుణ సంక్షోభాలు తీవ్రమయ్యాయి. నయా ఉదార వాద విధానాల ప్రభావంగా పెట్టుబడుల ప్రవాహాలలోని అనిశ్చితి మాలకంగా కరెన్సీ విలువలు తీవ్ర అనిశ్చితికి గురి కావటం ఇందుకు ప్రధాన కారణంగా కొందరు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.7.ఇంత వరకు రుణ చెల్లింపుల వైఫ ల్యాలు వర్ధమాన దేశాలకే పరిమితమయ్యాయి 1824-2004 వరకు రుణ చెల్లింపు వైఫల్యాలలో అత్యధికంగా 126 చెల్లిం పుల వైఫల్యాలు గల చరిత్ర లాటిన్‌ అమెరికాకు దక్కింది. ఆ తరువాత ఆఫ్రికా 63 వైఫల్యాలతో 2వ స్థానంలో ఉంది.8.రుణాల రీ షెడ్యూలింగ్‌ తో వర్ధమాన దేశాల రుణ రేటిం గులు పడిపోయిన కారణంగా ఆయా దేశాలు సార్వభౌమ రుణాలను తీసుకోవడంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాయి. గత దశకంలో మార్కెట్‌లో పెరిగిన లిక్విడిటితో అభివృద్ధి చెం దిన దేశాల ప్రభుత్వాలకే రుణాలు అత్యధికంగా లభించాయి 9. వివిధ దేశాల ఆర్థిక స్థితిగతుల్ని అధ్యయనం చేస్తూ సార్వ భౌమ రుణ ప్రభావాలపై అంతర్జాతీయంగా 3 ప్రధాన రేటింగ్‌ ఏజెన్సీలైన స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌, మూడీ, పిట్చ్‌ తమ రేటిం గ్‌లను ప్రకటిస్తున్నాయి. సుదీర్ఘకాల పరిశీలనలో అభివృద్ధి చెందిన దేశాల రుణ రేటింగ్‌లు చాలా స్థిరంగా ఉన్నాయి.

మంచి రేటింగ్‌ పొందిన ఏ సంపన్న దేశం గత 15 సంవ త్సరాల కాలంలో రుణ చెల్లింపు వైఫల్యాలకు (డెట్‌ డిఫాల్ట్‌) పాల్పడలేదు. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. 10. 2007 వ సంవత్సరంలో జీ-20 ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థలలో సగటు ప్రభుత్వ రుణం సగటు జి.డి.పి లో 80% ఉండి వర్ధమానదేశాల రుణ నిష్పత్తి కంటే రెట్టింపు ఉన్నది. 2014 నాటికి జి-20 ధనిక దేశాల సగటు ప్రభుత్వ రుణం జి.డి.పిలో 120% ఉండొచ్చునని అంచనా వేస్తు న్నారు. సంపన్న దేశాల సాధారణ రుణం తీవ్రంగా పెరిగి పోతున్నది. జపాన్‌ అనేక సంవత్సరాలుగా అత్యధిక రుణ భారంతో కొనసాగుతున్నది. అమెరికా, బ్రిటన్‌ ప్రపంచ అత్యధిక రుణ గ్రస్థ దేశాల జాబితాలో చేరాయి. 11. ఈ దేశాలలో నూతనంగా జన్మించేవారి రేటు గణనీయంగా పడి పోయి, వృద్ధులలో పెరుగుదల అత్యధికమవుతున్నది. దీనిపై వెచ్చించాల్సిన వ్యయం కూడా గణనీయంగా పెరుగుతున్నది. 12. ఈ సంపన్న దేశాల రుణ విధానంలో మౌళిక మార్పులు చేపట్టకపోతే, వీరి రుణ పరిమాణం సమీప భవిష్యత్త్‌లో 3 రెట్లకు పైబడి పెరిగే ప్రమాదముందని రేటింగ్‌ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ముగింపు - విదేశీ రుణాలతో 1960 లలో వర్ధమాన దేశాలలో సంక్షేమ ఆర్థిక నమూనా అమలు చేయబడి వివిధ దేశాలు ఆర్థికాబివృద్ధిని సాధించాయి. 1970లలో ప్రపంచాన్ని కుదిపేసిన చమురు సంక్షోభంతో నెలకొన్న ఆర్థిక దుస్థితి నుండి పేద వర్ధమాన దేశాలను గట్టెక్కించడానికి పశ్చిమ దేశాల బ్యాంకింగ్‌ రుణాలు సహాయపడి, అంతిమంగా వర్ధమాన దేశాలను 1980లలో ''రుణ ఊబి'' లోకి దించాయి. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయబడ్డ ప్రపంచీకరణ విధానాలు పేద వర్ధమాన దేశాలను మరింత రుణ గ్రస్తం చేశాయి. 20వ శతాబ్దం చివరి నుండి సంపన్న దేశాలు తమ తమ దేశాలలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాల్ని అధిగ మించడం కోసం అందుబాటులోకి వచ్చిన సార్వభౌమ రుణాలను వినియోగించుకొని ప్రపంచంలోనే అత్యధిక రుణ గ్రస్త దేశాలుగా తయారయ్యాయి.

వివిధ దేశాల రుణ భారాలు పెరుగుతున్న కొద్దీ, రుణ చెల్లింపు వైఫల్యాలు పెరుగుతున్నాయి. నూతన రుణాలు దొరకని స్థితిలో వివిధ ప్రభుత్వాలు ఈ రుణ భారాల్ని సామాన్య ప్రజానీకంపై రుద్దుతున్నాయి. సామాన్య ప్రజానీకం అనుభవిస్తున్న సంక్షేమ పధకాల కత్తిరింపులకు పూనుకుం టున్నాయి. ఉద్యోగ, ఉపాధి భద్రతపై దాడులు పెరుగుతు న్నాయి. నిరుద్యోగం, దారిద్య్రం సంపన్న దేశాలలో అంతు లేకుండా పెరుగుతున్నది.

2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభ పర్యావసనంగా సార్వభౌమ రుణ సంక్షోభం తీవ్రమైం ది. ఈ ఆర్థిక సంక్షోభ నివారణకు వివిధ ప్రభుత్వాలు రించిన బ్యాంకుల నష్టాలు, సంపన్న వర్గాలకు కల్పించిన రాయితీలతో కూడిన ఉద్దీపన చర్యలు రుణ సమస్యను మరింత జటిలం చేశాయి. గ్రీస్‌ తదితర యూరప్‌ దేశాలలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు తాజా ఉదాహరణ.

Friday, March 5, 2010

బడ్జెట్‌ - పాలక వర్గాలు

ఆర్థిక వ్యవస్థపై బడ్జెట్‌ ప్రభావం గణనీయంగా ఉంటుంది. అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో బడ్జెట్‌ రూపకల్పన ప్రజాతంత్రయుతంగా నిర్వహింపబడాలి. సామాన్య ప్రజల ఆకాంక్షలకు, అభీష్టాలకు అనుగుణంగా ''ప్రజా బడ్జెట్‌'' రూపొందింపబడాలి. స్వతంత్ర భారతంలో ''ప్రజా బడ్జెట్‌''గా మన్ననలు పొందిన బడ్జెట్లు అరుదైనవే. మన దేశంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులే పాలక పక్షాలుగా చలామణి అవుతున్నారు. బడ్జెట్‌ పై పాలక వర్గాల ప్రభావం ఏమిటి? కొన్ని అంశాలను పరిశీలిద్దాం.పాలక వర్గాలు : అధికారం, ఆధిపత్యం ఉన్న రాజకీయ పార్టీలనే పాలక పక్షాలు, పాలక వర్గాలుగా సాధారణంగా పరిగణిస్తున్నారు. పెట్టుబడిదారి విధానంలో ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం, ఆధిపత్యం ఉన్న వర్గాలను పాలక వర్గాలుగా మార్క్సిజం సూత్రీకరిస్తుంది. బడ్జెట్‌పై సంప్రదింపులు-సంపన్న వర్గాలు : బడ్జెట్‌ రూపకల్పన విస్తృతమైన కసరత్తుతో కూడుకొని వుంది. వివిధ మంత్రిత్వ శాఖల ప్రతిపాదనలు, సమీక్షల నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వివిధ డిపార్టుమెంట్‌లు బడ్జెట్‌ ప్రతిపాదనలు తయారు చేయడంలో కీలక పాత్రను నిర్వహిస్తాయి. దీనితో పాటు బడ్జెట్‌ సమర్పణకు ముందు వివిధ సెక్షన్ల వత్తిడి బడ్జెట్‌పై కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందులో సంపన్న వర్గాల లాబీలు ప్రధాన భూమికను పోషిస్తాయి. వీరికి బడ్జెట్‌ పై సంప్రదింపులలో ఆర్థిక మంత్రి ప్రత్యేక సమయాన్ని కేటాయించి చర్చలకు ఆహ్వానిస్తారు.
వీరిలో పారిశ్రామికాధిపతులు, పారిశ్రామిక సంఘాలు, వ్యాపార వాణిజ్య మండలులు, కార్పోరేట్‌ రంగ నిపుణులు, వీరి ఆకాంక్షలను ఆశలను సమర్థించే ఆర్థిక నిపుణులు తదితరులు ప్రముఖంగా ఉంటారు. ఆర్థిక వ్యవస్థ రథసారథులుగా వీరి ప్రాబల్యం ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయాలపై తీవ్రమైన ప్రభావాన్ని కల్గివుంటుంది. దీనితో పాటు వీరి సంక్షేమమే జాతి సంక్షేమంగా, వీరి ప్రయోజనమే ప్రజల ప్రయోజనంగా టీవి ఛానళ్ళు, పత్రికా కథనాలు, వివిధ నిపుణల నివేదికలు ప్రచారం చేస్తుంటాయి. ఈ తతంగమంతా ఈ సంవత్సరం కూడా బడ్జెట్‌ సందర్భంగా కొనసాగింది
.

బడ్జెట్‌-సామాన్య ప్రజలు : భారతదేశాన్ని సంపన్న దేశాల సరసన నిలబెట్టాలనే తపనతో అమలు పరిచిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు సృష్టించిన అసమానతలు, సమాజంలోని అట్టడుగువర్గాల జీవితాలను ఛిద్రంచేసాయి. పారిశ్రామిక సంస్థలపై నియమించిన జాతీయ కమీషన్‌ పరిశీలనలో దేశ జనాభాలో 76.7% పేదలు, దుర్భరులు ఉన్నారు. వీరి రోజువారి ఆదాయం రూ.20 లకంటే తక్కువగా ఉన్నది. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులు. దళిత గిరిజనులలో 1% మాత్రమే అధిక ఆదాయం కలవారుగాను, 11.2% మధ్యస్ధ ఆదాయం కలవారుగాను, మిగిలిన 87.8% అల్పాదాయ వర్గాలుగాను ఉన్నారు. అగ్రకులాలలో 45.2% అధిక మధ్యస్ధ ఆదాయాలు కలిగి వుండగా 54.8% అల్పాదాయ వర్గాలుగా ఉన్నారు. ఇదంతా నయా ఉదారవాద విధానాల అమలు పుణ్యమే.

అయినప్పటికీ ఈ వాస్తవాలను కార్పొరేట్‌ రంగం అంగీకరించదు. ఈ వర్గాల సమగ్రాభివృద్ధే దేశాభివృద్ధిగాను, ధనిక వర్గాల సంపదకు ఈ వర్గాల స్వేదమే పునాదన్న సత్యాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ రూపకల్పనలో గుర్తించరు. బడ్జెట్‌ ప్రతిపాదనలను తయారు చేసే సమయంలో ఆర్థిక మంత్రి ఈ పేదవర్గాలను కాని, వారి ప్రతినిధులను కాని సంప్రదింపులకు ఆహ్వానించరు. వారి అభిప్రాయాలను స్వీకరించరు. గతంలో కేంద్ర కార్మిక సంఘాలను బడ్జెట్‌ సందర్భంగా సంప్రదింపులకు పిలిచేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని గాలికి వదిలేసారు.

బడ్జెట్‌ లో కేటాయించిన సామాజికరంగ నిధులు ఆచరణలో ఖర్చుపెట్టబడక మురిగిపోతున్నాయి. గత ఏడాది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కేటాయించిన నిధులలో సగానికి సగం వినియోగింపబడలేదు. మన రాష్ట్రంలో ఖర్చు పెట్టిన నిధులలో కనీసం 10శాతం అవినీతితో దుర్వినియోగమయ్యాయని అధికారిక సర్వేలు తెలియచేస్తున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14.48 శాతం మందికి మాత్రమే పూర్తి స్థాయి పనులు కల్పించారు. పేదరిక నిర్మూలనకు గత 4 ఏళ్ళుగా లక్షన్నర కోట్ల రూపాయలు కేటాయించామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, ఆచరణలో సాధారణ ప్రజనీకానికి అందింది అతి స్వల్పం. వెనుకబడిన ప్రజల అభ్యున్నతికి వారి జనాభా దామాషా పద్ధతిలో బడ్జెట్‌ నిధుల కేటాయింపు ఉండాలని, వాటిని పూర్తిగా ఖర్చు చేయాలనే రాజ్యాంగ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తున్నారు.

గత బడ్జెట్‌లో నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైబడిన రాయితీలను సంపన్న వర్గాలకిచ్చిన సందర్భంగా, అధిక ధరల నియంత్రణకై సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్ధకు 94 వేల కోట్ల రూపాయలు కేటాయించమన్న నిపుణుల సిపార్సులను, ప్రజాసంఘాల అభ్యర్థనలను అర్థిక మంత్రి త్రోసిపుచ్చారు. ఈ సంవత్సరం బడ్జెట్‌ సందర్భంగా అధిక ధరల నియంత్రణకు చర్యలు లేకపోగా నిత్యావసర వస్తువుల ధరలను మండిరచే పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచేసారు.దళితులలో 2.8 శాతం, గిరిజనులలో 1.4 శాతం మాత్రమే సాంప్రదాయ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. వీరిలో నైపుణ్యాన్ని పెంచటానికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు 2022 నాటికి 50 కోట్ల నైపుణ్యంగల ప్రజలను తయారు చేయటమన్నది సుదూర స్వప్నమే. ముగింపు : నయా ఉదారవాద విధానాల అమలును వేగవంతం చేసే బడ్జెట్‌ ప్రజల జీవన స్థితిగతులను మరింత అస్థిర పరుస్తుంది. సంపన్న వర్గాలకు బాధ్యతగా బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు చేస్తూ, సామాన్య ప్రజలకిచ్చే అరకొర కేటాయింపులను ఔదార్యంగా ఇస్తున్న ట్లుగా ఉన్నది ఆర్ధిక మంత్రి ధోరణి. బడ్జెట్‌ సమ యాన అర్ధిక మంత్రికి సంపన్న వర్గాల స్వరం తప్ప సామాన్య ప్రజల ఆక్రందనలు వినబడటం లేదు. చట్ట సభలలలోని అత్యధికులైన ప్రజా ప్రతినిధుల చర్యలు సంపన్న వర్గాల ప్రయోజనాలతో అంటకాగుతున్నాయి. అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా వీరంతా పాలక వర్గాలే.