Monday, February 22, 2010

బడ్జెట్‌ పై అవగాహన - పరిచయం

సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల బడ్జెట్‌ పై ఉత్కంఠకు నెలవైంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్‌లను ప్రవేశపెడుతుంటాయి. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 26 న సమర్పింపబడనున్నది. కేంద్ర బడ్జెట్‌ లోని కొన్ని అంశాలను స్ధూలంగా అర్ధంచేసుకోవటానికి ప్రయత్నిద్దాం

అంచనాలు :- ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి బడ్జెట్‌లో మూడు రకాల అంచనాలు తారసపడుతాయి. 1. బడ్జెట్‌ అంచనాలు 2. సవరించిన అంచనాలు 3. వాస్తవ లేదా తుది అంచనాలు. ''బడ్జెట్‌ అంచనాలు'' రాబోయే సంవత్సరానికి అంటే 2010-2011కు సంబంధించినవి. బడ్జెట్‌ సమర్పించే సమయానికి పూర్తి సంవత్సరపు వాస్తవ వివరాలు అందుబాటులో వుండని కారణంగా జనవరి 2010 వరకు వాస్తవ లెక్కలకు రాబోయే 2 నెలల కాలానికి సంబంధించిన అంచనాలను కలుపుకొని ''సవరించిన అంచనాలు'' తయారుచేస్తారు. అంటే ఇవి 2009-2010 సం||కు సంబంధించినవి. ''వాస్తవ లేదా తుది అంచనాలు'' 2008-2009 సం||రానికి సంబంధించినవి అంటే క్రిందటి సం||రానికి సంబంధించిన వివిధ ఖాతాల వాస్తవ గణాంకాలు. చట్టసభలు కేవలం బడ్జెట్‌ అంచనాలను మాత్రమే చర్చించి, ఆమోదిస్తాయి.

గమనించాల్సిన అంశాలు :- 1. బడ్జెట్‌ అంచనాలను సవరించిన అంచనాలతోగాని, తుది అంచనాలతో గాని పోల్చకూడదు. సామాన్యంగా ఏ ప్రభుత్వాలైనా బడ్జెట్‌ లో కేటాయించబడ్డ అంచనాల మేరకు పూర్తిగా ఖర్చుపెట్టరు. అందువల్ల ప్రస్తుత బడ్జెట్‌ అంచనాలను, క్రితం సం|| సమర్పించిన బడ్జెట్‌ అంచనాలతోనే పోల్చాలి. సాధారణంగా పాలక వర్గాలు బడ్జెట్‌ అంచనాలను సవరించిన అంచనాలతోగాని, తుది అంచనాలతో గాని పోల్చుతూ బడ్జెట్‌ భ్రమల్ని సృష్టిస్తుంటాయి. 2. ప్రస్తుత బడ్జెట్‌ అంచనాలను గత సం|| బడ్జెట్‌ అంచనాలతో పోల్చేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని లెక్కలోనికి తీసుకొని విశ్లేషించాలి. 3. పెరిగిన అవసరాలు, ప్రాధాన్యతలకు తగ్గట్టు కేటాయింపులు ఉండాలికాని కేవలం గత సం|| కేటాయింపుల కంటే ఈ సం|| కేటాయింపులలో పెరుగుదలను, బడ్జెట్‌లో పెరుగుదలగా భావించకూడదు. 4. ప్రతియేడాది ప్రభుత్వ ఆదాయం సహజంగా పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల కేటాయింపులలోను, రాబడిలోను ఈ పెరుగుదల తప్పనిసరిగా ప్రతిబింబింపబడాలి 5. ప్రభుత్వ ఆదాయ వ్యయాలను స్ధూలదేశీయోత్పత్తిలో శాతంగా చూడాలి. అదే సందర్భంలో మొత్తం ఆదాయ వ్యయాయలలో ప్రతి పద్దు యొక్క ఆదాయ వ్యయాలు ఎంత శాతం ఉన్నాయో విశ్లేషించి పోల్చుకోవాలి. 6. అత్యధికంగా ఉండే ప్రభుత్వ ఆదాయ వ్యయాలు సమాజంలోని ప్రజలపై సహజంగా గణనీయమైన ప్రభావాన్ని కల్గిస్తాయి. ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందనే దాని కంటే ఎలా ఖర్చు పెడుతున్నదో పరిశీలించడం ప్రధానమైనది. అందువలన ప్రభుత్వ వ్యయం పెరిగిందంటే ఎందుకు పెరిగిందో విశ్లేషించాలి. ప్రభుత్వ ఆదాయం పెరిగినా ఏఏ మార్గాల ద్వారా, ఏఏ ఖాతాలలో పెరిగిందో తెలుసుకోవటం కీలకమైంది.

ప్రభుత్వ ఆదాయాలు - పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయాలుగా ప్రభుత్వ ఆదాయాలను వర్గీకరించారు. పన్నుల ఆదాయం - ప్రత్యక్ష పన్నులు (సంపన్న వర్గాలపై విధించేవి - ఆదాయం పన్ను కార్పొరేట్‌ పన్ను వగైరా), పరోక్ష పన్నులు (సామాన్యులపై ప్రభావం కలిగించేవి - ఎక్సైజ్‌ సుంకం, కస్టమ్స్‌ సుంకం వగైరా) గా విభజించబడ్డాయి. పన్నేతర ఆదాయం - గ్రాంట్లు, వడ్డీలు, ప్రభుత్వ రంగ సంస్ధల ఆదాయం, యూజర్‌ చార్జీలు, సర్వీసు చార్జీలుగా ఉన్నాయి. యూజర్‌ చార్జీలు, సర్వీసు చార్జీలు పన్నుల భారం కంటే ఎక్కువగా ఉంటున్నది. సామాన్యంగా పన్నేతర ఆదాయం కంటే, పన్నుల ఆదాయాన్ని పరిశీలిస్తారు. ప్రస్తుతం పన్నేతర ఆదాయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది.

ప్రభుత్వ ఆదాయం ఎంత పెరిగింది అనే దాని కంటే రావాల్సిన ఆదాయం ఎంత పోయింది అనే అంశాన్ని పరిశీలించాలి ప్రభుత్వ ఆదాయంలో ప్రత్యక్ష పరోక్ష పన్నుల నిష్పత్తి చూస్తారు. ఇది సామాన్యంగా 70:30 గా ఉంటుంది. విశ్లేషించాలి పన్నులు పెంచినంత మాత్రాన తప్పని, తగ్గించినంత మాత్రాన భేష్‌ అని మెచ్చుకోలేము. సామాన్యుడి దృష్ఠిలో పన్నుల ప్రభావాన్ని పరిశీలించాలి. ఇదే గీటురాయి.

రెవిన్యూ, మూలధన ఖాతాలు :- ఈ రెండు ఖాతాలలో ఆదాయం, వ్యయం రెండు ఉంటాయి.

1. ప్రభుత్వం ఇప్పటికే కల్పిస్తున్న సదుపాయాలను కొనసాగించటానికి అయ్యే వ్యయం రెవిన్యూ వ్యయంగాను, అదనంగా కల్పించే సదుపాయాలకు అయ్యే వ్యయాన్ని మూలధన వ్యయంగాను పరిగణిస్తారు. 2. పన్నులు,పన్నేతర మార్గాల ద్వారా వచ్చేది రెవిన్యూ ఆదాయం అంటారు. మూల ధన ఆదాయంలోని రాబడి దాదాపు 90% ప్రభుత్వం తీసుకొనే అప్పుల ద్వారా సమీకరించబడుతుంది. మిగతా 10% ఆదాయం ప్రభుత్వం తానుగా అప్పుయిచ్చిన వారినుండి తిరిగి వచ్చే చెల్లింపులు, ప్రభుత్వరంగ సంస్ధల వాటాల ద్వారా వచ్చే రాబడి. అప్పులు, పెట్టుబడి ఉపసంహరణ విధానాలు ప్రధానంగా ఉండే బడ్జెట్‌ లో మూలధన ఖాతా ఆదాయ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. రెవిన్యూ ఆదాయానికి మించిన వ్యయాన్ని రెవిన్యూ లోటని, మూల ధన ఖాతా ఆదాయం కంటే పెరిగిన వ్యయాన్ని మూల ధన లోటని, మొత్తం ఆదాయాలకు మించిన వ్యయాన్ని మొత్తం లోటని అంటారు. 1980 వరకు రెవిన్యూ లోటు అధిక ప్రాధాన్యతను పొందేది. ఆ కాలంలో ప్రభుత్వ లోటు పెరిగితే ప్రభుత్వమే దివాళా అనుకునేవారు. 1997 వరకు బడ్జెట్‌ లోటు భావన ప్రధానంగా ఉంది. ఆ తరువాత కాలంలో ద్రవ్యలోటు అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం రెవిన్యూ, మూల ధన వ్యయాలకు, ఋణాలు మినహాయించిన మొత్తం రెవిన్యూ మూల ధన ఆదాయాల మధ్య ఉండే తేడాను స్ధూలద్రవ్య లోటు అంటారు. గత సం|| మునపటి వరకు ద్రవ్యలోటు ఆర్ధిక వ్యవస్ధకు గుదిబండగా వ్యవహరించేవారు. కాని ప్రపంచ ఆర్ధిక సంక్షోభ నేపధ్యంలో గత సంవత్సర బడ్జెట్‌లో ఈ ద్రవ్యలోటే ఆర్ధిక వ్యవస్ధ రక్షణకు కల్పతరువైంది.

అభివృద్ధి, అభివృద్దేతర వ్యయాలు :- ప్రభుత్వ వ్యయాన్ని రెవిన్యూ వ్యయం మూలధన వ్యయంగా కాకుండానే అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయంగా కూడా వర్గీకరిస్తున్నారు. ఆర్ధిక వ్యవస్ధలో ఉత్పత్తిని, ఆదాయాలను ఉత్పాదకతను పెంచేవ్యయాన్ని అభివృద్ధి వ్యయం అంటారు. ప్రజల సంక్షేమానికి, పేదరిక నిర్మూలనకు ఉపయోగపడి, ప్రత్యక్షంగా ఉత్పత్తికి దోహదం చేయని ఖర్చును అభివృద్ధేతర వ్యయం అంటారు. సబ్సిడిలన్నీ అభివృద్దేతర వ్యయం కాదు. సబ్సిడి బియ్యం పై ఖర్చును అభివృద్ధేతర వ్యయంగా వర్గీకరిస్తారు. కాని ఎరువులపై సబ్సిడిని అభివృద్ధి వ్యయంగా పరిగణిస్తారు.

ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు :- కేంద్ర ప్రభుత్వ వ్యయంలో అధిక భాగం ప్రణాళికేతర వ్యయంగా ఉంటుంది. ఈ ప్రణాళికేతర వ్యయంలో అత్యధిక భాగం వడ్డీల చెల్లింపులు. ఆ తరువాత స్ధానంలో రక్షణ , సబ్సిడి వ్యయాలుంటాయి. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికి ఖచ్చితమైన నిర్వచనం లేదు. ప్రభుత్వ అవగాహన ప్రకారం ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు మారుతుంటాయి. ప్రభుత్వం అతి ప్రధానంగా భావించే అంశానికి పెట్టే వ్యయాన్ని ప్రణాళిక వ్యయంగా చూపుతారు. అత్యధిక ప్రాధాన్యత లేని వ్యయం ప్రణాళికేతర వ్యయం. ఎయిడ్స్‌ పై ఖర్చు ఒక సంవత్సరం ప్రణాళికా వ్యయం అవుతుండగా మరో సంవత్సరం ప్రణాళికేతర వ్యయంగా మారవచ్చు. బడ్జెట్‌ లో చూపే ప్రణాళిక వ్యయం మాత్రమే ప్రణాళిక కేటాయింపులు కాదు. ప్రభుత్వ రంగ సంస్ధకు బడ్జెట్‌లో 1000 కోట్లు కేటాయించబడి, ఆ ప్రభుత్వ రంగ సంస్ధ తన సొంత వనరుల నుండి 500 కోట్లు కేటాయిస్తే మొత్తం ప్రణాళికా కేటాయింపు 1500 కోట్లు అవుతుంది. ప్రణాళిక వ్యయానికి, ప్రణాళిక కేటాయింపులకు మధ్య ఉన్న తేడాను గమనించాలి.


Tuesday, February 16, 2010

పెట్టుబడుల ఉపసంహరణ - ఫ్రెంచ్‌ వేలం పద్ధతి

ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ యుపిఏ రెండవ దఫా ప్రభుత్వ విధానాలలో కీలక స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభ నేపధ్యంలో కొంత ఆలస్యమైనప్పటికి, తిరిగి ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటున్న క్రమంలో ఈ ప్రక్రియ వేగంగా ముందుకు వస్తుంది. వాటాల ఉపసంహరణకు ప్రభుత్వం ఇంతవరకు ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపిఒ), ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పిఒ) పద్ధతులను పాటిస్తూ వచ్చింది. తాజాగా ఫ్రెంచ్‌ ఆక్షన్‌ పద్ధతిని పాటించనున్నట్లు పెట్టుబడుల ఉపసంహరణశాఖ కార్యదర్శి ప్రకటించారు.

ఫ్రెంచ్‌ వేలం పద్ధతి: అత్యధిక ఆదాయం పొందటం లక్ష్యంగా రూపొందించిన వేలం పద్ధతి ఇది. 1960వ దశకంలో ఫ్రాన్స్‌లో ఈ పద్ధతిలో వాటాల ఉపసంహరణ ప్రక్రియ విజయంతమైంది. అప్పటి నుండి దీనిని ఫ్రెంచ్‌ వేలం పద్ధతిగా పిలుస్తున్నారు. ఇతర పద్ధతులలో లాగా బిడ్‌లకు ఆఫర్‌ చేసే వాటాధరపై, వాటాల కేటాయింపుపై ఉండే పరిమితులు ఫ్రెంచ్‌ వేలం పద్ధతిలో ఉండవు. ఇతర పద్ధతులలో షేర్‌ ధర (ప్రైస్‌ బ్యాండ్‌) అందరికి సమానంగా ఉండగా, ఫ్రెంచ్‌ పద్ధతిలో షేర్‌ ధర మదుపుదారులందరికి సమానంగా ఉండదు. విభిన్న రకాల షేర్‌ ధరలు, విభిన్న షేర్ల పరిమాణంతో బిడ్‌లు, కేటాయింపులు ఉంటాయి. అత్యధిక ధరకు బిడ్‌ వేసిన వారికి కోరినన్ని వాటాలను మంజూరు చేస్తు, అవరోహణ క్రమంలో షేర్లకు ఆఫర్‌ చేసిన బిడ్‌ ధరల ప్రాతినిధ్యంలో వాటాలు కేటాయించబడుతాయి. సమర్ధత కలిగి, కంపెనీ శక్తి సామర్ధ్యాలను సరిగ్గా అంచనా వేయగలిగే ఆర్ధిక స్ధోమత కల్గినవారికే ఫ్రెంచ్‌ వేలం పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది. అదే సందర్భంలో వాటాలను జారీచేస్తున్న కంపెనీ అత్యధిక మొత్తాలలో పెట్టుబడుల ఆదాయం పొందకల్గుతుంది.

ఫ్రెంచ్‌ వేలం పద్ధతిలో యన్‌.టి.పి.సి అనుభవం: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలలో యన్‌.టి.పి.సి నవరత్న స్ధాయి కల్గిన సంస్ధ. విద్యుదుత్పత్తి రంగంలో అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు గడించిన దిగ్గజంగా ప్రసిద్ధికెక్కింది. 31-03-2009 నాటికి రూ. 49,000 కోట్ల రిజర్వ్‌ నిధులుండి, క్రిత సంవత్సరం నుండి రిజర్వ్‌ నిధులు రూ. 5,000 కోట్లు పెంచుకొని, రూ. 15,000 కోట్ల నగదు బ్యాంకు బాలెన్స్‌లు కలిగి ఉంది. ప్రభుత్వ విధానంలో భాగంగా యన్‌.టి.పి.సి తన వాటాలలో 5శాతాన్ని ఉపసంహరణకు ప్రకటించి అందులో భాగంగా 41.2 కోట్ల వాటాలను (షేర్లు) ఫాలోఆన్‌ ఆఫరింగ్‌ క్రింద అమ్మకానికి పెట్టింది. వీటిలో 20.4 కోట్ల వాటాలను రిటైల్‌ మదుపుదారులు, హైనెట్‌ వర్త్‌ వ్యక్తులకు, మిగిలిన వాటాలను ''క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్యర్స్‌'' (క్యూ. ఐ.బి)కు కేటాయించింది. రిటైల్‌ మదుపుదారులు హై నెట్‌వర్త్‌ వ్యక్తులకు మంత్రుల బృందం నిర్ణయించిన ఫ్లోర్‌ ధరకు అమ్మకానికి పెట్టింది. క్యూ.ఐ.బిలకు కేటాయించిన వాటాలను ఫ్రెంచ్‌ వేలం పద్ధతిలో విక్రయించటానికి నిర్ణయించింది. ఈ పరిణామాలు యన్‌.టి.పి.సి వాటాల ఉపసంహరణ పై దేశవ్యాప్తంగా పెట్టుబడి మార్కెట్‌లో తీవ్ర సంచలనాన్ని కలిగించాయి.

ఇంతటి సంస్ధ పబ్లిక్‌ ఆఫరింగ్‌కు వెళ్ళుతుండటంతో మదుపుదారులలో ఉత్సాహం,ఆసక్తి సహజంగా రేకెత్తుతాయి. డిశంబరు 2009లో ఫాలోఆన్‌ ఆఫర్‌కు సెబీలో నమోదు చేసుకొని రికార్డు సమయంలో జనవరి 2010లో పబ్లిక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 3-5 తేదిలలో బిడ్డింగ్‌ ప్రక్రియను సైతం పూర్తిచేసుకుంది.

కాని వివిధ అంచనాలకు భిన్నంగా రూ. 8,300 కోట్ల విలువ కలిగి, 41.2 కోట్ల షేర్లు ఆఫర్‌ చేసిన ఈ కంపెనీకి ఆచరణలో 49.36 కోట్ల షేర్లు మాత్రమే బిడ్డింగ్‌ అయ్యాయి. అంటే 1.2 రెట్లు మాత్రమే అదనపు గిరాకీ (ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌) పలికింది. యన్‌.టి.పి.సి కీర్తి ప్రతిష్టలకు ఈ స్ధాయి మదుపుదారుల స్పందన అందరిని నిరుత్సాహపర్చింది. రిటైల్‌, హైనెట్‌ వర్త్‌ వ్యక్తులకు కేటాయించిన 20.4 కోట్ల షేర్లకు గాను కేవలం 1.3 కోట్ల షేర్లు మాత్రమే బిడ్డింగ్‌(బిఎస్‌సి గణాంకాల ఆధారంగా) అయ్యాయి. క్యూ.ఐ.బి. కేటగిరి మదుపుదారులలో కూడా మొదటిరోజు ఉన్న ఉత్సాహం మిగిలిన 2 రోజులు కానరాకపోయినా యఫ్‌.పి.ఓలో నిధుల సమీకరణకు ఫ్రెంచ్‌ వేలం పద్ధతి కొంత మేరకు ఉపయోగపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముగింపు: ఆర్ధిక సంక్షోభం మొదలైన తరువాత 85% విదేశీ సంస్ధాగత మదుపుదారుల పెట్టుబడులు ప్రైమరీ మార్కెట్లలోనే కేంద్రీకరించబడ్డాయి. విదేశీ సంస్ధాగత మదుపుదారులను ఆకర్షించి అధిక ఆదాయం పొందాలనే లక్ష్యంతో విడుదల చేసిన యన్‌.టి.పి.సి ని దేశీయ ఆర్ధిక సంస్థలైన యల్‌.ఐ.సి., బ్యాంకులు అత్యధికంగా గట్టెకించాయి. సంస్ధాగత మదుపుదారులకు, రిటైల్‌ మదుపుదారులకు మధ్య సమతుల్యతను సాధిస్తూ, అధిక ఆదాయాలను ఆర్జించాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. అలాగని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(యన్‌.యం.డి.సి), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌(ఆర్‌.ఇ.సి)లలో పెట్టుబడుల ఉపసంహరణపై మార్చిలోగా నిర్మించుకున్న రోడ్‌ మ్యాప్‌ నుండి ప్రభుత్వం వెనుకంజ వేసే పరిస్థతి కనిపించటంలేదు. రాబోయే బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసే సూచనలు అధికంగా ఉన్నాయి. ఫ్రెంచ్‌ పద్ధతైనా, మరొకటైనా వాటాల అమ్మకం వలన లబ్ధి పొందుతున్నది స్టాక్‌మార్కెట్‌ను నియంత్రించే ప్రధాన శక్తులే తప్ప సామాన్యులు కాదు

Friday, February 5, 2010

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌- ఒక పరిశీలన

సామ్రాజ్యవాద ప్రపంచీ కరణ, సంక్షోభంలో కూరుకు పోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ బ్యాంకింగ్‌ గురించిన చర్చ తెరమీదకు వచ్చింది. ఈ చర్చలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కాలంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ప్రపంచ ప్రఖ్యాత బ్యాంకులు సైతం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ డివిజన్లను ఏర్పాటు చేశాయి. కాని పిడుగులా మీదపడ్డ దుబారువరల్డ్‌ ఉదంతంతో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ మనుగడపై కారుమబ్బులు కమ్ముకున్నాయి.

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఆవిర్భావం: ముస్లిం మత సూత్రాల ప్రాతిపదికన నిర్వహించబడే ఇస్లామిక్‌ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఉనికి లోనికి వచ్చింది. 1200 సంవత్సరాల క్రితం బాగ్దాద్‌, డెమస్కస్‌, ఫెజ్‌ మరియు కోర్డోబాలలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు జరిగిన ఆధారాలు ఉన్నాయి. మొదటి తరహా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ సంస్థలు 1960లో పిలిగ్రిమ్స్‌ ఫండ్స్‌ రూపంలో మలేషియాలోనూ, మిట్‌ఖమర్‌ సేవింగ్‌ బ్యాంక్‌గా ఈజిప్టులోనూ వెలిశాయి. 1970లలో సంభవించిన ''మొదటి చమురు సంక్షోభం'' పరిణామాలతో చమురు ఉత్పత్తి చేసే అరబ్‌ దేశాలు నడమంత్రపు సిరులని చేజిక్కించుకోవటంతో ఇస్లామిక్‌ ఫైనాన్స్‌, ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలు విస్తరించాయి. 1974లో దుబారు ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఆవిర్భవించింది. 1974లో ఏర్పాటు చేయబడ్డ ఇస్లామిక్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వివిధ దేశాలలోని ఇస్లామిక్‌ బ్యాంక్‌ల కార్యకలాపాలను అనుసంధానం చేస్తూ 1976 నుండి తన కార్యక్రమాలను విస్తృత పరచింది.

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ లక్షణాలు: ముస్లీం మతాచారాలను నిర్దేశిస్తున్న షరియత్‌ సూత్రాలననుసరించి వడ్డీ(రిబా) నిషేధంతో ఆ స్థానంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ రంగంలో ప్రత్యామ్నాయ పద్ధతులు సృష్టించబడ్డాయి. ప్రపంచంలోనే అన్ని ఇస్లామిక్‌ బ్యాంకులు వడ్డీరహిత సూత్రాన్ని విధిగా పాటిస్తున్నాయి. వివిధ దేశాలలోని చట్టాలు, బ్యాంకుల పరిమాణం, బ్యాంకుల లక్ష్యాలు, విదేశీ బ్యాంకుల పోటీ తట్టుకోవటంలాంటి పరిస్థితులలో రకరకాలుగా ఇస్లామిక్‌ బ్యాంక్‌ తీరుతెన్నులు మారుతున్నాయి. వడ్డీరహిత ఇస్లామిక్‌ బ్యాంకులలో అనుసరిస్తున్న కొన్ని సర్వసామాన్య అంశాల్ని పరిశీలిద్దాం.

1) కరెంట్‌ ఎకౌంట్‌ ఖాతాలు సాంప్రదాయ బ్యాంకులలోలాగా ఉండి, సేవింగ్స్‌ బ్యాంక్‌ల ఎకౌంట్లో మాత్రం స్థిరమైన లాభానికి హామీ ఇవ్వటం లేదు. డిపాజిట్‌దారుల అనుమతితో వారి సొమ్మును ఇతర రంగాలలో పెట్టుబడులు పెడుతుంది. పెట్టుబడి తిరిగిచ్చే గ్యారెంటీ ఉండదు కానీ తక్కువ రిస్కు కలిగిన ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టి నష్టాల భారాన్ని సాధ్యమైనంతగా అదుపు చేస్తున్నారు. లాభాలు వస్తే పంచుతున్నారు.

2) ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లో అత్యధిక ప్రాచుర్యం కలిగినవి ఇస్లామిక్‌ బాండ్‌లు. వీటిని సుకుక్‌లు అని అంటారు. మామూలు బాండ్‌లలో నిర్ణీత సమయంలో అసలు, వడ్డీ ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. కాని సుకుక్‌లలో పెట్టుబడి సొమ్ము ఖచ్ఛితంగా తిరిగి ఇచ్చే గ్యారెంటీ ఉండదు. ఆ సొమ్మును ఒక ఆస్తిలోనూ, వ్యాపారంలోనూ, పరిశ్రమలోనూ బ్యాంక్‌ అజమాయిషీతో పెట్టుబడి పెట్టటం జరుగుతుంది. డిపాజిట్‌దారులు ఆ సంస్థలలో వాటాదారులుగా ఉంటారు. సంవత్సరాంతానికి వచ్చిన లాభనష్టాలను డిపాజిట్‌దారులకు పెట్టుబడి నిష్పత్తిలో పంచుతారు. అందువల్ల లాభనష్టాలని డిపాజిట్‌దారులు విధిగా భరించాల్సి ఉంటుంది. షరియత్‌ సూత్రాలననుసరించి పెట్టుబడులను అత్యధిక రిస్కు కలిగిన విధంగా వినియోగించకూడదన్న షరియత్‌ సూత్రంతో కనీస రిస్కు కలిగిన రియల్‌ఎస్టేట్‌లలో ఈ పెట్టుబడులను పెడుతున్నారు. సుకుక్‌దారుల పెట్టుబడులు సురక్షితంగానూ, లాభదాయకంగానూ ఉంటాయనేది మదుపుదారుల అనుభవం, విశ్వాసం.

3) లీజింగ్‌ పద్ధతి: శక్తివంతమైన ఋణ గ్రహీతకు అతనికి కావలసిన ఆస్తులని/వస్తువులని కొని ఒక నిర్ణీత సమయానికి బ్యాంకు లీజుకిస్తుంది. ఋణ గ్రహీత నుండి వాయిదాలలో లీజు మొత్తాన్ని వసూలు చేస్తుంది. నిర్ణీత సమయం పూర్తిఅయినాక అంగీకరించిన మొత్తాన్ని వసూలు చేసుకున్నాక హక్కుని లీజుదారునికి బదలాయిస్తారు. సాంప్రదాయ బ్యాంకింగ్‌లో డబ్బును ఋణ గ్రహీతకు ఇవ్వటంలా కాకుండా ఆస్థిని ఏర్పరచటం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ప్రత్యేక లక్షణంగా చెపుతారు.

4) ముషరకా: ఇదొక జాయింట్‌ వెంచర్‌లాంటిది. వ్యాపార సంస్థతో బ్యాంక్‌ భాగస్వామ్యం కుదుర్చుకొని పెట్టుబడిని పెట్టి, ఆ వ్యాపార లాభాల నుండి పెట్టుబడిని, కొంత లాభాన్ని సంపాదించిన తరువాత బ్యాంకు ఒప్పందం నుండి నిష్క్రమిస్తుంది.

5) ముదరభా: ఈ పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానం, వనరుల కార్మికుల యాజమాన్యం, నైపుణ్యాలను వ్యాపార సంస్థ ఏర్పాటు చేస్తుంది. పూర్తి ఆర్థిక మద్ధతును బ్యాంకు అందిస్తుంది. లాభాల భాగస్వామ్యం ముందే నిర్ణయించబడుతుంది. నష్టాలు వస్తే బ్యాంకు భరిస్తుంది.

6) ఇవి కాక ఆధునిక బ్యాంకింగ్‌ పద్ధతులైన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌, హైర్‌ పర్చేజ్‌, సేల్‌ అండ్‌ బై బ్యాక్‌ లాంటి ప్రక్రియలను ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లో అమలు చేస్తున్నారు. వడ్డీ స్థానంలో లాభాలలో వాటాలను పొందుతున్నారు. ఇవే కాకుండా సర్వీస్‌ ఛార్జీలు విధిస్తూ వ్యక్తిగత ఋణాలను అందిస్తున్నారు. చిన్న వ్యాపారులు, వ్యవసాయదారులు, మత్స్య వృత్తిలోని అణగారిన ప్రజానీకంలోని కొందరికి సర్వీసు ఛార్జీలు లేకుండా వివిధ ఋణాల్ని విధిగా ఇస్లామిక్‌ బ్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది.

7) షరియత్‌ సూత్రాలననుసరించి జూద ప్రవృత్తి గల రంగాలలో పెట్టుబడులు నిషేధించిన కారణంగా బ్యాంకింగ్‌ పెట్టుబడులు డెరివేటీవ్‌లాంటి అత్యధిక రిస్కు కలిగిన రంగాలకు విస్తరించకపోవటం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌కు రక్షణగా ఉంది.

8) ద్రవ్యమంతా(డబ్బు) ఆస్తులలో మార్చటం మూలకంగా ఇస్లామిక్‌ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక పెట్టుబడికి పెద్దపీట వేయటం జరిగింది. దీని కారణంగా అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి నీలినీడలు ఈ వ్యవస్థపై పరిమితంగా పడ్డాయి.

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ అభివృద్ధి: 2008, 2009 ప్రథమార్ధంలో ప్రపంచవ్యాప్త ద్రవ్య సంక్షోభ తుపానుకు ఇస్లామిక్‌ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా ఉన్నాయని విశ్లేషకులు భావించారు. 2009 బ్యాంకు సర్వేలో 500 ఇస్లామిక్‌ ఫైనాన్షియల్‌ సంస్థల ఆస్తులు 2008 కంటే 28.6% అభివృద్ధిని సాధించాయి. ఈ పెరుగుదల గత 3 సంవత్సరాలుగా నికరంగా సాధించబడుతున్నది. అదే సందర్భంలో ప్రపంచంలోని వెయ్యి అతిపెద్ద బ్యాంకులు 2008లో 21.6% అభివృద్ధి చెంది 2009లో 6.8 శాతమే అభివృద్ధి నమోదు చేసుకున్నాయి. 3 సంవత్సరాల పాటు నికరంగా సాగిన ఇస్లామిక్‌ బ్యాంకుల ప్రగతిలో షరియత్‌ చట్ట పరిధిలో సృజనాత్మకంగా సృష్టించిన కొన్ని సాధనాలు ఉపయోగపడగా వాటి ఆవిష్కరణలో ఇస్లామిక్‌ మేధావుల పాత్ర కూడా ఉంది. ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ పెట్టుబడులు ఒక ట్రిలియన్‌ డాలర్ల స్థాయిని మించినా ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థలో దీని పాత్ర స్వల్పమైంది. ఎక్కువ భాగం ముస్లిం దేశాలకు పరిమితమైంది.ఇరాన్‌, సౌదీ అరేబియా, మలేషియా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లో ముందుండగా కువైట్‌, బెహ్రాన్‌, మలేషియా ఇస్లామిక్‌ ఫైనాన్షియల్‌ సంస్థల నిర్వహణలో ప్రాధాన్యతను వహిస్తున్నాయి.

నయా ఉదారవాద విధానాల ప్రభావాలు: ఆధునిక బ్యాంకింగ్‌ వ్యవస్థలో స్పెక్యులేషన్‌, జూద ప్రవృత్తి అధికంగా ఉంటున్నది. ఈ ధోరణలు ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లో అంతగా కనబడటంలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో రియల్‌ఎస్టేట్‌ రంగం కూడా అత్యధిక స్పెక్యులేషన్‌కు గురికావటంతో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌పై నయా ఉదారవాద విధానాల ప్రాబల్యం పడింది. దుబారు అనుసరించిన ఆర్థిక నమూనా ఈ చక్రబంధంలో చిక్కుకొని దుబారు వరల్డ్‌ సంస్థ 26 బిలియన్‌ డాలర్ల అప్పును తిరిగి చెల్లించటాన్ని వాయిదా వేసింది. వీటిలో 3.52 బిలియన్‌ డాలర్ల సుకుక్‌ బాండ్‌ల విలువలపై చెల్లించాల్సిన 4.5 బిలియన్‌ డాలర్ల అప్పు ఇరుక్కు పోయింది. సురక్షితంగానూ, లాభదాయకంగానూ ఇంతకాలం ఉన్న సుకుక్‌ల మనుగడ ప్రశ్నార్థకమవటంతో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ భవితవ్యం సందేహాల సుడిగుండంలోకి నెట్టబడింది. అదే సందర్భంలో సుకుక్‌ల నిర్మాణంలోనూ షరియత్‌ చట్టాల ఉల్లంఘన ఉన్నట్లు అనేక నివేదికలు బహిర్గతమయ్యాయి. ప్రముఖ షరియత్‌ మేధావి షేక్‌ మహమ్మద్‌ తఖి ఉస్మాని సుకుక్‌లలో 85% షరియత్‌ చట్టాలకు కట్టుబడి లేవని విమర్శించారు. అదే సందర్భంలో పశ్చిమ ఆసియాలోని ఇస్లామిక్‌ అధినేతలు తమ పెట్టుబడుల్ని లండన్‌లాంటి మెట్రో సెంటర్లకు తరలించటం కూడా వింటున్నాము. ప్రపంచ ద్రవ్య సంక్షోభంతో కుదేలైన బ్యాంకులు సైతం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ డివిజన్‌లను ఏర్పాటు చేసి ఆయిల్‌ సొమ్మును హస్తగతం చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ భవితవ్యం ప్రశ్నార్థకమైంది.

Sunday, December 27, 2009

వాయువిడుదలలు - జరిమానాలు

పర్యావరణ పరిరక్షణకు నడుంకట్టిన క్యోటో ఒప్పందాన్ని అటకెక్కించటానికే ''కొపెన్‌హగెన్‌ అంగీకారం'' కుదిరిందని, చట్టబద్ధత లేకున్నా దశాబ్ధాలుగా ప్రపంచ దేశాలు, శాస్త్రవేత్తలు శ్రమించి సాధించిన క్యోటో ఒప్పందంలోని విలువైన మౌళికాంశాల్ని నీరుకార్చడంలో సంపన్నదేశాలు సఫలమయినాయని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోపక్క కొపెన్‌హగెన్‌లో జరిగిన పర్యావరణ మార్పు సదస్సు అర్థాంతరంగా ముగిసి అభాసుపాలు కాకుండా తన చతురతతో కనీసం ఒక రాజకీయ ఒప్పందాన్నైనా కుదర్చగలిగానని అమెరికా అధ్యక్షులు బారక్‌ ఒబామా కీర్తించుకుంటున్నారు

క్యోటో ఒప్పందం-జరిమానాలు - సంపన్న దేశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన గ్రీన్‌ హౌస్‌ వాయు విడుదలల కర్తవ్యాన్ని నిర్ధేశించి వర్థమాన దేశాలను ఆ వాయువిడుదలల తగ్గింపు బాధ్యత నుండి మినహాయించిన క్యోటో ఒప్పందంలోని కీలకాంశాన్ని, ''వాయు విడుదలల తగ్గింపు అందరి బాధ్యత'' అనే అంశంతో కొపెన్‌హగెన్‌ అంగీకారం తుడిపేసింది. క్యోటో ఒప్పందం చట్టబద్ధత కలిగినదైన, ఆ కాలానికి వాయువిడుదలల పరిమాణం లెక్కింపులో తగినంత సాంకేతిక అభివృద్ధిగాని, ఒప్పందనిర్ణయాలు అమలు చేయగల సంస్ధగత ఏర్పాట్లుగాని, జాతీయ కార్యాచరణలుగాని అంతగాలేవు కాని కొపెన్‌ హగన్‌ సదస్సు నాటికి, కొపెన్‌ హగన్‌ అంగీకారానికి చట్టబద్ధత లేకపోయినప్పటికి వాయువిడుదల పరిణామం లెక్కింపులో సాంకేతిక అభివృద్ధి, జాతీయ ప్రభుత్వాలు నిర్ణయాలను అమలు చేయగల సంస్ధాగత ఏర్పాట్లతో, సమాచారాన్ని పంచుకొనే జాతీయ కార్యాచరణను కల్గిఉన్నాయి. క్యోటో ఒప్పందంపై 2001లో బాన్‌లో జరిగిన 6వ వివిధ పక్షాల సమావేశంలో, వాయువిడుదలల తగ్గింపు లక్ష్యాన్ని సాధించని సంపన్న దేశాలపై విధించాల్సిన జరిమానాపై నిర్ణయం జరిగింది.

ఆ నిర్ణయం ప్రకారం ఏదైనా సంపన్న దేశం క్యోటో ఒప్పందం నిర్ధేశించిన వాయు విడుదలల తగ్గింపు లక్ష్యాన్ని, ఏదైన ఒక సంవత్సరంలో చేరలేకపోతే లోటైన వాయువిడుదలల పరిమాణానికి 130 శాతం మేరకు తదుపరి సంవత్సరంలో అదనంగా వాయువిడుదలలని తగ్గించాల్సిఉంటుంది. ఉదాహరణకు ఒక సంవత్సరంలో ఒక సంపన్నదేశం ఒక మెట్రిక్‌ టన్ను కార్బన్‌ వాయు పరిమాణం లక్ష్యం కంటే తగ్గితే, తదుపరి సంవత్సరం 1.3 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ వాయువిలువలలను అదనంగా తగ్గించాలి కాని ఈ వాయువిడుదలల తగ్గింపుపై విధించాల్సిన జరిమానా అమలుచేసే చట్టబద్ధ ప్రక్రియ ఏర్పాటు చేయటంలో నెలకొన్న లోపాలతో క్యోటో ఒప్పందం విఫలమైన కారణంగా సంపన్న దేశాలు బాహాటంగా వాయువిడుదలల తగ్గింపు లక్ష్యాల్ని ధిక్కరించాయి.

క్యోటో ఒప్పందంలో సంపన్న దేశాలకే పరిమితమైన ఈ జరిమానాలను, ''కొపెన్‌హగన్‌ అంగీకారం'' లో మారిన పరిస్థితులలో ''అంతర్జాతీయ సంప్రదింపులు మరియు విశ్లేషణ'' పేర వర్థమాన దేశాలపై వాయువిడుదలల తగ్గింపు నియంత్రణలను జరిమానాలను ఎక్కుపెట్టి, వాయువిడుదలల తగ్గింపు బాధ్యతల నుండితప్పుకోవటానికి సంపన్న దేశాలు సమాయత్తమవుతున్నాయి. కొపెన్‌హగన్‌ అంగీకారం కుదిరిన వెంటనే అమెరికా అధ్యక్షుడైన బారక్‌ ఒబామా సలహాదారుడు భారత్‌ చైనాలపై చేసిన వ్యాఖ్యలను ఈ దిశలో పరిశీలించాలి

లాభార్జనదుగ్ధతో సంపన్నదేశాలు- ''సమిష్ఠి లక్ష్యం వివిధ దేశాల విభిన్న బాధ్యతలు'' అనే పునాదిపై నిర్మించబడ్డ క్యోటో ఒప్పందం, కొపెన్‌హగన్‌ అంగీకారంలో ఆ పునాది ''సమిష్ఠి లక్ష్యం వివిధ దేశాల విభిన్న స్పందనలు'' గా మారిపోయింది.

కొపెన్‌హగన్‌ సదస్సు సందర్భంగా సంపన్న దేశాల వాయువిడుదలల లక్ష్యాల్ని ప్రభావితం చేయాలనే వ్యూహంతో అభివృద్ధి చెందుతున్న బేసిక్‌ దేశాలు (బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, ఇండియా, చైనా) క్యోటో ఒప్పందం ప్రకారం తమకు బాధ్యత లేకున్నా ఐచ్ఛికంగా వాయువిడుదలల తగ్గింపు లక్ష్యాన్ని ప్రకటించినప్పటికి, సంపన్న దేశాలు తాము ప్రకటించిన లక్ష్యాల్ని ఇసుమంతకూడా మార్పుచేయకుండా మొండిగా వ్యవహరించాయి. రెండు సంవత్సరాల క్రితం బాలీ కార్యాచరణ ప్రణాళికను ఒప్పుకున్న సంపన్న దేశాలు దాని స్పూర్తిని తుంగలో తొక్కాయి. సంపన్నదేశాలు ప్రకటించిన గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల తగ్గింపులతో, గరిష్ఠ వాయువిడుదలల సంవత్సరం 2015 నాటికిగాని అమలుకాదని, అలా జరిగితే 2020 నాటికి వాతావరణ ఉష్ణోగ్రత 3డిగ్రీలు దాటి ప్రమాద ఘంటికల్ని మోగిస్తుందని సమావేశ సందర్భంగా ఐక్యరాజ్య సమితి రహస్య నివేదిక అభిప్రాయపడింది.

అంతేకాకుండా సదస్సు సందర్భంగా ప్రకటించిన వర్థమాన దేశాల వాయువిడుదలల తగ్గింపు పరిమాణం 5.2 బిలియన్‌ టన్నలుండగా సంపన్నదేశాల ప్రకటనల ప్రకారం వాయువిడుదలల తగ్గింపు పరిమాణం 2.1 నుండి 3.4 బిలియన్‌ టన్నులు మాత్రమే ఉన్నట్లు ఆ రహస్య నివేదిక భావించింది. గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల ప్రభావం మానవాళిపై ఎంతో తీవ్రంగా ఉందని శాస్త్రవేత్తలు ఘోషించినా, సంపన్న దేశాలు లాభార్జనదుగ్ధతో అనుసరిస్తున్న నిర్లక్ష్య, బాధ్యతారహిత వైఖరిని ప్రపంచ ప్రజానికం ముందు ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వంచనను ప్రతిఘటించాలి- ''కొపెన్‌హగన్‌ అంగీకార పత్రంలో చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకోవటానికి గడువుతేదిగా డిసెంబర్‌ 2010ని ప్రకటించినా తుది పత్రంలో ఈ గడువు తేది తొలగించబడినట్లు తెలుస్తోంది. క్యోటో ఒప్పందంలో ఉన్న 1990 గరిష్ఠ వాయువిడుదలల సంవత్సరాన్ని సంపన్న దేశాలకు అన్వయించగా కొపెన్‌హగన్‌ అంగీకార పత్రంలో గరిష్ఠ వాయువిడుదలల ప్రస్థావన లేదు.ఈ అంశాన్ని సరిజేయటం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం. అదే సందర్భంగా క్యోటో ఒప్పందంలోని వాయువిడుదలల తగ్గింపుపై సంపన్న దేశాలపై ఉన్న జరిమానాలు, చట్టబద్ధ అమలు తప్పనిసరిగా భవిష్యత్‌ ఒప్పందంలో ఉంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. జి 77 దేశాలతోను, చిన్న ద్వీపకల్ప దేశాలతోను కలసి బేసిక్‌ దేశాలు భవిష్యత్‌లో మెక్సికోలో జరిగే ఒప్పంద రూపకల్పనలో ఐక్యంగా పనిచేయాలి. స్థానిక ప్రయోజనాలకు బేసిక్‌ దేశాలు కక్కుర్తి పడితే విశ్వమానవ సంక్షేమానికి తీవ్రవిఘాతం ఏర్పడుతుంది. చరిత్ర క్షమించదు.

Sunday, December 20, 2009

గరిష్ట వాయు విడుదలల సంవత్సరం

త 12రోజులుగా పర్యావరణ మార్పుపై డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హాగన్‌ నగరంలో జరుగుతున్న ప్రపంచదేశాల సమావేశంలో 193దేశాల ప్రతినిధులు, అధినేతలు హాజరైనారు. క్యోటో సదస్సులో గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల తగ్గింపుపై విధిగా కాలుష్యకారకులైన సంపన్నదేశాలు (ఎనేగ్జ్‌-1దేశాలు) అమలు చేయాల్సిన వాయు విడుదలల తగ్గింపు లక్ష్యాలను నిర్దేశించింది. అదే సమయంలో వర్ధమాన దేశాలను ఈ తగ్గింపు బాధ్యతనుండి మినహయించింది. ఈదేశాలు పర్యావరణ కాలూష్యానికి అనాదిగా కారణం కాదన్నది క్యోటో ఒప్పంద అవగాహన. దీనికి భిన్నంగా కోపెన్‌హెగెన్‌ సదస్సులో పరోక్షంగా చర్చించబడ్డ డెన్మార్క్‌ ముసాయిదా వర్ధమాన దేశాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఆ ముసాయిదాలో వర్దమాన దేశాలు కూడా ''గరిష్ట వాయు విడుదల సంవత్సరాన్ని'' పాటించాలనే అంశం వారి నిరసనలకు కారణమై, భారత్‌తో సహా నాన్‌ ఎనెక్స్‌-1 దేశాలు ఈ ముసాయిదాను ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ''గరిష్ట వాయు విడుదలల సంవత్సరం'' అంటే ఏమిటి..., ఇది వివిధ దేశాల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశాన్ని పరిశీలిద్దాం.


గరిష్ట వాయు విడుదలల సంవత్సరం

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధలో దశాబ్ధ కాలం వాయు విడుదల సగటును నిర్ధారణగా గరిష్ఠ వాయు విడుదల ప్రమాణాన్ని గుర్తిస్తారు. ఆలా గుర్తించిన గరిష్ఠ వాయు విడుదల సంవత్సరము నుండి ప్రతి సంవత్సరము ఒక నిర్దిష్ట ప్రమాణంలో వాయు విడుదలలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గ్రీన్‌హౌస్‌ వాయువులు గరిష్ట స్ధాయిలో ఉండే సంవత్సరాన్ని ''గరిష్ట వాయు విడుదలల సంవత్సరం'' లేదా ''పీక్‌ ఇయర్‌ ఆఫ్‌ ఎమిషన్స్‌'' అని అంటారు. అంటే ఆ వాయువులను విడుదల చేసే శిలాజ ఇంధనాల వినియోగాన్ని గరిష్టంగా ఆ నిర్దిష్ట సంవత్సరానికి పరిమితం చేసి, ఆ తర్వాతి కాలంలో వాటి వినియోగాన్ని క్రమపద్ధతిలో తగ్గించడమే గరిష్ట వాయు విడుదలల సంవత్సర సారాంశం.

వర్దమాన దేశాలపై ప్రభావం...

పైన చెప్పుకున్నట్లు నిర్దిష్ట సంవత్సరానికి గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలను తగ్గించడ మంటే శిలాజ ఇందన వినియోగాన్ని తగ్గించడమే గాకుండా వాయు విడుదల తగ్గింపును అంగీకరించడమే. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడమంటే శిలాజ ఇంధనాల ద్వారా జరిగే ఉత్పత్తిని తగ్గించడం గానూ, లేదా ప్రత్యామ్నాయ పునరుద్ధరణ ఇంధనవనరులతో పారిశ్రామికోత్పత్తిని మార్చుకోవడంగా చూడాలి. ఇది చాలా వ్యయపూరితమైనది డెన్మార్క్‌ ముసాయిదా ప్రకారం వర్దమాన దేశాలు గరిష్ట వాయు విడుదలల సంవత్సరాన్ని పాటించాలంటే ఆ దేశాల వాయు విడుదలలపై పరిమితులు పెట్టడమే. ఇది క్యోటో ఒప్పంద స్పూర్తికి భిన్నమైనది.

ఉదాహరణకు భారతదేశంలో 80 శాతం ప్లాంట్‌లోడ్‌ ఫ్యాక్టర్‌ కలిగిన బొగ్గు ఆధారతి విద్యుత్‌ కేంద్ర స్ధాపనలు ఒక మెగావాట్‌కు రూ. 5 కోట్లు సరిపోతే, అదే సౌరశక్తితో కేవలం 25 శాతం ప్లాంట్‌లోడ్‌ ఫ్యాక్టర్‌తో ఒక మెగావాట్‌ విద్యుత్‌ కేంద్రానికి 20-25 కోట్ల రూపాయలు వ్యయం అవుతోంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్ర సామర్థ్యానికి సమానమైన సౌరశక్తి విద్యుత్‌కేంద్ర స్థాపనకు బొగ్గు ఆధారితి కేంద్రం కంటే 12-15 రెట్టు అధికంగా పెట్టుబడి అవసరం అవుతోంది. అందుకనే వర్దమాన దేశాలు పర్యావరణ ముప్పు నుండి తట్టుకుని అభివృద్ధి చెందడానికి భారీస్థాయిలో పరిహారాన్ని, పరిజ్ఞానాన్ని సంపన్న దేశాల నుండి కోరుతున్నాయి. రియో సదస్సు సందర్భంగా క్యూబా మాజీ అధ్యక్షులు ఫైడల్‌ క్యాస్ట్రో ''ఈ పరిహారాన్ని సంపన్నదేశాలు, వర్దమానదేశాలకు చెల్లించాల్సిన బాకీ''గా అభివర్ణించారు.

కోపెన్‌హెగెన్‌ సదస్సులో ఆఫ్రికా దేశాల బృందం ఈ పరిహారం కింద షరతులు లేని 70 వేల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని కోరింది. అమెరికా ప్రతిపాదించిన 10 వేల కోట్లు, యూరోప్‌ ప్రతిపాదించిన వంద కోట్ల డాలర్ల లాంటి సంపన్నదేశాల సహాయం నామమాత్రమే. భారత్‌, చైనాలు 2005 స్థాయికి 2020లోగా వాయువిడుదలను తగ్గించాలనే ప్రతిపాదనలు ఐచ్ఛికంగా గరిష్టవాయు విడుదల సంవత్సరాన్ని అంగీకరించడమే.

సంపన్నదేశాలపై ప్రభావం...

గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలోని కార్బన్‌డయాక్పైడ్‌ 1750 సంవత్సరం నాటికి 280 పిపిఎంలు ఉండగా 2004 నాటికి 387 పిపిఎంలు ఉంది. గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో 75% ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌ ప్రధానంగా భూగోళ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణభూతమవుతోంది. క్యోటో ఒప్పందంలో 1990 నాటి ఉష్ణోగ్రత కన్నా 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రత పెరిగితే మానవాళికి ముప్పుగా భావించారు. ఇందుకోసమే భూగోళ ఉష్ణోగ్రతలు 1990 నాటి ఉష్ణోగ్రతలకు 2 డిగ్రీలు మించకుండా కార్బన్‌ వాయువిడుదల తగ్గించాలని ప్రతిపాదించారు. అందువల్లే క్యోటో ఒప్పందం కాలుష్య వాయు విడుదలలకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు 1990 వాయు విడుదలల స్థాయి నుండి 2012లోగా 5.2 శాతం తగ్గించాలని ఉద్దేశించింది.

అంటే క్యోటో ఒప్పందం ప్రకారం సంపన్నదేశాలు 1990ని గరిష్ట వాయువిడుదల సంవత్సరంగా భావించాయి. కాని కోపెన్‌హెగెన్‌ సదస్సు నాటికి 5.2% వాయు విడుదల తగ్గింపు లక్ష్యం నిర్లక్ష్యం చేయబడింది. వాయువిడుదలలు మరింతగా 10% పెరిగాయి. ప్రస్తుత సదస్సు సందర్భంగా అమెరికా 2005 స్థాయి నుండి 17% వాయు విడుదలలను 2020కు తగ్గిస్తానంది. అంటే క్యోటో ఒప్పందం నిర్దేశించిన గరిష్ట వాయు విడుదలల సంవత్సరాన్ని మార్చడానికి అమెరికా తెగించింది. అదే సందర్భంలో ఈ ప్రతిపాదనను 1990 స్థాయి వాయు విడుదలలలో 3% కంటే లేదు. మిగిలిన సంపన్న దేశాల తీరు కూడా అటుఇటుగా క్యోటో ఒప్పంద లక్ష్యాల్ని నీరు గార్చేటట్టుగా ఉంది. గరిష్ట వాయు విడుదలల సంవత్సరాన్ని క్యోటో ఒప్పందంలోని 1990 నుండి 2005కు మార్చటం సంపన్నదేశాలకు ప్రయోజనకరం.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పర్యవసానంగా 1990 నుండి 2005 మధ్యకాలంలో అనేక సంపన్నదేశాలు వారి పారిశ్రామిక స్థావరాలను తరలించిన కారణంగా చైనా, భారత్‌, బ్రెజిల్‌, సౌత్‌ ఆఫ్రికా వంటి దేశాల కార్బన్‌ వాయు విడుదలల స్థాయి, తీవ్రత పెరిగింది. ఎనెక్స్‌-1 దేశాల సరసన ఈ దేశాలను చేర్చి గ్రీన్‌హౌస్‌ వాయువిడుదల బాధ్యతను దింపుకోవడానికి అమెరికా సారథ్యంలోని అనేక సంపన్న దేశాలు నడుంకట్టాయి.

అందుకనే కోపెన్‌హెగెన్‌ సదస్సులో క్యోటో ఒప్పందాన్ని అటకెక్కించడానికి సంపన్నదేశాలు చేయని ప్రయత్నం లేదు. సంపన్నదేశాలన్నీ కలిసి ఇప్పటివరకూ ప్రతిపాదించిన వాయు విడుదలల తగ్గింపులు భూగోళ వాతావరణ ఉష్ణోగ్రతలను 3డిగ్రీల నుండి 4డిగ్రీల వరకూ పెంచుతాయనే నిపుణుల అంచనా పరిస్థితుల తీవ్రతను తెలుపుతోంది. వాతావరణంలో ఒక డిగ్రీ పెరుగుదల భారతదేశంలో కనీసం 10% గోధుమల ఉత్పత్తితో పాటు ఇతర ఆహార పంటల దిగుబడులను తగ్గిస్తాయని, ఆహార భద్రతకు తీవ్ర విఘాతం తెచ్చిపెడతాయని ప్రముఖ వ్యవయసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌ స్వామినాథన్‌ అభిప్రాయపడుతున్నారు.

ముగింపు:- విశ్వ మానవ సౌభాగ్యానికి దోహదపడాల్సిన అమెరికా రియో సదస్సునుండి ప్రపంచ మానవాళి విధ్వంసానికి కారణమవుతున్న పర్యావరణ మార్పుపై క్రమం తప్పకుండా అనుసరిస్తున్న వైఖరిని కోపెన్‌హెగన్‌లో కూడా ప్రదర్శిస్తుంది. క్యోటో ఒప్పందంలో అమెరికా వైఖరితో నిమిత్తం లేకుండా మిగిలిన సంపన్నదేశాలు ఒప్పంద పరిపూర్తికి సహకరించగా కోపెన్‌హెగెన్‌లో అవి అమెరికాతో అంటకాగడం చూస్తున్నాం. క్యోటో ఒప్పందం అంపశయ్య ఎక్కకుండా వర్ధమానదేశాలన్నీ ఐక్యంగా కదలాలి.

Sunday, December 13, 2009

వాయు విడుదల కొలమానాలు

'పర్యావరణ మార్పు''పై కొపెన్‌హగెన్‌లో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సుకు ముందే వివిధ దేశాలు ఆయా దేశాలలో కార్బన్‌ వాయువులను ఏమేరకు తగ్గించాలనుకుంటున్నాయో ప్రకటించాయి. భారతదేశం కూడా ఇంతవరకు తాను అనుసరిస్తూ సమర్ధిస్తున్న 'తలసరి వాయు విడుదలల'(పర్‌క్యాపిటా ఎమిషన్స్‌) స్థానంలో 'జిడిపి ఆధారిత కార్బన్‌వాయు విడుదలల తీవ్రత' ప్రాతిపదికగా 2005 స్థాయి నుండి 2020 నాటికి కార్బన్‌ వాయు విడుదలలను 20-25 శాతం తగ్గించుకునేందుకు ఐచ్ఛికంగా సంసిద్ధతను ప్రకటించింది. అంతకు ముందు ఇదే పద్ధతిలో చైనా 40-45 శాతానికి, అమెరికా 19 శాతానికి వాయువిడుదలల తగ్గింపుకు సిద్ధమైనట్లు ప్రకటించాయి. సంపన్న దేశాలపై వత్తిడి పెంచటానికే ఈ చర్య అని భారత్‌ వాదిస్తున్నది
అమెరికా వాయు విడుదలల నియంత్రణ దిశగా ముందడుగు ప్రయత్నాలు చేయకుండా వర్దమాన దేశాలన్నీ మరింతగా త్యాగాలు చేయాలని, ఏఏ దేశం ఎంత మేరకు నిర్దిష్టంగా వాయువు విడుదలలను తగ్గిస్తాయో ప్రకటించాలని వత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తలసరి వాయు విడుదలలు(పర్‌క్యాపిటా ఎమిషన్స్‌), జిడిపి ప్రేరిత వాయు విడుదలల తీవ్రత(ఎమిషన్‌ ఇన్‌టెన్సిటీ ఆఫ్‌ జిడిపి) అంశాలని పరిశీలిద్ధాం.

పూర్వరంగం: క్యోటో ఒప్పందం క్రింద ఎనెగ్జ్‌-1గా వర్గీకరించబడ్డ సంపన్న దేశాలు 1990 స్థాయి నుండి 5.2% విధిగా గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల్ని తగ్గించుకోవాలి. కానీ ఈ లక్ష్య సాధనలో ఏ దేశమూ విజయవంతం కాలేకపోగా గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల్ని మరింతగా పెంచి మానవ మనుగడకు ముప్పును తెచ్చాయి. ఎనెగ్జ్‌-1లో లేని దేశాలు ఐచ్ఛికంగా వాయువిడుదలల తగ్గింపు చర్యలు తీసుకోవచ్చు కానీ తగ్గింపు కోటాలు విధిగా పాటించనవసరం లేదు.

ఈ వాయువిడుదలల కోటాలను తలసరి వాయు విడుదలల తగ్గింపు పద్ధతిలోకానీ, జిడిపి ఆధారిత వాయు విడుదలల తీవ్రత తగ్గింపు పద్ధతిలోకానీ వ్యక్తం చేయవచ్చు. గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలలో 75% కార్బన్‌ వాయు విడుదలలు ఉన్నందున వీటిపైనే కేంద్రీకరణ ఎక్కువగా ఉంటున్నది.

తలసరి వాయు విడుదలలు(పర్‌ క్యాపిటా ఎమిషన్స్‌): ఒక దేశం/ప్రాంతంలో విడుదలైన గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల పరిమాణానికి, ఆ దేశ/ప్రాంత జనాభాకు మధ్య ఉన్న నిష్పత్తిని ''తలసరి వాయు విడుదల''లని అంటారు. అంటే ఆ దేశం/ప్రాంతంలో ఒక వ్యక్తిపై ఉన్న సగటు వాయువిడుదలల పరిమాణం ఇది. సాధారణంగా సంపన్న దేశాల వాయువిడుదలల సగటు పరిమాణం వర్ధమాన దేశాల కంటే 4 రెట్లకు మించి అధికంగా ఉంటుంది. ఉదాహరణకు అమెరికా తలసరి వాయు విడుదలలు 20.1 మెట్రిక్‌టన్నులుగా ఉంది. వర్దమాన దేశాల తలసరి వాయువిడుదలలో చైనా మొదటి స్థానంలో ఉంది.
2006లో ఆ దేశంలో 4.6 మెట్రిక్‌టన్నులు ఉన్న తలసరి వాయు విడుదలలు 2030కి 8.0 మెట్రిక్‌ టన్నులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అతి తక్కువ తలసరి వాయు విడుదలల దేశాలలో భారత్‌, ఆఫ్రికాలు ఉన్నాయి. భారత్‌లో 2006లో ఒక్కొక్క వ్యక్తిపై 1.1 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌వాయు పరిమాణం ఉంటే 2030 నాటికి 1.4 మెట్రిక్‌ టన్నులకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఆఫ్రికా దేశాలలో తలసరి వాయు విడుదలల స్థాయిలో 2006 నుండి 2030 వరకు మార్పు ఉండక పోవచ్చు.

డాలర్‌ జిడిపి ఆధారిత వాయు విడుదలల తీవ్రత: ఒక దేశంలో ప్రతి యూనిట్‌ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి డాలర్లలో) సంపదలో విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల పరిమాణాన్ని ''జిడిపి ఆధారిత వాయు విడుదలల తీవ్రత'' అంటారు. స్థూల దేశీయోత్పత్తిలో ప్రారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, సేవా రంగాల భాగస్వామ్యం ఉంటుంది.
వీటిలో సేవారంగ అభివృద్ధి ద్వారా విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలు నామమాత్రమే. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో వినియోగించే శిలాజ ఇంధనాల మూలకంగా ఉత్పన్నమయ్యే గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలే పర్యావరణ మార్పుకు అపాయకరంగా పరిణమిస్తాయి. ఒక అంచనా ప్రకారం 2006లో ఒక మిలియన్‌ డాలరు జిడిపికి సంపన్న దేశాలలో 386 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ వాయు విడుదలల పరిమాణం ఉండగా, 2030 నాటికి 246 మెట్రిక్‌ టన్నులు ఉండవచ్చని లెక్కిస్తున్నారు.2005 నాటికి అమెరికా-475, జర్మనీ-330, జపాన్‌-328, ఫ్రాన్స్‌-214 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ తీవ్రతను కల్గిఉన్నాయి. ఇక్కడ కార్బన్‌ వాయు విడుదలల తగ్గింపు సామర్ధ్యం బాగా ఉన్నట్లు వారి అంచనా. అదే సందర్భంలో వర్ధమాన దేశాలలో 2006లో ఒక మిలియన్‌ డాలర్‌ జిడిపికి 624 మెట్రిక్‌ టన్నులు ఉన్న కార్బన్‌ వాయు విడుదలలు 2030 నాటికి 330 మెట్రిక్‌ టన్నులకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

2005 నాటికి చైనా-1046, భారత్‌-501 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ తీవ్రతను కల్గి ఉన్నాయి.2006లో వర్ధమాన దేశాలలో కార్బన్‌ వాయు విడుదలల పరిమాణం పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. 1) సంపన్న దేశాల పారిశ్రామికోత్పత్తి వర్ధమాన దేశాలకు తరలడం, 2) సంపన్న దేశాలలో ఆర్ధికమాంద్యం పెరగటం, 3) సంపన్న దేశాల వినియోగపు సరుకులన్నీ వర్ధమాన దేశాలలో ఉత్పత్తి కావటం, 4) నయా ఉదారవాద విధానాల నేపధ్యంలో సంపన్న దేశాల జిడిపిలో అత్యధికంగా సేవారంగంపై ఆధారపడి ఉండటం. కానీ 2006వ సంవత్సరం పూర్వం సంపన్న దేశాల విచక్షణారహిత శిలాజ ఇంధనాల వినియోగం, విలాసవంత జీవనం, అడవుల నరికివేత లాంటి చర్యలు భూ ఖండంలో అత్యధిక ఉష్ణానికి కారణమైనాయి. వర్ధమాన దేశాల ప్రజానీకంపై తీవ్రమైన దుష్ప్రభావాల్ని కలిగిస్తున్నాయి.


విశ్లేషణ: పైన పేర్కొన్న వాయువిడుదలల కొలమాన పద్దతులను పరిశీలించినపుడు తలసరి వాయు విడుదలల పద్ధతి సంపన్న దేశాల ప్రయోజనాలకు ఆటంకంగా ఉంటుంది. అందువల్ల మన ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు మాంటెక్‌ సింగ్‌ అహుల్‌వాలియా ఈ అంశంపై మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలు సహజంగా తలసరి వాయు విడుదలల పద్ధతిని వ్యతిరేకిస్తారు కాబట్టి జి.డి.పి ఆధారిత వాయు విడుదలల తీవ్రతా పద్ధతిని అనుసరించడం శ్రేయస్కరమన్నారు. సంపన్న దేశాల కొమ్ముగాసే ఈ వాదనలే భారత్‌ లాంటి దేశాలను సంపన్న దేశాల ఉచ్చులోకి లాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో తలసరి వాయు విడుదలల పద్ధతి వర్దమాన పేద దేశాలు సంపన్న దేశాల నుండి పరిహారాన్ని, పరిజ్ఞానాన్ని రాబట్టుకోవటానికి నైతిక బలాన్ని అందిస్తుంది. భారత్‌ ప్రదర్శిస్తున్న తాజా వైఖరి సామ్రాజ్యవాద దేశాలకు ముందుగానే లొంగిపోవటమే కాకుండా వర్దమాన దేశాల ప్రయోజనాలకు భంగకరంగా కూడా ఉంది. ఈ వైఖరిని భారత్‌ పునరాలోచించుకొవాల్చిన అవసరం ఎంతైనా ఉంది.

Monday, December 7, 2009

డాలర్‌ బదిలీ వాణిజ్యం (డాలర్‌ క్యారీ ట్రేడ్‌)

ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా చలామణి అయి, వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను గత మూడు దశాబ్దాలుగా శాసించిన అమెరికన్‌ డాలర్‌ ఇటివలీ కాలంలో తీవ్రంగా బలహీన పడింది. బలహీన పడ్డ అమెరికన్‌ డాలర్‌ను పెట్టుబడిగా మార్చుకొని విపరీతమైన లాభార్జన నెరుపుతున్న వాణిజ్యమే ''డాలర్‌ బదిలీ వాణిజ్యం'' గా పేరు పొందింది. డాలర్‌ బలహీనపడిన కొద్దీ, బంగారం, ఆయిల్‌, సరుకులు, ఈక్విటీల మార్కెట్లు జోరుగా పెరుగుతున్నాయి. డాలర్‌ పటిష్టంగా వున్న 2008 సం||లో యీ జోరు ఇంతగా లేదు. సాధారణంగా దేశ ఆర్ధికాభివృద్ధితో బాటుగా విదేశీ మారక విలువ పెరుగుదలను మంచి లక్షణంగా చూస్తాము.

ఇటీవలి కాలంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ద్రవ్య సంక్షోభం నుండి కోలుకుంటున్న వేగం కంటే, అమెరికాలోనే కాకుండా, చైనా, భారత్‌, బ్రెజిల్‌ తదితర అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉపందుకున్న ఫైనాన్షియల్‌ మార్కెట్ల వేగం అర్ధశాస్త్ర మౌళిక సూత్రాలకతీతంగా ఉంది. అమెరికా డాలర్‌ బలహీన పడ్డ కొద్దీ, అంతర్జాతీయ పెట్టుబడుల మార్కెట్‌లు శరవేగంతో దూసుకుపోతున్నాయి. ఈ వేగాన్ని సృష్ఠిస్తున్న ప్రక్రియే ''కరెన్సీ బదిలీ వాణిజ్యం''. డాలర్ల ఆధారంగా జరిగేది ''డాలర్‌ బదిలీ వాణిజ్యం''.

కరెన్సీ బదిలీ వాణిజ్యం అంటే

''తక్కువ వడ్డీ రేటుకు లభ్యమయ్యే కరెన్సీ నిధులను అత్యధిక లాభాలనార్జించే విదేశీ కరెన్సీ లోని పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టె వ్యూహాన్ని'' ''కరెన్సీ బదిలీ వాణిజ్యం'' అంటారు. ఉదాహరణకు 1 శాతం వడ్డీ రేటుతో జపాన్‌ బ్యాంకు నుండి యెన్‌ల రూపంలో అప్పు తీసుకొని ఆసొమ్మును 4 శాతం వడ్డీరేటు గల అమెరికన్‌ డాలర్‌ బాండ్లలో పెట్టుబడి పెడితే రెండు దేశాల విదేశీ మారక విలువలలో మార్పు లేనంత కాలం 3 శాతం వడ్డీ లాభంగా మిగులుతుంది. దీనితోపాటే విదేశీ కరెన్సీ మారక విలువలు పెరిగేటట్లయితే లాభాల రేటు ఇంకా పెరుగుతుంది. అదే సందర్భంలో విదేశీ, స్వదేశీ కరెన్సీ మారక విలువలలో ఎగుడుదిగుడులుంటే ఆదాయాలు తారుమారవుతాయి. లాభాలైనా, నష్టాలైనా ఫలితం తీవ్రంగా ఉంటుంది. నయా ఉదారవాద విధానాల సృష్ఠి ''కరెన్సీ బదిలీ వాణిజ్యం''.

వెలిగి పోతున్న అంతర్జాతీయ ఫైనాన్స్‌ మార్కెట్లు

1980, 1995, 2006, 2008 సంవత్సరాలలో జపాన్‌లో సంభవించిన ఆర్ధిక సంక్షోభాల నేపథ్యంలో జపాన్‌ 'ఎన్‌' మారక విలువ క్షీణించిన దశలో జపాన్‌ పెట్టుబడీదారులు అతి తక్కువ వడ్డీకి లభించిన యెన్‌లను అధిక విదేశీ మారక విలువగల విదేశీ ఫైనాన్స్‌ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు గడించారు. ''యెన్‌ బదిలీ వాణిజ్యం'' యింతవరకు పెట్టుబడి మార్కెట్లకు చౌకబారునిధుల వనరుగా వున్నది. దాని స్ధానంలో డాలర్‌ నేడు ఈ దుస్ధితికి దిగజారింది. అమెరిగాలో ఇటీవలి ద్రవ్య సంక్షోభం నుండి బయటపడేందుకు అమలుచేస్తున్న ఉద్దీపన పధకాలతో ద్రవ్య లభ్యత (లిక్విడిటి) విపరీతంగా పెరిగింది. సున్నా కంటే అతి తక్కువ శాతం వడ్డీ రేట్లకు ఫెడరల్‌ రిజర్వ్‌, ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఋణాలను కార్పోరేట్‌ సంస్ధలు తమ దేశంలోనే కాక చైనా, భారత్‌, బ్రెజిల్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఫైనాన్షియల్‌ మార్కెట్లలో అత్యధికంగా పెట్టుబడులుగా పెడుతున్నాయి. దీనితో అంతర్జాతీయ ఫైనాన్స్‌ మార్కెట్‌ వెలిగి పోతున్నట్లు పెట్టుబడిదారులు ప్రచారం చేస్తూ ప్రజలలో భ్రమలు కల్పిస్తున్నారు. నిజ ఆర్ధిక వ్యవస్ధకు మళ్ళుతున్న నిధులు మాత్రం నామమాత్రం గానే ఉన్నాయి.

కరెన్సీ బదిలీ వాణిజ్యం ప్రభావాలు

కరెన్సీ బదిలీ వాణిజ్యం లో పెట్టుబడిగా పెట్టె కరెన్సీ మారక విలువ క్షీణత ఎక్కువ కాలం కొనసాగితే పెట్టుబడిదారుల లాభాలు అమితంగా ఉంటాయి. స్పెక్యులేషన్‌ కూడా అపరిమితంగా ఉంటుంది. అమెరికా అనుసరిస్తున్న ఈ తరహా కరెన్సీ విధానాల్ని (మానిటరీ పాలసీలు) ప్రపంచ దేశాలన్నీ అనుస రించాల్సిన దుస్ధితి ఏర్పడింది. అమె రికాలోని గృహరుణాల సంక్షోభం చేదు అనుభవాలు స్మృతి పథంనుండి తొలగక మునుపే, డాలర్‌ బదిలీ వాణిజ్యం ఆధారంగా ఫైనాన్షియల్‌ మార్కెట్‌ రంగంలోని స్పెక్యులేటర్లు అమితమైన దురాశతో. ''ఫైనాన్షియల్‌ రంగ బుడగ''ను అంతులేకుండా పెంచుతున్నారు. అమెరికన్‌ ఆర్ధిక నిపుణులు ప్రొఫెసర్‌ నౌరియేల్‌ రౌబీనీ యీ పరిమాణాల పట్ల వ్యాఖ్యానిస్తూ, ''సుధీర్ఘకాలం కొనసాగే డాలర్‌ బదిలీ వాణిజ్యంలో వాణిజ్య బుడగ పేలడం అనివార్యమని'' హెచ్చరించారు అమెరికా డాలర్‌ ధర ఏదోసమయానికి పెరగాల్సిందే. ఆ పరిణామమే వాణిజ్య బుడగ పగలటానికి కారణమౌతుందనేది అయన హెచ్చరిక సారాంశం. విధ్వంసాన్ని సృష్టించగలిగే వీటి పర్యవసానాలు. ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి.

డాలర్‌ భయాలు

సబ్‌ ప్రైం సంక్షోభ సూత్రధారులైన మెరిల్‌ లించ్‌, గోల్డ్‌ మాన్‌ సాచ్స్‌ లాంటి కార్పోరేట్‌ సంస్ధలు డాలర్‌ బదిలీ వాణిజ్య రూట్‌లో విదేశీ స్టాక్‌, బాండ్‌ల మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టి 40-60% లాభాలు ప్రకటించుకున్నారు. ఈ పెట్టుబడి ప్రవాహాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను ముంచేస్తున్నాయి. ఆయా దేశాల కరెన్సీ మారక విలువలను ప్రభావితం చేసే పరిస్థితులు ఆయాచితంగా మీద పడుతున్నాయి. రాబోయే పరిణామాలను అధిగమించటానికి బ్రెజిల్‌ స్టాక్‌, బాండ్‌ల మార్కెట్‌లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాలపై 2 శాతం పన్ను విధించింది. ఇటీవల జరిగిన జి-20 దేశాల ప్రధాన మంత్రుల సమావేశంలో బ్రిటన్‌ ప్రధాని గోర్డాన్‌ బ్రౌన్‌ విదేశీ చౌకబారు పెట్టుబడుల లావాదేవీలపై టోబిన్‌ పన్ను విధించాలని ప్రతిపాదించారు భారతదేశంలో దొడ్డిదారిన విదేశీ అనిశ్చితి పెట్టుబడులను ఆకర్షించే పార్టీసిపేటరీనోట్లను నిషేదించాలనే డిమాండ్‌ పార్లమెంట్‌లో లేవనెత్తారు.

కొన్ని ఆసియా దేశాలు డాలర్‌ బదిలీ వాణిజ్య దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు దేశీయ విధానాల మార్పుకు సమాయత్తం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షులు బారక్‌ ఓబామా చైనా పర్యటన సందర్భంగా, ఆదేశ బ్యాంకింగ్‌ రంగ నియంత్రణాధికారి లియు మింకాంగ్‌, చౌక బారు పెట్టుబడుల ప్రోత్సాహంతో అమెరికా అనుసరిస్తున్న అభద్రమైన కరెన్సీ విధానాల్ని తీవ్రంగా విమర్శించారు. జర్మనీ నూతన ఆర్ధిక మంత్రి ఉల్ఫ్‌ గ్యాంగ్‌ షఉబుల్‌, అనారోగ్య స్పెక్యులేటివ్‌ ధోరణలను పెంచే డాలర్‌ బదిలీ వాణిజ్యాన్ని దుయ్యబట్టారు.

ముగింపు

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, పెట్టుబడి అంగ నిర్మాణంలో మార్పులు తేవటమే కాకుండా లాభాల రేటు కాపాడుకోవడానికి పలు నూతన మార్గాలను, రంగాలను ముందుకు తెస్తున్నది. ఇవన్నీ ఉత్పాదక రంగంతో నిమిత్తంలేని స్పెక్యులేటివ్‌ రంగాలే. అటువంటివాటిలో ఒకటి కరెన్సీ క్యారి ట్రేడ్‌. ఈ అంశంపై జరుగుతున్న తాజా చర్చ పెట్టుబడిదారి ఆర్ధిక వ్యవస్ధ ఎంతగా సంక్షుభిత మయ్యిందో నిరూపించే మరో ఉదాహరణ మాత్రమే. నయా వుదారవాద విధానాలు, కరెన్సీ (మానిటరీ) విధానాలతోనే ఆర్ధిక రుగ్మతల్ని నివారించాలనుకుంటే ఫలితం ఇలానే ఉంటుంది. ఒక రోగానికి మందు వేస్తే, మరో రోగం ముదురుతున్నది.