Tuesday, October 5, 2010

బేసెల్‌ -2 ప్రమాణాలు - బ్యాంకింగ్‌ వ్యవస్థ


అంతర్జాతీయ బ్యాంకుల సుస్థిర మనుగడకు అమలు చేయాల్సిన మార్గదర్శకాలు బేసెల్‌ ప్రమాణాలుగా రూపొందించబడ్డాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఈ ప్రమాణాలను జాతీయ బ్యాంకులకు కూడా వర్తింపజేశాయి. ఈ క్రమంలో మొదటి విడతగా విడుదలైన బేసెల్‌-1 ప్రమాణాలు బ్యాంకులు అందించే రుణాలలో ఇమిడివున్న ''రిస్క్‌''ను ఎదుర్కోవడానికి అవసరమైన మూలధన పరిమాణాన్ని, ''రిస్క్‌'' నాణ్యతను బట్టి నిర్ణయించాయి. దీనినే ''సముచిత మూలధన నిష్పత్తి''(క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో) అన్నారు. ఈ నిష్పత్తి ''రిస్క్‌''ను ఎదుర్కోగలిగే బ్యాంకుల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రమాణాల తదనంతర కాలంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యరంగంలో నెలకొన్న వివిధ పరిణామాల నేపధ్యంలో బేసెల్‌-2 ప్రమాణాలు రూపొందించబడ్డాయి.
బేసెల్‌-2 ప్రమాణాల పూర్వరంగం

బేసెల్‌-1 ప్రమాణాలలో ''సముచిత మూలధన నిష్పత్తి'' గుండుగుత్తగా వివిధ దేశాలలోని బ్యాంకులన్నింటికి ఒకే విధంగా ఉంది. ఈ కారణంగా వివిధ దేశాల ద్రవ్య వ్యవస్థల్లో నెలకొన్న నూతన పరిణామాలతో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడంలో బేసెల్‌-1 ప్రమాణాలు విజయవంతం కాలేకపోయాయి. ప్రపంచీకరణ స్వరూప స్వభావాలలో నెలకొన్న మార్పులతో ద్రవ్య మార్కెట్‌లో వినూత్న ద్రవ్య ఉత్పత్తులు (ఫైనాన్షియల్‌ ఇన్నోవేషన్స్‌) రంగం మీదకొచ్చాయి. ఈ ద్రవ్య ఉత్పత్తుల్లో స్పెక్యులేషన్‌ తీవ్రత భారీగా ఉంది. రుణ రంగ ప్రాధాన్యత పెరిగి, రుణ డెరివేటీవ్‌ ల్లాంటి అత్యధిక రిస్క్‌ కలిగిన ద్రవ్య ఉత్పత్తుల ప్రవేశంతో మార్కెట్‌ రిస్క్‌ అపరిమితంగా పెరిగింది. దీని తట్టుకోగలిగే ''రిస్క్‌'' యాజమాన్య పద్ధతులు బేసెల్‌-1 ప్రమాణాలలో లేకపోవడం బ్యాంకులకు పెను సవాలుగా మారింది. బేసెల్‌-1 ప్రమాణాలు అంచనా కట్టిన రుణ రిస్క్‌ పరిధికి మించిన పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని అదునుగా తీసుకున్న కొన్ని అంతర్జాతీయ బ్యాంకులు వారి వారి బ్యాలెన్స్‌ షీట్లను తమ్మినిబమ్మిని చేశాయి. నూతన ద్రవ్య ఉత్పత్తుల మూలకంగా నెలకొన్న అదనపు రిస్క్‌కు అనుగుణంగా అదనపు మూలధన సమీకరణ ప్రమాణాలు లేకుండా పోయాయి. అధిక నాణ్యత కలిగిన రుణాలపై బ్యాంకు ఆర్జించే లాభాల కంటే నాసిరక రుణాలు/పెట్టుబడులు అత్యధిక లాభాల్ని ఆర్జించడంతో, అంతర్జాతీయ బ్యాంకులు నాణ్యత కలిగిన రుణాల మంజూరును నిర్లక్ష్యం చేయడం మొదలైంది. బ్యాంకులు అంతర్గతంగా అనుసరిస్తున్న పద్ధతుల్లో పారదర్శకత లోపించింది. 1990లలో బేసెల్‌-1 ప్రమాణాలను తు.చ తప్పకుండా అమలు చేసిన థారులాండ్‌, ఇండోనేషియా, మలేషియా లాంటి ఆసియా దేశాలలోని ద్రవ్య వ్యవస్థలు ద్రవ్య సంక్షోభంతో తల్లక్రిందులైనాయి. అనేక బ్యాంకులు మూతబడ్డాయి. ఈ సవాళ్ళను అధిగమించడానికి బేసెల్‌ కమిటి జూన్‌-2004లో బేసెల్‌-2 ప్రమాణాల పేర నూతన మార్గదర్శకాల్ని రూపొందించింది. ఈ ప్రమాణాలు బేసెల్‌-1 ప్రమాణాల కంటే మెరుగ్గా ఉన్నా, సంక్లిష్టంగా ఉన్నాయి.

బేసెల్‌-2 ప్రమాణాలు

కనీసం మూలధన పరిమాణం, పర్యవేక్షణ సమీక్ష, మార్కెట్‌ క్రమశిక్షణ అనే మూడు స్తంభాలపై (పిల్లర్స్‌) బేసెల్‌-2 ప్రమాణాలు నిర్మింపబడ్డాయి.

1). కనీస మూలధన ప్రమాణాలు

బ్యాంకులు ఎదుర్కొనే రిస్క్‌ను బేసెల్‌-2 ప్రమాణాలు 3 రకాలుగా వర్గీకరించాయి. అవి రుణాల రిస్క్‌, మార్కెట్‌ రిస్క్‌, నిర్వహణ రిస్క్‌లు

రుణాల రిస్క్‌ : సకాలంలో రుణాలను, వాటిపై వడ్డీలను తిరిగి చెల్లించటంలో రుణ గ్రహీతలలో అనేక తారతమ్యాలు వుంటాయి. వీటిలో ఇమిడి వున్న రిస్క్‌ను రుణాల రిస్క్‌ అంటారు. ఈ రిస్క్‌ కూడా ఒక్కొక్క రుణ గ్రహీతకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా అంచనా వేయగలిగే నష్టాలను బట్టి వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. కానీ వీటికి భిన్నంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొనే ఒడుదుడుకులతో బ్యాంకులెదుర్కొనే నష్టాలను ''ఊహించని నష్టాలు'' అంటారు. రుణాల రిస్క్‌, ఊహించని నష్టాల రిస్క్‌లకు అనుగుణంగా అదనపు మూలధన పరిమాణాన్ని బ్యాంకులు సమకూర్చుకోవాలి.

మార్కెట్‌ రిస్క్‌ : బ్యాంకులు ''చట్టబద్ధమైన లిక్విడిటీ నిష్పత్తి''ని (స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో-యస్‌.యల్‌.ఆర్‌) అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను తమ నిధులలో లిక్విడ్‌ ఆస్థులైన నగదు, బంగారం, అనుమతించిన ప్రభుత్వ/ఇతర బాండులలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. (భారతదేశంలో గరిష్ట చట్టబద్ధ లిక్విడిటీ నిష్పత్తి 40%గా ఉంది). ప్రపంచీకరణ విధానాల నేపధ్యంలో వీటి విలువలు అనిశ్చితికి గురౌతున్నాయి. మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ మూలకంగా, వడ్డీ రేట్లు, విదేశ మారక ద్రవ్యం, షేర్‌లు, సరుకుల ధరలలో సంభవించే మార్పులు ఈ అనిశ్చితికి కారణమౌతున్నాయి. ఈ రిస్క్‌ను మార్కెట్‌ రిస్క్‌ అంటారు.

నిర్వహణ రిస్క్‌ : బ్యాంకులు నిర్వహించే ఆంతరంగిక యాజమాన్య పద్ధతులు, ప్రక్రియలు, వాటిని నిర్వహించే వ్యక్తుల సమర్ధతతోపాటు, బాహ్య కారణాలు కూడా బ్యాంకుల అస్థిరతకు కారణమౌతున్నాయి. వీటినే ''నిర్వహణ రిస్క్‌'' అంటారు. పైన పేర్కొన్న రిస్క్‌ల పరిమాణాన్ని అంచనా వేయటానికి అందుకు అవసరమైన మూలధనాన్ని గణించటానికి కావలసిన మార్గదర్శకాలను మొదటి స్తంభం (ఫస్ట్‌ పిల్లర్‌) సమకూరుస్తుంది. బేసెల్‌-1 ప్రమాణాలలో రిస్క్‌ వెయిటేజ్‌లను, కావలసిన మూలధన పరిమాణాన్ని నియంత్రణ సంస్థలు ముందే నిర్ణయిస్తాయి. కానీ బేసెల్‌-2 ప్రమాణాలలో అనుమతి పొందిన రేటింగ్‌ ఏజెన్సీల రేటింగ్‌లపై ఆధారపడి బ్యాంకులు వారివారి రిస్క్‌ వెయిటేజ్‌లపై అంతర్గత రేటింగ్‌లను అభివృద్ధి చేసుకొనే అవకాశం మొదటి స్థంభం కలిగించింది.

2) పర్యవేక్షణ సమీక్ష

కేవలం సముచిత మూలధనం సమకూర్చుకోవడంతోనే బ్యాంకుల మనుగడకు సుస్థిరత రాదని బేసెల్‌-2 ప్రమాణాలు భావిస్తున్నాయి. దానితోపాటు బ్యాంకుల రిస్క్‌ను అదుపు చేయటానికి అవసరమైన, మెరుగైన రిస్క్‌ యాజమాన్య పద్ధతుల్ని బ్యాంకులు కలిగివుండాలని బేసెల్‌-2 ప్రమాణాలు నిర్దేశిస్తున్నాయి. బేసెల్‌-2 నందు రెండవ స్తంభం పర్యవేక్షణ పద్ధతులకు, సమీక్షకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. చట్టా వ్యాపారాలు, రుణ డెరివేటివ్‌లకు సంబంధం ఉన్న బ్యాంకులు ఈ ప్రమాణాల క్రింద అనేక నియంత్రణలను, మార్గదర్శకాలను ఆచరించాల్సి వుంటుంది. పర్యవేక్షకులు బ్యాంకులు అనుసరించాల్సిన నియంత్రణలు, అంతర్గత గణాంక పద్ధతుల్ని ప్రమాణీకరించడం, అమలుచేయాల్సిన బాధ్యతను కల్గివుంటాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రెండవ స్తంభం అందిస్తుంది.

3) మార్కెట్‌ క్రమశిక్షణ

బేసెల్‌-2 ప్రమాణాలలో మూడవ స్తంభంగా మార్కెట్‌ క్రమశిక్షణ ఉంది. బ్యాంకుల లావాదేవీలలో పర్యవేక్షకులు, నియంత్రణ సంస్థలు, రేటింగ్‌ ఏజెన్సీలు, డిపాజిట్‌దారులు, మదుపు దారులకు పూర్తి పారదర్శకత ను మార్కెట్‌ క్రమశిక్షణ కోరుతున్నది. బ్యాంకులు ఎదుర్కొంటున్న రిస్క్‌ను గూర్చిన పూర్తి సమాచారాన్ని పై తరగతులకు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి వుంది. ఇందుకోసంగా మూడవ స్తంభం ఆచరించాల్సిన ప్రమాణాలను రూపకల్పన చేసింది.

బేసెల్‌-2 ప్రభావాలు

1. బ్యాంకులు ఎదుర్కొనే రిస్క్‌ ఆధారంగా వివిధ రుణాలపై వడ్డీరేట్లు నిర్ణయింపబడతాయి. 2. బేసెల్‌-2 ప్రమాణాల రూపకల్పనకు అత్యధిక స్థాయిలో గణాంక వివరాలు కావల్సి వుంది. వివిధ స్థాయిలలో రిస్క్‌ను గణించటానికి అత్యధిక స్థాయి టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ల అవసరంవుంది. దీనికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందటానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమౌతాయి. 3. ఇంత భారీస్థాయి పెట్టుబడులు, సేకరించాల్సిన అదనపు మూలధనం పెద్ద బ్యాంకులకే సాధ్యమవటం వల్ల, చిన్న బ్యాంకులు ఈ రంగంలోకి అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రమాణాలు అమలు జాతీయ బ్యాంకులకు అనివార్యమైతే, బ్యాంకుల విలీనాలు, ఏకీకరణలకు బేసెల్‌-2 ప్రమాణాలు సారధులుగా పనిచేస్తాయి.

4. అత్యధిక మూలధన అవసరాల కోసం బ్యాంకులు విదేశీ పెట్టుబడులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. 5. ద్రవ్య సంక్షోభ సమయాలలో కార్పోరేట్ల రుణ రేటింగ్‌ పడిపోతుంది. దీని కారణంగా బేసెల్‌-2 ప్రమాణాల ప్రభావంతో అవసరమైన కాలంలో రుణాల లభ్యత పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే సందర్భంలో ఆర్థిక విజృంభణ (బూమ్‌) కాలం లో కార్పొరేట్ల రుణ రేటింగ్‌లు మెరుగై, బ్యాంకుల అధిక నిధుల లభ్యతతో రుణాల మంజూరు వేగవంతమవుతుంది. దీని కారణంగా రుణ సంక్షోభాలకు దారి తీసే ప్రమాదం ఉంది. బ్యాంకుల సుస్థిరతకు పకడ్భం దీగా రూపొం దించ బడ్డాయనుకున్న బేసెల్‌-2 ప్రమాణాలు, ఇటీవలి కాలంలో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని, బ్యాంకుల దివాళాలను ఆపలేకపోయాయి.

Sunday, September 26, 2010

బేసెల్‌ ప్రమాణాలు - బ్యాంకింగ్‌ వ్యవస్థ - పరిచయం


ప్రపంచీకరణ నేపథ్యంలో ద్రవ్య రంగ సుస్థిరత లక్ష్యంగా రూపొందించిన ''బేసెల్‌ ప్రమాణాలు'' (బేసెల్‌ నారమ్స్‌) బ్యాంకింగ్‌ వ్యవస్థలో పలు మౌళిక మార్పులకు కారణమవడమే కాకుండా, జాతీయ బ్యాంకుల రూపురేఖల్ని మారుస్తున్నాయి. సెప్టెంబర్‌ 12న బేసెల్‌ కమిటి ప్రతిపాదించిన బేసెల్‌-3 ప్రమాణాల అమలుకు, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ సంసిద్ధతను వ్యక్తం చేసింది. మౌళికంగా బ్యాంకింగ్‌ యాజమాన్యాల్ని ఉద్దేశించి రూపొందించిన ఈ ప్రమాణాలలో సాంకేతికత ఎక్కువగా ఉన్నా, ఇవి ప్రత్యక్షంగా దైనందిన బ్యాంకింగ్‌ నిర్వహణను నియంత్రిస్తూనే పరోక్షంగా డిపాజిట్‌దారులు, రుణగ్రహీతల ప్రయోజనాల్ని ప్రభావితం చేస్తున్నాయి. సాంకేతిక పదజాలంతో సంక్లిష్టంగా ఉండే బేసెల్‌ ప్రమాణాలు, వాటి పూర్వరంగాల్ని చర్చించుకుందాం.

బ్యాంకుల మనుగడ-మూలధన పరిమాణం

ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడం, రుణాలు మంజూరు చేయడం బ్యాంకుల సాధారణ కార్యకలాపాలుగా మనకు తెలుసు. రుణాలపై వచ్చే వడ్డీ నుండే డిపాజిట్‌దార్ల సొమ్ముపై బ్యాంకులు వడ్డీ చెల్లిస్తుంటాయి. రుణాలపై తిరిగి రావలసిన అసలు, వడ్డీ చెల్లింపులు అనిశ్చితికి గురైనప్పుడు, డిపాజిట్లపై వడ్డీలను కూడా చెల్లించలేని స్థితిలో బ్యాంకులుంటాయి. అలాంటప్పుడు డిపాజిట్‌దార్లకు చెల్లించాల్సిన అసలు ఫాయిదాల్ని బ్యాంకుల మూలధనం నుండి చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన రుణాలు మొండి బాకీలైతే, మూలధనం తగినంత లేకుంటే బ్యాంకులే మూతపడే పరిస్థితి ఏర్పడతాయి. అందువలన బ్యాంకుల రుణాల్లో ఇమిడివున్న ''రిస్క్‌''ను బట్టి, బ్యాంకుల మనుగడకు అవసరమైన మూలధన పరిమాణం ఆధారపడి ఉంది. ఈ ప్రాథమిక సూత్రమే బేసెల్‌ ప్రమాణాల రూపకల్పనకు పునాదిగా నిల్చింది.

బేసెల్‌ కమిటి పూర్వరంగం

రెండవ ప్రపంచ యుద్ధానంతరం జాతీయ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య సంస్కృతి మమేకమయ్యాయి. మొదటి చమురు సంక్షోభం తదనంతర కాలంలో తెరమీదకు వచ్చిన ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ, జాతీయ ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రమాణంగా తీసుకోవాలా లేక వేగంగా ముందుకొస్తున్న ప్రపంచీకరణ ధోరణులకు ప్రాతినిథ్యం వహించాలా అన్న సవాళ్ళను ఎదుర్కొంది. ఈ సవాళ్ళకు సమాధానంగా ఆవిర్భవించిన బేసెల్‌ ప్రమాణాల నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థకు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు మధ్య సంబంధాలు బలహీన పడి, అంతిమంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రపంచీకరణ ధోరణులకు లొంగిపోయింది.

బేసెల్‌ కమిటి ఆవిర్భావం

1970లలో తక్కువ మూలధనంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక బ్యాంకులు నిర్వహింపబడేవి. ప్రపంచీకరణ ప్రక్రియ ఊపందుకున్న మేరకు వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన అస్థిరతకు గురౌతుండేవి. వీటి ప్రభావంతో అంతర్జాతీయ, జాతీయ బ్యాంకుల వైఫల్యాల పరిమాణం పెరుగుతుండేది. దీనితో పాటు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బ్యాంకుల విస్తరణ పెరిగింది. వివిధ దేశాల్లో బ్యాంకుల మూలధన పరిమాణంలో అనేక వ్యత్యాసాలుండేవి. 1974లో జర్మనీ బ్యాంకు ''హెడ్‌స్టట్‌'' వైఫల్యంతో జి-10 దేశాలైన అమెరికా, బ్రిటన్‌, బెల్జియం, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, నెదర్లాండ్స్‌, స్విజర్లాండ్‌ లు ''తక్కువ మూలధన సమీకరణ కల్గిన బ్యాంకుల నమూనా పై, సక్రమమైన బ్యాంకింగ్‌ నియంత్రణల కొరత''పై లోతైన అధ్యయనానికి సిద్ధమైయ్యాయి. ఈ దేశాలన్ని 1974లో ''అంతర్జాతీయ పరిష్కారాల బ్యాంకు'' (బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ - బి.ఐ.యస్‌) పర్యవేక్షణలో స్విజర్లాండ్‌ నందలి బేసెల్‌ నగరంలో ''బ్యాంకింగ్‌ పర్యవేక్షణ కమిటి''గా ఏర్పడ్డాయి. ఈ కమిటియే తదనంతర కాలంలో ''బేసెల్‌ కమిటి'' గా ప్రాచుర్యం పొందింది. అంతర్జాతీయ పరిష్కారాల బ్యాంకు 1930లో బేసెల్‌ నగరంలో ఏర్పడ్డ అతి పురాతనమైన ఫైనాన్షియల్‌ సంస్థ. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులను సమన్వయ పరచడంలోనూ, వాటి సహకారాల్ని కూడకట్టడంలోనూ ఈ సంస్థ విశేషంగా కృషి చేస్తున్నది.

బేసెల్‌ -1 ప్రమాణాలు

జులై, 1988లో అంతర్జాతీయ బ్యాంకులకు కావల్సిన కనీస స్థాయి మూలధన అవసరాలపై బేసెల్‌ కమిటి కొన్ని ప్రమాణాలను రూపొందించింది. ఈ ప్రమాణాల్ని సభ్య దేశాలు అనివార్యంగా అమలు చేయాల్సిన అగత్యం లేకపోయినా, వారి వారి ఆర్థిక వ్యవస్థలకు ఈ ప్రమాణాలను అన్వయించుకొని 100కు పైగా దేశాల కేంద్ర బ్యాంకులు ఈ ప్రమాణాల అమలుకు సిద్ధమయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ సుస్థిరతపై మొట్టమొదటిగా రూపొందించిన ఈ ప్రమాణాలను బేసెల్‌-1 ప్రమాణాలు లేదా బేసెల్‌ నారమ్స్‌గా ప్రసిద్ధికెక్కాయి. ఈ ప్రమాణాల ప్రకారం బ్యాంకు మంజూరు చేసిన ''రిస్క్‌''తో కూడిన రుణాల మొత్తంలో 8%తో సమానమైన మూలధనాన్ని ఆ బ్యాంకు అదనంగా కలిగి ఉండాలి. దీన్నే సముచిత మూలధన నిష్పత్తి (క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో) లేదా మూలధన, రిస్క్‌తో కూడిన ఆస్థుల నిష్పత్తి (కేపిటల్‌ రిస్క్‌ రిలేటెడ్‌ ఎసెట్స్‌ రేషియో) అని అంటారు. దీన్ని లెక్కించడం కోసంగా వివిధ రుణాలకు, వాటిలో ఇమిడివున్న రిస్క్‌ను బట్టి వెయిటేజ్‌లను నిర్ణయించారు. గవర్నమెంట్‌ బాండ్‌లు 0% రిస్క్‌ వెయిటేజ్‌ గాను, ఇతర బ్యాంకులచే గ్యారంటీ చేయబడ్డ రుణాలకు 20%, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలచే గ్యారంటీ చేయబడ్డ రుణాలకు 40%, కార్పొరేట్‌ రుణాలతోపాటు ఇతర అన్ని రకాల రుణాలు (సిబ్బంది రుణాల మినహా) 100%గా రిస్క్‌ వెయిటేజ్‌ను నిర్ణయించబడ్డాయి. రుణాల నాణ్యతను బట్టి రుణ మొత్తంలో పైన పేర్కొన్న వెయిటేజ్‌ శాతం మేరకు ''సముచిత మూలధన నిష్పత్తి''ని బ్యాంకులు అమలు చేయాల్సి వుంటుంది.

బేసెల్‌ కమిటి వివిధ రకాల మూలధనాలకు ప్రామాణిక నిర్వచనాల్ని అందించింది. మూలధనాన్ని మొదటి అంచె (టైర్‌-1), రెండవ అంచె (టైర్‌-2) గా వర్గీకరించింది. ఈక్విటీ (మూల షేర్‌ ధనం) మొదటి అంచె మూలధనంగాను, అప్పుల ద్వారా సేకరించిన సహాయమూలధనాన్ని రెండవ అంచె మూలధనంగాను బేసెల్‌ కమిటి పేర్కొంది. ఈ ప్రమాణాల అమలు సరళంగా ఉన్నందున వీటిని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు స్వచ్ఛందంగా శీఘ్రగతిని అమలు చేసాయి. నయాఉదారవాద విధానాలు అమలవుతున్న దేశాలలో ద్రవ్య రంగంలో స్పెక్యులేషన్‌ ధోరణలు మితిమీరడంతో ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న ఒడిదుడుకుల కారణంగా ఈ ప్రమాణాలను వివిధ దేశాలు అంగీకరించాల్సి వచ్చింది.

బేసెల్‌-1 ప్రమాణాల ప్రభావాలు

బ్యాంకులలో ''తగినంత మూలధన సమీకరణ''లో బేసెల్‌-1 ప్రమాణాలు విజయవంతమైనాయి. బేసెల్‌-1 ప్రమాణాలు ప్రధానంగా రుణాలలో ఇమిడి ఉన్న రిస్క్‌ పరిమాణంపై కేంద్రీకరించాయి. రుణాలలోని రిస్క్‌ విశ్లేషణ వర్గీకరణతో, అంతవరకు సామాజిక బాధ్యతగా అందించబడుతున్న రుణాలు అధిక రిస్క్‌ కలిగినవిగా భావించబడ్డాయి. దీనితో వాటి కేటాయింపులు తగ్గించడం మొదలైంది. ఫలితంగా వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రాధాన్యత రుణాల కేటాయింపు తగ్గిపోయింది. వసూలు కాని రుణాలను నిరర్ధక ఆస్థులు (నాన్‌ పర్‌ఫార్మింగ్‌ ఎస్సెట్స్‌)గా పరిగణించారు. బ్యాంకుల మొత్తం రుణాలలో నిరర్ధక ఆస్థుల నిష్పత్తిపై పరిమితి విధింపబడింది. ఈ పరిమితిని అమలు చేయటానికి అనేక బ్యాంకులు మొండి బకాయిలను తమ లాభాల్లో సర్దుబాటు చేసుకోవడంతో అవి నష్టాల బారిన పడ్డాయి. బేసెల్‌-1 తదనంతర కాలంలో ద్రవ్య రంగంలో నెలకొన్న మౌళిక మార్పుల కారణంగా ఉత్పన్నమైన సమస్యల్ని పరిష్కరించడంలో బేసెల్‌-1 ప్రమాణాలు వైఫల్యం చెందాయి. అందువల్ల వాటిని సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బేసెల్‌-2 ప్రమాణాలకు రూపకల్పన జరిగింది

Sunday, September 19, 2010

నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశం ఎవరి కోసం ?


నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశంపై రిజర్వుబ్యాంకు విడుదల చేసిన చర్చా పత్రంపై దేశ వ్యాపితంగా రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌.బి.ఐ ప్రతిపాదించిన అంశాలపై కార్పొరేట్‌ వర్గాలకు కొన్ని పరిమితులున్నా, అవి స్థూలంగా నూతన ప్రైయివేటు బ్యాంకుల ప్రవేశాన్ని ఆహ్వానిస్తున్నాయి. . ''రిజర్వుబ్యాంకు నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశంపై పెద్ద ఆసక్తిని కనపర్చటం లేదని, సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి అడుగులు వేస్తుందని'' కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ''వివాదాస్పదమైన వివిధ అంశాలపై వివిధ కోణాలలో చర్చను పురిగొల్పుతూ, దేశంలోని వివిధ వర్గాల ఆంక్షల మేరకే నూతన మార్గదర్శకాలను ప్రజాతంత్ర పద్ధతులలో రిజర్వుబ్యాంకు రూపకల్పన చేస్తుందనే భావన కలిగించే రీతిలో చర్చా పత్రం ఉందని'' మరికొందరు అభినందిస్తున్నారు.

రిజర్వుబ్యాంకు అంతరంగమేమిటి?

విస్తరణలో కీలకమైనవి నూతన బ్యాంకులా లేదా బ్యాంకు శాఖలా అన్న అంశం కూడా చర్చలో లేదు. అందువలన తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అణగారిన అట్టడుగు వర్గాల ప్రజలు, వెనుకబడిన ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవల్ని చేరవేయాలనే లక్ష్య సాధనలో నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశానికి మార్గదర్శక సూత్రాలు ఎలా ఉండాలి? అనే అంశంపై రిజర్వుబ్యాంకు చర్చా పత్రం విడుదలయ్యింది కాని, ద్రవ్య పునాది విస్తరణలో భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ అనుసరించాల్సిన మార్గాల గురించి కాదు. అందులోనూ నూతన ప్రయివేటు బ్యాంకుల పాత్ర ఎలా ఉండాలి అనే అంశం కంటే ప్రయివేటు బ్యాంకుల సాధారణ అంగ నిర్మాణంపై చర్చ మొత్తం కేంద్రీకరించబడింది. చర్చా పత్రం ఉద్దేశ్యం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించిన నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశం తప్ప ద్రవ్య పునాది విస్తరణ కాదన్న అంశం సుస్పష్టమైంది. ఆర్‌బిఐ, నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశంపై అన్యమనస్కంగా వ్యవహరిస్తూ ఆచితూచి అడుగులు వేస్తుందన్న ప్రచారంలో నిజం లేదు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రయివేటు, విదేశీ బ్యాంకుల పట్ల పెరిగిన వ్యతిరేక భావనల నేపథ్యంలో హడావుడి, అత్యుత్సాహం ప్రతికూల స్పందనలకు దారితీసే ప్రమాదం ఉన్నందున నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశాన్ని సుగమం చేయటానికి రిజర్వు బ్యాంకు జాగురూకతతో వ్యవహరిస్తున్నట్లుంది. ద్రవ్య పునాది విస్తరణే రిజర్వుబ్యాంకు ప్రధాన ధ్యేయమైతే, చర్చను నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశానికి పరిమితం చేయాల్సిన అవసరం లేదు.

పెద్ద బ్యాంకుల ప్రోత్సాహమే రిజర్వుబ్యాంకు ధ్యేయం

రఘురాం రంజన్‌ కమిటీ, ''చిన్న బ్యాంకులు సృజనాత్మకతను పెంచి, స్థానిక అవసరాలకు తగ్గట్లు నూతన ఉత్పత్తులను సృష్టించగలవని, అందువల్ల చిన్న బ్యాంకులను ప్రోత్సహించాలని'' సిఫార్సు చేసింది. ఏనుగుల్లాంటి బ్యాంకులు పీనుగులైన అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభ అనుభవాలు మన కళ్ళముందున్నాయి. బ్యాంకుల పరిరక్షణకు పటిష్టమైన ఆర్థిక, ద్రవ్య విధానాలు అవసరం కాని, బ్యాంకుల పరిమాణం కాదన్నది సుస్పష్టమైంది. అందువల్లే స్థూల దేశీయోత్పత్తిలో సాధారణ బ్యాంకు పరిమాణం నాలుగు శాతానికి, పెట్టుబడి బ్యాంకు పరిమాణం రెండు శాతానికి మించి ఉండటం శ్రేయస్కరం కాదన్న అంతర్జాతీయ పాఠాల్ని రిజర్వుబ్యాంకు పట్టించుకోవటం లేదు. ఆసియా ద్రవ్య సంక్షోభం ధాటికి తట్టుకొని నిలబడ్డ ఇండోనేషియాలోని బ్యాంకు నిప్స్‌(ఎన్‌ఐఎస్‌పి) లాంటి ఉదాహరణలు ఎన్ని ఉన్నా, ద్రవ్య పునాది విస్తరణ అవసరం లేని దేశాలలోని బ్యాంకుల అనుభవాలు, నిర్మాణాన్ని రిజర్వుబ్యాంకు ప్రస్తావిస్తున్నది. అందుకోసమే నూతన ప్రయివేటు బ్యాంకుల మూలధనం రూ|| 500 కోట్లకు మించి ఉండాలనే అభిప్రాయాన్ని ప్రోత్సహించే దిశలో చర్చా పత్రం ఉంది.

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు పెద్ద పీట

సమర్థవంతంగా నిర్వహింపబడుతూ, ఆర్థిక వనరులు కలిగిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు గ్రామీణ ప్రాంతాలలో సూక్ష్మ రుణ విస్తరణలో కీలక పాత్ర వహిస్తున్నాయని, వాటి నిరర్ధకాస్తుల శాతం పరిమితంగా ఉంటుందని చర్చా పత్రం ప్రస్తావించింది. దీనితో, వాటి నిర్వహణ వ్యయం అత్యధికమైనా, వాటిని ప్రజా డిపాజిట్లకు అనుమతిస్తే, తక్కువ నిర్వహణ వ్యయంతో ఆ సంస్థలు గ్రామీణ ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహించగలుగుతాయనే చర్చను అందిపుచ్చుకొని కార్పోరేట్‌ వర్గాలు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్ని వాణిజ్య బ్యాంకులుగా మార్చటం కాని లేదా వాటికి బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశం కల్పించటం కాని చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అత్యధిక వ్యయంతో గ్రామీణ పేదల మూలుగులు పీలుస్తున్న సూక్ష్మ రుణ సంస్థల వలయంలో చిక్కుకున్న గ్రామీణ పేద మహిళలు రుణ చెల్లింపుకోసం వ్యభిచారానికి దిగజారుతూ, కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న దీనగాథలు చర్చా పత్రంలో చోటు చేసుకోలేదు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు స్వీకరించే గ్రామీణ డిపాజిట్ల భద్రతకు రిజర్వుబ్యాంకు నియంత్రణ తప్ప మరో గ్యారెంటీ ఏమిటన్న అంశాన్ని చర్చా పత్రం స్పష్టపర్చలేదు.

బ్యాంకులు, పారిశ్రామిక సంస్థల మధ్య కుమ్మక్కు

1969 బ్యాంకుల జాతీయకరణకు ముందు పారిశ్రామిక సంస్థల ఆధ్వర్యంలోని ప్రయివేటు బ్యాంకులు ప్రజల డిపాజిట్లను వారి వారి అవసరాల కోసం దిగమింగి, సామాన్య ప్రజానీకానికి, వ్యవసాయానికి రుణాలను అందించక, డిపాజిట్‌దార్ల సొమ్ముకు భద్రత లేని తరుణంలో 1969 ఫిబ్రవరిలో బ్యాంకులపై సామాజిక నియంత్రణను అమలు చేసే చట్టాన్ని చేయాల్సి వచ్చింది. ఆ తరువాత కొద్ది నెలల్లో 14 ప్రయివేటు బ్యాంకుల్ని జాతీయం చేయటం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో పారిశ్రామిక సంస్థలకు బ్యాంకు లైసెన్సులను మంజూరు చేయటం అనర్థదాయకమన్నది జగమెరిగిన సత్యం. దీనిపై చర్చ చేయాల్సిన పని లేదు. కాని ఈ చర్చా పత్రంపై చర్చ సందర్భంగా కొన్ని వాదనలు ముందుకొస్తున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, టెలికం, విద్యుత్‌, రక్షణ మరియు మౌలిక రంగాలలో ప్రయివేటు పారిశ్రామిక సంస్థలను అనుమతిస్తున్న కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో అనుమతించటానికి అభ్యంతరాలెందుకని ఎస్‌.ఎస్‌.తారాపూర్‌ లాంటి ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.రక్తం మరిగిన పులి, పిల్లిలా పాలుమాత్రమే తాగుతుందనేది వారి వాదనల సారాంశం. కొన్ని నియంత్రణలు, పరిమితులతోనైనా పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల లైసెన్సులు ఇవ్వాలని మీడియా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సి.ఎన్‌.బి.సి టివి18కి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అధినేత దీపక్‌ పరేఖ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశాన్ని స్వాగతిస్తూనే ''ప్రయివేటు నిర్వాహకులు నియంత్రణ సంస్థల కంటే తెలివిగా ఉన్నారని, ఒక సంస్థలోని అవకతవకలు వెలుగు చూడటానికి దీర్ఘకాలం పడుతుందని, వాటిని తెలుసుకొని నియంత్రణ సంస్థలు అదుపు చేసే లోపు జరగాల్సింది జరిగిపోతుంద''న్నారు. నియంత్రణ సంస్థల పరిమితుల్ని ఆయన ఈ సందర్భంగా ఎత్తిచూపుతున్నారు. బ్యాంకు లైసెన్సు మంజూరుకు ముందు నష్టాల్లో ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థలకు అప్పచెప్పాలన్నది చర్చా పత్రంలోని మరో అంశం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో సగ భాగం కేంద్ర ప్రభుత్వం, పావు వంతు రాష్ట్ర ప్రభుత్వం, మిగిలినది దత్తత తీసుకున్న బ్యాంకు కలిగి ఉంటుంది. నష్టాలు వస్తున్న గ్రామీణ బ్యాంకుల్లో నష్టాలకు భౌగోళిక, ప్రభుత్వపరమైన విధానాల పాత్ర ఎక్కువ. ఈ వ్యవస్థలో పారిశ్రామిక సంస్థలు చేయగలిగేదేమి ఉండదు. వాటి మనుగడకు పరిష్కారాలు వేరు. పారిశ్రామిక సంస్థలను మళ్ళీ బ్యాంకింగ్‌ రంగంలో చొప్పించటంపై చర్చను రేపటమే చర్చా పత్రం ముఖ్యఉద్దేశ్యం.

విదేశీ పెట్టుబడుల కుదింపు

నూతన ప్రయివేటు బ్యాంకులలో 10 సం||ల పాటు విదేశీ పెట్టుబడుల్ని 50 శాతానికి కుదించటం మార్కెట్‌ వర్గాలకు విస్మయం కలిగిస్తుంది. బ్యాంకింగ్‌ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టటం ఫలితంగా నాణ్యమైన సత్వర సేవలు లభించటాన్ని విశేషంగా ప్రస్తావిస్తున్నారు. విదేశీ ప్రయివేటు బ్యాంకుల్లో ప్రవేశం ఉన్నత మధ్యతరగతి, సంపన్నులకే అన్న అంశం అందరూ అంగీకరించేదే. ఒక పక్క 74 శాతం మేరకు విదేశీ పెట్టుబడుల్ని బ్యాంకుల్లో అంగీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో, 50 శాతం పరిమితి సాధారణంగా అర్థం లేనిది. కాకుంటే 50 శాతానికి మించిన విదేశీ పెట్టుబడులున్న బ్యాంకులకు విదేశీ బ్యాంకులనే ముద్ర ఉంటుంది. స్వదేశీ బ్యాంకుగా చెలామణి కావటానికి 50 శాతం పరిమితి ఉపయోగపడుతుంది. చర్చా పత్రం ప్రకారం ఈ పరిమితి శాశ్వతం కాదు. ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో నెలకొన్న విదేశీ బ్యాంకులపై ఉండే వ్యతిరేక ప్రభావాల నుండి దృష్టి మళ్ళించటం కోసమే ఈ చర్యగా భావించాల్సి ఉంటుంది. పాలకవర్గాలు బ్యాంకింగ్‌ రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై దృష్టి మళ్ళించకుండా, విదేశీ బ్యాంకులపై ఆధారపడటం సముచితం కాదు.

జాతీయీకరణ, సరళీకరణ కాలాల్లో గ్రామీణ సేవల లభ్యతలో తేడాలు

భారతదేశంలో 1969లో మొదలైన వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ ప్రస్థానం 1991 వరకు కొనసాగింది. గ్రామీణ ప్రాంతాలకు నిజమైన బ్యాంకింగ్‌ సేవల విస్తరణ ఈ కాలంలోనే జరిగింది. ద్రవ్య పునాది విస్తరణకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండేటట్లయితే వారు తప్పకుండా అనుసరించాల్సిన అనుభవాలివి. చర్చా పత్రం ఈ అనుభవాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 1991 నుండి సరళీకరణ దుష్ప్రభావాలు బ్యాంకింగ్‌ రంగంపై తీవ్రంగా పడ్డాయి. 1969 నుండి 1991 మధ్య కాలంలో ప్రయివేటు బ్యాంకుల ఊసే లేకపోగా, 1993 నుండి నూతన ప్రయివేటు బ్యాంకులు ప్రవేశించాయి. గ్రామీణ డిపాజిట్లు 1972లో 6.5 శాతం వృద్ధి కాగా, 1989 నాటికి ఈ వృద్ధి 15 శాతానికి పెరిగింది. అదే కాలంలో మెట్రోపాలిటన్‌ నగరాలలో డిపాజిట్లు 46.2 శాతం నుండి 38.6 శాతానికి పడిపోయాయి. గ్రామీణ రుణం ఇదే కాలంలో 4.6 శాతం నుండి 16.3 శాతానికి పెరగగా, మెట్రోపాలిటన్‌ నగరాలలో రుణం 60.2 శాతం నుండి 43.5 శాతానికి తగ్గింది. 1969లో 8,127గా ఉన్న బ్యాంక్‌ శాఖలు 1990 నాటికి 59,752 అయ్యాయి. 1969లో మొత్తం బ్యాంకు శాఖల్లో గ్రామీణ శాఖలు 17.6 శాతం ఉండగా, 1990 నాటికి 58.2 శాతానికి వృద్ధి చెంది అత్యద్భుత ప్రగతిని సాధించాయి. ఈ ఫలితాలు జాతీయీకరణ పటిష్టంగా ఉన్న కాలానివి. 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక మార్చి 2009నాటికి మొత్తం బ్యాంకు డిపాజిట్లలో గ్రామీణ డిపాజిట్లు 9.3 శాతానికి పడిపోయాయి. ఇదే కాలంలో మెట్రోపాలిటన్‌ నగరాలలో డిపాజిట్ల వృద్ధి 56.2 శాతానికి పెరిగింది.1998 నాటికి గ్రామీణ రుణం మొత్తం రుణంలో 10.7 శాతానికి పడిపోయింది. నేటికీ 50,376 బ్యాంకు శాఖల్లో 31,684 శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

జాతీయ బ్యాంకు శాఖల మొత్తంలో 65.57 శాతం గ్రామీణ శాఖలుగా ఉండగా ప్రయివేటు విదేశీ బ్యాంకులలో ఇది కేవలం 29.71 శాతంగా ఉంది. మొత్తం గ్రామీణ బ్యాంకు శాఖలలో జాతీయబ్యాంకు శాఖలు 30,567గా ఉండి, 96.47 శాతంగా ఉంది. 1977లో ప్రతి 4 గ్రామీణ బ్యాంకు శాఖలకు ఒక మెట్రో, ఒక పట్టణ శాఖకు రిజర్వుబ్యాంకు అనుమతినిచ్చేది. దీనర్థం ప్రతి బ్యాంకు తాను ప్రారంభించే శాఖల్లో 66.6 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించాల్సి ఉంది. ప్రతి ప్రయివేటు బ్యాంకు తమ శాఖల్లో కనీసం 25 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించాలని ప్రభుత్వం షరతు పెట్టినా దాన్ని అనేక ప్రయివేటు బ్యాంకులు అమలు చేయటం లేదు. అలాగే ప్రాధాన్యతా రంగాల్లో రుణాలు అందించటంలోనూ ప్రయివేటు బ్యాంకులు నిర్లక్ష్యం చేస్తున్నాయి. వాటిపై రిజర్వు బ్యాంకు నియంత్రణ అంతంతమాత్రంగానే ఉంది. పైన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే ద్రవ్య పునాది విస్తరణకు నిజమైన పరి ష్కారం బ్యాంకుల జాతీయీకరణలోనే ఉందన్నది స్పష్టమౌతుంది.

Sunday, September 12, 2010

నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశం


ఆర్‌బిఐ చర్చా పత్రం

భారతదేశ బ్యాంకింగ్‌ రంగంలో నూతన ప్రైవేట్‌ బ్యాంకుల ప్రవేశానికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపై రిజర్వ్‌బ్యాంక్‌ ఆగస్టు 11న చర్చా పత్రాన్ని విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30 లోగా అభిప్రాయాలు తెలియచేయాలని ప్రజానీకాన్ని కోరింది. 2010-11 సం|| బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రైవేట్‌ రంగంలో నూతన బ్యాంకుల ప్రవేశంపై చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ఈ చర్చా పత్రం విడుదలయ్యింది.

భారతదేశంలో నూతన బ్యాంకులు ఎందుకు?

11వ పంచవర్ష ప్రణాళికా లక్ష్యమైన సమ్మిళిత వృద్ధి (ఇన్‌క్లూసివ్‌ గ్రోత్‌)ని సాధించేందుకు ద్రవ్య పునాది విస్తరణను (ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అవసరమైన బ్యాంకింగ్‌ పునాది విస్తరణను సుగమం చేయటానికి నూతన ప్రయివేట్‌ బ్యాంకుల అవశ్యకతను చర్చా పత్రం ప్రస్తావించింది. మార్చి 31, 2009 నాటికి భారతదేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఏడు నూతన ప్రయివేట్‌ బ్యాంకులు, 15 పాత ప్రయివేట్‌ బ్యాంకులు, 31 విదేశీ బ్యాంకులు, 86 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 4 స్థానిక ఏరియా బ్యాంకులు, 1721 అర్బన్‌ సహకార బ్యాంకులు, 31 రాష్ట్ర సహకార బ్యాంకులు, 371 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి.

జూన్‌ 2005 నాటికి బ్యాంకు సేవలు పొందుతున్న సగటు జనాభా పట్టణాలలో 12,300 ఉండగా, జూన్‌ 2010 నాటికి 9400కు తగ్గినట్లు, ఇదే కాలంలో గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాలలో సగటు జనాభా 17200 నుండి 15900కు, దేశ వ్యాప్త సగటు జనాభా 15500 నుండి 13400కు తగ్గినట్లు చర్చా పత్రం వెల్లడించింది. దేశజనాభాలో బ్యాంకింగ్‌ సేవలు 37శాతానికి మించి అందట్లేదని, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు, వెనుకబడిన ప్రాంతాలకు సేవల లభించట్లేదని పత్రం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నూతన ప్రైవేట్‌ బ్యాంకులు అవసరం అంటూ చర్చాపత్రంలో ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడిదారీ విధానం నిత్యం వల్లించే స్వేచ్ఛా పోటీ బ్యాంకుల మధ్య ఏర్పడుతుందని ఈ పత్రం అంచనా వేసింది. దీనివల్ల సేవల వ్యయం తగ్గి, నాణ్యమైన సేవలు ప్రజలకు అందుతాయని, అట్టడుగు వర్గాల ప్రజలు, వెనుకబడిన ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవలు విస్తరిస్తాయని, బ్యాంకింగ్‌ పునాది కూడా పెరుగుతుందని చర్చాపత్రం విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

నూతన ప్రైవేట్‌ బ్యాంకుల ప్రవేశంపై రిజర్వ్‌ బ్యాంకు గత అనుభవం

1969కంటే ముందు మన దేశంలో ప్రయివేటు బ్యాంకులుండేవి. ఇవి కేవలం నగరాలకు పరిమితమై ఉండేవి. సంపన్నులు, పారిశ్రామిక అధిపతుల ప్రయోజనాలపైనే కేంద్రీకరించేవి. ప్రజాధనం దుర్వినియోగమయ్యేది. డిపాజిట్‌దారుల ప్రయోజనాలను బేఖాతరు చేసి కాలరాసేవి. ఈ నేపథ్యంలోనే 1969లో బ్యాంకుల జాతీయీకరణకు నాటి ప్రభుత్వం పూనుకుంది. బ్యాంకుల జాతీయీకరణ తరువాత కార్యకలాపాలు, సేవలు దేశమంతా విస్తరించాయి. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్‌ శాఖలు ఏర్పడ్డాయి. గ్రామీణ, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బ్యాంకింగ్‌రంగం గణనీయమైన కృషి చేసింది. అందుకే దాదాపు 23 ఏళ్లు అంటే 1992 దాకా నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రస్తావనే రాలేదు.

సోవియట్‌ రష్యా కూలిపోవడం, ప్రపంచ బలాబలాల్లో మార్పులు రావడం, మన దేశీయ విదేశాంగ విధానంలో మార్పులు చోటుచేసుకోవడం వీటన్నింటి ఫలితంగా మనదేశంలో మళ్లీ ప్రయివేటు బ్యాంకుల ప్రస్తావన వచ్చింది. 1993లో నూతన ప్రయివేటు బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శకాలు వచ్చాయి. 2001లో కొన్నింటిని సవరించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా 12 కొత్త ప్రయివేటు బ్యాంకులకు ఆర్‌బిఐ అనుమతినిచ్చింది. వీటిలో అయిదు బ్యాంకులు చేతులు ఎత్తేయడంతో ఇతర బ్యాంకులతో విలీనం చేయబడ్డాయి. మరో 5 బ్యాంకులు అనేక అరిష్టాలను ఎదుర్కొని రకరకాల పద్ధతులలో నిలబడ్డాయి.

పై అనుభవాల నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో కాకుండా, తగినంత ప్రారంభ మూలధనంతోనే కొత్తప్రయివేటు బ్యాంకులకు ప్రవేశం కల్పించాలని, అప్పుడే ఈ రంగంలో సంభవించే ఒడిదుడుకుల్ని తట్టుకోగలుగుతాయని చర్చాపత్రం అభిప్రాయపడింది. సంస్కరణలలో భాగంగా ప్రారంభింపబడ్డ స్థానిక ఏరియా బ్యాంకుల పనితీరు సక్రమంగా లేదని చర్చా పత్రం పేర్కొంది. ఆర్థిక రంగంలో తగినంత అనుభవం, చాలినన్ని వనరులు, విశ్వాసనీయత, యాజమాన్య సామర్థ్యంగల సంస్థలే బ్యాంకులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతాయని చర్చాపత్రం వెల్లడించింది.

ప్రైవేట్‌ బ్యాంకుల ప్రవేశానికి ప్రస్తుతం అమలులో వున్న మార్గదర్శకాలు

1. అతి పెద్ద పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య గ్రూపులు, నూతన బ్యాంకుల్ని ప్రమోట్‌ చేయటానికి అర్హులు కావు. అయినప్పటికి ఈ సంస్థలతో సంబంధాలున్న కంపెనీలు, బ్యాంకు నియంత్రణ ప్రయోజనం లేకుండా, 10% మించని బ్యాంకు వాటాలను కలిగి ఉండొచ్చు. 2. మంచి వ్యాపారానుభవం, వనరులు కలిగిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ 'ఎఎఎ' లేదా దానికి సమానమైన పరపతి రేటింగ్‌, 12% లోపు క్యాపిటల్‌ ఎడిక్వసీ, 5% లోపు నిరర్ధక ఆస్తుల నిష్పత్తులు, కనీస మూలధన వనరులు కలిగి వున్నప్పుడు వాణిజ్య బ్యాంకుగా ప్రమోట్‌ చేయటానికి, లేదా మార్చటానికి వీలుంటుంది. ఈ సంస్థకు ఏ పెద్ద పరిశ్రమతోగాని, వాణిజ్య గ్రూపులతో గాని సంబంధం ఉండకూడదు. 3.నూతన బ్యాంకులు కనీసం 200 కోట్ల మూల ధనం కలిగి వుండాలి. మూడేళ్ళ కాలంలో దీన్ని రూ. 300 కోట్లకు పెంచాలి. 4. బ్యాంకు మూల ధనం మొత్తంలో 40% ప్రమోటర్ల మూలధనం ఉండాలి.

ఇది 5సం||రాల పాటు లాకిన్‌ చేయబడుతుంది. అంటే ఈ వాటాలను ఈ కాలంలో బదిలీ చేసే అవకాశం ఉండదు. ఒక వేళ ప్రమోటర్ల మూలధనం మొత్తం బ్యాంకు మూలధనంలో 40% మించి ఉంటే, అలా మించి ఉన్న మూలధనాన్ని బ్యాంకు కార్యకలాపాలు మొదలైనప్పటి నుండి సంవత్సరం తరువాత ఇతరులకు తప్పనిసరిగా బదిలీ చేయాలి. 5. ప్రవాస భారతీయులు నూతన బ్యాంకుల ప్రాథమిక ఈక్విటీలో 40% వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కో ప్రమోటర్‌ గాను సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చే సంస్థగాను ఉన్న విదేశీ బ్యాంకింగ్‌ కంపెనీ కానీ, ఆర్థిక సంస్థగానీ ఈ 40%లో 20%నికి మించి వాటాలను కలిగి ఉండకూడదు. 6. బ్యాంకుల షేర్లు స్టాక్‌ ఎక్సేంజీల్లో లిస్ట్‌ అవ్వాలి. 7. బ్యాంకు కార్యకలాపాలు మొదలైనప్పటి నుండి బ్యాంకుల క్యాపిటల్‌ ఎడిక్వసీ నిష్పత్తి 10% క్రమబద్ధంగా ఉండాలి. 8. బ్యాంకులు ఇచ్చే రుణాలలో 40% ప్రాధాన్యతా రంగాలకు తప్పని సరిగా కేటాయించాలి. 9. బ్యాంకులు తెరిచే శాఖలలో 25% తప్పని సరిగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాలలో ఉండాలి. 10. ప్రమోటర్ల వ్యాపార వాణిజ్యాలకు, బ్యాంకులు దూరంగా ఉండాలి. ప్రమోటర్లకు, వాటి అనుబంధ కంపెనీలకు ఈక్విటీలో 10%నికి మించి రుణాలు ఇవ్వకూడదు. 11. ప్రయివేట్‌ బ్యాంకులు 74% వరకు విదేశీ పెట్టుబడులు (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సంస్థా గత పెట్టుబడులు, ప్రవాస భారతీయ పెట్టుబడులు కలుపుకొని) కలిగి వుండవచ్చు. కానీ ఈ విదేశీ పెట్టుబడులు 50%నికి మించితే ఆ బ్యాంకు విదేశీ బ్యాంకుగా పరిగణించబడుతుంది.

చర్చాపత్రం - ప్రధానాంశాలు

పైన పేర్కొన్న మార్గదర్శకాలకు సవరణలు చేస్తూ రిజర్వ్‌ బ్యాంకు ఈ కింది అంశాలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. 1.నూతన బ్యాంకులకు కావలసిన కనీస మూలధనం మరియు ప్రమోటర్ల వాటా శాతం ఎంత వుండాలి? 2.ప్రమోటర్లు, ఇతర వాటా దారుల వాటాలపై విధించాల్సిన కనీస, గరిష్ట పరిమితులేమిటి? 3.నూతన బ్యాంకులలో విదేశీ పెట్టుబడుల అనుమతి ఎంత శాతం ఉండాలి? 4.నూతన బ్యాంకులకు ప్రమోటర్లుగా అతి పెద్ద పారిశ్రామిక, వాణిజ్య సంస్థలను అనుమతించవచ్చా? 5.బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను బ్యాంకులుగా మార్చడం లేదా ప్రమోటర్లుగా అంగీకరించడానికి అనుసరించాల్సిన పద్ధతులు. 6. వ్యాపార నమూనా. పై అంశాలపై వివిధ ప్రయోజనాలు, పర్యవసానాల్ని చర్చాపత్రం విస్తృతంగా చర్చించి, అవగాహన కోసం విభిన్న కోణాల్లో సమస్యలను వివరించింది. వివిధ దేశాలలో నూతన బ్యాంకుల ప్రవేశానికి అనుసరిస్తున్న మార్గదర్శకాలను చర్చాపత్రంతో జతపరిచింది.

ఆర్ బి ఐ ఈ క్రింది పేర్కొన్న అంశాలను స్పష్టపరిచింది.

1. నూతన బ్యాంకుల కనీస మూల ధనం రూ. 300 కోట్లకు మించి వుండాలి. అది 300 కోట్లు లేదా 500 కోట్లు లేదా 1000 కోట్ల అన్న అంశం చర్చకు పెట్టబడింది. 2. ప్రమోటర్ల కోటా లాకిన్‌ పిరియడ్‌ తరువాత ఉపసంహరించుకోవాల్సిన వాటా 10%, 20%, 30% - ఎంత అన్నది చర్చకు వదిలివేయబడింది. 3. విదేశీ పెట్టుబడులు 50%నికి మించి ఉండకూడదని స్పష్టంచేసింది. 4. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు, బ్యాంకులకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో సంబంధం ఉండకూడదన్నది. 5. అతి పెద్ద పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశం కల్పించటానికి గాను, ముందుగా వారు నష్టాల్లో నడుస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను నిర్వహించాలన్నది. 6. అనుమతించే బ్యాంకుల సంఖ్య కూడా పరిమితంగా ఉండాలన్నది.

Thursday, August 26, 2010

ద్రవ్య పునాది విస్తరణ

(ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌)

bpl11వ పంచవర్ష ప్రణాళికలో 'సమ్మిళిత అభివృద్ధి'(ఇన్‌క్లూజివ్‌ డెవలప్‌మెంట్‌)ని లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు ముఖ్యమైన సాధనంగా ద్రవ్య, బ్యాంకింగ్‌ సేవల పునాది విస్తరణ ఉపయోగపడుతుందని భావించింది. ఈ అవగాహనను ముందుకు తీసుకెళ్ళడం కోసం 2006 సం|| బడ్జెట్‌ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి, ''ద్రవ్య పునాది విస్తరణ (పైనాన్షియల్‌ ఇక్లూజన్‌)''కు సంబంధించిన భావనను పరిచయం చేసి, ఈ దిశలో భారతదేశ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం రంగరాజన్‌ కమిటీని నియమించారు. ఆ కమిటీ 04.01.2008న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ''అసంఖ్యాకమైన భారత ప్రజానీకం ద్రవ్య సేవల ప్రయోజనాలను పొందలేక పోతున్నారని, ఆ లోపాన్ని పూడ్చకుండా ఆర్థిక వృద్ధి ఫలితాలు వారికందవ''ని చెబుతూనే, అందుకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. 2010 బడ్జెట్‌ ప్రసంగం వరకు చడీచప్పుడు చేయని కేంద్ర ప్రభుత్వం గత కొద్ది నెలలుగా ఈ భావనను, దాని ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఊదరగొడ్తోంది. ఈ భావనల ప్రచారానికి ప్రభుత్వ విధానాల ప్రకటనలు, ప్రజా ప్రాతినిధ్యం వహించే సంస్థలను వేదికలు చేసుకొని కాకుండా సి.ఐ.ఐ (ఛాంబర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ), జి-20 సమావేశాలలో, ప్రభుత్వ రంగ బ్యాంకు అధిపతులు, గ్రామీణ బ్యాంకు అధిపతుల సమావేశాలను ఎంచుకోవటం జరిగింది. ఈ నేపధ్యంలో ద్రవ్య పునాది విస్తరణ అంటే ఏమిటో, దాన్ని సాధించటానికి ఎంచుకున్న మార్గాలు, ప్రయత్నాలను పరిశీలిద్దాం.

ద్రవ్య పునాది విస్తరణ

వస్తూత్పత్తి రంగాన్ని నిజ ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తాం. నిజ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్య ఆర్థిక వ్యవస్థ గుండెకాయలాంటిది. నిజ ఆర్థిక వ్యవస్థకు కావలసిన ద్రవ్య వనరులన్నింటినీ ద్రవ్య ఆర్థిక వ్యవస్థ తగినంత సమకూర్చినప్పుడు ఆర్థిక వృద్ధి సజావుగా సాగుతుంది. ద్రవ్య వ్యవస్థలో ద్రవ్య (డబ్బు) లావాదేవీలన్నింటికీ బ్యాంకింగ్‌ వ్యవస్థ వాహకంగా ఉంటుంది. అందువల్ల నిజ ఆర్థిక వ్యవస్థకు, ద్రవ్య ఆర్థిక వ్యవస్థ దోస్తీగా ఉండటం ప్రజాజీవనానికి ఎల్లవేళలా శ్రేయస్కరమైనది. ప్రపంచీకరణ క్రమంలో ద్రవ్య ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యత పెరిగి, నిజ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం వహించడం మనం చూస్తున్నాం. ఈ విధానాలతో సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై, ఆర్థిక అసమానతలు పెరిగాయి. అనేక దేశాలలో ద్రవ్య సేవలు (ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) అసంఖ్యాకమైన అణగారిన ప్రజానీకానికి చేరలేక పోవడమే ఈ అసమానతల కారణంగా వాదనలు మొదలయ్యాయి. ద్రవ్య సేవలంటే, డిపాజిట్లు, రుణాలు, నగదుబదిలీలులాంటి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు, మైక్రోఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు మొదలైనవి. ఈ సేవల్ని అణగారిన, అల్పాదాయ వర్గాలకు అందించడమే ద్రవ్య పునాది విస్తరణగా నిర్వచిస్తున్నారు. ఈ ప్రజానీకం ద్రవ్య వ్యవస్థతో అనుసంధానమైతే, ఆ ద్రవ్య వ్యవస్థ అందించే ఫలితాలు పొందగలుగుతారన్నది వారి భావన.

బ్యాంకింగ్‌ పునాది విస్తరణ(ఇన్‌క్లూజివ్‌ బ్యాంకింగ్‌)

ద్రవ్య సేవలకు వాహకమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ, బ్యాంకింగ్‌ సేవలను, అది అందుబాటులో లేని ప్రాంతాలకు, ప్రజానీకానికి విస్తరింపజేయటమే ''బ్యాంకింగ్‌ పునాది విస్తరణ''గా చెప్పబడుతుంది.

అంతర్జాతీయ అనుభవం

అభివృద్ది చెందిన దేశాలైన డెన్మార్క్‌లో 99%, జర్మనీలో 91%, ఫ్రాన్స్‌లో 96% ప్రజలకు ద్రవ్య సేవలు అందుబాటులో ఉండగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 20% నుంచి 30% వరకు ప్రజానీకానికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ దేశాలలో అత్యధిక ప్రజలు గ్రామాలలో అల్పదాయ వర్గాలుగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళి, అక్కడి పట్టణ పేదరికాన్ని పెంచడం జరుగుతోంది.

భారతదేశంలో ద్రవ్య సేవల లభ్యత

మన దేశంలోని 6 లక్షల గ్రామాలలో 30 వేల గ్రామాలలో మాత్రమే వాణిజ్య బ్యాంకుల శాఖలున్నాయి. దేశ జనాభాలో 34% మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. అంతర్జాతీయంగా 100 దేశాలలో ''ద్రవ్య, బ్యాంకింగ్‌ సేవల లభ్యత సూచి''లో మన దేశం 50వ స్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో బ్యాంకింగ్‌ రంగ విస్తరణ మరింత తక్కువగా ఉంది. అదే సందర్భంలో భారతదేశంలోని జనాభాలో 10% జీవిత బీమాను, 0.6% సాధారణ బీమాను, 13% డెబిట్‌ కార్డులను, 2% క్రెడిట్‌ కార్డులను కలిగి ఉన్నారని ఒక సర్వేలో తేలింది. జాతీయ శాంపిల్‌ సర్వే ప్రకారం 8 కోట్ల 93 లక్షల వ్యవసాయ కుటుంబాలలో 51%మంది బ్యాంకులతో ఏ విధమైన లావాదేవీలు లేనివారుగా ఉన్నారు.

బ్యాంకింగ్‌ రంగ విస్తరణలో జాతీయ బ్యాంకుల పాత్ర

1969 వరకు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బ్యాంకింగ్‌ రంగం, జాతీయకరణతో డిపాజిట్ల సేకరణలోను, రుణాల పంపిణీలోను అసాధారణ పాత్రను నిర్వహించింది. 1951లో వాణిజ్య బ్యాంకులు, కో-ఆపరేటివ్‌ సొసైటీల ద్వారా 7.3% వనరులు పంపిణీ కాగా 1991 నాటికి అది 66.3% అయ్యింది. 1969 జూన్‌ నాటికి 8,262 గా ఉన్న బ్యాంకు శాఖలు మార్చి 2006 నాటికి 69,471 కి పెరిగాయి. జూన్‌ 1969లో 64 వేల మంది ప్రజలకు ఒక బ్యాంకు శాఖ ఉండగా, 2006 నాటికి 16 వేల మంది ప్రజలకు ఒక బ్యాంకు శాఖ ఉన్నది. బ్యాంకు శాఖలలో జూన్‌ 1969 నాటికి గ్రామీణ శాఖలు 22.2% గా ఉండగా, మార్చి 98 నాటికి అది 51% అయ్యింది. ప్రాంతీయ గ్రామీణబ్యాంకు శాఖలు మారుమూల గ్రామాలకు విస్తరించడం, పోలీస్‌ స్టేషన్లు పెట్టలేని చోట్ల కూడ గ్రామీణ బ్యాంకు శాఖలను ఏర్పాటు చేసి సేవలనందిస్తున్నాయి. కాని ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక జాతీయ బ్యాంకులు తీవ్రమైన ఒత్తిడి పరీక్షలు ఎదుర్కొంటున్నాయి. సేవాదృక్పథం స్థానంలో లాభాల ధ్యేయం చోటుచేసుకున్నాయి. కష్టమర్ల ఛార్జీలు భారీగా పెరిగాయి. సాంకేతికాభివృద్ధితో మెరుగైన సేవలను ప్రజానీకం ఆహ్వానిస్తున్నా, 2004-2009 కాలంలో జాతీయ బ్యాంకులలో ప్రభుత్వ మూల ధన వాటాలు తగ్గటం, ప్రయివేటు విదేశీ బ్యాంకుల ప్రవేశంతో శాఖల విస్తరణ మెట్రోనగరాలకు, పట్టణ ప్రాంతాలకు పరిమితమయ్యాయి. నష్టాలొస్తున్నాయన్న సాకుతో అనేక గ్రామాలలో బ్యాంకు శాఖలు మూసివేయబడటమో లేదా దగ్గరి పట్టణానికి తరలించడమో జరిగింది. గ్రామీణ బ్యాంకులు కూడా వాణిజ్య బ్యాంకుల పద్ధతిలో సేవలనందిచడం, బ్యాంకు సిబ్బంది కొరతతో వాటి లక్ష్యాలకు దూరమౌతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుండి భారత ఆర్థిక వ్యవస్థను రక్షించిన జాతీయ బ్యాంకింగ్‌ రంగాన్ని బ్యాంకింగ్‌ సంస్కరణలు దెబ్బతీస్తున్నాయి.

Sunday, August 8, 2010

బ్యాంకులకు ఒత్తిడి పరీక్షలు-ఒక పరిశీలన

గుండె నొప్పి అంటూ వచ్చిన రోగికి, గుండె పటిష్టత అంచనా కట్టేందుకు డాక్టర్‌ నిర్వహించే ఒత్తిడి పరీక్షల (స్ట్రెస్‌ టెస్టులు) వలె, ఇటీవల యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంకుల పటిష్టతను అంచనా వేసేందుకు యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంకింగ్‌ సూపర్‌ వైజర్స్‌ కమిటి ఒత్తిడి పరీక్షలను నిర్వహించింది. యూరోజోన్‌ ఎదుర్కొన్న సార్వభౌమ రుణ చెల్లింపు వైఫల్య సంక్షోభంతో శృంగభంగమైన 91 యూరోపియన్‌ బ్యాంకులలో, 7 బ్యాంకులు ఒత్తిడి పరీక్షలలో నెగ్గలేదని ఆ కమిటీ ప్రకటించింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ రిజర్వ్‌ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక సంక్షోభ తదనంతర కాలంలో తామూ, రుణాలు, వడ్డీ రేట్ల సంకటాలను (రిస్క్‌) తట్టుకోకలిగే స్తోమతపై భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఒత్తిడి పరీక్షలు నిర్వహించామని, భారతీయ బ్యాంకులు పటిష్టంగా ఉన్నాయన్నారు. రానున్న కాలంలో దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ విశ్వాసనీయతను పెంచేందుకు, మరిన్ని అధునాతనమైన ఒత్తిడి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోగల విశిష్టమైన వ్యవస్థగా భారతీయ బ్యాంకింగ్‌ ప్రపంచ వ్యాప్తంగా కీర్తింపబడుతున్న కాలంలో, రిజర్వ్‌ బ్యాంకు ప్రకటన విస్మయాన్ని కల్గిస్తుంది.

ఒత్తిడి పరీక్షలు - ఏమిటి, ఎందుకు?

అనూహ్యమైన సంక్లిష్ట పరిస్థితుల ప్రభావాల నుండి తట్టుకోవటానికి అవసరమైన నికర సంపద (పెట్టుబడి) ఒక బ్యాంకు కలిగి ఉందా, లేదా అనే అంశాన్ని లోతుగా పరిశీలించే పరీక్షలు ఒత్తిడి పరీక్షలుగా చెప్తున్నారు. సామాన్యంగా ప్రతి బ్యాంకు స్వీయ పరిశీలనగా ఈ పరీక్షలు నిర్వహిస్తాయి. స్థూలంగా బ్యాంకింగ్‌ వ్యవస్థను అస్థిర పరిచే పరిస్థితులు తలెత్తినా, లేదా అటువంటి పరిస్థితులకు అవకాశం ఉన్నా, ఆ దేశ కేంద్ర బ్యాంకు, ప్రభుత్వం ఇలాంటి పరీక్షలు నిర్వహించుకుంటాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తుత్పత్తి రంగంపై, ద్రవ్య ఆర్థిక వ్యవస్థ(ద్రవ్య పెట్టుబడి) అపరిమితమైన ఆధిపత్యాన్ని చలాయిస్తున్న కాలంలో అనిశ్చితి (రిస్క్‌) వ్యవస్థీకృతమైంది, విశ్వవ్యాప్తమైంది. ఒత్తిడి పరిస్థితుల అవసరాలు ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో నిత్య కృత్యమయ్యాయి.

వివిధ బ్యాంకింగ్‌ రిస్క్‌లు

సామాన్యంగా బ్యాంకింగ్‌ వ్యవస్థను దెబ్బతీసే సంకటాలు (రిస్క్‌లు) 1. రుణ సంకటాలు (క్రెడిట్‌ రిస్క్‌) 2. మార్కెట్‌ సంకటాలు(మార్కెట్‌ రిస్క్‌) 3. నిధుల లభ్యత సంకటాలు (లిక్విడిటీ రిస్క్‌).

రుణ సంకటాలు

బ్యాంకులు అందించే వివిధ రుణాల ద్వారా ఉద్భవించే సంకటాలు రుణ సంకటాలు. సరియైన హామీ లేకపోవటం లేదా చెల్లించే స్థోమత లేకపోవటం లాంటివి వీటికి సాధరణమైన కారణాలుగా ఉంటాయి. పారు బాకీలు, నిరర్ధక ఆస్థులు ఇందులో భాగాలు. అమెరికాలో గృహ రుణ సంక్షోభం ఇందుకు తాజా ఉదాహరణ.

మార్కెట్‌ సంకటాలు

ద్రవ్య మారకపు విలువలు, వడ్డీ రేట్లు, ఈక్విటీలు, బాండులు, డెరివేటివ్‌లు లాంటి నూతన ద్రవ్య ఉత్పత్తుల ధరలలోని అనిశ్ఛితితో ఏర్పడేవి మార్కెట్‌ సంకటాలు. యూరోజోన్‌ సార్వభౌమ రుణ చెల్లింపు వైఫల్య సంక్షోభం ఇందుకు ఉదాహరణ.

నిధుల లభ్యత సంకటం

లెహమాన్‌ బ్రదర్స్‌ దివాళాకు ముందుకాలంలో అంతర్జాతీయంగా నిధుల లభ్యత బ్యాంకులకు పెద్ద సమస్యగా ముందుకు రాలేదు. లెహమాన్‌ బ్రదర్స్‌ దివాళా ఉదంతంతో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సూత్రాలు తల్లక్రిందులైనాయి. 2008 సం|| బ్యాంకింగ్‌ రంగంలో సృష్టించిన నిధుల లభ్యత(లిక్విడిటీ) కొరత, భయోత్పాతంతో బెంబేలెత్తిన బ్యాంకేతర ద్రవ్య సంస్థలైన మనీ మార్కెట్‌లు బ్యాంకులకు పెట్టుబడులు పెట్టటానికి నిరాకరించాయి. సముచితమైన వడ్డీరేట్లకు నిధులు దొరకక, ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చాలన్నా ఆస్తులు విలువలు లేక, డిపాజిట్‌ దారుల డిమాండ్‌ మేరకు నిధులు అందించలేక బ్యాంకులు తల్లడిల్లాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఆర్థిక పటిష్టతను బేరీజు వేసుకొని, ఉపద్రవ నివారణా చర్యలకు సమాయత్తం కావడం కోసం నిర్వహించే ఒత్తిడి పరీక్షలు ఆహ్వానించ దగ్గవే. కానీ ఈ సంకటాలకు మూలమైన విధానాల సవరణలకు కాక బ్యాంకులలో జరిగే వివిధ వ్యవస్థీకృత సవరణలే ఆందోళనను కల్గిస్తున్నాయి.

అమెరికాలో ఒత్తిడి పరీక్షలు

2009 ప్రథమార్థంలో అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో అతి పెద్ద 19 బ్యాంకులపై నిర్వహించిన ఒత్తిడి పరీక్షలలో 10 బ్యాంకులు ఉత్తీర్ణతను సాధించలేక పోయాయి. ఈ 10 బ్యాంకులలో 74.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి కొరత కావడమే వైఫల్యాలకు కారణంగా నిర్వాహకులు పేర్కొన్నారు. వైఫల్యమైన బ్యాంకులు పెట్టుబడి కొరతను పూడ్చుకొనే మార్గాలను వివరించారు. ఈ ఫలితాల ప్రచార హోరుతో అమెరికాలోని స్టాక్‌ మార్కెట్‌ 7 నెలలో 36% పుంజుకుంది.

యూరోపియన్‌ యూనియన్‌ లో ఒత్తిడి పరీక్షలు

జూలైలో యూరోపియన్‌ యూనియన్‌లు 91 బ్యాంకులకు ఒత్తిడి పరీక్షలు నిర్వహించగా, 7 బ్యాంకులు 3.5 బిలియన్‌ యూరోల పెట్టుబడి కొరత కారణంగా పరీక్షలలో విజయవంతం కాలేదని నిర్వాహకులు తెలియజేసారు. వీటిలో స్పెయిన్‌ దేశంలో 5 బ్యాంకులు, జర్మనీ, గ్రీస్‌లలో ఒక్కొక్క బ్యాంకు ఉన్నాయి. అంటే మిగిలిన బ్యాంకుల ఆర్థిక పటిష్టత బాగున్నట్లే లెక్క. నిరుజ్యోగం 6%, జి.డి.పిలో తగ్గుదల 3%, షేర్‌ మార్కెట్‌ పతనం 20%, మార్కెట్‌ వడ్డీ రేట్ల పెరుగుదల 6% సంభవించిన పరిస్థితులలో నెలకొనే పరిణామాలకు తట్టుకోగలిగే పెట్టుబడి పరిపూర్ణత కలిగిన బ్యాంకులను పరీక్షలలో విజేతలుగా సూత్రీకరించారు. ఈ ఫలితాలతో మార్కెట్‌ వర్గాలు ఊపిరి పీల్చుకొని, ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడతాయని, అమెరికాలో మాదిరిగా ఫైనాన్షియల్‌ మార్కెట్‌ జోరుగా ఊపందుకుంటుందని కొండంత ఆశతో యూరోపియన్‌ యూనియన్‌ ఉంది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లలో జరిపిన ఒత్తిడి పరీక్షల విశ్వాసనీయతపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముగింపు

ప్రపంచీకరణ నేపథ్యంలో బ్యాంకుల పై పెరిగిన ఒత్తిడి విధానపరమైంది నిజమైన ఒత్తిడి పరీక్షలు పాలక వర్గ ఆర్థిక, ద్రవ్య విధానాలపై ఉండాలి. అందుకు భిన్నంగా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ లలో నిర్వహించిన పరీక్షలు కేవలం మార్కెట్ల విశ్వాసాన్ని పొందటానికి చేసిన జిమ్మిక్కులే. వీటి ఫలితాలు స్వల్పకాలికాలు. భారతదేశంలో బ్యాంకింగ్‌ రంగంపై నిర్వహింపబడుతున్న ఒత్తిడి పరీక్షల తీరు వేరుగా ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన జాతీయ బ్యాంకింగ్‌ రంగాన్ని భూస్థాపితం చేసి, ఈ రంగాన్ని సంక్షోభానికి కారకులైన విదేశీ బ్యాంకులకు ధారాదత్తం చేయటానికి ఒత్తిడి పరీక్షలను సాధనాలుగా వినియోగిస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంకు తాజా ప్రకటన ఇందులో భాగమే. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన ఒత్తిడి పరీక్షల స్థానంలో, సర్వజనీనమైన, ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తించే విధంగా ఈ పరీక్షల ప్రమాణాలను అంతర్జాతీయ సంస్థలు రూపొందిస్తున్నాయి. ఇది జాతీయ ఆర్థిక సార్వభౌమాధికారానికి, స్వావలంబనకు విఘాతం కల్గిస్తుంది.

Sunday, August 1, 2010

మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌-రెండవ భాగం


అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని శాసిస్తున్న కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ విశిష్ట వైభవాన్ని చవిచూసింది. లాభాలు, భద్రత, కోరినప్పుడు డబ్బుగా మార్చుకోగలిగే వెసులుబాటు (లిక్విడిటీ) లాంటి లక్షణాలు పుణికిపుచ్చుకుంటాయని చెప్పుకొనే మ్యూచువల్‌ ఫండ్స్‌, మదుపరులను ఆకట్టుకోవటంలో ఈ మధ్య కాలంలో వెనుకపట్టు పట్టాయి. మన దేశంలో పారిశ్రామిక రంగానికి పెట్టుబడుల్ని సమకూర్చటం, చిన్నమదుపుదారులకు సైతం స్టాక్‌ మార్కెట్‌ ప్రయోజనాల్ని అందించడం లాంటి లక్ష్యాలతో ప్రారంభమైన మ్యూచువల్‌ ఫండ్‌ రంగ అభివృద్ధి క్రమాన్ని సంక్షిప్తంగా సమీక్షిద్దాం.
మనదేశంలో మ్యూచువల్‌ ఫండ్‌ రంగం అభివృద్ధి

మ్యూచువల్‌ ఫండ్‌ వాణిజ్యాన్ని సెబి (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) నియంత్రిస్తుండగా, అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎ.యం.ఎఫ్‌.ఐ) మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి మదుపుదారులలోను, పంపిణిదారులలోను అవగాహనను, పరిజ్ఞానాన్ని పెంచడంకోసం కృషి చేస్తుంది. 1963లో ప్రభుత్వరంగమైన యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (యు.టి.ఐ) పేరు మీద ప్రారంభమైన మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో 1987 నాటికి జాతీయ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు ప్రవేశించాయి. 1988 చివరికి ఈ రంగంలో ''యాజమాన్యంలోని సగటు ఆస్తుల విలువ'' (యావరేజ్‌ ఎస్సెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ - ఎ.యు.యం) రూ. 6,700 కోట్లుగా ఉంది. 1993లో ఈ పరిశ్రమలోకి ప్రయివేట్‌ కంపెనీలు ప్రవేశించి ఎ.యు.యం రూ. 47,004 కోట్లకు చేరి, 2004 నాటికి ఈ విలువ రూ. 1,40,000 కోట్లకు పెరిగింది. 2007 ద్వితీయార్ధం నుండి 2009 ప్రథమార్ధం వరకు ప్రపంచ ఆర్థిక సంక్షోభం దెబ్బకు మ్యూచువల్‌ ఫండ్‌ రంగం చతికిల బడింది. భారత దేశంలో మొట్టమొదటగా ఆగస్టు-నవంబరు 2008 నాటికి ఈ వాణిజ్యం 26.1%నికి పడిపోయింది. కానీ మార్చి-ఆగస్టు 2009 నాటికి పరిస్థితులు మారి, వాణిజ్యం మళ్ళీ 52.1%నికి పెరిగింది. ఈ పెరుగుదల ఈక్విటీ/బ్యాలెన్స్‌డ్‌ పథకాలలో 66%, రుణ పథకాలలో 114.7%గా నమోదైంది. డిశంబర్‌ 2009 నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎ.యు.యం, రూ. 7,61,626 కోట్లకు పెరిగింది. ఇందులో జాతీయ బ్యాంకులు నిర్వహించే మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు 16.28%, యల్‌.ఐ.సి. 6% ఉండగా, ప్రయివేటు రంగంలోని కంపెనీలు (స్వదేశీ, విదేశీ, సంయుక్త రంగాలు) 77.2%గా ఉన్నాయి. అంటే ప్రభుత్వ రంగంలో మొదలైన భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌లో ప్రస్తుతం 3/4 వంతు ప్రయివేటు రంగం హస్తగతం చేసుకుంది.
మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ తీరుతెన్నులు

భారతదేశంలోని మ్యూచువల్‌ ఫండ్స్‌ ''యాజమాన్యంలోని సగటు ఆస్థుల విలువ (ఎ.యు.యం) లో అత్యధిక భాగం రుణపథకాల (డెట్‌ స్కీమ్స్‌) లోనే ఉంది. ఈక్విటీ పథకాలలో కేవలం 20% (సుమారు) మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రుణ పధకాలలో అత్యధిక భాగం సంస్థాగత మదుపు దారుల పెట్టుబడులు కాగా, గ్రోత్‌ ఫండ్‌, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ పధకాలలో అత్యధికంగా రిటైల్‌ మదుపుదారులు పెట్టుబడులు పెడుతున్నారు. అంటే ఈ వాణిజ్యంలో వ్యక్తిగత మదుపుదారుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ఈ పరిశ్రమ, దేశంలో 150 నగరాలకు విస్తరించగా, ఎ.యు.యంలో 85%, 10 మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైంది. అంటే ఈ వాణిజ్యంలో అత్యధిక భాగం నగరాలకే లక్ష్యమైంది. సి.యం.ఐ.ఇ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి) అంచనాల ప్రకారం డిసెంబర్‌-2009 నాటికి భారతదేశ జనాభాలో 8 కోట్ల 76 లక్షల కుటుంబాలు బంగారంలోను, 5 కోట్ల 97 లక్షల కుటుంబాలు జీవిత భీమా లోను, 4 కోట్ల 60 లక్షల కుటుంబాలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల లోను, 9 లక్షల 20 వేల కుటుంబాలు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుండగా, మ్యూచువల్‌ ఫండ్‌లో కోటి మంది లోపు కుటుంబాలు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలోని దేశీయ పొదుపులో మ్యూచువల్‌ ఫండ్స్‌ అతి తక్కువ భాగంగా ఉంది.
కలవర పెడుతున్న ఈక్విటీ మదుపరుల నిష్క్రమణ

మార్చి-జూన్‌ 2010 మధ్య కాలంలో మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌లో 7.5 లక్షల ఈక్విటీ ఆధారిత గ్రోత్‌/బ్యాలెన్స్‌ ఫండ్‌ పథకాలలోని ఖాతాలు (ఫోలియోలు) విరమించుకోవడం జరిగింది. ఇదే కాలంలో 1.9 లక్షల నూతన రుణపథకాల ఖాతాలు చేరినా, ఖాతాల భారీ విరమణలు మ్యూచువల్‌ ఫండ్‌ వర్గాల్నికలవరపెటుతున్నాయి. ఎ.యం.ఎఫ్‌.ఐ గణాంకాల ప్రకారం జూన్‌ 2010 నాటికి భారతదేశంలోని మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ 3,578 పథకాలతో, 4,79,41,250 ఖాతాలతో (ఫోలియోలు), 6.7 లక్షల కోట్ల ఎ.యు.యంతో నమోదైయింది. వీటిలో 4కోట్ల 35 లక్షల ఖాతాలు గ్రోత్‌/బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌కు సంబంధించినవి. ఇదే సమయంలో రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూ. 1 కోటి 1 లక్ష ఎ.యు.యం తోనూ, యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ 1 కోటి ఖాతాలు (ఫోలియోలు) కలిగి ప్రథమస్థానంలో ఉన్నాయి. ఈ సమయంలో సెన్సెక్స్‌ పెరుగుదల నిలకడగా ఉన్నా, మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో దాదాపు 4 లక్షల ఖాతాల పతనంపై మార్కెట్‌ వర్గాలు, సెబీ మల్లగుల్లలు పడుతున్నాయి.
ఎందుకిలా జరిగింది?

భారతదేశంలోని మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లు ఆకర్షణీయంగా లేవన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లో చేరేటప్పుడు ఎంట్రీ లోడ్‌ క్రింద 2.5% గతంలో కట్టించుకునేవారు. ఈ సొమ్ము, స్కీమ్‌ సొమ్ముతో పాటు వసూలు చేయబడేది. ఇలా వసూలు చేసిన సొమ్ము మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీదారులకు (ఏజెంట్‌లు/మధ్యవర్తులు) కమీషన్‌ కింద చెల్లింపబడేది. ఆగస్టు 2009లో సెబీ ఈ ఎంట్రీ లోడును రద్దు చేసి, కమీషన్‌ను నేరుగా మదుపుదారుల నుండే వసూలు చేసుకోమని ఆదేశించింది. ఈ చర్యకు వ్యతిరేకంగా పంపిణీదారులు సెబీ కార్యాలయం ముందు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన ప్రయోజనం లేకపోయింది. దీనితో పంపిణిదారులు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్ని ప్రచారం చేయడం, మదుపుదారులను చేర్పించడం మానేసారు. ఇదే సమయంలో ''యూలిప్‌'' (యూనిట్‌ లింక్డ్‌ ఇన్యూరెన్స్‌ పధకం) లలో ఆకర్షణీయమైన కమీషన్‌లు చెల్లిస్తున్న కారణంగా మ్యూచువల్‌ ఫండ్‌లకు ఆదరణ తగ్గి ''యూలిప్‌'' మార్కెట్‌ పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే సెబీ, ''యూలిప్‌'' పథకాలు, మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల పోలికలతో ఉన్నందున వాటిపై నియంత్రణ తమదేనంటూ వివాదానికి దిగటం, అంతిమంగా కేంద్ర ప్రభుత్వం సెబీ అభ్యంతరాల్ని తోసిపుచ్చడం జరిగింది. సెబీ, మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ మదుపుదారుల ఆదరణను తిరిగి పొందటం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలు ఏ మేరకు జయప్రదం అవుతాయో కాలమే తేల్చాలి. ''మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల నిర్మాణం సంక్లిష్టమైనందున, వివరించి నచ్చచెప్పే పంపిణీదారుల ఆవశ్యకత అనివార్యమని, అందువల్లే ఎంట్రిలోడ్‌ రద్దు మదుపుదారులకు ప్రయోజనకరమైనప్పటికి, వారిపై ఏ విధమైన ప్రభావాన్ని కల్గించలేకపోయిందని'' మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎంట్రీలోడ్‌ పునరుద్ధరణ, సమర్థవంతమైన ఫండ్‌ మేనేజర్ల ఏర్పాటు జరగనంతకాలం మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల కష్టాలు తీరేటట్లు లేవు.
ముగింపు

అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా వినియోగింపబడుతున్న ద్రవ్య సాధనాలలో ఒకటిగా ''మ్యూచువల్‌ ఫండ్స్‌''ను చూడాలి. 1993 తదనంతర కాలంలో మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌, స్టాక్‌ మార్కెట్‌ అడుగుజాడలలో నడుస్తున్నది. 1993 నుండి 2007 వరకు ఈ రంగం విదేశీ సంస్థాగత మదుపుదారుల పెట్టుబడులతో అప్రతిహతంగా కొనసాగింది. 2007-2009 మధ్య కాలంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో వెనక్కు మళ్ళిన విదేశీ సంస్థాగత పెట్టుబడులతో ఈ రంగం కూడా కుప్పకూలింది. దేశీయ పరిస్థితులతో పాటు విదేశీ పెట్టుబడుల ప్రాబల్యం ఈ రంగంపై గణనీయంగా ఉంటుందని గమనించాలి. అదే సందర్భంలో యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా విశిష్ట ఉత్పాదన అయిన యు.యస్‌-64 (భారతదేశంలోని మొదటి మ్యూచువల్‌ ఫండ్‌) 1998లో భారీ స్కాంలో కూరుకుపోవడంతో మదుపుదారుల విశ్వాసం భారీగా దెబ్బతిన్నది

ఈ స్కాం ప్రభావంతో నష్టపోయిన లక్షలాది మదుపుదారుల ఆక్రందనలతో 2001లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రిని పార్లమెంట్‌లో నిలదీయాల్సిన పరిస్థితులు దాపురించాయి. మదుపుదారులకు గ్యారంటీ, వస్తూత్పత్తి రంగానికి వనరులు సమకూర్చే లక్ష్యాలతో ప్రారంభమైన భారతదేశ మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ ప్రపంచీకరణ విధానాలతో సెకండరీ మార్కెట్‌ పెట్టుబడులతో అస్థిరతకు, అభద్రతకు గురికావల్సి వచ్చింది. అందువల్ల మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో మదుపుదారులకు, ఫండ్‌ కంపెనీలకు ద్రవ్య పెట్టుబడి ఆటుపోట్లు అనివార్యాలు.