Saturday, February 21, 2015

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పైనే ఆధారపడితే------

విదేశీ  ప్రత్యక్ష పెట్టుబడుల పైనే  ఆధారపడితే------
-సి. పి. చంద్ర శేఖర్  
పారిశ్రామిక ప్రగతిలో బ్రెజిల్, దక్షిణ కొరియా లాంటి దేశాల కంటే వెనకబడి ఉన్నామన్న  వాస్తవాన్ని గుర్తించిన ఎన్డియే ప్రభుత్వం తన ఆర్ధిక వ్యూహానికి కేంద్రంగా తయారీ రంగ పునరుద్దరణను ఎన్నుకుంది. ఈ గమ్యాన్ని సాధించటానికి అనుసరించాల్సిన విధానం 'భారత్ తయారి' నినాదంగా రూపొందింప బడి, భారత్ వచ్చి,విదేశి మార్కెట్ల కోసంగా ఎగుమతుల్ని భారత్ లో తయారు చేయడానికి గాను అవసరమైన  పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంగా ప్రతిపాదింప బడింది . ఈ విధానం విజయవంత మైతే,  ప్రభుత్వ పాత్ర  'విధానవాతావరణాన్ని' మలిచేందుకు, ఆ రకంగా వచ్చే పెట్టుబడులకు అవసరమైన మౌలిక పరిస్థితుల కల్పన మేరకే   పరిమితమౌతుంది. 

ఈ వ్యూహంలో నూతనత్వం ఏమి లేదు . గత నాలుగు దశాబ్దాలుగా అనేక వర్ధమాన దేశాలలో ప్రయోగాత్మకంగా నిర్వహింప బడుతున్నప్రక్రియే ఇది. . అందులో కొన్నిదేశాలు  తప్పించి , అత్యధిక దేశాలలో ప్రయోగాలు విఫలమైనవే. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న తరుణం లో  పై విధాన ప్రకటన లోని విజ్ఞత ప్రశ్నార్ధకమే. ఇంకా చెప్పుకుంటే, మన  దేశీయ మార్కెట్టు పై పూర్తి అవగాహన వుంటే, విదేశి పెట్టుబడి దారులు మన దేశం వస్తే,  వాళ్ళు ఎగుమతుల మార్కెట్ల కంటే దేశీయ మార్కెట్లలోనే పెట్టుబడులు పెట్టె  అవకాశాలు మెరుగ్గా వున్నాయని గ్రహించ కలుగుతాం. 

భారత దేశ గత అనుభవాన్నే పరిశీలిద్దాం. భారత దేశం లో నమోదు కాబడ్డ వివిధ కంపెనీల ఆస్తులూ అప్పులు మరియు మన దేశంలో నిర్వహంపబడుతున్న విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల ఆర్ధిక లావాదేవీల వివరాలను రిజర్వు బ్యాంకు ఈ మధ్యకాలంలో తెప్పించుకుంది. 2011 నుండి అన్ని కంపెనీలు తాము పొందుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అలాగే తాము విదేశాలలో పెట్టుతున్న పెట్టుబడులకు  సంబందించిన ఆస్తులు అప్పుల  వివరాలను రిజర్వుబ్యాంకు కు సమర్పించవలసి వున్నది. ఈ వివరాలను విశ్లేషిస్తే విదేశీ పెట్టుబడుల రంగంలో విదేశి కంపెనీల ఆధిపత్యం గణనీయంగా పెరిగిపోతున్నట్లు అర్ధమౌతున్నది..ఫైనాన్సు కంపెనీల ఈక్విటీ షేర్లలలో 63.9 శాతం. ఫైనాన్సేతర కంపెనీల ఈక్వీటీ షేర్లలలో 74.5 శాతం విదేశి ఆధిపత్యంలో  వున్నట్లు తెలుస్తున్నది. 

తయారీ రంగంలో మార్చి 2013 అంతానికి అప్పులు తీసివేయగా మిగిలిన మూల పెట్టుబడుల మొత్తం విలువలో (మార్కెట్ విలువ )విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల ఈక్విటీ షేర్ల విలువ 59. 4 శాతంగా వున్నది . అత్యధికంగా వున్న ఈ విదేశి పెట్టుబడుల ఆధిపత్యం స్టాక్ మార్కెట్ లో ప్రమాదకరమైన  ఆస్తుల ధరల ద్రవ్యోల్బణానికి దారితీసే పరిణామం  పొంచి వుంది. విదేశి మదుపుదారులు, ఈక్విటీ లలో ఆధిపత్యం కలిగి వుండటమే కాకుండా కంపెనీల ఆస్తులపై యాజమాన్య నియత్రణ  హక్కులు పొందగలుగు తున్నారు. 

 విదేశీ కంపెనీలను భారత్ కు వచ్చి తమ పెట్టుబడులతో ఈ దేశాన్ని తయారి రంగ కేంద్రం గా మలచమని భారత ప్రభుత్వం వాళ్ళకు మోకరిల్లుతున్న నేపధ్యంలో ఇప్పటికే ఈ కంపెనీలు భారత్ తయారి రంగంలో పొందిన అనుభవాల్నిసమీక్షించుకుంటె ఉపయుక్తంగా వుంటుంది.  మన దేశంలో విదేశీ పెట్టుబడులు  తయారీ, సేవా రంగాలలో స్పష్టంగా ఆధిపత్యాన్ని కలిగి వున్నాయి. తయారీ రంగం ఈక్విటిలో లో ప్రస్తుత మార్కెట్ ధరల్లో  విదేశీ పెట్టుబడులు 50శాతం దాకా వుండగా, సేవా రంగంలో ప్రత్యేకించి ఫైనాన్షియల్ మరియు వ్యాపార సేవల్లో 40శాతం దాక ఆధిపత్యం కలిగివున్నాయి.  తక్కువ వేతనాలతో, నైపుణ్యం మరియు ఇంగ్లీష్ మాట్లాడ గలిగే కార్మిక వర్గం వున్న రంగాలలోకి విదేశీ కంపెనీలు రాగలగడం సహజంగా భారత్ కు ప్రయోజనకరంగా వుంటుందని ప్రభుత్వం భావిస్తుంది.   

సరళీకరణ విధానాలు దేశీయ కంపెనీలను, వాటి సామర్ధ్యాలను అంతర్జాతీయ స్థాయి కి ప్రదర్శించి వాటిని అంతర్జాతీయ పోటికి తగ్గట్టు నిలబెడతాయని ప్రచారం జరిగినప్పటికీ, భారత దేశంలోని తయారి  రంగంలో వున్న విదేశీ  సబ్సిడరీ కంపెనీలు భారత్ ను  ఎగుమతుల ప్రధాన వేదికగా వాడటంలేదు . మొత్తం ఎగుమతులలో విదేశీ కంపెనీల ఎగుమతులు 32శాతంగా వున్నాయి. ఇదికూడా సమాచార పౌర సంబంధ రంగం ఈ కంపెనీలలో 17శాతం వుండి, వాటి అమ్మకాలలో 70శాతం ఎగుమతులు వున్నందు వల్ల సాధ్యమైంది. తయారీ రంగంలో వున్న అత్యధిక విదేశీ కంపెనీలు దేశీయ మార్కెట్లలోనే పెట్టుబడులు పెడుతున్నాయి. చెల్లింపుల సమతుల్యతా దృక్పధం  నుండి ఈ పరిణామాల్ని పరిశీలిస్తే ఆసక్తి  కరంగానే వుంటుంది. 

ప్రభుత్వేతర, ఫైనాన్సు యేతర 917 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కంపెనీల వ్యాపార గణాంకాలు 2015 జనవరిలో విడుదల చేయబడ్డాయి. వీటిని పరిశీలిస్తే 2010-11నుండి 2012-13 వరకు మూడు సంవత్సరాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కంపెనీలు సగటున 22శాతం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి లేని కంపెనీలు 26శాతం  విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాయి. విదేశీ పెట్టుబడి కంపెనీల కంటే విదేశీ పెట్టుబడి లేని కంపెనీలే ఎగుమతుల రంగంలో ముందువున్నాయ్. 

భారత తయారీ రంగం లో పెట్టుబడి పెడుతున్న విదేశీ కంపెనీల ప్రవర్తనలో మౌలిక మార్పు తేగలిగే విధానాలను ప్రభుత్వం అనుసరించక పొతే ఎగుమతి ఆధారిత ఆర్ధిక విజయం అసాధ్యమే. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మాంద్యం నుండి బయట పడినా, ఈ వాస్తవంలో మార్పు వుండదు. 

(4.. 2. 2015 'హిందూ' పత్రిక లోని వ్యాసానికి తెలుగు అనువాదం ) 

Friday, November 28, 2014

ఉపాధి హామీపై ఉదారవాద దాడి

ఉపాధి హామీపై ఉదారవాద దాడి

ఉపాధి హామీ పరి రక్షణకై దేశవ్యాప్త ఉద్యమం సాగుతోంది. గత రెండేళ్లుగా ఉపాధి హామీ ప్రయోజనాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం ప్రారంభమైనా తాజా పార్లమెం టు ఎన్నికల తర్వాత ఈ ప్రయత్నాలు రాజకీయ దాడి రూపం తీసుకున్నాయి. ఎన్నికలకు ముందే స్వేచ్ఛా మార్కెట్‌ సిద్ధాంతకర్తలు ఈ చట్టాన్ని సవరించాలని పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఈ తరహా విశ్లేషకులు, సంస్కరణల అనుకూలురు లెవనెత్తిన అంశాలను సమర్థించే బిజెపి అధికారానికి రావటంతో ఈ ప్రచారానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఏకంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజె సింధియా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి వారు ఉపాధి హామీ చట్టాన్ని తొలుత నిర్వీర్యం చేయటానికి, కాలక్రమంలో కేవలం ఒక పథకం స్థాయికి పరిమితం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దాడి రూపమే విస్తృత భాగస్వామ్య ప్రణాళికా కసరత్తు. ఈ చట్టంపై జరుగుతున్న దాడిని ఎదుర్కోవటానికి, చట్టాన్ని పరిరక్షించుకోవటానికి శ్రామిక శక్తులు ఏకమవుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింపజేయాలని, అటువంటి ప్రయత్నానికి ఉపాధి హామీ చట్టం ప్రధాన సాధనంకానున్నదని నమ్ముతున్న ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, మేధావులు ఈ ప్రయత్నాలను సమర్థించి ముందుకొస్తున్నారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు కూడా రెండుగా చీలిపోయాయి. కేంద్ర ప్రభుత్వం వందలాది పథకాలు అమలు పరుస్తుండగా ఉదారవాదులు ఈ ఒక్క చట్టం ఆధారిత పథకాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవటం వెనకగల కారణాలు ఏమిటి?
                     ఉపాధి హామీ చట్టం ప్రాధాన్యత గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే గత రెండు దశాబ్దాల ఆర్థిక సంస్కరణల దుష్ప్రభావాలను కూడా అర్థం చేసుకోవాలి. 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు గ్రామీణ భారతాన్ని కుంగదీశాయి. గ్రామీణ భారతానికి ఆయువుపట్టుగా ఉన్న వ్యవసాయాన్ని సంక్షోభ భరితం చేశాయి. లక్షలాది మంది రైతులు ఆత్మహత్యల పాలైనా సంస్కరణల మత్తులో జోగుతున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. 2000 సంవత్సరం తర్వాత గానీ ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం నిర్దిష్ట రాజకీయ రూపం తీసుకోవటం ప్రారంభం కాలేదు. ఫలితంగా 2004 ఎన్నికల నాటికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించటం ప్రధాన రాజకీయ పార్టీల ఎజెండాలో అంతర్భాగం అయ్యింది. అంతకు ముందే ప్రణాళికా సంఘం వంటి పలు కీలక ప్రభుత్వ విభాగాలు చితికిపోతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గుర్తించి దానికి తగిన పరిష్కారాలు ప్రతిపాదించటం ప్రారంభించాయి. ప్రణాళికా సంఘం రూపొందించిన 11వ పంచవర్ష ప్రణాళిక దిశా నిర్దేశ పత్రంలో గ్రామీణ ఆర్థిక సంక్షోభానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కనుమరుగవటం కీలక అంశంగా భావించి గ్రామీణ ఉపాధి పరిరక్షణ ఒక్కటే ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయట పడేయగలదని నిర్ధారించింది. తదనుగుణంగా రూపొందిందే గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ప్రస్తుతం ఈ చట్టం ఆవశ్యకత, ప్రాసంగికతపై సందేహాలు లేవనెత్తుతున్న శక్తులు, వ్యక్తులే నాడు ఈ చట్టం అవసరాన్ని కూడా ప్రశ్నిస్తూ వచ్చిన విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఉపాధి హామీ చట్టం అవసరం లేదన్న వాదన ముందుకు తేవటం అంటే ఆర్థిక సంస్కరణలు ఫలప్రదం అయ్యాయన్న మార్కెట్‌ ఛాందసవాదుల ప్రచారాన్ని ధృవీకరించటమే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న వాస్తవిక స్థితిని గుర్తించ నిరాకరించటమే అవుతుంది. నిజానికి ఈ చట్టం చిన్న సన్నకారు రైతాంగానికి, కౌలు రైతాంగానికి ఉపాధి అవకాశాలు కల్పించింది. తద్వారా వ్యవసాయ కార్మికులు, రైతాంగంలోని దిగువ తరగతుల మధ్య ఐక్యతకు పునాదులు వేసింది. ఈ చట్టం ద్వారా చేపట్టిన అనేక పనులు దీర్ఘకాలంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచటానికి దారితీసిందని స్వయంగా ఎన్‌ఎస్‌ఎస్‌ఒ వంటి సంస్థలతో పాటు ప్రణాళికా సంఘం ఆధీనంలో పని చేసే అనేక మేధో సంస్థలు ధృవీకరించాయి. ఇప్పటికే 10 లక్షల ఎకరాలకు పైగా అదనపు నీటి వనరులు ఈ చట్టం ద్వారా అందుబాటులోకి తెచ్చామని గ్రామీణాభివృద్ధి శాఖ నివేదికే స్పష్టం చేస్తోంది. ఈ ఐక్యత దీర్ఘకాలంలో ఆర్థిక సంస్కరణలపై జరిగే పోరాటానికి కొత్త ఊపిరులూదనుంది. ఉపాధి హామీ చట్టం వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయిందన్న వాదన ముందుకు తేవటం ద్వారా వ్యవసాయ సంక్షోభానికి కారణమవుతున్న ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సంస్కరణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నంలో కార్పొరేట్‌ మీడియా కూడా తనవంతు సహకారం అందిస్తోంది.
            ఈ చట్టం ఆశించిన ప్రయోజనాలు చేకూర్చలేదని, లక్షల కోట్ల రూపాయలు వృథా అయ్యాయన్నది వీరు ముందుకు తెస్తున్న మరో వాదన. ఈ చట్టం 2005లో ప్రారంభమైన నాటి నుంచి 2013-2014 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఉపాధి హామీ కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చించిన వ్యయం రూ.2,38,500 కోట్లు. మొత్తంగా జాతీయ ఆర్థిక వ్యవస్థను ఇటువంటి కేటాయింపులు సంక్షోభంలోకి నెడుతున్నాయని సంస్కరణవాదులు ప్రచారం చేస్తున్నారు. ఇది జిడిపిలో కేవలం 0.5 శాతం. మొత్తం జాతీయ ఆర్థిక వ్యవస్థ కేవలం 0.5 శాతం కేటాయింపుల వల్ల సంక్షోభంలో పడిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లు కార్పొరేట్‌ వర్గాలకు కేటాయించిన రూ.34 లక్షల కోట్ల గురించి ఎందుకు నోరెత్తటం లేదు? ఉపాధి హామీ చట్టం అమలుకు కేటాయించిన నిధుల్లో 65 శాతం అంటే రూ.1,55,000 కోట్లు నేరుగా వ్యవసాయ కార్మికులకు వేతనాల రూపంలో వారికి చేరింది. రూ.35 కోట్ల కుటుంబాలకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది. 1,575 కోట్ల పనిదినాలు సృష్టించబడ్డాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజలు ప్రత్యేకించి వ్యవసాయ కార్మికులు విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతున్నారని పలు పరిశోధనల్లో రుజువు అయ్యింది. ఆ మేరకు వ్యవసాయ కార్మికులు గ్రామీణ పెత్తందారుల ఆధిపత్యం నుంచి విముక్తి పొందారు. ఊపిరి తీసుకున్నారు. కానీ సంస్కరణవాదులకు ఇదంతా 'వృథా వ్యయం', 'బూడిదలో పోసిన పన్నీరు'లాగా కనిపిస్తోంది. నితిన్‌ గడ్కరి వంటి వారికి ఇదంతా కేవలం రాజకీయ పక్షపాతం కోసం ప్రభుత్వ నిధుల దుర్వినియోగంలా మాత్రమే కనిపిస్తోంది.
                        బిజెపి అధికారానికి వచ్చాక అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి లావాదేవీలు పెరిగాయి. రానున్న కాలంలో భారతదేశాన్ని అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడికి క్రీడాస్థలంగా మార్చే విధానాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఉపాధి హామీ చట్టం వల్ల కాస్తో కూస్తో గ్రామీణ శ్రమశక్తి విలువ పెరిగింది. వేతనాలు పెరిగాయి. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లోని సంఘటిత, అసంఘటిత కార్మికులు, నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికుల ముందు ఒక ప్రత్యామ్నాయం ఉంది. గతిలేని పరిస్థితుల్లో నామమాత్రపు వేతనాలకు గొడ్డుచాకిరీ చేసే స్థితి నుంచి గ్రామీణ కార్మికులు కాస్తంట ఊరట పొందారు. మరోవైపున ఉపాధి హామీ వేతనాల నేపథ్యంలో భవన నిర్మాణం, ప్రత్యేక ఆర్థిక మండళ్ల నిర్మాణం, పారిశ్రామిక క్లస్టర్లలో పని చేసే కార్మికుల వేతనాలు ఎంతో కొంత పెంచాల్సి వచ్చింది. ఈ మేరకు పెట్టుబడి లాభాల్లో కోత పడుతోంది. గతంలో కారుచౌకగా దొరికే శ్రమశక్తి ఇప్పుడు దొరకటం లేదు. గ్రామీణ కార్మికులు తమ కాళ్ల మీద తాము నిలబడే అవకాశాలు వస్తే అంతిమంగా తమ లాభాల్లో కోతపడుతుందని గుర్తించింది పెట్టుదారీ వర్గం. అందువల్లనే దేశీయ గుత్తపెట్టుబడిదారీ వర్గం, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో కుమ్మక్కై వ్యవసాయ కార్మికులకు, చిన్న సన్నకారు రైతాంగానికి, గ్రామీణ కార్మికవర్గానికి ఊతమిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలన్న దాడిని ఉధృతం చేస్తోంది.

- కొండూరి వీరయ్య 

Monday, November 17, 2014

నిజమైన లౌకిక వాది నెహ్రూ

నిజమైన లౌకికవాది నెహ్రూ..ప్రొ.కె.నాగేశ్వర్


భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శాస్త్రీయధృక్పథం ఉన్న నాయకుడని, నిజమైన లౌకిక వాది అని, దేశం ఆర్ధిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించేవాడని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో పాల్గొన్న విశ్లేషకులు, ఎమ్మెల్సీ, ప్రొ.కె.నాగేశ్వర్ అన్నారు. ప్రస్తుతం జవహర్ లాల్ నెహ్రూ ఆర్ధిక విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. నెహ్రూ ఆర్ధిక, విదేశాంగ విధానాలపై కార్పొరేట్ మీడియా దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. దేశంలో రాజకీయ స్వాతంత్రం, ఆర్ధిక స్వాతంత్రం పెరగాలని నెహ్రూ చెప్పేవారని గుర్తుచేశారు. సంపద కేంద్రీకరణను నెహ్రూ వ్యతిరేకించినా దాన్ని నిరోధించలేకపోయారన్నారు.
పారిశ్రామికాభివృద్ధికి పునాదులు...
నెహ్రూ ప్రభుత్వం తీసుకున్న ఆర్ధిక విధానాలు భారత దేశాన్ని ఆర్ధిక స్వావలంబన పైపుకు తీసుకెళ్లాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో హెచ్ఎంటీ, బిహెఇఎల్, ఐడిపిఎల్, హెఎఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్ధలు ఏర్పడిన తరువాతే అభివృద్ధి జరిగిందని చెప్పారు. హైదరాబాద్, విశాఖపట్నంలో జిడిపి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మనదేశంలోనే వస్తువుల ఉత్పత్తి పెంచుకుంటూ దిగుమతులను తక్కువ చేసుకుంటే ఆర్ధిక ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. అయితే నెహ్రూ ఆర్ధిక విధానంలో పరిమితులున్నాయని చెప్పారు. ఆర్ధిక శక్తులను నెహ్రూ పూర్తిగా నాశనం చేయలేదని తెలిపారు. ప్రణాళికా బద్ధమైన ఆర్ధిక ప్రణాళిక నెహ్రూ హయాం నుంచే మొదలైందని చెప్పారు. ప్రభుత్వరంగ గుత్తాధిపత్యానికి పరిష్కారం ప్రైవేటురంగ గుత్తాధిపత్యం కాదని వివరించారు.
విదేశాంగ విధానం..
అలీనోద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది నెహ్రూయేనని అన్నారు. ప్రపంచంలో ఆధిపత్య దేశాలకు ఎదురొడ్డి నిలవాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు. నెహ్రూ ఆర్ధిక, విదేశాంగ విధానాలను కాంగ్రెస్ పార్టీ సైతం మర్చిపోయిందని చెప్పారు. ప్రస్తుతం పేటెంట్ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కారని అన్నారు.
రక్షణ రంగంలో..
నెహ్రూ హయాంలో రక్షణ, శాస్త్రసాంకేతిక రంగం అభివృద్ధికి పునాదులు పడ్డాయని తెలిపారు. 1956-64 ప్రాంతంలో దేశంలో అణుశక్తి శాఖ ఏర్పాటు, అణు రియాక్టర్ ల నిర్మాణం జరిగాయని చెప్పారు. 1960 లోనే తొలి రాకెట్ ను కేరళ నుంచి ప్రయోగించామని గుర్తుచేశారు. శాస్త్రీయంగా, వైజ్ఞానికంగా ఆలోచించడం ద్వారానే భారత్ ముందడుగు వేస్తుందని నెహ్రూ చెప్పారని అన్నారు.
నెహ్రూ నిజమైన లౌకిక వాది..
నెహ్రూ వ్యక్తిగతంగా లౌకికవాది అని చెప్పారు. రాజ్యవ్యవస్ధకు మతం దూరంగా ఉండాలని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారన్నారు. భిన్న మతాల సమాహారమైన భారతదేశం లౌకిక దేశంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారని చెప్పారు. భారత దేశం మూఢత్వం వదిలి శాస్త్రీయ ధృక్పథం వైపు నడవాలని ఆయన సూచించారన్నారు. నెహ్రూ ఆలోచనలను, ఆశయాలను ప్రస్తుత పరిస్ధితులకు అన్వయించుకుంటూ అనుసరించాలని సూచించారు.

Thursday, October 17, 2013

ఔషధ ప్రయోగార్ధుల పరిరక్షణ సాధ్యమేనా?

మన దేశంలొ ఔషధ ప్రయోగ బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి వీలుకల్పించే నిర్దిష్టమైన నియమ నిబంధనలు 2012 వరకు అమలులో లేవు. దీని పర్యవసానంగా నష్ట పరిహారం చెల్లించే తంతు కాంట్రాక్ట్ పరిశోధనా సంస్థల ఇష్టా రాజ్యమైంది. దీనికి వ్యతిరేకంగా ఔషధ ప్రయోగ బాధితులకు సక్రమమైన న్యాయం జరిపించటానికి గాను దేశంలోని అనేక సామాజిక సంస్థలు,కార్యకర్తలు,ప్రజా సంఘాలు,మేధావులు అనేక పద్ధతులలొ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.దీని ఫలితంగా బాధితులకు నష్ట పరిహారం చెల్లించే దిశలొ కొద్ది పురోగతి లభించింది.కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు కొన్ని మార్గదర్శకాలను ప్రతిపాదించింది. నష్ట పరిహారాన్ని లెక్కించేందుకు బాధితుడి వయస్సు,ఆదాయం, బాధితుడి అస్వస్థత తీవ్రతలను ప్రధానంగా పరిగణలొనికి తీసికొని ఒక ఫార్ములాను రూపొందించింది.

ఔషధ ప్రయోగ సంస్థల ఆగడాలను అరికట్టటానికై సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారించబడుతుంది.ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కొర్టుకు సమర్పించిన అఫిడవిట్ లొ ఆసక్తి కలిగించే అనేక అంశాల్ని పేర్కొంది.2005నుండి2012 మధ్య కాలంలొ నూతన ఔషధాల ఆవిష్కరణలకై 475 ఔషధ ప్రయోగాలు ఆమోదింపబడ్డాయని, వీటి కారణంగా 11,972మంది(చనిపోయినవారు కాకుండా) అనేక ప్రతికూల పరిణామాలకు గురైనారని,అందులో 506మంది ప్రత్యక్షంగా ఔషధ ప్రయోగాలతో తీవ్రమైన ఇబ్బందులు అనుభవించారని అందులొ పేర్కొనడం జరిగింది.ఇదే కాలంలో 2644 మంది ప్రయోగాల ఫలితంగా హానికి గురికావటమో లేదా మరణించడమో జరిగితే,అందులో 44 మందికి మాత్రమే  నష్ట పరిహారం చెల్లించబడిందని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ లో తెలియచేసింది. ఇది ఇలావుండగా, చెల్లించిన నష్ట పరిహారం సగటున  రూ.2.2లక్షలకు మించి లేదు.అరుదైన సందర్భాలలో చెల్లించిన పరిహారం గరిష్టంగా రూ.20లక్షల లొపే వుంది. రికార్డులకు నమోదుకాకుండా ఔషధ ప్రయోగాలలో మరణించిన వారు లేదా తీవ్ర అస్వస్థతకు గురై నరక యాతనలు అనుభవించినవారి సంఖ్య అనేక రెట్లు వుంటుంది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ చే నియమింపబడ్డ ప్రొఫెసర్ రంజిత్ రాయ్ చౌదురి నాయకత్వం లోని నిపుణుల కమిటీ,హద్దూఅపు లేకుండా సాగుతున్న ఔషధ ప్రయోగాలను నియంత్రిస్తూ నియమనిబంధనల నియమావళిని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఔషధ ప్రయోగ కెంద్రాలు, వాటిని పర్యవేక్షించే ఎథిక్స్ కమిటీలు తప్పనిసరిగా ప్రభుత్వం నుండి ప్రత్యేక గుర్తింపు పొందాలని,ప్రయోగార్ధుల నుండి "పూర్తి అవగాహన సమ్మతి"(ఇన్ ఫాండ్ కన్సెంట్)ని స్వీకరించే ప్రక్రియను ఆడియో వీడియోల ద్వారా రికార్డు చేయాలని స్పష్టపరిచింది. ఔషధ ప్రయోగ బాధితుడికి ఏ విధమైన ఆరోగ్యపరమైన హాని జరిగినా లెదా మరణం సంభవించినా ఆ బాధితుడి గ్రూపు స్వభావంతో నిమిత్తం లేకుండా అనివార్యంగా నష్ట పరిహారం చెల్లించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.ఈ పరిహారాన్నిస్పాన్సర్డ్ కంపెనీ పూర్తిగా భరించాల్సివుంటుంది. ఔషధ ప్రయోగాలతో సంబంధం లేకుందా సంభవించే ఆరోగ్యహాని/మరణాలకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లెదని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది.

మరోవైపు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిశీలనలొ వున్న సమయంలొ నిపుణుల కమిటీ సిఫార్సులపై పారిశ్రామిక వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి.ఈ సిఫార్సులు ఆచరణయోగ్యం కావని,ఇవి అమెరికా,యూరప్ దెశాలలొని నిబంధనల కంటే కఠినంగా వున్నాయని,వీటి అమలుకు ప్రయత్నిస్తే 500మిలియన్ డాలర్ల ఔషధ ప్రయోగ వాణిజ్యం భారిగా దెబ్బతింటుందని,భవిష్యత్తులొ వచ్చే సంక్లిష్టమైన వ్యాధులకు అవసరమైన ఔషధాల అవిష్కరణలు ముందడుగు వేయలేక  ఆరోగ్య పరిరక్షణలొ మనదేశం వెనుకపడుతుందని హెచ్చరిస్తున్నాయి. నయావుదారవాద విధానాలు,పేటెంట్ చట్ట సవరణల నేపధ్యంలో ఔషధ ప్రయోగాలపై వున్న అనేక నియంత్రణలను ఎత్తివేయటం, సున్నితమైన ఈ రంగంలో ప్రైవేట్ రంగ ఆధిపత్యం పెంచడంతో లాభార్జనకు పెద్దపీట వేయబడింది. గినియా పందుల కంటే హీనంగా ఔషధ ప్రయోగార్ధుల ప్రాణాలతో చెలగాటమాడిన కొన్ని కాంట్రాక్ట్ ఔషధ ప్రయోగ సంస్థల ఆగడాలు మరువలేనివి. ఔషధ ప్రయోగాలపై,బాధితుల ఆవేదనలపై అధ్యయనానికి నియమింప బడ్డ పార్లమెంటరీ కమిటీ ఈ వాస్తవాల్ని రూఢీ చెసింది. ఔషధ రంగంలో నూతన ఆవిష్కరణలు అత్యావశ్యకమన్న వాదన అర్ధవంతమైనదే. అందుకు విక్షణా రహితంగా ప్రజల విలువైన ప్రాణాల్ని పణంగా పెట్టలేము. విదేశీ మారక ద్రవ్యార్జన ధ్యేయంగా నియంత్రణలు లెని ఔషధ ప్రయోగాల్ని కొనసాగించలేం. ప్రజల ఒత్తిడి,ప్రజా సంస్థల సహకారం లేకుంటే ప్రయోగార్ధుల పరిరక్షణ ప్రశ్నార్ధకమే.


Saturday, March 12, 2011

''ద్రవ్యలోటును తగ్గించిన ద్రవ్యోల్బణం!!''


కేంద్ర బడ్జెట్‌పై విశ్లేషణలు, వ్యాఖ్యానాలు, విమర్శలు జరుపుతున్న రోజులివి. గత సంవత్సర కాలం ద్రవ్య సంక్షోభ కష్టాల నుండి నుండి భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించటం కోసం అత్యధికంగా వ్యయం చేసినప్పటికీ ద్రవ్యలోటును గతంలో అంచనా వేసిన 5.5శాతం నుండి 5.1శాతానికి తగ్గించగలిగానని 2011-12 బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి సగర్వంగా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక నిపుణులు ''ద్రవ్యలోటును తగ్గించిన ద్రవ్యోల్బణం'' అన్న శీర్షిక కింద చేసిన విశ్లేషణలు ఆర్థికాంశాలపై ఆసక్తి ఉన్నవారందరికి విస్మయాన్ని కల్గిస్తుంది. అయినప్పటికి ఇది వాస్తవం. వివరాలలోకి పోయే ముందు బడ్జెట్‌కు సంబంధించిన కొన్ని పారిభాషిక పదాలను మరోసారి గుర్తుచేసుకుందాం.

ద్రవ్యలోటు

మొత్తం ప్రభుత్వ వ్యయానికి, రుణాలను మినహాయించిన ప్రభుత్వ ఆదాయానికి మధ్య ఉన్న తేడాను ద్రవ్యలోటు అంటారు. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటే ద్రవ్యలోటు గాను, వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉంటే ద్రవ్య మిగులు గాను పరిగణిస్తారు. ద్రవ్యలోటును సహజంగా స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)లో శాతంగా వ్యక్తపరుస్తారు.

స్థూలదేశీయోత్పత్తి (జి.డి.పి)

ఒక నిర్ణీత కాలంలో దేశీయ, విదేశీయ అనే తేడాతో నిమిత్తం లేకుండా, ఒక దేశ సరిహద్దులకు పరిమితమై ఉత్పత్తి అయ్యే అన్ని రకాల సరుకులు, సేవలు, మదుపులు (ఇన్‌వెస్ట్‌మెంట్స్‌), ఎగుమతుల, దిగుమతుల మధ్య ఉండే నికర ఎగుమతులన్నింటి ''మొత్తం ద్రవ్య విలువ''ను స్థూలదేశీయోత్పత్తి లేదా జి.డి.పి (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రాడక్ట్‌) అని అంటారు.

నామమాత్ర స్థూలదేశీయోత్పత్తి (నామినల్‌/నామమాత్ర జి.డి.పి)

లెక్కించే సమయానికి అమలులో ఉన్న ధరల ఆధారంగా గణించబడిన స్థూలదేశీయోత్పత్తిని నామమాత్ర స్థూలదేశీయోత్పత్తి లేదా నామినల్‌ జి.డి.పి అంటారు.

నిజ స్థూల దేశీయోత్పత్తి (రియల్‌ జి.డి.పి)

స్థిరమైన ధరల ఆధారంగా గణించబడిన జి.డి.పి ని నిజ స్థూలదేశీయోత్పత్తి లేదా రియల్‌ జి.డి.పి (నిజ జి.డి.పి) అంటారు. వివిధ కాలాల మధ్య జి.డి.పి ని పోల్చేటప్పుడు సాధారణంగా నిజ జి.డి.పి ని వాడుతారు.

ద్రవ్యోల్బణం

దీర్ఘ కాలం నికరంగా కొనసాగే సరకులు, సేవల ధరలలోని పెరుగుదల స్థాయిని ద్రవ్యోల్బణంగా పరిగణిస్తారు. నామ మాత్ర జి.డి.పి కి, నిజ జి.డి.పి కి మధ్య తేడాయే ద్రవ్యోల్బణం (ఇన్‌ప్లేషన్‌) అవుతుంది. ద్రవ్యోల్బణ రేటు 2%-3%గా ఉంటే సున్నిత ద్రవ్యోల్బణమని, 5% వరకు ఉంటే నడిచే ద్రవ్యోల్బణమని, 10% వరకు ఉండే ద్రవ్యోల్బణాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణమని, ఆపైన ఉండే ద్రవ్యోల్బణాన్ని విజృంభించే ద్రవ్యోల్బణమని పిలుస్తారు. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ప్రమాణాలలో 5% వరకు ద్రవ్యోల్బణ రేటు ఆరోగ్యకరమైనది గాను, ఆపైన ఉంటే ప్రమాదకరమైనదిగాను పరిగణిస్తున్నారు.

కేంద్ర బడ్జెట్‌ పై విశ్లేషణలో ద్రవ్యలోటు

2010-11 సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)ని అప్పటి ధరల్లో 69 లక్షల 35 వేల కోట్ల రూపాయలుగా, ద్రవ్య లోటును 3 లక్షల 81 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేసి, ద్రవ్య లోటును 5.5%గా నిర్ణయించారు. 2009 మే అయిదు నుండి మన ఆర్థిక వ్యవస్థలో వరుసగా 76 వారాల పాటు రెండంకెల విజృంభణ ద్రవ్యోల్బణం గంగ వెర్రులెత్తించింది. ఈ నేపథ్యంలో 2011-12 బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తుతం అమలులో ఉన్న ధరలలో నామమాత్ర జి.డి.పి రూ.78.78 లక్షల కోట్లకు పెరిగిందని. అలాగే ద్రవ్యలోటు నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నామమాత్ర జి.డి.పి కి, గత సంవత్సరం అంచనా వేసిన నామమాత్ర జి.డి.పి కి మధ్య ఉన్న తేడా 9.43 లక్షల కోట్ల రూపాయలు. ఇది శుద్ధమైన ద్రవ్యోల్బణం.

ప్రస్తుతమున్న ద్రవ్య లోటుకు (నాలుగు లక్షల కోట్ల రూపాయలకు), ద్రవ్యోల్బణంతో పెరిగిన జి.డి.పికి (రూ.78.78 లక్షల కోట్లకు) మధ్య ఉన్న నిష్పత్తి 5.1శాతం. అంటే గత బడ్జెట్‌ సమయానికి అంచనా వేసిన 5.8శాతం కంటే ఇది తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఈ కాలంలో ద్రవ్యలోటు తగ్గటానికి సంపన్నులపై పన్నులేవి విధించబడలేదు. పైపెచ్చు సామాజిక వ్యయం, బడ్జెట్‌ అంచనాల కంటె చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వ చర్యలతో నిమిత్తం లేకుండా, కేవలం పెరిగిన ద్రవ్యోల్బణం మూలకంగా తగ్గిన ద్రవ్యలోటు రేటును ఆర్థిక మంత్రి తన సొంత విజయంగా చెప్పుకుంటున్నారు. ద్రవ్య లోటయిన నాలుగు లక్షల కోట్ల రూపాయలతో, ద్రవ్యోల్బణం అసలేమీ లేదనుకొని గత సంవత్సరం అంచనా వేయబడ్డ రూ.69.35 లక్షల కోట్ల నామమాత్ర జి.డి.పి తో గణిస్తే ద్రవ్యలోటు రేటు 5.8% అవుతుంది. అంటే అంచనా కంటే ఆచరణలో ద్రవ్యలోటు పెరిగినట్లు భావించాలి.

విచిత్రమేమంటే ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఏమున్నా, బడ్జెట్‌ పత్రాలకు జతచేయబడిన ''మధ్యస్థ కాల ద్రవ్య విధాన ప్రకటన''లో జి.డి.పి లోని అత్యధిక నామమాత్ర పెరుగుదలే (ద్రవ్యోల్బణం) ద్రవ్యలోటును తగ్గించిందని అంగీకరించటం కొసమెరుపు. అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు లెక్కించే ద్రవ్యలోటు రేట్లు అసంబద్ధమైనవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లో వాస్తవ పరిస్థితులతో నిమిత్తం లేని అంకెల గారడీతో ఎంతకాలం పాలక వర్గాలు సామాన్య ప్రజలను మోసగించగల్గుతారు? పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాల నుండి పాలకులు గుణపాఠాలు నేర్చుకోకపోతే, ఆ దుస్థితే మన దేశంలో పునరావృతం కాకమానదు.