Monday, February 1, 2016

ఆర్థిక లావాదేవీలపై పన్ను కోసం

- ప్రభాత్‌ పట్నాయక్‌
ద్రవ్యపెట్టుబడికి చట్టా వ్యాపారంపైనే ఆసక్తి వుండటం ఇక్కడ సమస్య. వాస్తవ ఆర్థిక వ్యవస్థపై చట్టా వ్యాపార ప్రభావాన్ని పరిమితంచేసే ప్రయత్నం ఎలాంటిదైనా అది చట్టా వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. అందుకని చట్టా వ్యాపారంపై ఎటువంటి పరిమితి విధించినా ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకిస్తుంది. ఆర్థిక లావాదేవీలపై పన్ను వేయటానికి ద్రవ్య పెట్టుబడి ఎందుకు వ్యతిరేకిస్తున్నదో ఇది తెలియజేస్తుంది.

రాబోయే అమెరికన్‌ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వానికి ప్రయత్నిస్తున్న బెర్నీ శాండర్స్‌ తనకుతాను 'సోషలిస్టు'నని ప్రకటించుకున్నాడు. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఉచితవిద్య అందించేందుకు ఆర్థిక లావాదేవీలపై పన్ను విధించాలని ఆయన ప్రతిపాదిస్తున్నాడు. డెమోక్రాటిక్‌ పార్టీలో జరుగుతున్న చర్చ ఈసారి వాల్‌స్ట్రీట్‌ (అమెరికాలో ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకులు కేంద్రీకృతమైన ప్రాంతం పేరు)ను నియంత్రించటంపై దృష్టి సారించింది. దానితో వాల్‌ స్ట్రీట్‌ను ప్రత్యక్షంగా ప్రభావితంచేసే శాండర్స్‌ ప్రతిపాదనకు ఎనలేని ప్రాధాన్యత వచ్చింది.

'ద్రవ్య సరుకుల(ఫైనాన్షియల్‌ ఎస్సెట్స్‌)'పై ఆర్థిక లావాదేవీల పన్నువేయటమనేది అమ్మకం పన్ను వేయటంలాంటిదే. బ్యాంకింగ్‌ సేవల నుంచి విదేశీ మారకద్రవ్య లావాదేవీలదాకా, ఈక్విటీ నుంచి డెరివేటివ్స్‌, కమ్మోడిటి 'ప్యూచర్స్‌' లావాదేవీలదాకా ఆర్థిక లావాదేవీల పన్ను పరిధిలోకి వస్తాయి. వీటిలో స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు కరెన్సీ లావాదేవీలతో సహా మిగిలిన లావాదేవీలకంటే భిన్నమైనవి. చట్టా కార్యకలాపాలను పరిమితం చేయటానికి ఈ ఇతర లావాదేవీలపై పన్ను విధించాలని గతంలో ప్రముఖ ఆర్థికవేత్త జేమ్స్‌ టోబిన్‌ సూచించాడు. ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచగలిగే అవకాశమున్నందున ఈ సూచన ప్రస్తుతం అందరి దృష్టీ ఆకర్షిస్తున్నది. దీనిని గురించే నేను ఇకపై ప్రస్తావించదలిచాను.

ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వ్యయం చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో వున్నది. అయితే కేవలం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచగలిగే శక్తి వుండటంవల్లనే ఆర్థిక లావాదేవీల పన్నును విధించటాన్ని సమర్థించటం లేదు. స్టాక్‌ మార్కెట్‌లో వస్తున్న విపరీతమైన ఒడిదుడుకులను తగ్గించటానికి, అనేక స్వల్ప కాల ట్రేడ్స్‌ను తొలగించటానికి కూడా ఈ పన్ను అవసరం వుంటుంది. ఆ విధంగా సమకాలీన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో వాస్తవ ఆర్థిక వ్యవస్థ కంటే సాపేక్షంగా కృత్రిమంగా ఎన్నోరెట్లు పెరుగుతూవున్న ద్రవ్యరంగ పరిమాణాన్ని కుదించటం కూడా దీనితో సాధ్యపడుతుంది. అలా కృత్రిమంగా అతిగా పెంచబడిన ద్రవ్య రంగం వాస్తవ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుకు గుదిబండలా తయారవుతుందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎమ్‌ఎఫ్‌) కూడా భావిస్తున్నది. దీని పరిమాణాన్ని సాపేక్షంగా కుదించటం అవసరమని ఈ సంస్థ కోరుతున్నది. ఈ లక్ష్యం సాధించటానికి ఆర్థిక లావాదేవీలపై పన్ను విధించటం ఒక సాధనంగా వుంటుంది.

పన్ను ప్రతిపాదన వ్యతిరేకిస్తున్న కార్పొరేట్‌-ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం

ఊహించినట్టుగానే అలాంటి పన్ను ప్రతిపాదనను ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్‌-ద్రవ్య పెట్టుబడిదారీ వర్గాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. భారతదేశంలో ఈక్విటీ లావాదేవీలపైన నామమాత్ర పన్ను విధిస్తున్నారు. అయితే దానిని కూడా ఇంకా తగ్గించాలనే డిమాండ్‌ ముందుకొస్తున్నది. అమెరికాలో కూడా కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులు తప్పుడు లెక్కలతో అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అలాంటి పన్నుతో ఎంతగా దెబ్బతింటున్నదో వివరిస్తూ శాండర్స్‌ ప్రతిపాదనను ఖండిస్తున్నారు.

అలాంటి అతిశయోక్తులను పక్కనబెట్టి ఆర్థిక లావాదేవీలపై పన్ను వేయటాన్ని వ్యతిరేకించేవారి వాదన ప్రధానంగా ఇలా వుంటుంది. పన్నువల్ల ఆదాయం పెరుగుతుందని చేసే వాదన 'సుస్థిర పరిచే ప్రభావం' వుంటుందనే వాదనతో విభేదిస్తుంది. ఒకవేళ చట్టా వ్యాపారాన్ని వాస్తవంలో పన్ను పరిమితం చేయగలిగి, వ్యవస్థలో స్థిరత్వాన్ని తేగలిగినప్పుడు ఆదాయం అంతగా రాదు. దీనికి కారణం ఇప్పుడున్న లావాదేవీల సంఖ్య పరిమితం చేయటంద్వారానే స్థిరత్వం వస్తుంది. అయితే లావాదేవీల సంఖ్య తగ్గించటమే జరిగితే దానికి అనుగుణంగా పన్ను పునాది కూడా తగ్గుతుంది. అలాగే పన్నుతో వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ పన్ను ప్రతిపాదించేవారు దానితోవచ్చే లాభాలను ఎక్కువచేసి చెబుతున్నారు. ఒక్కసారి ఈ వాస్తవాన్ని గుర్తిస్తే ఈ పన్నును వారు చెబుతున్న లాభాలు ఎంత పరిమితంగా వుంటాయో గమనించగలుగుతాం. ఆ తరువాత పెట్టుబడిదారుల తపన(జంతు ఉరవడి లేక యానిమల్‌ స్పిరిట్స్‌)పై దుష్ప్రభావం వుంటుంది గనుక అలాంటి పన్ను వేయటం అర్థరహితమైన చర్యగా మిగిలిపోతుంది.

ఈ వాదన సరుకులపైవేసే పరోక్ష పన్నుల విషయంలో చేసే వాదనను పోలి వున్నది. అదేమంటే ఒకవేళ ఒక సరుకు వినియోగాన్ని తగ్గించటం కోసం పరోక్షపన్ను రేటు పెంచి ఆపైన అదే సమయంలో దాన్ని ఆదాయం పెంచే చర్యగా సమర్థించటం సాధ్యపడదు.

అయితే ఈ వాదన ఒక కుతర్కం ఆధారంగా జరుగుతున్నది. అమెరికాకు సంబంధించిన అంచనాలాగా ఫైనాన్షియల్‌ కమ్మోడిటీస్‌ డిమాండ్‌కి చెందిన ధర వ్యాకోచంలో ఐక్యత వుంటుంది. అంటే ఒకవేళ ఫైనాన్షియల్‌ లావాదేవీల వ్యయం రెండు రెట్లయితే మొత్తం లావాదేవీల విలువ మారకుండా లావాదేవీల పరిమాణం సగం అవుతుంది. ఉదాహరణకు ఆర్థిక లావాదేవీల పన్నువల్ల ఆర్థిక లావాదేవీల వ్యయం రెట్టింపవుతుందని అనుకుందాం. అంటే గతంలో ఒక్కోటి 100 రూపాయల విలువగల 100ఫైనాన్షియల్‌ ఆస్తి యూనిట్లను అమ్మేవారనుకుంటే మొత్తం అమ్మకాల విలువ 10,000 రూపాయలవుతుంది. ఇప్పుడు పన్ను పెరగటంవల్ల ఒక్కో ఆస్తి విలువలో పెరుగుదల 200 ఉంటుంది. దానితో లావాదేవీలు జరిగిన ఆస్తుల పరిమాణం 50కి తగ్గుతుంది. అయినప్పటికీ మొత్తం అమ్మకాల విలువ అంతకుముందు వున్నట్టుగానే 10,000రూపాయలుంటుంది. అయితే ఈ నూతన పరిస్థితిలో కూడా పన్నుపై ఆదాయం 5,000 రూపాయలు వస్తుంది(50సార్లు 100రూపాయల చొప్పున). అంటే లావాదేవీల పరిమాణం గణనీయంగా తగ్గినప్పటికీ పన్నుపై వస్తున్న ఆదాయం పెరిగింది.

నేను ఇంతకుముందు చెప్పిన కుతర్కం మూలాలు ఒక గందరగోళంలో వున్నాయి. అదేమంటే పన్ను రేటుకు సంబంధించిన డిమాండ్‌ వ్యాకోచానికి, ఒక ఫైనాన్షియల్‌ కమ్మోడిటీ ధరకు సంబంధించిన డిమాండ్‌ వ్యాకోచానికి మధ్యగల తేడా గుర్తించక పోవటంవల్ల ఈ గందరగోళం ఏర్పడింది. రెండవది యూనిటి అయినప్పటికీ మొదటిది కాదు. ఎందుకంటే పన్ను ఒకేఒక భాగం. అదీ మొత్తం ధరలో పన్ను ఒక చిన్న భాగం మాత్రమే. కాబట్టి ఒక పన్నువల్ల పెరిగిన ధరతో పడిపోయే డిమాండ్‌ పరిమాణం సమ నిష్పత్తికి అనుగుణంగా వుంటుంది. పెరిగిన పన్నురేటుతో పోల్చినప్పుడు అది సమ నిష్పత్తికంటే తక్కువగా వుంటుంది. అందుకనే పన్ను రేటు పెరిగినప్పుడు పన్నుతోవచ్చే ఆదాయం పరిమాణం పెరుగుతుంది.

దీనితో అర్థమయ్యేదేమంటే ఆర్థిక లావాదేవీలపై పన్ను వేయటాన్ని సహేతుకమైన కారణాలతో ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం వ్యతిరేకించటంలేదు. ఏ కారణాలతో అయితే కరెన్సీ లావాదేవీల పన్నును లేక టోబిన్‌ పన్నును వ్యతిరేకించిందో అవే కారణాలతో దీనిని కూడా వ్యతిరేకిస్తున్నది. ఆ కారణాలు చట్టా వ్యాపారంలో తనకున్న ఆసక్తిలో వున్నాయి. ఈ పన్నులన్నీ ఆ చట్టా వ్యాపారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో వేసేవే.

'ఎంటర్‌ప్రైస్‌'కి, 'చట్టా వ్యాపారానికి' మధ్య తేడా గ్రహించగలిగే శక్తి అంతర్లీనంగా పెట్టుబడిదారీ మార్కెట్‌కు వుండదని ప్రముఖ బ్రిటిష్‌ ఆర్థికవేత్త జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ వాదించాడు. ఒక ఆస్తిని 'ఉంచుకునేందుకు' కొనటానికి, తరువాత కాలంలో అమ్మటానికి కొనటానికి మధ్యగల తేడాగా ఆయన నిర్వచించాడు. ఈ అశక్తతతే మార్కెట్‌ వైఫల్యంగా వుంటుందని కీన్స్‌ అన్నాడు. ఆర్థిక కార్యకలాపాలపై చట్టా ప్రభావాన్ని తగ్గించే చర్యలను ఆయన సమర్థించాడు. అయితే సమస్యేమిటంటే ద్రవ్య పెట్టుబడికి చట్టా వ్యాపారంపై ఆసక్తి వుంటుంది. వాస్తవ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే చట్టా వ్యాపారంపై వేసే కళ్లేలు స్వాభావికంగా చట్టా వ్యాపారానికి కళ్లేలుగా మారతాయి కాబట్టి అలాంటి చర్యలను ఏకంగా ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకిస్తుంది. ఆర్థిక లావాదేవీల పన్ను వేయటాన్ని ఇది ఎందుకు వ్యతిరేకిస్తున్నదో దీనినిబట్టి మనకు అర్థమవుతున్నది.

సంక్షేమ వ్యయానికి ఉపయోగపడుతుంది
భారతదేశంలో ఈ పన్నుపై వచ్చే ఆదాయం సంక్షేమ వ్యయానికి ఉపయోగపడుతుందని గతంలో ఒకసారి రాశాను. ఆ వాదన ఒకసారి గుర్తు చేసుకుందాం. గతంలో ప్రణాళికా సంఘంచే నియమించబడిన ఒక నిష్ణాతుల కమిటీని అనుసరించి భారతదేశంలో ప్రజలందరికీ సార్వజనీన ఆరోగ్య సంరక్షణ అందించటానికి స్థూల జాతీయోత్పత్తిలో 1.8శాతం అదనపు నిధులు అవసరమౌతాయి. గత కొద్ది కాలంగా భారతదేశంలోని స్టాక్‌ మార్కెట్‌లో ప్రతి దినం లావాదేవీల విలువ 2లక్షల కోట్లు. అంటే స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలపై 0.37శాతం పన్ను విధిస్తే భారతదేశంలో సార్వజనీన ఆరోగ్య సంరక్షణ అందించటానికి సరిపోతుంది. ఇది జేమ్స్‌ టోబిన్‌ సూచించిన 0.5శాతం కంటే తక్కువ.

అమెరికాలో శాండర్స్‌ సూచించినట్టుగానే భారతదేశంలో కూడా కోట్లాది పేదలకు అత్యంతగా ఉపయోగపడే ఈ ప్రణాళికను కార్పొరేట్‌-ఫైనాన్షియల్‌ పెట్టుబడిదారీ వర్గం వ్యతిరేకిస్తున్నది. ఇది చాలా తేలిగ్గా ఊహించగలిగే విషయమే. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజలకు మేలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చెందిన సంస్కరణలను 'శాంతియుతం'గా రద్దు చేయగలుగుతున్నప్పుడు వ్యవస్థను అధిగమించటం (ట్రాన్‌సెండింగ్‌) అనే అవసరం ఊసే వుండదు. ప్రస్తుతం ఐరోపా ఖండంలో అస్తిత్వంలోగల సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి 'పొదుపు చర్యల'ను ప్రవేశపెడుతున్నట్టుగా పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించేవారు దానిని 'సంక్షేమ పెట్టుబడిదారీ వ్యవస్థ'గా మార్చాలనే పగటికలను కంటున్న స్థితిలో పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించవలసిన అవసరం ఏర్పడుతుంది.
ఉచిత ప్రభుత్వ విద్యను అందించటానికి ఆర్థిక లావాదేవీలపై పన్ను విధించాలని శాండర్స్‌ చేస్తున్న డిమాండ్‌వంటి వాటికి చాలా ప్రాధాన్యత వుంది. ఈ డిమాండ్‌లో ఏ కొంచెం వాస్తవ రూపం దాల్చినా చాలా మేలు జరుగుతుంది. దీనిలో ఎంతయితే వాస్తవ రూపం దాల్చదో అంతవరకు అది లెనినిస్టు అర్థంలో 'పరివర్తనకాల డిమాండ్‌' పాత్రను పోషిస్తుంది. దానితో ఒకవైపు కొందరు భోగభాగ్యాలలో ఓలలాడుతుండగా మరోవైపు దుర్భర దారిద్య్రంలో, అజ్ఞానంలో, అనారోగ్యంలో తాము మగ్గటానికి గల అసలు కారణాన్ని ప్రజలు గ్రహించగలుగుతారు.

అనువాదం: నెల్లూరు నరసింహారావు

Sunday, January 31, 2016

పునః పంపిణీతోనే వృద్ధి

- ప్రభాత్‌ పట్నాయక్‌

నేడు అభివృద్ధిని గురించి మౌలికంగా పొసగని రెండు దృక్పథాలు పరస్పరం పోటీపడుతున్నాయి. మొద టిది నయా ఉదారవాద దృక్పథం. దీని ప్రకారం అభివృద్ధి జరగాలంటే స్థూల జాతీయోత్పత్తి వేగంగా వృద్ధి చెందాలి. ఒకవేళ అలాంటి వృద్ధి 'ఊట సిద్ధాంతం'తో స్వయంచా లకంగా పేదల పరిస్థితిని మెరుగుపర్చలేకపోతే ఆ వృద్ధి వల్ల బాగా పెరిగిన ప్రభుత్వ ఆదాయా న్ని వారి సంక్షేమం కోసం వినియోగించ వచ్చు. అలాంటి అత్యధిక వృద్ధిని సాధించా లంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు కావాలి. కాబట్టి ఆ స్థాయిలో పెట్టుబడులను సమీకరిం చాలనే లక్ష్యం ప్రభుత్వ విధానాలకుండాలి. ఈ విధానాలు అలాంటి పెట్టుబడులను పెట్టే దేశీయ కార్పొరేట్‌ కంపెనీ లకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు 'ప్రోత్సాహకాల'ను ఇచ్చేలా ఉండాలి. దీనినిబట్టి అర్థమయ్యేదేమంటే కావలసి నంత భూమి లేకపోవటం, అనేక రకాల నిర్ణయాలు తీసుకో వటంలో అధికారులు చేసే అనవసర జాప్యం, కార్మికులను తొలగించటానికి కావలసిన 'స్వేచ్ఛ' లేకపోవటం వంటి అడ్డంకులను అలాంటి పెట్టుబడులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడకుండా చూడాలి. 'అభివృద్ధి ప్రాజెక్టులకు' రైతుల భూమిని గుంచుకునేందుకు మోడీ ప్రభుత్వం విడుదల చేసిన భూ సేకరణ ఆర్డినెన్స్‌, 'లేబర్‌ మార్కెట్‌ సరళత్వం' కోసం కార్మిక చట్టాలకు ప్రతిపా దించిన సవరణలు, గత కొంతకాలంగా భారతదేశ బడ్జెట్లలో కార్పొరేట్‌ కంపెనీలకు ఇచ్చే పన్ను రాయితీలు మొదలైనవన్నీ ఈ వ్యూహంలో భాగంగా అందజేయబడుతున్నాయి.

రెండవది వామపక్ష దృక్పథం. అది ఇలా ఉంటుంది. ఈ రాయితీలతో కార్పొరేట్‌ కంపెనీలు, బహుళ జాతి కంపెనీలు పెంచిన వృద్ధి ఫలితం దిగువ వర్గాల ప్రజలకు ఏమాత్రం 'అందక'పోగా పెరిగిన ప్రభుత్వ ఆదాయం పేదల కోసం వ్యయం చేయకుండా వృద్ధిని అదే స్థాయిలో కొనసా గించటానికి అవే కంపెనీలకు పన్ను రాయితీల రూపంలో ఇస్తున్నారు. మరోలా చెప్పాలంటే అలాంటి వృద్ధి పేదల స్థితి గతులను మెరుగుపర్చాలనే లక్ష్యం కోసం సాధనంగా ఉండ టానికి బదులు వృద్ధి తనకు తానే ఒక లక్ష్యంగా మారుతోంది. అంతేగాక వీరికి ప్రోత్సాహకాలు ఇవ్వటంవల్ల విత్త వనరులు తరిగిపోవటమేకాక రైతులు, చిన్న ఉత్పత్తిదారులు భూమిని కోల్పోయి ఒత్తిడికి లోనవుతారు(దీనినే 'పెట్టుబడి యొక్క ఆదిమ మూలధన సంచయం' ప్రక్రియ అంటారు). కార్మికుల హక్కులకు పరిమితులు విధించబడతాయి. దానితో వారి నిజ వేతనాలు తగ్గుతాయి. ఇవన్నీ కష్టజీవుల జీవన స్థితిగతులను మరింతగా దిగజారుస్తాయి. కాబట్టి ఈ వృద్ధితో పేదరికం తగ్గకపోగా పెరుగుతుంది.
అంతేకాక కార్పొరేట్‌ కంపెనీలకు, బహుళజాతి కంపె నీలకు ఇస్తున్న రాయితీలను పెంచటం వల్ల అలాంటి వృద్ధి కొనసాగబోదు. ఎందుకంటే అది 'బుడగల'పై ఆధారపడేది. ఎగుమతులను పెంచుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా అలాంటి బుడగలను సృష్టించిన అతిపెద్ద పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను కలిగివున్న అమెరికా తన ఆర్థిక వ్యవస్థలో కూడా అలాంటి బుడగలను సృష్టించటంపైనే ఆధారపడు తున్నది. దీనికి తోడు దేశీయ ఆర్థిక వ్యవస్థలో ధనికులు చేసే అత్యధిక వ్యయం ఆధారంగా ఈ బుడగలు ఏర్పడతాయి. ఇప్పటిలాగా అలాంటి 'బుడగలు' పేలిపోయిన తరువాత కాలాలలో పేదలకు వ్యతిరేకమైన ఈ వ్యూహంతో వృద్ధి జరగదు. అయితే ఈ వ్యూహం పరిధిలో అలా వృద్ధి జరగక పోవటం వల్ల పేదల పరిస్థితి మరింతగా క్షీణిస్తుంది. ఎందు కంటే వృద్ధిని ఉత్తేజపరిచే ప్రయత్నంలో భాగంగా పేదలకు కేటాయించవలసిన నిధులను కార్పొరేట్‌ కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు నిరర్థకంగా మరిన్ని రాయితీల రూపంలో ఇస్తారు.

పేదల స్థితి మెరుగుదలకు ప్రభుత్వ జోక్యం అవసరం కాబట్టి పేదల స్థితి మెరుగుపడటానికి ప్రభుత్వం తక్షణమే ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలని ఈ రెండవ దృక్పథం కోరుతుంది. దీనితో పేదల స్థితి మెరుగుపడట మేకాక తత్ఫలితంగా వారి కొనుగోలు శక్తి పెరిగి దేశీయ మార్కెట్‌ విస్తృతమౌతుంది. అలా పెరిగిన డిమాండ్‌ను అందుకోవటానికి కార్పొరేట్‌ కంపెనీలు, బహుళజాతి కంపెనీలే కాక చిన్నచిన్న వ్యాపారులు కూడా పెట్టుబడులు పెడతారు. పర్యవసానంగా ఏర్పడే 'ద్వితీయ, ఉన్నత శ్రేణి ప్రభావాల' వల్ల ఉద్యోగిత పెరిగి దేశీయ మార్కెట్‌ మరింతగా విస్తృతమవుతుంది. ఇది పేదరికాన్ని మరింతగా తగ్గిస్తుంది. మరోలా చెప్పాలంటే కష్టజీవుల జీవన ప్రమాణా లను ప్రభావితంచేసే, బుడగలు అవసరంలేని వృద్ధిని పెంపొందించే, మరింతగా సమానత్వాన్ని పెంపొందించే, పేదరికాన్ని నిర్మూలించగలిగే పునఃపంపిణీ వ్యూహంతో వృద్ధిని సాధించాలని, ఇది స్వాతంత్య్ర పోరాట ఆకాంక్ష అయిన స్వేచ్ఛా భారతావనికి అనుగుణంగా ఉంటుందని ఈ రెండవ దృక్పథం భావిస్తుంది. ఈ రెండవ దృక్పథాన్ని వక్రంగా చిత్రించటానికి నయా ఉదారవాద ప్రతినిధులు అన్ని విధాలుగా ప్రయత్నించటంలో ఆశ్చర్యం లేదు. సమానత్వాన్ని పెంపొం దించే ఆదాయాల, ఆస్తుల పునఃపంపిణీ వృద్ధికి వ్యతిరేకమైన దన్నట్టుగా వారు చిత్రిస్తారు. ఆ తరువాత సమాజంలో అందుబాటులో ఉండే అరకొర వనరులు పేదరికాన్ని పెంచే విగా ఉంటాయికాని తొలగించేవిగా ఉండవని వారు వాది స్తారు. వృద్ధి, పునఃపంపిణీలు పరస్పర విరుద్ధాలైనట్లు 'వృద్ధి కావాలా, పునఃపంపిణీ కావాలా' అనే విధంగా వారు మాట్లాడతారు. పునఃపంపిణీపైనే శ్రద్ధ చూపే వామపక్ష వ్యూహం వృద్ధిని మందగింపజేసి ప్రజలకు పంచే జాతీయస్థాయి మిగులును శాశ్వతంగా కుదింపజేస్తుందని వారు చెబుతారు. అదే వృద్ధిని ప్రాథమ్యంగా ఎంచుకునే తమ వ్యూహం వల్ల ప్రజలకు పంచే మిగులు పరిమాణం ఎక్కువగా ఉంటుందని, అది రేపు అందరికీ అందుబాటులోకి వస్తుందని వారు చెబుతారు.

అయితే ఇది వామపక్ష దృక్పథాన్ని పూర్తిగా వక్రీకరిం చటమే అవుతుంది. వృద్ధికి, పునఃపంపిణీకి మధ్య ద్వంద్వ విభజన ఉన్నదని ఈ దృక్పథం అంగీకరించదు. అంతేకాక పునఃపంపిణీ చర్యలను ఎంత వేగంగా, ఎంత సుస్థిరంగా, ఎంత కచ్చితంగా ప్రవేశపెడితే వృద్ధి అంతగా పెరుగు తుందని వామపక్ష దృక్పథం చెబుతుంది. అంగీకర యోగ్యమైనది కాకపోయినా ఆధిపత్యంలోకి వచ్చిన నయా ఉదారవాద దృక్పథం సామాజిక జీవితంలోని ఒక అస్తిత్వా నికి చెందిన ఆధిపత్యపు సామాన్య వ్యక్తీకరణ మాత్రమే. ఆ అస్తిత్వం పేరే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి. దీనితో దేశంలోని కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ బూర్జువా వర్గం మమేక మయింది. భారతదేశంలో జాతీయ స్థాయిలో వామపక్ష దృక్పథం ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. అయితే ప్రయోగశాలలో మాదిరిగా భారతదేశంలోని రెండు వేరు వేరు రాష్ట్రాలలో ఈ రెండు వేరువేరు అభివృద్ధి నమూనా లను ఆచరిస్తున్నారు. ఈ అభివృద్ధి నమూనాలే నయా ఉదారవాదం, వామపక్ష దృక్పథం. వీటిని ఆచరిస్తున్న రెండు రాష్ట్రాలు గుజరాత్‌, కేరళ. ఈ రెండు రాష్ట్రాల అనుభవాలను పోల్చిచూస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన వాస్తవాన్ని మర్చిపో కూడదు. అదేమంటే గుజరాత్‌ అనుసరిస్తున్న వ్యూహానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం, సమర్థన ఉండటమే కాకుండా అది జాతీయ స్థాయిలో అమలవుతున్నది. అదే కేరళ వ్యూహం విషయానికి వస్తే అది కేంద్ర ప్రభుత్వ ప్రాథమ్యానికి సమాంతరంగా ఉండి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నది. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగినంతగా వనరుల బదిలీ కాకపోవటం, దారిద్య్ర రేఖకు దిగువ, ఎగువ తేడాలతో ఆహార భద్రతకు కావలసిన ఆహార ధాన్యాలను కేంద్రం కేటాయించక పోవటం, ఇతర ఒత్తిడుల రూపంలో ఈ అడ్డం కులున్నాయి. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ వ్యూహాన్ని పూర్తి స్థాయిలో అమలు చెయ్యటానికి ఏ మాత్రం అనుమతిం చటంలేదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మొత్తంగా నయా ఉదారవాదానికి దాస్యం చేస్తున్నది గనుక. అయినప్పటికీ కేరళ, గుజరాత్‌లను పోల్చటం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఉపయుక్తమైన పోలిక
2004-05, 2011-12ల మధ్య కాలంలో భారతదేశం అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. అంతకు ముందు వృద్ధి తక్కువగా ఉంది. ఈ కాలంలో బడా వ్యాపార సంస్థలకు, బహుళజాతి కంపెనీలకు ఎటువంటి ప్రత్యేక రాయితీలను ఇవ్వనప్పటికీ, ఆదిమ మూలధన సంచయానికి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వనప్పటికీ కేరళ వార్షిక వాస్తవ జిడిపి వృద్ధి రేటు గుజరాత్‌తో దాదాపు సమానంగా 7.91 శాతం ఉన్నది. ఆ కాలంలో గుజరాత్‌ వృద్ధి రేటు 8.19 శాతం. అయితే మానవాభివృద్ధి సూచికలకు సంబంధించి కేరళ భారతదేశంలోని రాష్ట్రాలన్నిటి కంటే అగ్రస్థానంలో ఉన్నది. కానీ ఇదే కాలంలో వాస్తవ తలసరి ఆదాయంలో కేరళతో పోల్చినప్పుడు గుజరాత్‌ ఎటువంటి వృద్ధినీ సాధించలేదు. మానవాభివృద్ధి సూచికలకు సంబంధించి రాష్ట్రాల ర్యాంకింగులో దాని స్థానం దిగజారింది. 1981లో గుజరాత్‌ నాలుగవ స్థానంలో ఉన్నది. 2001లో అది ఏడవ స్థానానికి, 2008లో ఎనిమిదవ స్థానానికి దిగజారింది. 2000-2008 మధ్యకాలంలో మానవ అభివృద్ధి సూచిక పెరుగుదలకు సంబంధించి భారతదేశంలోని రాష్ట్రాలలో గుజరాత్‌ స్థానం 18! మానవ అభివృద్ధి సూచికలో తలసరి ఆదాయానికి గణనీయమైన ప్రాధాన్యత ఉంటుంది గనుక దానిలోని ఇతర అంశాల విషయంలో కూడా గుజరాత్‌ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. అయితే ఒక సాధారణ నయా ఉదారవాద చట్రంలో వివిధ రాష్ట్రాలను పోల్చి చూచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జాతీయ మార్కెట్‌ కోసం ఉద్దేశింపబడిన పెద్దపెద్ద ప్రాజక్టుల కోసం కావలసిన పెట్టుబడులను సమీకరించే ప్రయత్నం రాష్ట్రాలు చేయ కూడదని పునఃపంపిణి వ్యూహం చెప్పదు. జాతీయ స్థాయిలో నయా ఉదారవాద వ్యూహం అమలవుతున్న స్థితిలో ఇతర ప్రత్యామ్నాయాలేవీ అందుబాటులో ఉండవు. అయితే అది ఆదిమ మూలధన సంచయం అవసరాన్ని రైతుల, చిన్న ఉత్పత్తిదారుల మీద రుద్దేదిగా ఉండకూడదు. అలాగే ప్రభుత్వ ఆధీనంలోని కొద్దిపాటి విత్త వనరులను హరించేదిగా కూడా ఉండకూడదు. ఎందుకంటే దీనితో ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం చేసే కార్యక్రమాలు కుంటుబడతాయి. ఆ విధంగా జాతీయ స్థాయిలో పునః పంపిణీ వ్యూహాన్ని అమలుచేసేందుకు అవకాశం ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమంటే అందుకు కావలసిన అనుబంధ చర్యలను కూడా తీసుకోవాలి. పెట్టుబడులు ఎప్పుడనుకుంటే అప్పుడు దేశం వీడిపోకుండా నియంత్రణలు విధించటం, విదేశీమారకపు చెల్లింపుల శేషంలో సమతౌల్యం ఉండేలా చూడటం కోసం వాణిజ్యాన్ని నియంత్రించటం వంటి చర్యలు ఈ వ్యూహానికి అనుబం ధంగా ఉంటాయి. ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకో కుండా అభివృద్ధిచెందిన దేశాలు చూస్తాయి. ఎందుకంటే ఈ చర్యల సారం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం నుంచి జాతి రాజ్య స్వంతంత్రతను పునఃస్థాపించటంగా ఉంటుంది గనుక. అయితే నయా ఉదారవాద వ్యూహం కంటే పునఃపంపిణీ వ్యూహం మేలైనదనే వాస్తవాన్ని వామపక్షం ప్రజలకు అర్థమయ్యేలా చూడాలి. ఎందుకంటే నయా ఉదారవాదం తనకు ప్రత్యామ్నాయం లేనేలేదని నిత్యం వామపక్షంపై దాడిజేస్తుంటుంది గనుక.

ఆర్థిక మాంద్యం, అస్థిరత వెనుక..?


అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ బ్యాంకులు గత కొన్నేళ్లుగా డాలర్లను యథేచ్ఛగా ముద్రించిన ఫలితమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం, తీవ్ర అస్థిరతకు దారితీసింది. ఇదే ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనానికి కూడా కారణమైందని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు స్టీఫెన్‌ లెండ్‌మాన్‌ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక ఇంజన్‌లా వుంటున్న చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో షేర్‌ మార్కెట్లలో కల్లోలం మరింత తీవ్రరూపం దాల్చిందన్నారు. ఈక్విటీ మార్కెట్ల పతనం సమీప భవిష్యత్తుతో పాటు దీర్ఘకాలికంగా కూడా ఆర్థికప్రగతిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన విశ్లేషించారు.. ఇటువంటి బుల్‌ మార్కెట్‌ తన జీవితంలో మరోసారి చూడబోనని ప్రముఖ ఆర్థికవేత్త మార్క్‌ఫేబర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దుస్థితికి దర్పణం పడుతున్నాయి. ప్రముఖ హెడ్జ్‌ ఫండ్‌ ఇన్వెస్టర్‌ రే డాలియో మాట్లాడుతూ 50-75 ఏళ్ల పాటు సాగే రుణ విష వలయం చివరిలో మరో స్వల్పకాలిక వలయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పడిందని, ఇది 8 నుంచి 10 ఏళ్ల వరకు కొనసాగే అవకాశముందని తెలిపారు. దావోస్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బద్ధ కమ్యూనిస్టు వ్యతిరేకి జార్జి సొరోస్‌ మాట్లాడుతూ, చైనా తన ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటుపై ప్రధానంగా దృష్టి సారించిందని, ఇదే ప్రస్తుత సంక్షోభానికి కారణమని చెప్పారు. ఇది 2008 నాటి పరిస్థితిని గుర్తు చేస్తోందని లెండ్‌మాన్‌ వ్యాఖ్యానించారు.. ఫైనాన్షియల్‌ మార్కెట్లకు ఇదొక తీవ్రమైన సవాల్‌ విసురుతోందన్నారు. ముడి చమురు ధరల పతనం గురించి ప్రస్తావిస్తూ వీటి ధరలు పడిపోవడానికి అధిక సరఫరాతో బాటు డిమాండ్‌ పడి పోవడం ఒక ముఖ్య కారణమన్నారు. చమురు దేశాల కూటమి ఒపెక్‌ ముడి చమురు ఉత్పత్తిని 5 శాతం తగ్గించబోతోందన్న పుకార్లు రావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. ఒపెక్‌ సమావేశ అజెండాలో ముడిచమురు ఉత్పత్తి కుదింపు అంశం అసలు లేనే లేదని ఒపెక్‌ దేశమైన సౌదీ అరేబియా స్పష్టం చేసింది. ఆరునూరైనా ప్రస్తుత స్థాయిలోనే చమురు ఉత్పత్తిని కొనసాగిస్తామని అది పేర్కొంది. రష్యన్‌ వార్తా సంస్థ ఇటార్‌ టాస్‌ కథనం మరోలా వుంది. ముడి చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రష్యా ఇంధన శాఖ మంత్రి అలెగ్జాండర్‌ నొవాక్‌ను ఉటంకిస్తూ ఆ వార్తా సంస్థ తెలియజేసింది. దీనిపై ఒపెక్‌ కూటమి తన సభ్య దేశాలతోను, సభ్యత్వయేతర దేశాలతో కలసి త్వరలో ఒక సమావేశాన్ని నిర్వహించేందుకు యత్నిస్తున్నదని ఇటార్‌ టాస్‌ తెలిపింది. కొన్ని దేశాలు ఈ సమావేశాన్ని నిర్వహించాలని కోరుతున్నాయని, అటువంటి సమావేశం ఏది జరిగినా దానికి తాము హాజరవుతామని రష్యా ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నట్లు అది వివరించింది. కాగా, ఒపెక్‌ గత సమావేశంలో ముడి చమురు ఉత్పత్తిని 5శాతం మేర తగ్గించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే ఒపెక్‌ దానిని తిరస్కరించింది. రష్యాకే చెందిన పేరు తెలపడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, వచ్చే ఒపెక్‌ సమావేశంలో చమురు ఉత్పత్తి తగ్గింపు ప్రతిపాదన చర్చకు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

రష్యాపై పోరుకు స్వస్తి పలికిన జార్జ్‌ సోరోస్‌
జీవితాంతం కమ్యూనిజాన్ని, రష్యాను వ్యతిరేకించిన జార్జ్‌సోరోస్‌ ఎట్టకేలకు తన పోరును స్వస్తి చెబుతున్నట్ల్లు ప్రకటించారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఐరోపా దేశాలతో పాటు ఒకప్పటి తన బద్ధ శత్రువు రష్యాకు కూడా అమెరికా ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం వుందన్నారు. అయితే రష్యా వ్యతిరేక పోరును పూర్తిగా విడిచిపెట్టారా లేక సస్పెండ్‌ చేశారా? అన్న విషయం తెలియరాలేదు.

(ప్రజా శక్తి 1.2.2016 నుండి)

Tuesday, January 5, 2016

వెలుగు జాడ మన గురజాడ!!
-మహి

వెలుగు జాడ మన గురజాడ!!
యుగకర్త.. నవయుగ వైతాళికుడు.. ఆంధ్ర సాహిత్యలోకానికి అరుణోదయం.. మనందరి గురజాడ శత వర్ధంతి నేడు!
సాహిత్యంలో కొత్తపాతల మేలు కలయికగా తన రచనల వెలుగుతో మానవత్వపు పరిమళాలు చల్లుతూ తెలుగు జాతిని నడిపించిన దార్శనికుడాయన..
దేశమంటే మట్టి కాదు, మనుష్యులంటూ సొంతలాభం కొంతమానుకుని పొరుగు వాడికి తోడు పడమని కొంచం మెత్తగా అయినా చెళ్ళుమనిపించేటట్లే చెప్పాడు.
జాతి బంధములన్న గొలుసులు జారిపోయి, మతాలన్నీ మాసిపోయి, వర్ణ భేదాలు కల్లలై, ఎల్లలోకము ఒక్క ఇల్లుగా చేసుకుని జ్ఞానమొక్కటి నిలచి వెలగాలని ఆశ పడ్డాడు!!
తెలుగు కవితను ముత్యాల సరాలతో అలంకరించి కొయ్య బొమ్మలే మెచ్చు కళ్ళకు..కోమలులు సౌరెక్కునా... అని మనల్ని నిలదీశాడు..
కవిత్వం అంటే వేరే ఏది కాదనీ... ప్రజల భాషే అనీ "దిద్దుబాటు" చేసాడు!!
మంచి అన్నది మాల అయితే ఆ మాల నేనవుతా అంటూ సగర్వంగా ప్రకటించి సర్వ మానవ హితుడయ్యాడు!!
సమాజంలో కుళ్ళును, మత మౌఢ్యాన్ని, కుల దురహంకారాన్ని, గ్రాంధిక భాషా చాందసత్వాన్ని, స్త్రీల పట్ల అణచివేతను తీవ్రంగా నిరసిస్తూ తన కలాన్ని కత్తిగా మలచి అభివృద్ధి నిరోధకత్వంపై పోరాడిన ధీరుడాయన!!
తెలుగు సాహితీ జగత్తులో ఎప్పటికీ వెలుగులీనే ఓ కవి భాస్కరుడా...

మీకిదే మా నివాళి!!!

Sunday, January 3, 2016


హేమంతం....
 'నవతెలంగాణ' సంపాదకీయం  
హేమంతం...! హిమంలా.. సుమంలా.. సుందరం.. సుమధురం... చల్లని ఆకాశం. చుట్టూ సతత హరితం. పచ్చని ఆకుల నిగారింపు. సుతి మెత్తని సవ్వడి. తెరలు తెరలుగా తెమ్మెర మీటినట్టే వుంటుంది. అరవిచ్చిన గులాబీలూ, పొలం గట్లమీద పచ్చని తంగేడు పూలూ. మురిపించే మందారాలూ.. నవపారిజాతాల మృదుత్వం.. చామంతుల సింగారం.. వెరసి ఈ హేమంతంలో సుమంతం చూడ చక్కని ముచ్చట..! హేమంతం ప్రారంభంలో చలిగాలులు అంతగా వీచవు. తెల్లవారు జామునుంచే పక్షుల కిలకిలారావాలు.. తెలతెలవారే వాతావరణం కాలమిలా ఆగిపోతే..ఎంత బావుండు అన్నంత ఆహ్లాదంగా కమనీయంగా కన్నుల పండుగలా వుంటుంది. సూర్యుడు ఒక కక్ష్యలో నుండి మరో కక్ష్యలో అడుగు పెడుతుంటాడు. ఇలా అడుగు పెట్టడమే సంక్రమణ..! సంక్రమణ అంటే గమనం.. ఈ గమనం వల్లనే వీచే చలిగాలులు. వీటి నుంచి రక్షణగా వెచ్చని సంతోష సౌభాగ్యాలు సమకూరుతాయని గుండెనిండుగా విశ్వాసం.
''తల్లీ...!
నీవెప్పుడు నాకొక పట్టెడు మెతుకులు పెడతావో
ఒక్క నిజమైన కథ చెపుతావో
ఎదలో చోటిచ్చి నిదుర పొమ్మంటావో
అప్పుడు నీ పాటలు
పక్షులై విహరిస్తాయి ఆకాశంలో
నీ నవ్వులు పువ్వులై వికసిస్తాయి
భూమండలంలో
నీ యెండలు
జెండాలై ఎగురుతాయి దిగంతాల్లో
నేనొక కన్నీటి బిందువునై కలిసి పోతాను
మానవతా సముద్రంలో..'' తన రుతుఘోష పద్యకావ్యంలో కవి శేషేంద్రశర్మ చెబుతారు. ప్రకృతికీ కాలచక్రానికీ వున్నటువంటి అవినాభావ సంబంధమిది. ఈ హేమంత రుతువులో ఫలసాయాలు పుష్కలంగా చేతికంది ఇంటింటా సిరుల పంటలు పండుతాయి. పంట చేల నుంచి ధాన్యరాశులు ఇంటికి వస్తాయి. ముంగిట్లో తీరైన ముగ్గులు.. గొబ్బెమ్మలు.. గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కీర్తనలతో పల్లెలు సందడితో విలసిల్లుతాయి. విశిష్టమైన భౌగోళిక, వ్యవసాయక, ఆర్థిక ప్రాధాన్యత సంతరించి పెడుతుంది. అదిగో..! సరిగ్గా ఇదే సమయాన నవీన సంవత్సరం అడుగిడుతుంది. ఎన్నెన్నో ఆశల పందిళ్లు.. అవి పచ్చ పచ్చని చివుళ్లతో.. మొగ్గలు తొడుగుతుంది. ఇలా కాలం ఎప్పటికప్పుడు తాజాగా పరిమళిస్తుంది. మనిషి ఆశాజీవి. తన జీవితం ఓ అందమైన కలగా ఊహిస్తాడు. తన బతుకంతా బాధ కావొద్దని కోరుకుంటాడు. మంచి జరిగితే మంచిరోజులుగా స్వీకరిస్తాడు. చెడు జరిగితే కుంగిపోతాడు. మానవుడు సంఘజీవి. తన చుట్టూ జరిగే తప్పిదాల్ని అర్థం చేసుకోవాలి. కనుక నలుగురితో పాటు నడవడం అవసరం. కలిసి వుంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. ఒంటరిగా మనజాలం. బతికినన్నినాళ్లూ అందమె ఆనందం...ఆనందమె జీవిత మకరందం...అనుకొని అందరితో కలిసి మమేకమైతే జీవితానికి సార్థకత. 
మనుషుల మధ్య ఐక్యత వుంటే మనమే కాదు. మన కుటుంబం, మన దేశంలో అన్నీ బాగు పడతాయి. అందుకే ఐకమత్యమే మహాబలం అన్నారు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే సుమతీ...అన్నట్టు కలిసికట్టుగా పోరాడితే చీమలదండంతా కలిసి ఆ పెద్దపామును కూడా చంపేయగలదు. వేటగాడు బియ్యం చల్లి, వల విసిరి సునాయాసంగా దొరికినన్ని పావురాలను పట్టేసుకుంటాడు. పావురాలు ఆలోచించి సమిష్టిగా ఒక నిర్ణయం చేసుకున్నాయి. అందరం ఒకేసారి వలలో వాలిపోవాలనీ... వలలో చిక్కిన తరువాత కలిసికట్టుగా ఒకేసారి వలతో సహా ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయాయి. తెల్లబోవటం వేటగాని వంతయింది. అంతేమరి. ఐక్యతను మించిన ఆయుధం లేదు.
'కావ్‌..కావ్‌..!' అంటూ కాకులు గోలగోల చేస్తాయని అనుకుంటాం. నిజానికి కాకులు ఐక్యతకు పెట్టింది పేరు. ఒక కాకి ప్రమాదంలో చిక్కుకుంటే, మిగతా కాకులు కొన్ని వందల సంఖ్యలో క్షణాల్లో వచ్చి వాలి, ప్రమాదం నుండి కాకిని తప్పించడానికి విశేష ప్రయత్నం చేస్తాయి. మన శరీరంలోని అవయవాలన్నీ ఉమ్మడిగా పని చేస్తేనే సమన్వయం వుండి జీర్ణ వ్యవస్థ మనగలుగుతుంది. యావత్‌ దేశం కూడా అంతే. విభిన్న జాతులు, భాషలు, మతాలు, సంస్కృతులూ వుండటం సహజం. వీటన్నిటి మధ్య సరైన అవగాహన వుంటేనే దేశం భవిష్యత్‌ సుస్థిరం. అదుపు తప్పుతున్న పరిస్థితుల్ని అధిగమించడానికి పల్లె నుంచి ఢిల్లీ దాకా అన్ని రంగాల్లో సుపరిపాలన నెలకొల్పడానికి మనమంతా అంకితమైతే మన దేశం బాగుంటుంది. మన ఇల్లు ప్రశాంతంగా వుంటుంది. సుశాంతి వల్ల మనం బాగుంటాం. అప్పుడే హేమంతంలో సుమంతం. ప్రజల జీవితాల్లో నవవసంతం.

Monday, December 21, 2015

'పారిస్‌' మన కొంప ముంచింది

 మేక్‌ ఇన్‌ ఇండియా కోసం ... దేశానికి హాని తెచ్చారు
- విజయం అమెరికాదే.. పేద దేశాలపైనే పెను భారం
- పారిస్‌ ఒప్పందంపై నీటి వనరుల సంరక్షకుడు, మెగాసెసే గ్రహీత రాజేంద్ర సింగ్‌ తీవ్ర అసంతృప్తి
 ప్రపంచ దేశాలను విపరీతంగా భయపెడుతున్న భూ తాపం, పర్యావరణ కాలుష్యం సమస్యలపై ఇటీవల ముగిసిన పారిస్‌ సదస్సులో కుదిరిన ఒప్పందంపై మన దేశంలో నీటి సంరక్షణ దీక్ష వహించిన రాజేంద్ర సింగ్‌ నిప్పులు కురిపించారు. నీటి నిల్వలను కాపాడే విషయంలో ఆయన చేసిన నిర్విరామ కృషికి గుర్తింపుగా మెగాసెసే అవార్డు రాజేందర్‌ సింగ్‌ను వరించిన విషయం తెలిసిందే. పారిస్‌ ఒప్పందం వల్ల కాలుష్య ప్రమాదం కన్నా అందుకు ప్రధాన కారణమైన అమెరికాకు మాత్రం చాలా ఎక్కువ ప్రయోజనాలనే సాధించిపెట్టిందని ఆయన ఆరోపించారు. నిజానికి వాతావరణం ఇంత ప్రమాదకరంగా తయారుకావడానికి ప్రధాన బాధ్యత అమెరికాదే, అయినా, ఆ సమస్య పరిష్కారానికి పేద దేశాలతో సహా అన్ని ఇతర దేశాలను ఈ సదస్సు ఒకే స్థాయిలో పరిగణించిందని, బాధ్యతల బరువును అందరి నెత్తిన పడేసిందని ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం పారిస్‌ ఒప్పందం అమెరికాకు ఘన విజయాన్నీ, భారత దేశానికి ఘోర పరాజయాన్ని కట్టబెట్టింది. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, నీటిని పవిత్రమైనదిగాను, అమూల్యమైనదిగాను ప్రేమించి, గౌరవించడం మన సంస్కృతి అన్న వాస్తవాన్ని ప్రభుత్వం విస్మరించిందని తప్పుపట్టారు. 


ఈ సదస్సు జరుగుతున్న సమయంలో పారిస్‌లోనే ఉన్న రాజేందర్‌ సింగ్‌ సదస్సు జరిగిన తీరును పరిశీలించి, గతంలో రియో డీ జెనీరియో, కోపన్‌హాగన్‌, క్యోటో సదస్సుల స్ఫూర్తికి విరుద్ధంగా సాగిందని ఆన్నారు. అమెరికా తన నేరానికి ప్రాయశ్చిత్తంగా దాని పరిష్కారంలో ప్రధాన జవాబుదారీ బాధ్యతను స్వీకరిస్తుందని అందరూ ఆశించారు. కాని ఆ బరువు బాధ్యతలు చివరికి పేద దేశాల నెత్తిన కూడా పడింది. 


దాదాపు 40 వేల మంది పాల్గొన్న సదస్సులో పర్యావరణం గురించి మాట్లాడింది తక్కువ, వ్యాపారపరమైన అంశాలపై జరిగిన చర్చలే ఎక్కువ అని ఆయన అన్నారు. గట్టిగా 400 మంది కూడా లేని ప్రత్యేక బృందం అందరి తరఫున నిర్ణయాలు తీసేసుకుందని రాజేందర్‌ సింగ్‌ ఆరోపించారు. ఇక ఇండియా విషయానికి వస్తే మన దేశంలోని పారిశ్రామిక రంగానికి చాలా ప్రధానమైన ఇంధనం కోసం బొగ్గు వినియోగానికి అనుమతి సంపాదించడమే లక్ష్యంగా చర్చల్లో పాల్గొన్నదని ఆయన ఎద్దేవా చేశారు. భూసారం గురించి కాని, నీటి వనరుల భద్రత గురించి కాని అక్కడ ప్రధానంగా చర్చ జరగనే లేదని ఆయన అన్నారు. ఇలా విద్యుత్‌ కోసం బొగ్గు వాడకం ప్రమాదకరం అనే విషయంలో ప్రపంచమంతా ఏకాభిప్రాయంతో ఉన్నా మన పాలకులు దానికోసమే ఈ ఒప్పందంపై సంతకాలు చేశారని ఆయన విమర్శించారు.

(21.12.2015 నవ తెలంగాణ పత్రిక నుండి స్వీకరణ)

Tuesday, December 15, 2015

పారిస్‌ ఒప్పందం

పారిస్‌లో నవంబరు29న ప్రారంభమై డిసెంబరు12న ముగిసిన ప్రపంచ వాతావరణ సమావేశం ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. దాని ప్రకారం 196 సభ్య దేశాలు ఏ ఒక్క కార్యాచరణకూ కట్టుబడనవసరం లేదు. ప్రతి దేశం తను విడుదల చేస్తున్న ఉద్గారాల నియంత్రణ గురించి స్వచ్ఛందంగా నివేదించేలా కట్టుబడనవసరంలేని లక్ష్యాలను నిర్దేశించారు. పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలతో మునక ప్రమాదాన్ని, తీవ్రస్థాయిలో చెలరేగుతున్న తుపానులతో పెను విధ్వంసాలను ఎదుర్కొంటున్న పసిఫిక్‌ మహాసముద్రంలోని 20 ద్వీప దేశాలను, అదనంగా నిధులను ఏర్పాటుచేసి మోసపుచ్చారు. పారిస్‌ వాతావరణ ఒప్పందంలో నియంత్రించ వలసిన తాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు బదులు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించాలని గత సమావేశాలలో చేసిన ఈ దేశాల డిమాండ్‌ను చర్చల చివరి దశలో విస్మరించారు. 

పారిస్‌ వాతావరణ సమావేశం ప్రకటించిన ఒప్పందాన్ని సామ్రాజ్యవాద దేశాల నాయకులు అతిగా కీర్తిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కార్పొరేట్‌ మీడియా బాకా వూదుతోంది. చారిత్రకంగా భూగోళాన్ని కాలుష్యంతో నింపింది ఈ దేశాలే. అమెరికా అధ్యక్షుడు ఒబామా పారిస్‌ ఒప్పందాన్ని ఒక గొప్ప 'మలుపు'గా అభివర్ణించాడు. 'భూగోళం చరిత్రలో డిసెంబర్‌ 12, 2015 ఒక గొప్ప దినంగా మిగులుతుంది. అనేక శతాబ్దాల కాలంలో పారిస్‌లో అనేక విప్లవాలు జరిగాయి. ఈ రోజు వాతావరణ మార్పుకోసం సంభవించిన విప్లవం అన్నింటికంటే సుందరమైనది, అన్నిటికంటే శాంతియుతమైనది' అని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఫ్రాన్సిస్‌ హోల్లాండ్‌ పేర్కొన్నాడు. ఒకవైపు 'శాంతియుత విప్లవం' గురించి మాట్లాడుతూనే మరోవైపు పర్యావరణ నిరసనకారులపై పోలీసు, మిలిటరీ బలగాలను ఉపయోగించి హోల్లాండ్‌ తన ఉక్కుపాదం మోపాడు.

'ఆపరేషన్‌ విజయవంతంగా జరిగింది. కానీ రోగి మరణించాడు' అన్నచందంగా పారిస్‌లో రెండు వారాలపాటు వాతావరణ సదస్సు జరిగిందని చెప్పవచ్చు. హోల్లాండ్‌, ఒబామా, ఇతర పెట్టుబడిదారీ దేశాల నాయకులు పారిస్‌ సమావేశాన్ని రాజకీయంగా నిర్వహించినతీరు గొప్పగా విజయవంతం అయింది. 'మనకున్న ఒకేఒక గ్రహం' భవిష్యత్తు కోసం శ్రమించే పర్యావరణ వాదులుగా ఈ దేశాల నాయకులు పోజుపెట్టటానికి పారిస్‌ సమావేశం ఉపయోగపడింది. అయితే రోగగ్రస్తమైన భూగ్రహం భవిష్యత్తు, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో బందీగా ఉన్నంతకాలం ఆందోళనకరంగానే వుంటుంది. ప్రధాన దేశాల నాయకులకు ఏమి కావాలో అది పారిస్‌ సమావేశంలో దొరికింది. ప్రపంచ వాతావరణ క్షీణతను ఏమాత్రం అరికట్టకుండా కొంచెం ఖర్చుతోనే వాతావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నట్టుగా నటించే అవకాశం ఈ సమావేశం కల్పించింది. స్థూలంగా చెప్పాలంటే పారిస్‌ వాతావరణ సదస్సు ప్రకటించిన ఒప్పందం వాతావరణ మార్పును, భూతాపాన్ని అరికట్టేందుకు చేసింది చాలా స్వల్పం. అనివార్యంగా తీసుకోవలసిన చర్యల గురించి దీనిలో ఆదేశాలు ఏమీలేవు. ఏ ప్రభుత్వమైనా, ఏ కంపెనీ అయినా తప్పనిసరిగా చేయవలసింది ఏమీలేదు.

పారిస్‌ వాతావరణ సదస్సు సాధించిన 'విజయం' ఏమంటే అది 2009లో జరిగిన కోపెన్‌హాగెన్‌ వాతావరణ సమావేశంలాగా బహిరంగంగా విఫలం కాకపోవటమే. అప్పటి సదస్సులో సామ్రాజ్యవాద దేశాలకు, చైనా, ఇండియా, బ్రెజిల్‌ వంటి వర్ధమాన దేశాలకు మధ్య ఏర్పడిన విభేదాలవల్ల అది పూర్తిగా విఫలమైంది. కోపెన్‌హాగెన్‌లో నేర్చుకున్న 'పాఠం'తో సామ్రాజ్యవాద దేశాలు ఇతర దేశాల ఆకాంక్షలను ముందుగానే పసిగట్టి ఎంత బలహీనమైనదైనప్పటికీ ఒక ఒప్పందాన్ని రూపొందించి దానిని ఒక పెద్ద ముందడుగుగా ప్రకటించింది. ఉద్గారాల విడుదలను తగ్గించుకునేందుకు సభ్యదేశాల స్వయం ప్రకటిత లక్ష్యాల ఆధారంగా ఒబామా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఒప్పందాన్ని రూపొందించారు. దీని 'అమలు'కు గల ఏకైక యంత్రాంగం ప్రపంచ ప్రజాభిప్రాయమే.

పారిస్‌ ఒప్పందానికి కట్టుబడనవసరంలేని స్వచ్ఛంద స్వభావం వుండటం సానుకూల అంశం అనే అభిప్రాయం కొందరిలో ఉన్నది. ఎందుకంటే అది ప్రయివేటు పెట్టుబడిని, ప్రయివేటు వాతావరణ పరిరక్షణా ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది గనుక. వాతావరణం నుంచి కార్బన్‌డైఆక్సైడ్‌ను తొలగించగలిగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటానికి సహకరిస్తామని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ వంటి బిలియనీర్స్‌ చేసిన వాగ్దానాన్ని ఒబామా ప్రభుత్వం ప్రశంసించింది. 'మానవ విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు మార్కెట్లకు ఈ ఒప్పందం ఒక సూచికవంటిది'అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ-మూన్‌ వ్యాఖ్యానించాడు.
నిజానికి పెట్టుబడిదారీ లాభాల వ్యవస్థకు మారుపేరైన 'మార్కెట్లు' మానవ ప్రగతికి ప్రధాన అడ్డంకిగా వున్నాయి. విధ్వంసకర 'అభివృద్ధి' ద్వారా భూతాపాన్ని ప్రమాదకర స్థాయికి తెచ్చిన అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలే ప్రపంచ సంపదంతా కొద్దిమంది పెట్టుబడిదారీ బిలియనీర్ల చేతుల్లో పోగేసి పెట్టాయి. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామికీకరణ కోసం చేసే ప్రతి ప్రయత్నాన్నీ ధనిక దేశాలు భూతాపం పేరుతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. భూతాపాన్ని పెంచిన దేశాలే ఇప్పుడు తగ్గించేందుకు ప్రధాన బాధ్యత తీసుకోవాలి. ఇందుకు ప్రజల నుండి వత్తిడి పెంచటం తప్ప మరో మార్గం లేదు.


(నవతెలంగాణ -16.12. 2015 తేదీ సంపాదకీయం)