సరళీకరణ విధాన యుగంలో ప్రైవేట్ థర్మల్ విద్యుత్
కన్నన్ కస్తూరి
విద్యుత్తు చట్టం 2003 వీలు కల్పించిన సరళీకరణ విధాన యుగం - బొగ్గు నీరు లభ్యత కలిగిన కొన్ని ప్రాంతాలలో స్థాపింపబడ్డ కొన్ని స్వంత వినియోగ (కాప్టివ్ )థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆకర్షణీ యమైన లాభాలను పొందే అవకాశాన్ని కల్పించింది.. కాని, తాము కర్మాగారాల్ని స్థాపించ వలసిన ప్రాంతాలలోని ప్రజానీకం పడే ఇబ్బందులతో నిమిత్తం లేకుండా చాలా ప్రతిపాదిత ప్రాజెక్ట్ లు అర్ధాంతరంగా వదలివేయబడ్డాయి . మిగిలిన వాటిలో కొన్ని పాక్షిక సామర్ధ్యంతో పనిచేస్తుంటే, ఇతర ప్రాజెక్టులు నిర్మాణ జాప్యాలతో కొట్టుమిట్టాడుతూ,అజ్ఞాతంలోకి కనుమరుగవుతున్నాయి. గత దశాబ్దకాలం లో ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల అభివృద్ది పై విమర్శనాత్మక విశ్లేషణ వ్యాసం ఇది..
విద్యుత్ చట్టం 2003, జాతీయ విద్యుత్ విధానం 2005 లు, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలకు అత్యంత మైన సరళీకరణ విధాన యుగాన్ని తీసికొచ్చింది. లైసెన్సింగ్ తీసివేయబడింది. కేంద్ర విద్యుత్ అధారిటీ నుండి సాంకేతిక ఆర్ధిక క్లియరెన్స్ తీసికోవలసిన అవసరాన్ని రద్దు చేసింది. స్వంత ప్రసార సమాహారానికి(ట్రాన్స్ మిషన్ నెట్ వర్క్ ) నేరుగా , కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు కొన్ని మినహాయింపులతో బహిరంగంగా చేరుకునే వీలును థర్మల్ ఉత్పత్తి కర్మాగారాలకు కల్పించటం జరిగింది. ఉత్పత్తి దారుల లాభాలను కుదిస్తున్న పంపిణీ కంపెనీలతో చేసికోవాల్సిన దీర్ఘ కాలిక(20-25 సం) విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు స్వస్తి చెప్పటం జరిగింది..ఉత్పత్తిదారులు తమ విద్యుత్ ను స్వల్పకాలిక ఒప్పందాల తోను, వర్తకులు,విద్యుత్ ఎక్స్చేంజి కేంద్రాలతో నేరుగా విద్యుత్ ను బహిరంగ మార్కెట్లలో అమ్ముకునే వీలుకల్పించారు.
ఈ సరళీకరణ విధాన యుగం ప్రైవేట్ కంపెనీల ఉత్సాహాల్లో విస్పోటనాన్ని రేకెత్తించింది. ఈ కాలం లో లో థర్మల్ విద్యుత్ రంగంలో చోటుచేసికున్న ప్రభావాలలోని పరిణామాలను ఈ వ్యాసం విమర్శనాత్మకం గా విశ్లేషిస్తుంది.
డేటా సేకరించే వనరులు
ఏ ఒక్క వనరు నుండి ప్రైవేట్ థర్మల్ ప్రాజెక్ట్ లకు సంబంధించిన సమగ్ర సమాచారం దొరకటం లేదు. లైసెన్సింగ్ వ్యవస్థ అంతం కావటంతో, దాదాపుగా విద్యుత్ ఉత్పత్తికి చేరువలో వుండి,పర్యావరణ అనుమతులు పొందాల్సిన విద్యుత్ ప్రాజెక్ట్ లు మినహాయించి,మిగిలిన అన్ని ప్రాజెక్ట్ ల పర్యవేక్షణను కేంద్ర విద్యుత్ అధారిటీ ఆపి వేసింది. పర్యావరణ అనుమతులు పొందాల్సిన ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రక్రియను అడవులు,పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖలు పర్యవేక్షిస్తున్నాయి. పర్యావరణ అనుమతి పొందటానికి పూర్వమే ప్రాజెక్ట్ లు స్థాపించే ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంతో విద్యుత్ కంపెనీలు విలక్షణమైన అవగాహనా పత్రాలపై సంతకాలు చేస్తున్నాయి. అదనంగా అంతర్ రాష్ట్ర ప్రసార సమాహారం లో ప్రవేశం కోరే కంపెనీలు కేంద్ర ప్రసార యుటిలిటీ తో ప్రవేశ అభ్యర్ధనలను నమోదుచేసి కుంటాయి. ఈ నేపధ్యంలో వివిధ అభివృద్ది స్థాయిలలో వున్న ప్రాజెక్ట్ ల భిన్నమైన సమాచారాలను ఒక చోటికి చేర్చి ఒక సమష్టి దృశ్యాన్ని పొంద వీలుకలుగుతుంది.
పర్యావరణ, అరణ్య, పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖల నుండి పరిపూర్ణమైన సమాచారాన్ని పొందటం కష్టతరమైన కర్తవ్యం. దేశవ్యాప్త సమాచారం యొక్క ఉపసమూదాయానికి(సబ్ సెట్ ) పరిమితం చేస్తూ కర్తవ్యాన్ని సులభతరం చేసికోవచ్చును. ఎటువంటి ఉపసముదాయాన్ని ఎంచుకోవాలో క్రింద వివరించబడింది.
ఒక రీజియన్ లోని ఒక రాష్ట్రం నుండి ఉత్పత్తి అయిన విద్యుత్ ను అదే రీజియన్ లోని మరొక రాష్ట్రానికి అనుమతించే విధంగా ప్రసార మౌలిక వ్యవస్థ నిర్వచింపబడి,.విద్యుత్ ఉత్పత్తి,పంపిణీల పరంగా దక్షిణ, ఉత్తర,పశ్చిమ, తూర్పు,ఈశాన్య ప్రాంతీయాల పేర భారత దేశం ఐదు ప్రాంతీయాలుగా(రీజియన్లు)విడగొట్టబడింది. విద్యుత్ మొత్తంగా ఉత్పత్తి అయిన ప్రాంతీయం లోనే వినియోగింప బడుతుంది
2008నుండి 2015మద్య కాలంలో(నూతన ప్రాంతీయంలో మొట్టమొదటి విద్యుత్ కేంద్రం నిర్వహణలోనికి వచ్చే సమయానికి ) ఛత్తీస్ ఘర్,మధ్యప్రదేశ్,గుజరాత్,మహారాష్ట్ర,గోవా రాష్ట్రాలు గల పశ్చిమప్రాంతీయం ప్రైవేట్ థర్మల్ విద్యుత్ సామర్ధ్యంలో అత్యధిక స్థాపనను సాధించింది.వీటి ద్వారా భారత దేశంలోని మొత్తం ప్రైవేట్ థర్మల్ విద్యుత్ సామర్ధ్యానికి అదనంగా 57శాతం ప్రైవేట్ థర్మల్ విద్యుత్ సామర్ధ్యం జత అయింది.
గొప్ప థర్మల్ విద్యుత్ రద్దీ
పర్యావరణ అనుమతులకు సిద్ధంగా వున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ల సంఖ్యను బట్టి ప్రైవేట్ థర్మల్ ప్రాజెక్ట్ లపై పెరుగుతున్న ఆసక్తిని అంచనా వేయవచ్చును. పర్యావరణ అనుమతులకు సిద్ధం గా వున్న ప్రైవేట్ థర్మల్ కర్మాగారాలు ప్రభుత్వ భూమి,నీరు, ఇంధన సరఫరా ప్రణాళికలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ముడిపడి వున్నాయి. తప్పనిసరిగా ప్రాజెక్ట్ ప్రాంతంలో నిర్వహించాల్సిన మరియు తరచు ప్రజల వ్యతిరేకతను చవిచూసే, “‘ప్రజా విచారణను”(పబ్లిక్ ఎంక్వైరీ ) ఆ ప్రాజెక్ట్ లు పూర్తీ చేసి వుంటాయి. అందువల్ల అంతిమంగా అత్యంత ఆసక్తిగల ప్రాజెక్ట్ లే పర్యావరణ అనుమతిని పొందివుంటాయి(కస్తూరి 2011:10)
పశ్చిమ ప్రాంతీయం లో లో పర్యావరణ అనుమతి పొందిన ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ల గూర్చి ప్రస్తావించుకోవాల్సిన రెండు అంశాలు వున్నాయి.
ఒకటి- కేవలం సామర్ధ్య పరిమాణాన్ని యోచించటం. 79 ప్రైవేట్ థర్మల్ ప్రాజెక్ట్ లు 92 గిగా వాట్ల సమిష్టి ఉత్పత్తి సామర్ధ్యాన్ని ప్లాన్ చేశాయి. కాని ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో(2007-12)లో ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ద్వారా అదనంగా 19గిగా వాట్ల సామర్ధ్యాన్ని, ప్లానింగ్ కమిషన్ 12వ పంచవర్ష ప్రణాళికలో(201-17) ప్రభుత్వ,ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ద్వారా అదనంగా 64గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిని అంచనా వేసి, దీని ద్వారా 9శాతం స్థూల దేశీయోత్పత్తిని సాధించగలమని భావించాయి.(ప్లానింగ్ కమిషన్ 2012:1.4.1). వీటిలో అనేక ప్రతిపాదనలు సఫలంగావని ప్రభుత్వానికి ముందే తెలుసుననిపిస్తుంది. .
రెండవది-2006నుండి 2010 మధ్యకాలంలో గుట్టలు గుట్టలుగా పెరిగిన ప్రతిపాదనలు. ప్రాజెక్ట్ లలో తీవ్రంగా పెరిగిన ఆసక్తి కీలక దశకు చేరి,2011తర్వాత అక్కడనుండి నెమ్మదిగా నీరిగారిపోవటం మొదలైంది . 2011నుండి పశ్చిమ ప్రాంతీయం లో ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పట్ల నూతన ఆసక్తి ఎక్కడా కానరాలేదు(అక్కడక్కడ ఒకటి,రెండు వున్నా,వాటికి ఇంతవరకు పర్యావరణ అనుమతి లేదు).గతంలో గుట్టలు గుట్టలుగా పెరిగిన ప్రాజెక్ట్ లు ఎదుర్కొన్న వ్యతిరేక పరిణామాలను తర్వాత చర్చించుదాం. థర్మల్ విద్యుత్ పట్ల తగ్గుతున్న ఆసక్తికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంబంధించిన ఆర్ధిక అంశాలలో ఈ కాలంలో వస్తున్న తీవ్ర మార్పులతో సంబంధం వున్నది.
బహిరంగ మార్కెట్ లో విద్యుత్ ను అమ్ముకోవటానికి అనుమతి ఇవ్వడంతో, స్వంత వినియోగ విద్యుత్ ఉత్పత్తిదారులు విద్యుత్ దొరకని కాలంలో మంచి లాభాలు పొందగలిగారు. స్వంత వినియోగ విద్యుత్ ఉత్పత్తిదారుడైన జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ 2007లో థర్మల్ కర్మాగారాన్ని ఏర్పాటుచేసి, దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు లేకుండానే పూర్తి వర్తక విద్యుత్ సరఫరా దారుగా 2007నుండి 2010 వరకు బంపర్ లాభాలను ఆర్జించింది.(జోషీ 2009). వర్తక ఉత్పత్తిదారులు ప్రత్యేకించి జిందాల్ కంపెనీ విజయం, థర్మల్ విద్యుత్ రంగంలోకి చాలా మంది ఔత్సాహికుల్ని విశేషంగా ఆకర్షించింది.
2010నుండి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. బొగ్గు ఉత్పత్తి స్తంభించటం తో 2011నుండి ప్రభుత్వం దీర్ఘకాలిక బొగ్గు ఒప్పందాలను ఇవ్వటం ఆపివేసింది. 2010లో అంతర్జాతీయ బొగ్గు ధరలు పెరిగి,2011నాటికి భారీ స్థాయికి చేరటంతో, బొగ్గును దిగుమతి చేసికోవటం లాభదాయకమైన అంశంగా కానరాలేదు. 2010నాటికి వర్తక విద్యుత్ ధరలు తీవ్రంగా తగ్గిపోయి,2010 రెండవ అర్ధబాగానికి రేట్లు సగానికి సగం పడిపోయాయి. ఆ తర్వాత కాలంలో పశ్చిమ ప్రాంతీయం లో విద్యుత్ రేట్లు తక్కువలోనే కొనసాగాయి. దక్షిణ ప్రాంతీయం తప్పించి, ఇతర ప్రాంతీయాలలో సైతం విద్యుత్ రేట్లు పడిపోవటం జరిగింది.
ఈ రకమైన మారిన పరిస్థితులలో చాలా థర్మల్ ప్రాజెక్ట్ లు ఆపి వేయబడ్డాయి. కొన్ని వదిలి వేయబడ్డాయి.
ఆపివేయబడ్డ,వదలివేయబడ్డ ప్రాజెక్ట్ లు
పశ్చిమప్రాంతీయం లోని ఛత్తీస్ ఘర్ నూతన విధాన యుగం యొక్క ఆగడాలను అధ్యయనం చేయటానికి ఒక ఉదాహరణ గా వుంది. ఆ రాష్ట్రం వర్ధమాన విద్యుత్ హబ్ గా, థర్మల్ విద్యుత్ లో 61 అవగాహనా పత్రాలు సంతకం చేసి, దేశంలోని ఇతర ప్రాంతాలకు విద్యుత్ ఎగుమతిదారుని గా తనంతట తానే ప్రచారం చేసికుంది.
ప్రతిపాదిత ప్రాజెక్ట్ లలో 2/3వంతుగా వున్న40 ప్రాజెక్ట్ లకు పర్యావరణ అనుమతులకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్ట్ లన్నీ అనేక సంవత్సరాల క్రింద ప్రకటించబడినా, వాటి అభివృద్ది లో పురోగమనం లేకపోవటానికి,ఇంతకు ముందు చెప్పుకున్నట్లు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలోని మారిన ఆర్ధిక అంశాలే ప్రధాన కారణం గా వుంది. పర్యావరణ అనుమతికి వచ్చిన 21 ప్రాజెక్ట్ లలో, 10 ప్రాజెక్ట్ లలో అత్యధిక భాగం పాక్షిక సామర్ధ్యంతో ఉత్పత్తి లో వున్నాయి. కొద్ది ప్రాజెక్ట్ లు మాత్రం తీవ్రమైన జాప్యంతో నిర్మాణం లో వున్నాయి. కొద్ది ఇతర ప్రాజెక్ట్ లు అన్ని రకాలుగా ఆగిపోయినట్లున్నాయి. ఛత్తీస్ ఘర్ లో ప్రతిపాదించిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ లలో కేవలం నాలుగవ వంతు ప్రాజెక్ట్ లే ఉత్పత్తి లోకి రాగలుగుతాయి.
పోటీ తత్వాన్ని ప్రతిపాదించే వారికి కొన్ని ప్రాజెక్ట్ ల వైఫల్యం పొందటం పెద్ద సమస్య కాక పోవచ్చును. విఫలమైన ప్రాజెక్ట్ లు పెట్టుబడిదారులకే కాకుండా,అంతకు మించి ఆ ప్రాజెక్ట్ లు స్థాపించిన వ్యవసాయ భూములసాగుదార్లకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పర్యావరణ అనుమతుల దగ్గర ఆగిపోయిన అన్ని ప్రాజెక్ట్ లకు అవసరమైన భూమినంత స్వాధీనం చేయటం జరిగింది. ప్రతి వెయ్యి మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ కు 700నుండి 900 ఎకరాల భూమి అవసరమౌతుంది. పర్యావరణ అనుమతులు పొందని కనీసం 17 ప్రతిపాదిత ప్రాజెక్ట్ లకు పాక్షికంగానో లేదా పూర్తిగానో భూమి సమీకరింప బడింది. పర్యావరణ అనుమతులు పొందేందుకై బొగ్గు లింకేజి మంజూరు చేయటం ద్వారా తొలి రోజుల్లో భూ సమీకరణను ప్రభుత్వమే స్వయంగా ప్రోత్సహించింది(కస్తూరి2011:11)
అసమతుల్యాన్ని తీవ్ర తరంచేస్తూ
సరళీకరణ విధాన యుగంలో విస్తరించిన ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కర్మాగారాలు, స్థాపక ఉత్పత్తి సామర్ధ్యానికి మరియు విద్యుత్ అవసరాలకు మధ్య వుండే అసమతుల్యాన్ని తీవ్రతరం చేశాయి. పశ్చిమ ప్రాంతీయం సాపేక్షంగా మిగులు సామర్ధ్యం కలిగి వుండగా, ఉత్తర, దక్షిణ ప్రాంతీయాలు సామర్ధ్య లోటు తో ఉన్నాయి.. దేశవ్యాప్త ఉత్పత్తి సామర్ధ్యం లోని సగం వృద్ది ప్రైవేట్ థర్మల్ కర్మాగారాల ద్వారా వుండగా,అందులోనూ 64శాతం వృద్ది పశ్చిమ ప్రాంతీయం లో వుండటం మూలకంగా,ఈ ప్రాంతీయం సాపేక్షంగా మితిమీరిన విద్యుత్ లావాదేవీలలో వుంది.
తగినంత అంతర్ ప్రాంతీయాల ప్రసార సామర్ధ్యం( ట్రాన్స్ మిషన్ కెపాసిటీ) కలిగివుంటే, కొన్ని ప్రాంతీయాలలో వుండే సామర్ధ్య మిగులు, మరి కొన్నిప్రాంతీయాల లోని సామర్ధ్య లోటు పెద్ద సమస్యలుగా ముందుకు రావు. 2010నుండి పశ్చిమ ప్రాంతీయం నుండి దక్షిణ ప్రాంతీయం కు విద్యుత్ ఎగుమతి మార్కెట్ మొదలైంది. సాపేక్షంగా పశ్చిమ ప్రాంతీయం లోని విధ్యుత్ మిగులు, దక్షిణ ప్రాంతీయంలోని విద్యుత్ లోటుల లోని తేడా భారత విద్యుత్ ఎక్స్చేంజి (ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజి)దగ్గర విభిన్న ధరల రూపంలో నమోదు అయింది. పశ్చిమ ప్రాంతీయం దక్షిణ ప్రాంతీయం ఎక్స్చేంజి లు అంతర్ ప్రాంతీయాల ప్రసార సమస్యల్ని వ్యక్తం చేశాయి.
నామమాత్ర ప్రసార సామర్ధ్యాల పరిమితితో, 2010నుండి 2013 వరకు పశ్చిమ ప్రాంతీయం నుండి దక్షిణ ప్రాంతీయం కు వాస్తవ దిగుమతులు పరిమితంగా పెరిగాయి. సాంకేతిక కారణాల రీత్యా కొంత మోతాదు విద్యుత్ పక్కన పెట్టాల్సి ఉన్నందున, నామమాత్ర ప్రసార సామర్ధ్యాన్ని ఆచరణలో వినియోగించుకోలేక పోయారు.
మహారాష్ట్ర నందలి సోలాపూర్,కర్నాటక నందలి రాయచూర్ మధ్య మొదటి రెండు 2100మెగా వాట్ల లింకులు ప్రారంభ మైనందున 2014లో సామర్ధ్యాలలో పెంపుదల జరిగింది.అధికమైన నామమాత్ర ప్రసార సామర్ధ్యాలు లభ్యమైనప్పటికి, పశ్చిమం నుండి దక్షిణ ప్రాంతీయంకు బదిలీ అయిన సగటు విద్యుత్ చిన్న పరిమాణం లోనే పెరిగింది.
ఉత్పత్తి కేంద్రాలు,లోడ్ కేంద్రాల మధ్య అంచు నుండి అంచు వరకు వరకు ప్రసార సామర్ధ్యం కలిగి వుంటేనే విద్యుత్ బదిలీ సుసాధ్యం కావటం ఇందుకు కారణం. అంతర్ ప్రాంతీయాల ప్రసార సామర్ధ్యం(ప్రాంతీయాల సరిహద్దుల మధ్య వుండే లింకుల సామర్ధ్యం) తగినంత ఉన్నప్పటికీ, కారిడార్ లోని అంచు నుండి అంచు వరకు ఇతరత్రా అవరోధాలు వుండ వచ్చును. ప్రస్తుత అంశంలో, పశ్చిమ ప్రాంతీయం ఉత్పత్తి క్లస్టర్లు ( ఛత్తీస్ ఘర్ లో వలే)నుండి సోలాపూర్ వరకు, రాయచూర్ నుండి దక్షిణ ప్రాంతీయం లోడ్ కేంద్రాల వరకు ప్రసార సామర్ధ్యం లోపించింది. 2014-15లలో కేవలం 1500మెగావాట్ల సామర్ధ్య బదిలీకి సమానమైన 1172 మెగా వాట్ల విద్యుత్ ( సంవత్సరానికి దేశ వ్యాప్త ఉత్పత్తి సామర్ధ్యంలో దాదాపు 0.6 శాతం) మాత్రమె పశ్చిమ ప్రాంతీయం నుండి దక్షిణ ప్రాంతీయం కు బదీలీ కాబడుతుంది. దక్షిణ ప్రాంతీయం అవసరాలకంటే, పశ్చిమ ప్రాంతీయం లో లభ్య మౌతున్న మిగులు కంటే ఇది చాలా తక్కువగా వున్నది.
ఖాళీగా వున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు
నూతన విధాన కాలంలో స్వల్పంగా చేరుతున్న ప్రాంతీయం ఉత్పత్తి సామర్ధ్యానికి, దాని వంతు పర్యవసానా లున్నాయి. గుజరాత్ లో తప్ప మిగిలిన పశ్చిమ ప్రాంతీయం లో ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ వరుసుగా తగ్గుతున్నది. అది ప్రస్తుతం 43శాతంగా వుంది.
కొన్ని సంవత్సారాల క్రితం బొగ్గు లభ్యత కష్టంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి అలా లేదు. గత నాలుగేళ్ల కంటే 2014-15లో బొగ్గు ఉత్పత్తి 32మిలియన్ టన్నులు పెరిగింది. రాష్ట్ర కర్మాగారాలలో బొగ్గుల నిల్వలు బాగా పెరిగాయి. అంతర్జాతీయ బొగ్గు ధరలు తగ్గాయి. ఈ విద్యుత్ ఉత్పాదకులు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ కు ఖాతాదార్లు లేకపోవటమే సమస్యగా కనిపిస్తుంది.
పశ్చిమప్రాంతీయం లోని విద్యుత్ పంపిణీ కంపెనీలు ప్రస్తుత పరిస్థితి లో ఎక్కువ విద్యుత్ ను తీసికోకలిగేటట్లులేవు . దీనర్ధం ఈ ప్రాంతీయం లో ప్రతి ఇంటికి ఇప్పటికే విద్యుత్ ఇవ్వబడి,24గంటలు విద్యుత్ సరఫరా అవుతుందని కాదు. వారి పరిమితమైన ప్రసార సమాహారం, పంపిణీ చేయకలిగే సమర్ధత,విద్యుత్ ను కొనగలిగే ఆర్ధిక స్థితికి లోబడి ఇంతకు ముందే పేర్కొన్న లక్ష్యాలకు వాళ్ళు చేరారు. వర్షాలు కరువై జల విద్యుత్ కష్టాల్లో పడటం వల్ల, దక్షిణ ప్రాంతీయం లోని కర్నాటక తీవ్రమైన విద్యుత్ కష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రసార సామర్ధ్యం లేని కారణంగా విద్యుత్ ఎగుమతి సాధ్యం కావటం లేదు. ఈ విద్యుత్ ఉత్పత్తి దారులు నిస్సహాయ స్థితిలో మిగిలున్నారు.
ప్రసార వ్యవస్థ ప్రణాళిక
ఈ నూతన యుగం ప్రారంభానికి పూర్వం, భారత దేశంలోని ప్రతి ప్రాంతీయం విద్యుత్ ఉత్పాదనలో స్వయం సమృద్ధిని సాధించటానికి ప్రణాళిక రచన చేయబడింది. దానికి లోబడే రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తికి,ప్రసారానికి అవసరమైన మౌలిక వ్యవస్థను అభివృద్ది చేసికున్నాయి.ఒక రాష్ట్రంలో నూతన ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేస్తూనే, రాష్ట్రాలకు విద్యుత్ సరఫరాను అందించేందుకు అవసరమైన అంతర్ రాష్ట్ర,అంతర్ ప్రాంతీయాల ప్రసార వ్యవస్థను అభివృద్ది చేస్తూ, ఆ కర్మాగారాల నుండి విద్యుత్ ను కూడా కేటాయించింది. దీనితో పాటు ప్రాంతీయాల సరిహద్దులలో నిర్దిష్టంగా విద్యుత్ ను ఇచ్చిపుచ్చు కోటానికి కొన్నిప్రసార లింకులను కూడా నిర్మించింది.
జాతీయ విద్యుత్ విధానం2005, ప్రసార సమాహర ప్రణాళిక, అమలు వినియోగదారులతో ముందుగానే చేసికునే ఒప్పందాల ప్రాతిపదికన కాకుండా బహిరంగ మార్కెట్ అవసరాల ప్రాతిపదికన వుండాలని చెప్పుతుంది(విద్యుత్ మంత్రిత్వ శాఖ 2005:5.3. 2). విద్యుత్ ఉత్పత్తి సంస్థలు దేశంలో ఎక్కడైనా తమ ఖాతాదారులను ఎన్నుకోవచ్చుననే భావన ఒక ప్రక్క, ప్రసార వ్యవస్థలు వ్యయ పూరితం కావటంవల్ల,వాటిని దీర్ఘకాలిక అవసరాల ప్రాతిపదికన నిర్మించాలనే భావన మరో ప్రక్క కలగాపులగంగా వుంటే, ,ప్రస్తుత పరిస్థితులలో ప్రసార వ్యవస్థను నిర్మించుకోవటం ఉహాజనిత ఆలోచనగానే వున్నది.
ప్రసార వ్యవస్థల ప్రామాణిక పధక రచనకు ప్రతి ఉత్పత్తి సంస్థ యొక్క స్థానం,సామర్ధ్యం, అది పూర్తి చేయకలిగే సమయం, దాని ప్రతిపాదిత ఖాతాదార్ల గూర్చిన పరిజ్ఞానం పట్ల అవగాహన కావాలి. అంతర్ రాష్ట్ర ,అంతర్ ప్రాంతీయాల సమాహారాల( అంచు నుండి అంచు వరకు అవసరమైన) ప్రసార సామర్ధ్యాలను పెంచటానికి,బహుళ సంస్థలు సమన్వయంతో కలసి పని చేయాల్సి వుంటుంది(కేంద్ర విద్యుత్ అధారిటి 2012:7.4. 2).
విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలతో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసికోవాల్సిన అవసరం లేదు కాబట్టి నూతన విధానం లో ప్రసార ప్రణాళిక రచన చాలా క్లిష్టంగా మారింది. చాలా ప్రైవేట్ ఉత్పత్తి సంస్థలు ప్రసార సమాహారానికి దీర్ఘకాలిక ప్రవేశం కావాలని కోరుతున్నప్పటికీ, పంపిణీ సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసికోలేని కారణంగా వారి అంతిమ వినియోగదారు లెవ్వరో నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళు, వాళ్ళ కర్మాగార స్థాపన ప్రణాళికకు జవాబుదారులు కాలేకపోతున్నారు.
ప్రస్తుతానికి వున్న ప్రసార సమాహారాలన్నీ కేంద్రానికి లేదా రాష్ట్రాలకు స్వంతం అయివున్నాయి. పైన పేర్కొన్న అనిశ్చితుల కారణంగా ప్రసార మౌలిక రంగంలో నూతన పెట్టుబడులు రావటం కష్టతరంగా వుంది. ఈ పరిస్థితులు ప్రస్తుత సమాహారాల పాక్షిక వినియోగానికి దారితీసే ప్రమాదం వుంది. మరో ప్రక్క, వర్తమానంలో జరుగుతున్నట్లు రద్దీ కారణంగా ఉత్పత్తి సంస్థలకు ప్రసార వ్యవస్థలో ప్రవేశం తిరస్కరింప బడవచ్చును.(ప్లానింగ్ కమిషన్2012:2. 2)
ముగింపు
విద్యుత్తు చట్టం 2003 వీలు కల్పించిన సరళీకరణ విధాన యుగం, కొన్ని స్వంత వినియోగ (కాప్టివ్ )థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ,ఆకర్షణీ యమైన లాభాలు పొందే అవకాశాన్ని కల్పించింది. దీనివల్ల ప్రత్యేకంగా బొగ్గు నీరు లభ్యత కలిగిన కొన్ని ప్రాంతాలలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక ప్రైవేట్ కంపెనీలు ఆకర్షించ బడ్డాయి. థర్మల్ విద్యుత్ ఉత్పాదనలో మారుతున్న ఆర్దికాంశాలు త్వరితంగా ఆ ఉత్సాహాన్ని నీరుకార్చాయి .
చాలా ప్రతిపాదిత ప్రాజెక్ట్ లు వాటిని స్థాపించ వలసిన ప్రాంతాలలోని ప్రజానీకం ఇబ్బందులతో నిమిత్తం లేకుండా అర్ధాంతరంగా వదలివేయబడ్డాయి . మిగిలిన వాటిలో కొన్ని పాక్షిక సామర్ధ్యంతో పనిచేస్తుంటే, ఇతర ప్రాజెక్టులు నిర్మాణ జాప్యాలతో కొట్టుమిట్టాడుతూ,అజ్ఞాతంలోకి కనుమరుగవుతున్నాయి.
పనిచేస్తున్న కర్మాగారాల స్థాపన ప్రదేశం, గిరాకికి, ఉత్పత్తి సామర్ధ్యానికి మధ్య వుండే ప్రాంతీయ అసమతుల్యాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నది. దేశం లోవివిధ ప్రాంతాలలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, స్థానికంగా సత్వర గిరాకి లేకపోవటం వల్ల లేదా విధ్యుత్ కొరత ప్రాంతాలలో తగిన ప్రసార సామర్ధ్యం లేకపోవటంవల్ల, విద్యుత్ అమ్ముకోలేక ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు ఖాళీగా వుండటమో లేదా తక్కువ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తో పనిచేయటమో జరుగుతున్నది. ప్రైవేట్ థర్మల్ విద్యుత్ రంగం అభివృద్ది మొత్తంగా చూస్తే, జాతీయ వనరుల అభిలషణీయమైన వినియోగానికి చాలా దూరంగా వుంది.
ఈ వ్యాసం లో వివరించని విద్యుత్ రంగానికి సంబంధించిన ఇతర ప్రతికూల పర్యవసానాలు చాలా వున్నాయి. థర్మల్ కర్మాగారాల్ని నిర్మించాలనే తహతహ యంత్ర సామాగ్రి గిరాకీని హటాత్తుగా పెంచిది. ఈ పరిస్థితిని విదేశీ తయారీ సంస్థలు ఉపయోగించుకొని, దేశీయ తయారీ సంస్థలను నష్టపరిచాయి. కేంద్ర విద్యుత్ ఆధారిటీ సేకరించిన సమాచారం లో(సి ఇ ఎ 2015) ఈ అంశం స్పష్టంగా వుంది. విద్యుత్ ప్రాజెక్ట్ లు . ఖాయిలపడటంతో, వాటికి ఆర్ధిక సహాయం చేసిన ప్రధాన ఋణదాతలైన ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తుల శాతం భారీగా పెరిగింది(ఆచార్య 2912). దీనితో విద్యుత్ రంగంలో నూతనంగా ప్రవేశించే ప్రాజెక్ట్ లకు బ్యాంకుల ఋణ సహాయం క్లిష్ట మైంది.
వీటిలో ప్రతి సమస్యకు సమన్వయలోపం,తగినంత జాగురతగా వుండక పోవటం లాంటి అంశాలు కారణాలుగా వున్నాయి. అన్నీ కలిపి చూస్తే, చట్టపరమైన, విధాన పరమైన చట్రం లోని బలహీనతలు కనిపిస్తున్నాయి. ఈ చట్రం పరిశ్రమ యొక్క భారీ పెట్టుబడుల ఆవశ్యకతను, ఆర్ధిక వ్యవస్థ ను నిలబెట్టటం కోసం జాతీయ వనరుల విశిష్ట వినియోగం కోసం విద్యుత్ రంగంలో ప్రణాళికబద్ధ కృషి ఆవశ్యకతను గుర్తించింది. అయినప్పటికీ పోటీ ద్వారా సమర్ధతను సాధించాలనే సాకుతో ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు కర్మాగారాల స్థాపనలో సమయం, స్థలం. పరిమాణాలతో నిమిత్తం లేకుండా ఆంక్షలు లేని స్వేచ్చను అందించింది.
ప్రస్తుత ప్రభుత్వం తన కేంద్రీకరణ ను సౌర విద్యుత్ కు మార్చుకుంది. గత ప్రభుత్వం థర్మల్ విద్యుత్ కు ఇచ్చిన ప్రోత్సాహం తెలిసి కూడా,థర్మల్ విద్యుత్ అభివృద్దికి తీవ్రంగా అంతరాయం కలిగిస్తున్న సమస్యలను పరిష్కరించ కుండా,ప్రస్తుత ప్రభుత్వం సౌర విద్యుత్ సామర్ధ్యాన్ని పెంచటం కోసం మున్నెన్నడు ఎరుగని లక్ష్యాలను నిర్దేశిస్తున్నది.
స్వేచ్చానువాదం :కొండముది లక్ష్మీ ప్రసాద్