Tuesday, March 31, 2015

భారత దేశ వార్తా పత్రికా రంగం -భవితవ్యం - సవాళ్లు

భారత దేశ వార్తా పత్రికా రంగం -భవితవ్యం - సవాళ్లు 
-ఎన్. రామ్ 
అభివృద్ది చెందిన ప్రపంచ దేశాలలో వార్తా పత్రికారంగం చూస్తుండగానే   సంక్షోభంలో కూరుకుంది. ఈ డిజిటల్ యుగంలో బాగా అభివృద్ది చెందిన దేశాలలోని  వార్తా పత్రికలూ మరియు సమాచార టెలివిజన్ల  భవితవ్యంపై విషాదం అలముకుంది. వ్యాన్ ఇఫ్రా ఆధ్వర్యంలో అక్టోబర్ 2011న వియన్నాలో నిర్వహించిన ప్రపంచ న్యూస్ పేపర్ కాంగ్రెస్స్ మరియు ప్రపంచ సంపాదకుల ఫోరం  లలో నేనూ పాల్గొన్నాను. ఆ సమావేశాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిలోనూ వార్తా పత్రికా రంగ చారిత్రక యుగం ముగింపు కొచ్చిందని, ప్రపంచ వ్యాప్తంగా అటూ ఇటూగా  అందరం నిలకడలేని అనిశ్చితి లోకి అడుగుపెడుతున్నామన్న భావన  కలిగింది. పాఠకుల ప్రవర్తనలలోను,  వార్తలను స్వీకరించే రీతిలోనూ వస్తున్న పెను మార్పులతో పాటు వెబ్ మరియు మొబైల్ వేదికలు వేగాన్ని పుంజుకోవడంతో, ప్రాణాంతకమైన ఆర్ధిక ఇబ్బందులతో పాటు  జారిపోతున్న పాఠకలోకాన్ని తిరిగి చేజిక్కించుకోవడం సంప్రదాయ వార్తాపత్రికారంగానికి పెను సవాలైంది. ఇటువంటి  పరిశ్రమకు సంబంధించిన ధోరణులతో పాటు,అబివృద్ది చెందిన దేశాలలో ఒత్తిళ్ళు, నిరాశ నిర్వేదాలు, గందరగోళాలతో    ఇప్పటికే స్వతంత్రమైన, సమర్ధవంతమైన జర్నలిజం   భారిగా దెబ్బతింది. కొలంబియా యూనివర్సిటీ మా పూర్వ విద్యార్ధుల సంఘం  ఆధ్వర్యంలో ప్రచురించిన " అమెరికా జర్నలిజం పునర్నిర్మాణం " అన్న సమకాలీన నివేదికలో  ప్రస్తావించినట్లు, "స్వతంత్ర నివేదనలో దేశానికి  పట్టుగొమ్మలైన వార్తా పత్రికలు, కొద్దిమంది జర్నలిస్టులతో, కొద్ది పేజీలకు పరిమితమై కొద్ది కధనాలతో వాస్తవంగా కుంచించుకు పోతున్నాయి. ''

ఈ దుస్థితితో భారత దేశ వార్తా పత్రికా రంగాన్ని పోల్చి చూస్తే,అది అభివృద్ది బాటలో ప్రస్పుటంగా కనిపిస్తుంది. కాని ఎగసిపడుతున్న మన అభివృద్ది వృత్తాంతం, దాని పర్యవసానాల్ని విమర్శనాత్మకం గా  పరిశీలించుకోవాల్సివుంది. గణాంకాలు అందుబాటులో వున్నా వాటిని అంతగా పట్టించుకోదలచలేదు. 2012 న్యూయార్కర్ పత్రికలో కెన్ ఔలెట్ట తన వ్యాసంలో వ్రాస్తూ, భూఖండంలో వార్తా పత్రికలు బతికి బట్టకడుతున్న దేశాలలో భారత దేశం ఒకటని, ఇక్కడ జర్నలిస్టులకు,  ప్రత్యేకించి యువకులకు పుష్కలంగా నైపుణ్యావకాశాలు వున్నాయని వ్రాశారు. 

ఇండియన్ ప్రెస్ ప్రత్యేకించి భారత దేశ భాషా వార్తా పత్రికలూ మరియు ఉపగ్రహ వార్తా టెలివిజన్ వృద్ధి పధంలో కొనసాగుతున్నాయి. ఈ అభివృద్ది కధనంలో కొంత భాగాన్ని విశేషంగా పరిశోధించి, విశ్లేషించిన  అంశాల్ని 15సంవత్సరాల క్రితమే రాజకీయ శాస్త్రవేత్త అయిన రాబిన్ జఫ్రీ తన "భారత దేశ వార్తా పత్రికా విప్లవం" అన్న పుస్తకంలో పొందుపరచారు. దీనితో పాటు ఈ అంశంపై ఎకనామిక్ మరియు పొలిటికల్ వీక్లీ లో 1987,1993,1997లలో సీరియల్ గా ఆయన  వ్యాసాల్ని ప్రచురించారు. అభివృద్ది చెందిన సాంకేతిక విజ్ఞానం, నిలకడగా విస్తరిస్తున్న అక్షరాస్యత, మెరుగైన కొనుగోలుశక్తి, వైరుధ్యభరితమైన కధనాలు, వీటన్నిటిని మించి రాజకీయ ఉత్సుకతలు- భారత వార్తా పత్రికా విప్లవం వెనుకనున్న కీలకాంశాలుగా రాబిన్ జఫ్రి  పేర్కొన్నారు. ఇక్కడ వార్తల దాహార్తి పుష్కలంగా వుండి, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు , వినోదం , వాటి సంకర ఆవిష్కరణ అయిన "వినోదాత్మక సమాచారం " - అన్నీ వార్తల ముసుగు క్రింద చలామణి అవుతున్నాయి. ఈ మూసలో  పలుకుబడి కలిగిన భారత భాషా వార్తా దినపత్రికలు  పుంఖాను పుంఖాలుగా విస్తరించాయి. అందులో చాలా పత్రికలు  అత్యధిక సర్క్యులేషన్, భారీ పాఠకలోకాన్నికలిగి వున్నాయి. 
అయినప్పటికీ భారత పత్రికా రంగం ప్రదర్శిస్తున్న  ఎగసిపడే అబివృద్ధిని, వాటి పర్యవసానాల్ని ఆరాధనా స్థాయికి తీసుకు వెళ్ళకూడదు. భిన్నత్వాలు కలిగిన ప్రజల అవసరాలు ప్రత్యేకించి గ్రామీణ ప్రజలు మరియు మహిళల అవసరాలకు న్యాయం చేయకలిగే సామాజిక దృక్కోణం  కలిగివుండటానికి భారత వార్తా పత్రికా రంగం ఇంకా చాలా దూరం  ప్రయాణించ వలసి వున్నది. ఈ అంశాలపై సంపాదకీయాలు వ్రాయటానికి వాస్తవంలో అనేక ఇబ్బందులు  ఇమిడి వున్నాయి. 

భారత టెలివిజన్ భారి ప్రేక్షక లోకం కలిగివుండి ఇంకా వృద్ది చెందుతూనే వుంది. అయినప్పటికీ ఈ సామూహిక ప్రేక్షక లోకం లో అత్యధిక భాగం వినోద చానళ్ళ కు సంబందించిన వారే. ఇంగ్లీష్ మరియు ఇతర భాషా వార్తా పత్రికలతో పోటీ పడకలిగిన 24 x 7 ఉపగ్రహ టెలివిజన్ వార్తా చానళ్ళు దజన్లలో వున్నా మొత్తం టివి మార్కెట్లో వాటి నిష్పత్తి చాలా స్వల్పంగా వుంది. 

భారత పత్రికా రంగ ప్రదర్శిస్తున్న ఎగసిపడే వృద్ధిని పెద్దదిగా చేసి చూపించవద్దనటానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కవర్ పేజి ధరలకంటే తక్కువ ధరలకు పత్రికల నమ్మడం, వందలవేలాది కాపీలను ముద్రించి,  వాటిని పాత  కాగితాల మార్కెట్ కు తరలించడం లాంటి అనైతిక పద్ధతులతో భారీ సర్క్యులేషన్ లేబిల్ పొందటం వార్తా పత్రికలకు పరిపాటి అయ్యింది. వీటిలో రెండవ పధ్ధతి వాణిజ్య ప్రకటనల సముపార్జనకు ఒక విధాన ప్రక్రియగా మారింది. ఇది చాలదన్నట్లు టెలివిజన్ ప్రేక్షకుల కొలమాన విధానం(టి.ఎ. ఎం ) విస్తృతమైన విమర్శలకు గురై, న్యాయపరమైన చిక్కులను  ఎదుర్కొంటుంది. . 

ప్రింట్ మరియు సమాచార రంగ వ్యవస్థలన్నీ క్రమంగా  ఆర్ధిక సంక్లిష్టతను ఎదుర్కొంటున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా వాణిజ్య ప్రకటనల రంగం బిగుసుకు పోతున్నది. ప్రింట్ రంగంలో వృద్ది మందగించింది. 2008-09 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఇందుకు దోహద పడినట్లుంది. అది భారత పత్రికా రంగ వృద్ది నే దెబ్బ తీసింది. సంక్షోభ పూర్వ కాలంలో చవి చూసిన,  కీలకమైన వాణిజ్య ప్రకటనల రెవిన్యూను మనం తిరిగి చూడలేమని నిపుణులు చెప్తున్నారు. 
భారత దేశం డిజిటల్ యుగ  వైరుధ్యాలను ఎదుర్కొని ఎలా మనగలుగుతుంది? పరివర్తనా యుగానికి కేంద్రమైన ఈ వైరుధ్యాన్ని నిర్వచించటానికి ప్రయత్నిస్తాను. ఒక ప్రక్కన అత్యధికంగా ప్రజలు డిజిటల్ గా  వార్తా పత్రికల్ని చదువేందుకు ముందుకొస్తున్నారు. మొట్టమొదటి సారిగా చరిత్రలో ఉత్తమ ప్రచురణలకు ప్రపంచ వ్యాప్త సజీవ పాఠకలోకాన్ని  కలిగివున్నాము. బహుముఖ మైన శీర్షికలతో,  మల్టీ మీడియా హంగులతో  సుసంపన్నమైన అనేక అత్యత్భుత వార్తా పత్రికలూ, వార్తా వెబ్సైట్ లు లభ్యమౌతున్నాయి. లభ్యమౌతున్న ఈ స్థలంలో అందించ కలిగే సమర్ధతకు ఆకాశమే హద్దు గా ఉన్నట్లుంది. మరో ప్రక్క, పాత వార్తా పత్రికా రంగాన్ని అతలాకుతలం చేస్తున్న " అస్తిత్వ సంక్షోభం" ఇంకా పరిష్కరింపబడలేదు. భారీ నష్టాన్ని చవిచూస్తూ అది కొనసాగుతూనేవుంది. జర్నలిజం భవితవ్యం పై చర్చలు ముగియ లేదు. దిగజారిన నైతికత, అల్ప స్థాయి చైతన్యం జర్నలిస్ట్ వృత్తిని, వార్తా పత్రిక పరిశ్రమను వెంటాడుతూనే వున్నది. ఎందుకంటే ఈ అద్భుతమైన పరిణామం అటు అంతర్జాలానికి గాని లేదా ఇటు డిజిటల్ జర్నలిజానికి గాని మనగలిగే ఆదాయాల్ని మరియు వ్యాపార నమూనాన్ని ఇవ్వలేక పోతున్నది. 

అంతర్జాల వినియోగంలో, బ్రాడ్ బ్యాండ్ సౌలభ్యం కావడంలో మన దేశం సాపేక్షంగా వెనుకబడి ఉన్న కారణంగా వార్తా పత్రికా రంగం,సమాచార టెలివిజన్ ఆ మేరకు ప్రయోజనాల్ని  పొందకలగడంలో  ఎవరికీ లేశ మాత్రమైన సందేహం కూడా లేదు. . ఈ విషయంలో చైనా అత్యద్భుత ప్రగతిని సాధించింది. జూలై 2014 అంతానికి ఆ దేశంలో 632 మిలియన్ల అంతర్జాల వినియోగ దారులున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో అత్యధిక భాగం బ్రాడ్ బ్యాండ్ వినియోగ దారులు కావటం విశేషం. మన దేశ అంతర్జాల అభివృద్ది పై అధికారికంగా ఇంతవరకు  ఏ విధమైన శాస్స్త్రీయ సర్వే నిర్వహింపబడలేదు. చిత్తు అంచనాలలో భారత దేశంలో 240 మిలియన్ల అంతర్జాల వినియోగ దారులున్నట్లు తేలింది. వీరిలో అత్యధికులు లోపభూయిష్టమైన బ్యాండ్ విడ్త్  తో సతమత మౌతున్నారు. పోల్చదగ్గ జనాభా కల్గిన ఈ రెండు దేశాల్లో  అంతర్జాల విస్తరణ పోలిక ఆసక్తికరమైన విశేషాన్ని తెలియచేస్తుంది. భారత దేశంలో అంతర్జాల విస్తరణ కంటే రెట్టింపుకు మించి చైనా లో విస్తరణ 47శాతం గా వుంది. 

దీనర్ధమేమంటే వార్తా పత్రికా రంగం మరియు సమాచార టెలివిజన్ల పై డిజిటల్ విప్లవ ప్రభావం పడటం ఇంకా ప్రారంభం కాలేదు. మనదేశంలో ప్రతి వార్తా పత్రిక వెబ్ సైట్ కలిగివుండి, అందులో అనేక పత్రికలూ సమాచారాన్ని, ఆకర్షణీయ మైన డిజిటల్ హంగులను దేశీయ, విదేశీ పాఠకుల ప్రయోజనం కోసం నిర్వహిస్తున్నప్పటికీ, అవి ప్రింట్ మీడియాకు లోబడే వున్నాయి. ది గార్డియన్ పత్రిక సంపాదకులు ఎలన్ రుస్ బ్రిడ్జర్ చెప్పినట్లుగా ఇలా చెప్తుంటారు,'జర్నలిజం కాంతి తరంగాల  వేగంతో సమానంగా మార్పుకు గురౌతున్నది( దాదాపు సెకనుకు 3 లక్షల కి.మీ ),  మీడియాను పరివర్తింప చేస్తున్న డిజిటల్ టెక్నాలజీల  నూతన విజ్ఞానాన్ని, నవీన సత్యాలను  తప్పనిసరిగా ప్రతి వారం తెలుసుకుంటున్నాము".   ఈ మార్పు మన దేశంలో శబ్ద తరంగాల వేగంతో (సెకనుకు 342.29 మీటర్లు)వున్నట్లు మన దేశ వార్తా పత్రికా పరిశ్రమ అంతర్గతంగా అబిప్రాయ పడుతున్నట్లుంది. 

ఈ పరిస్థితి ఉదాసీనతను పుట్టిస్తున్నది. డిజిటల్ యుగానికి ముఖ్యమైన నూతన విజ్ఞానాన్ని. నవీన సత్యాలను తెలిసికోవాలనే నిజమైన చొరవ వుండటం లెదు. అమెరికా ప్రింట్ మీడియా ఎదుర్కుంటున్న పరిస్థితిని భారత వార్తా పత్రికా రంగం 2040 నాటికి ఎదుర్కోవలసి వుంటుందని, . ప్రకటనలపైన, ఇతర అంశాలపైన ఆర్జించ కలిగే రెవెన్యూ లో అత్యధిక భాగం మనం సాంతం చేసికోవటానికి సంసిద్దులం కావాలని  భారత దేశంలో కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. డిజిటల్ ప్రభావం తక్షణం కాకపోయినా సమీపంలో వుంటుదన్న వాస్తవాల్ని గుర్తించలేని వారి జోస్యాలు, అంచనాలు సత్య దూరా లనిపిస్తుంది. 2040 వరకు పరివర్తన సమయం రావడం అసాధ్యమనిపిస్తుంది. 

ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఏకీకరణల  ప్రక్రియతో రాజీపడటం -ఇక్కడ మన ముందు పెద్ద సవాలుగా నిలిచింది. 'మార్పు'యొక్క నడకను నిశితంగా అంచనా వేసికొని, సంక్లిష్ట పరిస్థితులను గమనంలో వుంచుకొని భవిష్యత్ జీవితానికి సిద్ధం కావలసి వుంది. 

భారత వార్తా పత్రిక రంగంలో పలుకుబడి కలిగిన వర్గాలు చాలాకాలంగా రాజకీయాలలో నిర్వహిస్తున్న  ప్రజాతంత్ర పాత్ర ప్రశ్నించలేనిది. దురదృష్టవశాత్తు, ఆర్ధిక సమస్యలు, విధానాలు వచ్చేసరికి ప్రధాన స్రవంతి మీడియా అప్రజాస్వామికంగానే వ్యవహరిస్తున్నది. కానీ ఎప్పుడూ ఇదే విధానం కొనసాగలేదు. ఆకలి చావుల సమస్యల్లో క్షేత్ర స్థాయిలో  తీవ్ర బాధితుల వాస్తవ జీవితాల్ని బహిరంగ పరచడంలోను  ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాల అమలును నివారించి, తీవ్ర ఆకలి, క్షామ పరిస్థితుల నుండి విముక్తిపరిచే గ్యారంటీలు పొందటంలోను ఇతర ప్రజాతంత్ర సంస్థలతో కలసి భారత దేశ  మీడియా  నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను అమర్త్యసేన్ కొనియాడారు. 

గత రెండు దశాబ్దాలుగా తీవ్ర దుష్ప్రభావాల్ని కలిగించిన నయా ఉదారవాద విధానాలను సవాలు చేసే వార్తలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాల్ని భారత వార్తా పత్రికా పరిశ్రమను నిర్వహిస్తున్న అనేక శక్తులు బహిష్కరించాయి. ప్రధాన స్రవంతి పత్రికలు మరియు సమాచార టెలివిజన్ ఆ విధానాలను నెత్తి కెత్తుకొని, వాటిపై వస్తున్న విమర్శల్ని, అభ్యంతరాల్ని ప్రచురణకు నోచుకోకుండా చేయటమో లేదా విమర్సల  పదునును తగ్గించడమో చేస్తున్నారు. సామాజిక ఆర్ధిక ప్రతికూల ప్రభావాల్ని సెన్సార్ చేస్తున్నారు. ఆర్ధిక నిపుణులతో పాటు ఈ విధానాలపై  పటిష్టమైన విమర్శలు చేసేవారి గొంతుకలకు కూడా  ప్రచురణ స్థానం ఇవ్వడంలేదు. 

ప్రజల దైన్య స్థితుల వాస్తవాలను ప్రముఖంగా చెప్పటం కంటే "అంతా బాగానే వుంది"అన్న భావనకు ప్రచురణలలో ప్రాధాన్యతనివ్వాలని పత్రికా యజమానులు , ప్రకటన కర్తలు, మార్కెటింగ్ అధికారులు, కార్పోరేట్ మేనేజర్లు, చివరకు సీనియర్ జర్నలిస్టుల నుండి కూడా భారత దేశ జర్నలిజం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటుందని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. . "పేదరికం,ప్రత్యేకంగా గ్రామీణ పేదరికం, వార్తలకుగాని, సంపాదకీయాలకు గాని కధనా వస్తువు  వుండ కలిగే అర్హత లేదని, పేదరికాన్ని ఆకాంక్ష గా స్వీకరించలేని యువకులకు, ఈ వార్తాసేకరణ వారి  ఆకాంక్షల్ని ఎలా నెరవేర్చగలదని , వ్యాపార తాత్వికత నుండి ఉద్భవించిన వార్తాపత్రిక సంపాదకీయ తాత్వికత, ఆశావాదాలలో ఒకటిగా ఎలా మనగలుతుందనే అంశాల గూర్చి  భారత దేశ వార్తా పత్రికా ఎగ్జిక్యుటివ్లతో 'ఔలెట్ట'  నిర్మోహమాటం గా జరిపిన సంభాషణలనుండి   తెలుసుకున్నారు. 

చెన్నై లోని ఆసియా స్కూల్ అఫ్ జర్నలిజం విద్యార్ధులకు 2002 సంవత్సర స్నాతకోపన్యాసంగా ప్రముఖ ఆర్ధిక వేత్త ప్రభాత్ పట్నాయక్, "మార్కెట్లు, నైతికత, మీడియా "అనే అంశం పై తన స్వతస్సిద్ధమైన, అసాధారణమైన  దృక్కోణ పధ్ధతిలో ప్రసంగించారు. ఆయన ఆ సందర్భంగా చేసిన ప్రసంగ పూర్తి  పాఠం ఆన్ లైన్ లో లభ్యమౌతున్నది. ఇక్కడ దాని ముగింపును మాత్రం   ప్రస్తావిస్తాను. 

ఆర్ధిక అంశాలకు సంబంధించి మీడియా శక్తి పై,  పై ప్రసంగాన్ని  మనం "పట్నాయక్ చట్టం" గా అభివర్ణించ వచ్చును. "అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, మీడియా ఒకే సరసన ఉన్నప్పుడు, మీడియా శక్తిమంతంగా కనిపిస్తుంది. కానీ దానంతటదిగా మీడియా మానవ విలువల్ని సమర్ధిస్తూ, పేదలు నిర్భాగ్యుల వేదనల్ని వాస్తవంగా వ్యక్తంచేసినప్పుడు అది శక్తి విహీనంగా కనిపిస్తుంది.  ఈ శక్తి విహీనత ఒక ప్రక్రియ ద్వారా ఉద్భవిస్తుందని ఆయన సూత్రీకరించారు. ఆర్ధిక వ్యవస్థ పై అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రాబల్యం సాధించటమే ఆ ప్రక్రియగా చెప్పారు. వైరుధ్య పూర్వకంగా గౌరవనీయమైన కొన్ని మినహాయింపులు తప్పించి, స్థూలంగా ఈ ప్రాబల్యాన్నిమీడియా మనస్పూర్తిగా  సమర్ధిస్తున్నది. 

పేదరికం , సామూహిక నిరాకరణ, మౌలిక జీవనాధార సమస్యలు, ఈ సమస్యలపై ప్రభుత్వ విధానాల ప్రభావం, వ్యవసాయం స్థితిగతులు,గ్రామీణ సమస్యలు భారతదేశ వార్తాపత్రికల్లో, సమాచార టెలివిజన్ లో అతి తక్కువ స్థాయిలో ప్రచురణకు నోచుకుంటున్నాయి పట్నాయక్ ప్రస్తావించిన ' గౌరవనీయ మినహాయింపులు' చాలా  సార్ధకమైనవి. గ్రామీణ దుస్థితి,రైతుల ఆత్మహత్యలు, సామూహిక వలసలు లాంటి సామాజిక అంశాలపై పి. సాయినాథ్ పరిశోధన వ్యాసాలు- ప్రజా హితమైన, పరిశోధనాత్మకమైన, కార్యాచరణను రూపొందించే జర్నలిజం యొక్క విలువైన సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నాయి. ఇటువంటి జర్నలిజానికి విలువనివ్వకలిగే ప్రజా సంస్కృతిని నిర్మించగలిగి, ప్రతిభావంతమైన పై కృషికి వివిధ భారతీయ భాషల్లో ఈ అంశాలపైనే ఆదర్శ భావాలు గల యువ విలేఖరుల రచనలు తోడైతే ప్రస్తుత సంక్లిష్ట స్థితి నుండి బయటపడటానికి మార్గం దొరకగలదు. 

భారత వార్తా పత్రికా రంగం చర్చలలో తరచూ ఉపేక్షింప బడుతున్న క్లిష్టమైన అంశం దగ్గరకు తీసుకు రాబడ్డాను. రెండు స్థితులు: వార్తా పత్రికా పరిశ్రమ యొక్క అదృష్టాలు మరియు జర్నలిజం యొక్క స్థితి. ఈ రెంటిని కలుపకూడదు. యాజమాన్యాల  ఆర్ధిక రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చటం కోసం వార్తల్ని, విశ్లేషణల్ని, వ్యాఖ్యనాల్ని మార్చడం, ప్రముఖ వార్తా పత్రికలూ , వార్తా టెలివిజన్ సంస్థలలో సంపాదకీయ విషయాన్ని,సంపాదకీయ కార్యకలాపాల్ని తక్కువ చేయటం, విలువలేకుండా చేయటం, మార్కెట్ పరిశోధన పేరు మీద క్రమ పద్ధతిన నోరు మూయించడం, యాజమాన్యాలు,సీనియర్ మేనేజ్ మెంట్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంపాదకీయాల స్థాయిని దిగజార్చే పద్ధతులకు ఇష్టపూర్వకంగా అంగీకరించడం, సంపాదకీయ సమాచారం ముసుగులో అందించే అడ్వర్ టైజ్ మెంట్ సమాచారంలో వార్తలకు చెల్లించే వివరాలను పూర్తిగా ఇవ్వకపోవడం/ అసలు ఇవ్వకపోవడం, ప్రైవేట్ ఒప్పందాలు, ఎన్నికల ప్రచార వార్తలకు చేల్లిపులు స్వీకరించడం, అనుకూల వార్తల ప్రచురణకు లంచాలు తీసికోవటం,  ఈ రకమైన పద్ధతులతో వార్తా పత్రికలూ , ఇతర వార్తా మీడియా వర్ధిల్లుతుంటే. భారత దేశ మీడియా  రంగం అభివృద్ది బాటలో తీవ్రమైన అక్రమాలున్నాయి.  

ఫ్రంట్ లైన్ పత్రికలో ప్రచురించిన వ్యాసానికి కె.యల్. ప్రసాద్  సంక్షిప్త అనువాదం 

Sunday, March 22, 2015

అంకెల మాయాజాలంలో ఆర్థిక వ్యవస్థ

ప్రభుత్వం చెపుతున్నట్లు ఆర్థికాభివృద్ధి 7 శాతానికిమించితే తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలుపెరగాలి. బ్యాంకు రుణాలు 2013-14లో 9. 7 శాతం ఉండగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతానికి మించలేదు. కీలకమైన మౌలికవసతుల కల్పన రంగం - జాతీయ రహదారులు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, ప్రత్యేక పారిశ్రామిక వాడలు వంటి రంగాల్లో ఉన్న కంపెనీలకు రుణాలు ఇవ్వవద్దని రిజర్వు బ్యాంకు ఆదేశించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుకు అనుగుణంగానే పన్నుల ఆదాయాలు పెరగాలి. కానీ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోయిందని బడ్జెట్‌ 
పత్రాల్లో ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు నివేదించారు.
                    ''అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభంలో భాగంగా నాలుగేళ్ల పాటు నత్తనడక సాగించిన భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఉరుకులు పరుగులు తీయనారంభించింది.'' 2015-16 బడ్జెట్‌ ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో చేసిన ప్రసంగపాఠం ఇది. కేంద్ర గణాంకాల సంస్థ తాజాగా వెలువరించిన నూతన గణాంకాలు దీనికి ప్రాతిపదిక అని కూడా ఆయన ప్రకటించారు. ఈ నూతన గణాంకాల ఆధారంగానే దేశ ఆర్థిక ప్రగతి చైనాతో పోటీ పడే స్థాయిలో ఉందన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర గణాంకాలు, ఆర్థికవ్యవస్థ ప్రగతిని కొలవటంలో దాని అంచనాల పాత్ర, వాటి ప్రాసంగికత వంటి అంశాలపై మరోమారు చర్చ మొదలైంది. ఏ ఆర్థిక వ్యవస్థ విశ్లేషణకైనా ఆయా దేశాల్లోని ప్రజల స్థితిగతుల్లో వచ్చిన మార్పులు పరిశీలించటం ప్రమాణం. ఈ మార్పులను జాతీయ స్థాయిలోనో, రాష్ట్రాల స్థాయిలోనో పరిశీలించేటప్పుడు అంకెల్లో అంచనాలకు రావటం పరిపాటి. అయితే ఈ అంచనాలు జనజీవితాల్లో కనిపించే వాస్తవికతకు దగ్గరగా లేకపోతే కేవలం అంకెల గారడీగానే మిగిలిపోతాయి. 2015 జనవరిలో కేంద్ర గణాంకాల సంస్థ విడుదల చేసిన తాజా అంచనాలు, అందుకు అనుసరించిన ప్రమాణాలు ఇటువంటి గారడీకి పాల్పడ్డాయా అన్న సందేహం రిజర్వు బ్యాంకు గవర్నర్‌తో సహా పలువురు వ్యక్తం చేస్తున్నారు. 
                  జాతీయ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంకెల్లో బంధించి ప్రపంచం ముందుంచటానికి అన్ని ప్రభుత్వాల ఆధీనంలో గణాంక సంస్థలు పని చేస్తాయి. భారతదేశంలో దీనికోసం ఏకంగా ఒక మంత్రిత్వశాఖే పని చేస్తోంది. ఈ శాఖ ఆధీనంలోనే కేంద్ర గణాంకాల సంస్థ, జాతీయ నమూనా సర్వే సంస్థ వంటి కీలకమైన విభాగాలు ఉన్నాయి. కేంద్ర గణాంకాల సంస్థ ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు పారిశ్రామిక సంస్థల నుండి ప్రతి నెలా గణాంకాలు సేకరించి వాటి ఆధారంగా జాతీయ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంచనా వేస్తుంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విధి విధానాలు రూపొందించటంలో ఈ అంచనాలే ప్రభుత్వాలకు మౌలికమైన ఆధారాలుగా పని చేస్తాయి. కార్మికులకు డిఎ పెంచాలన్నా, వేతన కమిషన్‌ సిఫార్సులు అమలు జరపాలన్నా, వేతన పెంపు నిలుపుదల చేయాలన్నా, కొత్త పన్నులు విధానాలు ప్రతిపాదించాలన్నా అన్నింటికీ ఈ గణాంక సంస్థ అంచనాలే కీలకం. ఈ గణాంక సంస్థలు విడుదలచేసే పారిశ్రామికోత్పత్తి సూచిక (ఇండెక్స్‌ ఆఫ్‌ ఇండిస్టియల్‌ ప్రొడక్షన్‌) ప్రభుత్వాలు అనుసరించే పారిశ్రామిక విధానాలకు దిశా నిర్దేశం చేస్తుంది. ప్రపంచీకరణ యుగంలో వాస్తవాలకతీతంగా అంచనాలు విడుదలచేయటం ఆనవాయితీగా మారింది. 
                2004-05 ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థను అంచనా వేస్తూ వచ్చారు. అంటే 2004-05 నాటికి అన్ని గణాంకాలు 100గా ఉన్నాయనుకుంటే తర్వాతి సంవత్సరాల్లో ఆయా గణాంకాలు 100 కంటే ఎంత ఎక్కువ ఉన్నాయి, ఎంత తక్కువ ఉన్నాయి అన్నదాన్ని బట్టి ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందా, తిరోగమిస్తోందా, స్థబ్ధతలో ఉందా అన్న నిర్ధారణకు వస్తుంటారు. ఈ అంచనాల ఆధారంగానే యుపిఎ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో విఫలం అయ్యిందనే ప్రచారం హోరెత్తింది. అంతిమంగా కాంగ్రెస్‌ను అంపశయ్యపైకి చేర్చి బిజెపి అధికారానికి వచ్చింది. కుర్చీలో కూర్చున్నాకగానీ అయ్యవార్లకు అసలు విషయం అంతుబట్టలేదు. ఆర్థిక విధానాలు గాడిలో పెట్టామని బిజెపి ఎంతగా డంభాలు పలికినా ఆచరణలో పారిశ్రామికోత్పత్తి సహా అన్ని ఆర్థికాభివృద్ధి సూచికలు నేల చూపు కొనసాగించాయి. ఆర్థిక వ్యవస్థను నడిపించే లాభాపేక్షకు జేబులో మిగులు పోగుపడిందా లేదా అన్నదే ప్రధానం తప్ప ప్రభుత్వంలో బిజెపి ఉందా కాంగ్రెస్‌ ఉందా అన్నది పెట్టుబడికి సంబంధం లేని విషయం. అందువల్లే మోడీ మాటల మంత్రదండం పని చేయలేదు. గోబెల్స్‌ ప్రచారంలో ప్రావీణ్యం సాధించిన బిజెపి ఏకంగా ఆర్థిక అంచనాల ప్రాతిపదిక సంవత్సరాన్ని 2004-05 నుండి 2011-12కు మార్చింది. దాంతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా అంగలుపంగలు మీద పరుగులెత్తుతున్నట్లు కనిపించింది. ఈ పరిణామం హేతుబద్దంగా ఆలోచించే మేధావుల ముందు పలు ప్రశ్నలు లేవనెత్తింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇటువంటి అంకెల మాయాజాలాన్ని బాగా అర్థం చేసుకుని ఇప్పుడు రిజర్వు బ్యాంకు గవర్నర్‌ హోదాలో పని చేస్తున్న రఘురాం రాజన్‌ వంటివారే తాజా అంచనాల్లో ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంచనాలు తప్ప మరేవీ నమ్మశక్యంగా లేవని ప్రకటించారు. 
                     ఈ గణాంకాల ప్రాతిపదికను, పొందికను మార్చటానికి ఐక్యరాజ్యసమితి గణాంకాల సంస్థ సూచనలు కారణమని ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ఈ తాజా కసరత్తు. గణాంకాల సూచికలు ఐక్యరాజ్యసమితి సూచనల మేరకు ఉన్నాయని భావించినా వాటిని దేశానికి వర్తింపచేసుకోవటంలో ప్రభుత్వం, ఉదారవాద మేధావులు అనుసరించిన మతలబుతో కుంటి గుర్రంలా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఏకంగా కుందేలులాగా కుప్పిగంతులు వేయనారంభించింది. అందుకే అనుభవజ్ఞుల అంకెలు నందిని పందిగాను, పందిని నందిగానూ నిరూపిస్తాయని విమర్శిస్తుంటారు. సాధారణంగా ప్రభుత్వం విడుదలచేసే వివిధ గణాంకాల మధ్య పోల్చి విశ్లేషకులు లోతుపాతులు వ్యాఖ్యానించటం ఆనవాయితీ. విశ్లేషణ కోసం పోల్చాలన్నా సూచికలు ఒకే విధంగాఉండాలి. కానీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా అంచనాల్లో అటువంటి కీలక సూచికల్లో కూడా మార్పులు చేయటంతో ఈ అంచనాలను విమర్శనాత్మకంగా విశ్లేషించటానికి, పోల్చి తప్పొప్పులు చూపటానికి, విధానపరమైన నిర్ధారణలకు రావటానికి అవకాశం లేకపోయింది. నయాఉదారవాదం ప్రత్యామ్నాయ దృక్ఫధాన్ని, ఆలోచనలను, విశ్లేషణా సామర్ధ్యాన్ని ఎలా నియంత్రిస్తుందో తెలియచెప్పేందుకు ఇది ఒక తాజా ఉదాహరణ. 
ప్రభుత్వం చెపుతున్నట్లు ఆర్థికాభివృద్ధి 7 శాతానికి మించితే తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు పెరగాలి. లావాదేవీలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగాలి. కానీ ప్రభుత్వ అంచనాల్లోనే ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో తగ్గిపోయింది. పారిశ్రామికోత్పత్తి పుంజుకుంటే ఆయా కంపెనీల షేర్లు అమ్మకాలు పెరగాలి. కానీ ఈ గత సంవత్సర కాలంగా విదేశీ మదుపరులను మినహాయిస్తే దేశీయ పారిశ్రామిక సంస్థల షేర్ల అమ్మకాలు స్థబ్దతకు లోనయ్యాయి. 2014 ఏప్రిల్‌ - డిశంబరు వరకు తొమ్మిది నెల్లపాటు 2.1 శాతంగా ఉన్న పారిశ్రామికోత్పత్తుల సూచి ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 6.7 శాతంగా ఉంటుందని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఫిబ్రవరి వరకు విడుదల అయిన ఈ సూచి లెక్కలు కూడా అంచనాలు తప్పే అని చెపుతున్నాయి. బ్యాంకు రుణాలు 2013-14లో 9. 7 శాతం ఉండగా 2014 -15 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతానికి మించలేదు. కీలకమైన మౌలికవసతుల కల్పన రంగం-జాతీయ రహదా రులు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, ప్రత్యేక పారిశ్రామిక వాడలు వంటి రంగాల్లో ఉన్న కంపెనీలకు రుణాలు ఇవ్వవద్దని రిజర్వు బ్యాంకు ఆదేశించింది. ఆర్థిక వ్యవస్థలో ఉపద్రవం స్థాయికి చేరనున్న సంక్షోభానికి ఇవి సూచనలు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుకు అనుగుణంగానే పన్నుల ఆదాయాలు పెరగాలి. కానీ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోయిందని బడ్జెట్‌ పత్రాల్లో ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు నివేదించారు. ఈ వివరాలన్నీ ప్రభుత్వం విడుదల చేస్తున్న అంచనాలకు, ఆర్థిక వ్యవస్థ వాస్తవిక స్థితికి మధ్య పొంతనలేని వైనాన్ని తెలియ చేస్తుంది. 
                   ప్రభుత్వాల ఆర్థిక అంచనాలన్నీ ఏదో ఒక సంవత్సరం వాస్తవిక లెక్కలు ఆధారం చేసుకుని (స్థిర ధరల ప్రాతిపదికన) సాగుతుంటాయి. అటువంటి ఆధారిత సంవత్సరాన్ని గణాంకాల పరిభాషలో బేస్‌ ఇయర్‌ అంటారు. ఈ బేస్‌ ఇయర్‌ ప్రతి పదేళ్లకొకసారి మారుతుంది. స్వాతంత్వ్రానంతరం 1948-49 ఆర్థిక సంవత్సరాన్ని బేస్‌ ఇయర్‌గా తీసుకుని నాటి స్థిర ధరల ప్రాతిపదికన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంచనాలు లెక్కగట్టటం ప్రారంభం అయ్యింది. అప్పటి వరకు ఆర్థిక వ్యవస్థ ఇంగ్లాండ్‌ పార్లమెంట్‌ కనుసన్నల్లో ఉండేది. దాంతో దేశీయంగా అన్ని వివరాలు అందుబాటులో లేని పరిస్థితి తలెత్తింది. కాల క్రమంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ కేంద్రం ఢిల్లీకి మారటం, గణాంకాల్లో తగు మార్పులు చేసుకోవటం, మార్పులుకు అనుగుగణంగా వివరాలు సేకరణ ప్రారంభం కావటంతో 1967 నాటికి గణాంకాల సేకరణ గాడిలో పడింది. దాంతో 1960-61 ఆర్థిక సంవత్సరం బేస్‌ ఇయర్‌గా తీసుకుని 1967 సంవత్సరపు ఆర్థిక అంచనాలు రూపొదించబడ్డాయి. క్రమంగా 1978లో ఆర్థిక అంచనాలకు 1960-61 సంవత్సరాన్ని, 1988 సంవత్సరానికి 1970-71 సంవత్సరాన్ని, ఆధారిత సంవత్సరాలుగా పరిగణించటం, ఆమేరకు ఆర్థిక అంచనాలు లెక్కకట్టడం జరిగింది. 1998 వచ్చేసరికి ఆధారిత సంవత్సరం ప్రమాణాలు మారిపోయాయి. 1999లో ఆర్థిక వ్యవస్థ అంచనాలు రూపొందించటానికి 1993-94 సంవత్సరాన్ని ఆధారిత సంవత్సరంగా మార్చారు. 1991 వరకు దేశీయ ఆర్థిక అంచనాలు ప్రధానంగా దేశీయ ప్రజల ప్రయోజనాలు, అందుకవసరమైన విధానాల రూపకల్పన లక్ష్యంతో సూచికలను నిర్ధారించుకునేవి. 1991కు ముందు వివిధ దేశాలు విడుదలచేసిన ఆర్థిక అంచనాలను పున:పరిశీలించటానికి, మదింపు చేయటానికి, విదేశీ పెట్టుబడుల ప్రయోజనాల దృష్ట్యా విశ్లేషించటానికి విదేశీ పెట్టుబడుల కేంద్ర స్థానాలు ప్రత్యేక అధ్యయనాలు చేసేవి. 
                        1991 తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో మన దేశ ఆర్థిక వ్యవస్థ శక్తిని ప్రదర్శించటం కూడా ఒక లక్ష్యంగా మారింది. అంతిమంగా దేశీయంగా రూపొందించే ఆర్థిక అంచనాలు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఆకర్షించేలా రూపొందించటం ఒక ముఖ్యమైన లక్ష్యంగా మారింది. దాంతో దేశీయ గణాంకాల అధ్యయనం తీరుతెన్నులు కూడా పర్యవేక్షించటం, అవరమైన శిక్షణ ఇవ్వటం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటి సంస్థల కార్యకలాపాల్లో అంతర్భాగం అయ్యాయి. దానికనుగుణంగా మన దేశంలో కూడా గణాంక అధ్యయనాల దశ, దిశల్లో మార్పులు వచ్చాయి. ఉద్దేశ్యాలు కూడా మారిపోయాయి. అందువల్లనే 1999 నుండి ఆధారిత సంవత్సరాన్ని పదేళ్ల నుండి ఐదేళ్లకు తగ్గించారు. అందువల్లనే 1999 ఆర్థిక సంవత్సరం అంచనాలుకు 1993-94 ప్రాతిపదిక అయ్యింది. 2006 అంచనాలకు 2004-05 అంచనాలు ప్రాతిపదిక అయ్యాయి. ఈ కోవలోనే తాజా అంచనాలకు 2011-12ను ఆధారిత సంవత్సరంగా పరిగణించారు. 2011-12 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థికాభివృద్ధి రేటుపై ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ప్రభావం ఉంది. వృద్ధి రేటు వేగం తగ్గిపోయింది. ఎక్కువ వృద్ధి రేటు ఉన్న సంవత్సరం ప్రాతిపదికగా తీసుకుంటే తాజా సంవత్సరంలో అంతకంటే వృద్ధి రేటు పెరిగితేనే ఆర్థికాభివృద్ధి జరిగినట్లు అర్థమవుతుంది. తక్కువ వృద్ధి రేటు ఉన్న సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ సమస్య ఉండదు. ఎంత పెరిగినా పెరిగినట్లే కనిపిస్తుంది. దీనినే బేస్‌ ఇయర్‌ ఎఫెక్ట్‌ అంటారు. ఆర్థిక వ్యవస్థలో నిజమైన వృద్ధి రేటు ప్రాతిపదికన అంచనాలు, విధానాలు రూపొందించటానికి బదులు అటువంటి బేస్‌ ఇయర్‌ ఎఫెక్ట్‌పై ఆధారపడి అంచనాలు, విధానాలు రూపొందించే ప్రయత్నం చేయటం తాజా అంచనాల పర్యవసానం. అంటే ముతక భాషలో చెప్పాలంటే బలుపు ఆధారంగా అంచనాకు రావటం పక్కన పెట్టి వాపు ఆధారంగా అంచనాకు రావటం ప్రారంభమైంది. 
                     ప్రైవేటు కార్పొరేట్‌ వర్గపు మదుపు రేట్లు, పెట్టుబడి రేట్లు పాత అంచనాల ప్రకారం ఈ మదుపు రేట్లు 30 శాతానికి మించి లేవు. కానీ కొత్త అంచనాల ప్రకారం మదుపు రేట్లు 40 శాతానికి పెరిగాయి. ఇక్కడే మరో ప్రశ్న తలెత్తుతుంది. జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కంటే ప్రైవేటు కంపెనీల వద్ద పోగుపడే లాభాల రేటు ఎక్కువగా ఉన్నపుడు వారికి మరిన్ని రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అన్న ప్రశ్న అది. పెరిగిన వృద్ధి రేటును కొనసాగించగల సామర్ధ్యం ప్రైవేటు కార్పొరేట్‌ వర్గానికి ఉన్నపుడు బడ్జెట్‌లో మూడో వంతు ఆదాయాన్ని వారికి రాయితీల రూపంలో కట్టుబెట్టాల్సిన అవసరం ఏమిటి? ఈ అంచనాలే విధానాల రూపకల్పనకు ప్రాతిపదికన అనుకున్నపుడు సాధారణ ప్రజల చేతుల్లో మదుపు 72 శాతం నుండి 59 శాతానికి పడిపోయింది. అంటే ప్రభుత్వ విధానాల లక్ష్యం సాధారణ చేతుల్లో మదుపు సామర్థ్యం పెంచేదిగా ఉండాలి. కానీ బడ్జెట్‌లో అనుసరించిన పరోక్ష పన్నుల విధానం ఈ ప్రజల మదుపు సామర్ధ్యాన్ని మరింత కుంగదీసేదిగా ఉంది. 
                        స్థూలంగా చూసినప్పుడు మనం కొన్ని నిర్ధారణలకు రావచ్చు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థ వాస్తవిక చిత్రాన్ని ప్రతిబింబించటం లేదు. అంతర్జాతీయ ద్రవ్యమార్కెట్‌లో ఈ అంచనాలతో తమ పరిపాలన సామర్ద్యానికి మెప్పు పొందే ప్రయత్నమే ఇది. ఇటువంటి కపటవాస్తవాలు కళ్ల ముందు పెట్టి విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నించటం ఎండమావిలో దప్పిక తీర్చుకునే ప్రయత్నం తప్ప మరోటి కాదు. యుపిఎ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్న బిజెపి ప్రచారం తప్పుడు ప్రచారమని ఈ అంచనాలు నిరూపిస్తున్నాయని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించటం ఇందులో కొసమెరుపు. ఇటువంటి అనుమానాస్పద అంచనాలు ఆధారం చేసుకుని విధానాలు రూపొందించటం అంటే రోగాన్ని గుర్తించకుండా మందులు వేయటమే అవుతుంది.
-కె. లక్ష్మీప్రసాద్‌