Sunday, May 30, 2010

భారతదేశంలో పేదరిక నిర్ధారణప్రమాణాలు- పరిచయం

భారతదేశంలో పేదరిక నిర్ధారణప్రమాణాలు- పరిచయం

మొదటి భాగం

See full size image

19వ శతాబ్దంలో కనీస పౌష్టికాహార లభ్యత ప్రాతిపదికన నిర్వచించబడ్డ ''పేదరికం'' ఆర్థికాంశంగాను కొనసాగుతూ వచ్చింది. 1970 నాటికి కనీస మౌలికాంశాల ప్రాతిపదికన పేదిరిక నిర్వచనం ఆర్థికాంశం గానే విసృతమైంది. ఫైనాన్స్‌ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలపై పట్టు బిగించి ఆధిపత్యాన్ని కొనసాగించే క్రమంలో సంక్షేమ ఆర్థిక వ్యవస్థ పునాదులు వివిధ దేశాలలో నిర్వీర్యమయ్యాయి ఈ నేపథ్యంలో పేదరిక నిర్వచనాన్ని ఆర్థికాంశం నుండి సామాజికాంశంగా మార్పు చేసే పరిశోధనలు ముమ్మరమయ్యాయి. ఈ దిశలోనే ప్రముఖ ఆర్థిక వేత్తలు అమర్త్యసేన్‌, అర్కిన్‌సన్‌ తదితరులు ప్రతిపాదించిన సామర్థ్యాల నమూనా (కేపబులిటిస్‌ అప్రోచ్‌) పేదరిక నిర్వచన స్వరూప స్వభావాల్ని మార్చేసింది. మానవాభివృద్ధి అవగాహన (హ్యూమన్‌ డెవలెప్‌మెంట్‌ అప్రోచ్‌) దర్పణంలో నూతన పేదరిక అంచనాలు ముందుకు వచ్చాయి.

ప్రపంచ బ్యాంకు దృష్టిలో పేదరికం-వివిధ దేశాలు వివిధ రకాలుగా పేదరికాన్ని నిర్వచిస్తూ , పేదరిక రేఖల్ని రకరకాలుగా ప్రమాణికరించాయి. ''కనీస జీవన ప్రమాణాలు గల జీవితాన్ని పొందలేక పోవటమే పేదరికంగా'' ప్రపంచబ్యాంకు నిర్వచించుకుంది ఈ ప్రమాణాలలో రెండు అంశాలు చోటు చేసుకున్నాయి. ఒకటి పౌష్ఠికాహారము, ఇతర కనీస అవసరాలు. రెండవది సమాజంలో జీవించటానికి ప్రతిరోజు అయ్యే ఖర్చు. కాని అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిర్ధారించే పేదరిక ప్రమాణాలలో ప్రపంచబ్యాంకు రెండవ అంశాన్ని పక్కన పెట్టింది.

కనీస పౌష్ఠికాహార వినియోగ ప్రాతిపదికనే పేదరికాన్ని కొలవటానికి ప్రమాణాల్ని తయారు చేసింది. ప్రపంచబ్యాంకు దృష్టిలో రోజుకు ఒక డాలర్‌ (అమెరికన్‌) కంటే తక్కువ ఆదాయం కలవారిని పేదలుగాను (1985 ధరలననుసరించి), డాలర్‌లో 3/4 వంతు కంటే తక్కువ ఆదాయం కలవారిని నిరుపేదలుగాను సూత్రీకరించింది. ఈ ప్రమాణాలననుసరించి భారతదేశంలో పేదలు 75%గా అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో పేదరికంపై అంచనాలు-

స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటగా 1957లో జరిగిన భారత కార్మిక సమావేశంలో పేదరికాన్ని నిర్వచించే ప్రతిపాదనలు చేయబడ్డాయి. దీని కొనసాగింపుగా ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలోని ఒక కార్యనిర్వాహక బృందం పౌష్ఠికాహార వినియోగ ప్రాతిపదికన పేదరిక రేఖను నిర్ధారించింది. దీనినే కేలరీల ఆధారిత పేదరిక రేఖ అంటారు. ఆ నిపుణుల బృందం నెలకు రూ. 20/- లోపు ఆదాయం కల వారిని పేదలుగా పరిగణించింది. 1979లో ప్రణాళికాసంఘం పేదరికాన్ని తిరిగి నిర్వచించటానికి ఒక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. సుధీర్ఘమైన చర్చలనంతరం ఆ బృందం క్యాలరీల ఆధారంగానే పేదరిక రేఖను నిర్ధారించటానికి నిర్ణయించి, పేదరిక ప్రమాణాలను గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు వేరువేరుగా నిర్వచించింది. ఈ ప్రమాణాలను బట్టి 1973 ధరల ఆధారంగా గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 49/-, పట్టణ ప్రాంతాలలో రూ. 57/-లు కంటే తక్కువ ఆదాయం కలవారు పేదలుగా వర్గీకరించింద

ఈ ప్రాతిపదిక ఆధారంగానే ఈనాటికి భారతదేశంలో పేదరికాన్ని నిర్వచిస్తున్నారు. కానీ ద్రవ్యోల్బణానికి అనుబంధమైన ధరల సూచి ప్రాతిపదికన గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నెలసరి ఆదాయ పరిమితులను సరిచేస్తున్నారు. 1999-2000లలో గ్రామీణ ప్రాంతాలలో రూ.327/-లు, పట్టణ ప్రాంతాలలో రూ. 454/-లు లోపు నెలసరి ఆదాయాలను పేదరిక రేఖ ప్రమాణాలుగా తీసుకుంటే 2004-05 నాటికి గ్రామీణ ప్రాంతాలలో రూ. 356/-లు, పట్టణ ప్రాంతాలలో రూ. 538/-లు నెలసరి ఆదాయాల లోపు ప్రజలను పేదలుగా నిర్ధారిస్తున్నారు.పేదరిక రేఖపై భారతదేశంలో జరిగిన అధ్యయనాలలో పి.డి.ఒజా, ఆర్‌.యన్‌.మిన్హాన్‌, బి.యమ్‌.దండేకర్‌, రాథ్‌, జాతీయ శాంపుల్‌ సర్వే సంస్థ, ప్రణాళికా సంఘం నిర్వహించినవి ప్రముఖమైనవి. ఈ ఆధ్యయనాలన్నీ పౌష్ఠికాహార ప్రాతిపదికపై పేదరికాన్ని అంచనా వేయబడ్డవే. టెండూల్కర్‌ కమిటీ అధ్యయనాలలో అదనంగా సామాజిక అంశాలు చోటుచేసుకోవటంతో పేదరికరేఖపై విసృత చర్చలు మొదలయ్యాయి. భారతదేశంలో పేదరికరేఖ నిర్ధారణా అంచనాలపై, వాటి విశ్వాసనీయతపై అనేక విమర్శలు చోటుచేసుకున్నాయి. అనేక దశాబ్ధాలుగా వివిధ ఆర్థికవేత్తలు సామాజికవేత్తలు ప్రజాసంఘాలు భారతదేశంలో మౌలికాంశాల ఆధారంగా పేదరిక రేఖ నిర్ధారణ జరగాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో సామర్థ్యాల ప్రాతిపదికన పేదరికం నిర్ధారణ ఆవశ్యకత ఎంతగానో వుంది.

Sunday, May 16, 2010

సామాజిక, ఆర్థిక భావనగా పేదరికం-ఒక పరిచయం

టెండూల్కర్‌ కమిటీ నివేదిక అనంతరం పేదరికం నిర్వచనంపై, దారిద్య్రరేఖ ప్రమాణాలపై మొదలైన విస్తృత చర్చ ఆహర భధ్రత హక్కు చట్టం గురించిన చర్చతో వేడెక్కింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్న క్రమంలోనూ, ప్రపంచీకరణ విధానాల ప్రభావంతో పెరుగుతున్న అసమానతలతోనూ, ప్రభుత్వ సహాయానికై ఎదురుచూస్తున్న ప్రజానీకంపై పేదరిక నిర్వచనాలు, దారిద్య్రరేఖ ప్రమాణాల ప్రభావం ఎంతగానో ఉంటుంది. పేదరికాన్ని అవగాహన చేసుకోవటంలో, దాని నిర్మూలనకు కృషి చేయటంలో శతాబ్ధాలుగా, మానవ సమాజం, మేధావులు నిమగమై ఉన్నారు. అయినప్పటికీ పేదరికంపై నిర్ధిష్టమైన, విశ్వవ్యాప్తమైన నిర్వచనం రూపొందలేదు. 19వ శతాబ్ధం నుండి పేదరికం గూర్చి జరుగుతున్న చర్చను 3 భాగాలుగా విభజించవచ్చు. అవి జీవనభృతి(ఆదాయం), మౌలిక అవసరాలు, సాపేక్ష నిరాకరణలు గూర్చిన చర్చలు.

1) జీవనభృతి(ఆదాయం): జీవన భృతిపై ఆధారపడ్డ భావన విక్టోరియన్‌ ఇంగ్లాండ్‌లోని పౌష్టికాహార శాస్త్రవేత్తల కృషి నేపధ్యంలో ఏర్పడింది. పారిశ్రామిక విప్లవ నేపధ్యంలో ఉత్పత్తి క్రమంలో మానవ శ్రమ ప్రాధాన్యతను గుర్తించిన కాలమిది. కార్మి కులను శక్తి వంతంగా, ఆరోగ్య వంతంగా ఉంచటానికి (భౌతిక సమర్ధత) కావలసిన జీవిత అవసరాలకు తగ్గట్టు ఆదాయ ప్రమా ణాలను నిర్ధారించటం ఇందులో ముఖ్యమైనది. భౌతిక సమర్థ తను నిలబెట్టగలిగే కనీస జీవితావసరాలకు సరిపడని జీవన భృతి గల కుటుంబాలను పేద కుటుంబాలుగా నిర్వచించే వాళ్ళు. ఇంటి అద్దె మినహాయింపబడిన భృతి దారిద్య్రరేఖ ప్రమా ణాల కంటే దిగువ నుంటే పేద కుటుంబాలుగా పరిగణించేవారు. దారిద్య్రరేఖ రూపకల్పనలో ఆదాయ స్థాయిలో గుడ్డ, ఇంధనం, కొన్ని ఇతర అవసరాలకు చోటు కల్పించినా వాటి స్థాయి చాలా తక్కువగా ఉండేది. ఆహార వ్యయానికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చేవారు.

ప్రభావం: ఈ భావన వంద సంవత్సరాల పాటు వివిధ శాస్త్ర అధ్యయనాలను, అంతర్జాతీయ, జాతీయ విధానాల్ని గణనీయంగా ప్రభావితం చేసింది. సామాజిక స్థితిగతుల్ని వివరించటానికి వివిధ దేశాల స్థాయిల్లోనూ, ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థల స్థాయిలలోనూ, గణాంక కొలమానాల రూపకల్పనకు ఇది ప్రాతిపదిక అయ్యింది. అప్పటి బ్రిటీష్‌ సామ్రాజ్యంలోని అనేక దేశాలలో ఈ అవగాహన విస్తృతంగా ప్రచారం చేయబడింది. బ్రిటీష్‌ సామ్రాజ్యంలోని దక్షిణాఫ్రికాలో నల్లజాతి కార్మికుల వేతన నిర్ణయంలోను, మలేషియా, భారత దేశాలలోని అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలోను ఈ భావన పునాదిగా నిలిచింది.

విమర్శలు: అదే సందర్భంలో ఈ భావన అనేక విమర్శలకూ గురైంది. ''మానవ అవసరాలు, సామాజిక అవసరాలతో నిమిత్తం లేని భౌతిక అవసరాలేనా?'' అనే ప్రశ్న ప్రధానంగా ఎదురైంది. ''భౌతికశక్తికి కావాల్సిన వనరుల్ని సమీకరించుకోవాల్సిన ప్రజలు కేవలం వ్యక్తిగత జీవులే కాదు, వారు సమాజంలోని కార్మికులు, పౌరులు, తల్లిదండ్రులు, స్నేహితులు. ఇలా సమాజ నిర్వహణలో వారి పాత్ర విస్తృతమైంది. వారు సామాజిక జీవులు కూడా. అలాగే వారు భౌతిక వస్తువుల వినియోగదారులే కాదు, వాటి ఉత్పత్తికి సృష్టికర్తలు కూడా. అందువల్ల వారు వ్యక్తిగత ఆదాయాలతోపాటు కుటుంబ పరంగా సమిష్టిగా అందించాల్సిన సదుపాయాలు, ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నారు. ఈ అవసరాలు విశ్వవ్యాప్తమైనవి. కేవలం ధనిక పారిశ్రామిక వ్యవస్థలకే పరిమితమైనవి కావు'' అనే వాదనలు బలంగా ముందుకు వచ్చాయి. నాటి నుండే వేతనాల నిర్ధారణకు కుటుంబ విసృత అవసరాలు, విద్య, వైద్య సదుపాయలకయ్యే ఖర్చు ప్రాతిపదికగా మారింది.

2) మౌలిక అవసరాలు: సంక్షేమ భావన వేళ్ళూనుకున్న 50,60 దశకాలలో ఆర్థిక వేత్తలు, సామాజిక శాస్త్రవేత్తల దృష్టి మరోమారు పేదరికం వైపుకు మళ్ళింది. 1970ల నాటికి మౌళిక అవసరాల భావన రూపుదాల్చింది. ''అంతర్జాతీయ కార్మిక సంస్థ'' ఈ భావనను బలంగా సమర్ధించింది. ఈ భావనలో రెండు అంశాలు చోటు చేసుకున్నాయి. మొదటిది కుటుంబానికి కావాల్సిన మౌలిక వినియోగ అవసరాలు. అవి కూడు, గుడ్డ, ఇంటికి అవసరమైన కనీస పరికరాలు. రెండవది సమాజం మొత్తానికీ కావాల్సిన అత్యవసర సేవలు. అవి రక్షిత నీరు, పారిశుద్ధ్యం, ప్రజారవాణా, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు సాంస్కృతిక సదుపాయాలు గా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో మౌళిక అవసరాలతో పాటు అదనంగా భూమి, వ్యవసాయ పరికరాలు మరియు సేద్యం చేయగలిగే అవకాశాలు చేర్చబడ్డాయి సదరు వ్యక్తి వర్తమానం లో గౌరవ ప్రదమైన జీవితం గడపటమే అభివృద్ధికి పరమార్ధం కాదని, ఆ వ్యక్తి భాగస్వామ్యమైన కుటుంబానికి శాశ్వత ఆదాయ వనరులు ఉండాలన్న అవగాహన ఈ చర్చకు నేపధ్యం గ్రామీణ ప్రాంతాలలో భూసంస్కరణలు, పారిశ్రామికి ప్రాంతాలలో పెన్షన్‌లు శాశ్వత ఆదాయ వనరులుగా గుర్తించబడ్డాయి. మౌలిక అవసరాల భావన జీవన భృతి భావనను మెరుగుపర్చటమే. జీవన భృతి భావన పరిధి పరిమితమైనందున విధాన నిర్ణయాలు, రాజకీయ జోక్యాల ఆవశ్యకత పరిమితంగానే ఉంది. సామాజిక బాధ్యతలతో సంబంధం లేని జీవన భృతి భావన పాలకవర్గాలకు ఆకర్షణీయంగా ఉంది. కాని మౌలిక అవసరాల భావన సమాజ అభివృద్ధికి ముందస్తు షరతుల్ని విధించింది. రాజకీయ జోక్యం, విధాన నిర్ణయాల అవసరాల్ని పెంచింది. ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ ఏజెన్సీల అభివృద్ధి ప్రణాళికలలో మౌలిక అవసరాల భావన విశిష్టమైన పాత్రను నిర్వహించింది.

3) సాపేక్ష నిరాకరణ: 20వ శతాబ్ధంలో పేదరికం నిర్వచనాలలో మూడవ భావన ముందుకొచ్చింది. అది సాపేక్ష నిరాకరణ భావన. సాపేక్షంగా అతి తక్కువ ఆదాయం గల ప్రజలనే పేదలుగా పరిగణించటం సరికాదనే వాదన ఇది. పేదరికానికి, అసమానతకు మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా గుర్తించటం లేదని, పేదలంటే లోప భూయిష్టమైన పంపిణీ వ్యవస్థ బాధితులే కాదు, అంతకు మించి సామాజిక అవసరాలు, అవకాశాల లభ్యత పొందలేని వారు మరియు నిరాకరించబడ్డ వారిని పేదలుగా ఈ భావన పేదరికాన్ని నిర్వచిస్తుంది. పై రెండు భానలకు, సాపేక్ష నిరాకరణ భావనకు మధ్య కీలకమైన వ్యత్యాసం ఉంది. పై రెండు భావనలు పేదరికం నుండి బయటపడటానికి కావలసిన సాధనాలను చర్చిస్తే, సాపేక్ష నిరాకరణ భావన పేదరికం కారణాలపై దృష్ఠి సారిస్తుంది. ప్రపంచీకరణ ప్రపంచ సమాజాన్ని ఏకీకరణ చేసే క్రమంలో ఆర్ధిక, సామాజిక అంతరాల్ని పెంచింది. దేశాలలోని ప్రజల మధ్య, వివిధ దేశాల మధ్య అసమానతలు తారాస్థాయికి చేరాయి. ధరల సూచి ప్రాతిపదికన అమలులో ఉన్న దారిద్య్రరేఖ ప్రమాణాలు తీవ్ర విమర్శలకూ గురయ్యాయి. అందువల్లే సాపేక్ష నిరాకరణ భావన ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రాధాన్యతను పొందింది. సాపేక్ష నిరాకరణ భావన కుటుంబ పరిమాణం, నమూనాను బట్టి ఆదాయ పరిధుల్ని నిర్ణయిస్తుంది. ఈ పరిధిలోకి నెట్టబడినవారు సమాజంలో బ్రతకలేనివారుగా పరిగణింపబడతారు. ఈ దిశలోనే అమర్త్యసేన్‌ రూపొందించిన సామర్ధ్యాల భావన పేదరిక నిర్వచనానికి నూతన కోణాల్ని చూపింది.

Saturday, May 15, 2010

క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ -

అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వేగవంతమైన విస్తరణకు వీలు కల్పిస్తు సృష్టించబడ్డ మరో నూతన ద్రవ్య ఉత్పత్తి ''క్రెడిట్‌ డిఫాల్ట్‌' శ్వాప్స్‌'' (సి.డి.యస్‌) లేదా రుణ చెల్లింపు వైఫల్య పరిహార ఒప్పందాలు. అమెరికా గృహ రుణ బూమ్‌ విజృంభణకు కొల్లెటరలైజ్‌డ్‌ డెట్‌ ఆబ్లిగేషన్స్‌ (సి.డి.ఒలు) తో పాటు క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ (సి.డి.యస్‌.లు) కీలకమైన పాత్రను పోషిం చాయి. గ్రీసు రుణ భారాన్ని తక్కువ చేసి చూపేందుకు గోల్డ్‌ మెన్‌ శ్యాక్స్‌ రూపొందించిన క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ తీవ్రమైన అంతర్జాతీయు ఆరోపణలకు గురికావటం ఈ మధ్య కాలంలో చూసాం.

క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ - వీటిని సి.డి.యస్‌లుగాను లేదా రుణ చెల్లింపు వైఫల్య పరిహార ఒప్పందాలుగాను పిలుస్తారు. ఇవి డెరివేటివ్‌ల స్వభావం కలిగినవి. వీటికి ఆధారమైన రుణ ఒప్పందాల నుండి ఇవి విలువను పొందుతాయి. సి.డి.యస్‌లలో ''హామి'' అనే సేవ సరుకుగా మారుతుంది. రుణ చెల్లింపు వైఫల్యాల ప్రమాదం (రిస్క్‌) నుండి రుణ దాతకు అందించే హామి ఇది. ఈ హామికి అమ్మకందారులు, కొనుగోలు దారులు ఉంటారు. హామి అమ్మకం దారులకు, హామి కొనుగోలు దారులకు మధ్య ఏర్పడిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్‌ (సి.డి.యస్‌) లేదా రుణ చెల్లింపు వైఫల్య పరిహార ఒప్పందం అని అంటారు.

వివరణ - హామి కొనుగోలుదారుడు, హామి అమ్మకం దారులకు నిర్ణిత కాల పరిమితులలో ప్రీమియం లాంటి వాయిదాలు చెల్లిస్తుంటాడు. దానికి ప్రతిఫలంగా కొనుగోలు దారుడు తన బాధ్యతలో ఉన్న రుణ బకాయిలను చెల్లించలేనప్పుడు హామి అమ్మకం దారుడు ఆ బాకీని తీరుస్తాడు. స్ధూలంగా సి.డి,యస్‌. నిర్వచన సారాంశం ఇది. ఉదాహరణకు ఒక ప్రభుత్వం తమ అవసరాల కోసం నిధుల సమీకరణకు బాండులను ప్రజలకు జారీ చేస్తుంది. ఆ బాండులను కొన్న రుణ దాత ఆ బాండులపై సి.డి.యస్‌ ఒప్పందం కుదుర్చుకొని వాయిదాలు కడుతూఉంటే, బాండులు జారీ చేసిన ప్రభుత్వం ఏదైన విపత్కర పరిస్థితులలో బాండు పరిపక్వ తేదీ నాటికి దానిపై చెల్లించాల్సిన ప్రతిఫలాన్ని చెల్లించలేనప్పుడు, ఆ బాధ్యతలను సి.డి.యస్‌ ను జారీచేసిన సంస్థ నిర్వహిస్తుంది. బాండులపై గాని, వాటి ఆధారంగా సృష్టించబడ్డ సి.డి.ఒల పై గాని హక్కులను కైవసం చేసుకొని ఈ సంస్థ మరొకరికి అమ్ము తుంది. అందువల్ల ఒక రుణం ఒప్పందం పై ఒకరికి మించిన రుణ దాతలు ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే సి.డి,యస్‌ అంటే ప్రధాన రుణదాత యొక్క రుణ చెల్లింపు వైఫల్య ప్రమాదానికి వర్తిరచే ఇన్సురెన్స్‌ లాంటిది. కాని సి.డి.యస్‌లకు, ఇన్సురెన్స్‌కు మౌలిక సూత్రాలలో తేడాలున్నాయి.

సి.డి.యస్‌, ఇన్సురెన్స్‌ల మధ్య తేడా- 1.ఇన్సురెన్స్‌లో ఇన్సురెన్స్‌ కొనుగోలుదారుడు అనివార్యంగా ఇన్సురెన్స్‌ చేయబడే రుణ ఒప్పందంలో ప్రత్యక్ష భాగస్వామి కావలసియుంటుంది. ఇది ప్రత్యక్ష ఒప్పందం. అతను ఇన్సురెన్స్‌ ప్రయోజనాలు పొందగలిగే హక్కు (ఇన్స్యూరబుల్‌ ఇన్‌టరెస్ట్‌) కలిగి వుండాలి. సి.డి.యస్‌లో అటువంటి నిబంధన ఏదీ లేదు. సి.డి.యస్‌లు పరోక్ష ఒప్పందాలు. సి.డి.యస్‌ కొనుగోలుదారుడికి సి.డి.యస్‌కు ఆధారమైన రుణ ఒప్పందంతో ఏ విధమైన సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. రుణ గ్రస్తుని ఆర్ధిక స్థోమతపై స్పెక్యూలేట్‌ చేస్తూ, సి.డి,యస్‌ను ఎవరైన కొనుగోలు చేయవచ్చు. రుణ ఒప్పందాలతో సంబంధం లేని వాళ్ళకు అమ్మే సి.డి.యస్‌లను ''నేకెడ్‌ క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌'' లేదా ''నగ రుణ చెల్లింపు వైఫల్య పరిహార ఒప్పందాలు'' అంటారు. ప్రపంచంలోని సి.డి,యస్‌ మార్కెట్‌లో నేకెడ్‌ క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ శాతం అత్యధికం. 2.ఇన్సురెన్స్‌ నియంత్రించబడి వుంటుంది. సి.డి.యస్‌లలో నియంత్రణ లేదు. 3. ఇన్సురెన్స్‌లో అమ్మకం దారుడికి రిజర్వ్‌ నిల్వలు ఉండాలి, సి.డి.యస్‌లలో అలాంటి రిజర్వ్‌ నిధుల అవసరం లేదు. దీని కారణంగా సి.డి.యస్‌ రంగంలో తరచు తీవ్ర అనిశ్చితి నెలకొంటుంది. సి.డి.యస్‌లు స్పెక్యూలేటివ్‌ సాధనాలయ్యాయి. 4. ఇన్స్‌రెన్సులో కట్టవలసిన ప్రీమియంలు ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి. బాండుల యాజమాన్యం మారితే ఇన్స్‌రెన్సు రద్దవుతుంది. అందువల్ల ఇన్స్‌రెన్సులో స్పెక్యూలేషన్‌ కు అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాని సి.డి.యస్‌లలో అలా కాదు బాండు యాజమాన్యం మారినప్పుడు సి.డి.యస్‌ వాయి దాలలో మార్పు ఉంటుంది. బాండు యాజమాన్యంతో నిమిత్తం లేకుండా అనేక మంది ఒకే రుణ ఒప్పందపై అనేక సి.డి.యస్‌లు కొనుగోలు చేసుకొనే అవకాశం ఉన్నందున, సి.డి.యస్‌లను మరొకరికి బదిలి చేసే అవకాశం ఉన్నందున ఈ రంగంలో అత్యధిక స్పెక్యూలేషన్‌కు, దురాశకు అవకాశం దొరికింది.

ప్రయోజనాలు- రుణ మార్కెట్‌ విస్తరణకు ప్రధాన అవరోధమైన రుణ చెల్లింపు వైఫల్య ప్రమాదాన్ని సి.డి.యస్‌లు వాయిదా చేస్తాయి. దీని కారణముగా రుణ మార్కెట్‌ విస్తరణ వేగవంతమై, చెల్లింపు సామర్ధ్యంతో నిమిత్తం లేకుండా వినియోగదారులకు రుణ సదుపాయాలు చేకూరుతాయి.

దుష్పలితాలు- రుణ చెల్లింపు వైఫల్యాల ప్రమాదం సి.డి.యస్‌ల మూలకంగా వాయిదా పడినందువల్ల, సి.డి.యస్‌లపై ఎటువంటి నియంత్రణలు లేనందువల్ల, రుణ దాతలు రుణ మంజూరులో స్వీయ రక్షణ ప్రమాణాలను గాలికి వదిలేసి బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల రుణ వైఫల్యాల సంఖ్య పెరగటం మొదలైంది. పెరిగిన మేరకు పరిహారాలు చెల్లింపలేని స్థితిలో ఉండి సి.డి.యస్‌ మంజూరు సంస్ధలు దివాలా తీయటంతో రుణ చెల్లింపు వైఫల్య ప్రమాదం బ్రద్దలై, ఆర్థిక సంస్థలను, వ్యవస్థలను దివాళా తీయించాయి. అమెరికా గృహ రుణ సంక్షోభంతో బేర్‌ స్టెరన్స్‌ దివాళా తీయగా, అమెరికా ఇన్సురెస్స్‌ గ్రూప్‌ సంస్థ జాతీయం చేయబడింది.

ముగింపు - క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ 1990 ప్రథమార్థంలో సృష్టించబడ్డాయి 1994లో జే.పి. మోర్గాన్‌ అండ్‌ కో తయారు చేసిన సి.డి.యస్‌లు ఈ రంగంలో ఒక మలుపుగా చెప్పుకోవాలి. 2003 సం||లో 3.7 ట్రిలియన్‌ డాలర్లు ఉన్న సి.డి.యస్‌ మార్కెట్‌ 2007 అంతానికి 62.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది.అమెరికాలో నెలకొన్న గృహరుణాల విజృంభణతో సి.డి,యస్‌ల మార్కెట్‌ పరిమాణం అత్యధికంగా పెరిగింది. 2008లో ఆ బుడగ పగిలిపోవటంతో ఆ మార్కెట్‌ 38 ట్రిలియన్‌ డాలర్లకు పడిపోయింది. సి.డి.యస్‌లు జారీ ఒక ఎక్స్ఛేంజ్‌ పరిధినుండి ఉండవు అనేక కంపెనీలు ఒవర్‌దికౌంటర్‌ జారీ చేస్తుంటాయి. వీటిపై నియంత్రణ లేదు. సి.డి.యస్‌ జారీ చేసే సంస్థలకు సాల్వెన్సీ ప్రమాణాలు అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఉవ్వెత్తున పెరుగుతున్న రుణ మార్కెట్‌తో సమానంగా సి.డి.యస్‌ మార్కెట్‌ పెరుగుతుంది. వివిధ ప్రభుత్వాలు చేదు అనుభవాలనుంచి గుణ పాఠాలను పరిమితంగానే తీసుకుంటున్నాయి. భారతదేశంలో కూడా కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ పెరుగుదల కోసం క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ను 2010లో అమలు చేయాలని రిజర్వ్‌ బ్యాంకు ఆరాటపడుతుంది. నియంత్రణలు లేని నూతన ద్రవ్య ఉత్పత్తుల వాణిజ్యం ఆచరణలో ఆర్థిక వ్యవస్థలకు వినాశకరమౌతుంది.