Sunday, May 16, 2010

సామాజిక, ఆర్థిక భావనగా పేదరికం-ఒక పరిచయం

టెండూల్కర్‌ కమిటీ నివేదిక అనంతరం పేదరికం నిర్వచనంపై, దారిద్య్రరేఖ ప్రమాణాలపై మొదలైన విస్తృత చర్చ ఆహర భధ్రత హక్కు చట్టం గురించిన చర్చతో వేడెక్కింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్న క్రమంలోనూ, ప్రపంచీకరణ విధానాల ప్రభావంతో పెరుగుతున్న అసమానతలతోనూ, ప్రభుత్వ సహాయానికై ఎదురుచూస్తున్న ప్రజానీకంపై పేదరిక నిర్వచనాలు, దారిద్య్రరేఖ ప్రమాణాల ప్రభావం ఎంతగానో ఉంటుంది. పేదరికాన్ని అవగాహన చేసుకోవటంలో, దాని నిర్మూలనకు కృషి చేయటంలో శతాబ్ధాలుగా, మానవ సమాజం, మేధావులు నిమగమై ఉన్నారు. అయినప్పటికీ పేదరికంపై నిర్ధిష్టమైన, విశ్వవ్యాప్తమైన నిర్వచనం రూపొందలేదు. 19వ శతాబ్ధం నుండి పేదరికం గూర్చి జరుగుతున్న చర్చను 3 భాగాలుగా విభజించవచ్చు. అవి జీవనభృతి(ఆదాయం), మౌలిక అవసరాలు, సాపేక్ష నిరాకరణలు గూర్చిన చర్చలు.

1) జీవనభృతి(ఆదాయం): జీవన భృతిపై ఆధారపడ్డ భావన విక్టోరియన్‌ ఇంగ్లాండ్‌లోని పౌష్టికాహార శాస్త్రవేత్తల కృషి నేపధ్యంలో ఏర్పడింది. పారిశ్రామిక విప్లవ నేపధ్యంలో ఉత్పత్తి క్రమంలో మానవ శ్రమ ప్రాధాన్యతను గుర్తించిన కాలమిది. కార్మి కులను శక్తి వంతంగా, ఆరోగ్య వంతంగా ఉంచటానికి (భౌతిక సమర్ధత) కావలసిన జీవిత అవసరాలకు తగ్గట్టు ఆదాయ ప్రమా ణాలను నిర్ధారించటం ఇందులో ముఖ్యమైనది. భౌతిక సమర్థ తను నిలబెట్టగలిగే కనీస జీవితావసరాలకు సరిపడని జీవన భృతి గల కుటుంబాలను పేద కుటుంబాలుగా నిర్వచించే వాళ్ళు. ఇంటి అద్దె మినహాయింపబడిన భృతి దారిద్య్రరేఖ ప్రమా ణాల కంటే దిగువ నుంటే పేద కుటుంబాలుగా పరిగణించేవారు. దారిద్య్రరేఖ రూపకల్పనలో ఆదాయ స్థాయిలో గుడ్డ, ఇంధనం, కొన్ని ఇతర అవసరాలకు చోటు కల్పించినా వాటి స్థాయి చాలా తక్కువగా ఉండేది. ఆహార వ్యయానికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చేవారు.

ప్రభావం: ఈ భావన వంద సంవత్సరాల పాటు వివిధ శాస్త్ర అధ్యయనాలను, అంతర్జాతీయ, జాతీయ విధానాల్ని గణనీయంగా ప్రభావితం చేసింది. సామాజిక స్థితిగతుల్ని వివరించటానికి వివిధ దేశాల స్థాయిల్లోనూ, ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థల స్థాయిలలోనూ, గణాంక కొలమానాల రూపకల్పనకు ఇది ప్రాతిపదిక అయ్యింది. అప్పటి బ్రిటీష్‌ సామ్రాజ్యంలోని అనేక దేశాలలో ఈ అవగాహన విస్తృతంగా ప్రచారం చేయబడింది. బ్రిటీష్‌ సామ్రాజ్యంలోని దక్షిణాఫ్రికాలో నల్లజాతి కార్మికుల వేతన నిర్ణయంలోను, మలేషియా, భారత దేశాలలోని అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలోను ఈ భావన పునాదిగా నిలిచింది.

విమర్శలు: అదే సందర్భంలో ఈ భావన అనేక విమర్శలకూ గురైంది. ''మానవ అవసరాలు, సామాజిక అవసరాలతో నిమిత్తం లేని భౌతిక అవసరాలేనా?'' అనే ప్రశ్న ప్రధానంగా ఎదురైంది. ''భౌతికశక్తికి కావాల్సిన వనరుల్ని సమీకరించుకోవాల్సిన ప్రజలు కేవలం వ్యక్తిగత జీవులే కాదు, వారు సమాజంలోని కార్మికులు, పౌరులు, తల్లిదండ్రులు, స్నేహితులు. ఇలా సమాజ నిర్వహణలో వారి పాత్ర విస్తృతమైంది. వారు సామాజిక జీవులు కూడా. అలాగే వారు భౌతిక వస్తువుల వినియోగదారులే కాదు, వాటి ఉత్పత్తికి సృష్టికర్తలు కూడా. అందువల్ల వారు వ్యక్తిగత ఆదాయాలతోపాటు కుటుంబ పరంగా సమిష్టిగా అందించాల్సిన సదుపాయాలు, ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నారు. ఈ అవసరాలు విశ్వవ్యాప్తమైనవి. కేవలం ధనిక పారిశ్రామిక వ్యవస్థలకే పరిమితమైనవి కావు'' అనే వాదనలు బలంగా ముందుకు వచ్చాయి. నాటి నుండే వేతనాల నిర్ధారణకు కుటుంబ విసృత అవసరాలు, విద్య, వైద్య సదుపాయలకయ్యే ఖర్చు ప్రాతిపదికగా మారింది.

2) మౌలిక అవసరాలు: సంక్షేమ భావన వేళ్ళూనుకున్న 50,60 దశకాలలో ఆర్థిక వేత్తలు, సామాజిక శాస్త్రవేత్తల దృష్టి మరోమారు పేదరికం వైపుకు మళ్ళింది. 1970ల నాటికి మౌళిక అవసరాల భావన రూపుదాల్చింది. ''అంతర్జాతీయ కార్మిక సంస్థ'' ఈ భావనను బలంగా సమర్ధించింది. ఈ భావనలో రెండు అంశాలు చోటు చేసుకున్నాయి. మొదటిది కుటుంబానికి కావాల్సిన మౌలిక వినియోగ అవసరాలు. అవి కూడు, గుడ్డ, ఇంటికి అవసరమైన కనీస పరికరాలు. రెండవది సమాజం మొత్తానికీ కావాల్సిన అత్యవసర సేవలు. అవి రక్షిత నీరు, పారిశుద్ధ్యం, ప్రజారవాణా, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు సాంస్కృతిక సదుపాయాలు గా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో మౌళిక అవసరాలతో పాటు అదనంగా భూమి, వ్యవసాయ పరికరాలు మరియు సేద్యం చేయగలిగే అవకాశాలు చేర్చబడ్డాయి సదరు వ్యక్తి వర్తమానం లో గౌరవ ప్రదమైన జీవితం గడపటమే అభివృద్ధికి పరమార్ధం కాదని, ఆ వ్యక్తి భాగస్వామ్యమైన కుటుంబానికి శాశ్వత ఆదాయ వనరులు ఉండాలన్న అవగాహన ఈ చర్చకు నేపధ్యం గ్రామీణ ప్రాంతాలలో భూసంస్కరణలు, పారిశ్రామికి ప్రాంతాలలో పెన్షన్‌లు శాశ్వత ఆదాయ వనరులుగా గుర్తించబడ్డాయి. మౌలిక అవసరాల భావన జీవన భృతి భావనను మెరుగుపర్చటమే. జీవన భృతి భావన పరిధి పరిమితమైనందున విధాన నిర్ణయాలు, రాజకీయ జోక్యాల ఆవశ్యకత పరిమితంగానే ఉంది. సామాజిక బాధ్యతలతో సంబంధం లేని జీవన భృతి భావన పాలకవర్గాలకు ఆకర్షణీయంగా ఉంది. కాని మౌలిక అవసరాల భావన సమాజ అభివృద్ధికి ముందస్తు షరతుల్ని విధించింది. రాజకీయ జోక్యం, విధాన నిర్ణయాల అవసరాల్ని పెంచింది. ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ ఏజెన్సీల అభివృద్ధి ప్రణాళికలలో మౌలిక అవసరాల భావన విశిష్టమైన పాత్రను నిర్వహించింది.

3) సాపేక్ష నిరాకరణ: 20వ శతాబ్ధంలో పేదరికం నిర్వచనాలలో మూడవ భావన ముందుకొచ్చింది. అది సాపేక్ష నిరాకరణ భావన. సాపేక్షంగా అతి తక్కువ ఆదాయం గల ప్రజలనే పేదలుగా పరిగణించటం సరికాదనే వాదన ఇది. పేదరికానికి, అసమానతకు మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా గుర్తించటం లేదని, పేదలంటే లోప భూయిష్టమైన పంపిణీ వ్యవస్థ బాధితులే కాదు, అంతకు మించి సామాజిక అవసరాలు, అవకాశాల లభ్యత పొందలేని వారు మరియు నిరాకరించబడ్డ వారిని పేదలుగా ఈ భావన పేదరికాన్ని నిర్వచిస్తుంది. పై రెండు భానలకు, సాపేక్ష నిరాకరణ భావనకు మధ్య కీలకమైన వ్యత్యాసం ఉంది. పై రెండు భావనలు పేదరికం నుండి బయటపడటానికి కావలసిన సాధనాలను చర్చిస్తే, సాపేక్ష నిరాకరణ భావన పేదరికం కారణాలపై దృష్ఠి సారిస్తుంది. ప్రపంచీకరణ ప్రపంచ సమాజాన్ని ఏకీకరణ చేసే క్రమంలో ఆర్ధిక, సామాజిక అంతరాల్ని పెంచింది. దేశాలలోని ప్రజల మధ్య, వివిధ దేశాల మధ్య అసమానతలు తారాస్థాయికి చేరాయి. ధరల సూచి ప్రాతిపదికన అమలులో ఉన్న దారిద్య్రరేఖ ప్రమాణాలు తీవ్ర విమర్శలకూ గురయ్యాయి. అందువల్లే సాపేక్ష నిరాకరణ భావన ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రాధాన్యతను పొందింది. సాపేక్ష నిరాకరణ భావన కుటుంబ పరిమాణం, నమూనాను బట్టి ఆదాయ పరిధుల్ని నిర్ణయిస్తుంది. ఈ పరిధిలోకి నెట్టబడినవారు సమాజంలో బ్రతకలేనివారుగా పరిగణింపబడతారు. ఈ దిశలోనే అమర్త్యసేన్‌ రూపొందించిన సామర్ధ్యాల భావన పేదరిక నిర్వచనానికి నూతన కోణాల్ని చూపింది.

No comments: