Sunday, May 30, 2010

భారతదేశంలో పేదరిక నిర్ధారణప్రమాణాలు- పరిచయం

భారతదేశంలో పేదరిక నిర్ధారణప్రమాణాలు- పరిచయం

మొదటి భాగం

See full size image

19వ శతాబ్దంలో కనీస పౌష్టికాహార లభ్యత ప్రాతిపదికన నిర్వచించబడ్డ ''పేదరికం'' ఆర్థికాంశంగాను కొనసాగుతూ వచ్చింది. 1970 నాటికి కనీస మౌలికాంశాల ప్రాతిపదికన పేదిరిక నిర్వచనం ఆర్థికాంశం గానే విసృతమైంది. ఫైనాన్స్‌ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలపై పట్టు బిగించి ఆధిపత్యాన్ని కొనసాగించే క్రమంలో సంక్షేమ ఆర్థిక వ్యవస్థ పునాదులు వివిధ దేశాలలో నిర్వీర్యమయ్యాయి ఈ నేపథ్యంలో పేదరిక నిర్వచనాన్ని ఆర్థికాంశం నుండి సామాజికాంశంగా మార్పు చేసే పరిశోధనలు ముమ్మరమయ్యాయి. ఈ దిశలోనే ప్రముఖ ఆర్థిక వేత్తలు అమర్త్యసేన్‌, అర్కిన్‌సన్‌ తదితరులు ప్రతిపాదించిన సామర్థ్యాల నమూనా (కేపబులిటిస్‌ అప్రోచ్‌) పేదరిక నిర్వచన స్వరూప స్వభావాల్ని మార్చేసింది. మానవాభివృద్ధి అవగాహన (హ్యూమన్‌ డెవలెప్‌మెంట్‌ అప్రోచ్‌) దర్పణంలో నూతన పేదరిక అంచనాలు ముందుకు వచ్చాయి.

ప్రపంచ బ్యాంకు దృష్టిలో పేదరికం-వివిధ దేశాలు వివిధ రకాలుగా పేదరికాన్ని నిర్వచిస్తూ , పేదరిక రేఖల్ని రకరకాలుగా ప్రమాణికరించాయి. ''కనీస జీవన ప్రమాణాలు గల జీవితాన్ని పొందలేక పోవటమే పేదరికంగా'' ప్రపంచబ్యాంకు నిర్వచించుకుంది ఈ ప్రమాణాలలో రెండు అంశాలు చోటు చేసుకున్నాయి. ఒకటి పౌష్ఠికాహారము, ఇతర కనీస అవసరాలు. రెండవది సమాజంలో జీవించటానికి ప్రతిరోజు అయ్యే ఖర్చు. కాని అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిర్ధారించే పేదరిక ప్రమాణాలలో ప్రపంచబ్యాంకు రెండవ అంశాన్ని పక్కన పెట్టింది.

కనీస పౌష్ఠికాహార వినియోగ ప్రాతిపదికనే పేదరికాన్ని కొలవటానికి ప్రమాణాల్ని తయారు చేసింది. ప్రపంచబ్యాంకు దృష్టిలో రోజుకు ఒక డాలర్‌ (అమెరికన్‌) కంటే తక్కువ ఆదాయం కలవారిని పేదలుగాను (1985 ధరలననుసరించి), డాలర్‌లో 3/4 వంతు కంటే తక్కువ ఆదాయం కలవారిని నిరుపేదలుగాను సూత్రీకరించింది. ఈ ప్రమాణాలననుసరించి భారతదేశంలో పేదలు 75%గా అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో పేదరికంపై అంచనాలు-

స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటగా 1957లో జరిగిన భారత కార్మిక సమావేశంలో పేదరికాన్ని నిర్వచించే ప్రతిపాదనలు చేయబడ్డాయి. దీని కొనసాగింపుగా ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలోని ఒక కార్యనిర్వాహక బృందం పౌష్ఠికాహార వినియోగ ప్రాతిపదికన పేదరిక రేఖను నిర్ధారించింది. దీనినే కేలరీల ఆధారిత పేదరిక రేఖ అంటారు. ఆ నిపుణుల బృందం నెలకు రూ. 20/- లోపు ఆదాయం కల వారిని పేదలుగా పరిగణించింది. 1979లో ప్రణాళికాసంఘం పేదరికాన్ని తిరిగి నిర్వచించటానికి ఒక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. సుధీర్ఘమైన చర్చలనంతరం ఆ బృందం క్యాలరీల ఆధారంగానే పేదరిక రేఖను నిర్ధారించటానికి నిర్ణయించి, పేదరిక ప్రమాణాలను గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు వేరువేరుగా నిర్వచించింది. ఈ ప్రమాణాలను బట్టి 1973 ధరల ఆధారంగా గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 49/-, పట్టణ ప్రాంతాలలో రూ. 57/-లు కంటే తక్కువ ఆదాయం కలవారు పేదలుగా వర్గీకరించింద

ఈ ప్రాతిపదిక ఆధారంగానే ఈనాటికి భారతదేశంలో పేదరికాన్ని నిర్వచిస్తున్నారు. కానీ ద్రవ్యోల్బణానికి అనుబంధమైన ధరల సూచి ప్రాతిపదికన గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నెలసరి ఆదాయ పరిమితులను సరిచేస్తున్నారు. 1999-2000లలో గ్రామీణ ప్రాంతాలలో రూ.327/-లు, పట్టణ ప్రాంతాలలో రూ. 454/-లు లోపు నెలసరి ఆదాయాలను పేదరిక రేఖ ప్రమాణాలుగా తీసుకుంటే 2004-05 నాటికి గ్రామీణ ప్రాంతాలలో రూ. 356/-లు, పట్టణ ప్రాంతాలలో రూ. 538/-లు నెలసరి ఆదాయాల లోపు ప్రజలను పేదలుగా నిర్ధారిస్తున్నారు.పేదరిక రేఖపై భారతదేశంలో జరిగిన అధ్యయనాలలో పి.డి.ఒజా, ఆర్‌.యన్‌.మిన్హాన్‌, బి.యమ్‌.దండేకర్‌, రాథ్‌, జాతీయ శాంపుల్‌ సర్వే సంస్థ, ప్రణాళికా సంఘం నిర్వహించినవి ప్రముఖమైనవి. ఈ ఆధ్యయనాలన్నీ పౌష్ఠికాహార ప్రాతిపదికపై పేదరికాన్ని అంచనా వేయబడ్డవే. టెండూల్కర్‌ కమిటీ అధ్యయనాలలో అదనంగా సామాజిక అంశాలు చోటుచేసుకోవటంతో పేదరికరేఖపై విసృత చర్చలు మొదలయ్యాయి. భారతదేశంలో పేదరికరేఖ నిర్ధారణా అంచనాలపై, వాటి విశ్వాసనీయతపై అనేక విమర్శలు చోటుచేసుకున్నాయి. అనేక దశాబ్ధాలుగా వివిధ ఆర్థికవేత్తలు సామాజికవేత్తలు ప్రజాసంఘాలు భారతదేశంలో మౌలికాంశాల ఆధారంగా పేదరిక రేఖ నిర్ధారణ జరగాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో సామర్థ్యాల ప్రాతిపదికన పేదరికం నిర్ధారణ ఆవశ్యకత ఎంతగానో వుంది.

No comments: