Sunday, December 19, 2010

ద్రవ్య సరఫరా విధానం పరిచయం - చారిత్రక నేపధ్యం


సమకాలీనకాలంలో స్థూలఆర్థికవ్యవస్థ నిర్వహణకు ''ద్రవ్య సరఫరా విధానం''(మానిటరీ పాలసీ) ప్రధాన సాధనమైంది. ద్రవ్య (డబ్బు) ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో పాటుగా శతాబ్దాలుగా ద్రవ్య సరఫరా విధానం వివిధ దశలలో పరిణామం చెందింది. ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం పెరిగిన మేరకు ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్య సరఫరా విధాన పాత్ర కీలకమైంది. ఇదే సందర్భంలో ఈ మధ్య కాలంలో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదననంతరం అనేక దేశాలలో సంక్షోభ పరిష్కారానికి ద్రవ్య సరఫరా చర్యలు చేపట్టటం చూస్తున్నాం. ఉద్దీపన పథకాలు, నిధుల లభ్యత (లిక్విడిటి) చర్యలు అందులో భాగమే. రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించిన రూ. 48 వేల కోట్ల నిధుల లభ్యత విధానం తాజా ఉదాహరణ.

ద్రవ్య విధానం, ద్రవ్య సరఫరా విధానం

ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు ద్రవ్య విధానం (ఫిస్కల్‌ పాలసీ), ద్రవ్య సరఫరా విధానం (మోనెటరీ పాలసీ) విభిన్న కోణాలలో ప్రధాన భూమికలను నిర్వహిస్తున్నాయి. ద్రవ్య విధానం ప్రభుత్వ వ్యయ అంచనాలను, వసూలు చేయాల్సిన పన్నుల అంచనాలను నిర్ణయిస్తూ, ప్రభుత్వ రుణాల అంచనాలను ప్రభావితం చేస్తున్నది. ఇది అంతిమంగా డబ్బు గిరాకిని నియంత్రిస్తున్నది. ద్రవ్య సరఫరా విధానం డబ్బు (కరెన్సీ) సరఫరాను, నిధుల లభ్యతను, దాన్ని ప్రభావితం చేసే వడ్డీ రేట్లను, మారకపు ద్రవ్య విలువలను ప్రభావితం చేస్తున్నది. ఈ విధానం డబ్బు చలామణి, సరఫరాలను నియంత్రిస్తుంది. ద్రవ్య విధానం, ద్రవ్య సరఫరా విధానాలలో ఏది ముఖ్యమైనదన్న అంశంపై అనేక వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.

కరెన్సీ ఆవిర్భావం

మార్కెట్‌లతో పాటుగా డబ్బు (కరెన్సీ) ఆవిర్భవించింది. వాణిజ్య కార్యకలాపాలను వేగవంతం చేయడంలో డబ్బు పాత్ర కీలకమైనది. ఈ డబ్బు బంగారం, వెండి లాంటి అతి విలువైన లోహాల రూపంలో ఉండేది. వీటి చలామణి, ప్రాచుర్యం పెరగడంతో అధిక మొత్తాలలో నాణేలను ఉత్పత్తి చేయడం కోసం వీటిని కల్తీ చేసి (డిబేస్‌మెంట్‌), మిశ్రమ లోహాలతో నాణేలు తయారీ మొదలైంది. ఆ తరువాత నాణేల స్థానంలో ఆయా దేశాల బంగారం, వెండి నిల్వలతో సమానమైన అధికారిక కాగితపు డబ్బు (ఫియెట్‌ మనీ) అములులోనికి వచ్చింది. 17వ శతాబ్ద నుండి సామ్రాజ్యవాద దేశాలైన ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికా లాంటి దేశాలలో యుద్ధ అవసరాలకోసం బంగారం, వెండి నిల్వలతో నిమిత్తం లేని అధికారిక కాగితపు డబ్బు ముద్రణ అధికమైంది. ఈ విధానం ఆయా ప్రభుత్వాల ఆధీనంలో ఉండేది.

కేంద్ర బ్యాంకుల ఏర్పాటు

ద్రవ్య సరఫరా విధానం వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల అధీనంలో ఉంటుందని సాధారణంగా అనుకుంటుంటాం. కాని 20వ శతాబ్దం వరకు అనేక దేశాలలో ఈ బాధ్యతను అయా దేశాల కోశాగారాలు (ట్రెజరీలు) నిర్వహించేవి. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకులకు ఈ బాధ్యత అప్పచెప్పబడింది. మొదటి తరం కేంద్ర బ్యాంకులు స్వీడన్‌లో 1664, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ 1694, ఫ్రాన్స్‌లో 1800, నెదర్లాండ్స్‌లో 1818లలో ఆవిర్భవించాయి. మార్కెట్‌ల రుణాలు, ప్రభుత్వ రుణాల కొనుగోలు కోసం, వాణిజ్య అవసరాల మద్దతు కోసం కొద్ది మంది ప్రయివేటు పెట్టుబడిదారులతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఏర్పాటు చేయబడింది. తొలిరోజుల్లో ద్రవ్య వ్యవస్థ అభివృద్ధికి ఈ బ్యాంకు స్థాపన పునాదులు వేసింది. ఈ బ్యాంకు ఇతర వాణిజ్య బ్యాంకుల నుండి డిపాజిట్లను స్వీకరించటం, రుణాలనివ్వటం నిర్వహించింది. దాని దగ్గర అతి పెద్ద సంఖ్యలో పోగైన బంగారం నిల్వలతో పాటు బ్యాంకింగ్‌ రంగంలో అది పెంచుకున్న గుత్తాధిపత్యంతో అంతిమ రుణదాతగా (లెండర్‌ ఆఫ్‌ ల్యాస్ట్‌ రిసార్ట్‌) పరిణామం చెంది అనేక ఆర్థిక కల్లోలాలలో నిధుల లభ్యతను అందించింది. ప్రస్తుత కాలంలో అనుసరిస్తున్న ద్రవ్య సరఫరా విధాన సాధనమైన ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్‌లు (బహిరంగ మార్కెట్‌ కార్యకలాపాలు) - ఒ.యం.యు.ను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ అప్పట్లోనే చేపట్టింది. ప్రభుత్వ రుణ పత్రాలను, ఇతర ఆర్థిక సంస్థల రుణ పత్రాలను హామీగా ఉంచుకొని వాటికి రుణాలను అందించేది. దీనిపై వడ్డీని వసూలు చేసేది. ఈ వడ్డీ రేటును కొన్ని దేశాలలో డిస్కౌంట్‌ రేటుగా పిలుస్తున్నారు.

ఈ రకమైన వడ్డీ రేటును నియంత్రిస్తు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ బ్రిటీష్‌ రుణ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేయగలిగింది. అదే సందర్భంలో స్వల్ప కాలిక నిధులను ఆకర్షిస్తూ, అందించేందుకు ప్రతిపాదిస్తూ వివిధ దేశాల రుణ వ్యవస్థలను ఆ కాలంలో ప్రభావితం చేసింది. రెండవ తరం కేంద్ర బ్యాంకులుగా స్విట్జర్లాండ్‌లో 1907, అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ పేర 1913లలో ఏర్పడ్డాయి. అభివృద్ధి చెందిన దేశాల బాటలో బ్రిటీష్‌ వలస దేశాలలో, మధ్య ఐరోపా దేశాలలో, లాటిన్‌ అమెరికా దేశాలలో కేంద్ర బ్యాంకులు విస్తరించాయి.

ఆనాటి కేంద్ర బ్యాంకుల అనుభవాలు

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ లాంటి కేంద్ర బ్యాంకులు ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా వాణిజ్య దృక్పథంతో వ్యవహరించే క్రమంలో ప్రజల నుంచి పెరిగిన వత్తిడి మేరకు ప్రజా అవసరాల దృక్పథాల్ని పెంచుకోవాల్సి వచ్చింది. 19వ శతాబ్దం చివరి దశకం నుండి 20వ శతాబ్ద రెండవ దశకం వరకు కేంద్ర బ్యాంకులు బంగారం ప్రమాణాన్ని పాటించేవి. 18,19 శతాబ్ధాలలో బంగారం, వెండి నిల్వలతో నిమిత్తం లేని డబ్బు చెలామణితో పెరిగిన అత్యధిక స్థాయి ద్రవ్యోల్బణంతో ఈ చర్య అనివార్యమైంది. ఒక దేశంలోని డబ్బు చలామణి విలువ మొత్తం, ఆ దేశంలోని బంగారం నిల్వలతో సమానంగా ఉండటమే బంగారం ప్రమాణం అంటారు. ఇది వలసవాదం నాటి ''బంగారం ప్రమాణం'' గా పరిగణించాలి.

1913లో అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ ఏర్పడిన తరువాత వివిధ ఆర్ధిక ఒడుదుడుకులు సందర్భంగా ఆ బ్యాంకు చేపట్టిన ద్రవ్య సరఫరా చర్యలు వికటించి, అంతిమంగా మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడ్డ మహామాంద్యం కాలంలో అనేక బ్యాంకులు దివాళా తీసిన క్రమంలో, ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్య సరఫరా విధాన బాధ్యతను అమెరికా ట్రెజరీకి అప్పచెప్పింది. మళ్ళీ 1951 వరకు తిరిగి ఆ బాధ్యతను పొందలేకపోయింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్థాపన

బ్రిటీష్‌ వలస రాజ్యంగా ఉన్న భారతదేశంలో ద్రవ్య వ్యవస్థ సుస్థిరత కోసం, 1935లో భారత కేంద్ర బ్యాంకుగా ''రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా'' ప్రయివేట్‌ రంగంలో ఆవిర్భవించింది. అప్పటి వరకు ద్రవ్య సరఫరా విధాన అవసరాలలో కొన్నింటిని బ్రిటీష్‌ సామ్రాజ్యవాద నేతృత్వంలోని ఇంపీరియల్‌ బ్యాంక్‌ తీరుస్తుండేది. కరెన్సీ ముద్రణ బాధ్యతతో పాటు, బ్యాంకులకు బ్యాంకుగాను, ప్రభుత్వానికి బ్యాంకు గాను వ్యవహరించేటట్లు భారత రిజర్వ్‌ బ్యాంకును స్థాపించారు. దీనితో పాటు వ్యవసాయ పరపతి, సహకార రంగాల్ని అభివృద్ధి చేసే బాధ్యతను కూడా దీనికి అప్పచెప్పారు. వలస రాజ్యం అధీనంలో ఉండే రిజర్వ్‌ బ్యాంక్‌ ''నిర్వహణ స్వేచ్ఛ'' పై అనేక పరిమితులు ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోని అవసరాలను తీర్చడం కోసం బ్రిటీష్‌ వలస వాదులు భారత రిజర్వ్‌ బ్యాంకును వాడుకున్నారు. స్వతంత్ర భారతం ఆవిర్భవించిన తరువాత 1949లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జాతీయం చేయబడింది.

ముగింపు

తొలి శతాబ్ధాలలో ద్రవ్య సరఫరా విధాన ఛాయలు గోచరించినా, 19వ శతాబ్ధ తొలి దశలోనే ద్రవ్య సరఫరా విధాన పరిణామం మొదలైంది. 1914 ముందుకాలంలో ఈ విధానానికి సంబంధించిన సూత్రాలు, సాధనాలు ఆనాటి అవసరాల మేరకు అభివృద్ధి అయిన, 1914 తరువాత కాలంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో ''ద్రవ్య సరఫరా విధాన'' పాత్ర ప్రముఖంగా ముందుకొచ్చింది.

No comments: