Monday, February 1, 2016

ఆర్థిక లావాదేవీలపై పన్ను కోసం

- ప్రభాత్‌ పట్నాయక్‌
ద్రవ్యపెట్టుబడికి చట్టా వ్యాపారంపైనే ఆసక్తి వుండటం ఇక్కడ సమస్య. వాస్తవ ఆర్థిక వ్యవస్థపై చట్టా వ్యాపార ప్రభావాన్ని పరిమితంచేసే ప్రయత్నం ఎలాంటిదైనా అది చట్టా వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. అందుకని చట్టా వ్యాపారంపై ఎటువంటి పరిమితి విధించినా ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకిస్తుంది. ఆర్థిక లావాదేవీలపై పన్ను వేయటానికి ద్రవ్య పెట్టుబడి ఎందుకు వ్యతిరేకిస్తున్నదో ఇది తెలియజేస్తుంది.

రాబోయే అమెరికన్‌ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వానికి ప్రయత్నిస్తున్న బెర్నీ శాండర్స్‌ తనకుతాను 'సోషలిస్టు'నని ప్రకటించుకున్నాడు. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఉచితవిద్య అందించేందుకు ఆర్థిక లావాదేవీలపై పన్ను విధించాలని ఆయన ప్రతిపాదిస్తున్నాడు. డెమోక్రాటిక్‌ పార్టీలో జరుగుతున్న చర్చ ఈసారి వాల్‌స్ట్రీట్‌ (అమెరికాలో ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకులు కేంద్రీకృతమైన ప్రాంతం పేరు)ను నియంత్రించటంపై దృష్టి సారించింది. దానితో వాల్‌ స్ట్రీట్‌ను ప్రత్యక్షంగా ప్రభావితంచేసే శాండర్స్‌ ప్రతిపాదనకు ఎనలేని ప్రాధాన్యత వచ్చింది.

'ద్రవ్య సరుకుల(ఫైనాన్షియల్‌ ఎస్సెట్స్‌)'పై ఆర్థిక లావాదేవీల పన్నువేయటమనేది అమ్మకం పన్ను వేయటంలాంటిదే. బ్యాంకింగ్‌ సేవల నుంచి విదేశీ మారకద్రవ్య లావాదేవీలదాకా, ఈక్విటీ నుంచి డెరివేటివ్స్‌, కమ్మోడిటి 'ప్యూచర్స్‌' లావాదేవీలదాకా ఆర్థిక లావాదేవీల పన్ను పరిధిలోకి వస్తాయి. వీటిలో స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు కరెన్సీ లావాదేవీలతో సహా మిగిలిన లావాదేవీలకంటే భిన్నమైనవి. చట్టా కార్యకలాపాలను పరిమితం చేయటానికి ఈ ఇతర లావాదేవీలపై పన్ను విధించాలని గతంలో ప్రముఖ ఆర్థికవేత్త జేమ్స్‌ టోబిన్‌ సూచించాడు. ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచగలిగే అవకాశమున్నందున ఈ సూచన ప్రస్తుతం అందరి దృష్టీ ఆకర్షిస్తున్నది. దీనిని గురించే నేను ఇకపై ప్రస్తావించదలిచాను.

ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వ్యయం చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో వున్నది. అయితే కేవలం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచగలిగే శక్తి వుండటంవల్లనే ఆర్థిక లావాదేవీల పన్నును విధించటాన్ని సమర్థించటం లేదు. స్టాక్‌ మార్కెట్‌లో వస్తున్న విపరీతమైన ఒడిదుడుకులను తగ్గించటానికి, అనేక స్వల్ప కాల ట్రేడ్స్‌ను తొలగించటానికి కూడా ఈ పన్ను అవసరం వుంటుంది. ఆ విధంగా సమకాలీన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో వాస్తవ ఆర్థిక వ్యవస్థ కంటే సాపేక్షంగా కృత్రిమంగా ఎన్నోరెట్లు పెరుగుతూవున్న ద్రవ్యరంగ పరిమాణాన్ని కుదించటం కూడా దీనితో సాధ్యపడుతుంది. అలా కృత్రిమంగా అతిగా పెంచబడిన ద్రవ్య రంగం వాస్తవ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుకు గుదిబండలా తయారవుతుందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎమ్‌ఎఫ్‌) కూడా భావిస్తున్నది. దీని పరిమాణాన్ని సాపేక్షంగా కుదించటం అవసరమని ఈ సంస్థ కోరుతున్నది. ఈ లక్ష్యం సాధించటానికి ఆర్థిక లావాదేవీలపై పన్ను విధించటం ఒక సాధనంగా వుంటుంది.

పన్ను ప్రతిపాదన వ్యతిరేకిస్తున్న కార్పొరేట్‌-ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం

ఊహించినట్టుగానే అలాంటి పన్ను ప్రతిపాదనను ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్‌-ద్రవ్య పెట్టుబడిదారీ వర్గాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. భారతదేశంలో ఈక్విటీ లావాదేవీలపైన నామమాత్ర పన్ను విధిస్తున్నారు. అయితే దానిని కూడా ఇంకా తగ్గించాలనే డిమాండ్‌ ముందుకొస్తున్నది. అమెరికాలో కూడా కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులు తప్పుడు లెక్కలతో అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అలాంటి పన్నుతో ఎంతగా దెబ్బతింటున్నదో వివరిస్తూ శాండర్స్‌ ప్రతిపాదనను ఖండిస్తున్నారు.

అలాంటి అతిశయోక్తులను పక్కనబెట్టి ఆర్థిక లావాదేవీలపై పన్ను వేయటాన్ని వ్యతిరేకించేవారి వాదన ప్రధానంగా ఇలా వుంటుంది. పన్నువల్ల ఆదాయం పెరుగుతుందని చేసే వాదన 'సుస్థిర పరిచే ప్రభావం' వుంటుందనే వాదనతో విభేదిస్తుంది. ఒకవేళ చట్టా వ్యాపారాన్ని వాస్తవంలో పన్ను పరిమితం చేయగలిగి, వ్యవస్థలో స్థిరత్వాన్ని తేగలిగినప్పుడు ఆదాయం అంతగా రాదు. దీనికి కారణం ఇప్పుడున్న లావాదేవీల సంఖ్య పరిమితం చేయటంద్వారానే స్థిరత్వం వస్తుంది. అయితే లావాదేవీల సంఖ్య తగ్గించటమే జరిగితే దానికి అనుగుణంగా పన్ను పునాది కూడా తగ్గుతుంది. అలాగే పన్నుతో వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ పన్ను ప్రతిపాదించేవారు దానితోవచ్చే లాభాలను ఎక్కువచేసి చెబుతున్నారు. ఒక్కసారి ఈ వాస్తవాన్ని గుర్తిస్తే ఈ పన్నును వారు చెబుతున్న లాభాలు ఎంత పరిమితంగా వుంటాయో గమనించగలుగుతాం. ఆ తరువాత పెట్టుబడిదారుల తపన(జంతు ఉరవడి లేక యానిమల్‌ స్పిరిట్స్‌)పై దుష్ప్రభావం వుంటుంది గనుక అలాంటి పన్ను వేయటం అర్థరహితమైన చర్యగా మిగిలిపోతుంది.

ఈ వాదన సరుకులపైవేసే పరోక్ష పన్నుల విషయంలో చేసే వాదనను పోలి వున్నది. అదేమంటే ఒకవేళ ఒక సరుకు వినియోగాన్ని తగ్గించటం కోసం పరోక్షపన్ను రేటు పెంచి ఆపైన అదే సమయంలో దాన్ని ఆదాయం పెంచే చర్యగా సమర్థించటం సాధ్యపడదు.

అయితే ఈ వాదన ఒక కుతర్కం ఆధారంగా జరుగుతున్నది. అమెరికాకు సంబంధించిన అంచనాలాగా ఫైనాన్షియల్‌ కమ్మోడిటీస్‌ డిమాండ్‌కి చెందిన ధర వ్యాకోచంలో ఐక్యత వుంటుంది. అంటే ఒకవేళ ఫైనాన్షియల్‌ లావాదేవీల వ్యయం రెండు రెట్లయితే మొత్తం లావాదేవీల విలువ మారకుండా లావాదేవీల పరిమాణం సగం అవుతుంది. ఉదాహరణకు ఆర్థిక లావాదేవీల పన్నువల్ల ఆర్థిక లావాదేవీల వ్యయం రెట్టింపవుతుందని అనుకుందాం. అంటే గతంలో ఒక్కోటి 100 రూపాయల విలువగల 100ఫైనాన్షియల్‌ ఆస్తి యూనిట్లను అమ్మేవారనుకుంటే మొత్తం అమ్మకాల విలువ 10,000 రూపాయలవుతుంది. ఇప్పుడు పన్ను పెరగటంవల్ల ఒక్కో ఆస్తి విలువలో పెరుగుదల 200 ఉంటుంది. దానితో లావాదేవీలు జరిగిన ఆస్తుల పరిమాణం 50కి తగ్గుతుంది. అయినప్పటికీ మొత్తం అమ్మకాల విలువ అంతకుముందు వున్నట్టుగానే 10,000రూపాయలుంటుంది. అయితే ఈ నూతన పరిస్థితిలో కూడా పన్నుపై ఆదాయం 5,000 రూపాయలు వస్తుంది(50సార్లు 100రూపాయల చొప్పున). అంటే లావాదేవీల పరిమాణం గణనీయంగా తగ్గినప్పటికీ పన్నుపై వస్తున్న ఆదాయం పెరిగింది.

నేను ఇంతకుముందు చెప్పిన కుతర్కం మూలాలు ఒక గందరగోళంలో వున్నాయి. అదేమంటే పన్ను రేటుకు సంబంధించిన డిమాండ్‌ వ్యాకోచానికి, ఒక ఫైనాన్షియల్‌ కమ్మోడిటీ ధరకు సంబంధించిన డిమాండ్‌ వ్యాకోచానికి మధ్యగల తేడా గుర్తించక పోవటంవల్ల ఈ గందరగోళం ఏర్పడింది. రెండవది యూనిటి అయినప్పటికీ మొదటిది కాదు. ఎందుకంటే పన్ను ఒకేఒక భాగం. అదీ మొత్తం ధరలో పన్ను ఒక చిన్న భాగం మాత్రమే. కాబట్టి ఒక పన్నువల్ల పెరిగిన ధరతో పడిపోయే డిమాండ్‌ పరిమాణం సమ నిష్పత్తికి అనుగుణంగా వుంటుంది. పెరిగిన పన్నురేటుతో పోల్చినప్పుడు అది సమ నిష్పత్తికంటే తక్కువగా వుంటుంది. అందుకనే పన్ను రేటు పెరిగినప్పుడు పన్నుతోవచ్చే ఆదాయం పరిమాణం పెరుగుతుంది.

దీనితో అర్థమయ్యేదేమంటే ఆర్థిక లావాదేవీలపై పన్ను వేయటాన్ని సహేతుకమైన కారణాలతో ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం వ్యతిరేకించటంలేదు. ఏ కారణాలతో అయితే కరెన్సీ లావాదేవీల పన్నును లేక టోబిన్‌ పన్నును వ్యతిరేకించిందో అవే కారణాలతో దీనిని కూడా వ్యతిరేకిస్తున్నది. ఆ కారణాలు చట్టా వ్యాపారంలో తనకున్న ఆసక్తిలో వున్నాయి. ఈ పన్నులన్నీ ఆ చట్టా వ్యాపారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో వేసేవే.

'ఎంటర్‌ప్రైస్‌'కి, 'చట్టా వ్యాపారానికి' మధ్య తేడా గ్రహించగలిగే శక్తి అంతర్లీనంగా పెట్టుబడిదారీ మార్కెట్‌కు వుండదని ప్రముఖ బ్రిటిష్‌ ఆర్థికవేత్త జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ వాదించాడు. ఒక ఆస్తిని 'ఉంచుకునేందుకు' కొనటానికి, తరువాత కాలంలో అమ్మటానికి కొనటానికి మధ్యగల తేడాగా ఆయన నిర్వచించాడు. ఈ అశక్తతతే మార్కెట్‌ వైఫల్యంగా వుంటుందని కీన్స్‌ అన్నాడు. ఆర్థిక కార్యకలాపాలపై చట్టా ప్రభావాన్ని తగ్గించే చర్యలను ఆయన సమర్థించాడు. అయితే సమస్యేమిటంటే ద్రవ్య పెట్టుబడికి చట్టా వ్యాపారంపై ఆసక్తి వుంటుంది. వాస్తవ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే చట్టా వ్యాపారంపై వేసే కళ్లేలు స్వాభావికంగా చట్టా వ్యాపారానికి కళ్లేలుగా మారతాయి కాబట్టి అలాంటి చర్యలను ఏకంగా ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకిస్తుంది. ఆర్థిక లావాదేవీల పన్ను వేయటాన్ని ఇది ఎందుకు వ్యతిరేకిస్తున్నదో దీనినిబట్టి మనకు అర్థమవుతున్నది.

సంక్షేమ వ్యయానికి ఉపయోగపడుతుంది
భారతదేశంలో ఈ పన్నుపై వచ్చే ఆదాయం సంక్షేమ వ్యయానికి ఉపయోగపడుతుందని గతంలో ఒకసారి రాశాను. ఆ వాదన ఒకసారి గుర్తు చేసుకుందాం. గతంలో ప్రణాళికా సంఘంచే నియమించబడిన ఒక నిష్ణాతుల కమిటీని అనుసరించి భారతదేశంలో ప్రజలందరికీ సార్వజనీన ఆరోగ్య సంరక్షణ అందించటానికి స్థూల జాతీయోత్పత్తిలో 1.8శాతం అదనపు నిధులు అవసరమౌతాయి. గత కొద్ది కాలంగా భారతదేశంలోని స్టాక్‌ మార్కెట్‌లో ప్రతి దినం లావాదేవీల విలువ 2లక్షల కోట్లు. అంటే స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలపై 0.37శాతం పన్ను విధిస్తే భారతదేశంలో సార్వజనీన ఆరోగ్య సంరక్షణ అందించటానికి సరిపోతుంది. ఇది జేమ్స్‌ టోబిన్‌ సూచించిన 0.5శాతం కంటే తక్కువ.

అమెరికాలో శాండర్స్‌ సూచించినట్టుగానే భారతదేశంలో కూడా కోట్లాది పేదలకు అత్యంతగా ఉపయోగపడే ఈ ప్రణాళికను కార్పొరేట్‌-ఫైనాన్షియల్‌ పెట్టుబడిదారీ వర్గం వ్యతిరేకిస్తున్నది. ఇది చాలా తేలిగ్గా ఊహించగలిగే విషయమే. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజలకు మేలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చెందిన సంస్కరణలను 'శాంతియుతం'గా రద్దు చేయగలుగుతున్నప్పుడు వ్యవస్థను అధిగమించటం (ట్రాన్‌సెండింగ్‌) అనే అవసరం ఊసే వుండదు. ప్రస్తుతం ఐరోపా ఖండంలో అస్తిత్వంలోగల సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి 'పొదుపు చర్యల'ను ప్రవేశపెడుతున్నట్టుగా పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించేవారు దానిని 'సంక్షేమ పెట్టుబడిదారీ వ్యవస్థ'గా మార్చాలనే పగటికలను కంటున్న స్థితిలో పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించవలసిన అవసరం ఏర్పడుతుంది.
ఉచిత ప్రభుత్వ విద్యను అందించటానికి ఆర్థిక లావాదేవీలపై పన్ను విధించాలని శాండర్స్‌ చేస్తున్న డిమాండ్‌వంటి వాటికి చాలా ప్రాధాన్యత వుంది. ఈ డిమాండ్‌లో ఏ కొంచెం వాస్తవ రూపం దాల్చినా చాలా మేలు జరుగుతుంది. దీనిలో ఎంతయితే వాస్తవ రూపం దాల్చదో అంతవరకు అది లెనినిస్టు అర్థంలో 'పరివర్తనకాల డిమాండ్‌' పాత్రను పోషిస్తుంది. దానితో ఒకవైపు కొందరు భోగభాగ్యాలలో ఓలలాడుతుండగా మరోవైపు దుర్భర దారిద్య్రంలో, అజ్ఞానంలో, అనారోగ్యంలో తాము మగ్గటానికి గల అసలు కారణాన్ని ప్రజలు గ్రహించగలుగుతారు.

అనువాదం: నెల్లూరు నరసింహారావు

No comments: