నయాఉదారవాద విధానాల అమలుతో తీవ్రంగా రుణగ్రస్తమై, అనేక ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొన్న మెక్సికో, అర్జెంటినా లాంటి అబివృద్ధి చెందుతున్న దేశాల అనుభవాలు గతంలో చూశాం. అమెరికా ద్రవ్య సంక్షోభ తదనంతర పరిణామాలలో భాగంగా అబివృద్ధి చెందిన దేశాలైయుండి, యూరోజోన్ ఆర్థిక క్రమ శిక్షణతో పరిపుష్టతను పెంచుకున్న పోర్చుగల్, ఇటలీ, ఐర్లాండ్, గ్రీస్, స్పెయిన్ లాంటి యూరో దేశాలు సార్వభౌమ రుణ సంక్షోభంలో కూరుకుపోవడం, వాటిలో గ్రీస్ ఆర్థిక దుస్ధితి మరింత దిగజారటం ప్రపంచవ్యాప్త చర్చ అయింది.
గ్రీసు వైభవం - 2001లో గ్రీస్ పట్టుబట్టి యూరోజోన్లో సభ్యదేశమైంది. ప్రపంచ వాణిజ్య సంస్థ, నల్ల సముద్ర ఆర్థిక సహకార సంఘం, ఆర్థిక సహకార, అభివృద్ధి సంఘం (ఒ.ఇ.సి.డి)లలోను సభ్య దేశంగా ఉంది. 1 కోటి 10 లక్షల జనాభా గలిగిన గ్రీస్లో 49 లక్షల మంది కార్మిక వర్గంగా ఉన్నారు. గ్రీసు స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి) లో సేవారంగం 75.7%, పారిశ్రామిక రంగం 20.6%, వ్యవసాయరంగం 3.7% గా ఉండి, ప్రభుత్వ రంగం 40% గా ఉంది. వివిధ ఏజెన్సీల అంచనాల ప్రకారం (2008) జి.డి.పి ప్రాతిపదికన ప్రపంచంలో 27వ అతి పెద్ద సంపన్న దేశంగాను, తలసరి జి.డి.పిలో 26వ దేశంగాను, అత్యధిక మానవాభివృద్ధి సూచిలో 25వ దేశంగాను, నాణ్యత గల జీవనప్రమాణాలు సూచిలో 22వ దేశంగాను గ్రీస్ ప్రసిద్ధికెక్కింది. గ్రీస్ ఎగుమతి, దిగుమతులలో దాదాపు 50% యూరోజోన్ దేశాలతోనే పరిమితమయ్యాయి. గ్రీస్ ఆర్థిక వ్యవస్థలో టూరిజం, షిప్పింగ్ రంగాలు ప్రధానమైనవి. చైనా, ఆస్ట్రియా దేశీయులకు గ్రీస్ అత్యంత సందర్శనీయమైనది. యూరోపియన్ యూనియన్ సగటు జి.డి.పిలో గ్రీస్ 95% కలిగియున్నా, యూరోజోన్ దేశాల మొత్తం జి.డి.పిలో గ్రీస్ జి.డి.పి 3%నికి మించదు.
ఇంతటి ఆర్థిక పరిపుష్టి కలిగి సంపన్న దేశంగా చలామణి అవుతున్న గ్రీసు అతి స్వల్పకాలంలోనే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులకు ''అత్యంత ప్రీతి పాత్రమైన గమ్యదేశం''గా పరిణితి పొందింది. వేలాది కోట్ల డాలర్ల అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులు గ్రీస్ను ముంచేసాయి. ఆర్థిక ద్రవ్య సంఘంలోను, యూరోజోన్లోను సభ్య దేశంగా ఉన్నందున గ్రీస్ కు చెల్లించే రుణాలకు పూర్తి గ్యారంటీ ఉంటుందనే విశ్వాసంతో విదేశీ బ్యాంకులు, పెట్టుబడిదారులు అతి తక్కువ వడ్డీకి (2.25%) గ్రీస్ రుణ బాండులను కొన్నారు. ఈ రుణ బాండులను గ్యారంటీ చేయటానికి ''రుణ చెల్లింపు వైఫల్య పరిహార సాధనాలు'' (సి.డి.యస్) లాంటి డెరివేటివ్లు గ్రీస్ అర్థిక వ్యవస్థను కైవశం చేసుకున్నాయి (అమెరికా ద్రవ్య సంక్షోభానికి సి.డి.యస్.లు ఒక ముఖ్య కారణం). అమెరికా ఆర్థిక నమూనా తరహాలో పొదుపు కంటే వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ, వినియోగం పెరగటానికి రుణాల్ని పెంచారు. దీనితో ప్రభుత్వ వ్యయం అదుపులేకుండా పోయింది. అమెరికా ద్రవ్య సంక్షోభ తదనంతర కాలంలో గ్రీస్లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గింది. అందుచేత ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుండి రక్షించటానికి గాను ప్రభుత్వ వ్యయం మరింత పెరిగి, ద్రవ్య లోటు జి.డి.పిలో 12.7%నికి (2009) (యూరోజోన్ ప్రమాణం 3%) చేరటంతో గ్రీస్ ఆర్థిక వ్యవస్థలో ప్రమాదఘటికలు మ్రోగాయి.
రుణ సంక్షోభంలో గ్రీస్ - ఈ నేపథ్యంలో జరిగిన గ్రీస్ సాధారణ ఎన్నికలలో ''జార్జి పాపస్ డ్య్రూ'' నాయకత్వంలోని సోషలిస్ట్ పాసక్ పార్టి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతామనే ప్రధాన వాగ్దానంతో విజయం సాధించి, అధికార పగ్గాలను చేజిక్కించుకున్నది (నవంబరు,2009). దివాళా చేరువకు చేరిన గ్రీస్ ఆర్థిక వ్యవస్థను రక్షించటం కోసం ద్రవ్య లోటును 8.7%కి తగ్గించటానికి పూనుకొంది. అదే సందర్భంలో గ్రీస్ రుణ భారం జి.డి.పిలో 113.4% నుండి 121% (యూరోజోన్ ప్రమాణం 60%) చేరటం ప్రభుత్వానికి ఆందోళన కల్గించింది. గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలను బహిరంగపర్చింది. గత ప్రభుత్వం గోల్డ్మ్యాన్ శాక్ లాంటి పెట్టుబడి బ్యాంకులతో కుమ్మక్కై ''రుణ చెల్లింపు వైఫల్య పరిహార సాధనాల'' (క్రెడిట్ డిఫాల్ట్ శ్వాప్) చాటున అత్యధిక ప్రభుత్వ రుణాన్ని, ద్రవ్య లోటును కప్పి పుచ్చి, పెట్టుబడిదారులను తప్పుత్రోవ పట్టించిన వార్తలు, అవినీతి కార్యకలాపాల కథనాలు గుప్పుమన్నాయి. ప్రభుత్వ పారదర్శకత, విశ్వాసనీయత, రిస్క్లపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీనితో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు గ్రీస్ రుణ బాండులపై విశ్వాసనీయ రేటింగ్ను తీవ్రంగా కుదించాయి. దీని ప్రభావంతో కొత్తగా వేలం వేసే రుణ బాండులతో పాటు పాత ఖాతాలపై కూడా చెల్లించాల్సిన వడ్డీ, రుణ వ్యయం, సి.డి.యస్లపై చెల్లించాల్సిన ప్రీమియం రెట్టింపై ఆర్థిక భారాన్ని తీవ్రంగా పెంచాయి. ద్రవ్య రేటు మరింత పెరిగింది. ఈ స్థితిలో విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. విదేశీ మారక విలువలుఅడుగంటి కరెన్సీ కరెంటు ఎకౌంట్ లోటు (యూరోజోన్ ప్రమాణం 4%) విపరీతంగా పెరిగింది. 2010లో గ్రీస్ చెల్లించాల్సిన 50 బిలియన్ యూరోల రుణం తిరిగి చెల్లించలేని స్థితికి దిగజారింది. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ గ్రీస్ ఆర్థిక దుస్థితిని తీవ్రంగా పరిగణించింది.
యూరోజోన్ చక్రబంధంలో గ్రీస్ - ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ప్రతి దేశానికి స్వతంత్రంగా అమలు చేయగల ద్రవ్య విధానాలు కావాలి. ఎగుమతులు పెంచుకోవటం కోసం కరెన్సీ విలువను తగ్గించుకోవాలి. కాని గ్రీస్ విషయంలో కధ అడ్డం తిరిగింది. యూరో విలువను తగ్గించటానికి యూరోజోన్ ఏకాభిప్రాయం కావాలి. ఇతర దేశాలనుండి ఆర్థిక సహాయం పొందటానికి యూరోజోన్ అంగీకారం కావాలి. ఇవన్నీ యూరో జోన్ పరిధిలో అసాధ్యాలు. గ్రీస్ లో జరిగిన ఆర్థిక అవకతవకలతో జర్మనీ, ఫ్రాన్స్ లాంటి యూరో దేశాలు ఆగ్రహించాయి. గ్రీస్కు సహాయమందిస్తే, ఇతర రుణ గ్రస్త యూరో దేశాలకూ ఆర్థిక సహాయమందించాల్సిన బాధ్యత మీద పడుతుందని, ఫలితంగా తమ ఆర్థిక వ్యవస్థలపై భారాలు పెరిగి తమ దేశాలు సైతం ప్రమాదపుటంచులకు లాగబడతాయని భయపడ్డాయి. సహాయం చేయకపోతే యూరోజోన్ భవితవ్యం ప్రశ్నార్ధకమౌతుందనే డోలాయమానం ఆ దేశాలను ఆవహించింది. ఆర్థిక సహాయం పొందాలంటే గ్రీస్ తన ద్రవ్య లోటును జి.డి.పిలో 3%నికి తగ్గించాలని యూరో దేశాలు షరతు పెట్టాయి. ద్రవ్య లోటు అదుపులో భాగంగా గ్రీస్, ప్రభుత్వ వ్యయాన్ని భారీగా తగ్గించి, ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలపై, సదుపాయాలపై తీవ్రమైన కోతను విధించాయి. ప్రజాగ్రహం మిన్ను ముట్టింది. తన సందిగ్ధ స్థితిలో యూరోజోన్ గ్రీస్ను సత్వరం ఆదుకోవటానికి ముందుకు రాలేదు. గ్రీస్ కష్టాలు మరింత పెరిగాయి. యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ ఏకీకరణ అంతిమ లక్ష్యంగా ఏర్పడిన యూరోపియన్ ఆర్థిక ద్రవ్య సంఘం, యూరోజోన్లకు క్లిష్టసమయాల్లో యూరోపియన్ యూనియన్ రాజకీయ మద్దతు లేకపోవటంతోనూ, సంక్లిష్ట పరిస్థితులలో ఉమ్మడి బాధ్యతలతో పాటు ద్రవ్య విధానాలలో స్వతంత్ర కార్యాచరణకు వెసులుబాటు లేకపోవటంతోనూ గ్రీస్ ఒంటరి పాలుకావటంతో, యూరోజోన్ మనుగడ ప్రశ్నార్ధకమైంది. యూరోజోన్ ఆర్థిక ప్రగతికి ఊపిరిలూదిన ఉమ్మడి కరెన్సీ భావన నయాఉదారవాద విధానాల నేపధ్యంలో గ్రీస్ ఆర్థిక సంక్లిష్టతను మరింతగా పెంచింది.
ముగింపు - తాజాగా యూరోజోన్ దేశాలు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ సంయుక్తంగా గ్రీస్కు రుణ సహాయాన్ని అందించటానికి సిద్ధమౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్జెంటినా రుణ సంక్షోభ సమయాన అంతర్జాతీయ ద్రవ్య సంస్థ పన్నిన కుయుక్తులు ఆ దేశాన్ని మరింత కష్టాల్లోకి దించింది. యూరోజోన్ ఆర్థిక సమస్యలలో, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ జోక్యం, యూరోజోన్లో కొత్త సమస్యలను సృష్టించనున్నది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి జీవనాధారంగా గల ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులు దినదిన గండాలే.
No comments:
Post a Comment