Friday, April 9, 2010

ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం

ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం -

ఇటీవలి ప్రపంచ ఆర్థిక సంక్షోభ ధాటికి యూరోపియన్‌ యూనియన్‌ దేశమైన గ్రీసు కుప్పకూలటం అందరికీ తెలిసిన విషయమే. ఈ దేశం 300 బిలియన్‌ యూరోల సార్వభౌమ ఋణ చెల్లింపు వైఫల్యాల సుడిగుండంలో ఇరుక్కున్నది. ఫలితంగా యూరోపియన్‌ యూనియన్‌ ఐక్యత, యూరో కరెన్సీ మనుగడ, ఆర్థిక ద్రవ్య సంఘ అస్థిత్వాలపై తీవ్రమైన విమర్శలు, చర్చలు చెలరేగుతున్నాయి.

యూరోపియన్‌ సంఘం (యూరోపియన్‌ యూనియన్‌-ఇ.యు)- మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలతో చవిచూసిన అపార నష్టాలనుండి రక్షించుకోవడం కోసం, ఆర్థిక పరిపుష్టిని పెంచుకొని ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన శక్తిగా యూరోపియన్‌ దేశాలు ఎదగడం కోసం యూరోపియన్‌ యూనియన్‌ ఆవిర్భవించింది. 1951లో పారిస్‌లో యూరప్‌ దేశాల ఐక్యతకు శ్రీకారం చుట్టబడి, 1952లో యూరోపియన్‌ బొగ్గు, ఉక్కు సమాజం పేర (యూరోపియన్‌ కోల్‌ Ê స్టీల్‌ కమ్యూనిటి) ఫ్రాన్స్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, బెల్జియం, పశ్చిమ జర్మనీ, లుగ్జెంబర్గ్‌ దేశాల మద్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యంతో యూరోపియన్‌ యూనియన్‌ స్థాపనకు పునాదులు పడ్డాయి. 1957 సం||లో ఈ దేశాలు యూరోపియన్‌ ఆర్థిక సమాజం (యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటి - ఇ.ఇ.సి) పేర ఒక కష్టమ్స్‌ యూనియన్‌ గాను, అణుశక్తిని అభివృద్ధి చేయటానికి యూరోపియన్‌ అణుశక్తి సమాజం (యూరోపియన్‌ అటామిక్‌ ఎనర్జీ కమ్యూనిటి) గాను ఏర్పడ్డాయి. 1967లో మెర్జర్‌ ఒప్పందం ద్వారా యూరోపియన్‌ సమాజం (యూరోపియన్‌ కమ్యూనిటి - ఇ.సి) ఏర్పడి, 1973లో అంతిమంగా మాస్ట్రీచ్ట్‌ ఒప్పందం ద్వారా యూరోపియన్‌ సమాజం (యూరోపియన్‌ యునియన్‌) ఆవిర్భవించింది. దీనిలో 27 యూరప్‌ దేశాలు సభ్య దేశాలుగా ఉండి 500 మిలియన్ల పౌరుల్ని కలిగివుంది. యూరప్‌ దేశాలలో ఏకీకృత మార్కెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి, తమ సభ్య దేశాలలోని ప్రజలు, సరుకులు, సేవలు, పెట్టుబడిరంగాలలో స్వేచ్ఛా చలనాన్ని యూరోపియన్‌ యూనియన్‌ ఏర్పరిచింది. ఫలితంగా స్థూల ప్రపంచ ఉత్పత్తిలో యూరోపియన్‌ యూనియన్‌ 30% వాటాని కలిగివుంది. యూరోపియన్‌ యూనియన్‌లో ఏ దేశాని కా దేశం అభివృద్ధి అవుతూ, యూరోపియన్‌ యూనియన్‌ సమగ్రాభివృద్ధికి దోహదపడుతున్నది. రాజకీయంగా యూరోపియన్‌ యూనియన్‌ ప్రపంచ చరిత్రలో మహత్తర శక్తిగా ఎదిగింది.


మొదటి భాగం

ఆర్థిక ద్రవ్య సంఘం(ఎకనామిక్‌ మానిటరీ యూనియన్‌ - ఇ.యం.యు)- యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు పటిష్టమై, ప్రపంచ వాణిజ్యంలో బలమైన శక్తిగా ఎదగటానికి సాధనంగా ''ఆర్థిక ద్రవ్య సంఘం భావన'' ఆవిర్భవించింది. యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ఏకీకృతం చేసే సాధనమే ఆర్థిక ద్రవ్య సంఘం. యూరోపేతర దేశాలతో పటిష్టమైన వాణిజ్యాన్ని నెరపడం కోసం, ఆర్థిక సంక్షోభాలనుండి ఆర్థిక వ్యవస్థల్ని రక్షించుకోవడం కోసం యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్ధల మధ్య అంతర్గత ఆర్థిక ద్రవ్య సమన్వయముండాలని 1969లో బర్‌ నివేదిక పేర్కొంది. ఈ కార్య సాధనకు ఆర్థిక ద్రవ్య సంఘం ఉండాలని భావించి అక్టోబర్‌ 1970 నాటికి వార్నర్‌ ప్రణాళిక పేర కార్యాచరణ బ్లూప్రింట్‌ తయారుచేయబడింది. అంతర్జాతీయ కరెన్సీ ప్రమాణంగా బంగారం స్థానంలో డాలర్‌ను అమెరికా ఏక పక్షంగా రుద్దిన సంక్షోభ ఫలితంగాను, 1972లో చమురు సంక్షోభంతో పెరిగిన ధరల మూలకంగాను ఈ ప్రణాళిక అమలుకు నోచుకోలేకపోయింది. కాని ఈ సంక్షోభం నుండి బయటపడటానికి 1973లో ''యూరోపియన్‌ ద్రవ్య సహకారనిధి'' ఏర్పాటు చేయబడింది. యూరప్‌ దేశాల సంఘీభావం నిలబెట్టబడింది. 1979లో ఏర్పడ్డ చమురు సంక్షోభంలో ఆర్థిక ద్రవ్య సంఘ భావన కంటె, ఏకీకృత మార్కెట్‌ భావన ప్రముఖంగా ముందుకొచ్చింది. 1987లో ఏర్పడ్డ ఏకీకృత మార్కెట్‌ చట్టం అమలుతో వివిధ యూరప్‌ దేశాల మద్య పన్నుల విధింపులో సామరస్యం, ఆరోగ్యకర పోటీ ఆవశ్యకతలు అనివార్యమయ్యాయి. వీటికి కొనసాగింపుగా ఏకీకృత మార్కెట్‌కు, ఏకీకృత కరెన్సీ దోహదపడుతూ పుష్కలంగా మార్కెట్లను చేజిక్కించుకోగలమనే విశ్వాసం యూరప్‌ దేశాలలో పెరిగింది

No comments: