Thursday, June 17, 2010

నమోదైన కంపెనీల్లో పబ్లిక్‌ హౌల్డింగ్‌ పెంపు ఎవరికి శ్రేయస్కరం

ఒక పరిశీల

సెబీతో (స్టాక్‌ ఎక్స్చ్‌ంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) నమోదైన భారతీయ కంపెనీలు తప్పనిసరిగా కనీసం 25% ల వాటాలను పబ్లిక్‌ హౌల్డింగ్‌ లో (ప్రజల చేతుల్లో కంపెనీ వాటాలు) ఉంచాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. వీటిపై అటు ప్రయివేటు రంగంలోను, ఇటు ప్రభుత్వ రంగంలోను విస్త్రృత చర్చ నడుస్తున్నది. ఈ మార్గదర్శక సూత్రాల ప్రభావం ''ప్రభుత్వరంగ వాటాల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్‌) పై తీవ్ర ప్రభావాల్ని కల్గించనున్నది. ఈ మార్గదర్శక సూత్రాల పర్యవసానాల్ని కొన్నింటిని పరిశీలించుదాం

మార్గదర్శక సూత్రాలు

యు.పి.ఏ-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, క్యాపిటల్‌ మార్కెట్‌ అభివృద్ధికి కొన్ని చర్యల్ని చేపట్టింది. అందులో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ మార్గంలో ప్రభుత్వ రంగ వాటాల ఉపసంహరణ ప్రధానమైనది. ఇంత వరకు సెబీతో నమోదైన (లిస్టెడ్‌) కంపెనీలలో పబ్లిక్‌ హౌల్డింగ్‌ క్రింద కనీసం 10% ఉంచాలి. అప్పుడు ప్రమోటర్‌ కోటా 90% గా ఉంటుంది. ఈ మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వం అనేక మినహాయింపులతో చూసి చూడనట్లుండేది. ఆ సూత్రాలు, నమోదైన ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించేవి కావు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ పై మోజు పెరిగినాక, కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్‌ హౌల్డింగ్‌ ప్రమాణాల సవరణకు పూనుకుంది. నూతన ప్రమాణాల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ అయిన, ప్రయివేటు రంగ సంస్థ అయిన సెబీ దగ్గర నమోదైతే కనీసం పబ్లిక్‌ హౌల్డింగ్‌లో 25% వాటాలు ఉంచాలి. దీనికి ఏరకమైన మినహాయింపులుండవు. ఒక సంవత్సరంలో 25% పబ్లిక్‌ హౌల్డింగ్‌ సాధ్యం కాని పక్షంలో ప్రతి సంవత్సరం 5% తగ్గకుండా కంపెనీ పబ్లిక్‌ హౌల్డింగ్‌ను పెంచాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో మరుసటి సంవత్సరం 25% పబ్లిక్‌ హౌల్డింగ్‌ ఒక్క సంవత్సరంలోనే సాధించవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక నమోదైన కంపెనీలో పబ్లిక్‌ హౌల్డింగ్‌ 10% ఉంటే 3 సం||లోగా పబ్లిక్‌ హౌల్డింగ్‌ను 25% పెంచాలి

చర్చా పత్రం వివరాలు-

''పబ్లిక్‌ హౌల్డింగ్‌ను పెంచడమంటే నమోదైన కంపెనీలలో ప్రజల వాటా శాతాన్ని పెంచడమే. ఈ రకంగా ప్రజల వాటాలా విస్తృతి పెంచటం మూలకంగా వ్యక్తిగత షేర్‌ మదుపుదారులకు విలువైన కంపెనీల వాటాలు విస్తృతంగా లభిస్తాయి. ఫలితంగా సక్రమమైన వాటా ధర నిర్ణయం చేయబడి, ఎక్కువ సంఖ్యలో వాటాలు, ఎక్కువ మంది వాటా దారులకు అందుబాటులో ఉంచగల''వని మార్గదర్శక సూత్రాలకు జారీకి ముందు విడుదల చేసిన చర్చా పత్రంలోసెబీ వివరించింది. ''వ్యక్తిగత వాటాదారులకు వాటాల లభ్యత ఏ మేరకు తగ్గుతాయో, ఆ మేరకు ప్రమోటర్‌ వాటాలు కలిగిన ఆ కంపెనీ యాజమాన్యాలు వివిధ అవకతవలకు పాల్పడే ప్రమాదముందని'' ఆ పత్రంలో సెబీ వాదించి, పబ్లిక్‌ హౌల్డింగ్‌ను 25% కి పెంచటానికి కావలసిన ప్రాతిపదికను ఆ పత్రం సిద్ధం చేసింది.

పూర్వ చరిత్ర -

1993 సం|| పూర్వం సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ రెగ్యులేషన్స్‌ చట్టం 1956 ప్రకారం, నమోదైన కంపెనీ 60% వాటాలను పబ్లిక్‌ హౌల్డింగ్‌ క్రింద జారీ చేయవలసియుంది. ఈ నియమాలను వివిధ రకాలుగా మినహాయిస్తూ, (కేంద్ర ప్రభుత్వ అంగీకారంతో) స్టాక్‌ ఎక్స్ఛెంజ్‌లకు అనుమతినిచ్చారు. భారతదేశంలో నయాఉదారవాద విధానాల అమలు జోరు అందుకున్నాక, 60% పబ్లిక్‌ హౌల్డింగ్‌ నియమంతో ''విదేశీ సంస్థలు స్వదేశీ కంపెనీల వాటాలను అత్యధికంగా హస్తగతం చేసుకొనే ప్రమాదం ఉందన్న'' సాకుతో, పబ్లిక్‌ హౌల్డింగ్‌ శాతాన్ని తగ్గించాలని భారతదేశ ప్రయివేటు రంగం ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి తెచ్చింది. దేశీయ కంపెనీల వత్తిడికి తలొగ్గి 1999లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ హౌల్డింగ్‌ శాతాన్ని 25% కి తగ్గించింది. అందులోనూ మరిన్ని మినహాయింపులను మంజూరు చేసింది. ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ కంపెనీలు, 20 లక్షల వాటాల్ని ఆఫర్‌ చేయగల సంస్థలు, వేయి కోట్లకు పైబడి మార్కెట్‌ నుండి పెట్టుబడి సమీకరించగల కంపెనీలకు పబ్లిక్‌ హౌల్డింగ్‌ 10% నికి తగ్గించబడింది. 25% పబ్లిక్‌ హౌల్డింగ్‌ అన్న సూత్రం ఆచరణలో 10% నికి కుదించబడింది. ఈ విధంగా భారతీయ ప్రయివేటు కంపెనీలు విదేశీ కంపెనీల బూచిని చూపి అత్యధిక ప్రయోజనాల్ని పొందాయి. ప్రమోటర్స్‌ కోటా 90% నికి పెంచుకోవటంలోనూ, పబ్లిక్‌ హౌల్డింగ్‌ను 10%నికి నిర్వహించడంలోను వివిధ కంపెనీల యాజమాన్యాలు అనేక రకాల అవకతవకలకు పాల్పడ్డాయి.

అంచనావేస్తున్న పర్యవసానాలు - యు.పి.ఏ-2 అధికారంలోకి వచ్చినాక ప్రభత్వరంగ సంస్థల వాటాల ఉపసంహరణకు నడుంకట్టింది. తాజా మార్గదర్శక సూత్రాలను అమలు జరిపితే ఈ క్రింద పేర్కొన్న పర్యవసానాలకు అవకాశమున్నట్లు యస్‌.యం.సి. క్యాపిటల్స్‌, ఈక్విటీ హెడ్‌ జగన్నాధం తూనుగుంట్ల తెలియజేస్తున్నారు.

1. 25% కంటే తక్కువ పబ్లిక్‌ హౌల్డింగ్‌ కలిగి నమోదైన కంపెనీలు 183.

2. ఈ 183 కంపెనీల నుండి వివిధ పబ్లిక్‌ ఆఫరింగ్‌ల ద్వారా రూ. 1,50,527 కోట్లు నిధులు మార్కెట్లో సమీకరింపబడాలి. వీటిలో ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రూ. 1,24,547 కోట్లు (మొత్తంలో 83%) మరియు ప్రయివేటు రంగం నుండి రూ. 25,981 కోట్లు (మొత్తంలో 17%).

3. పై వాటాలను ప్రతి సంవత్సరం 5% చొప్పున జారీ చేస్తే, జూన్‌ 2010 నుండి జూన్‌ 2011 వరకు రూ.61,327 కోట్లు, జూన్‌ 2011 నుండి జూన్‌ 2012 వరకు రూ. 43,668 కోట్లు, జూన్‌ 2012 నుండి జూన్‌ 2013 వరకు రూ. 24,475 కోట్లు, జూన్‌ 2013 నుండి జూన్‌ 2014 వరకు రూ. 11,911 కోట్లు, జూన్‌ 2014 నుండి 2015 వరకు రూ. 9,147 కోట్ల నిధులు మార్కెట్లో సమీకరించాల్సి ఉంటుంది.

4. పై 183 కంపెనీలలో 148 కంపెనీలు ప్రయివేటు రంగంలోను, 35 కంపెనీలు ప్రభుత్వ రంగంలోను ఉన్నాయి.

5. ప్రభుత్వరంగ సంస్థలలో హిందూస్థాన్‌ కాపర్‌, యం.యం.టి.సి, నైవేలి లిగ్‌నైట్‌, యన్‌.టి.పి.సి, యన్‌.హెచ్‌.పి.సి, పవర్‌ గ్రిడ్‌ , భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, యునైటెడ్‌ బ్యాంకు, ఐ.ఒ.సి మొదలైనవి ఉన్నాయి.

6. ప్రయివేటు రంగంలో డి.యల్‌.ఎఫ్‌, విప్రో, రిలయన్స్‌ పవర్‌, సన్‌ టి.వి, టాటా టెలికమ్యూనికేషన్స్‌ మొదలైనవి ఉన్నాయి.

7. వచ్చే దశకం సగం భాగం ఎఫ్‌.పి.ఒల యుగంగా మారనున్నది.

స్పందనలు-

1. ప్రభుత్వరంగ సంస్థల వాటాల ఉపసంహరణకు ఈ చర్యలు ప్రధానంగా దారితీస్తాయి. అందువల్ల ఈ మార్గ దర్శక సూత్రాల నుండి ప్రభుత్వరంగాన్ని మినహాయించాలని ప్రభుత్వ రంగ పరిరక్షణ సంఘాలు కోరుతున్నాయి.

2. ప్రజల వాటా విస్త్రృతి పెంచటం క్యాపిటల్‌ మార్కెట్‌ నియమాలలో ఆరోగ్యకర పరిణామమే. 1993 పూర్వంలోని పబ్లిక్‌ వాటాల స్థాయికి పబ్లిక్‌ హౌల్డింగ్‌ను తీసుకువెళ్ళడం శ్రేయస్కరం. తాజా మార్గదర్శక సూత్రాల వల్ల లబ్ది పొందే సామాన్య మదుపదుల సంఖ్య చాలా స్వల్పమైనదని సామాన్య నిపుణులు ఆభిప్రాయపడుతున్నారు (దేశ జనాభాలో షేర్‌ల మదుపు దారులు రెండు శాతం కంటే తక్కువ).

3. జనవరి 2008 సం||లో రూ. 74,48,000 కోట్ల మార్కెట్‌ సమీకరణ కలిగిన భారత స్టాక్‌ మార్కెట్‌ మే 2010 నాటికి రూ.43,75,020 కోట్లు మాత్రమే ఉంది. అత్యధిక బూమ్‌ ను చూసిన 2007 వ సం||లో పబ్లిక్‌ షేర్లు అత్యధికంగా రూ. 59,000 కోట్లు మాత్రమే ట్రేడ్‌ అయినాయి. యూరప్‌ పరిణామాల దుష్ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకుంటున్నాయి. మార్కెట్‌ నిరుత్సాహంగా, నిశ్చేజంగా ఉన్న నేపధ్యంలో మదుపుదారులు తగ్గుతున్నారు. ఈ స్థితిలో ఈ మార్గదర్శక సూత్రాల అమలు, విలువైన షేర్‌లను తెగబడి అమ్మే సంస్రృతికి నెట్టబడుతుందని, ఇది సరిఅయిన సమయం కాదని కార్పోరేట్‌ మార్కెట్‌ వర్గాలు అభిప్రాయబడుతున్నాయి.

4. ఈ చర్యలు అంతిమంగా అత్యధిక ధనవంతులకు, సంస్థాగత పెట్టుబడిదారులకు మాత్రమే ప్రయోజనం కలిగించేవిగా అభ్యుధయ వాదులు భావిస్తున్నారు. కారణాలేవైనా అన్ని వర్గాలలో పై మార్గదర్శక సూత్రాల అమలు పై విముఖత పెరుగుతుంది.

Monday, June 7, 2010

భారత దేశం లో పేదరిక రేఖ పై విభిన్న దృక్పధాలు

ప్రపంచీకరణ వేగవంతమవడంతో పేదరికం గురించిన చర్చ దశ, దిశ మారాయి. ఆర్థిక వేత్తలు రెండు శిబిరాలుగా చీలారు ఇందులో ఒకటి ప్రపంచీకరణ విధానాలు పేదరిక నిర్మూలనకు దోహదపడ్డాయన్నది. రెండవది ఈ ఆర్థిక విధానాలు పేదరికాన్ని తీవ్రంగా పెంచాయన్నది. ఈ వాదనలకు అనుగుణంగా వివిధ దేwwdoit2.jpg poverty image by chelseamuhxree

శాలపై పేదరిక గణాంకాలు వివిధ రకాలుగా వెలుగులోకి వచ్చాయి. అదే పద్ధతిలో భారత దేశంలో పేదల సంఖ్యపై విభిన్నమైన, పరస్పర విరుద్ధమైన ప్రమాణాలు చర్చకు వచ్చాయి. భిన్న గణాంకాలు తెరమీదకు వచ్చాయి.

భారతదేశంలో విభిన్న పేదరిక గణాంకాలు- భారతదేశంలో ఆర్థిక సంస్కరణల అవసరాలకు అనుగుణంగా నూతన చర్చకు తెరలేపింది లక్డావాలా కమిటి అని చెప్పవచ్చు. ఇప్పటికి ఖరారైన పేదరిక ప్రమాణాలకు 2004-05 సం|| ప్రమాణాలు ఆధారంగా ఉన్నాయి. అధికారికంగా ప్లానింగ్‌ కమీషన్‌ నిపుణుల బృందం నిర్ధారించిన పేదరిక గణాంకాల ప్రకారం మన దేశంలో పట్టణ ప్రాంతాలలో 25.7%, గ్రామీణ ప్రాంతాలలో 28.3% పేదలున్నట్లు తెలుస్తుంది. ఇదే సందర్భంలో కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ, మాజీ ప్రణాళికా సంఘ సభ్యుడు యన్‌.సి. సక్సేనా నాయకత్వంలో చేపట్టిన అధ్యయనాల ప్రకారం మన దేశంలో పేదలు 50%గా ఉన్నట్టు తేలుతున్నది. అర్జున్‌ సేన్‌ గుప్తా నాయకత్వంలో పారిశ్రామిక సంస్థలలో అసంఘటిత రంగంపై అధ్యయనానికి నియమించిన జాతీయ కమీషన్‌ మన దేశంలో 77% మంది రోజుకు రూ.20/- లు అంత కంటే తక్కువ ఆదాయంతో జీవనం గడుపుతున్నారని ప్రకటించారు. ఆర్థిక వృద్ధి కేవలం లాభార్జనే పరమావధిగా ఉండకూడదని, సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల జీవన స్థితిగతుల్ని గణనీయంగా మెరుగుపరిచేదిగా ప్రణాళికలుండాలని ఈ అధ్యయన బృందం అభిప్రాయపడింది. ఈ విధంగా భిన్న ఆధ్యయనాలు, భిన్న నిర్ధారణలకు రావడానికి కారణం అర్థికవేత్తల సామాజిక దృక్పథంలో ఉన్న వైవిధ్యమే.

వేరువేరు అధ్యయనాలతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆర్థిక సంస్కరణలు పేదరిక నిర్మూలనకు దోహద పడుతున్నాయని పాలక వర్గాలు చేస్తున్న ప్రచారం బెడిసికొట్టింది. కేంద్ర ప్రణాళికా సంఘం పేదరిక నిర్ధారణపై అధ్యయనానికి మార్చి 2009లో సురేష్‌ టెండూల్కర్‌ నాయకత్వంలో మరొక నిపుణుల బృందాన్ని నియమించింది. ఈ బృందం కూడా 2004-05 సం||లో ఖరారైన పేదరిక ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుంది. ఈ బృందం ఖరారు చేసిన నివేదికలో పట్టణ ప్రాంతాలలోని పేదలు 25.7%గా యథాతథంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పేదలు 28.3% నుండి 41.8% పెరిగి దేశవ్యాప్తంగా పేదలు 27.5% నుండి 37.2% పెరిగినట్లు నివేదిక పేర్కొన్నది. గతంలో జరిగిన వివిధ అధ్యయనాలకు భిన్నంగా టెండూల్కర్‌ కమిటి పేదరిక నిర్ధారణలో పౌష్ఠికాహార వినియోగంతో పాటు విద్య, వైద్య అవసరాలను పరిగణలోకి తీసువాలన్నది. అదే సందర్భంలో పట్టణ ప్రాంతాల్లో వినియోగమైన రూ. 19/- (రోజుకు) లలో విద్య, వైద్య ఖర్చులు ఇమిడి ఉన్నాయని చెప్తూ నూతన పేదరిక ప్రమాణాలను నిర్ధారించటానికి ప్రయత్నించింది. యన్‌.సి.సక్సేనా, అర్జున్‌ సేన్‌ గుప్తా కమిటీల అధ్యయనాలలో తేలిన పేదరిక పెరుగుదలతో కంగారు పడ్డ పాలక వర్గాలు టెండూల్కర్‌ కమిటి నివేదికతో ఊపిరిపీల్చుకుని, కమిటి సిఫార్సులను అమోదించాయి. మూడు నివేదికల సారాంశం సంస్కరణల తరువాత పేదరికం పెరిగిందన్నదే.

టెండూల్కర్‌ కమిటి సిఫార్సులపై విమర్శలు - టెండూల్కర్‌ కమిటి సిఫార్సులపై వివిధ ఆర్థిక, సామాజిక రంగాల నిపుణులు తీవ్రమైన అభ్యంతరాల్ని వ్యక్తం చేసారు.

1. మౌలిక పౌష్ఠికాహార వినియోగ ప్రమాణాలను నీరు కార్చటం- ఆదాయం పై కాకుండా పౌష్ఠికాహార వినియోగంపై ఆధారపడి పేదరిక రేఖ అంచనాలు వేయాలని 1957,1979 సం||లలో ప్లానింగ్‌ కమీషన్‌ నిపుణుల బృందం నిర్ధారించింది. భారత వైద్య పరిశోధన కౌన్సిల్‌ నిర్ధారణ మేరకు తీవ్రమైన పనుల్లో ఉన్న మగవారు 3800 కేలరీలు, ఆడవారు 2925 కేలరీల పౌష్ఠికాహారాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ప్లానింగ్‌ కమీషన్‌ నిపుణుల బృందం పట్టణ ప్రాంతాలలో 2100 కేలరీలు, గ్రామీణ ప్రాంతాలలో 2400 కేలరీల పౌష్ఠికాహార వినియోగాన్ని పేదరిక ప్రమాణ నిర్ధారణకు నిర్ణయించింది. కానీ టెండూల్కర్‌ కమిటి సిఫార్సులలో ఈ పౌష్ఠికాహార ప్రమాణాలను పట్టణ ప్రాంతాల్లో 1795 కేలరీలు, గ్రామీణ ప్రాంతాలలో 1820 కేలరీలుగా నిర్ణయించి అంచనాలు తయారు చేసింది. ఇందుకు ప్రపంచ ఆహార సంస్థ భారతదేశ పౌష్ఠికాహార వినియోగ ప్రమాణం 1800 కేలరీలు చాలునన్న సిఫార్సుల్ని సాకుగా చూపింది. ఈ ప్రమాణం అనేక అబివృద్ధి చెందిన దేశాల పౌష్ఠికాహార వినియోగ ప్రమాణాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. పౌష్ఠికాహార వినియోగ ప్రమాణాల్ని తగ్గించి తయారు చేసే పేదరిక నిర్ధారణ అంచనాలు తప్పని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. భారతదేశ పౌష్ఠికాహార ప్రమాణాలు ఈ దేశంలోనే నిర్ణయించబడాలని ప్రతిపాదిస్తున్నారు. పౌష్ఠికాహార ప్రమాణాలను తగ్గించాల్సిన పరిస్థితులు ఏమి లేవని అభిప్రాయపడుతున్నారు.

2. లోపభూయిష్టమైన ధరల సూచి- 1973 ధరల ఆధారంగా గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.49/- లు పట్టణ ప్రాంతాలలో నెలకు రూ. 57/-లు కంటే తక్కువ పౌష్ఠికాహార వినియోగం కలవారు పేదలుగా పరిగణించటం ఈనాటికీ ప్రమాణంగానే ఉంది. కానీ దీనిని వినియోగదారుల ధరల సూచి ఆధారంగా పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నారు. వాస్తవంగా వినియోగదారుల ధరల సూచి వాస్తవ జీవన వ్యయాన్ని సక్రమంగా ప్రతిబింబించలేదన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల లోపభూయిష్టమైన ధరల సూచి ఆధారంగా చేసే అంచనాలు వాస్తవాలను ప్రతిబింబించవు.

3. అమలులో ఉన్న పేదరిక రేఖ పౌష్ఠికాహార వాస్తవ అవసరాలతో పాటు జీవించటానికి కావలసిన నివాసం, గుడ్డ, ఆరోగ్య రక్షణ, పారిశుధ్యం, సాగునీరు, విద్య లాంటి మౌలిక అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నది.

4.జనాభా పెరగడం మూలకంగా తగ్గే పేదరిక శాతాన్ని, పేదరికం తగ్గినట్లుగా పరిగణించకూడదు.

5. పై వాదనల ఆధారంగా అంచనావేసే వాస్తవ పేదరికం అధికారికముగా ప్రకటించే పేదరికానికి రెండింతలు ఉంటుందని. నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముగింపు - ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులైన మాంటెక్‌ సింగ్‌ అహుల్వాలియా టెండూల్కర్‌ కమిటి సిఫార్సులను ఆమోదిస్తూ, పేదరిక ప్రమాణాల నిర్ధారణలో విద్య, వైద్యం లాంటి మౌళిక అవసరాల్ని పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. కానీ మౌలికంగా పేదరిక రేఖ నిర్ధారణలో జరుగుతున్న పొరపాటు అవగాహనలు, తప్పుడు వ్యాఖ్యలు సరికాకుండా వాస్తవ పేదరిక రేఖ నిర్ధారణ ఎండమావియే.

Saturday, June 5, 2010

సామర్థ్యాల పేదరికం - పరిచయం

See full size imageసాపేక్ష నిరాకరణ (రెలెటివ్‌ డిప్రివేషన్‌) భావనకు కొనసాగింపుగా ''సామర్థ్యాల అవగాహన'' (కేపబిలిటీస్‌ అప్రోచ్‌) మరింత మెరుగ్గా పేదరికాన్ని నిర్వచించినది. ఈ అవగాహనకు రూపశిల్పి నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌. ఈ అవగాహనలో మానవ జీవిత నిర్వహణలోని ''సామర్థ్యాల పాత్రను'' ఆయన విశిష్టంగా విశ్లేషిస్తారు. సామర్థ్యాల పేదరికంపై ఆయన వాదనలు ఇలా ఉన్నాయి. సామర్థ్యాల నిరాకరణ - పేదరికాన్ని ఆదాయాల్లో కొరత (జీవనభృతి) ప్రమాణాలలో కంటే సామర్థ్యాల నిరాకరణ (డిప్రివేషన్‌ ఆఫ్‌ కేపబిలిటీస్‌)గా చూడాలి. సామర్థ్యాల నిరాకరణ అవగాహనలోనే, ఆదాయాల్లో కొరత భావన ఇమిడివుంది. సామర్థ్యాల కొరత/నిరాకరణ కున్న అనేక కారణాలలో ఆదాయ కొరత/నిరాకరణ ఒకటి మాత్రమే. సామాన్యంగా ఆదాయాల కొరత/నిరాకరణ, సామర్థ్యాల కొరత/నిరాకరణకు దారితీస్తుంది. అందువలన సామర్థ్యాల నిరాకరణను ఆమోదించడమంటే పేదరికంపై ఆదాయకొరత అవగాహనను నిరాకరించడం కాదని అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు.

వివరణ - సామాన్యంగా సామర్థ్యాలను మానవుడు సరుకులు, వాటి లక్షణాల నుండి పొందుతాడు. ఈ సామర్థ్యాలే అంతిమంగా మానవుని అవసరాలను తీర్చగల్గుతాయి. ఉదాహరణకు సైకిల్‌ ఒక సరుకు. దాని ప్రధాన లక్షణం రవాణా చేయటం. అది మనిషిని ఒక చోట నుండి మరొక చోటికి త్వరగా చేర్చ కలిగే మానవ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ రకం సామర్థ్యాలే మానవుని జీవన ప్రమాణాల్ని మెరుగుపరుస్తాయి. ఈ ప్రక్రియనే సరుకుల్ని ప్రయోజనాత్మకంగా మార్చుకోవటం (ఫంక్షనింగ్‌) అంటారు. జీవన ప్రమాణాల మెరుగుదలలో సరుకులు, వాటి వినియోగాలే కాకుండా, మానవ సామర్థ్యాల పాత్ర కీలకమని అమర్త్యసేన్‌ వాదిస్తారు. సుదీర్ఘంగా ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన జీవితాన్ని గడపటానికి కావలసిన పోషణ కరువైనప్పుడు మౌలిక సామర్థ్యాలు కొరవడుతాయని, ఫలితంగా జీవన ప్రమాణాలు క్షీణిస్తాయని, అందువల్ల సామర్థ్యాల నిరాకరణే పేదరికంగా అమర్త్యసేన్‌ నిర్వచించారు. పేదరికమంటే కూడు, గూడు, గుడ్డ తోపాటు ఆరోగ్యం, విద్య, స్వేచ్ఛ లేకపోవటం లేక నిరాకరింపబడటం. పేదరిక నిర్వచనం విసృతమైనది.

సామర్థ్యాలపై వివిధ ప్రభావాలు - సామర్థ్యాలపై (ఆదాయం పై కంటే ) వివిధ ప్రభావాలుంటాయి. 1. వయస్సు - యుక్తవయస్సు కంటే వృధ్ధాప్యంలో సామర్ధ్యంలో తేడా ఉంటుంది. వాళ్ళ అవసరాలు భిన్నంగా ఉంటాయి. 2. లింగభేదం, సామాజిక పాత్ర - గర్భధారణ బాధ్యత, ఆచారపరంగా నిర్వహించాల్సిన కుటుంబ బాధ్యతలు సామర్థ్యాలపై ప్రభావం చూపిస్తాయి. 3. స్థితి/స్ధానం - వరదలు, కరువుకాటకాలు, అభద్రత, హింస ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సామర్థ్యాలపై వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది.4. అంటువ్యాధులు - అంటువ్యాధులు తరచు సోకే ప్రాంతాలలో ప్రజల సామర్థ్యాలపై వాటి ప్రభావం అధికంగా ఉంటుంది. 5. మానవుని అదుపు లేని వివిధ పరిస్థితులు మానవ సామర్థ్యాలపై ప్రభావాన్ని చూపిస్తాయి.

ఆదాయం, సామర్థ్యాలు - 1. వృద్ధాప్యం, అంగవైకల్యం మనిషి సంపాదనపై పరిమితులను ఏర్పరుస్తాయి. సరుకుల్ని ప్రయోజనాత్మకంగా మార్చుకోవడంలో వారి మధ్య అనేక వ్యత్యాసాలు ఉంటాయి. వృద్ధులు, అంగవైకల్యులు, అనారోగ బాధితులు సగటు మనిషి జీవన ప్రమాణాలను సాధించటానికి ఎక్కువ ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. వీటి ప్రభావం వారి సామర్థ్యాలపై అధికంగా ఉండి, వారి వ్యయ ప్రాధాన్యతలను తారుమారు చేస్తున్నాయి. అందువల్ల వీరికి ప్రభుత్వ చర్యలు అవసరమై ఉంటాయి. 2. లింగవివక్ష కొన్ని కుటుంబాలలో కొన్ని వైరుధ్యాలను సృష్టిస్తుంది. లింగవివక్ష పాటించే ప్రాంతాలలో మగవారికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, కుటుంబ వనరులను అత్యధికంగా కేటాయించటం మూలకంగా, కుటుంబంలో మహిళలకు అందించగలిగే వనరులు కొరవడి అవి వారి సామర్థ్యంపై ప్రభావాన్ని కల్గిస్తాయి. లింగసమానత్వం ఉందనుకున్న యూరప్‌లోని ఇటలీలో జాతీయ ఆదాయంలో మహిళా శ్రమశక్తి గుర్తింపబడలేదు. అందువలన ఆదాయాలపరంగా సాపేక్ష నిరాకరణ, సామర్థ్యాల పరంగా సంపూర్ణంగా ఉండి సంపూర్ణ పేదరికానికి (ఆబ్జల్యూట్‌ పావర్టి) దారితీస్తుంది. 3. సామాజిక కార్యక్రమాలలో పాల్గొననివ్వని ''సామాజిక వెలివేత'' విధానాలు మానవ సామర్థ్యాలపై ప్రభావం కలిగి ఉంటాయి. టి.వి, వీడియో ప్లేయర్లు, ఆటోమోబైల్స్‌ అత్యధికంగా ఉత్పత్తి అయ్యే ధనిక దేశాలలో, వాటి నిరాకరణ కూడా సామర్థ్యాల నిరాకరణకు దారితీయవచ్చు.

సామర్థ్యాల పేదరిక విశ్లేషణలు, ''సామర్థ్యాల పేదరిక'' నిర్వచనాల యొక్క స్వభావం, కారణాలపై అవగాహనను పెంచుతుంది. అది పేదరిక నిర్మూలన సాధనాల కంటే, పేదరికానికి మూలమైన సమస్యలను వెదికి, వాటి పరిష్కారానికి కేంద్రీకరిస్తుంది.

వనరులపై హక్కును పొందటం (ఎన్‌టైటిల్‌మెంట్‌)- అమర్త్యసేన్‌ సామర్థ్యాలపై చేసిన సూత్రీకరణలతో పాటు, వనరులపై స్వాధీన హక్కును పొందే (ఎన్‌టైటిల్‌మెంట్‌) ప్రక్రియపై చేసిన వాదనలు ప్రముఖమైనవి. సమాజంలో వనరులు విస్తారంగా ఉండవచ్చుకాని, వాటి అవసరాలున్న ప్రజానీకం వాటిని సేకరించుకోగలిగే హక్కు కల్గియుండాలి. ఆ హక్కు భూమి కావచ్చు, జీవనభృతి, వేతనాల రూపంలో గాని ఉండవచ్చు లేదా ప్రభుత్వ జోక్యంతో సంక్రమించవచ్చు. లేని పక్షంలో మానవ సామర్థ్యాలు చైతన్యాలుడిగి నీరుకారి పోతాయి. అమర్త్యసేన్‌, ''కరువుకాటకాలలో మగ్గుతున్న ప్రజల్ని ఉదహరిస్తూ, వారు ఆహార పదార్థాల నందుకొనే హక్కు కల్గియుంటే, వారి సామర్థ్యాలు నిలబడతాయి. లేకపోతే కరువుకాటకాలతో బాధపడటమే వారికి సంక్రమించిన హక్కుగా భావించవలస ివుంటుంద''న్నారు. అందువల్లే వన రులపై హక్కులు లేకపోవడమే సామర్థ్యాల నిరాకరణగా, అదే పేద రికంగా అమర్త్యసేన్‌ పేదరికంపై నిర్వచనాన్ని విసృత పరిచారు.

సామర్థ్యాలు, వనరులపై హక్కు సాధనకు స్వేచ్ఛ అనివార్యమైంది - తమ దగ్గర ఉన్న సంపదను ఉపయోగించుకొని సామర్థ్యాల మెరుగుదలకు అవసరమైన సుదీర్ఘ జీవనం, ఆరోగ్యం, చలనం లాంటి జీవన ప్రమాణాలు వాటంతటవే ప్రజలదగ్గరకు రావు. వాటిని ఎన్నుకోకలిగి, సాధించగలిగే స్వేచ్ఛ అవసరమని, అందుకు రాజకీయ, పౌర స్వేచ్ఛలు కావాలని అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. రాజకీయ, పౌర స్వేచ్ఛలను సాధించటానికి, అనుభవించటానికి హక్కులు అవసరమని, ఈ హక్కుల సాధనకు సంఘాలు ఏర్పాటు చేసుకోవటం, దానికి చట్టబద్ధత, చట్టపరమైన భద్రత అనివార్యమైనదన్నారు. ఇదంతా జరిగితే వ్యవస్థ స్వరూప స్వభావాలే మారిపోవచ్చు. అందుకనే పాలక వర్గాలు పై వాదనలకు అనేక ప్రతివాదనలను ముందుకు తెస్తున్నాయి. సంపద సృష్టిలో శ్రమ శక్తికి మానవ సామర్థ్యాల కల్పన ముందస్తు షరతుగా ''కారల్‌ మార్క్సు'' చేసిన సూత్రీకరణ, సామర్థ్యాల పేదరికంపై మరింత స్పష్టతనిస్తుంది.