నమోదైన కంపెనీల్లో పబ్లిక్ హౌల్డింగ్ పెంపు ఎవరికి శ్రేయస్కరం
ఒక పరిశీలనసెబీతో (స్టాక్ ఎక్స్చ్ంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) నమోదైన భారతీయ కంపెనీలు తప్పనిసరిగా కనీసం 25% ల వాటాలను పబ్లిక్ హౌల్డింగ్ లో (ప్రజల చేతుల్లో కంపెనీ వాటాలు) ఉంచాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. వీటిపై అటు ప్రయివేటు రంగంలోను, ఇటు ప్రభుత్వ రంగంలోను విస్త్రృత చర్చ నడుస్తున్నది. ఈ మార్గదర్శక సూత్రాల ప్రభావం ''ప్రభుత్వరంగ వాటాల ఉపసంహరణ (డిజిన్వెస్ట్మెంట్) పై తీవ్ర ప్రభావాల్ని కల్గించనున్నది. ఈ మార్గదర్శక సూత్రాల పర్యవసానాల్ని కొన్నింటిని పరిశీలించుదాం
మార్గదర్శక సూత్రాలు
యు.పి.ఏ-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, క్యాపిటల్ మార్కెట్ అభివృద్ధికి కొన్ని చర్యల్ని చేపట్టింది. అందులో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ మార్గంలో ప్రభుత్వ రంగ వాటాల ఉపసంహరణ ప్రధానమైనది. ఇంత వరకు సెబీతో నమోదైన (లిస్టెడ్) కంపెనీలలో పబ్లిక్ హౌల్డింగ్ క్రింద కనీసం 10% ఉంచాలి. అప్పుడు ప్రమోటర్ కోటా 90% గా ఉంటుంది. ఈ మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వం అనేక మినహాయింపులతో చూసి చూడనట్లుండేది. ఆ సూత్రాలు, నమోదైన ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించేవి కావు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ పై మోజు పెరిగినాక, కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్ హౌల్డింగ్ ప్రమాణాల సవరణకు పూనుకుంది. నూతన ప్రమాణాల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ అయిన, ప్రయివేటు రంగ సంస్థ అయిన సెబీ దగ్గర నమోదైతే కనీసం పబ్లిక్ హౌల్డింగ్లో 25% వాటాలు ఉంచాలి. దీనికి ఏరకమైన మినహాయింపులుండవు. ఒక సంవత్సరంలో 25% పబ్లిక్ హౌల్డింగ్ సాధ్యం కాని పక్షంలో ప్రతి సంవత్సరం 5% తగ్గకుండా కంపెనీ పబ్లిక్ హౌల్డింగ్ను పెంచాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో మరుసటి సంవత్సరం 25% పబ్లిక్ హౌల్డింగ్ ఒక్క సంవత్సరంలోనే సాధించవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక నమోదైన కంపెనీలో పబ్లిక్ హౌల్డింగ్ 10% ఉంటే 3 సం||లోగా పబ్లిక్ హౌల్డింగ్ను 25% పెంచాలి
చర్చా పత్రం వివరాలు-
''పబ్లిక్ హౌల్డింగ్ను పెంచడమంటే నమోదైన కంపెనీలలో ప్రజల వాటా శాతాన్ని పెంచడమే. ఈ రకంగా ప్రజల వాటాలా విస్తృతి పెంచటం మూలకంగా వ్యక్తిగత షేర్ మదుపుదారులకు విలువైన కంపెనీల వాటాలు విస్తృతంగా లభిస్తాయి. ఫలితంగా సక్రమమైన వాటా ధర నిర్ణయం చేయబడి, ఎక్కువ సంఖ్యలో వాటాలు, ఎక్కువ మంది వాటా దారులకు అందుబాటులో ఉంచగల''వని మార్గదర్శక సూత్రాలకు జారీకి ముందు విడుదల చేసిన చర్చా పత్రంలోసెబీ వివరించింది. ''వ్యక్తిగత వాటాదారులకు వాటాల లభ్యత ఏ మేరకు తగ్గుతాయో, ఆ మేరకు ప్రమోటర్ వాటాలు కలిగిన ఆ కంపెనీ యాజమాన్యాలు వివిధ అవకతవలకు పాల్పడే ప్రమాదముందని'' ఆ పత్రంలో సెబీ వాదించి, పబ్లిక్ హౌల్డింగ్ను 25% కి పెంచటానికి కావలసిన ప్రాతిపదికను ఆ పత్రం సిద్ధం చేసింది.
పూర్వ చరిత్ర -
1993 సం|| పూర్వం సెక్యూరిటీ కాంట్రాక్ట్ రెగ్యులేషన్స్ చట్టం 1956 ప్రకారం, నమోదైన కంపెనీ 60% వాటాలను పబ్లిక్ హౌల్డింగ్ క్రింద జారీ చేయవలసియుంది. ఈ నియమాలను వివిధ రకాలుగా మినహాయిస్తూ, (కేంద్ర ప్రభుత్వ అంగీకారంతో) స్టాక్ ఎక్స్ఛెంజ్లకు అనుమతినిచ్చారు. భారతదేశంలో నయాఉదారవాద విధానాల అమలు జోరు అందుకున్నాక, 60% పబ్లిక్ హౌల్డింగ్ నియమంతో ''విదేశీ సంస్థలు స్వదేశీ కంపెనీల వాటాలను అత్యధికంగా హస్తగతం చేసుకొనే ప్రమాదం ఉందన్న'' సాకుతో, పబ్లిక్ హౌల్డింగ్ శాతాన్ని తగ్గించాలని భారతదేశ ప్రయివేటు రంగం ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి తెచ్చింది. దేశీయ కంపెనీల వత్తిడికి తలొగ్గి 1999లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ హౌల్డింగ్ శాతాన్ని 25% కి తగ్గించింది. అందులోనూ మరిన్ని మినహాయింపులను మంజూరు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు, 20 లక్షల వాటాల్ని ఆఫర్ చేయగల సంస్థలు, వేయి కోట్లకు పైబడి మార్కెట్ నుండి పెట్టుబడి సమీకరించగల కంపెనీలకు పబ్లిక్ హౌల్డింగ్ 10% నికి తగ్గించబడింది. 25% పబ్లిక్ హౌల్డింగ్ అన్న సూత్రం ఆచరణలో 10% నికి కుదించబడింది. ఈ విధంగా భారతీయ ప్రయివేటు కంపెనీలు విదేశీ కంపెనీల బూచిని చూపి అత్యధిక ప్రయోజనాల్ని పొందాయి. ప్రమోటర్స్ కోటా 90% నికి పెంచుకోవటంలోనూ, పబ్లిక్ హౌల్డింగ్ను 10%నికి నిర్వహించడంలోను వివిధ కంపెనీల యాజమాన్యాలు అనేక రకాల అవకతవకలకు పాల్పడ్డాయి.
అంచనావేస్తున్న పర్యవసానాలు - యు.పి.ఏ-2 అధికారంలోకి వచ్చినాక ప్రభత్వరంగ సంస్థల వాటాల ఉపసంహరణకు నడుంకట్టింది. తాజా మార్గదర్శక సూత్రాలను అమలు జరిపితే ఈ క్రింద పేర్కొన్న పర్యవసానాలకు అవకాశమున్నట్లు యస్.యం.సి. క్యాపిటల్స్, ఈక్విటీ హెడ్ జగన్నాధం తూనుగుంట్ల తెలియజేస్తున్నారు.
1. 25% కంటే తక్కువ పబ్లిక్ హౌల్డింగ్ కలిగి నమోదైన కంపెనీలు 183.
2. ఈ 183 కంపెనీల నుండి వివిధ పబ్లిక్ ఆఫరింగ్ల ద్వారా రూ. 1,50,527 కోట్లు నిధులు మార్కెట్లో సమీకరింపబడాలి. వీటిలో ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రూ. 1,24,547 కోట్లు (మొత్తంలో 83%) మరియు ప్రయివేటు రంగం నుండి రూ. 25,981 కోట్లు (మొత్తంలో 17%).
3. పై వాటాలను ప్రతి సంవత్సరం 5% చొప్పున జారీ చేస్తే, జూన్ 2010 నుండి జూన్ 2011 వరకు రూ.61,327 కోట్లు, జూన్ 2011 నుండి జూన్ 2012 వరకు రూ. 43,668 కోట్లు, జూన్ 2012 నుండి జూన్ 2013 వరకు రూ. 24,475 కోట్లు, జూన్ 2013 నుండి జూన్ 2014 వరకు రూ. 11,911 కోట్లు, జూన్ 2014 నుండి 2015 వరకు రూ. 9,147 కోట్ల నిధులు మార్కెట్లో సమీకరించాల్సి ఉంటుంది.
4. పై 183 కంపెనీలలో 148 కంపెనీలు ప్రయివేటు రంగంలోను, 35 కంపెనీలు ప్రభుత్వ రంగంలోను ఉన్నాయి.
5. ప్రభుత్వరంగ సంస్థలలో హిందూస్థాన్ కాపర్, యం.యం.టి.సి, నైవేలి లిగ్నైట్, యన్.టి.పి.సి, యన్.హెచ్.పి.సి, పవర్ గ్రిడ్ , భారత్ ఎలక్ట్రానిక్స్, యునైటెడ్ బ్యాంకు, ఐ.ఒ.సి మొదలైనవి ఉన్నాయి.
6. ప్రయివేటు రంగంలో డి.యల్.ఎఫ్, విప్రో, రిలయన్స్ పవర్, సన్ టి.వి, టాటా టెలికమ్యూనికేషన్స్ మొదలైనవి ఉన్నాయి.
7. వచ్చే దశకం సగం భాగం ఎఫ్.పి.ఒల యుగంగా మారనున్నది.
స్పందనలు-
1. ప్రభుత్వరంగ సంస్థల వాటాల ఉపసంహరణకు ఈ చర్యలు ప్రధానంగా దారితీస్తాయి. అందువల్ల ఈ మార్గ దర్శక సూత్రాల నుండి ప్రభుత్వరంగాన్ని మినహాయించాలని ప్రభుత్వ రంగ పరిరక్షణ సంఘాలు కోరుతున్నాయి.
2. ప్రజల వాటా విస్త్రృతి పెంచటం క్యాపిటల్ మార్కెట్ నియమాలలో ఆరోగ్యకర పరిణామమే. 1993 పూర్వంలోని పబ్లిక్ వాటాల స్థాయికి పబ్లిక్ హౌల్డింగ్ను తీసుకువెళ్ళడం శ్రేయస్కరం. తాజా మార్గదర్శక సూత్రాల వల్ల లబ్ది పొందే సామాన్య మదుపదుల సంఖ్య చాలా స్వల్పమైనదని సామాన్య నిపుణులు ఆభిప్రాయపడుతున్నారు (దేశ జనాభాలో షేర్ల మదుపు దారులు రెండు శాతం కంటే తక్కువ).
3. జనవరి 2008 సం||లో రూ. 74,48,000 కోట్ల మార్కెట్ సమీకరణ కలిగిన భారత స్టాక్ మార్కెట్ మే 2010 నాటికి రూ.43,75,020 కోట్లు మాత్రమే ఉంది. అత్యధిక బూమ్ ను చూసిన 2007 వ సం||లో పబ్లిక్ షేర్లు అత్యధికంగా రూ. 59,000 కోట్లు మాత్రమే ట్రేడ్ అయినాయి. యూరప్ పరిణామాల దుష్ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకుంటున్నాయి. మార్కెట్ నిరుత్సాహంగా, నిశ్చేజంగా ఉన్న నేపధ్యంలో మదుపుదారులు తగ్గుతున్నారు. ఈ స్థితిలో ఈ మార్గదర్శక సూత్రాల అమలు, విలువైన షేర్లను తెగబడి అమ్మే సంస్రృతికి నెట్టబడుతుందని, ఇది సరిఅయిన సమయం కాదని కార్పోరేట్ మార్కెట్ వర్గాలు అభిప్రాయబడుతున్నాయి.
4. ఈ చర్యలు అంతిమంగా అత్యధిక ధనవంతులకు, సంస్థాగత పెట్టుబడిదారులకు మాత్రమే ప్రయోజనం కలిగించేవిగా అభ్యుధయ వాదులు భావిస్తున్నారు. కారణాలేవైనా అన్ని వర్గాలలో పై మార్గదర్శక సూత్రాల అమలు పై విముఖత పెరుగుతుంది.
No comments:
Post a Comment