Monday, June 7, 2010

భారత దేశం లో పేదరిక రేఖ పై విభిన్న దృక్పధాలు

ప్రపంచీకరణ వేగవంతమవడంతో పేదరికం గురించిన చర్చ దశ, దిశ మారాయి. ఆర్థిక వేత్తలు రెండు శిబిరాలుగా చీలారు ఇందులో ఒకటి ప్రపంచీకరణ విధానాలు పేదరిక నిర్మూలనకు దోహదపడ్డాయన్నది. రెండవది ఈ ఆర్థిక విధానాలు పేదరికాన్ని తీవ్రంగా పెంచాయన్నది. ఈ వాదనలకు అనుగుణంగా వివిధ దేwwdoit2.jpg poverty image by chelseamuhxree

శాలపై పేదరిక గణాంకాలు వివిధ రకాలుగా వెలుగులోకి వచ్చాయి. అదే పద్ధతిలో భారత దేశంలో పేదల సంఖ్యపై విభిన్నమైన, పరస్పర విరుద్ధమైన ప్రమాణాలు చర్చకు వచ్చాయి. భిన్న గణాంకాలు తెరమీదకు వచ్చాయి.

భారతదేశంలో విభిన్న పేదరిక గణాంకాలు- భారతదేశంలో ఆర్థిక సంస్కరణల అవసరాలకు అనుగుణంగా నూతన చర్చకు తెరలేపింది లక్డావాలా కమిటి అని చెప్పవచ్చు. ఇప్పటికి ఖరారైన పేదరిక ప్రమాణాలకు 2004-05 సం|| ప్రమాణాలు ఆధారంగా ఉన్నాయి. అధికారికంగా ప్లానింగ్‌ కమీషన్‌ నిపుణుల బృందం నిర్ధారించిన పేదరిక గణాంకాల ప్రకారం మన దేశంలో పట్టణ ప్రాంతాలలో 25.7%, గ్రామీణ ప్రాంతాలలో 28.3% పేదలున్నట్లు తెలుస్తుంది. ఇదే సందర్భంలో కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ, మాజీ ప్రణాళికా సంఘ సభ్యుడు యన్‌.సి. సక్సేనా నాయకత్వంలో చేపట్టిన అధ్యయనాల ప్రకారం మన దేశంలో పేదలు 50%గా ఉన్నట్టు తేలుతున్నది. అర్జున్‌ సేన్‌ గుప్తా నాయకత్వంలో పారిశ్రామిక సంస్థలలో అసంఘటిత రంగంపై అధ్యయనానికి నియమించిన జాతీయ కమీషన్‌ మన దేశంలో 77% మంది రోజుకు రూ.20/- లు అంత కంటే తక్కువ ఆదాయంతో జీవనం గడుపుతున్నారని ప్రకటించారు. ఆర్థిక వృద్ధి కేవలం లాభార్జనే పరమావధిగా ఉండకూడదని, సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల జీవన స్థితిగతుల్ని గణనీయంగా మెరుగుపరిచేదిగా ప్రణాళికలుండాలని ఈ అధ్యయన బృందం అభిప్రాయపడింది. ఈ విధంగా భిన్న ఆధ్యయనాలు, భిన్న నిర్ధారణలకు రావడానికి కారణం అర్థికవేత్తల సామాజిక దృక్పథంలో ఉన్న వైవిధ్యమే.

వేరువేరు అధ్యయనాలతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆర్థిక సంస్కరణలు పేదరిక నిర్మూలనకు దోహద పడుతున్నాయని పాలక వర్గాలు చేస్తున్న ప్రచారం బెడిసికొట్టింది. కేంద్ర ప్రణాళికా సంఘం పేదరిక నిర్ధారణపై అధ్యయనానికి మార్చి 2009లో సురేష్‌ టెండూల్కర్‌ నాయకత్వంలో మరొక నిపుణుల బృందాన్ని నియమించింది. ఈ బృందం కూడా 2004-05 సం||లో ఖరారైన పేదరిక ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుంది. ఈ బృందం ఖరారు చేసిన నివేదికలో పట్టణ ప్రాంతాలలోని పేదలు 25.7%గా యథాతథంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పేదలు 28.3% నుండి 41.8% పెరిగి దేశవ్యాప్తంగా పేదలు 27.5% నుండి 37.2% పెరిగినట్లు నివేదిక పేర్కొన్నది. గతంలో జరిగిన వివిధ అధ్యయనాలకు భిన్నంగా టెండూల్కర్‌ కమిటి పేదరిక నిర్ధారణలో పౌష్ఠికాహార వినియోగంతో పాటు విద్య, వైద్య అవసరాలను పరిగణలోకి తీసువాలన్నది. అదే సందర్భంలో పట్టణ ప్రాంతాల్లో వినియోగమైన రూ. 19/- (రోజుకు) లలో విద్య, వైద్య ఖర్చులు ఇమిడి ఉన్నాయని చెప్తూ నూతన పేదరిక ప్రమాణాలను నిర్ధారించటానికి ప్రయత్నించింది. యన్‌.సి.సక్సేనా, అర్జున్‌ సేన్‌ గుప్తా కమిటీల అధ్యయనాలలో తేలిన పేదరిక పెరుగుదలతో కంగారు పడ్డ పాలక వర్గాలు టెండూల్కర్‌ కమిటి నివేదికతో ఊపిరిపీల్చుకుని, కమిటి సిఫార్సులను అమోదించాయి. మూడు నివేదికల సారాంశం సంస్కరణల తరువాత పేదరికం పెరిగిందన్నదే.

టెండూల్కర్‌ కమిటి సిఫార్సులపై విమర్శలు - టెండూల్కర్‌ కమిటి సిఫార్సులపై వివిధ ఆర్థిక, సామాజిక రంగాల నిపుణులు తీవ్రమైన అభ్యంతరాల్ని వ్యక్తం చేసారు.

1. మౌలిక పౌష్ఠికాహార వినియోగ ప్రమాణాలను నీరు కార్చటం- ఆదాయం పై కాకుండా పౌష్ఠికాహార వినియోగంపై ఆధారపడి పేదరిక రేఖ అంచనాలు వేయాలని 1957,1979 సం||లలో ప్లానింగ్‌ కమీషన్‌ నిపుణుల బృందం నిర్ధారించింది. భారత వైద్య పరిశోధన కౌన్సిల్‌ నిర్ధారణ మేరకు తీవ్రమైన పనుల్లో ఉన్న మగవారు 3800 కేలరీలు, ఆడవారు 2925 కేలరీల పౌష్ఠికాహారాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ప్లానింగ్‌ కమీషన్‌ నిపుణుల బృందం పట్టణ ప్రాంతాలలో 2100 కేలరీలు, గ్రామీణ ప్రాంతాలలో 2400 కేలరీల పౌష్ఠికాహార వినియోగాన్ని పేదరిక ప్రమాణ నిర్ధారణకు నిర్ణయించింది. కానీ టెండూల్కర్‌ కమిటి సిఫార్సులలో ఈ పౌష్ఠికాహార ప్రమాణాలను పట్టణ ప్రాంతాల్లో 1795 కేలరీలు, గ్రామీణ ప్రాంతాలలో 1820 కేలరీలుగా నిర్ణయించి అంచనాలు తయారు చేసింది. ఇందుకు ప్రపంచ ఆహార సంస్థ భారతదేశ పౌష్ఠికాహార వినియోగ ప్రమాణం 1800 కేలరీలు చాలునన్న సిఫార్సుల్ని సాకుగా చూపింది. ఈ ప్రమాణం అనేక అబివృద్ధి చెందిన దేశాల పౌష్ఠికాహార వినియోగ ప్రమాణాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. పౌష్ఠికాహార వినియోగ ప్రమాణాల్ని తగ్గించి తయారు చేసే పేదరిక నిర్ధారణ అంచనాలు తప్పని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. భారతదేశ పౌష్ఠికాహార ప్రమాణాలు ఈ దేశంలోనే నిర్ణయించబడాలని ప్రతిపాదిస్తున్నారు. పౌష్ఠికాహార ప్రమాణాలను తగ్గించాల్సిన పరిస్థితులు ఏమి లేవని అభిప్రాయపడుతున్నారు.

2. లోపభూయిష్టమైన ధరల సూచి- 1973 ధరల ఆధారంగా గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.49/- లు పట్టణ ప్రాంతాలలో నెలకు రూ. 57/-లు కంటే తక్కువ పౌష్ఠికాహార వినియోగం కలవారు పేదలుగా పరిగణించటం ఈనాటికీ ప్రమాణంగానే ఉంది. కానీ దీనిని వినియోగదారుల ధరల సూచి ఆధారంగా పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నారు. వాస్తవంగా వినియోగదారుల ధరల సూచి వాస్తవ జీవన వ్యయాన్ని సక్రమంగా ప్రతిబింబించలేదన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల లోపభూయిష్టమైన ధరల సూచి ఆధారంగా చేసే అంచనాలు వాస్తవాలను ప్రతిబింబించవు.

3. అమలులో ఉన్న పేదరిక రేఖ పౌష్ఠికాహార వాస్తవ అవసరాలతో పాటు జీవించటానికి కావలసిన నివాసం, గుడ్డ, ఆరోగ్య రక్షణ, పారిశుధ్యం, సాగునీరు, విద్య లాంటి మౌలిక అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నది.

4.జనాభా పెరగడం మూలకంగా తగ్గే పేదరిక శాతాన్ని, పేదరికం తగ్గినట్లుగా పరిగణించకూడదు.

5. పై వాదనల ఆధారంగా అంచనావేసే వాస్తవ పేదరికం అధికారికముగా ప్రకటించే పేదరికానికి రెండింతలు ఉంటుందని. నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముగింపు - ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులైన మాంటెక్‌ సింగ్‌ అహుల్వాలియా టెండూల్కర్‌ కమిటి సిఫార్సులను ఆమోదిస్తూ, పేదరిక ప్రమాణాల నిర్ధారణలో విద్య, వైద్యం లాంటి మౌళిక అవసరాల్ని పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. కానీ మౌలికంగా పేదరిక రేఖ నిర్ధారణలో జరుగుతున్న పొరపాటు అవగాహనలు, తప్పుడు వ్యాఖ్యలు సరికాకుండా వాస్తవ పేదరిక రేఖ నిర్ధారణ ఎండమావియే.

No comments: