Sunday, September 19, 2010

నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశం ఎవరి కోసం ?


నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశంపై రిజర్వుబ్యాంకు విడుదల చేసిన చర్చా పత్రంపై దేశ వ్యాపితంగా రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌.బి.ఐ ప్రతిపాదించిన అంశాలపై కార్పొరేట్‌ వర్గాలకు కొన్ని పరిమితులున్నా, అవి స్థూలంగా నూతన ప్రైయివేటు బ్యాంకుల ప్రవేశాన్ని ఆహ్వానిస్తున్నాయి. . ''రిజర్వుబ్యాంకు నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశంపై పెద్ద ఆసక్తిని కనపర్చటం లేదని, సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి అడుగులు వేస్తుందని'' కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ''వివాదాస్పదమైన వివిధ అంశాలపై వివిధ కోణాలలో చర్చను పురిగొల్పుతూ, దేశంలోని వివిధ వర్గాల ఆంక్షల మేరకే నూతన మార్గదర్శకాలను ప్రజాతంత్ర పద్ధతులలో రిజర్వుబ్యాంకు రూపకల్పన చేస్తుందనే భావన కలిగించే రీతిలో చర్చా పత్రం ఉందని'' మరికొందరు అభినందిస్తున్నారు.

రిజర్వుబ్యాంకు అంతరంగమేమిటి?

విస్తరణలో కీలకమైనవి నూతన బ్యాంకులా లేదా బ్యాంకు శాఖలా అన్న అంశం కూడా చర్చలో లేదు. అందువలన తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అణగారిన అట్టడుగు వర్గాల ప్రజలు, వెనుకబడిన ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవల్ని చేరవేయాలనే లక్ష్య సాధనలో నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశానికి మార్గదర్శక సూత్రాలు ఎలా ఉండాలి? అనే అంశంపై రిజర్వుబ్యాంకు చర్చా పత్రం విడుదలయ్యింది కాని, ద్రవ్య పునాది విస్తరణలో భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ అనుసరించాల్సిన మార్గాల గురించి కాదు. అందులోనూ నూతన ప్రయివేటు బ్యాంకుల పాత్ర ఎలా ఉండాలి అనే అంశం కంటే ప్రయివేటు బ్యాంకుల సాధారణ అంగ నిర్మాణంపై చర్చ మొత్తం కేంద్రీకరించబడింది. చర్చా పత్రం ఉద్దేశ్యం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించిన నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశం తప్ప ద్రవ్య పునాది విస్తరణ కాదన్న అంశం సుస్పష్టమైంది. ఆర్‌బిఐ, నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశంపై అన్యమనస్కంగా వ్యవహరిస్తూ ఆచితూచి అడుగులు వేస్తుందన్న ప్రచారంలో నిజం లేదు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రయివేటు, విదేశీ బ్యాంకుల పట్ల పెరిగిన వ్యతిరేక భావనల నేపథ్యంలో హడావుడి, అత్యుత్సాహం ప్రతికూల స్పందనలకు దారితీసే ప్రమాదం ఉన్నందున నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశాన్ని సుగమం చేయటానికి రిజర్వు బ్యాంకు జాగురూకతతో వ్యవహరిస్తున్నట్లుంది. ద్రవ్య పునాది విస్తరణే రిజర్వుబ్యాంకు ప్రధాన ధ్యేయమైతే, చర్చను నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశానికి పరిమితం చేయాల్సిన అవసరం లేదు.

పెద్ద బ్యాంకుల ప్రోత్సాహమే రిజర్వుబ్యాంకు ధ్యేయం

రఘురాం రంజన్‌ కమిటీ, ''చిన్న బ్యాంకులు సృజనాత్మకతను పెంచి, స్థానిక అవసరాలకు తగ్గట్లు నూతన ఉత్పత్తులను సృష్టించగలవని, అందువల్ల చిన్న బ్యాంకులను ప్రోత్సహించాలని'' సిఫార్సు చేసింది. ఏనుగుల్లాంటి బ్యాంకులు పీనుగులైన అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభ అనుభవాలు మన కళ్ళముందున్నాయి. బ్యాంకుల పరిరక్షణకు పటిష్టమైన ఆర్థిక, ద్రవ్య విధానాలు అవసరం కాని, బ్యాంకుల పరిమాణం కాదన్నది సుస్పష్టమైంది. అందువల్లే స్థూల దేశీయోత్పత్తిలో సాధారణ బ్యాంకు పరిమాణం నాలుగు శాతానికి, పెట్టుబడి బ్యాంకు పరిమాణం రెండు శాతానికి మించి ఉండటం శ్రేయస్కరం కాదన్న అంతర్జాతీయ పాఠాల్ని రిజర్వుబ్యాంకు పట్టించుకోవటం లేదు. ఆసియా ద్రవ్య సంక్షోభం ధాటికి తట్టుకొని నిలబడ్డ ఇండోనేషియాలోని బ్యాంకు నిప్స్‌(ఎన్‌ఐఎస్‌పి) లాంటి ఉదాహరణలు ఎన్ని ఉన్నా, ద్రవ్య పునాది విస్తరణ అవసరం లేని దేశాలలోని బ్యాంకుల అనుభవాలు, నిర్మాణాన్ని రిజర్వుబ్యాంకు ప్రస్తావిస్తున్నది. అందుకోసమే నూతన ప్రయివేటు బ్యాంకుల మూలధనం రూ|| 500 కోట్లకు మించి ఉండాలనే అభిప్రాయాన్ని ప్రోత్సహించే దిశలో చర్చా పత్రం ఉంది.

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు పెద్ద పీట

సమర్థవంతంగా నిర్వహింపబడుతూ, ఆర్థిక వనరులు కలిగిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు గ్రామీణ ప్రాంతాలలో సూక్ష్మ రుణ విస్తరణలో కీలక పాత్ర వహిస్తున్నాయని, వాటి నిరర్ధకాస్తుల శాతం పరిమితంగా ఉంటుందని చర్చా పత్రం ప్రస్తావించింది. దీనితో, వాటి నిర్వహణ వ్యయం అత్యధికమైనా, వాటిని ప్రజా డిపాజిట్లకు అనుమతిస్తే, తక్కువ నిర్వహణ వ్యయంతో ఆ సంస్థలు గ్రామీణ ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహించగలుగుతాయనే చర్చను అందిపుచ్చుకొని కార్పోరేట్‌ వర్గాలు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్ని వాణిజ్య బ్యాంకులుగా మార్చటం కాని లేదా వాటికి బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశం కల్పించటం కాని చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అత్యధిక వ్యయంతో గ్రామీణ పేదల మూలుగులు పీలుస్తున్న సూక్ష్మ రుణ సంస్థల వలయంలో చిక్కుకున్న గ్రామీణ పేద మహిళలు రుణ చెల్లింపుకోసం వ్యభిచారానికి దిగజారుతూ, కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న దీనగాథలు చర్చా పత్రంలో చోటు చేసుకోలేదు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు స్వీకరించే గ్రామీణ డిపాజిట్ల భద్రతకు రిజర్వుబ్యాంకు నియంత్రణ తప్ప మరో గ్యారెంటీ ఏమిటన్న అంశాన్ని చర్చా పత్రం స్పష్టపర్చలేదు.

బ్యాంకులు, పారిశ్రామిక సంస్థల మధ్య కుమ్మక్కు

1969 బ్యాంకుల జాతీయకరణకు ముందు పారిశ్రామిక సంస్థల ఆధ్వర్యంలోని ప్రయివేటు బ్యాంకులు ప్రజల డిపాజిట్లను వారి వారి అవసరాల కోసం దిగమింగి, సామాన్య ప్రజానీకానికి, వ్యవసాయానికి రుణాలను అందించక, డిపాజిట్‌దార్ల సొమ్ముకు భద్రత లేని తరుణంలో 1969 ఫిబ్రవరిలో బ్యాంకులపై సామాజిక నియంత్రణను అమలు చేసే చట్టాన్ని చేయాల్సి వచ్చింది. ఆ తరువాత కొద్ది నెలల్లో 14 ప్రయివేటు బ్యాంకుల్ని జాతీయం చేయటం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో పారిశ్రామిక సంస్థలకు బ్యాంకు లైసెన్సులను మంజూరు చేయటం అనర్థదాయకమన్నది జగమెరిగిన సత్యం. దీనిపై చర్చ చేయాల్సిన పని లేదు. కాని ఈ చర్చా పత్రంపై చర్చ సందర్భంగా కొన్ని వాదనలు ముందుకొస్తున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, టెలికం, విద్యుత్‌, రక్షణ మరియు మౌలిక రంగాలలో ప్రయివేటు పారిశ్రామిక సంస్థలను అనుమతిస్తున్న కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో అనుమతించటానికి అభ్యంతరాలెందుకని ఎస్‌.ఎస్‌.తారాపూర్‌ లాంటి ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.రక్తం మరిగిన పులి, పిల్లిలా పాలుమాత్రమే తాగుతుందనేది వారి వాదనల సారాంశం. కొన్ని నియంత్రణలు, పరిమితులతోనైనా పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల లైసెన్సులు ఇవ్వాలని మీడియా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సి.ఎన్‌.బి.సి టివి18కి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అధినేత దీపక్‌ పరేఖ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశాన్ని స్వాగతిస్తూనే ''ప్రయివేటు నిర్వాహకులు నియంత్రణ సంస్థల కంటే తెలివిగా ఉన్నారని, ఒక సంస్థలోని అవకతవకలు వెలుగు చూడటానికి దీర్ఘకాలం పడుతుందని, వాటిని తెలుసుకొని నియంత్రణ సంస్థలు అదుపు చేసే లోపు జరగాల్సింది జరిగిపోతుంద''న్నారు. నియంత్రణ సంస్థల పరిమితుల్ని ఆయన ఈ సందర్భంగా ఎత్తిచూపుతున్నారు. బ్యాంకు లైసెన్సు మంజూరుకు ముందు నష్టాల్లో ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థలకు అప్పచెప్పాలన్నది చర్చా పత్రంలోని మరో అంశం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో సగ భాగం కేంద్ర ప్రభుత్వం, పావు వంతు రాష్ట్ర ప్రభుత్వం, మిగిలినది దత్తత తీసుకున్న బ్యాంకు కలిగి ఉంటుంది. నష్టాలు వస్తున్న గ్రామీణ బ్యాంకుల్లో నష్టాలకు భౌగోళిక, ప్రభుత్వపరమైన విధానాల పాత్ర ఎక్కువ. ఈ వ్యవస్థలో పారిశ్రామిక సంస్థలు చేయగలిగేదేమి ఉండదు. వాటి మనుగడకు పరిష్కారాలు వేరు. పారిశ్రామిక సంస్థలను మళ్ళీ బ్యాంకింగ్‌ రంగంలో చొప్పించటంపై చర్చను రేపటమే చర్చా పత్రం ముఖ్యఉద్దేశ్యం.

విదేశీ పెట్టుబడుల కుదింపు

నూతన ప్రయివేటు బ్యాంకులలో 10 సం||ల పాటు విదేశీ పెట్టుబడుల్ని 50 శాతానికి కుదించటం మార్కెట్‌ వర్గాలకు విస్మయం కలిగిస్తుంది. బ్యాంకింగ్‌ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టటం ఫలితంగా నాణ్యమైన సత్వర సేవలు లభించటాన్ని విశేషంగా ప్రస్తావిస్తున్నారు. విదేశీ ప్రయివేటు బ్యాంకుల్లో ప్రవేశం ఉన్నత మధ్యతరగతి, సంపన్నులకే అన్న అంశం అందరూ అంగీకరించేదే. ఒక పక్క 74 శాతం మేరకు విదేశీ పెట్టుబడుల్ని బ్యాంకుల్లో అంగీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో, 50 శాతం పరిమితి సాధారణంగా అర్థం లేనిది. కాకుంటే 50 శాతానికి మించిన విదేశీ పెట్టుబడులున్న బ్యాంకులకు విదేశీ బ్యాంకులనే ముద్ర ఉంటుంది. స్వదేశీ బ్యాంకుగా చెలామణి కావటానికి 50 శాతం పరిమితి ఉపయోగపడుతుంది. చర్చా పత్రం ప్రకారం ఈ పరిమితి శాశ్వతం కాదు. ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో నెలకొన్న విదేశీ బ్యాంకులపై ఉండే వ్యతిరేక ప్రభావాల నుండి దృష్టి మళ్ళించటం కోసమే ఈ చర్యగా భావించాల్సి ఉంటుంది. పాలకవర్గాలు బ్యాంకింగ్‌ రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై దృష్టి మళ్ళించకుండా, విదేశీ బ్యాంకులపై ఆధారపడటం సముచితం కాదు.

జాతీయీకరణ, సరళీకరణ కాలాల్లో గ్రామీణ సేవల లభ్యతలో తేడాలు

భారతదేశంలో 1969లో మొదలైన వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ ప్రస్థానం 1991 వరకు కొనసాగింది. గ్రామీణ ప్రాంతాలకు నిజమైన బ్యాంకింగ్‌ సేవల విస్తరణ ఈ కాలంలోనే జరిగింది. ద్రవ్య పునాది విస్తరణకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండేటట్లయితే వారు తప్పకుండా అనుసరించాల్సిన అనుభవాలివి. చర్చా పత్రం ఈ అనుభవాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 1991 నుండి సరళీకరణ దుష్ప్రభావాలు బ్యాంకింగ్‌ రంగంపై తీవ్రంగా పడ్డాయి. 1969 నుండి 1991 మధ్య కాలంలో ప్రయివేటు బ్యాంకుల ఊసే లేకపోగా, 1993 నుండి నూతన ప్రయివేటు బ్యాంకులు ప్రవేశించాయి. గ్రామీణ డిపాజిట్లు 1972లో 6.5 శాతం వృద్ధి కాగా, 1989 నాటికి ఈ వృద్ధి 15 శాతానికి పెరిగింది. అదే కాలంలో మెట్రోపాలిటన్‌ నగరాలలో డిపాజిట్లు 46.2 శాతం నుండి 38.6 శాతానికి పడిపోయాయి. గ్రామీణ రుణం ఇదే కాలంలో 4.6 శాతం నుండి 16.3 శాతానికి పెరగగా, మెట్రోపాలిటన్‌ నగరాలలో రుణం 60.2 శాతం నుండి 43.5 శాతానికి తగ్గింది. 1969లో 8,127గా ఉన్న బ్యాంక్‌ శాఖలు 1990 నాటికి 59,752 అయ్యాయి. 1969లో మొత్తం బ్యాంకు శాఖల్లో గ్రామీణ శాఖలు 17.6 శాతం ఉండగా, 1990 నాటికి 58.2 శాతానికి వృద్ధి చెంది అత్యద్భుత ప్రగతిని సాధించాయి. ఈ ఫలితాలు జాతీయీకరణ పటిష్టంగా ఉన్న కాలానివి. 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక మార్చి 2009నాటికి మొత్తం బ్యాంకు డిపాజిట్లలో గ్రామీణ డిపాజిట్లు 9.3 శాతానికి పడిపోయాయి. ఇదే కాలంలో మెట్రోపాలిటన్‌ నగరాలలో డిపాజిట్ల వృద్ధి 56.2 శాతానికి పెరిగింది.1998 నాటికి గ్రామీణ రుణం మొత్తం రుణంలో 10.7 శాతానికి పడిపోయింది. నేటికీ 50,376 బ్యాంకు శాఖల్లో 31,684 శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

జాతీయ బ్యాంకు శాఖల మొత్తంలో 65.57 శాతం గ్రామీణ శాఖలుగా ఉండగా ప్రయివేటు విదేశీ బ్యాంకులలో ఇది కేవలం 29.71 శాతంగా ఉంది. మొత్తం గ్రామీణ బ్యాంకు శాఖలలో జాతీయబ్యాంకు శాఖలు 30,567గా ఉండి, 96.47 శాతంగా ఉంది. 1977లో ప్రతి 4 గ్రామీణ బ్యాంకు శాఖలకు ఒక మెట్రో, ఒక పట్టణ శాఖకు రిజర్వుబ్యాంకు అనుమతినిచ్చేది. దీనర్థం ప్రతి బ్యాంకు తాను ప్రారంభించే శాఖల్లో 66.6 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించాల్సి ఉంది. ప్రతి ప్రయివేటు బ్యాంకు తమ శాఖల్లో కనీసం 25 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించాలని ప్రభుత్వం షరతు పెట్టినా దాన్ని అనేక ప్రయివేటు బ్యాంకులు అమలు చేయటం లేదు. అలాగే ప్రాధాన్యతా రంగాల్లో రుణాలు అందించటంలోనూ ప్రయివేటు బ్యాంకులు నిర్లక్ష్యం చేస్తున్నాయి. వాటిపై రిజర్వు బ్యాంకు నియంత్రణ అంతంతమాత్రంగానే ఉంది. పైన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే ద్రవ్య పునాది విస్తరణకు నిజమైన పరి ష్కారం బ్యాంకుల జాతీయీకరణలోనే ఉందన్నది స్పష్టమౌతుంది.

No comments: