Friday, July 2, 2010

బేస్ రేట్ వడ్డీ విధానం - పరిచయం

భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసే వివిధ ఋణాలపై వసూలు చేసే వడ్డీ రేటు బి. పి. యల్‌. ఆర్‌. (బెంచ్‌ మార్క్‌డ్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు - నిర్దేశిత ప్రాధాన్యతా ఋణరేటు) ప్రాతిపదికగా ఉన్నది. ఈ బేస్‌ రేటు తొలుత ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్‌బిఐ ప్రకటించింది. కానీ శుక్రవారం (05.03.2010) సాయంత్రం విడుదలైన ఆర్‌బిఐ ప్రకటనలో బేస్‌రేట్‌ జూన్‌ ఒకటి నుంచి అమల్లోకి వుంటుందని సవరించింది. బేస్‌ రేటు విధాన అమలులో ఋణాలపై విధించే వడ్డీ రేటు పారదర్శకంగాను, శాస్త్రీయంగాను ఉండి, వివిధ ఋణ గ్రహీతలకు ప్రయోజన కరంగా ఉంటుందని రిజర్వ్‌ బ్యాంకు అభిప్రాయపడింది. అదే సందర్భంలో మన దేశంలో ఫైనాన్షియల్‌ రంగ సంస్కరణల సాఫల్యతకు వడ్డీ రేట్ల సరళీకరణ అనివార్యమని రఘురాజన్‌ కమిటి నివేదికతో పాటు బేస్‌ రేటు విధానంపై రిజర్వ్‌ బ్యాంకు నియమించిన దీపక్‌ మొహంతి నాయకత్వంలోని కార్యనిర్వాహక బృందం సిఫార్సు చేసింది.

వడ్డీ రేట్ల సరళీకరణ ప్రక్రియ -


దీపక్‌ మొహంతి కమిటి పరిశీలనలు- ముఖ్యాంశాలు

బేస్‌ రేటు విధాన రూపకల్పనపై జూన్‌ 2009లో రిజర్వ్‌ బ్యాంకు నియమించిన దీపక్‌ మొహంతి నాయకత్వంలోని కమిటి అక్టోబర్‌ 2009లో తన నివేదికను సమర్పించింది. దాని పరిశీలనలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

1. బి.పి.యల్‌.ఆర్‌ - అనుభవం -

1. గత సం|| మొదటి భాగంలో ఆర్ధిక మాంద్య ప్రభావం నుండి ఆర్ధిక వ్యవస్ధను బయట పడవేయటానికి రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టింది. కరెన్సీ చర్యలకు (మానిటరీ మెజర్స్‌) అనుగుణంగా స్పందించడంలో బి.పి.యల్‌.ఆర్‌ పద్దతి విఫలమైందని పై కమిటి అభిప్రాయ పడింది. లిక్విడిటి లభ్యతను పెంచినా, రెపో రివర్స్‌ రెపో రేట్లలో గణనీయమైన మార్పులు చేపట్టినా, వినియోగదారులకు భారీ ఋణ మంజూరులకు బ్యాంకులు సిద్ధం కాకుండా తక్కువ వడ్డీ రేట్లు కలిగిన రిజర్వ్‌ బ్యాంకు సెక్యూరిటీలలో పెట్టుబడికి సిద్ధమయ్యాయి. దానితోపాటు తమ వడ్డీ రేట్లను తగినంతగా మార్చలేదు. ఆ సందర్భంగా బి.పి.యల్‌.ఆర్‌ పద్ధతి వైఫల్యంతో పాటు, ఆర్ధిక వ్యవస్ధపై బ్యాంకులకు ఏర్పడ్డ అవిశ్వాసం కూడా కీలకమైనది. కమిటి ఈ అంశాన్ని తన నివేదికలో ప్రస్తావించలేదు. 2. బి.పి.యల్‌.ఆర్‌ పద్ధతిలో పారదర్శకత లేని కారణంగా, వినియోగదారుడికి ఋణ వడ్డీరేట్ల తీరులో అవగాహన లేకుండా పోయింది. 3. సబ్‌ పి.యల్‌.ఆర్‌ రేటుకు అంటే పి.యల్‌.ఆర్‌ కంటే తక్కువ వడ్డీ రేట్లకు కార్పొరేట్‌ రంగానికి ఋణాలుఇచ్చే వెసులుబాటు ఇవ్వడంతో, బ్యాంకులు రూ. 2 లక్షలలోపు చిన్న ఋణ గ్రహీతలు, వ్యవసాయ దారులను నిర్లక్ష్యం చేశాయి. బ్యాంకు ఋణాలలో 65-70 శాతం ఋణాలు సబ్‌ పి.యల్‌.ఆర్‌ క్రింద మంజూరు చేసినవి. దీనితో బి.పి.యల్‌.ఆర్‌ అస్ధిత్వానికి అర్ధం లేకుండా పోయింది.

2. బేస్‌ రేట్‌ లెక్కింపు విధానం -

1. బేస్‌ రేట్‌ లెక్కింపులో డిపాజిట్‌లపై వ్యయం, రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించే లిక్విడిటి రెపో రేట్ల నిర్వహణకు అయ్యే ఖర్చు, బ్యాంకు నిర్వహణకు అయ్యే ఖర్చు, బ్యాంకు లాభాల మార్జిన్‌ పరిగణలోనికి తీసుకొని బేస్‌ రేట్‌ లెక్కిస్తారు. ఈ బేస్‌ రేట్‌కు ఒక్కొక్క తరహా రంగానికి అయ్యే నిర్వహణ ఖర్చులు అదనంగా చేర్చి వడ్డీ రేట్లను విధిస్తారు. ఈ బేస్‌ రేట్‌ కంటే తక్కువ వడ్డీ రేటుతో సాధారణంగా ఋణాలు మంజూరు చేకూడదు. సం||లోపు కాల పరిమిత గల ఋణాలు బేస్‌ రేట్‌ పరిధిలో ఉండవు. విద్యాభ్యాస ఋణాలకు నియంత్రిత రేట్లు అమలవుతాయి. ఈ రేటు 5 ప్రభుత్వ రంగ బ్యాంకుల సగటు బేస్‌ రేటుకు 200 బేసిస్‌ పాయింట్‌లు కలిపి వడ్డీ రేటును నిర్ణయిస్తారు. 3. రూ. 2 లక్షలకు పైబడ్డ సబ్‌ పి.యల్‌.ఆర్‌. ఋణాలు, రూ. 2 లక్షలలోపు బి.పి.యల్‌.ఆర్‌ సీలింగ్‌ రేటుకు లోబడిన ఋణాలు బేస్‌ రేటు పద్దతిలోనే మంజూరు చేయాలి. దీని వల్ల ఇదివరకు నిర్లక్ష్యం చేయబడ్డ చిన్న ఋణ లబ్ది దారులకు, వ్యవసాయ దారులకు ఋణ లభ్యత అవకాశాలు మొరుగుపడతాయి. 4. ఫ్లోటింగ్‌ రేటు ఋణాలు కూడా బేస్‌ రేటు ప్రాతిపదికనే నిర్వహింపబడాలి. 5. బేస్‌ రేటు పారదర్శకంగా ఉన్న కారణంగా లబ్ధిదారులకు ప్రయోజనకరంగా ఉండే బ్యాంకు ఋణాలను ఎన్నుకొనే అవకాశం పెరుగుతుంది. 6.బేస్‌ రేటు పద్దతిలో వడ్డీ రేటు బి.పి.యల్‌.ఆర్‌ వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది. 7. సం||లో ప్రతి మూడు నెలలకు బ్యాంకులు బేస్‌ రేటు ప్రకటించాల్సి ఉంటుంది. 8. బేస్‌ రేటు విధానం నూతన ఋణాలకు మాత్రమే వర్తిస్తుంది. పాత ఋణాల రెన్యూవల్‌ సమయంలో వడ్డీ రేట్లపై వినియోగ దారులకు ఆఫ్షన్‌ ఉంటుంది.

ముగింపు - దీపక్‌ మొహంతి కమిటి సిఫార్సులను రిజర్వ్‌ బ్యాంకు అమోదించి అమలుకు పూనుకుంది. కార్పొరేట్‌ రంగానికి ఈ సిఫార్సులు ప్రయోజన కరంగా ఉంటాయి. దేశీయ పొదుపు పై వీటి దుష్ప్రభావం గణనీయంగా ఉండే అవకాశముంది. సామాన్య ప్రజానీకం ఈ సిఫార్సులతో ఏ మేరకు లబ్ది పొందగలరనేది వేచి చూడాలి. సామాన్య ప్రజల ప్రయోజనాలకంటే సమాజానికి హాని కల్గించే ఫైనాన్షియల్‌ రంగ సరళీకరణ ఈ సిఫార్సుల ప్రధాన లక్ష్యం.

No comments: