Thursday, August 26, 2010

ద్రవ్య పునాది విస్తరణ

(ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌)

bpl11వ పంచవర్ష ప్రణాళికలో 'సమ్మిళిత అభివృద్ధి'(ఇన్‌క్లూజివ్‌ డెవలప్‌మెంట్‌)ని లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు ముఖ్యమైన సాధనంగా ద్రవ్య, బ్యాంకింగ్‌ సేవల పునాది విస్తరణ ఉపయోగపడుతుందని భావించింది. ఈ అవగాహనను ముందుకు తీసుకెళ్ళడం కోసం 2006 సం|| బడ్జెట్‌ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి, ''ద్రవ్య పునాది విస్తరణ (పైనాన్షియల్‌ ఇక్లూజన్‌)''కు సంబంధించిన భావనను పరిచయం చేసి, ఈ దిశలో భారతదేశ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం రంగరాజన్‌ కమిటీని నియమించారు. ఆ కమిటీ 04.01.2008న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ''అసంఖ్యాకమైన భారత ప్రజానీకం ద్రవ్య సేవల ప్రయోజనాలను పొందలేక పోతున్నారని, ఆ లోపాన్ని పూడ్చకుండా ఆర్థిక వృద్ధి ఫలితాలు వారికందవ''ని చెబుతూనే, అందుకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. 2010 బడ్జెట్‌ ప్రసంగం వరకు చడీచప్పుడు చేయని కేంద్ర ప్రభుత్వం గత కొద్ది నెలలుగా ఈ భావనను, దాని ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఊదరగొడ్తోంది. ఈ భావనల ప్రచారానికి ప్రభుత్వ విధానాల ప్రకటనలు, ప్రజా ప్రాతినిధ్యం వహించే సంస్థలను వేదికలు చేసుకొని కాకుండా సి.ఐ.ఐ (ఛాంబర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ), జి-20 సమావేశాలలో, ప్రభుత్వ రంగ బ్యాంకు అధిపతులు, గ్రామీణ బ్యాంకు అధిపతుల సమావేశాలను ఎంచుకోవటం జరిగింది. ఈ నేపధ్యంలో ద్రవ్య పునాది విస్తరణ అంటే ఏమిటో, దాన్ని సాధించటానికి ఎంచుకున్న మార్గాలు, ప్రయత్నాలను పరిశీలిద్దాం.

ద్రవ్య పునాది విస్తరణ

వస్తూత్పత్తి రంగాన్ని నిజ ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తాం. నిజ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్య ఆర్థిక వ్యవస్థ గుండెకాయలాంటిది. నిజ ఆర్థిక వ్యవస్థకు కావలసిన ద్రవ్య వనరులన్నింటినీ ద్రవ్య ఆర్థిక వ్యవస్థ తగినంత సమకూర్చినప్పుడు ఆర్థిక వృద్ధి సజావుగా సాగుతుంది. ద్రవ్య వ్యవస్థలో ద్రవ్య (డబ్బు) లావాదేవీలన్నింటికీ బ్యాంకింగ్‌ వ్యవస్థ వాహకంగా ఉంటుంది. అందువల్ల నిజ ఆర్థిక వ్యవస్థకు, ద్రవ్య ఆర్థిక వ్యవస్థ దోస్తీగా ఉండటం ప్రజాజీవనానికి ఎల్లవేళలా శ్రేయస్కరమైనది. ప్రపంచీకరణ క్రమంలో ద్రవ్య ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యత పెరిగి, నిజ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం వహించడం మనం చూస్తున్నాం. ఈ విధానాలతో సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై, ఆర్థిక అసమానతలు పెరిగాయి. అనేక దేశాలలో ద్రవ్య సేవలు (ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) అసంఖ్యాకమైన అణగారిన ప్రజానీకానికి చేరలేక పోవడమే ఈ అసమానతల కారణంగా వాదనలు మొదలయ్యాయి. ద్రవ్య సేవలంటే, డిపాజిట్లు, రుణాలు, నగదుబదిలీలులాంటి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు, మైక్రోఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు మొదలైనవి. ఈ సేవల్ని అణగారిన, అల్పాదాయ వర్గాలకు అందించడమే ద్రవ్య పునాది విస్తరణగా నిర్వచిస్తున్నారు. ఈ ప్రజానీకం ద్రవ్య వ్యవస్థతో అనుసంధానమైతే, ఆ ద్రవ్య వ్యవస్థ అందించే ఫలితాలు పొందగలుగుతారన్నది వారి భావన.

బ్యాంకింగ్‌ పునాది విస్తరణ(ఇన్‌క్లూజివ్‌ బ్యాంకింగ్‌)

ద్రవ్య సేవలకు వాహకమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ, బ్యాంకింగ్‌ సేవలను, అది అందుబాటులో లేని ప్రాంతాలకు, ప్రజానీకానికి విస్తరింపజేయటమే ''బ్యాంకింగ్‌ పునాది విస్తరణ''గా చెప్పబడుతుంది.

అంతర్జాతీయ అనుభవం

అభివృద్ది చెందిన దేశాలైన డెన్మార్క్‌లో 99%, జర్మనీలో 91%, ఫ్రాన్స్‌లో 96% ప్రజలకు ద్రవ్య సేవలు అందుబాటులో ఉండగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 20% నుంచి 30% వరకు ప్రజానీకానికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ దేశాలలో అత్యధిక ప్రజలు గ్రామాలలో అల్పదాయ వర్గాలుగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళి, అక్కడి పట్టణ పేదరికాన్ని పెంచడం జరుగుతోంది.

భారతదేశంలో ద్రవ్య సేవల లభ్యత

మన దేశంలోని 6 లక్షల గ్రామాలలో 30 వేల గ్రామాలలో మాత్రమే వాణిజ్య బ్యాంకుల శాఖలున్నాయి. దేశ జనాభాలో 34% మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. అంతర్జాతీయంగా 100 దేశాలలో ''ద్రవ్య, బ్యాంకింగ్‌ సేవల లభ్యత సూచి''లో మన దేశం 50వ స్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో బ్యాంకింగ్‌ రంగ విస్తరణ మరింత తక్కువగా ఉంది. అదే సందర్భంలో భారతదేశంలోని జనాభాలో 10% జీవిత బీమాను, 0.6% సాధారణ బీమాను, 13% డెబిట్‌ కార్డులను, 2% క్రెడిట్‌ కార్డులను కలిగి ఉన్నారని ఒక సర్వేలో తేలింది. జాతీయ శాంపిల్‌ సర్వే ప్రకారం 8 కోట్ల 93 లక్షల వ్యవసాయ కుటుంబాలలో 51%మంది బ్యాంకులతో ఏ విధమైన లావాదేవీలు లేనివారుగా ఉన్నారు.

బ్యాంకింగ్‌ రంగ విస్తరణలో జాతీయ బ్యాంకుల పాత్ర

1969 వరకు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బ్యాంకింగ్‌ రంగం, జాతీయకరణతో డిపాజిట్ల సేకరణలోను, రుణాల పంపిణీలోను అసాధారణ పాత్రను నిర్వహించింది. 1951లో వాణిజ్య బ్యాంకులు, కో-ఆపరేటివ్‌ సొసైటీల ద్వారా 7.3% వనరులు పంపిణీ కాగా 1991 నాటికి అది 66.3% అయ్యింది. 1969 జూన్‌ నాటికి 8,262 గా ఉన్న బ్యాంకు శాఖలు మార్చి 2006 నాటికి 69,471 కి పెరిగాయి. జూన్‌ 1969లో 64 వేల మంది ప్రజలకు ఒక బ్యాంకు శాఖ ఉండగా, 2006 నాటికి 16 వేల మంది ప్రజలకు ఒక బ్యాంకు శాఖ ఉన్నది. బ్యాంకు శాఖలలో జూన్‌ 1969 నాటికి గ్రామీణ శాఖలు 22.2% గా ఉండగా, మార్చి 98 నాటికి అది 51% అయ్యింది. ప్రాంతీయ గ్రామీణబ్యాంకు శాఖలు మారుమూల గ్రామాలకు విస్తరించడం, పోలీస్‌ స్టేషన్లు పెట్టలేని చోట్ల కూడ గ్రామీణ బ్యాంకు శాఖలను ఏర్పాటు చేసి సేవలనందిస్తున్నాయి. కాని ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక జాతీయ బ్యాంకులు తీవ్రమైన ఒత్తిడి పరీక్షలు ఎదుర్కొంటున్నాయి. సేవాదృక్పథం స్థానంలో లాభాల ధ్యేయం చోటుచేసుకున్నాయి. కష్టమర్ల ఛార్జీలు భారీగా పెరిగాయి. సాంకేతికాభివృద్ధితో మెరుగైన సేవలను ప్రజానీకం ఆహ్వానిస్తున్నా, 2004-2009 కాలంలో జాతీయ బ్యాంకులలో ప్రభుత్వ మూల ధన వాటాలు తగ్గటం, ప్రయివేటు విదేశీ బ్యాంకుల ప్రవేశంతో శాఖల విస్తరణ మెట్రోనగరాలకు, పట్టణ ప్రాంతాలకు పరిమితమయ్యాయి. నష్టాలొస్తున్నాయన్న సాకుతో అనేక గ్రామాలలో బ్యాంకు శాఖలు మూసివేయబడటమో లేదా దగ్గరి పట్టణానికి తరలించడమో జరిగింది. గ్రామీణ బ్యాంకులు కూడా వాణిజ్య బ్యాంకుల పద్ధతిలో సేవలనందిచడం, బ్యాంకు సిబ్బంది కొరతతో వాటి లక్ష్యాలకు దూరమౌతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుండి భారత ఆర్థిక వ్యవస్థను రక్షించిన జాతీయ బ్యాంకింగ్‌ రంగాన్ని బ్యాంకింగ్‌ సంస్కరణలు దెబ్బతీస్తున్నాయి.

No comments: