Sunday, December 20, 2009

గరిష్ట వాయు విడుదలల సంవత్సరం

త 12రోజులుగా పర్యావరణ మార్పుపై డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హాగన్‌ నగరంలో జరుగుతున్న ప్రపంచదేశాల సమావేశంలో 193దేశాల ప్రతినిధులు, అధినేతలు హాజరైనారు. క్యోటో సదస్సులో గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల తగ్గింపుపై విధిగా కాలుష్యకారకులైన సంపన్నదేశాలు (ఎనేగ్జ్‌-1దేశాలు) అమలు చేయాల్సిన వాయు విడుదలల తగ్గింపు లక్ష్యాలను నిర్దేశించింది. అదే సమయంలో వర్ధమాన దేశాలను ఈ తగ్గింపు బాధ్యతనుండి మినహయించింది. ఈదేశాలు పర్యావరణ కాలూష్యానికి అనాదిగా కారణం కాదన్నది క్యోటో ఒప్పంద అవగాహన. దీనికి భిన్నంగా కోపెన్‌హెగెన్‌ సదస్సులో పరోక్షంగా చర్చించబడ్డ డెన్మార్క్‌ ముసాయిదా వర్ధమాన దేశాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఆ ముసాయిదాలో వర్దమాన దేశాలు కూడా ''గరిష్ట వాయు విడుదల సంవత్సరాన్ని'' పాటించాలనే అంశం వారి నిరసనలకు కారణమై, భారత్‌తో సహా నాన్‌ ఎనెక్స్‌-1 దేశాలు ఈ ముసాయిదాను ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ''గరిష్ట వాయు విడుదలల సంవత్సరం'' అంటే ఏమిటి..., ఇది వివిధ దేశాల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశాన్ని పరిశీలిద్దాం.


గరిష్ట వాయు విడుదలల సంవత్సరం

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధలో దశాబ్ధ కాలం వాయు విడుదల సగటును నిర్ధారణగా గరిష్ఠ వాయు విడుదల ప్రమాణాన్ని గుర్తిస్తారు. ఆలా గుర్తించిన గరిష్ఠ వాయు విడుదల సంవత్సరము నుండి ప్రతి సంవత్సరము ఒక నిర్దిష్ట ప్రమాణంలో వాయు విడుదలలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గ్రీన్‌హౌస్‌ వాయువులు గరిష్ట స్ధాయిలో ఉండే సంవత్సరాన్ని ''గరిష్ట వాయు విడుదలల సంవత్సరం'' లేదా ''పీక్‌ ఇయర్‌ ఆఫ్‌ ఎమిషన్స్‌'' అని అంటారు. అంటే ఆ వాయువులను విడుదల చేసే శిలాజ ఇంధనాల వినియోగాన్ని గరిష్టంగా ఆ నిర్దిష్ట సంవత్సరానికి పరిమితం చేసి, ఆ తర్వాతి కాలంలో వాటి వినియోగాన్ని క్రమపద్ధతిలో తగ్గించడమే గరిష్ట వాయు విడుదలల సంవత్సర సారాంశం.

వర్దమాన దేశాలపై ప్రభావం...

పైన చెప్పుకున్నట్లు నిర్దిష్ట సంవత్సరానికి గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలను తగ్గించడ మంటే శిలాజ ఇందన వినియోగాన్ని తగ్గించడమే గాకుండా వాయు విడుదల తగ్గింపును అంగీకరించడమే. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడమంటే శిలాజ ఇంధనాల ద్వారా జరిగే ఉత్పత్తిని తగ్గించడం గానూ, లేదా ప్రత్యామ్నాయ పునరుద్ధరణ ఇంధనవనరులతో పారిశ్రామికోత్పత్తిని మార్చుకోవడంగా చూడాలి. ఇది చాలా వ్యయపూరితమైనది డెన్మార్క్‌ ముసాయిదా ప్రకారం వర్దమాన దేశాలు గరిష్ట వాయు విడుదలల సంవత్సరాన్ని పాటించాలంటే ఆ దేశాల వాయు విడుదలలపై పరిమితులు పెట్టడమే. ఇది క్యోటో ఒప్పంద స్పూర్తికి భిన్నమైనది.

ఉదాహరణకు భారతదేశంలో 80 శాతం ప్లాంట్‌లోడ్‌ ఫ్యాక్టర్‌ కలిగిన బొగ్గు ఆధారతి విద్యుత్‌ కేంద్ర స్ధాపనలు ఒక మెగావాట్‌కు రూ. 5 కోట్లు సరిపోతే, అదే సౌరశక్తితో కేవలం 25 శాతం ప్లాంట్‌లోడ్‌ ఫ్యాక్టర్‌తో ఒక మెగావాట్‌ విద్యుత్‌ కేంద్రానికి 20-25 కోట్ల రూపాయలు వ్యయం అవుతోంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్ర సామర్థ్యానికి సమానమైన సౌరశక్తి విద్యుత్‌కేంద్ర స్థాపనకు బొగ్గు ఆధారితి కేంద్రం కంటే 12-15 రెట్టు అధికంగా పెట్టుబడి అవసరం అవుతోంది. అందుకనే వర్దమాన దేశాలు పర్యావరణ ముప్పు నుండి తట్టుకుని అభివృద్ధి చెందడానికి భారీస్థాయిలో పరిహారాన్ని, పరిజ్ఞానాన్ని సంపన్న దేశాల నుండి కోరుతున్నాయి. రియో సదస్సు సందర్భంగా క్యూబా మాజీ అధ్యక్షులు ఫైడల్‌ క్యాస్ట్రో ''ఈ పరిహారాన్ని సంపన్నదేశాలు, వర్దమానదేశాలకు చెల్లించాల్సిన బాకీ''గా అభివర్ణించారు.

కోపెన్‌హెగెన్‌ సదస్సులో ఆఫ్రికా దేశాల బృందం ఈ పరిహారం కింద షరతులు లేని 70 వేల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని కోరింది. అమెరికా ప్రతిపాదించిన 10 వేల కోట్లు, యూరోప్‌ ప్రతిపాదించిన వంద కోట్ల డాలర్ల లాంటి సంపన్నదేశాల సహాయం నామమాత్రమే. భారత్‌, చైనాలు 2005 స్థాయికి 2020లోగా వాయువిడుదలను తగ్గించాలనే ప్రతిపాదనలు ఐచ్ఛికంగా గరిష్టవాయు విడుదల సంవత్సరాన్ని అంగీకరించడమే.

సంపన్నదేశాలపై ప్రభావం...

గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలోని కార్బన్‌డయాక్పైడ్‌ 1750 సంవత్సరం నాటికి 280 పిపిఎంలు ఉండగా 2004 నాటికి 387 పిపిఎంలు ఉంది. గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో 75% ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌ ప్రధానంగా భూగోళ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణభూతమవుతోంది. క్యోటో ఒప్పందంలో 1990 నాటి ఉష్ణోగ్రత కన్నా 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రత పెరిగితే మానవాళికి ముప్పుగా భావించారు. ఇందుకోసమే భూగోళ ఉష్ణోగ్రతలు 1990 నాటి ఉష్ణోగ్రతలకు 2 డిగ్రీలు మించకుండా కార్బన్‌ వాయువిడుదల తగ్గించాలని ప్రతిపాదించారు. అందువల్లే క్యోటో ఒప్పందం కాలుష్య వాయు విడుదలలకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు 1990 వాయు విడుదలల స్థాయి నుండి 2012లోగా 5.2 శాతం తగ్గించాలని ఉద్దేశించింది.

అంటే క్యోటో ఒప్పందం ప్రకారం సంపన్నదేశాలు 1990ని గరిష్ట వాయువిడుదల సంవత్సరంగా భావించాయి. కాని కోపెన్‌హెగెన్‌ సదస్సు నాటికి 5.2% వాయు విడుదల తగ్గింపు లక్ష్యం నిర్లక్ష్యం చేయబడింది. వాయువిడుదలలు మరింతగా 10% పెరిగాయి. ప్రస్తుత సదస్సు సందర్భంగా అమెరికా 2005 స్థాయి నుండి 17% వాయు విడుదలలను 2020కు తగ్గిస్తానంది. అంటే క్యోటో ఒప్పందం నిర్దేశించిన గరిష్ట వాయు విడుదలల సంవత్సరాన్ని మార్చడానికి అమెరికా తెగించింది. అదే సందర్భంలో ఈ ప్రతిపాదనను 1990 స్థాయి వాయు విడుదలలలో 3% కంటే లేదు. మిగిలిన సంపన్న దేశాల తీరు కూడా అటుఇటుగా క్యోటో ఒప్పంద లక్ష్యాల్ని నీరు గార్చేటట్టుగా ఉంది. గరిష్ట వాయు విడుదలల సంవత్సరాన్ని క్యోటో ఒప్పందంలోని 1990 నుండి 2005కు మార్చటం సంపన్నదేశాలకు ప్రయోజనకరం.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పర్యవసానంగా 1990 నుండి 2005 మధ్యకాలంలో అనేక సంపన్నదేశాలు వారి పారిశ్రామిక స్థావరాలను తరలించిన కారణంగా చైనా, భారత్‌, బ్రెజిల్‌, సౌత్‌ ఆఫ్రికా వంటి దేశాల కార్బన్‌ వాయు విడుదలల స్థాయి, తీవ్రత పెరిగింది. ఎనెక్స్‌-1 దేశాల సరసన ఈ దేశాలను చేర్చి గ్రీన్‌హౌస్‌ వాయువిడుదల బాధ్యతను దింపుకోవడానికి అమెరికా సారథ్యంలోని అనేక సంపన్న దేశాలు నడుంకట్టాయి.

అందుకనే కోపెన్‌హెగెన్‌ సదస్సులో క్యోటో ఒప్పందాన్ని అటకెక్కించడానికి సంపన్నదేశాలు చేయని ప్రయత్నం లేదు. సంపన్నదేశాలన్నీ కలిసి ఇప్పటివరకూ ప్రతిపాదించిన వాయు విడుదలల తగ్గింపులు భూగోళ వాతావరణ ఉష్ణోగ్రతలను 3డిగ్రీల నుండి 4డిగ్రీల వరకూ పెంచుతాయనే నిపుణుల అంచనా పరిస్థితుల తీవ్రతను తెలుపుతోంది. వాతావరణంలో ఒక డిగ్రీ పెరుగుదల భారతదేశంలో కనీసం 10% గోధుమల ఉత్పత్తితో పాటు ఇతర ఆహార పంటల దిగుబడులను తగ్గిస్తాయని, ఆహార భద్రతకు తీవ్ర విఘాతం తెచ్చిపెడతాయని ప్రముఖ వ్యవయసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌ స్వామినాథన్‌ అభిప్రాయపడుతున్నారు.

ముగింపు:- విశ్వ మానవ సౌభాగ్యానికి దోహదపడాల్సిన అమెరికా రియో సదస్సునుండి ప్రపంచ మానవాళి విధ్వంసానికి కారణమవుతున్న పర్యావరణ మార్పుపై క్రమం తప్పకుండా అనుసరిస్తున్న వైఖరిని కోపెన్‌హెగన్‌లో కూడా ప్రదర్శిస్తుంది. క్యోటో ఒప్పందంలో అమెరికా వైఖరితో నిమిత్తం లేకుండా మిగిలిన సంపన్నదేశాలు ఒప్పంద పరిపూర్తికి సహకరించగా కోపెన్‌హెగెన్‌లో అవి అమెరికాతో అంటకాగడం చూస్తున్నాం. క్యోటో ఒప్పందం అంపశయ్య ఎక్కకుండా వర్ధమానదేశాలన్నీ ఐక్యంగా కదలాలి.

No comments: