భూ వాతావరణంలో మితిమీరిన గ్రీన్హౌస్ వాయువిడుదలలతో భూగోళం వేడెక్కి (గ్లోబల్వార్మింగ్) తీవ్ర పరిణామాలకు దారితీస్తు న్నాయి. ఈ సమయంలోనే డిసెంబర్ నెలలో డెన్మార్క్ దేశంలోని కొపెన్హగెన్ నగరంలో ''పర్యావరణ మార్పు''పై అంతర్జాతీయ సమావే శం జరుగనున్నది. పర్యావరణ పరిరక్షణపై 1997లో ఏర్పరచుకున్న ''క్యోటో ఒప్పంద'' కాలపరిమితి 2012తో ముగియనుండటంతో, దాని స్థానంలో వివిధ దేశాల మధ్య నూతన ఒప్పందం కుదరాల్సి ఉంది.
పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలు: అభివృద్ధికీ, పర్యావరణానికీ మధ్య ఉన్న సంబం ధం గురించిన అధ్యయనాలు 1960 దశకంలో ప్రారంభమైనాయి. 1964లో స్థాపించిన ''అంతర్జాతీయ జీవసంబంధ కార్యక్రమం (ఇంటర్నేషనల్ బైలాజికల్ ప్రోగ్రామ్) పర్యా వరణానికి, అభివృద్ధికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించింది. 1969లో పర్యావరణ సమస్యల శాస్త్రీయ కమిటీ (సైన్టిఫిక్ కమిటీ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్) ఏర్పాటు చేయబడింది. 1971లో 'మానవుడు మరియు జీవావరణ కార్యక్రమం' (మాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్) అన్న కార్యక్రమాన్ని 'యునెస్కో' చేపట్టింది. ఈ దశకంలోనే ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సమావేశంలో సమర్పించిన 'ధనిక దేశాల అభివృద్ధి నమూ నా'పై వర్ధమాన దేశాలు తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేశాయి. ఈ నమూనా వర్ధమాన దేశాల ప్రయోజనాలను రక్షించలేవన్న నిర్ధారణకు వచ్చాయి.
ఐక్యరాజ్యసమితి 1972లో స్టాక్ హోమ్లో నిర్వహించిన మానవ పర్యావరణ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ''మన్నికయ్యే అభివృద్ధి'' (సస్టెయినబుల్ డెవలప్మెంట్) ఎజెండాను రంగం మీదకు తెచ్చింది. పర్యా వరణ పరిరక్షణకు లోబడిన ఆర్థిక, సామాజిక అభివృద్ధే మన్నికయ్యే అభివృద్ధిగా నిర్వచించారు. ''మన్నికయ్యే అభివృద్ధి''పై చర్చల నడుమ ''గ్లోబల్ వార్మింగ్'' తొలి హెచ్చరికలు మొదలయ్యాయి. వాతావరణ మార్పు మానవ సమాజం మొత్తాన్ని సమిష్టిగా భయాందోళనలకు గురి చేస్తున్న సమస్యగా ఐక్యరాజ్య సమితి 1988లో తీర్మా నించింది. విస్తృత స్థాయిలో వివిధ దేశాలలోని శాస్త్రవేత్తలు, పర్యావరణ వాదులు, విధాన నిపుణులతో ''పర్యావరణ మార్పుపై అంతర్జా తీయ ప్యానల్ (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్)''ను నియమించి ''వాతావరణ మార్పు-ముప్పు''పై నివేదికను సమర్పించమంది.
ఆ ప్యానల్ సమర్పించిన మొదటి నివేదికే నవంబర్ 1990లో జెనివాలో జరిగిన మొదటి ప్రపంచ పర్యావరణ సమావేశ చర్చలకు ప్రాతి పదిక అయ్యింది. ఈ సమావేశమే 1992లో జరిగిన ధరిత్రి సదస్సులో ''వాతావరణ మార్పు పై అంతర్జాతీయ అవగాహనా ఒప్పందానికి (ఇంటర్నేషనల్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమెట్ ఛేంజ్)'' భూమికను ఏర్పాటు చేసింది.
ధరిత్రి సదస్సు: 'ఐక్యరాజ్యసమితి పర్యా వరణం, అభివృద్ధి' సమావేశం జూన్ 1992లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. వాతావరణ మార్పు దుష్ప్రభావాలపైన, పర్యా వరణ పరిరక్షణపైన ప్రపంచవ్యాప్త దృష్టిని మళ్ళించిన చారిత్రాత్మక సదస్సు ఇది. ప్రపంచ వ్యాప్తంగా 178 దేశాల నుండి వేలాది మంది అధినేతలు, ప్రభుత్వేతర సంస్థలు, సామాజిక కార్యకర్తలు, పత్రికా ప్రతినిధులు హాజరైన మొట్టమొదటి సదస్సు ఇది. పర్యావరణ పరిరక్షణ ప్రస్థానానికి పునాదిగా నిలిచిన ''ఇంటర్నేషనల్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమెట్ ఛేంజ్'' ఈ సదస్సులోనే రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్త పర్యావరణ పరిరక్షణ చర్యల్ని ఈ సంస్థే అజమా యిషీ చేస్తున్నది. ఈ సందర్భంగానే ''గ్లోబల్ ఫోరమ్'' పేరుమీద వందలాది ప్రభుత్వేతర సంస్థలతో సమాంతర అనధికార సమావేశం కూడా జరిగింది.
ధరిత్రి సదస్సు మూడు విశాల లక్ష్యాలపై కేంద్రీకరించింది. 1) పర్యావరణ అభివృద్ధి, పరిరక్షణ ధ్యేయంగా సూత్రీకరించబడ్డ అధికార పత్రాన్ని తయారు చేయటం. 2) మన్నికయ్యే అభివృద్ధి సాధనకు ప్రపంచవ్యాప్త కార్యాచరణను నిర్ధేశించి ఎజెండా-21ని రూపకల్పన చేయటం. 3) వర్ధమాన దేశాల్లో మన్నికయ్యే అభివృద్ధి సాధించటానికి అభివృద్ధి చెందిన దేశాల నుండి నిధులు, ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించటం. ఈ సదస్సులో అమెరికా తదితర సంపన్న దేశాలు, బహుళజాతి సంస్థలు శిలాజ ఇంధనాల లాబీయిస్టులు, చమురు, ఇంధన కంపెనీల ప్రతినిధులు అనేక అడ్డంకులు, చిక్కుల్ని సృష్టించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాల కర్తవ్యాన్ని నిర్ధేశించే 27 సూత్రాల ''రియో సదస్సు'' ప్రకటనను నీరుకార్చ డానికి అమెరికా శతవిధాలా ప్రయత్నించింది. పర్యావరణ పరిరక్షణకు సదస్సు ప్రతిపాదించిన ''ఎజెండా 21'' పేర కార్యాచరణపై దాదాపు ఏకాభిప్రాయం కుదిరింది.
పర్యవసానంగా మన్నికయ్యే అభివృద్ధి కమీషన్, పర్యావరణ మార్పు కమీషన్, జీవవైవిధ్య కమీషన్లాంటి అంతర్జా తీయ సంస్థలు ఆవిర్భవించాయి. భూగోళ కౌన్సిల్, మన్నికయ్యే అభివృద్ధికి సంబంధించిన వాణిజ్య కౌన్సిల్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అయితే వాణిజ్య కౌన్సిల్లో 48 బహుళజాతి కార్పొరేట్ కంపెనీల ముఖ్యనిర్వహణాధికారులు సభ్యులుగా ఉండటంతో ''ఐక్యరాజ్యసమితి పర్యావరణం, అభివృద్ధి సంస్థ''ను కార్పోరేట్ శక్తులు హస్తగతం చేసుకున్నట్లయింది.
ఆకట్టుకున్న క్యాస్ట్రో ప్రసంగం: ఈ నేపధ్యం లో క్యూబా అధ్యక్షులైన ఫైడల్ క్యాస్ట్రో సదస్సు నుద్ధేశించి చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంది. పర్యావరణ పరి రక్షణలో సంపన్న దేశాలు చేయాల్సిన ఆర్ధిక సహాయాన్ని వర్ధమాన దేశాలకు ''బాకీ పడిన అప్పు''గా అభివర్ణిస్తూ, ''ప్రపంచ జనాభాలో 1/5వ వంతు ఉన్న సంపన్న దేశాలు ప్రపంచ ఖనిజాల్లో 2/3వ వంతు, ఇంథనాల్లో 3/4వ వంతు అనుభవిస్తున్నారు. వాళ్ళు సముద్రాల్ని, నదుల్ని విషమయం చేస్తున్నారు. గాలిని కాలుష్యపరుస్తూ ఓజోన్ పొరను బలహీనపర్చి బొక్కలు పొడుస్తున్నారు. వాతావరణాన్ని కలుషిత వాయువులతో నింపి మానవాళిని వాటి దుష్ప్రభావల బారికి నెట్టివేశారు. వాళ్ళ స్వార్ధం, ఆధిపత్యం, బాధ్యతారాహిత్యం, వంచన, మొద్దుబారిన తనం ఇక చాలు. ఎప్పుడో మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని రేపటి నుండి చేయాలనుకోవటమే చాలా ఆలస్యంగా ప్రారం భించిన కార్యాచరణ'' అని వర్ధమాన దేశాలకు తక్షణ కర్తవ్య బోధన చేస్తూ సంపన్న దేశాలను తీవ్రంగా హెచ్చరించారు.
రియో సదస్సు, తదనంతర పరిణామాలు: గ్రీన్హౌస్ వాయువుల అపాయకర స్థాయి నుండి వాతావరణ వ్యవస్థను రక్షించటమే లక్ష్యమని రియో సదస్సు ప్రకటనలోని ఆర్టికల్-2 ఉద్బోదించింది. వాతావరణ కాలుష్య కారకులు సంపన్న, పారిశ్రామిక దేశాలైనందున, 2000 నాటికి ఆ దేశాల కాలుష్య వాయు విడుదలల్ని 1990 స్థాయికి తగ్గించాలని సదస్సు అభిప్రా యపడింది. అభివృద్ధి చెందిన దేశాలకూ, వర్థమాన దేశాలకూ ''ఉమ్మడిగానే అయిన విభిన్న బాధ్యతలు'' ఉన్నాయంటూనే అందులో అభివృద్ధి చెందిన దేశాల బాధ్యత ప్రధానమని, వర్థమాన దేశాలకు సంపన్న దేశాలు ఆర్ధిక పరిహారాన్ని ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేయాలని ఈ సదస్సు నిస్సంకోచంగా స్పష్టపరిచింది. అయితే కాలుష్య కారకులైన సంపన్న దేశాలు ఎంత మోతా దులలో తమ వాయు విడుదలలను తగ్గించు కోవాలి, అందుకు ఏ ఏ పద్ధతులు పాటించాలి అన్న ఆచరణాత్మక అంశాలపై సదస్సులో ఏకాభిప్రాయం కుదరలేదు.
అంతేకాకుండా ఎజెండా 21 అమలుకు కావలసిన నిధుల సేకరణలో సంపన్న దేశాలు సహకరించలేదు. దాంతో రియో సదస్సు పర్యావరణ పరిరక్షణలో విజయం పొందలేకపోయింది. మళ్ళీ 1995లో బెర్లిన్లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో గ్రీన్హౌస్ వాయువిడుదల అదుపుకు కట్టుబడి ఉండాలనే తీవ్ర ఆకాంక్షను ''బెర్లిన్ మాన్డేట్''గా వివిధ దేశాలు ప్రకటించాయి. బెర్లిన్ సమావేశంలో భారత్, చైనా, ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్లాంటి దేశాలు కలుషిత వాయు విడుదలల్ని 20శాతం తగ్గించుకో వటానికి అంగీకరించగా అమెరికా తీవ్రమైన సహాయ నిరాకరణ ధోరణిని ప్రదర్శించింది.ఈ కాలంలోనే ''గాట్''పై ఉరుగ్వే చర్చలు కొలిక్కి వచ్చాయి. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భవించింది.
క్యోటో ఒప్పందం: రియో సదస్సు అవగా హనలో ఉన్న లోపాలను సవరించి, పర్యావరణ చర్చలను అర్ధవంతంగా మార్చే లక్ష్యంతో తదుపరి చర్చలు జరిగాయి. బెర్లిన్ సమావేశం తరువాత 1997 డిసెంబర్లో జపాన్లోని క్యోటో నగరంలో జరిగిన 'అంతర్జాతీయ పర్యా వరణ, అభివృద్ధి సమావేశం' మరోసారి పర్యా వరణ పరిరక్షణపై కార్యాచరణకు పూనుకుంది. క్యోటో ఒప్పందం ప్రపంచ దేశాల్ని రెండు శ్రేణులుగా విభజించింది. నిర్ధిష్ట కోటా ప్రాతి పదికన గ్రీన్హౌస్ వాయు విడుదలను నియం త్రించాల్సిన దేశాలను ఎనెగ్జ్ 1 దేశాలుగాను, మిగిలిన దేశాలను ఇతర దేశాలుగాను పరిగణించింది. ఎనెగ్జ్1లో 37 సంపన్న దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు 2008 నుండి 2012 మధ్య 1990 నాటి ఆ దేశ గ్రీన్హౌస్ వాయు విడుదల స్థాయి నుండి 5% తగ్గించాలని సదస్సు నిర్ణయించింది. మిగిలిన దేశాలు కలుషిత వాయువిడుదలపై 2012 వరకు ఏ రకమైన ఆంక్షలు విధించరాదని నిర్ణయించింది.
అదే సందర్భంలో సంపన్న దేశాలు క్యోటో ఒప్పంద బాధ్యతలను నెరవేర్చటానికి రెండు విధాలైన అవకాశాలనిచ్చింది. మొదటిది కార్బన్డైఆక్సైడ్ను పీల్చుకోగలిగే అడవులను అభివృద్ధి చేయటం, అడవుల నరికివేతను నిరోధించటం. రెండవది - క్యోటో ఒప్పందం క్రింద ప్రత్యేకంగా రూపొం దించిన ''సరళ యంత్రాంగాన్ని'' (ఫ్లెక్స్బుల్ మెకానిజం) వినియోగించుకోవడం. ఈ సరళ యంత్రాంగంలో భాగంగా కార్బన్ వాణిజ్యం అనేది అభివృద్ధి చెందింది.
కార్బన్వాయు విడుదలను మారకం చేసుకునే యంత్రాంగానికి 'క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం' అని పేరుపెట్టారు. ఈ యంత్రాం గం నిర్వహణకు ఒక ఎగ్జిక్యూటీవ్ బోర్డు ఉంటుంది. దీని ప్రకారం కార్బన్ వాయువులను అదుపు చేసే సందర్భంలో ప్రతి మెట్రిక్టన్ను వాయువుకు ఒక యూనిట్ క్రెడిట్ ఇస్తారు. కార్బన్ వాయువులను అదుపు చేయగలమేరకు క్రెడిట్ యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ రకంగా ఆర్జించిన కార్బన్ క్రెడిట్లను క్యోటో ఒప్పంద పరిధిలోని అభివృద్ధి చెందిన దేశాలకుగానీ, ఆ దేశాల కంపెనీలకుగానీ వర్ధమాన దేశాలు లేదా ఆ దేశాల కంపెనీలు మార్కెట్ ధరకు అమ్ము కోవచ్చు. ఈ విధమైన క్రెడిట్ యూనిట్ల వాణిజ్యం కార్బన్ ట్రేడింగ్గా ప్రసిద్ధికెక్కింది. కార్బన్ వాణిజ్యంలో కార్బన్ క్రెడిట్లను అధికంగా కొనగలిగే సంపన్న వర్గాలకు భూ వాతావరణాన్ని కలుషితం చేయడానికి హక్కు సంక్రమిస్తున్నది. అంటే భూపైన గల వాతావరణం కూడా ప్రైవేటీకరించబడుతుంది.
2006లో 3000 కోట్ల డాలర్లున్న కార్బన్ వాణిజ్యం ప్రస్తుతం లక్ష కోట్ల డాలర్లకు మించి పోయింది. ఈ వాణిజ్యంలో స్పెక్యులేషన్ పెంచే ఫ్యూచర్లు, ఆప్షన్లులాంటి డెరివేటీవ్లు ప్రవేశిం చాయి. ఫైనాన్షియల్ రంగంలో డెరివేటీవ్లు సృష్టించిన విలయాన్ని భవిష్యత్లో కార్బన్ వాణిజ్యంలో సృష్టించబోతున్నాయని పర్యావరణ ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మొత్తం మీద చూసినప్పుడు నేడు ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావంతోనూ, నయా ఉదా రవాద విధానాలతోనూ సంపన్న దేశాల ప్రత్యక్ష పెట్టుబడులు, బహుళజాతి సంస్థలు వర్ధమాన దేశాల పారిశ్రామిక వ్యవస్థలలో ప్రవేశిస్తూ ఆయా దేశాల శిలాజ ఇంధన వినియోగాన్ని మరింత పెంచుతున్నాయి. దీనితో చైనా, భారత్, బ్రెజిల్లాంటి వర్ధమాన దేశాలలో గ్రీన్హౌస్ వాయు విడుదల కేంద్రీకరణ పెరుగుతోంది. దీని వల్ల వాయువిడుదలను తగ్గించాలనే లక్ష్యం నెరవేరటం లేదు. కార్బన్ క్రెడిట్ కొనుగోలుతో సంపన్న దేశాలలో తగ్గాల్సిన కార్బన్ వాయువుల పరిమాణం అక్కడ తగ్గకుండా వర్ధమాన దేశాల్లో తగ్గుతోంది. సంపన్న దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని పెంచకుండా తగ్గించినప్పుడు మాత్రమే వర్ధమాన దేశాలలోని కార్బన్ పరిమాణం తగ్గుదల వాతావరణంపై అనుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది. కానీ కార్బన్ ట్రేడింగ్ ప్రక్రియలో తక్కువ వ్యయంతో లభిస్తున్న కార్బన్ కొనుగోలుతో సంపన్న దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని మరింత పెంచుతూ వాతావ రణాన్ని కలుషితం చేస్తున్నాయి.
క్యోటో ఒప్పందానికి అడ్డంకులు: 184 దేశాల భాగస్వామ్యం కలిగిన క్యోటో ఒప్పందం 2005 నుండి అమలులోకి వచ్చింది. క్యోటో ఒప్పందపు భాగస్వామ్య దేశాల సమావేశాలు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) 1995 నుండి 2008 వరకు 14 సార్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతా ల్లో జరిగాయి. 2009 సమావేశం కొపెన్ హగెన్లో జరగనున్నది. రియో సదస్సుకు భిన్నంగా గ్రీన్హౌస్ వాయు విడుదలపై నిర్ధిష్ట నియంత్రణ ప్రక్రియను రూపొందించి సంపన్న దేశాలను అందుకు బాధ్యుల్నిగా చేయటంలో క్యోటో ఒప్పందం పురోగతిని సాధించింది. అదే సందర్భంలో సంపన్నేతర దేశాలను వాయు విడుదల పరిమితుల నుండి మినహాయించడం లో కూడా ఇది న్యాయంగానే వ్యవహరించింది. రియో ధరిత్రి సదస్సులో అనేక అడ్డంకులను సృష్టించిన అమెరికా క్యోటో సదస్సులోనూ అడ్డంగానే నిలిచింది.
1998నాటి సమావేశం లో అమెరికా అధ్యక్షుడైన బిల్క్లింటన్ క్యోటో ఒప్పందంపై సంతకం చేయటానికి సిద్ధమైనా, ఆ దేశ సెనెట్ అందుకు ఆమోదించలేదు. వర్ధమాన దేశాల వాయువిడుదలలపై ఆంక్ష లుండాలనే సాకుతో 2001లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జార్జ్బుష్ క్యోటో ఒప్పందం నుండి వైదొలుగుతూ పరిశీలకుడిగా ఉంటామని ప్రకటించాడు. వింతైన విషయ మేమంటే ఇప్పటికీ అమెరికాలోని శాస్త్రవేత్తల, ఆర్ధికవేత్తల లాబీ ఒకటి వాతావరణ మార్పు దుష్ప్రభావాలు సత్య దూరాలని వాదిస్తూనే ఉన్నది.
స్టెర్న్ రిపోర్టు: ప్రపంచబ్యాంకు మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్ధికవేత్త లార్డ్ నికోలస్ స్టెర్న్ బ్రిటీష్ ప్రభుత్వ ఆదేశాలపై క్యోటో ఒప్పందంపై అక్టోబర్ 2006లో నివేదికను సమర్పించాడు. ఆయన కార్బన్ ట్రేడింగ్తోపాటు కార్బన్ టాక్స్ విధింపును ప్రతిపాదించాడు. ప్రపంచ దేశాల స్థూల దేశీయోత్పత్తిలో 1% వెచ్చిస్తే వాతావరణ మార్పు దుష్ప్రభావాల నుండి ప్రపంచాన్ని రక్షించవచ్చన్నాడు.
మన్నికయ్యే అభివృద్ధి సాధ్యమేనా?: 2007 నాటికి ఎనెగ్జ్-1 దేశాలు వాయు విడుదలల్ని 1990 స్థాయిలో 5% తగ్గించాలనిక్యోటో ఒప్పందం నిర్దేశించింది. కాని ఈ దేశాలు విడుదలను తగ్గించకపోగా 1990 తో పోలిస్తే 10% పెంచాయి. అమెరికాల 17% పెంచింది. ఈ నేపధ్యంలో 2002లో జోహె న్స్బర్గ్లో 'మన్నికయ్యే అభివృది' (సస్టయినబుల్ డెవెలప్మెంట్)పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సదస్సు, ఎజెండా-21 అమలుకు అంతర్జాతీయ కమీషన్కు మార్గదర్శకాలను నిర్ధేశించింది. 2003లో ఈ కమీషన్ మార్గదర్శకాల అమలుకు ప్రతి దశకు 2 ఏళ్ల వ్యవధితో ఏడంచెల కార్యాచరణను రూపొందించింది. ఈ కార్యా చరణ 2004-05లో మొదలై 2016-17కు పూర్తి కావాలని నిర్ణయించింది. పేదరిక నిర్మూ లన, స్త్రీ పురుష సమానత్వం, విద్య వైద్య రంగా ల అభివృద్ధి, ప్రకృతి వనరుల సంరక్షణ కేంద్రం గా అమలు కావాల్సిన ఈ పథకాలు ఇంత వరకు సామాన్య ప్రజానీకానికి నిర్ధిష్టమైన ప్రయో జనాల్ని కల్గించలేదు.
2050 నాటికి కనీసం 40% మేరకు (1990 స్థాయి నుండి)విడుదలల్ని తగ్గించగలిగి నప్పుడే మానవ జాతి క్షేమంగా ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సంపన్న దేశాలు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. వ్యవసా యం, ఆహారం, ఇంధన సంక్షోభాలు దగ్గరలోనే పొంచి వున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆచరణలో సంపన్న దేశాలు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవటంతో క్యోటో ప్రొటోకల్ లక్ష్యాలు సాధింపబడలేదు. కొపెన్హగెన్ సదస్సు తేదీలు దగ్గర పడినకొద్దీ వివిధ దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చల తరహాలో గ్రూపులుగా ఏర్పడి తమతమ ప్రయోజనాల్ని ముందుకు తేవ టంతో సన్నాహక సమావేశాలలో ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈ పరిస్థితిని అదునుగా తీసు కొని అమెరికా, వివిధ వర్ధమాన దేశాలతో పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలకు సిద్ధమైంది. వాతావరణ మార్పు ముప్పు ప్రపంచ వ్యాప్తమైంది. విడివిడి ఒప్పందాల్తో ఉమ్మడి కృషిని భగం చేయటమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో ఇంత వరకు సాధిం చిన ప్రయోజనాలు నీరుకారతాయి. కొపెన్హగెన్ సదస్సు పర్యావరణ పరిరక్షణలో పాత సవాళ్ళనే ఎదుర్కోబోతున్నది
No comments:
Post a Comment