Wednesday, December 29, 2010

ద్రవ్య సరఫరా విధానం- ధ్యేయాలు , మార్గాలు

డబ్బు (కరెన్సీ) సరఫరాను, నిధుల లభ్యతను, దాన్ని ప్రభావితం చేసే వడ్డీ రేట్లను, మారకపు ద్రవ్య విలువలను ద్రవ్య సరఫరా విధానం ప్రభావితం చేస్తుందని, ఈ విధానం డబ్బు చలామణి, సరఫరాలను నియంత్రిస్తుందని చెప్పుకున్నాం. ద్రవ్య సరఫరా విధానంలో ప్రధానంగా మూడు ప్రాథమిక అంశాలున్నాయి. అవి 1. ద్రవ్య సరఫరా విధాన ధ్యేయాలు, 2) ద్రవ్య సరఫరా ప్రసార మార్గాలు, 3) నిర్వహణ పద్ధతులు - లక్ష్యాలు, సాధనాలు.

1) ద్రవ్య సరఫరా విధాన ధ్యేయాలు

ధరల స్థిరీకరణ, ఆర్థిక వృద్ధి సంప్రదాయ ధ్యేయాలుగా ప్రపంచంలోని వివిధ కేంద్ర బ్యాంకులు కలిగిఉన్నాయి. వీటి సాధనలో మారకపు రేటు స్థిరీకరణ, ద్రవ్య వ్యవస్థ స్థిరీకరణల పాత్ర ప్రముఖంగా ముందుకొస్తుంది. ఈ ధ్యేయాలన్నింటిని అన్ని కాలాలలో సాధించడం, నిర్వహించటం సాధ్యమయ్యే పని కాదు. ఈ ద్రవ్య సరఫరా విధాన ధ్యేయాలు దేనికవి స్వతంత్రంగా లేవు. ఒకదానితో మరొకటి పెనవేసుకొని ఉన్నాయి. ఉదాహరణకు అభివృద్ధి చెందే ఆర్ధిక వ్యవస్థలలో అతిస్వల్ప ద్రవ్యోల్బణం(తక్కువ ధరలు), అతి స్వల్ప నిరుద్యోగ రేటు(అత్యధిక ఉద్యోగాలు) ఉండాలని సాధారణంగా భావిస్తార. కానీ కొందరు నిపుణుల అభిప్రాయంలో అతి స్వల్ప ద్రవ్యోల్బణం, అతి స్వల్ప నిరుద్యోగ రేటు కలిసి సహజీవనం చేయలేవని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని కుదించే చర్యలలో భాగంగా వేతనాల తగ్గింపు, ఉపాధి కుదింపుతో నిరుద్యోగ రేటు పెరగటం అనివార్యమైందని వారి అభిప్రాయం. అదే సందర్భంలో ఉపాధి పెంపు మార్కెట్‌లో డబ్బు చలామణిని పెంచుతూ, సరుకుల ధరలను పెంచుతుందని, ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని వారు వాదిస్తున్నారు. అందువల్ల ద్రవ్య సరఫరా సుస్థిరతకు పాటించాల్సిన వివిధ చర్యలలో రాజీ అనివార్యమౌతుంది. దీన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థలో ద్రవ్య సరఫరా విధానం ప్రత్యేక లక్షణంగా చూడాల్సి ఉంటుంది. ద్రవ్య సరఫరా విధాన ధ్యేయాలన్నింటిని ఏక కాలంలో సాధించాలనే ప్రయత్నాలలో ఎదురౌవుతున్న అనేక అవరోధాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ''ధరల స్థిరీకరణ'' ధ్యేయంపై ఏకాభిప్రాయాన్ని కలిగివున్నాయి. ప్రపంచంలో ప్రధాన కేంద్ర బ్యాంకులైన యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇంగ్లాండ్‌, బ్యాంకు ఆఫ్‌ జపాన్‌లు ధరల స్థిరీకరణను ద్రవ్య సరఫరా విధానంలో ఏకైక ధ్యేయంగా పెట్టుకున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ బహుముఖ ధ్యేయాలను కలిగివుంది. అవి 1) ధరల స్థిరీకరణ 2) గరిష్ట ఉపాధి రేటు 3) దీర్ఘ కాలం కొనసాగగలిగే అతి స్వల్ప వడ్డీ రేట్ల నిర్వహణ. 1990సం|| తరువాత కాలంలో వివిధ దేశాలలో ఎదురైన వివిధ ద్రవ్య సంక్షోభాల అనుభవంతో ప్రపంచ దేశాలన్నింటిలోని కేంద్ర బ్యాంకులకు ''ద్రవ్య వ్యవస్థ సుస్థిరత''ను సాధించడం పెనుసవాలైంది.

2). ద్రవ్య సరఫరా ప్రసార మార్గాలు (మానిటరీ ట్రాన్స్‌మిషన్‌ ఛానల్స్‌) - ద్రవ్యోల్బణ అదుపు, ఆర్థిక వృద్ధిని సాధించేందుకు ద్రవ్య సరఫరా విధానంలో చేయాల్సిన మార్పుల మార్గాలను ద్రవ్య సరఫరా ప్రసార మార్గాలు అంటారు. అవి 1) పరిమాణ మార్గం (డబ్బు సరఫరా, రుణాలు) 2) వడ్డీరేట్ల మార్గం 3) మారకపు రేట్ల మార్గం. ఒక ఆర్థిక వ్యవస్థలో పై మార్గాలు ఏ పద్ధతిలో పనిచేస్తాయన్నది ఆ వ్యవస్థ అభివృద్ధి స్థాయిపై, ద్రవ్య వ్యవస్థ నిర్మాణ పటిమపై ఆధారపడి ఉంటుంది.

1) పరిమాణ మార్గం (క్వాంటం ఛానల్‌) - అధిక ధరలను అదుపు చేయాల్సి వచ్చినప్పుడు నిధుల లభ్యతను, బ్యాంకు రుణాలను తగ్గించాల్సి ఉంటుంది. ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు డబ్బుల లభ్యతను పెంచాల్సి ఉంటుంది. ఇందుకోసం నిధుల లభ్యతను, రుణాలను ముమ్మరం చేయాల్సి ఉంటుంది.

2) వడ్డీరేట్ల మార్గం (ఇంటరెస్ట్‌ రేట్‌ ఛానల్‌) - ద్రవ్యోల్భణ అదుపుకు వడ్డీ రేట్లు పెంచడం, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులలో వడ్డీ రేటు తగ్గించడం ఇందుకు ఉదాహరణ. బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రధాన వనరుగా ఉన్న ఆర్థిక వ్యవస్థలలో రుణ పాత్ర కీలకంగా ఉంటూనే, వడ్డీ రేట్ల మార్గం అందుకు తోడవుతుంది. ఇటీవల అమెరికాలో నెలకొన్న గృహరుణ బుడగలో వడ్డీరేట్ల మార్గం కీలక పాత్ర వహించింది. 9/11 తీవ్రవాదుల చర్యలకు కకావికలైన ఆర్థిక వ్యవస్థ రక్షించుకోవడం కోసం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపుకు పూనుకోవడం, గృహ రుణ విజృంభణకు బాటలు వేయడం, అంతిమంగా అమెరికా ద్రవ్య సంక్షోభానికి దారితీయటం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవడం సముచితంగా ఉంటుంది.

3) మారకపు రేట్ల మార్గం (ఎక్సేంజ్‌ రేట్‌ ఛానల్‌)

ప్రపంచీకరణ నేపథ్యంలో స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థలలో మారకపు రేట్ల మార్గం కీలకంగా మారింది. మహామాంద్యం నుండి బయట పడటానికి, విదేశాలకు ఎగుమతులు పెంచుకోవటానికి మారకపు రేటు ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం అమెరికా, వివిధ దేశాలతో నెరుపుతున్న కరెన్సీ యుద్ధంలో మారకపురేట్ల మార్గం పాత్ర కీలకమైంది.

పై మార్గాలన్నీ సర్వకాల సర్వావస్థలలో విశిష్టమైనవేవి కావు. అత్యుత్తమంగా భావిస్తున్న మార్గాలు అతి స్వల్ప కాలంలో అవరోధంగా మారవచ్చు. వాటి పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, సవరణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అందుకోసం కేంద్ర బ్యాంకుల త్రైమాసిక సమీక్షలు అధిక ప్రాధాన్యతను కల్గివున్నాయి. ద్రవ్య సరఫరా విధాన ధ్యేయాలనన్నింటిని కేంద్ర బ్యాంకులు నేరుగా ఏకబిగిని సాధించలేవు. అందుకోసం మధ్యకాల లక్ష్యాల్ని నిర్దేశించుకోవల్సివుంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ వై.వి.రెడ్డి వివరిస్తూ, ''చిన్న ఆర్థిక వ్యవస్థలలో స్వల్ప ద్రవ్యోల్బణ సాధన కంటే మారకపు రేటును మధ్య కాల లక్ష్యంగా ఎంచుకోవచ్చు. కానీ ఈ ప్రక్రియ స్వతంత్ర వడ్డీ రేట్ల విధానాన్ని హరిస్తుంది. ద్రవ్య సరఫరా విధానంలో స్థిర మారకపు రేటు, బహిరంగ పెట్టుబడి ఖాతా, స్వతంత్ర ద్రవ్య సరఫరా విధానం కలసి మనలేవు'' అని అన్నారు. ఆయన పరిశీలనలో ద్రవ్య సరఫరా విధానంలోని వైరుధ్యాలు తేటతెల్లమవుతున్నాయి.

ముగింపు

1990ల నుండి ద్రవ్య సరఫరా విధానంలో పారదర్శకతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. దీనిలో భాగంగా ప్రపంచ దేశాలలో స్వల్ప ద్రవ్యోల్భణ లక్ష్యాన్ని నిర్దేశించుకొనే ధోరణి కూడా పెరిగింది. ఇది మధ్య కాల లక్ష్యంగాను, అంతిమ లక్ష్యంగాను మారినప్పుడు, ద్రవ్యోల్బణ అంచనాల తయారి ప్రాముఖ్యతను పొందింది. ద్రవ్యోల్బణ అదుపు లక్ష్యాన్ని చేరాలంటే కేంద్ర బ్యాంకులకు నిర్వహణ స్వేచ్ఛను గాని, స్వతంత్ర ప్రతిపత్తిని గాని ఇవ్వాల్సి ఉంటుంది. దీనితోపాటు అస్థిర విదేశీ మారకపు రేట్ల పరిస్థితులను కల్పిస్తూ, అభివృద్ధి అయిన ద్రవ్య వ్యవస్థ మార్కెట్‌లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీని కొనసాగింపుగా ద్రవ్య విధాన(ఫిస్కల్‌ పాలసీ) ఆధిపత్యాన్ని తొలగింపు అనివార్యమౌతుంది. అంతిమంగా ఈ చర్యలన్నీ ఆర్థిక వ్యవస్థలపై అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Sunday, December 19, 2010

ద్రవ్య సరఫరా విధానం పరిచయం - చారిత్రక నేపధ్యం


సమకాలీనకాలంలో స్థూలఆర్థికవ్యవస్థ నిర్వహణకు ''ద్రవ్య సరఫరా విధానం''(మానిటరీ పాలసీ) ప్రధాన సాధనమైంది. ద్రవ్య (డబ్బు) ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో పాటుగా శతాబ్దాలుగా ద్రవ్య సరఫరా విధానం వివిధ దశలలో పరిణామం చెందింది. ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం పెరిగిన మేరకు ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్య సరఫరా విధాన పాత్ర కీలకమైంది. ఇదే సందర్భంలో ఈ మధ్య కాలంలో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదననంతరం అనేక దేశాలలో సంక్షోభ పరిష్కారానికి ద్రవ్య సరఫరా చర్యలు చేపట్టటం చూస్తున్నాం. ఉద్దీపన పథకాలు, నిధుల లభ్యత (లిక్విడిటి) చర్యలు అందులో భాగమే. రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించిన రూ. 48 వేల కోట్ల నిధుల లభ్యత విధానం తాజా ఉదాహరణ.

ద్రవ్య విధానం, ద్రవ్య సరఫరా విధానం

ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు ద్రవ్య విధానం (ఫిస్కల్‌ పాలసీ), ద్రవ్య సరఫరా విధానం (మోనెటరీ పాలసీ) విభిన్న కోణాలలో ప్రధాన భూమికలను నిర్వహిస్తున్నాయి. ద్రవ్య విధానం ప్రభుత్వ వ్యయ అంచనాలను, వసూలు చేయాల్సిన పన్నుల అంచనాలను నిర్ణయిస్తూ, ప్రభుత్వ రుణాల అంచనాలను ప్రభావితం చేస్తున్నది. ఇది అంతిమంగా డబ్బు గిరాకిని నియంత్రిస్తున్నది. ద్రవ్య సరఫరా విధానం డబ్బు (కరెన్సీ) సరఫరాను, నిధుల లభ్యతను, దాన్ని ప్రభావితం చేసే వడ్డీ రేట్లను, మారకపు ద్రవ్య విలువలను ప్రభావితం చేస్తున్నది. ఈ విధానం డబ్బు చలామణి, సరఫరాలను నియంత్రిస్తుంది. ద్రవ్య విధానం, ద్రవ్య సరఫరా విధానాలలో ఏది ముఖ్యమైనదన్న అంశంపై అనేక వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.

కరెన్సీ ఆవిర్భావం

మార్కెట్‌లతో పాటుగా డబ్బు (కరెన్సీ) ఆవిర్భవించింది. వాణిజ్య కార్యకలాపాలను వేగవంతం చేయడంలో డబ్బు పాత్ర కీలకమైనది. ఈ డబ్బు బంగారం, వెండి లాంటి అతి విలువైన లోహాల రూపంలో ఉండేది. వీటి చలామణి, ప్రాచుర్యం పెరగడంతో అధిక మొత్తాలలో నాణేలను ఉత్పత్తి చేయడం కోసం వీటిని కల్తీ చేసి (డిబేస్‌మెంట్‌), మిశ్రమ లోహాలతో నాణేలు తయారీ మొదలైంది. ఆ తరువాత నాణేల స్థానంలో ఆయా దేశాల బంగారం, వెండి నిల్వలతో సమానమైన అధికారిక కాగితపు డబ్బు (ఫియెట్‌ మనీ) అములులోనికి వచ్చింది. 17వ శతాబ్ద నుండి సామ్రాజ్యవాద దేశాలైన ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికా లాంటి దేశాలలో యుద్ధ అవసరాలకోసం బంగారం, వెండి నిల్వలతో నిమిత్తం లేని అధికారిక కాగితపు డబ్బు ముద్రణ అధికమైంది. ఈ విధానం ఆయా ప్రభుత్వాల ఆధీనంలో ఉండేది.

కేంద్ర బ్యాంకుల ఏర్పాటు

ద్రవ్య సరఫరా విధానం వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల అధీనంలో ఉంటుందని సాధారణంగా అనుకుంటుంటాం. కాని 20వ శతాబ్దం వరకు అనేక దేశాలలో ఈ బాధ్యతను అయా దేశాల కోశాగారాలు (ట్రెజరీలు) నిర్వహించేవి. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకులకు ఈ బాధ్యత అప్పచెప్పబడింది. మొదటి తరం కేంద్ర బ్యాంకులు స్వీడన్‌లో 1664, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ 1694, ఫ్రాన్స్‌లో 1800, నెదర్లాండ్స్‌లో 1818లలో ఆవిర్భవించాయి. మార్కెట్‌ల రుణాలు, ప్రభుత్వ రుణాల కొనుగోలు కోసం, వాణిజ్య అవసరాల మద్దతు కోసం కొద్ది మంది ప్రయివేటు పెట్టుబడిదారులతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఏర్పాటు చేయబడింది. తొలిరోజుల్లో ద్రవ్య వ్యవస్థ అభివృద్ధికి ఈ బ్యాంకు స్థాపన పునాదులు వేసింది. ఈ బ్యాంకు ఇతర వాణిజ్య బ్యాంకుల నుండి డిపాజిట్లను స్వీకరించటం, రుణాలనివ్వటం నిర్వహించింది. దాని దగ్గర అతి పెద్ద సంఖ్యలో పోగైన బంగారం నిల్వలతో పాటు బ్యాంకింగ్‌ రంగంలో అది పెంచుకున్న గుత్తాధిపత్యంతో అంతిమ రుణదాతగా (లెండర్‌ ఆఫ్‌ ల్యాస్ట్‌ రిసార్ట్‌) పరిణామం చెంది అనేక ఆర్థిక కల్లోలాలలో నిధుల లభ్యతను అందించింది. ప్రస్తుత కాలంలో అనుసరిస్తున్న ద్రవ్య సరఫరా విధాన సాధనమైన ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్‌లు (బహిరంగ మార్కెట్‌ కార్యకలాపాలు) - ఒ.యం.యు.ను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ అప్పట్లోనే చేపట్టింది. ప్రభుత్వ రుణ పత్రాలను, ఇతర ఆర్థిక సంస్థల రుణ పత్రాలను హామీగా ఉంచుకొని వాటికి రుణాలను అందించేది. దీనిపై వడ్డీని వసూలు చేసేది. ఈ వడ్డీ రేటును కొన్ని దేశాలలో డిస్కౌంట్‌ రేటుగా పిలుస్తున్నారు.

ఈ రకమైన వడ్డీ రేటును నియంత్రిస్తు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ బ్రిటీష్‌ రుణ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేయగలిగింది. అదే సందర్భంలో స్వల్ప కాలిక నిధులను ఆకర్షిస్తూ, అందించేందుకు ప్రతిపాదిస్తూ వివిధ దేశాల రుణ వ్యవస్థలను ఆ కాలంలో ప్రభావితం చేసింది. రెండవ తరం కేంద్ర బ్యాంకులుగా స్విట్జర్లాండ్‌లో 1907, అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ పేర 1913లలో ఏర్పడ్డాయి. అభివృద్ధి చెందిన దేశాల బాటలో బ్రిటీష్‌ వలస దేశాలలో, మధ్య ఐరోపా దేశాలలో, లాటిన్‌ అమెరికా దేశాలలో కేంద్ర బ్యాంకులు విస్తరించాయి.

ఆనాటి కేంద్ర బ్యాంకుల అనుభవాలు

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ లాంటి కేంద్ర బ్యాంకులు ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా వాణిజ్య దృక్పథంతో వ్యవహరించే క్రమంలో ప్రజల నుంచి పెరిగిన వత్తిడి మేరకు ప్రజా అవసరాల దృక్పథాల్ని పెంచుకోవాల్సి వచ్చింది. 19వ శతాబ్దం చివరి దశకం నుండి 20వ శతాబ్ద రెండవ దశకం వరకు కేంద్ర బ్యాంకులు బంగారం ప్రమాణాన్ని పాటించేవి. 18,19 శతాబ్ధాలలో బంగారం, వెండి నిల్వలతో నిమిత్తం లేని డబ్బు చెలామణితో పెరిగిన అత్యధిక స్థాయి ద్రవ్యోల్బణంతో ఈ చర్య అనివార్యమైంది. ఒక దేశంలోని డబ్బు చలామణి విలువ మొత్తం, ఆ దేశంలోని బంగారం నిల్వలతో సమానంగా ఉండటమే బంగారం ప్రమాణం అంటారు. ఇది వలసవాదం నాటి ''బంగారం ప్రమాణం'' గా పరిగణించాలి.

1913లో అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ ఏర్పడిన తరువాత వివిధ ఆర్ధిక ఒడుదుడుకులు సందర్భంగా ఆ బ్యాంకు చేపట్టిన ద్రవ్య సరఫరా చర్యలు వికటించి, అంతిమంగా మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడ్డ మహామాంద్యం కాలంలో అనేక బ్యాంకులు దివాళా తీసిన క్రమంలో, ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్య సరఫరా విధాన బాధ్యతను అమెరికా ట్రెజరీకి అప్పచెప్పింది. మళ్ళీ 1951 వరకు తిరిగి ఆ బాధ్యతను పొందలేకపోయింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్థాపన

బ్రిటీష్‌ వలస రాజ్యంగా ఉన్న భారతదేశంలో ద్రవ్య వ్యవస్థ సుస్థిరత కోసం, 1935లో భారత కేంద్ర బ్యాంకుగా ''రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా'' ప్రయివేట్‌ రంగంలో ఆవిర్భవించింది. అప్పటి వరకు ద్రవ్య సరఫరా విధాన అవసరాలలో కొన్నింటిని బ్రిటీష్‌ సామ్రాజ్యవాద నేతృత్వంలోని ఇంపీరియల్‌ బ్యాంక్‌ తీరుస్తుండేది. కరెన్సీ ముద్రణ బాధ్యతతో పాటు, బ్యాంకులకు బ్యాంకుగాను, ప్రభుత్వానికి బ్యాంకు గాను వ్యవహరించేటట్లు భారత రిజర్వ్‌ బ్యాంకును స్థాపించారు. దీనితో పాటు వ్యవసాయ పరపతి, సహకార రంగాల్ని అభివృద్ధి చేసే బాధ్యతను కూడా దీనికి అప్పచెప్పారు. వలస రాజ్యం అధీనంలో ఉండే రిజర్వ్‌ బ్యాంక్‌ ''నిర్వహణ స్వేచ్ఛ'' పై అనేక పరిమితులు ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోని అవసరాలను తీర్చడం కోసం బ్రిటీష్‌ వలస వాదులు భారత రిజర్వ్‌ బ్యాంకును వాడుకున్నారు. స్వతంత్ర భారతం ఆవిర్భవించిన తరువాత 1949లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జాతీయం చేయబడింది.

ముగింపు

తొలి శతాబ్ధాలలో ద్రవ్య సరఫరా విధాన ఛాయలు గోచరించినా, 19వ శతాబ్ధ తొలి దశలోనే ద్రవ్య సరఫరా విధాన పరిణామం మొదలైంది. 1914 ముందుకాలంలో ఈ విధానానికి సంబంధించిన సూత్రాలు, సాధనాలు ఆనాటి అవసరాల మేరకు అభివృద్ధి అయిన, 1914 తరువాత కాలంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో ''ద్రవ్య సరఫరా విధాన'' పాత్ర ప్రముఖంగా ముందుకొచ్చింది.

Sunday, November 21, 2010

బహుముఖ పేదరిక సూచి - పరిచయం


పేదరిక కొలమాన ప్రమాణాలు నిరంతరం మారుతూ వస్తున్నాయి. ఆదాయం, మౌలికావసరాలు, సాపేక్ష నిరాకరణ, సామర్థ్యాల ప్రాతిపదికన నిర్వచించబడ్డ వివిధ పేదరిక కొలమాన ప్రమాణాలను మనం ఈ శీర్షిక కింద గతంలో చర్చించుకున్నాం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యతను సంపాదించుకున్న 'మానవాభివృద్ధి పేదరిక సూచి' ఆధారంగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(యుఎన్‌డిపి) ప్రతి ఏటా ఒక నివేదికను ప్రచురిస్తోంది. ఈ 'సూచి'లో ఆరోగ్యం, విద్య, సముచిత జీవన ప్రమాణాల కొరత వంటి అంశాలు ప్రాతిపదికలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రచురించిన తాజా 'మానవాభివృద్ధి వార్షిక నివేదిక-2010'లో 'మానవాభివృద్ధి పేదరిక సూచి' స్థానంలో 'బహుముఖ పేదరిక సూచి' (మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌-ఎంపిఐ) చోటు చేసుకుంది. పేదరిక ప్రమాణాల నిర్దారణలో ఈ సూచి మరో ముందడుగుగా ఉన్నది.

బహుముఖ పేదరిక సూచి (మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌)

ఒకే సమయంలో వివిధ రకాల వనరుల కొరత, సౌకర్యాల నిరాకరణను ఎదుర్కొంటున్న పేదల సంఖ్య, వాటి తీవ్రత ప్రభావాన్ని కొలిచే నూతన ప్రమాణమే బహుముఖ పేదరిక సూచి. అమర్త్యసేన్‌ రూపొందించిన మానవాభివృద్ధి సూచి దీనికి పునాది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో 'ఆక్స్‌ఫర్డ్‌ పేదిరక మానవాభివృద్ధి చొరవ(ఒపిహెచ్‌ఐ)' విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సబీనా అల్కైర్‌, జార్జి వాషింగ్టన్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జేమ్స్‌ ఇ. ఫోస్టర్‌ ఈ సూచిని అభివృద్ధి చేశారు. 1999లో తన దేశంలో పేదరికాన్ని కొలిచేందుకు మెక్సికో ఈ సూచిని వాడింది. ఈ సూచి ప్రాతిపదికనే నేపాల్‌ స్వంతంగా 'స్థూల జాతీయ సంతోష సూచి'ని రూపొందించుకుంది. యుఎన్‌డిపి, ఒపిహెచ్‌ఐ కలిసి రూపొందించిన తాజా మానవాభివృద్ధి నివేదిక-2010 కూడా ఈ సూచి ఆధారంగానే తయారయింది

వివరణ

2009 వరకు మానవాభివృద్ధి నివేదికలు తయారు చేసేందుకు వాడిన సూచి వివిధ దేశాల్లో జీవన ప్రమాణాల కొరతను వివరిస్తుందేకానీ, ఈ కొరతలను ఎదుర్కొంటున్న వ్యక్తులు, కుటుంబాలు, ప్రాంతాలు, కొరతల సమిష్టి తీవ్ర ప్రభావాలను కొలవలేకపోయింది. పేదరిక నిర్మూలన కోసం, క్షేత్ర స్థాయిలో ఏ ప్రాతిపదికన చర్యలు చేపట్టవచ్చో నిర్దిష్టంగా గుర్తించేందుకు వీలులేకుండా పోయింది. ఈ లోటును 'బహుముఖ పేదరిక సూచి' తీరుస్తుంది. తీవ్ర పేదరికాన్ని, వివిధ బృందాలు, ప్రాంతాల వారీగా పేదరిక రేటును కనుక్కునేందుకు, జీవన ప్రమాణాల కొరత సమిష్టి ప్రభావాన్ని కొలిచేందుకు ఈ సూచి ఉపయోగపడుతుంది. ఈ సూచి నిర్మాణంలో విద్య, ఆరోగ్యం, జీవనప్రమాణాల ప్రాతిపదికగా పది అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. విద్యలో -పాఠశాలలో ఉన్న సంవత్సరాలు, బాల్య నమోదు, ఆరోగ్యంలో-బాల్య ఆయుకాలం, పౌష్టికాహారం, జీవన ప్రమాణాల్లో-విద్యుత్‌, త్రాగునీరు, పారిశుధ్యం, నివేశన స్థలం, వంట ఇంధనం, వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు ఉన్నాయి. ప్రతీ అంశానికి నిర్దిష్ట వెయిటేజీని కల్పిస్తారు. ఇలా వచ్చిన గణాంకాల ఆధారంగా కొరత / నిరాకరణల సగటు తీవ్రతను లెక్కిస్తారు. ఈ సగటు తీవ్రతను పేదల సంఖ్యతో (హెడ్‌కౌంట్‌) గుణిస్తే వచ్చేదే బహుముఖ పేదరిక సూచి. పై సూచిలో ఒక వ్యక్తి 30శాతం పైబడి పేదరిక తీవ్రతను కలిగి ఉంటే బహుముఖ పేదగా పరిగణిస్తారు. ఈ సూచిలో ఆదాయ సూచి చేర్చబడలేదు. ఆదాయ సూచి గణాంకాలలో విద్య, వైద్యానికి సంబంధించిన సమాచారం లేకపోవడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంటోంది. బహుముఖ పేదరిక సూచికి కావలసిన సమాచారాన్ని జనాభా ఆరోగ్య సర్వే, బహుళ సూచి క్లస్టర్‌ సర్వే, ప్రపంచ ఆరోగ్య సర్వేల ఫలితాల నుంచి తీసుకున్నారు..

ప్రభావాలు

బహుముఖ పేదరిక సూచి వెనుకబడిన, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఆదాయం ఆధారంగా కొలిచే పేదరికం కంటే బహుముఖ పేదరిక సూచిలో పేదల సంఖ్య సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాలను చేరటానికి కావలసిన పేదరిక తీవ్రత సమాచారాన్ని అందించటానికి ఈ సూచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సూచి ఆధారంగా మానవాభివృద్ధి నివేదిక పరిశీలించిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.

1. 104 దేశాల్లో పేదరిక నిర్దారణ గణించబడింది. ఈ దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 78%గా ఉంది. ఈ దేశాల మొత్తం జనాభాలో (520కోట్లు) 3వ వంతు అనగా 175కోట్లు బిలియన్ల ప్రజలు బహుముఖ పేదరికంలో ఉన్నట్లు తేలింది. ఆదాయం ఆధారిత పేదరిక నిర్ధారణలో ఈ దేశాలలోని పేదలు 144కోట్లుగా గుర్తించబడింది.

2. యూరప్‌, మధ్య ఆసియా దేశాలలో బహుముఖ పేదరిక రేటు 3% ఉండగా, సబ్‌ సహారా దేశాలలో 65%గా ఉంది.

3. దక్షిణాసియాలో బహుముఖ పేదరిక సంఖ్య, సబ్‌ సహారా దేశాల కంటే అధికంగా ఉంది. ప్రపంచ పేదలలో సగ భాగం దక్షిణాసియా దేశాలలోను (51%), నాల్గవ వంతు (28%) ఆఫ్రికా దేశాలలో ఉన్నారు.

4. బహుముఖ పేదరిక తీవ్రత రేటులో సబ్‌ సహారా దేశాల శాతం అత్యధికంగా ఉంది (నైగర్‌లో 93%).

5. భారత దేశంలో 8 రాష్ట్రాలలోని బహుముఖ పేదలు 421 మిలియన్లు ఉండగా, 26 అతిపేద ఆఫ్రికా దేశాలలో బహుముఖ పేదలు 411 మిలియన్లుగా ఉన్నారు.

6. బహుముఖ పేదరికం దక్షిణాసియా దేశాలలో అత్యధికంగా ఉండగా, తూర్పు ఆసియా దేశాలలో (చైనా, థారులాండ్‌) తక్కువగా ఉంది. భారతదేశంలో బహుముఖ పేదరిక రేటు 55%గా ఉంది. ఇది టెండూల్కర్‌ కమిటి అంచనాల కంటే ఎక్కువ. భారతదేశంలో అతితక్కువ బహుముఖ పేదలున్న రాష్ట్రం కేరళ.

7. భారతదేశంలో ఢిల్లీ బహుముఖ పేదరిక రేటు, ఇరాక్‌, వియత్నాంలకు (14%)చేరువలో ఉండగా బీహార్‌ రాష్ట్రం సియెర్రా, గినియా దేశాల (81%) స్థాయిలో ఉంది.

8. భారతదేశంలో గిరిజన ప్రజలలో 81%, షెడ్యూల్‌ కులాల ప్రజానీకంలో 66%, ఇతర వెనుకబడిన తరగతులలో 58% ఇతరులలో 33% బహుముఖ పేదరికంలో ఉన్నారు. బారక్‌ ఒబామా చేత అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడాలని ఉబలాటబడ్డ భారతదేశ పాలకులు పేదరికంలో ఏమని పిలిపించుకోవాలో తేల్చుకోవాలి.

ముగింపు

2010 మానవాభివృద్ధి నివేదిక బహుముఖ పేదరిక సూచితోపాటు అసమానతకు సర్దుబాటు చేయబడ్డ మానవాభివృద్ధి సూచిని, స్త్రీ,పురుష అసమానతకు నూతన కొలమానాన్ని ప్రవేశపెట్టింది. బహుముఖ పేదరిక సూచిపై విమర్శలు లేకపోలేదు. వివిధ అంశాలలో వాస్తవమైన సమాచార సేకరణలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. వీటిని సరిదిద్దుకొని బహముఖ పేదరిక సూచిని మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ పేదరికం లోతుల్ని, నిజస్వరూపాన్ని దర్శించటానికి, పేదరిక నిర్మూలన చర్యలను మరింత మెరుగుపరచుకోటానికి పాలకులకు, పౌరసమాజానికి ఈ సూచి మార్గదర్శకంగా నిలుస్తుంది.

2010 మానవాభివృద్ధి నివేదిక సారాంశంలో మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ అవసరాన్ని ప్రస్తావిస్తూ ''నిలకడైన ఆర్థిక పురోగమనానికి మార్కెట్ల అవసరం ఉండవచ్చేమోగాని, వాటంతటవి మానవాభివృద్ధిలోని వివిధ పార్వ్శాల అభివృద్ధిని సాధించలేవు. వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ఆకాంక్షించే అభివృద్ధి నమూనా అరుదుగానే మనగలుగుతుంది. మరోమాటలో చెప్పాలంటే మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ అవసరమేకాని, అదే (ఆర్థికాభివృద్ధికి) సరిపోదు''. ప్రపంచీకరణ విధానాలకు ఎదురొడ్డి పోరాడుతున్న ప్రగతిశీల శక్తులు ఇంత కాలం ఘోషిస్తున్న ''నిజం'' ఇది.

Sunday, November 14, 2010

ఆర్థిక మాంద్యం, కోలుకోవడం రూపాలు - పరిచయం

అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక సంక్షోభాలు తరచూ సంభవిస్తుండేవి. వాటి దుష్ప్రభావాలు ఆయా దేశాలకే పరిమితమౌతుండేవి. ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో ఆర్థిక సంక్షోభ భారాలు వివిధ దేశాలపై పడటం అనివార్యమైంది. వీటితో ఆయా దేశాలలోని స్థూల దేశీయోత్పత్తి, ఉపాధి కల్పన, ఉత్పాదన తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ మధ్య సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభ తదనంతర కాలంలో ఆర్థిక సంక్షోభాల గూర్చి అధ్యయనం, విశ్లేషణ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవల జరిగిన జి-20 శిఖరాగ్ర సమావేశాల్లో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మాంద్యం, కోలుకోవటాల స్థాయిలను చర్చించడం జరిగింది. సంక్షోభాల ప్రభావంగా స్టాక్‌ మార్కెట్లలో విజృంభణ, పతన ప్రక్రియలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలో మాంద్యం (రెసిషన్‌), కోలుకోవడం (రికవరీ)ల స్థాయిని వ్యక్త పరిచే పద్ధతులలో రేఖాచిత్ర వ్యక్తీకరణ ప్రముఖంగా ముందుకొచ్చింది. వీటి ఆధారంగా పరిష్కార మార్గాల అన్వేషణ కూడా జరుగుతుంది. రేఖా చిత్రాలుగా వ్యక్తికరింపబడుతున్న ఆర్థిక మాంద్య/కోలుకోవడంల స్థాయిలనుV, U,W,L రూపాలుగా వ్యక్తపరుస్తున్నారు. ఆయా స్థాయిలను ఆయా రూపాల పేర్లతో ఆర్థిక నిపుణులు పిలుస్తున్నారు. ప్రపంప ఆర్థిక సంక్షోభ తదనంతర కాలంలో వివిధ దేశాలలోని ఆర్థిక మాంద్యం/కోలుకోవడంల స్థాయిలను W- రూపం గల స్థాయిగా పిలుస్తున్నారు. ఇదే డబుల్‌ డిప్‌ రెసిషన్‌/రికవరీ లేదా తిరగబెట్టిన ఆర్థిక మాంద్యం/కోలుకోవడం నమూనాగా ప్రముఖంగా చర్చల్లో ఉంది.

ప్రాతిపదిక

ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక దశలోని ఉపాధి కల్పన రేటు, స్థూల దేశీయోత్పత్తి రేటు, ఉత్పాదక రేటుల నికర విలువను గణాంకంగా రేఖా చిత్రంలోని నిలువు అక్షం పైన, కాల వ్యవధిని గణాంకంగా తీసుకొని అడ్డంగా ఉండే అక్షం పైన తీసుకొని రేఖా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

V - రూపం గల మాంద్యం/కోలుకోవడం నమూనా


ఈ నమూనాలో మాంద్య దశ మొదలై ఆర్థిక వృద్ధి గణాంకం ఉన్నత స్థాయి నుండి దిగువ స్థాయికి పడిపోతుంది. అంటే ఉపాధి కల్పన, స్థూల దేశీయోత్పత్తి, ఉత్పాదన కలిసికట్టుగా పతనమైనట్లు భావించాలి. ఈ పతన దశ ఒక స్థాయికి చేరిన తరువాత అదే స్థాయిలో అదే వేగంతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మాంద్యంతో పతనమై, తిరిగి కోలుకొనే స్థితి రేఖా చిత్రం V రూపంలో ఉంటుంది. స్వల్పకాలంలో పతనమై ఆర్థికాభివృద్ధి స్వల్ప కాలంలో కోలుకొనే స్థితి ఇది. వస్తూత్పత్తి ప్రాధాన్యతగా కలిగిన పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఇది సర్వ సామాన్యంగా ఉంటుంది.

U-రూపంలోని ఆర్థిక మాంద్యం/కోలుకోవడం నమూనా

V-రూప నమూనాలో కంటే U-రూప నమూనాలో ఆర్థిక వృద్ధి స్వల్ప కాలంలో పతనమై, నామమాత్రపు ఆర్థిక వృద్ధితో మాంద్యం దీర్ఘ కాలం కొనసాగి ఆ తరువాత కోలుకుంటుంది. ఆర్థిక నిపుణులు ఖ-రూప స్థాయిని ''స్నానాల తొట్టి''తో పోల్చారు. దీనిలో దిగిన వ్యక్తిలా ఆర్థిక వ్యవస్థ కూడా ఈ నమూనాలో నుంచి అంత తొందరగా బయటపడలేదని వాళ్ళు అభిప్రాయ పడుతున్నారు.
1972-1977ల మధ్య కాలంలోని మొదటి చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ధరలు అమితంగా పెరిగాయి. కార్మికవర్గ ఉపాధిపై, వేతనాలపై తీవ్రమైన కోతలు విధించారు. దీని కారణంగా ప్రజల కొనుగోలు శక్తి భారీగా పడిపోయింది. సరుకుల కుప్పలు పేరుకుపోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. నిరుద్యోగం పెరిగి, ఉత్పాదకత తగ్గిన కారణంగా అనేక దేశాలలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితిని U-రూప నమూనాతో పోలుస్తున్నారు. ఈ కాలంలో అధిక ధరలు, మాంద్యం కలసి ఆర్థిక వ్యవస్థలను దీర్ఘ కాలంగా బాధించాయి. పాలక వర్గాలు ఈ సంక్షోభం నుండి బయటపడటానికి బలప్రయోగాన్ని ఉపయోగించారు. భారతదేశంలో ఈ కాలంలోనే అత్యవసర స్థితి విధించబడింది. మానవ హక్కుల్ని కాలరాశారు.

W-రూపం గల మాంద్యం/కోలుకోవడం నమూనా

దీన్నే డబుల్‌ డిప్‌ రెసిషన్‌/రికవరీ నమూనా లేదా తిరగబెట్టిన మాంద్యం/కోలుకోవడం నమూనాగా పిలుస్తారు. V-రూపం గల నమూనాలో స్వల్ప కాలంలో ఆర్థిక వృద్ధి పతనమై, అదే కాలంలో తిరిగి కోలుకొంటుంది. కానీ w-రూపం గల నమూనాలో స్వల్ప కాలంలో పతనమై తిరిగి కోలుకున్న ఆర్థిక వృద్ధి మళ్ళీ పతనమై తిరిగి కొంత కాలానికి కోలుకుంటుంది. అంటే ఈ స్థాయిలో ఆర్థిక వృద్ధి పతనం రెండు సార్లు వెంట వెంటనే జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకర స్థితి. ఈ స్థితిలో నిరుద్యోగ రేటు తీవ్రంగా పెరగటం, ఉత్పాదకత భారీగా తగ్గి పోవడం, స్థూల దేశీయోత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ మహా మాంద్య స్థితికి నెట్టబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆర్థిక వృద్ధికి పటిష్టమైన మౌళిక చర్యలు చేపట్టకుండా ఆర్థిక మాంద్యాన్ని కేవలం ఉద్దీపన పథకాలతో పరిష్కరించాలనుకుంటే ఏర్పడే స్థితి ఇది. ఉద్దీపనలతో మాంద్య తీవ్రత తాత్కాలికంగా తగ్గుతూనే ద్రవ్యోల్భణం పెరుగుతుంది. ద్రవ్యోల్భణాన్ని తగ్గించటానికి వడ్డీ రేట్లను పెంచడం, కార్మిక వర్గ వేతనాలు తగ్గించడం లాంటి చర్యలు కొనుగోలు శక్తిని తగ్గించి మార్కెట్లో సరుకుల గిరాకీని తగ్గిస్తాయి. ఇది మళ్ళీ సంక్షోభానికి దారితీస్తుంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభ తదనంతర కాలంలో అమెరికా, యూరప్‌ తదితర దేశాలు ఎదుర్కొంటున్న సంకట స్థితి ఇదే. భారత దేశంలో రిజర్వ్‌ బ్యాంకు సంక్షోభ నివారణ చర్యలతో ఈ స్థితి రావచ్చునని ఆందోళన పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో అమెరికాలో నిరుద్యోగ రేటు పెరగటం, వృద్ధి రేటు పెరగక పోవటం, అదే సందర్భంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ బ్రిటన్‌ మాంద్యానికి చేరువులో ఉన్నదని ప్రకటించడం లాంటివి w-రూప నమూనా లక్షణాలే.

L-రూపం గల మాంద్యం/కోలుకోవడం నమూనా

L-రూపం గల ఆర్థిక వ్యవస్థలోని వృద్ధి రేటు స్వల్ప కాలంలో పతనమై, మాంద్యం సుధీర్ఘ కాలం కొనసాగుతుంది. కోలుకొనే అవకాశాలు అంచనాలలో ఉండవు. ఈ కాలంలో ఆర్థిక వృద్ధి చాలా స్వల్పంగా ఉంటుంది. ఈ స్థితి ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదకర పరిస్థితిగా చెప్తున్నారు. ఈ స్థితిని మహా మాంద్యంగా కూడా వర్ణిస్తారు.

రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలం నుండి జపాన్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా బలపడింది. 1980ల చివరిలో జపాన్‌లో ఆస్థుల ధరల బుడగ పగలడంతో ప్రతి ద్రవ్యోల్భణంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అనేక సంవత్సరాలుగా పూర్వ స్థితికి చేరుకోలేక పోయింది. దీన్నే ''పోగొట్టుకున్న దశకం''గా కూడా ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. ఈ స్థాయిని ూ-రూపం గల మాంద్యం/కోలుకోవడం నమూనాగా పరిగణిస్తున్నారు. U-రూపంలో,W-రూపాలలోని ఆర్థిక వ్యవస్థలుL-రూపం గల నమూనాలుగా మారే అవకాశాలు ద్రవ్య పెట్టుబడి ప్రాధాన్యత గల పెట్టుబడి దారీ వ్యవస్థలో అత్యధికంగా ఉంటాయి
.

ముగింపు

ఆర్థిక సంక్షోభానికి ఆర్థికపరమైన పరిష్కారాలు కావాలనుకొనే ప్రపంచ అధినేతలు ఉద్దీపన పథకాలు, ద్రవ్య విధాన చర్యల (మానిటరీ మెజర్స్‌)తోనే పరిమితమౌతున్నారు. ఈ చర్యలు సంక్షోభ సమస్యల్ని పరిష్కరించకుండా, నూతన సంక్షోభాల్ని సృష్టిస్తున్నాయి. అందుకోసం ఆర్థిక సంక్షోభ శాశ్వత పరిష్కారానికి రాజకీయ పరిష్కారం అనివార్యమైంది. వస్తూత్పత్తి రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఉత్పాదనను పెంచే మార్గాలను అన్వేషించి అమలు చేయాలి. వినియోగంలోనికి రాని మానవ శ్రమ శక్తి, ఉత్పాదక శక్తి పూర్తి వినియోగానికి తగిన చర్యలు తీసుకోవాలి. ద్రవ్య పెట్టుబడి, ఆర్థికాభివృద్ధికి సహాయకారి కావాలి. కానీ అది ఆర్థిక వ్యవస్థను శాసించకూడదు. అప్పుడే సంక్షోభాల ప్రళయాల నుండి సామాన్య ప్రజానీకం, వివిధ దేశాలు కాపాడబడతాయి.


Friday, November 5, 2010

వాణిజ్య లోటు

ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కరెన్సీ యుద్ధంలో మునిగితేలుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా అమితంగా పెరిగిన విదేశీ మారకద్రవ్య ''కరెన్సీ ఖాతాలోటు'' ఈ యుద్ధానికి మూల కారణమైంది. కరెంటు ఖాతా లోటుకు వాణిజ్యలోటు కీలకమైంది. వాణిజ్య లోటు, వాణిజ్య మిగులు వాణిజ్య సమతుల్యతలో రెండు భాగాలు. ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో అత్యంత కీలకమైన విదేశీ మారకద్రవ్య నిల్వలలో వాణిజ్య సమతుల్యత వ్యూహాత్మక పాత్రను పోషిస్తున్నది.

వాణిజ్య సమతుల్యత అంటే

ఆర్థిక వ్యవస్థలోని ఎగుమతి, దిగుమతుల మధ్య ఉన్న సంబంధమే ''వాణిజ్య సమతుల్యత'' (బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌) అని అంటారు. ఒక దేశం నుండి ఎగుమతయ్యే వస్తువులు, సేవల విలువ కంటే దిగుమతుల విలువ తక్కువగా ఉన్నప్పుడు ''వాణిజ్య మిగులు''(ట్రేడ్‌ సర్‌ప్లస్‌) అంటారు. ఒక దేశం యొక్క దిగుమతుల విలువ కంటే ఎగుమతుల విలువ తక్కువగా ఉంటే ''వాణిజ్య లోటు'' (ట్రేడ్‌ డెఫిసిట్‌) అంటారు. సాధారణంగా ''వాణిజ్య మిగులు'' ఒక ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తిని పెంచడంతో పాటు, ఆ దేశంలో సంపదను ఉద్యోగ,ఉపాధి అవకాశాల్ని పెంచి దేశీయ పొదుపును, విదేశీ మారక ద్రవ్య నిల్వలను, ఆర్థిక సుస్థిరతను పెంచుతుంది. ''వాణిజ్య లోటు'' ఆర్థిక వ్యవస్థ స్థూలదేశీయోత్పత్తిని తగ్గించడంతోపాటు ఆ దేశ సంపదను, విదేశీ మారకద్రవ్య నిల్వలను కుదిస్తుంది. వాణిజ్య లోటు ప్రభావంగా దేశీయ పొదుపు తగ్గటమే కాకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లి, ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు దారితీసే అవకాశాలున్నాయి. తాత్కాలికంగా ఏర్పడే వాణిజ్య లోటు కంటే, సుదీర్ఘకాలం కొనసాగే వాణిజ్య లోటు ప్రమాదకరమైంది. వాణిజ్య లోటును తగ్గించటానికి వస్తూత్పత్తిని పెంచి, దేశీయ వినియోగాన్ని, ఎగుమతులను పెంచటం పరిష్కారంగా ఉండేది. సాంప్రదాయ ఆర్థికవేత్తలు 1970కి పూర్వం వాణిజ్య సమతుల్యతను గూర్చి స్థూలంగా వివరించిన అంశాలివి. ఆర్థిక వ్యవస్థలో వస్తూత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇచ్చిన కాలమది. ప్రపంచీకరణ నేపథ్యంలో వాణిజ్య లోటును పరిష్కరించే మార్గాలు మారాయి.

ప్రపంచీకరణ నేపథ్యంలో వాణిజ్య లోటు

ఆర్థిక వ్యవస్థకు వాణిజ్య లోటు ప్రమాదకారి కాదని, పైపెచ్చు అది దోహదకారి అనే వాదనలు 1970 తరువాత ముందుకొచ్చాయి. 90ల తరువాత ప్రపంచీకరణ విధానాల మూలంగా ప్రాధాన్యతను సంతరించుకున్న స్వేచ్ఛా వాణిజ్యం కారణంగా, వివిధ దేశాలలో దిగుమతులు పెరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతోను, సరుకులపై సంఖ్యాపర ఆంక్షలు (క్వాంటిటేటివ్‌ రిష్ట్రిక్షన్స్‌) ఎత్తివేయడంతోనూ ప్రతి ఆర్థిక వ్యవస్థలో అనివార్యమైన దిగుమతులు కుప్పలుగా పోగయ్యాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, వినియోగం పెరగడం, దేశీయ వస్తువులు కొరతగాను, ఖరీదుగాను ఉండటం మూలంగా వినియోగదారుడి ప్రయోజనాల రక్షణకు దిగుమతులు లాభకరమనే వాదనలు ఊపందుకున్నాయి. వీటి ద్వారా పెరిగిన వాణిజ్య లోటు ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్థ్యాలను వ్యక్తం చేస్తుందేకాని, ప్రమాదకారి కాదని మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ లాంటి ఆర్థికవేత్తలు సిద్ధాంతాలను లేవనెత్తారు.

అమెరికా వాణిజ్య లోటు - ప్రపంచ ద్రవ్య సంక్షోభం

1970కి ముందుకాలంలో అమెరికా స్థూల దేశీయోత్పత్తిలో 1% వాణిజ్య మిగులును కలిగివుండేవి. 1970ల తరువాత ఆ దేశం అనుసరించిన నయాఉదారవాద విధానాల నేపథ్యంలో అమెరికా దేశీయ వస్తూత్పత్తిని తగ్గించుకొని, విదేశీ దిగుమతులపై ఆధారపడటం మొదలెట్టింది. దీని ప్రభావంగా ప్రపంచంలో అత్యధిక వాణిజ్య లోటుగల దేశంగా అమెరికా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై డాలర్‌ ఆధిపత్యం పెరిగింది. ఆ మేరకు తన ఆర్థిక వ్యవస్థలో పెరిగిన వాణిజ్య లోటును, ఇతర దేశాలు డాలర్ల రూపంలో తమ దగ్గర పెట్టుకున్న పెట్టుబడులతో భర్తీ చేసుకోవడం మొదలెట్టింది. వాణిజ్య లోటు పెరిగిన మేరకు అమెరికాలో ఉపాధి అవకాశాలు తగ్గి నిరుద్యోగ రేటు పెరగడం మొదలైంది. దీనితోపాటు కరెంటు ఖాతా లోటు కూడా పెరిగింది. తదనంతరం ఆ వ్యవస్థలో కొనసాగుతున్న ఆర్థిక స్థంభన (స్టాగేషన్‌) 2007-08 సం||కి ఆర్థిక మాంద్యంగా మారి, అంతిమంగా ద్రవ్య సంక్షోభమై అమెరికాను, ప్రపంచదేశాల్ని ముంచెత్తింది. దీనితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తలకిందులై, అమెరికాకు రావలసిన పెట్టుబడులు సన్నగిల్లాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అమెరికా చేపట్టిన ఉద్దీపన చర్యలతో కరెంటు ఖాతా తీవ్ర లోటుకు గురై, కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీని నుండి బయటపడటానికి అమెరికా తన ఎగుమతుల్ని పెంచు కోవడం కోసం, ఇతర దేశాల కరెన్సీ విలువలను పెంచాలని డిమాం డ్‌ చేస్తుంది. ఇదే అమెరికా, తన ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగే కాలంలో ఇతర దేశాల నుండి దిగుమతులను చౌకగా పొందేందుకు గాను ఆయా దేశాల కరెన్సీ విలువల్ని తగ్గించడం కోసం అంతర్జా తీయ ద్రవ్య సంస్థల్ని వినియోగించుకోవడం మనకు తెలుసు. అమెరికా ప్రయోజనాలు ప్రపంచ ప్రయోజనాలుగా పరిగిణించిన చర్యలివి.

వాణిజ్య లోటు - భారతదేశం

భారతదేశంలో వాణిజ్యలోటు 2004-05 సం||లో 33.7 బిలియన్‌ డాలర్లు ఉండగా, అప్పటినుండి క్రమంగా పెరుగుతూ 2009-10 సం||నికి 117.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ వాణిజ్య లోటు మరింత పెరుగుతూ 2010-11 సం||నికి 135 బిలియన్‌ డాలర్లు అయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత సం|| మొదటి త్రైమాసికంలో 4.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్న కరెంటు ఖాతా లోటు, ప్రస్తుత సం|| మొదటి త్రైమాసికంలో 13.7 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థ తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ వాణిజ్య గణాంకాలు 2010లో, ప్రపంచంలోని అత్యధిక వ్యాపార (మెర్కండైజ్‌) వాణిజ్య లోటులో అమెరికా, బ్రిటన్‌ దేశాల తరువాత భారతదేశం 3వ స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. రూపాయి విలువ పెరగడంతో ఎగుమతులు తగ్గి, ఎగుమతిదారులు రూపాయి విలువను తగ్గించమని కోరుతున్నా, భారత ప్రభుత్వం అంగీకరించడంలేదు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ద్వారా చేకూరిన 15 బిలియన్‌ డాలర్ల ''నికర పెట్టుబడి ఖాతా మిగులు'' (నెట్‌ క్యాపిటల్‌ ఎకౌంట్‌ సర్‌ప్లస్‌)తో గట్టెక్కగలమన్న ధీమాతో ప్రభుత్వ వర్గాలున్నాయి. ఈ పెట్టుబడుల అస్థిరత ప్రపంచ ఆర్థిక సంక్షోభ కాలంలో మన అనుభవంలోకి వచ్చిందే. అనూహ్య పరిస్థితుల్లో ఈ పెట్టుబడులు వెనక్కు మళ్ళితే, మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముగింపు

ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పెరిగిన వివిధ దేశాల వాణిజ్య లోటులను ఎగుమతులతోనే పూడ్చుకోవాలనే నూతన దృక్పథం పెరగటానికి సంక్షోభమే కారణమైంది. వాణిజ్యలోటును ''హాట్‌ మనీ''తో సర్దుకోగలమనే విశ్వాసం ప్రపంచ దేశాల్లో సన్నగిల్లింది. ప్రముఖ ఆర్థిక నిపుణులు వారెన్‌ బఫెట్‌ వ్యాఖ్యానిస్తూ, వాణిజ్య లోటు అమెరికా అర్థిక వ్యవస్థకు ప్రమాదకరమన్నారు. చైనా గత ఆరు సంవత్సరాలుగా వాణిజ్య మిగులును సాధిస్తూ, క్రితం మార్చికి మొదటిసారిగా వాణిజ్య లోటును చవిచూసింది. అయినప్పటికి ఈ లోటు ప్రభావం తమ ఆర్థిక వ్యవస్థపై ఉండదని చైనా ప్రభుత్వం ప్రకటిస్తున్నది. దేశీయ వస్తూత్పత్తిని పెంచి, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకొని, స్వావలంబన చర్యలకు ఉపక్రమించినప్పుడే మనం కూడా ఈ తీవ్ర వాణిజ్య లోటు నుండి బయటపడగలం.

Sunday, October 31, 2010

మైక్రోఫైనాన్స్‌ సంస్థల పరిణామం - సవాళ్ళు


పేదరిక నిర్మూలనకు కీలక సాధనాలుగాను, పట్టణ, గ్రామీణ పేదలకు పట్టుకొమ్మలుగాను అంతర్జాతీయంగా కీర్తింపబడ్డ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు, ఇటివలి కాలంలో బీదల రక్తాన్ని పీలుస్తూ, వారి మాన ప్రాణాలను హరించే కిరాతకులుగా తెగనాడబడుతున్నాయి. మైక్రో రుణ సంస్థల రాక్షసత్వానికి ఆంధ్రప్రదేశ్‌లో 57 మందికి పైగా సమిధలు కాగా, అందులో 20 మంది మహిళలు కావటం ఆందోళకరమైన అంశం. ప్రచారానికందని మైక్రో ఫైనాన్స్‌ దురాగతాలు కోకొల్లలుగా ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్‌ సంస్థల పనితీరుపై, రుణ గ్రహీతలు గురైన దురాగతాలపై అనేక నిజ నిర్ధారణలు, ప్రముఖుల ప్రకటనలు, నిపుణుల విశ్లేషణలు వెలువడ్డాయి. మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు విధిస్తున్న వడ్డీ రేట్లను, బాకీలు వసూలు చేసుకోవడంలో వివిధ సంస్థలు అనుసరిస్తున్న అనాగరిక పద్ధతులను ఇవి తూర్పారాబట్టాయి. ఈ ఆగడాలపై రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబికిన ఆగ్రహం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థల్ని నియంత్రించేందుకు ప్రత్యేక ఆర్డివెన్స్‌ తెచ్చినా వాటిలోని పలు అంశాలు వివాదాస్పదమయ్యాయి. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఇప్పట్లో వీటిపై శిక్షలు పడే అవకాశం కూడా లేదు. మైక్రోఫైనాన్స్‌పై పాలకవర్గాలు వేస్తున్న పిల్లిమొగ్గలను అర్థం చేసుకోవాలంటే మైక్రోఫైనాన్స్‌ పుట్టుక, ఫైనాన్స్‌ పెట్టుబడి ప్రపంచీకరణ ప్రభావాలను మనం పరిశీలించాల్సి ఉంటుంది.
మైక్రో ఫైనాన్స్‌ పుట్టు పూర్వోత్తరాలు

17వ శతాబ్దం మధ్య కాలంలో విశాండర్‌ స్పూనర్‌ అనే సిద్ధాంత వేత్త చిన్న రైతులు, చిన్న వ్యాపారులకు తక్కువపాటి రుణాలనందిచడం ద్వారా వారి పేదరికాన్ని తగ్గించవచ్చనే భావనతో పరిశోధన చేసాడు. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో యూరప్‌ దేశాల పునరుద్ధరణకు వెలువడిన ''మార్షల్‌ ప్లాన్‌''తో ఈ భావన ప్రాధాన్యతను సంతరించుకొంది వివిధ దేశాలలో పొదుపును ప్రోత్సహిస్తూ స్థానిక పొదుపు సంఘాలు, రుణ సంఘాలు, సహకార సంఘాలు, చిట్‌ ఫండ్‌ సంఘాలు రూపుదాల్చాయి. 1960లలో వీటి సంఖ్య విపరీతంగా పెరిగింది. 1970లలో పాకిస్థాన్‌ ఆర్థికవేత్త అఖ్త్‌ర్‌ హమీద్‌ ఖాన్‌, బంగ్లాదేశ్‌ ఆర్థిక వేత్త మహమ్మద్‌ యూనస్‌లు చిన్న మొత్తాల పొదుపు, రుణాల అనుభవాల్ని ముందుకు తీసుకెళ్ళి ''సూక్ష్మ రుణ విధానాన్ని'' (మైక్రో క్రెడిట్‌) ఒక భావనగా అభివృద్ధి చేశారు. అప్పటికే కొన్ని దేశాలలో ప్రపంచీకరణ విధానాలు మొదలయ్యాయి. వాణిజ్య బ్యాంకుల రుణ వితరణలో పేదల్ని ఇముడ్చుకోలేని దశలో ''సూక్ష్మ రుణ భావన'' ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ భావనకు ఆచరణరూపమిస్తూ 1976లో మహమ్మద్‌ యూనస్‌ బంగ్లాదేశ్‌లోని జోబ్రా గ్రామంలో గ్రామీణ్‌ బ్యాంకు ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. 1983 నాటికి బంగ్లాదేశ్‌లో ప్రత్యేక చట్టం ద్వారా అది గ్రామీణ్‌ బ్యాంకు హౌదాను పొంది, సూక్ష్మ రుణ సంస్థలలో అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. 2006లో మహమ్మద్‌ యూనస్‌కు, ఆయన స్థాపించిన గ్రామీణ్‌ బ్యాంకుకు సంయుక్తంగా నోబెల్‌ బహుమతి లభించి, సూక్ష్మరుణ విధానం అంతర్జాతీయ గౌరవాన్ని పొందింది.

సూక్ష్మ రుణ భావన

ఈ భావన స్వేచ్ఛా మార్కెట్‌ సూత్రాల పునాదులపై నిర్మింపబడింది. పెట్టుబడిదారి విధానంలో కేవలం లాభాపేక్షతో నిర్వహించే వ్యాపారాలతో పాటు, సామాజిక దృక్పథం కలిగిన (లాభాలతో నిమిత్తం లేకుండా) సామాజిక వ్యాపారాల్ని నిర్వహించవచ్చుననేది మహమ్మద్‌ యూనస్‌ ప్రగాఢ విశ్వాసం. మరో ప్రత్యామ్నాయంతో పనిలేకుండా పేదలకు బహుముఖ ప్రయోజనాల్ని సమకూర్చగలిగే సామర్ధ్యం, ప్రపంచీకరణకు, స్వేచ్ఛా మార్కెట్‌ విధానాలకు ఉందని ఆయన గట్టిగా వాదిస్తారు. సక్రమమైన బాహ్య వాతావరణాన్ని సృష్టించగలిగితే, వారంతట వారే అభివృద్ధి కాగల అంతర్గత సామర్థ్యం పేదలు కలిగియున్నారని ఆయన అభిప్రాయ పడతారు. ఈ కార్యసాధనలో మహిళలు కీలక పాత్ర వహించాల్సి వుంటుందని, గ్రామీణ్‌ బ్యాంకుకు గుత్తాధిపత్యం ఉండకూడదని, పోటి ఉండాలని, అప్పుడే వినియోగదారులకు ప్రయోజనం సమకూరుతుందని ఆయన సూత్రికరిస్తారు.

అంతర్జాతీయ సంస్థల విధానంగా మైక్రో ఫైనాన్స్‌

ప్రపంచీకరణ విధానాల నేపధ్యంలో వివిధ దేశాలలో సామాజిక వ్యయం తగ్గటం మూలంగా, అట్టడుగు వర్గాల ప్రజల జీవన స్థితిగతులు అగమ్యంగా తయారయ్యాయి. ప్రభుత్వ బాధ్యత, సబ్సిడీలతో నిమిత్తం లేకుండా పేదల అభివృద్ధిని పేదలే చూసుకోవాల్సిన ''సూక్ష్మ రుణ పద్ధతి'' పాలక వర్గాలకు, అంతర్జాతీయ సంస్థలకు ఆకర్షణీయంగా ఉంది. ఈ నేపథ్యంలో 1995లో బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళల సాధికారిక సదస్సులో అప్పటి ఐక్యరాజ్య సమితి అధ్యక్షులు కోఫి అన్నన్‌, ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షులు జేమ్స్‌ ఉల్ఫ్‌న్సన్‌, మహిళలలో ఆర్థిక సాధికారికతను పెంచే సూక్ష్మ రుణ విధాన భావనను పరిచయం చేశారు. ఆ తరువాత 1997లో పేదరిక నిర్మూలన సాధనంగా సూక్ష్మ రుణ భావనను ఆచరణలో అమలు చేయడం కోసం అమెరికాలో ప్రపంచ శిఖరాగ్ర సదస్సు నిర్వహింపబడింది. ఈ సదస్సులో 2005సం|| నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల పేదలకు సూక్ష్మ రుణ విధానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి 2005 సంవత్సరాన్ని ''అంతర్జాతీయ సూక్ష్మ రుణ సంవత్సరం''గా ప్రకటించింది. ఈ ప్రకటనతో సూక్ష్మ రుణ భావనకు ప్రపంచ వ్యాప్తంగా నైతికత పెరిగింది. ప్రపంచ బ్యాంక్‌ ప్రపంచ వ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్‌ అభివృద్ధి బాధ్యతను సి.జి.ఏ.పి (కన్సల్టేటివ్‌ గ్రూప్‌ టు అసిస్ట్‌ ది పూర్‌)కి అప్పజెప్పింది.

భారతదేశంలో మైక్రో ఫైనాన్స్‌ విస్తరించిన తీరు

1991 సరళీకరణ విధానాల అమలుతో జాతీయ బ్యాంకుల ప్రాధాన్యత కుంచించబడింది. సామాజిక రంగానికి ప్రాధాన్యత తగ్గి, లాభాల రేటు ప్రాధాన్యత పెరిగింది. నరసింహన్‌ కమిటి సిఫార్సులు, బేసెల్‌ కమిటి ప్రమాణాలతో వ్యవసాయరంగానికి ఇచ్చే ప్రాధాన్యతా రుణాలు నిరర్ధక ఆస్తులు(పారు బాకీలు)గా భావించబడి వాటి మంజూరు తగ్గుముఖం పట్టింది. గ్రామీణ ప్రజానీకం ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. 1993, 1999 జాతీయ శాంపిల్‌ సర్వే గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 72% కుటుంబాలు ప్రభుత్వేతర వనరుల దగ్గర రుణాలు పొంది వున్నారు. వీరిలో 22% వడ్డీ వ్యాపారుల దగ్గర, 21% పాన్‌ బ్రోకర్ల దగ్గర అధిక వడ్డీకి రుణాలు పొందారు. సరిగ్గా ఈ సమయంలోనే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయసంస్థల ప్రేరణతో స్వయం సహాయక బృందాల ద్వారా సూక్ష్మ రుణ ప్రక్రియకు భారత ప్రభుత్వ అంగీకరించింది.

సూక్ష్మ రుణ ప్రక్రియ కోసం 15-20 మంది మహిళలు ఉండే బృందాలు ఏర్పడ్డాయి. ఈ బృందాలు కొన్ని చోట్ల ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలోను, కొన్ని చోట్ల రాజకీయ పార్టీల కార్యకర్తల నాయకత్వంలోను ఏర్పాట య్యాయి. ఒక స్థాయి వరకు పొదుపు చేసిన తరువాత బ్యాంకులతో అనుసంధానం చేసి, రుణాలను ఇప్పిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. బ్యాంకు రుణాలతో పాటు సబ్సిడీ రుణాలు అందిస్తామని చెప్పడంతో ఈ బృందాలు అనేక ఆశలు పెంచుకున్నాయి. దేశంలో 60లక్షల బృందాలు ఏర్పడి, రూ. 54.47కోట్ల డిపాజిట్లను ప్రోగుచేశాయి.

కానీ, బ్యాంకులు ఈ బృందాలకు రుణాలివ్వటానికి విముఖంగా ఉన్నాయి. ఆ దశలో సంయుక్త బాధ్యత (జాయింట్‌ లయబులిటి) బృందాలతో మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. సూక్ష్మ రుణ విధానంలో మహిళలు ప్రధాన భూమికను వహిస్తూ రుణాల్ని తిరిగి చెల్లించడంలో విధేయంగా ఉండటం, మహిళలు కావటం వలన వాళ్ళపై వత్తిడిని పెంచి సులువుగా రుణ వసూళ్ళు చేసుకొనే అవకాశం ఉండటంతో రుణ రికవరీ 90%నికి మించింది. ఈ శాతం సంప్రదాయ బ్యాంకుల రుణ రికవరీ కంటే అత్యధికంగా ఉంది. ఈ పరిణామంతో ఆకర్షించబడి నాబార్డ్‌, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు ప్రాధాన్యతా రుణాలను మైక్రో ఫైనాన్స్‌ నిర్వహించే బ్యాంకేతర ఫైనాన్స్‌ సంస్థలకు (ఎన్‌బిఎఫ్‌సి) అందించటానికి అంగీకరించి మార్గదర్శకాలను రూపొందించాయి.

ప్రాధాన్యతా రుణాలు పొందే వెసులుబాటు ఉండటంతో అనేక నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు మైక్రో ఫైనాన్స్‌ రంగంలో ప్రవేశించి ఆ వ్యాపారంలో 80% హస్తగతం చేసుకున్నాయి. ఈ సంస్థల అధీనంలోని జాయింట్‌ లయబిలిటి గ్రూపులకు బ్యాంకు రుణాలివ్వడంతో, స్వయం సహాయక బృందాలు ఈ సంస్థలకు బదిలీ అయ్యాయి. భారతదేశంలోని మైక్రో ఫైనాన్స్‌ రంగంలో రెండు విభిన్న లక్ష్యాలు గల సూక్ష్మ రుణ సంస్థలు వెలిశాయి. పేదల సాధికారికత, శిక్షణ, ఆరోగ్యరక్షణ లాంటి మౌళిక సామాజిక చర్యలతో మహిళలు, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కొన్నింటి లక్ష్యమైంది. పేదల అభ్యున్నతిపేర లాభాలు దండుకోవడం మిగిలినవాటి లక్ష్యంగా ఉంది. భారతదేశంలో రెండవ లక్ష్యంగల సంస్థలు పై చేయి సాధించి, మైక్రో ఫైనాన్స్‌ రంగంపై ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్‌

మన దేశంలో ఎనిమిది వందల మైక్రో ఫైనాన్స్‌ సంస్థలున్నాయి. అందులో 70% ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడులో ఉన్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో వీటి విస్తరణ మరింత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక బృందాలు డ్వాక్రా గ్రూపులుగా చెలామణి అవుతున్నాయి. 1994లో 10 వేల గ్రూపులుగా ఉన్న డ్వాక్రా గ్రూపులు 2001 నాటికి 3 లక్షల 50 వేలకు పెరిగాయి. కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద 2000 సంవత్సరం నాటికి ఈ స్వయం సహాయక బృందాలు ప్రపంచ బ్యాంకు రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి ఇచ్చే రుణానికి అర్హతను సాధించాయి. రోజుకు రూ.1/- పొదుపును సాధించాల్సిన ఈ గ్రూపులకు 9-12% వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వవలసి వుంది. ఇంత హడావుడిగా ఏర్పాటుచేసిన డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన రుణాలు మొత్తం బ్యాంకుల రుణాలలో 0.6% నికి కూడా మించలేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్ల స్వయం సహాయక గ్రూపులు బ్యాంకింగేతర పైనాన్స్‌ సంస్థల వైపుకు రుణాలకోసం మళ్ళాయి. మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు విపరీతమైన వడ్డీ రేట్లతో రుణ కార్యక్రమాన్ని మొదలెట్టాయి.

ఒక అంచనా ప్రకారం 2008-2009 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 2 కోట్ల మైక్రో ఫైనాన్స్‌ రుణ గ్రహీతలు (స్వయం సహాయక బృందాలు, జాయింట్‌ లయబిలిటి బృందాలు కలుపుకొని) రూ.12,300 కోట్ల రుణం కలిగివున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1 కోటి 60 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అంటే 125% కుటుంబాలకు మైక్రో ఫైనాన్స్‌ రుణం కల్గివుందని భావించాలి. ఈ రుణాలు పొందేది ఎక్కువగా పేదలే. మన రాష్ట్రంలో మొత్తం కుటుంబాల్లో 40 శాతం పేద కుటుంబాలున్నాయని ఒక అంచనా. ఈ లెక్కన మైక్రో ఫైనాన్స్‌ కింద ఒక్కో పేద కుటుంబానికి ఎనిమిదేసి సార్లు రుణం అందించబడింది. దీంతో వీరి సగటు కుటుంబపు రుణం రూ.49,000లుగా ఉంది. దేశవ్యాప్తంగా మైక్రోఫైనాన్స్‌ సంస్థలు అందించిన సగటు కుటుంబ రుణానికి ఇది ఎనిమిదిరెట్లు కాగా, స్వయం సహాయక గ్రూపులు పొందిన సగటు కుటుంబ రుణం కంటే 11రెట్లు ఎక్కువ. పై గణాంకాలు ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్‌ సంస్థల కేంద్రీకరణను తెలియజేస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి బహుళ సంఖ్యలో రుణాలు మంజూరు చేసినట్లు తేలుతుంది. మైక్రో ఫైనాన్స్‌ సంస్థల మధ్య రుణాలివ్వడంలో పోటీ ఎక్కువైనప్పటికీ, అధిక వడ్డీరేట్ల విషయంలో ఇవన్నీ సిండికేట్‌గానే వ్యవహరిస్తున్నాయి. దీంతో పేదలకు ప్రయోజనాలు కలుగక పోగా అనర్ధాలు ఎక్కువయ్యాయి.

ప్రభుత్వ జోక్యానికి బ్రేకులేసిన ప్రపంచబ్యాంకు

ప్రపంచబ్యాంకు ఏర్పాటు చేసిన సి.జి.ఏ.పి వివిధ దేశాలలో మైక్రో పైనాన్స్‌ అమలుకు కొన్ని మార్గదర్శకాల్ని రూపొందించింది. అవి 1) వడ్డీరేట్లపై పరిమితుల్ని విధించే రుణ వ్యాపార చట్టాల్ని రద్దు చేయాలి. వడ్డీ రేట్లపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు. 2) పేదలకిచ్చే అన్ని రకాల సబ్సిడీలు రద్దు చేయాలి.3) సూక్ష్మ రుణ సంస్థలను ప్రయివేటీకరించాలి. 4) కఠినమైన రుణ వసూళ్ళ చర్యలు, చట్టాలు రూపొందించాలి. వాస్తవానికి వీటిని మార్గదర్శకాలు అనడం కంటే షరతులు అని పేర్కొనాలి. ఫైనాన్స్‌పెట్టుబడి ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక రంగంలో ప్రభుత్వ జోక్యాన్ని నివారించేందుకు, నయా ఉదారవాద విధానాలకు ఢోకా లేకుండా ఉండేందుకు ప్రపంచబ్యాంకు ఈ షరతులను విధించింది. నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న ఏ దేశమైనా వీటిని అమలు చేయాల్సిందే. భారతదేశంలో గ్రామీణ మహిళా అభివృద్ధి, సాధికారిక ప్రాజక్ట్‌ క్రింద ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన రుణం ఈ నిబంధనలకు లోబడి వుంది. దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలపై ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ అనుభవాలు - నేర్పుతున్న పాఠాలు

1) మహమ్మద్‌ యూనస్‌ సూత్రీకరించినట్లు స్వేచ్ఛా మార్కెట్‌ విధానాలపై నిర్మితమైన సూక్ష్మరుణ విధానం పేదల పేదరిక నిర్మూలనకు దోహదపడక పోగా, పెనం నుండి పొయ్యిలో పడ్డట్లు పేదలను నిరుపేదలుగాను, బానిసలు గానూ మారు స్తున్నాయి.

2) పేదరిక నిర్మూలనలో సూక్ష్మరుణ విధానం ఒక సహయకారి మాత్రమే కాని పేదరిక నిర్మూలనకు దివ్య ఔషదం కాదు అందువల్ల మైక్రో ఫైనాన్స్‌ విధానానికి విశేష ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం లేదు

.3) సరళీకరణ విధానాలతో విద్య, ఆరోగ్యం, నివాసం వంటి సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఉపాధి, ఉద్యోగభద్రత కరువైంది. ఆర్థిక, సామాజిక అంతరాలూ పెరిగాయి. వీటన్నింటి వల్ల జీవన వ్యయం పెరిగింది. అందుకే పేదలు సూక్ష్మ రుణాలను వస్తూత్పత్తికి ఉపయోగించకుండా నిత్యావసర జీవనానికి, అప్పటికే ఉన్న అప్పులు తీర్చడానికి వాడుతున్నారు. దీంతో అప్పుల భారం తడిసిమోపడైపోయింది. పేదల జీవన స్థితిగతుల్ని మెరుగుపర్చకుండా, కేవలం సూక్షరుణాలతోనే సరిపడితే వీరి బతుకులు బాగుపడవు.

4) వ్యవస్థలో వేతనంతో కూడిన ఏ ఉపాధీ దొరకని స్థితిలో, ఆఖరి చర్యగా పేదలు స్వయం ఉపాధిని ఎంచుకుంటారు. కొన్ని వస్తువులు ఉత్పత్తిచేస్తున్నారు. మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ప్రపంచీకరణ విధానాల వల్ల మార్కెట్లో బహుళ జాతి ఉత్పత్తులు వెల్లువగా వస్తున్నాయి. వాటికి ప్రచార బలమూ మెండు గా ఉంది. బడా కార్పొరేట్‌ మాళ్లను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఈ పోటీలో నిలదొక్కు కోవాలంటే ప్రభుత్వం స్వయం ఉపాధి ఉత్పత్తులకు రక్షణ కల్పించాలి. కానీ అలా చేయకపోవడంతో స్వయం సహాయక బృందాల జీవనం అస్తవ్యస్తమ య్యింది.

5) అధిక వడ్డీరేట్లకు, కిరాతక చర్యలకు ప్రపంచ బ్యాంకు షరతులే మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు అండగా నిలుస్తున్నాయి. ఆర్‌బిఐ సైతం తన మార్గదర్శక సూత్రాలలో వడ్డీ రేటు నిర్ణయం మైక్రో ఫైనాన్స్‌ సంస్థలదేనన్నది. ఈ షరతులకు తలొగ్గే ప్రభు త్వాలు ఉన్నంత కాలం పేదలపాలిట మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు విషపు గుళికలే.

6) లాభాపేక్ష ధ్యేయంగా ఉండే పెట్టుబడిదారీ వర్గం ప్రపంచ వ్యాప్తంగా లాభాలు దొరకనప్పుడు లాభాల కోసం పేదల రక్తాన్ని పీల్చటానికి వెనుకాడవన్న వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. పేదరిక నిర్మూలనలో కార్పోరేట్ల భాగస్వామ్యం పనికిరాదని దీంతో రుజువైంది.

7) స్వేచ్ఛా మార్కెట్‌ విధానాలలో పోటి వినియోగదారుడికి మేలుచేస్తుందని ప్రచారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్‌ సంస్థల పోటి నిర్వహణ ఖర్చుల్ని తగ్గించక పోగా తీవ్రంగా పెంచింది.

8) ఆంధ్రప్రదేశ్‌లో మరణించిన పేదలలో 17 మంది యస్‌.కె.యస్‌. మైక్రో ఫైనాన్స్‌ నుంచి అప్పులు తీసుకున్నవారే. ఈ సంస్థ ఇటీవలనే ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపిఓ) ఉపక్రమించింది. పబ్లిక్‌ ఆఫర్‌ కు వెళ్ళబోయేముందు తన వాటాలలో గణనీయమైన భాగాన్ని హెడ్జ్‌ ఫండ్స్‌ అమ్ముకున్నట్లు, దాని ద్వారా 12 రెట్ల లాభాన్ని పొందినట్లు వార్తలు వస్తున్నాయి. పేదల జీవితాలతో ముడిపడ్డ మైక్రో ఫైనాన్స్‌ రంగంలో హెడ్జ్‌ ఫండ్ల ప్రవేశం ప్రమాదకరమైంది.

9) వడ్డీరేటును నియంత్రించకుండా మైక్రో ఫైనాన్స్‌ సంస్థల పూర్తి నియంత్రణ సందేహాస్పదమే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ ఎందుకూ కొరగాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది.

.

Sunday, October 10, 2010

బేసెల్‌ ప్రమాణాలు - భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ

బేసెల్‌-3 ప్రమాణాల అమలుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఇటీవల చేసిన ప్రకటనతో, భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ యొక్క సుస్థిరత ఒక కోణంలో ఆశావహంగా కనిపిస్తున్నా, మరో కోణంలో పరిశీలించినట్లయితే బేసెల్‌ ప్రమాణాల అమలు తీరే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థ మనుగడకు గొడ్డలి పెట్టుగా ఉంది.

బేసెల్‌-1 ప్రమాణాలు

సరళీకరణ విధానాల నేపథ్యంలో 1992లో భారత దేశంలో ఈ ప్రమాణాల అమలుకు పూనుకున్న రిజర్వు బ్యాంక్‌, 1999 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. బేసెల్‌ కమిటీ ఈ ప్రమాణాలలో ''సముచిత మూలధన నిష్పత్తి'' (క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో)ని 8%గా నిర్ణయించగా, రిజర్వు బ్యాంకు ఈ నిష్పత్తిని 9%గా ఖరారు చేసింది. ఈ ప్రమాణాల అమలులో ప్రభావితమైన రెండు అంశాల్ని ప్రత్యేకంగా పేర్కొనాల్సి వుంది. అవి 1. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా రూ. 20,446 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనానికి జమ చేసి, జాతీయ బ్యాంకుల ''సముచిత మూల నిష్పత్తి''ని పెంచడం 2) మొత్తం బ్యాంకు రుణాలలో నిరర్దక ఆస్తుల (మొండిబాకీలు) శాతాన్ని 1993 మార్చి నాటికున్న 23.2 నుండి మార్చి 2004 నాటికి 7.8 కి తగ్గించడం.

ప్రభావాలు

బేసెల్‌-1 ప్రమాణాల ప్రకారం నిరర్దక ఆస్తులు పెరిగిన మేరకు బ్యాంకులు అదనపు మూలధనాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్యాంకులు అనివార్యంగా నిరర్దక ఆస్తుల్ని తగ్గించాల్సి వచ్చింది. ఈ మొండి బకాయిలలో అత్యధిక శాతం సంపన్న వర్గాలు, రాజకీయ నాయకులవి. పారుబాకీ దారుల చిట్టాను బహిర్గతం చేసి, కఠిన చర్యలతో ఈ బాకీల వసూళ్ళకు ప్రభుత్వం పూనుకోవాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు గళమెత్తినా, పాలక వర్గాలు తగు రీతిలో స్పందించలేదు. వివిధ ట్రిబ్యూనల్స్‌ను, అప్పిలేట్లను సాధనంగా చేసుకొని 2003-04 నాటి స్థూల నిరర్దక ఆస్తులలో 56.6% న్ని పారుబాకీల ఖాతాకు జమ చేసి, అందులో అత్యధిక భాగాన్ని రద్దు చేసే ప్రక్రియకు ప్రభుత్వ రంగ బ్యాంకులు పూనుకోవాల్సిన స్థితి ఏర్పడింది. దీంతో జాతీయ బ్యాంకులు ఆర్జించిన విశేష లాభాలను మొండిబాకీలకు సర్దుబాటు చేయడంతోను, ప్రభుత్వం అందించిన అదనపు మూలధనంతోనూ, నిరర్దక ఆస్తుల శాతం తగ్గింది. ఆచరణలో పూర్తిస్థాయిలో బకాయిలు మాత్రం వసూలు కాలేదు. ఈ పరిణామంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలలో పడటం, వాటి ప్రయివేటీకరణకు పాలక వర్గాలు కసరత్తు చేయటం మొదలైంది. బ్యాంకుల రుణ డిపాజిట్‌ నిష్పత్తి తగ్గుముఖం పట్టింది. ప్రాధాన్యతారంగ రుణాలను ఇవ్వటానికి వాణ ిజ్య బ్యాంకులు విముఖతను చూపడంతో, వ్యవసాయ రుణాల మంజూరు తగ్గింది.

అంతర్జాతీయ సంస్థల వత్తిడితో బేసెల్‌-2 ప్రమాణాల అమలు

ఫిబ్రవరి 2005లో బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు కావల్సిన మార్గదర్శకాల్ని రిజర్వు బ్యాంక్‌ నియమించిన స్టీరింగ్‌ కమిటీ విడుదల చేసింది. మొదట్లో మార్చి 31, 2007లోగా బేసెల్‌-2 ప్రమాణాల్ని అమలు చేయాలని రిజర్వ్‌ బ్యాంకు భావించింది. ఆ తరువాత తన ప్రణాళికను మార్చుకుంది. మార్చి 31, 2008లోగా దేశంలోని విదేశీ బ్యాంకులు, మార్చి 31, 2009లోగా దేశీయ వాణిజ్య బ్యాంకులు ఈ ప్రమాణాల అమలును పూర్తి చేయాలన్నది. బేసెల్‌-2 ప్రమాణాల మార్గదర్శకాల రూపకల్పన ఆరంభంలో రిజర్వ్‌ బ్యాంకు ప్రకటిస్తూ, తమ మొత్తం వాణిజ్యంలో 20%నికి మించిన విదేశీ వాణిజ్యం కలిగిన దేశీయ బ్యాంకులే బేసెల్‌-2 ప్రమాణాలను అమలు చేయాలన్నది. అప్పటికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక్కటే మన దేశంలో అత్యధిక వాణిజ్యాన్ని కలిగి ఉంది. అయితే అది కూడా ఆరుశాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ వాణిజ్య బ్యాంకులు బేసెల్‌-2 ప్రమాణాల్ని అనుసరించాల్సిన అవసరం లేదు. కానీ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వివిధ దేశాలలో బేసెల్‌-2 ప్రమాణాల పూర్తి అమలును ప్రోత్సహించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ కూడా తమ సభ్య దేశాలు ద్రవ్య రంగ సుస్థిరత కోసం ఈ ప్రమాణాలను అమలు చేయాలని, విదేశీ బ్యాంకుల విస్తరణకు అంగీకరించాలని, వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో పేర్కొంది. భారత్‌ కూడా అందులో ఒక సభ్య దేశం. ఈ నేపథ్యంలో భారత దేశంలో రిజర్వ్‌ బ్యాంకు బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు సిద్ధమైంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు శ్రీకారం

బేసెల్‌-2 ప్రమాణాలు కొన్ని అంశాలలో రిస్క్‌ వేయిటేజీలకు మూలధన సమీకరణలో వెసులుబాటు కల్పించాయి. కార్పొరేట్‌ రుణాల కంటే రిటైల్‌ రుణాలకు, చిన్న వ్యాపార రుణాలకు రిస్క్‌ వెయిటేజీని తగ్గించాయి. ఈ రకమైన వెసులుబాటుతో అదనపు మూలధన అవసరం బ్యాంకులకు తగ్గినా, నిర్వహణ రిస్క్‌ (ఆపరేషనల్‌ రిస్క్‌)కు సంబంధించి సమీకరించాల్సిన అదనపు మూలధనం తడిసి మోపెడైంది. గత మూడు సంవత్సరాల సగటు వార్షిక స్థూల ఆదాయంలో 15 శాతాన్ని అదనపు మూలధనంగా బ్యాంకులు సమీకరించాలి. ఐ.సి.ఆర్‌.ఎ అంచనా ప్రకారం భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులు నిర్వహణ రిస్క్‌ కింద రూ. 12 వేల కోట్ల మూలధనాన్ని తక్షణం సమీకరించాల్సి వచ్చింది. దీనికి తోడు భవిష్యత్తు రుణాల మంజూరుకు మధ్యస్థ కాల పరిమితిలో రూ. 18,000-20,000 కోట్లు సమీకరించాల్సి వుంది. వీటితో పాటు సమాచార సమీకరణకు, విశ్లేషణలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అత్యధిక వ్యయపూరితమైంది. అప్పటికే జాతీయ బ్యాంకులు వారి లాభాలను నిరర్దక ఆస్తుల అదుపుకు సర్దుబాటు చేయడం, ప్రభుత్వం నుండి బాండుల రూపంలో రుణం పొందటంతో అదనపు మూలధన సమీకరణకు నూతన మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బ్యాంకులు 51%నికి మించిన ప్రభుత్వ వాటాలను రిటైల్‌ మార్కెట్లో అమ్మటానికి అనుమతించింది. ఈ చర్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టింది. అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు పూనుకున్నాయి. ఈ ధోరణి వేగం పుంజుకొని ప్రభుత్వ ఆధీనంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాలను 33%నికి తగ్గించాలని వత్తిడి పెరిగింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఈ ధోరణికి బ్రేక్‌ పడింది. ప్రయివేట్‌ బ్యాంకులు సైతం అదనపు మూలధన సమీకరణకు పెట్టుబడి మార్కెట్‌ను ఆశ్రయించాయి. ఈ సమయంలో మార్చి 2004లో ప్రయివేట్‌ రంగ బ్యాంకులలో ఆటోమేటిక్‌ మార్గంలో 74% వరకు విదేశీ పెట్టుబడిని అనుమతించటానికి ప్రభుత్వం అంగీకరించింది. కొన్ని ప్రయివేట్‌ బ్యాంకులు విదేశీ పెట్టుబడిని ఆహ్వానించి విదేశీ బ్యాంకులుగా మారాయి. ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు, హెచ్‌.డి.ఎఫ్‌.సి బ్యాంకు ఈ కోవలోవే. ఈ రకంగా బారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించటానికి, విదేశీ బ్యాంకుల విస్తరణను పెంచటానికి బేసెల్‌-2 ప్రమాణాలు సాధనాలయ్యాయి.

మూలధన సమీకరణ కోసం ఐ.యం.ఎఫ్‌ అప్పు

బేసెల్‌-2 ప్రమాణాలు ''సముచిత మూలధన నిష్పత్తి'' 8%గా ఉండాలని నిర్దేశించగా, రిజర్వ్‌ బ్యాంకు 9%గా నిర్ణయించింది కాని భారత ప్రభుత్వం ఈ నిష్పత్తి 12% ఉండాలని ఆదేశించింది. దీంతో వాణిజ్య బ్యాంకులు సమీకరించాల్సిన మూలధన పరిమాణం పెరిగింది. మూలధన సమీకరణకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులలో, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటా 51% గా ఉన్నందున వాటాల ఉపసంహరణకు అవకాశం లేకుండా పోయింది. విక్రయించగలిగే ప్రభుత్వ వాటాలున్న బ్యాంకులకు, వాటాల విక్రయానికి, మార్కెట్‌ అనుకూలంగా లేకుండా పోయింది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంకులన్నింటికి ఆర్థిక సహాయానికి పూనుకొని మూడు బిలియన్‌ డాలర్ల రుణం కోసం అంతర్జాతీయ ద్రవ్య సంస్థను ఆశ్రయించింది. దేశంలోని అభ్యుదయ కాముకులు ఈ చర్యను వ్యతిరేకించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్పటికే రిజర్వ్‌ బ్యాంకు ప్రమాణాల ప్రకారం సముచిత మూలధన నిష్పత్తిని కలిగివున్నాయి. అదనపు నిష్పత్తి అమలు సాకుతో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలనాశ్రయించడంలోని దురుద్దేశం చర్చనీయాంశమైంది. ద్రవ్య రంగ సరళీకరణను వేగవంతం చేయడం కోసం రిజర్వు బ్యాంకుపై వత్తిడిని పెంచటానికే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకున్నదని, చైనా అనుసరించినట్లుగా విదేశీ మారక ద్రవ్య నిధులను ఈ అవసరాలకు మళ్ళించే అవకాశాన్ని ఉద్దేశ పూర్వ కంగానే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు పెల్లుబికాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య సంస్థ నుండి రెండు బిలియన్‌ డాలర్ల మొదటి విడత రుణాన్ని బ్యాంకుల అదనపు మూలధనం సమీకరణకోసం పొందింది.

బేసెల్‌-3 ప్రమాణాలు

బేసెల్‌-2 ప్రమాణాలు బ్యాంకుల నియంత్రణను కీలకంగా తీసుకొని రూపొందించబడ్డాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బడా బ్యాంకులు కుప్పకూలడంతో బేసెల్‌-2 ప్రమాణాల డొల్లతనం బయటపడింది. విడివిడిగా బ్యాంకుల సుస్థిరతే కాకుండా ''ద్రవ్య రంగ వ్యవస్థ మొత్తం సుస్థిరత'' ధ్యేయంగా బేసెల్‌-3 ప్రమాణాల ప్రతిపాదనలు తయారయ్యాయి. బేసెల్‌-2 ప్రమాణాల కంటే కనీస సముచిత మూలధనంలో నాణ్యతను, పరిమాణాన్ని మెరుగుపర్చాలని ఈ ప్రమాణాలు నిర్దేశిస్తున్నాయి. అలాగే నిధుల లభ్యత (లిక్విడిటీ) నిష్పత్తిపై విడివిడి దేశాలకు స్వేచ్ఛనివ్వకుండా విశ్వ ప్రామాణికమైన నిధుల లభ్యత నిష్పత్తిని ఖరారు చేయటానికి ఈ ప్రమాణాలు సిద్ధమౌతున్నాయి. నవంబర్‌లో జరిగే జి-20 దేశాల సమావేశంలో ఈ ప్రమాణాలు తుది మెరుగులు దిద్దుకుంటాయి. భారతదేశంలో ఈ ప్రమాణాల అమలు కోసం వచ్చే తొమ్మిది సంవత్సరాలలో రూ. ఆరు లక్షల కోట్ల నిధులు అవసరమౌతాయని ఐ.సి.ఆర్‌.ఎ అంచనా వేస్తున్నది. బేసెల్‌-3 ప్రమాణం ప్రకారం సముచిత మూలధన నిష్పత్తి 16శాతంగా ఉండాలి. మనదేశ సముచిత మూలధన నిష్పత్తి 13.4%గా ఉంది. అలాగే మన దేశ మొదటి అంచె మూలధనం 9.3%గా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్‌బిఐ మటుకు బేసెల్‌-3 ప్రమాణాలను అమలు చేయగల మన్న ధీమాను వ్యక్తం చేస్తున్నా, వాటిలో ఉన్న కొన్ని ఇబ్బందులను అంగీకరిస్తున్నది.

ముగింపు

భారతదేశంలో బేసెల్‌ ప్రమాణాల అమలుతో ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వ ఆధీనంలోని సగటు మూలధనం 61.32%నికి పడిపోయింది. బ్యాంకుల సామాజిక దృక్పథం స్థానంలో లాభాపేక్ష పెరిగింది. ప్రయివేట్‌ బ్యాంకుల ఆధిపత్యం పెరిగి విదేశీ బ్యాంకుల ప్రాబల్యం అధికమైంది. బ్యాంకుల ఏకీకరణకు రంగం సిద్ధమైనది. అయినప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల బలంతో మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొంది. బేసెల్‌-3 ప్రమాణాల అమలు ద్రవ్య రంగ సరళీకరణ వేగాన్ని పెంచడంతో పాటు, నీడనిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మొదళ్ళను పెకలించి, విదేశీ బ్యాంకుల ఆధిపత్యాన్ని పెంచనున్నది. తస్మాత్‌ జాగ్రత్త!!