యూనిట్ లింక్డ్ బీమా మార్కెట్లు - ఒక పరిశీలన
యూనిట్ లింక్డ్ బీమా పథకాలు
(యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్-యూలిప్)
యూనిట్ లింక్డ్ బీమా పథకాలను క్లుప్తంగా ''యూలిప్'' అంటారు. మూలధన మార్కెట్ల (క్యాపిటల్ మార్కెట్) ప్రయోజనాల్ని అందించే జీవిత బీమా పాలసి ''యూలిప్''గా చలామణి అవుతున్నది. జీవిత బీమా పథకాలలో బీమా రక్షణను అందించే పాలసీలు (రిస్క్ కవర్ పాలసీలు), బీమా రక్షణ, పొదుపులను ఉమ్మడిగా అందించే పాలసీలు (ఎండోమెంట్ తరహా పాలసీలు), పూర్తిగా పొదుపునందించే పాలసీలు (ప్యూర్ ఎండోమెంట్ పాలసీలు) వివిధ రకాలుగా ఉన్నాయి. ''యూలిప్''పాలసీ స్టాక్ మార్కెట్ ప్రయోజనాలు, బీమా రక్షణలను ఉమ్మడిగా ఒకే పాలసీలో అందిస్తుంది. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెట్టకుండా, అనుభవం, సామర్థ్యం కలిగిన ఫండ్ మేనేజర్ల ద్వారా స్టాక్ మార్కెట్ ప్రయోజనాలను పొందే మ్యూచివల్ ఫండ్ లాంటిది. పోలికలున్నా మ్యూచ్వల్ ఫండ్లు, ''యూలిప్''లు ఒకటి కాదు. మ్యూచ్వల్ ఫండ్లు స్వల్ప కాలిక ప్రయోజనాల్ని ఇవ్వగలిగేవి. ''యూలిప్''లు దీర్ఘకాలిక ప్రయోజనాల్ని అందిస్తాయి. ఈ పథకంలో ''యూనిట్ నిధి'' ఏర్పాటు చేయబడుతుంది. ఈ నిధిని జీవిత బీమా కంపెనీలు నిర్వహిస్తాయి. ''యూలిప్''పాలసీ పై చెల్లించే ప్రీమియంల నుండి నిధి నిర్వహణకు కావలసిన వివిధ ఖర్చులైన ప్రీమియం యాలకేషన్ చార్జీలు, ఫండ్ నిర్వహణ ఖర్చులు, పాలసీ/కార్యనిర్వహణ ఖర్చులతో పాటు, పాలసీదారునకు బీమా రక్షణ వర్తించటానికి అవసరమయ్యే ''రిస్క్'' ప్రీమియంలను మినహాయించగా మిగిలిన సొమ్మును యూనిట్ నిధికి జమ చేస్తారు. ఈ నిధిని గ్రోత్ ఫండ్ (ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి), బాండ్ ఫండ్ (కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, స్థిరమైన వడ్డీని అందించే వివిధ పధకాలు), క్యాష్ ఫండ్ (మనీ మార్కెట్లో పెట్టుబడి), బ్యాలెన్స్ ఫండ్ (కొంత ఈక్విటీ, కొంత బాండ్ మార్కెట్లలో పెట్టుబడి)లలో పెట్టుబడి పెడతారు. ఐ.ఆర్.డి.ఎ లైసెన్సు పొందిన జీవిత బీమా కంపెనీలు ఏ కంపెనీకి ఆ కంపెనీ, ఏ యూనిట్కు ఆ యూనిట్ నిధులను నిర్వహిస్తాయి. ప్రతి 'నిధి'ని వివిధ యూనిట్లుగా విభజిస్తారు. ప్రతిరోజూ యూనిట్ విలువను లెక్కిస్తారు. ఈ విలువను నికర ఆస్థి విలువ (నెట్ ఎస్సెట్ వ్యాల్యూ-యన్.ఎ.వి) అంటారు. యన్.ఎ.వి స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ప్రాతిపదికన మారుతుంటుంది.
పూర్వరంగం
బ్రిటన్లో యూనిట్ ట్రస్ట్లచే 1950లో ''యూలిప్''లు ప్రారంభింపబడ్డాయి. ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, కెనడాలలో ఈ ఉత్పత్తులు విజయవంతంగా అమలయిన తరువాత 1976లో అమెరికాలో ''యూలిప్''లు ప్రవేశపెట్టబడ్డాయి. 1980లో ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో జీవిత బీమా కంపెనీలు ''యూలిప్''లను సొంతం చేసుకున్నాయి. ద్రవ్య పెట్టుబడి ప్రపంచీకరణ వేగానికి అనుగుణంగా ఆయా దేశాలలో ఈ మార్పులు జరిగినాయి.
మనదేశంలో
బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులనుమతిస్తూ ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ స్థాపన తరువాత బీమా ఉత్పత్తులలో వచ్చిన వివిధ మార్పులలో భాగంగా 2003 నుండి ''యూలిప్'' వ్యాపారం మన దేశంలో గణనీయంగా అభివృద్ధి అయ్యింది. అంతకు పూర్వం యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ''యూలిప్'' వ్యాపారం ఉన్నా, అది నామమాత్రంగా ఉండేది. 2003 నుండి 2008 వరకు సెన్సెక్స్ 3,391 పాయింట్ల నుండి 20,301 పాయింట్లకు పెరిగింది. ఈ పెరుగుదల ప్రతి సంవత్సరం సగటున 43% గా ఉన్నది (అప్పుడప్పుడు ఉండే ఒడిదుడుకుల్ని పరిగణలోకి తీసుకుంటే) ఈ పెరుగుదలకు ప్రధానంగా ''యూలిప్'' నిధులు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు గణనీయంగా దోహదపడ్డాయి. ఆ కాలంలోని సెన్సెక్స్ పెరుగుదలతో పాటు వడ్డీ రేటు తగ్గుదల ''యూలిప్'' నిధుల సమీకరణపైతీవ్రమైన ప్రభావాన్ని కల్గించాయి. ''యూలిప్''ల ప్రాధాన్యతను పెంచాయి. ఆ తరువాతి కాలంలో అమెరికా గృహరుణాల సంక్షోభంతో మూలధనమార్కెట్లు కుప్పకూలాయి. తిరిగి పూర్వ వైభవాన్ని పుంజుకోవటం ఇంతవరకు సాధ్యపడలేదు.
సంప్రదాయ జీవిత బీమా పధకాలు నిర్లక్ష్యం
ప్రపంచవ్యాప్తంగా ''సంప్రదాయ జీవిత బీమా పధకాలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. ఈ పథకాలలో అత్యధిక పెట్టుబడుల రిస్క్ను బీమా కంపెనీలు భరించాల్సి ఉంటుంది. కాని వారికొచ్చే లాభం 10%నికి మించ''దని యాక్చ్యూరియల్ నిపుణులు ఆర్. రామకృష్ణన్ పేర్కొంటున్నారు. కానీ ''యూలిప్''లలో పెట్టుబడుల ''రిస్క్'' నంతా పూర్తిగా పాలసీదారుడే భరిస్తారు. లాభాలను జీవితబీమా కంపెనీలు అనుభవిస్తాయి. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా జీవిత బీమా కంపెనీలు ''యూలిప్'' వ్యాపారాన్ని ఆదరిస్తూ, సంప్రదాయ బీమా వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి.
భారతదేశంలో బీమా రంగంలో ప్రయివేటు పెట్టుబడులు అనుమతించిన తరువాత ప్రయివేటు జీవిత బీమా కంపెనీలు ''యూలిప్''ల వ్యాపారం మీదనే కేంద్రీకరించాయి. ఆ కాలంలో పెరిగిన స్టాక్ మార్కెట్ పై మోజు, సెన్సెక్స్ విజృంభణ వారి వ్యూహాలకు తోడైనాయి. వారు చేసే జీవిత బీమా వ్యాపారంలో ''యూలిప్''లు 80%గా ఉన్నాయి. జాతీయం చేసినప్పటి నుండి (1956) బీమా రక్షణతోపాటు పొదుపును ప్రోత్సహించే ఎండోమెంట్ తరహా పాలసీలను భారతీయ జీవిత బీమా సంస్థ మన్నికగా నిర్వహించి, లక్షల కోట్ల రూపాయల నిధుల్ని వివిధ ప్రణాళికలకు అందించింది. దానితోపాటు పాలసీదారుల అత్యంత విశ్వాసనీయతను చూరగొన్నది. దేశీయ పొదుపు ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతగా ఉన్నప్పుడు భారతీయ జీవితబీమా సంస్థ నిర్వహించిన మహౌన్నత కర్తవ్యమిది. కాని నయాఉదారవాద విధానాల నేపధ్యంలో ఆర్థిక వ్యవస్థ చోదకులుగా మార్కెట్ శక్తులైనాయి, మారిన ప్రాధాన్యతలలో మూలధన మార్కెట్ (క్యాపిటల్ మార్కెట్) ముందుకొచ్చింది. ప్రయివేటు జీవిత బీమా కంపెనీల ప్రచార ప్రభా వాలతో, దేశంలో నెలకొన్న మారిన పరిస్థితులలో భారతీయ జీవిత బీమా సంస్థ సైతం ''యూలిప్''ల వ్యాపారంపై కేంద్రీకరించాల్సి వచ్చింది. ఈ సంస్థ వ్యాపారంలో ''యూలిప్''లు 65%గా ఉండి, సంప్రదాయ జీవిత బీమా వ్యాపారం తగ్గింది. భారత దేశంలోని 23 జీవిత బీమా కంపెనీల ఉమ్మడి యూనిట్ నిధులు రూ. 2,00,000 ల కోట్లుగా ఉంది. మొత్తం దేశంలోని జీవితబీమా వ్యాపారంలో ''యూలిప్''లు 60%గా ఉన్నాయి. అందువల్ల ''యూలిప్'' పాలసీ దారుల ప్రయోజన రక్షణ, ''యూలిప్'' వ్యాపారంలో అనారోగ్య పోకడల నివారణ ఐ.ఆర్.డి.ఎ తక్షణ కర్తవ్యమైంది.
No comments:
Post a Comment