Tuesday, November 24, 2009

చరిత్రలో మానవ వలసలు

ప్రపంచవ్యాపితంగా మానవ వలసల ధోరణులలోని మూడు కీలకాంశాలను మానవాభివృద్ధి నివేదిక 2009 గుర్తించింది. 1) మానవ స్థితిగతుల్ని మెరుగుపర్చుకోవలసిన మానవ అవసరమే మానవ వలసలకు చోదక శక్తిగా ఉంది. 2) మానవ వలసల సమగ్రాభివృద్ధికి ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాల విధానపరమైన అడ్డంకులు, ఆర్థికపరమైన అవాంతరాలు అడ్డుగోడలుగా ఉన్నాయి. ఈ అడ్డుగోడల్ని అధిగమించలేని పేద ప్రజానీకం అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ మానవ వలసల ప్రయోజనాలను పొందలేకున్నారు. 3) భవిష్యత్తులో ఎదురుకానున్న విభిన్న ఆర్థిక, భౌగోళిక పరిణామాలు మానవ వలసల ప్రవాహాన్ని పెంచే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయని నివేదిక అంచనా వేసింది.

19వ శతాబ్ధంలో మానవ వలసల స్వేచ్ఛా సమాజం:

అతి పురాతనమైన మానవ వలసలకు బైబిల్‌(పాతనిబంధనలు), ఖురాన్‌ లాంటి మత గ్రంథాలు గౌరవ స్థానమిచ్చాయని, వలస ప్రజలను మౌళిక వసతులతో ఆదరించాలనే మత ప్రభోధాలను నివేదిక ప్రస్తావించింది. ప్రాచీన కాలంలో నాగరికతలలో ఎన్ని మనస్పర్ధలున్నా వలస ప్రజలతో సహజీవనం చేయటం సమాజ లక్ష్యంగా ఉండేది. ఇబేరియన్‌ పాలనలో అమెరికా ఖండానికి లక్షలాది స్పేనియన్‌లు, ఆంగ్లేయులు వలస పోవటం, 15వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు శ్రమ శక్తి కొరత తీర్చటం కోసం కోటి 20 లక్షల మంది ఆఫ్రికన్లను క్రూరపద్ధతులలో బానిసలుగా తీసుకువెళ్ళటం, 23 లక్షల చైనీయులు, 13 లక్షల మంది ఇండియన్లు ఈశాన్య ఆసియా దేశాలకు కాంట్రాక్టు కార్మికులుగా వెళ్ళటాన్ని నివేదిక పేర్కొన్నది. బ్రిటన్‌లోని పారిశ్రామిక విప్లవం గ్రామ సీమల నుండి పట్టణాలకు వలసల వేగాన్ని పెంచింది. ఇదే కాలంలో బ్రిటన్‌ న్యూయార్క్‌ల మధ్య తగ్గిన రవాణా ఖర్చులు, స్వీడన్‌ ఐరిష్‌ దేశాల నుండి వలస వెళ్ళిన ప్రజల వేతనాలు సంపన్న దేశాల స్థాయిలో ఉండటం మానవ వలసలకు ప్రోత్సాహకర వాతావరణం ఏర్పరచిందని నివేదిక చెప్పింది. అర్జెంటీనా వంటి దేశాలు వలస వెళ్ళే ప్రజలకు కల్పించిన ప్రయాణ సబ్సిడీలు, బ్రెజిల్‌ లాంటి దేశాలు వలస వచ్చిన ప్రజలకు ఉచితంగా అప్పగించిన భూములు, 1924వరకు అమెరికాలో శాశ్వత నివాసమేర్పరచుకోటానికి వలస ప్రజలకు ఆంక్షలు లేని వాతావరణం, 19వ శతాబ్ధంలో చరిత్రలో నిలిచిన మానవ వలసల స్వేచ్ఛా సమాజాన్ని ప్రస్తావిస్తూ, సమకాలీన కాలంలో మానవ వలసలలోని నూతన కోణాల్ని చూడటానికి ఈ చరిత్ర ప్రాతిపదికను అందించిందని నివేదిక చెప్పింది. ఈ నాటికంటే ప్రపంచవ్యాపితంగా 19వ శతాబ్ధంలో మానవ వలసల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం.

మానవ వలసలపై ఆంక్షల్ని ప్రారంభించిన 20వ శతాబ్దం:

పారిశ్రామికాభివృద్ధి పెరుగుతూ నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, పౌరపాలనలో సరిహద్దులు, సంరక్షణ అనే భావన పెరిగింది. అభివృద్ధి చెందిన వివిధ దేశాలు శ్రమశక్తి కొరతగా ఉన్నప్పుడు విదేశాల నుండి మానవ వలసల్ని ప్రోత్సహించటం, కరువుకాటకాలు, ఆర్థిక సంక్షోభకాలాల్లో మానవ వలసలపై ఆంక్షలు విధించటం రివాజుగా మారిపోయిందని నివేదిక అభిప్రాయపడింది. మానవ శ్రమశక్తి మారకానికి వివిధ దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 1942లో మెక్సికన్‌ ఫారమ్‌ లేబర్‌(బ్రాసరో) ఒప్పందం క్రింద అమెరికా 22 సం||లపాటు 4.6 మిలియన్ల కాంట్రాక్టు కార్మికులను మెక్సికో నుండి తమ దేశానికి అనుమతించింది. దీనిని 1964లో రద్దు చేసింది. 1947లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఆస్ట్రేలియాల మధ్య కుదిరిన అసిస్టెడ్‌ ప్యాసేజ్‌ అగ్రిమెంట్‌, గెస్ట్‌ వర్కర్‌ ప్రోగ్రామ్‌లాంటి యూరోపియన్‌ యూనియన్‌ కార్మిక సంఘాల ఒప్పందాలు ఈ దిశలో ప్రాచుర్యాన్ని పొందాయి. 1970వ సం||లో ప్రపంచ దేశాలను కుదిపిన ఆయిల్‌షాక్‌తో ఈ ఒప్పందాలు రద్దయ్యాయి. అదే సందర్భంలో గల్ఫ్‌ దేశాలలో ఆయిల్‌ వాణిజ్యం ఆకర్షణీయంగా ఉన్న నేపథ్యంలో ఆ దేశాలకు మానవ వలసలు ఎక్కువయ్యాయి. ఇన్ని ఆంక్షలు ఉన్నా 1960 ప్రపంచ జనాభాలో 2.7శాతం ఉన్న వలస ప్రజలు 2010 నాటికి 2.8శాతం ఉండటం వలస ప్రజల సంఖ్య స్థిరత్వాన్ని తెలియచేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలలో జనాభాలో 5 శాతం నుండి 12 శాతానికి, గల్ఫ్‌ దేశాలలో 5 శాతం నుండి 39 శాతానికి వలస ప్రజలు పెరిగారు. మిగిలిన ప్రపంచంలో వలస ప్రజల శాతం స్థిరంగానూ, కొన్ని దేశాలలో తక్కువగానూ ఉన్నాయి.

పెరుగుతున్న పట్టణీకరణ-సవాళ్ళు:

వివిధ దేశాల్లో అంతర్గత వలసల స్థాయి పెరుగుతుంది. నివేదిక పరిశీలించిన 18 దేశాలలో 11 దేశాలలో ఈ వలసల స్థాయి అధికంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రామాల నుండి పట్టణాలకు వచ్చే వలసలు పెరుగుతున్నాయి. 2050 నాటికి ప్రపంచవ్యాపితంగా ఉండే పట్టణ ప్రజలు ప్రస్తుత పట్టణ జనాభాకు రెట్టింపు ఉంటారని నివేదిక అంచనా వేస్తుంది. ఈ పెరుగుదల ఆఫ్రికా దేశాలలో 40 నుండి 60 శాతం వరకు ఉండవచ్చు. 2030 నాటికి పట్టణ ప్రజలలో 40శాతం(20లక్షలమంది) మురికివాడల్లో నివసిస్తారని, పట్టణీకరణకు నూతన సవాళ్ళు ముందున్నాయిని నివేదిక హెచ్చరిస్తుంది.

వలసలలోని రకాలు:

వలసలలను శాశ్విత వలసలు, తాత్కాలిక వలసలు, అక్రమ వలసలుగా వర్గీకరించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో తాత్కాలిక వలసలు లేదా స్వల్పకాలిక వలసలలో ప్రజల సంఖ్య అధికంగా ఉంది. సంపన్న దేశాలలో 83శాతం విదేశీయులు కనీసం 5 సం||లు నివసిస్తున్నట్లు నివేదిక చెప్తున్నది. వివిధ కారణాల రీత్యా శాశ్వత వలసలు తాత్కాలిక వలసలుగానూ, తాత్కాలిక వలసలు శాశ్వత, అక్రమ వలసలుగానూ, అక్రమ వలసలు శాశ్వత వలసలుగానూ రూపాంతరం చెందటం ప్రపంచవ్యాపితంగా ఉన్న పరిణామం. అమెరికా జనాభాలో 4 శాతం అక్రమ వలస ప్రజలే. ఆ దేశ వలస ప్రజలలో వీరు 30శాతం. శ్రమశక్తి కొరతను అధిగమించటానికి సంపన్న దేశాలు అక్రమ వలసల్ని చూసీచూడనట్లుగా ఉన్నాయి. 2007వ సం||లో జరిపిన సర్వేలో 78శాతం ప్రభుత్వాలు ఆయా దేశాలలో వలసల స్థాయి సంతృప్తికరంగా ఉందని, 17శాతం ప్రభుత్వాలు వలసల స్థాయి ఎక్కువగా ఉన్నాయని, 5శాతం ప్రభుత్వాలు వలసల స్థాయి తక్కువగా ఉన్నాయని తెల్పుతున్నట్లు నివేదిక ప్రస్తావించింది.

కార్బన్‌ ట్రేడింగ్‌పై విమర్శలు

పర్యావరణ కాలుష్యాన్ని పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం సృష్టించిన సామాజిక సంక్షోభంగా చూడాలి. శతాబ్దాలపాటు పారిశ్రామిక ఉత్పత్తిలో లాభార్జనే పరమావధిగా విచక్షణా రహితంగా వినియోగించిన శిలాజ ఇంధనాలు(ఫోసిల్‌ ఫ్యూయల్స్‌), అడవుల నరికివేత కలుషిత వాయువిడుదలలకు ప్రధాన కారణాలు. ప్రస్తుత దశకంలో ప్రపంచవ్యాపిత విద్యుదుత్పత్తిలో 80% శిలాజ ఇంధనాలపై ఆధారపడి ఉంది. వీటిలో చమురు భాగం 34%. ప్రపంచవ్యాపిత పారిశ్రామిక ఉత్పాదకతతో శిలాజ ఇంధనాలు బ్రహ్మముడి వేసుకొని ఉన్నాయి. వీటి వినియోగాల్ని తగ్గించటమంటే పారిశ్రామిక ఉత్పాదకతను, ఆర్ధికాభివృద్ధిని కుదించటంగా ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. అందుకనే క్యోటో ఒప్పందంలో శిలాజ ఇంధనాల వినియోగం తగ్గింపుకంటే కలుషిత వాయువిడుదలల సర్దుబాటుపై ఎక్కువ దృష్టి సారించాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో కార్బన్‌ ట్రేడింగ్‌ మాన్యతపై పర్యావరణవేత్తల కొన్ని విమర్శల్ని పరిశీలిద్దాం.

1. శిలాజ ఇంధనాల వినియోగాన్ని కార్బన్‌ ట్రేడింగ్‌ తగ్గించలేదు: కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రక్రియలో పారిశ్రామిక దేశాలు ఉత్పత్తి స్థానంలో కలుషిత వాయు విడుదలల్ని తగ్గించటం లేదు. వర్ధమాన దేశాలు కార్బన్‌ నిల్వల్ని పెంచటానికి పెట్టుబడులుపెట్టి వారి వాయువిడుదలల్ని సర్ధుబాటు చేసుకుంటున్నారు. ఆర్థిక దృక్కోణంలో కార్బన్‌వాయు విడుదలల సర్దుబాటు కాలుష్యాన్ని నివారించినట్లు కనిపించినా పర్యావరణ దృక్కోణంలో ఉత్పత్తి స్థానంలో శిలాజ ఇంధనాల వినియోగం, కలుషిత వాయు విడుదలల తగ్గింపే శాస్త్రీయమైన కాలుష్యనివారణ అవుతుంది. పర్యావరణ కాలుష్య సమస్యను కార్బన్‌ ట్రేడింగ్‌ పరిష్కరించలేకపోతుంది.

2. కార్బన్‌ ట్రేడింగ్‌ అసమానతల ప్రాతిపదికపై నిర్మించబడింది: పర్యావరణ పరిరక్షణ సూత్రాలననుసరించి పర్యావరణాన్ని ఏమేరకు కలుషితమొనరిస్తున్నారో, ఆ మేరకు కాలుష్యకారకులు సమానత ప్రాతిపదికన నష్టాన్ని భరించాలి. పారిశ్రామిక దేశాలు తాము కలుషితం చేస్తున్న పర్యావరణ విలువ కంటే అతితక్కువ వ్యయంతో కలుషిత వాయు విడుదలల్ని సర్దుబాటు చేసుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం వర్ధమాన దేశాలలో అడవులు, తోటల పెంపకానికి అయ్యే ఖర్చుకంటే 50 నుండి 200 రెట్లు అధికంగా సంపన్న దేశాలలో వారు సృష్టించిన కాలుష్యాన్ని తగ్గించటానికి వ్యయమవుతుంది. లాభాలనార్జిస్తూ పర్యావరణ కాలుష్య హక్కులను పారిశ్రామిక దేశాలు పొందుతుంటే, తాము కారణం కాని వర్ధమాన దేశాల పేద ప్రజానీకం కాలుష్య నష్టాలను అనుభవిస్తూ, కాలుష్య నివారణా బాధ్యతను మోయాల్సివస్తుంది.

3. కాలుష్య నివారణను నీరుకార్చటమే కార్బన్‌ ట్రేడింగ్‌ లక్ష్యం: కాలుష్యరంగంలో మార్కెట్‌ను సృష్టించటం సామాజిక దృక్కోణంలో అనైతిక చర్య. పర్యావరణ పరిరక్షణకు ప్రధానంగా గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల్ని అడ్డుకోవాలి. కాని వాటిని వాణిజ్య సరుకుగా మార్చి, ఆ సరుకు లాభదాయకమైతే పెట్టుబడిదారీ వ్యవస్థలో వాటి ఉత్పత్తి నిరాఘాటంగా కొనసాగింపబడుతుంది. డచ్‌ జాతీయ ప్రజారోగ్యం, పర్యావరణ సంస్థ అంచనాల ప్రకారం కార్బన్‌ ట్రేడింగ్‌ ద్వారా గ్రీన్‌హస్‌ వాయువిడుదలల్ని 2012 నాటికి 0.1% మించి తగ్గించలేరన్నారు. క్యోటో ఒప్పంద లక్ష్యమైన 5.2% గగనకుసుమమైంది. అందువల్ల కార్బన్‌ట్రేడింగ్‌ వల్ల కాలుష్య నివారణను వాయిదావేయటం లేదా నిర్లక్ష్యం చేయటం జరుగుతుంది కాని కాలుష్య నివారణ సాధింపబడదు.

4. వాతావరణ ప్రైవేటీకరణ - కార్బన్‌ ట్రేడింగ్‌ మార్గం: పౌరులకు స్వచ్ఛమైన గాలిని, పర్యావరణ భద్రతను అందిచాల్సిందిపోయి వాతావరణాన్ని కలుషితం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వాతావరణంపై సర్వహక్కుల్ని కార్బన్‌ట్రేడింగ్‌ ధారాదత్తం చేస్తుంది.

5. నయా ఉదారవాద మానసపుత్రిక కార్బన్‌ట్రేడింగ్‌: కలుషిత వాయు విడుదలల్ని నిర్మూలించాలనే నైతికమైన, పర్యావరణ పరమైన సామాజిక సమస్యను బిలియన్‌ డాలర్ల సంపదను పోగుచేసుకోగలిగే వాణిజ్య వనరుగా కార్బన్‌ట్రేడింగ్‌ మార్చింది. 'అనిశ్చితిని' సరుకుగా మార్చేది నయాఉదారవాద స్ఫూర్తి. కార్బన్‌ నిల్వల గిరాకీ-సరఫరాలలోని అనిశ్చితిని అసరాగా చేసుకొని కార్బన్‌మార్కెట్‌లలోకూడా డెరివేటీవ్‌ల్ని అమలు చేశారు. వాటి ప్రభావంగా మానవాళి మనుగడను సవాలు చేస్తున్న పర్యావరణ కాలుష్యం యొక్క నివారణ ప్రక్రియలలో జూదప్రవృత్తి పెరిగింది. కార్బన్‌ నిల్వలు కార్బన్‌వలయం(కార్బన్‌ సైకిల్‌)లో కాకుండా వాల్‌స్ట్రీట్‌లో పరిభ్రమిస్తున్నాయి.

6. కార్బన్‌ ట్రేడింగ్‌లో దుశ్చర్యలు: శీతలీకరణ వాయుఉత్పత్తిలో విడుదలయ్యే ట్రైక్లోరోమీథేన్‌ను చౌకగా నాశనం చేసి అత్యధిక లాభాలనార్జించటం, అడవులు వనాల పెంపకంలో కార్బన్‌డైయాక్సైడ్‌ను విడుదల చేసే మోనోకల్చర్‌ సాగును ప్రోత్సహించటం, కార్బన్‌ క్రెడిట్‌ లెక్కింపులలో కుంభకోణాలకు పాల్పడటం కార్బన్‌ ట్రేడింగ్‌లో దుశ్చర్యలుగా బహుళ ప్రచారంలో ఉన్నాయి.


కార్బన్‌ ట్రేడింగ్‌ ఎంత ప్రయోజనకరం?

మానవాళి మనుగడకు విఘాతమై, ప్రకృతి వైపరీత్యాలకు కారణభూతమౌతూ, పర్యావరణ కాలుష్యాలైన గ్రీన్‌హౌస్‌ విషవాయువుల నియంత్రణకు భూగోళంలోని ఉత్తర దేశాలు(ధనిక దేశాలు) కార్బన్‌ట్రేడింగ్‌ను ప్రధాన సాధనంగా ఎంచుకున్నాయి. కార్బన్‌ ట్రేడింగ్‌ ద్వారా ఉత్తరదేశాల కాలుష్యవాయు విడుదలల అదుపుకు దక్షిణ దేశాలు (వర్దమాన దేశాలు) కార్బన్‌ నిల్వల స్థావరాలై, కార్బన్‌ మార్కెట్ల విక్రయదారులయ్యాయి. క్యోటో ఒప్పందంలో 170 దేశాల ఆమోదంతో సాధికారత పొందిన కార్బన్‌ ట్రేడింగ్‌ అంతర్జాతీయంగా సామాజిక కార్యకర్తలలోనూ, పర్యావరణ వాదులలోను తీవ్రమైన చర్చనీయాంశమైంది. కార్బన్‌ వాయు విడుదలల అదుపుకు అనువైన మార్గంగా మద్ధతుదార్లు వాదిస్తుంటే, పర్యావరణ కాలుష్యాన్ని మరింతగా కాలుష్య పరచటానికి కాలుష్యదారులకు లైసెన్స్‌ ఇవ్వటంగా పర్యావరణవాదులు విమర్శిస్తున్నారు.

చెప్పబడుతున్న ప్రయోజనాలు: 1) క్యోటో ఒప్పందం ఆమోదించిన వాయువిడుదలల ప్రక్రియలో 'పరిమితి-వాణిజ్యం' (క్యాప్‌ అండ్‌ ట్రేడ్‌) విధానం కీలకమైంది. ఈ విధానానికి లోబడి అభివృద్ధి చెందిన దేశాలు/అందులోని పరిశ్రమలు నిర్ణీత కాలవ్యవధిలో అంగీకరించిన కోటాల మేరకు కాలుష్య విడుదలల్ని అదుపు చేయాల్సి ఉంది. ఈ కార్యసాధనలో కార్బన్‌ ట్రేడింగ్‌ సులభమైన పద్ధతులలో సులువుగా వాయువిడుదలల అదుపుకు తోడ్పడుతుంది.

2) క్యోటో ఒప్పందం ఏర్పరచిన 'కార్బన్‌ డెవలప్‌మెంట్‌ మెకానిజం' కింద అనుబంధం-1 పరిధిలోని అత్యధిక వాయువిడుదల దేశాలు తమ వాయువిడుదలలను సర్దుబాటు చేసుకోవటం కోసం, అనుబంధం-1 కిందకు రాని అత్యల్ప వాయువిడుదలల దేశాల నుండి కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్‌లు కొనుగోలు చేసుకునే వీలుకల్పించింది. తమ దేశాలు వాయువిడుదలల అదుపుకు సంబంధించిన నిర్వాహణ వ్యయం అత్యధికంగా ఉన్న కారణంగాను ప్రకృతి వనరుల లభ్యత కొరత ఉన్న కారణంగాను తక్కువ ఖర్చుతో వర్దమాన దేశాల నుండి కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్లు(సర్టిఫికెట్‌ ఆఫ్‌ కార్బన్‌ రిడక్షన్‌) కొనుక్కోవటం ఉత్తర దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇందుకోసం కార్బన్‌ విడుదలల సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయటం, కార్బన్‌ నిల్వలు పెంచటంలో దక్షిణ దేశాలకు గణనీయమైన నిధులు, పరిజ్ఞానం లభ్యమౌతాయి. వీటితో ఆయా దేశాలు ఆర్ధిక అభివృద్ధికి దోహదపడే పేదరిక నిర్మూలనకు, ఉపాధి అవకాశాల పెంపుకు అవసరమయ్యే నిధుల కొరతను తేలిగ్గా అధిగమించవచ్చును. 3) కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రక్రియలో వర్ధమాన దేశాలలో కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్ల అభివృద్ధికి చేపట్టే ప్రధాన చర్యలైన వన పరిరక్షణ, అడవుల అభివృద్ధి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నిర్వాహణల వల్ల కాలుష్య నియంత్రణ కోసం అంతర్జాతీయంగా వెచ్చించే అధిక వ్యయం ఆదా అవుతుంది.

దీనిని ఆర్ధిక అభివృద్ధిలో మరొక రంగంలో వినియోగించుకోవచ్చును. 4) అడవులు అభివృద్ధితో వన్యప్రాణుల రక్షణ పెరుగుతుంది. 5) కార్బన్‌ ట్రేడింగ్‌లో కార్బన్‌ నిల్వల్ని సరుకుగా పరిగణించిన కారణంగా మార్కెట్‌ శక్తులకు సరుకుల వాణిజ్యంలో ఉన్న అనుభవం దృష్ట్యా కార్బన్‌ వాణిజ్యం తేలికైయ్యింది. కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్లు కార్బన్‌ రిడక్షన్‌ సర్టిఫికెట్‌ల రూపంలో ఉండటం మూలకంగా స్టాక్‌మార్కెట్‌ పద్ధతుల్ని ఈ విక్రయంలో అమలు చేయటం తేలికయ్యింది. వర్ధమాన దేశాలలోని పరిశ్రమలు కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్ల ఆర్జన కోసం తమ పరిశ్రమల్ని అల్పవాయు విడుదలల పరిజ్ఞానానికి మార్చుకోవటం మూలకంగా పర్యావరణంపై మరింత భారం తగ్గుతుంది.

6) కాలుష్య వాయువిడుదలల కంపెనీల ఉత్పత్తులపై వేసే పన్నును కార్బన్‌ టాక్స్‌ అంటారు. కార్బన్‌ టాక్స్‌ ఆర్థిక వ్యవస్థలో పన్ను భారాల్ని పెంచేదృష్ట్యా దీనికంటే కార్బన్‌ క్రెడిట్‌ పద్ధతి మెరుగైనదని అంటున్నారు. తాజాగా చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన కార్బన్‌టాక్స్‌ ఒక ఉదాహరణ.

భారతదేశంలో కార్బన్‌ ట్రేడింగ్‌: ప్రపంచ కార్బన్‌ ట్రేడింగ్‌ మార్కెట్‌లో చైనా 73%, భారత్‌, బ్రెజిల్‌ దేశాలు ఒక్కొక్కటి 8% మార్కెట్‌ షేర్‌ కలిగి ఉన్నాయి. కానీ కార్బన్‌ డెవలప్‌మెంట్‌ మెకానిజం ప్రాజెక్టులలో అత్యధికం మన దేశానివి. 2009 సం||లో ఐరోపాలో కార్బన్‌ ట్రేడింగ్‌ వాణిజ్యం 64 బిలియన్‌ డాలర్లు(కార్బన్‌ ధరలు తగ్గిన కారణంగా) ఉండగా మన దేశం 5 బిలియన్‌ డాలర్ల వాణిజ్యాన్ని చేజిక్కించుకుంది. ప్రపంచ వ్యాపితంగా కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రాజెక్టులలో 72% కార్బన్‌ పీల్చుకునే వనాలు, అడవుల పెంపకం సంబంధించినవి కాగా, 21% బయోమాస్‌, 2% పునరుద్ధరించగలిగే ఇంధన ప్రాజెక్టులు ఉన్నాయి.

లక్ష హెక్టార్లు కొత్త అడవులు 10 లక్షల టన్నుల కార్బన్‌ నిల్వల్ని పెంచుతాయని అంచనా వేస్తున్నారు. ఒక హెక్టార్‌లోని యూకలిప్టస్‌ చెట్లు సాధారణంగా 5 టన్నుల కార్బన్‌ని నిల్వ చేస్తుందంటున్నారు. కార్బన్‌ ట్రేడింగ్‌లో వీటన్నింటికీ టన్నుకు ఒక యూనిట్‌ చొప్పున కార్బన్‌ క్రెడిట్‌లు ఇవ్వబడతాయి. ఈ మధ్య కాలంలో సుబాబుల్‌, యూకిలిప్టస్‌ చెట్ల సాగు భారీగా పెరగటానికి ఈ విధానాలే కారణం. అందుకోసమే ప్రపంచబ్యాంకు విధానాల అమలులో వనసంరక్షణ, చెట్ల పెంపకం ముఖ్య షరతు అయ్యింది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో పర్యావరణ మంత్రిత్వశాఖ ఏర్పడింది. మన దేశంలో ఈ ప్రాజెక్టుల కింద అనేక వనసంరక్షణ, చెట్ల పెంపక పథకాలు వెలిశాయి. ధనిక దేశాలలో కాలుష్య నివారణకు, పెట్టుబడిదారుల అధిక లాభాల పరిరక్షణకు వర్దమాన దేశాల భూమి అడవుల పెంపకంలోనూ, వనసంరక్షణలోనూ ప్రధాన వనరయ్యింది.

ప్రపంచ పర్యావరణ కాలుష్య అదుపుకు స్థావరంగా మారిన భారతదేశంలో కాలుష్య వాయువిడుదలల స్థాయి అంతకంతకు పెరుగుతున్నది. వాయువిడుదలల స్థూలపరిమాణంలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న జపాన్‌ను మన దేశం ఇప్పటికే అధిగమించింది. ప్రపంచ సగటు వాయువిడుదలలో భారతదేశం రెట్టింపయ్యింది. 2005 సం|| గణాంకాల ప్రకారం భారతదేశంలో కాలుష్యవాయువిడుదలలు విద్యుత్‌రంగంలో 55%, ట్రాన్స్‌పోర్టు 9%, పరిశ్రమలలో 31%, ఇతరాలు 5%గా ఉన్నాయి. ప్రైవేటు వాహనాల పెరుగుదలల వల్ల కాలుష్యవాయు విడుదలలు మనదేశంలో 5.6 రెట్లు పెరగగా చైనాలో 3.4 రెట్లు మాత్రమే పెరిగింది.

వాహన కార్బన్‌కాలుష్య అదుపుకు మన కార్లరంగంలో యూరో-1/ఇండియా 2000, యూరో-2/భారత్‌-2, యూరో-3/భారత్‌-3, యూరో-4/భారత్‌-4 ప్రమాణాలు పాటిస్తున్నాము. యూరో ప్రమాణాలు యూరప్‌ దేశానివి. ఐ.ఎస్‌: 1460-2000 మరియు ఐ.ఎస్‌: 2796-2000 డిజిల్‌, పెట్రోల్‌ ఇంధనాల గుణాత్మక విలువలు. ఇది భారత్‌-2కి సమానమైనవి. భారత్‌-3 ప్రమాణాలు 2010లోగా దేశమంతటా అమలు చేయాల్సి ఉండగా భారత్‌-4/యూరో-4 ప్రమాణాల్ని 2010నాటికి 10 మెట్రో నగరాలలో అమలు చేయాల్సి ఉంది. వీటివల్ల చేకూరే కార్బన్‌ వాయు విడుదలల అదుపు ఆ కంపెనీలకు కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్లను సంపాదించి ఇస్తాయి.

ముగింపు: హిల్లరీ క్లింటన్‌ ఇటీవలి భారత్‌ పర్యటనలో వాయువిడుదల కాలుష్యంలో అమెరికా చేసిన తప్పును భారతదేశం చేయవద్దని హితవు పలికింది. ఇంతవరకు కాలుష్యవాయు విడుదలలపై ఏ రకమైన పరిమితులు వర్తించని భారతదేశం ఇక నుండి పరిమితుల్ని అంగీకరంచాలనేదే ఆవిడ అంతరంగం. అందుకోసంగా మన ఆర్థిక అభివృద్ధిని ఫణంగా పెట్టాల్సిఉంది.

కార్బన్‌ ట్రేడింగ్‌ పరిచయం

సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో త్వరితమైన పారిశ్రామికీకరణ కీలకమైంది. విద్యుత్‌, స్టీల్‌, జౌళీ, ఎరువులు తదితర పరిశ్రమలలో వాడుతున్న బొగ్గు, సహజవాయువు, పెట్రోలియంలాంటి శిలాజ ఇంధనాలు, పెరిగిన వినిమయ సంస్కృతి, అడవుల నరికివేత కారణంగా భూ వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్‌(బొగ్గుపులుసు వాయువు), మీథేన్‌, నైట్రస్‌ఆక్సైడ్‌, హైడ్రో, ఫ్లోరో కార్బన్‌లాంటి గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల(గ్యాస్‌ ఎమిషన్స్‌) మితిమీరింది. వీటి కారణంగా భూగోళం వేడెక్కి(గ్లోబల్‌ వార్మింగ్‌) మానవాళికి ముప్పు కలిగిస్తున్న ఎల్‌నినో, అకాల వర్షాలు, ఆమ్లవర్షాలు, దీర్ఘకాలిక కరువులు, భూగర్భ నీటి మట్టాలు తగ్గిపోవటం, మంచుకొండలు కరగటం, నదులు, సముద్రాలు పొంగటం లాంటివి సంభవిస్తున్నాయి.

గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలను అదుపు చేయటానికి 1990 మొదటి భాగంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ సదస్సులో అంతర్జాతీయ ప్రయత్నాలు మొదలయ్యాయి. 1997లో 170 దేశాలు ఆమోదించిన క్యోటో ఒప్పందం(అమెరికా సంతకం చేయలేదు) గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల్ని తగ్గించటానికి వివిధ దేశాలకు కోటాలు(క్యాప్స్‌) నిర్ణయించింది. 2008 నుండి 2012 సం||లలో 1990సం||లోని కార్బన్‌ వాయువుల స్థాయి నుండి 5.2% తగ్గించాలని నిర్ణయించారు.

తాజాగా 2009 జూలై 17న ఇటలీలో జరిగిన 17 దేశాల సదస్సు పార్రిశ్రామికీకరణకు ముందుగా వున్న ఉష్ణోగ్రత కంటే 2 సెల్సియస్‌ డిగ్రీలు మించి ఉష్ణోగ్రత ఉండరాదని నిర్ణయించాయి. 2050 నాటికి గణనీయంగా కార్బన్‌ వాయువిడుదలను నియంత్రించాలన్నాయి. క్యోటో ఒప్పందం చట్టబద్ధమైంది. ఈ ఒప్పందంలో భాగంగా కార్బన్‌ వాయువుల అదుపుకు వివిధ దేశాలకు విధించిన కోటాలను సాధించటం కోసం కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రక్రియను క్యోటో ఒప్పందం ఆమోదించింది.

కార్బన్‌ ట్రేడింగ్‌ అంటే : భూ వాతావరణంలో అత్యధిక స్థాయిలో కార్బన్‌ వాయువిడుదలలో అభివృద్ధి చెందిన దేశాల పాత్ర ప్రధానమైంది. ప్రపంచజనాభాలో అయిదుశాతంగా ఉన్న అమెరికా ప్రపంచ కాలుష్యంలో 26శాతానికి కారణ భూతమైంది. అంతర్జాతీయ ప్యానల్‌ లెక్కల ప్రకారం గ్రీన్‌హౌస్‌ వాయువులు విడిచిపెట్టే దేశాలలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా చైనా 91వ స్థానంలోనూ, భారత్‌ 124వ స్థానంలోనూ ఉన్నాయి. ఉత్తర అమెరికా ఖండం తరువాత యూరప్‌ దేశాలు ప్రపంచ కాలుష్య స్థావరాల్లో ప్రసిద్ధికెక్కాయి.

క్యోటో ఒప్పందం ప్రకారం ఒక అభివృద్ధి చెందిన దేశంకానీ, దానిలోని పరిశ్రమకానీ(అధిక కార్బన్‌ వాయు విడుదలలు కలిగిన దేశం), తక్కువ కార్బన్‌ వాయు విడుదలలు కలిగిన దేశంతో కానీ దానిలోని పరిశ్రమలతోకానీ కార్బన్‌ వాయు విడుదలల మారక ఒప్పందం చేసుకోవచ్చు.

తక్కువ కార్బన్‌ వాయు విడుదలలను ''దృవీకరించబడ్డ కార్బన్‌వాయు విడుదలలు తగ్గింపు'' యూనిట్లు(సర్టిఫైడ్‌ ఎమిషన్‌ రిడక్షన్‌) అంటారు. అంటే ఈ యూనిట్లలో అధిక కార్బన్‌ వాయువిడుదల దేశాలు/కంపెనీలు పెట్టుబడులను పెట్టవచ్చు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే ఒప్పందంలోని రెండు దేశాలు క్యోటో ఒప్పందం అంగీకరించిన దేశాలై ఉండాలి. క్యోటో ఒప్పందం కింద పై ప్రక్రియలో కార్బన్‌ వాయువుల నిల్వలను, తగ్గింపును ''క్లీన్‌ డెవలప్‌మెంట్‌ మెకానిజం'' ద్వారా నిర్వహింపబడుతుంది. ఈ యంత్రాంగం నిర్వహణకు ఒక ఎగ్జిక్యూటీవ్‌ బోర్డు ఏర్పాటు చేయబడింది. తక్కువ ఖరీదులో కార్బన్‌వాయువు అదుపు, కార్బన్‌ నిల్వలు పెంచటమే ఈ మెకానిజం ప్రధాన లక్ష్యం. ఈ మెకానిజం కింద కార్బన్‌వాయువు అదుపు చేసే సందర్భంలో ప్రతి ఒక్క మెట్రిక్‌టన్ను వాయువుకు ఒక యూనిట్‌ క్రెడిట్‌ ఇస్తారు. కార్బన్‌వాయువును ఏమేరకు అదుపుచేసి/నిల్వ చేయగలరో ఆ మేరకు క్రెడిట్‌ యూనిట్ల సంఖ్య పెరుగుతుంది.(చెట్లు ఆక్సిజన్‌ను వదిలి కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకోవటమే కార్బన్‌ నిల్వలు పెరగటం)

కార్బన్‌ క్రెడిట్స్‌ : ఇవి రెండు రకాలు కార్బన్‌ ఆఫ్‌సెట్‌ క్రెడిట్‌, కార్బన్‌ రిడక్షన్‌ క్రెడిట్‌. సంప్రదాయ ఇంధన ఉత్పత్తి పద్ధతులైన వాయు(విండ్‌), సూర్యరశ్మి(సోలార్‌), జల(హైడ్రో) మరియు బయోఇంధనాల ద్వారా అదుపు చేయబడ్డ కార్బన్‌ను కార్బన్‌ ఆఫ్‌సెట్‌ క్రెడిట్‌ కింద, అడవుల పరిరక్షణ, అడవుల పెంపకం, మహా సముద్రాలలోనూ, భూగర్భంలోనూ కార్బన్‌ నిల్వలు పాతిపెట్టే పద్ధతులతో కార్బన్‌ను అదుపు చేయటం కార్బన్‌ రిడక్షన్‌ క్రెడిట్‌ క్రింద పరిగణిస్తారు. ఈ పద్ధతులలో ఆర్జించిన కార్బన్‌ క్రెడిట్లను క్యోటో ఒప్పంద పరిధిలో అభివృద్ధి చెందిన దేశాలతోకానీ లేదా ఆయా దేశాలలోని పారిశ్రామిక కంపెనీలతోకానీ మార్కెట్‌ ధరకు అమ్ముకోవచ్చు. లేదా పెట్టుబడులను స్వీకరించవచ్చు. ప్రపంచవ్యాపితంగా అత్యధిక కార్బన్‌ వాయువిడుదలల దేశాలు/కంపెనీలు ఈ మార్కెట్‌లో కార్బన్‌ విక్రయాలతో తమ కార్బన్‌ వాయువిడుదల రేటును తగ్గించుకుంటున్నాయి. ఈ విధమైన కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్ల వ్యాపారాన్ని కార్బన్‌ ట్రేడింగ్‌ అంటున్నారు. అత్యధిక కాలుష్యకారకులైన ధనికదేశాలు అత్యధిక లాభాలు పొందుతూ, కాలుష్యానికి కారణం కాని వర్ధమాన దేశాలతో కార్బన్‌ విడుదల అదుపు చేయించటమే కార్బన్‌ ట్రేడింగ్‌ సారాంశం.

కార్బన్‌ మార్కెట్‌ : కార్బన్‌ట్రేడింగ్‌ అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన వాణిజ్యంగా రూపుదిద్దుకుంది. 2006వ సం||లో ప్రపంచవ్యాపితంగా 30బిలియన్‌ డాలర్లు ఉన్న కార్బన్‌ మార్కెట్‌ ప్రస్తుతానికి 1 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌గా పరిణామం చెందింది. చైనా, భారతదేశం ఈ మార్కెట్‌లలోని కార్బన్‌ విక్రయాలలో ప్రముఖంగా ఉన్నాయి. యూరప్‌ దేశాలతో కార్బన్‌ ట్రేడింగ్‌ ఎక్కువగా నిర్వహింపబడుతున్నది. కార్బన్‌ మార్కెట్‌లో స్పాట్‌ మార్కెట్‌లు, డెరివెటీవ్‌ మార్కెట్‌లు అమలులో ఉన్నాయి. డెరివెటీవ్‌లలో ప్యూచర్‌లు, ఆక్షన్‌లు ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రపంచబ్యాంక్‌తో సంయుక్తంగా పనిచేసిన ప్రైస్‌వాటర్‌కూపర్‌ అభిప్రాయంలో కార్బన్‌ ట్రేడ్‌ - కాపీరైట్‌, పేటెంట్‌, లైసెన్సింగ్‌ మరియు వాణిజ్య పారిశ్రామిక ట్రేడ్‌మార్క్‌ హక్కులతో సమానమైందన్నారు. నయాఉదారవాద విధానాలలో కార్బన్‌ ట్రేడింగ్‌ ద్వారా భూవాతావరణం కూడా ప్రైవేటీకరించబడుతుందని పర్యావరణవాదులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఫైనాన్షియల్‌ రంగంలో డెరివెటీవ్‌లు సృష్టించిన విలయాన్ని భవిష్యత్‌లో పర్యావరణ రంగంలో కార్బన్‌ ట్రేడింగ్‌ సృష్టిస్తుందని ప్రముఖ పర్యావరణవేత్త లారీలోV్‌ామన్‌ హెచ్చరిస్తున్నారు.

Sunday, November 8, 2009

ఆర్ధిక జీవనం

తాత్విక బోధనలేన్ని చెప్పినా నిత్య జీవితం లో" ఆర్ధిక జీవనం" విడతీయలేని అంతర్భాగం అయింది .. దీనికి పునాది జీవనోపాధి.' కోటి విద్యలు కూటికొరకే ' అనే సామెత అనాదినుండి ప్రాచుర్యం లో వున్న లోకోక్తి. ఈ జీవనోపాధి ప్రస్తుతం మార్కెట్ లో సరుకు గా మారింది .యువత వుపాది కోసం వెంపరలాడు తున్నారు. ఈ వుపాది కల్పన పై అనేక బాహ్య ప్రభావాలు పడుతున్నాయి .ప్రపంచం లో సంభవిస్తున్న అనేక ఆర్ధిక .సామాజిక .రాజకీయ పరిణామాలు మానవ జీవన సరళి ని మార్చుతున్నాయి . వాటిపై నా లో కల్గిన స్పందనలు .చెప్పాలనుకున్న విశ్లేషణ లే ఈ బ్లాగ్గ్ ప్రతి రూపం . స్వీకరించండి ;స్పందించండి .ధన్యవాదాలు

మన్నికయ్యే అభివృద్ధి

పెట్టుబడిదారీ ప్రపం చీ కరణ సృష్టించిన ఆర్థిక, సామాజిక అసమాన తలకు తోడుగా, పర్యావరణ మార్పు దుష్ప్రభావాలు ప్రపంచ మానవ జాతిని వణికిస్తున్న నేపథ్యంలో ''వివిధ అభివృద్ధి నమూనాల'' చర్చలు తెరపైకి వస్తున్నాయి. యుయన్‌డిపి నేతృత్వం లోని ''మానవాభివృద్ధి భావన''(హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌), యూరప్‌ నమూనాగా ప్రాచుర్యం పొందిన ''ఇముడ్చు కోగలిగే అభివృ ద్ధి''(ఇన్‌క్లూసివ్‌ డెవలప్‌మెంట్‌), విశ్వమానవ సిద్ధాంతంగా పిలవబడుతున్న ''సమానత్వ అభివృద్ధి''(ఇక్విటబుల్‌ డెవలప్‌మెంట్‌) సరసన, కొపెన్‌హగెన్‌ ''పర్యావరణ పరిరక్షణ'' చర్చల ప్రభావంతో ''మన్నికయ్యే అభివృద్ధి''(సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌) ప్రాధాన్యతను సంతరించుకున్నది.

చారిత్రక నేపథ్యం: ఐక్యరాజ్య సమితి నియమించిన ''పర్యావరణ మరియు అభివృద్ధి'' ప్రపంచ కమీషన్‌ బ్రన్డ్‌ట్లాన్డ్‌ కమీషన్‌గా 1987లో ''మన సమిష్టి భవిష్యత్‌''పేర ''అభివృద్ధిపై పర్యావరణ ప్రభావాలను'' విశ్లేషిస్తూ నివేదికను సమర్పించింది. అంతర్జాతీయ అసమానతలు, పేదరిక మూలాల్ని స్పృశించకుండా పర్యావరణ దుష్ప్రభావాలను నివారించే ప్రయత్నాలు వ్యర్ధమని చెప్తూ, నివేదిక ''మన్నికయ్యే అభివృద్ధి'' భావనను మొదటిసారిగా పరిచయం చేసింది. 1992లో నిర్వహించబడ్డ ''రియో భూగోళ సదస్సు''లో, పర్యావరణ మార్పు ముప్పుతో అభివృద్ధిపై వ్యక్తమవుతున్న వివిధ దేశాల భయాందోళనలను నివారించే ప్రయత్నంలో భాగంగా ''మన్నికయ్యే అభివృద్ధి'' సాధనకు ఒక కమీషన్‌ నియమింపబడింది. అప్పటి నుండి పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలు అంతర్జాతీయ పర్యావరణ చట్టాల్లో చోటు చేసుకోవటంతోపాటు, 2002లో జొహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన ప్రపంచ భూగోళ సదస్సు ''మన్నికైన అభివృద్ధి''పై ప్రత్యేకంగా చర్చించి, కార్యాచరణల్ని రూపొందించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ''మన్నికయ్యే అభివృద్ధి ప్రపంచ కమీషన్‌'' ఈ కార్యాచరణల్ని వార్షికంగా సమీక్షిస్తుంది. ఈ కమీషన్‌ 17వ సమావేశం మే 2009లో న్యూయార్క్‌లో జరిగింది.

మన్నికైన అభివృద్ధి అంటే?: పైన పేర్కొన్న వివిధ సదస్సుల్లో రూపొందిన భావనను బట్టి సారాంశంగా ''భవిష్యత్తరాల అవసరాలు తీర్చగలిగే సామర్ధ్యాలపై ఎటువంటి రాజీ లేకుండా, ప్రస్తుత తరాల అవసరాల్ని తీర్చగలిగే అభివృద్ధే'' మన్నికైన అభివృద్ధిగా నిర్వచిస్తున్నారు. మన్నికను విస్తృతార్ధంలో భరించగల సామర్ధ్యంగా చెప్పుకుంటాం. అందువలన పర్యావరణ పరిరక్షణ, సామాజిక, ఆర్ధికాభివృద్ధులు ''మన్నికయ్యే అభివృద్ధి''కి మూడు మూలస్థంభాలుగా ఉన్నాయి. ఇవి పరస్పరాధారితాలై, వాటి సమన్వయ సాధనే మానవ మనుగడ లక్ష్యాలుగా మారుతున్నాయి. మన్నికయ్యే వ్యవసాయం, మన్నికయ్యే పరిశ్రమలు, మన్నికయ్యే ఆర్ధికాభివృద్ధులు, పర్యావరణ పరిరక్షణకు లోబడి జరిపే సమిష్టి సాధనే ''మన్నికైన అభివృద్ధి'' అవుతుంది.

అవాంతరాలు: మన్నికయ్యే అభివృద్ధి కార్యాచరణ రూపొందినా పెట్టుబడిదారీ విధాన చట్రంలో ఆచరణలో అది సఫలీకృతమవటం లేదు. ఒక వైపు ద్రవ్యపెట్టుబడి ఆధిపత్యంలోని నయా ఉదారవాద విధానాలు సామాజిక, ఆర్ధిక అంతరాల్ని తీవ్రంగా పెంచుతుండగా, మరోవైపు శిలాజ ఇంధనాల విచక్షణా రహిత వినియోగం పర్యావరణ ముప్పుకు కారణమవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల్ని పెంచుతున్నది. లాభార్జనే ధ్యేయంగా సంపన్న దేశాలు, సంపన్న వర్గాలు బాహాటంగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియల మూలకంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం, ఇంధన సంక్షోభం, ద్రవ్య సంక్షోభం, ఆర్ధిక మాంద్యం, పర్యావరణ సంక్షోభాలు విలయతాండవం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 9 కోట్ల జనాభా పెరుగుతూ, 96.3 కోట్ల మంది ఆకలితో, పౌష్టికాహార లేమితో అలమటిస్తున్నారు. మన్నికయ్యే అభివృద్ధిలో వ్యవసాయాభివృద్ధికి, గ్రామీణాభివృద్ధికి సముచిత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం అనివార్యమయింది.

Thursday, November 5, 2009

MIGRATION & INDIA

మానవ వలసల తీరుతెన్నులు

ప్రపంచవ్యాప్తంగా మానవ వలసలపై ఉండే ఆంక్షల్ని, అవరోధాల్ని సడలించాలనే ప్రతిపాదనను సమర్థించే దిశలో మానవాభివృద్ధి నివేదిక 2009 మరో రెండు కారణాలని ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్త జనాభా విస్తరణ, పర్యావరణ మార్పుల ప్రభావాలు మానవ వలసల అనివార్యతను నొక్కిచెప్తున్నాయి.

1) జనాభా విస్తరణ: 2050లోగా ప్రపంచ జనాభా ఇప్పటికంటే 1/3వ వంతు పెరిగే అవకాశాలున్నాయి. ఈ పెరుగుదల అభివృద్ధి చెందిన దేశాలలో 2020 నాటికి గరిష్ట స్థాయికి చేరి, ఆతరువాత కాలంలో 7% పతనమయ్యే ప్రమాదమున్నదని నివేదిక చెప్తున్నది. ప్రపంచ జనాభాలో ఆఫ్రికా దేశాల్ని మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా 15 సం||ల లోపు పిల్లల కంటే, 60 సం||లు పైబడ్డ వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2050 నాటికి ప్రపంచంలో పని చేయగలిగే వారి సంఖ్య 1.1 బిలియన్‌లు పెరగవచ్చు. ప్రస్తుత వలసల స్థాయి కొనసాగితే 2050 నాటికి అభివృద్ధి చెందిన దేశాలలో పని చేయలేని వారు 71% ఉండవచ్చునని, వలసలను నిరోధిస్తే ఈ శాతం 78కి పెరగవచ్చునని నివేదిక అంచనా వేస్తున్నది. దీన్ని అధిగమించటానికి ఎంత శాస్త్ర,సాంకేతికాభివృద్ధి సాధించినా, మానవ శ్రమశక్తి డిమాండ్‌ అనివార్యంగా పెరిగి, 19వ శతాబ్ధంలోలాగా వలసలకు ప్రోత్సాహకాలనివ్వాల్సిన అగత్యం ఏర్పడుతుందని నివేదిక హెచ్చరిస్తున్నది.

2) పర్యావరణ మార్పు: గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలలు సృష్టించే సవాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా రానున్న కాలంలో 200 మిలియన్‌ల నుండి 1 బిలియన్‌ వరకు ప్రజానీకం సమస్యాత్మక ప్రాంతాల నుండి రక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపధ్యంలో మానవ వలసలపై అంతర్జాతీయ సడలింపులు తప్పనిసరి అవుతాయని నివేదిక అభిప్రాయపడుతుంది.

వలసల వల్ల ప్రయోజనాలు పొందుతున్న వలస ప్రజలు, వారి దేశాలు: మానవాభివృద్ధి పరిశోధనల్లో సంపన్న దేశాలలోని వలస ప్రజల మానవాభివృద్ధి, వారి సొంత దేశాలలో మానవాభివృద్ధికంటే 24% ఉంది. వలస ప్రజలలో మహిళలు అత్యధిక నిధుల్ని స్వంత దేశాలకు పంపుతున్నారు. వలస ప్రజల వల్ల వర్ధమాన దేశాలకు అభివృద్ధి చెందిన దేశాల నుండి 2008లో 308 బిలియన్‌ డాలర్ల నిధి బదిలీ అయ్యింది.

ఆర్ధికమాంధ్యం కారణంగా 2009లో ఈ నిధులు 293 బిలియన్‌ డాలర్లకు పడిపోవచ్చు. అభివృద్ధి దేశాలకు తరలి వస్తున్న వలస ప్రజల విదేశీ మారక ద్రవ్యం ఆయా దేశాల 'అధికారిక అభివృద్ధి సహాయనిధి'కి 4 రెట్లు ఉంది. వలస ప్రజల కుటుంబాలలో బాల కార్మికుల సంఖ్య తగ్గటంతోపాటు శిశు మరణాల శాతం, స్కూళ్ళకు వెళ్ళే పిల్లలలో డ్రాపౌట్‌ల శాతం తగ్గాయి. వలస ప్రజల కుటుంబాలు ప్రత్యేకించి మహిళలు స్థానిక సంస్థలలోను, రాజకీయ, సామాజిక రంగాలలోనూ భాగస్వామ్యం కావటం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో అంతర్గత వలసల వల్ల గృహసంబంధ పేదరిక రేటు 2001-02 నుండి 2006-07కు 50శాతంకు తగ్గింది. ఇండోనేషియాలో 50శాతం గృహాల్లో వలస ప్రజలు ఉన్నారు. వారిలో పేదరిక రేటు 34 నుండి 19 శాతానికి తగ్గింది. పై విధంగా వలస ప్రజలు కొన్ని కోణాల్లోనైనా అవకాశాల్ని పెంచుకొని ప్రయోజనాల్ని పొందుతున్నారు.

ఈ ప్రయోజనాలు అందరిలో సమానస్థాయిలో లేవు. వ్యక్తులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులు, స్వదేశీ, ఆతిధ్య దేశాల్లోని ప్రభుత్వాల విధానాలు ఈ ప్రయోజనాల్ని తగ్గించేస్తున్నాయి. అసమానతలు పెరుగుతున్నాయి. ఘర్షణ, అక్రమ మానవ రవాణాల్లోని ప్రజలు ప్రపంచ వలస ప్రజల్లో అతిస్వల్ప సంఖ్యగా ఉన్నా ప్రపంచ సభ్యతకు ఈ పరిణామాలు కళంకంగానే ఉన్నాయి. వలస ప్రజల అభివృద్ధికి అవరోధాల్ని నివారించగలిగితే వలస ప్రజల మానవాభివృద్ధిలో గణనీయమైన ప్రగతిని సాధించగలమని మానవాభివృద్ధి నివేదిక 2009 గట్టిగా నమ్ముతున్నది.

వలసల వల్ల ఆతిధ్యదేశాలు పొందుతున్న ప్రయోజనాలు: గత 50 సం||లుగా అభివృద్ధి చెందిన దేశాలలో వలస ప్రజల సంఖ్య పెరుగుతూనే ఉంది. అతిథ్య దేశాల అభివృద్ధిలో వలస ప్రజల పాత్ర అనేక దశల్లో కీలకంగా మారింది.

వలస ప్రజల్లో 1 శాతం పెరిగితే, ఆ దేశ స్థూలదేశీయోత్పత్తి 1 శాతం పెరుగుతుందని నివేదిక విశ్లేషిస్తున్నది. పర్షియన్‌ గల్ఫ్‌ దేశాలలో వలస ప్రజలు ఆదేశ స్థూలదేశీయోత్పత్తిని పెంచటంలో ముందున్నారు. ప్రత్యేకించి ఖతర్‌ దేశంలో ప్రతి ఐదుగురిలో నలుగురు వలస ప్రజలే. ఆ దేశాభివృద్ధి వీరిపైనే ఎక్కువ ఆధారపడి ఉంది. 1950 నుండి 2000 వరకు అమెరికా విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న విదేశీయులు స్థానిక ప్రజల సృజనాత్మకతను దెబ్బతీయకుండా తలసరి పేటెంట్ల సాధనలో 15 శాతం అభివృద్ధిని సాధిస్తున్నారు. అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 40 మిలియన్‌ల మంది వలస ప్రజలు నివశిస్తున్నారని నివేదిక చెప్తున్నది.

వలసలపై మానవాభివృద్ధి నివేదిక 2009 ప్రతిపాదించిన కార్యాచరణ-ఎజెండా: ఈ నేపథ్యంలో మానవాభివృద్ధి నివేదిక ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్‌లో కీలకంగా మారనున్న వలస ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చటం కోసం ఈ క్రింది ఎజెండాను ప్రపంచ దేశాల ముందు పరిశీలనకు సమర్పించింది.

అంశాలు:1) నైపుణ్య కార్మికులను తీసుకుంటున్న ప్రస్తుత స్థాయికి మించి అల్ప నైపుణ్య కార్మికుల్ని పనిలోకి వివిధ దేశాలు తీసుకోవాలి. 2) వలస ప్రజలందరికి ప్రతి దేశం విద్య, వైద్యం, ఓటు హక్కులాంటి ప్రాథమిక సేవలను పొందగలిగే ప్రాథమిక మానవహక్కులను కల్పించాలి. 3) వలస ప్రజల రవాణా, లావాదేవీల వ్యయాన్ని తగ్గించాలి. 4) అతిథ్య దేశాలకు, వలస ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పరిష్కార మార్గాలు వెతకాలి. 5) అంతర్గత వలసల ద్వారా పొందుతున్న ప్రయోజనాల్ని విస్తృత పర్చాలి. 6) వలసలు ఆయా సొంత దేశాల అభివృద్ధి వ్యూహాలలో ఒకటిగా చేర్చాలి.

వలసలు-భారతదేశం: మన దేశంలో 42 మిలియన్‌ల అంతర్గత వలస ప్రజలు ఉన్నారని నివేదిక చెప్తున్నది. వీరిలో 21 మిలియన్‌లు అభివృద్ధి పేర నిర్వాశితులైన ప్రజలే. మన దేశంలో విదేశీ వలస ప్రజలు మన జనాభాలో 0.5శాతమే. వీరిలో 48.6 శాతం మహిళలు. విదేశాలలో ఉన్న మన దేశ వలస ప్రజలు మన జనాభాలో 0.8 శాతం(2000-02). అంతర్జాతీయ మానవ చలనాలు 1.4 శాతం(2000-02)గా ఉన్నాయి. మన దేశం నుండి వెళ్ళిన వలస ప్రజలలో అత్యధిక మానవాభివృద్ధి దేశాల్లో 47.9శాతం, అధిక మానవాభివృద్ధి దేశాల్లో 20.4శాతం, మధ్యస్థాయి మానవాభివృద్ధి దేశాల్లో 30.7శాతం, అత్యల్ప మానవాభివృద్ధి దేశాల్లో 1శాతం ఉన్నారు.మన దేశం నుండి సంపన్న దేశాలకు వలస వెళ్ళిన వారిలో అధిక విద్యార్హతలు కలిగిన వారు 51.2 శాతం ఉన్నారు.

భారతదేశానికి వలస ప్రజల నుండి వస్తున్న ఆదాయం 35, 262 మిలియన్‌ డాలర్లు. ఇది స్థూలదేశీయోత్పత్తిలో 3.1శాతం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిష్పత్తిలో 1.5 ఉంది. ఈ నిధుల్లో 58.26శాతం ఆసియా నుండి, 26.9 శాతం ఉత్తర అమెరికా నుండి, 12.8 శాతం యూరప్‌ దేశాల నుండి వస్తున్నాయి.

ముగింపు: ప్రపంచ జనాభాలో అంతర్జాతీయ వలస ప్రజలు 3 శాతం ఉంటే మన దేశంలో 0.5శాతం ఉన్నారు. దీన్ని బట్టి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, విదేశీయులను ఆకర్షించగల స్థాయిలో మన దేశాభివృద్ధి లేదని విదితమవుతుంది. అదే సమయంలో మన దేశం నుండి విదేశాలకు వలస వెళ్ళే ప్రజల శాతం కూడా ప్రపంచ సగటు కంటే(3శాతం) తక్కువగా ఉంది. భారతదేశంలోని పేద ప్రజానీకం అంతర్జాతీయ వలస ప్రయోజనాల్ని పొందలేకపోవటంగా ఈ పరిణామం తెలియచెప్తుంది. అత్యధిక విద్యార్హతలు కలిగిన వారికి స్వదేశంలో అవకాశాల్లేక విదేశాలకు వెళ్ళటంగా పై గణాంకాలు తెలియచేస్తున్నాయి.