Sunday, December 27, 2009

వాయువిడుదలలు - జరిమానాలు

పర్యావరణ పరిరక్షణకు నడుంకట్టిన క్యోటో ఒప్పందాన్ని అటకెక్కించటానికే ''కొపెన్‌హగెన్‌ అంగీకారం'' కుదిరిందని, చట్టబద్ధత లేకున్నా దశాబ్ధాలుగా ప్రపంచ దేశాలు, శాస్త్రవేత్తలు శ్రమించి సాధించిన క్యోటో ఒప్పందంలోని విలువైన మౌళికాంశాల్ని నీరుకార్చడంలో సంపన్నదేశాలు సఫలమయినాయని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోపక్క కొపెన్‌హగెన్‌లో జరిగిన పర్యావరణ మార్పు సదస్సు అర్థాంతరంగా ముగిసి అభాసుపాలు కాకుండా తన చతురతతో కనీసం ఒక రాజకీయ ఒప్పందాన్నైనా కుదర్చగలిగానని అమెరికా అధ్యక్షులు బారక్‌ ఒబామా కీర్తించుకుంటున్నారు

క్యోటో ఒప్పందం-జరిమానాలు - సంపన్న దేశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన గ్రీన్‌ హౌస్‌ వాయు విడుదలల కర్తవ్యాన్ని నిర్ధేశించి వర్థమాన దేశాలను ఆ వాయువిడుదలల తగ్గింపు బాధ్యత నుండి మినహాయించిన క్యోటో ఒప్పందంలోని కీలకాంశాన్ని, ''వాయు విడుదలల తగ్గింపు అందరి బాధ్యత'' అనే అంశంతో కొపెన్‌హగెన్‌ అంగీకారం తుడిపేసింది. క్యోటో ఒప్పందం చట్టబద్ధత కలిగినదైన, ఆ కాలానికి వాయువిడుదలల పరిమాణం లెక్కింపులో తగినంత సాంకేతిక అభివృద్ధిగాని, ఒప్పందనిర్ణయాలు అమలు చేయగల సంస్ధగత ఏర్పాట్లుగాని, జాతీయ కార్యాచరణలుగాని అంతగాలేవు కాని కొపెన్‌ హగన్‌ సదస్సు నాటికి, కొపెన్‌ హగన్‌ అంగీకారానికి చట్టబద్ధత లేకపోయినప్పటికి వాయువిడుదల పరిణామం లెక్కింపులో సాంకేతిక అభివృద్ధి, జాతీయ ప్రభుత్వాలు నిర్ణయాలను అమలు చేయగల సంస్ధాగత ఏర్పాట్లతో, సమాచారాన్ని పంచుకొనే జాతీయ కార్యాచరణను కల్గిఉన్నాయి. క్యోటో ఒప్పందంపై 2001లో బాన్‌లో జరిగిన 6వ వివిధ పక్షాల సమావేశంలో, వాయువిడుదలల తగ్గింపు లక్ష్యాన్ని సాధించని సంపన్న దేశాలపై విధించాల్సిన జరిమానాపై నిర్ణయం జరిగింది.

ఆ నిర్ణయం ప్రకారం ఏదైనా సంపన్న దేశం క్యోటో ఒప్పందం నిర్ధేశించిన వాయు విడుదలల తగ్గింపు లక్ష్యాన్ని, ఏదైన ఒక సంవత్సరంలో చేరలేకపోతే లోటైన వాయువిడుదలల పరిమాణానికి 130 శాతం మేరకు తదుపరి సంవత్సరంలో అదనంగా వాయువిడుదలలని తగ్గించాల్సిఉంటుంది. ఉదాహరణకు ఒక సంవత్సరంలో ఒక సంపన్నదేశం ఒక మెట్రిక్‌ టన్ను కార్బన్‌ వాయు పరిమాణం లక్ష్యం కంటే తగ్గితే, తదుపరి సంవత్సరం 1.3 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ వాయువిలువలలను అదనంగా తగ్గించాలి కాని ఈ వాయువిడుదలల తగ్గింపుపై విధించాల్సిన జరిమానా అమలుచేసే చట్టబద్ధ ప్రక్రియ ఏర్పాటు చేయటంలో నెలకొన్న లోపాలతో క్యోటో ఒప్పందం విఫలమైన కారణంగా సంపన్న దేశాలు బాహాటంగా వాయువిడుదలల తగ్గింపు లక్ష్యాల్ని ధిక్కరించాయి.

క్యోటో ఒప్పందంలో సంపన్న దేశాలకే పరిమితమైన ఈ జరిమానాలను, ''కొపెన్‌హగన్‌ అంగీకారం'' లో మారిన పరిస్థితులలో ''అంతర్జాతీయ సంప్రదింపులు మరియు విశ్లేషణ'' పేర వర్థమాన దేశాలపై వాయువిడుదలల తగ్గింపు నియంత్రణలను జరిమానాలను ఎక్కుపెట్టి, వాయువిడుదలల తగ్గింపు బాధ్యతల నుండితప్పుకోవటానికి సంపన్న దేశాలు సమాయత్తమవుతున్నాయి. కొపెన్‌హగన్‌ అంగీకారం కుదిరిన వెంటనే అమెరికా అధ్యక్షుడైన బారక్‌ ఒబామా సలహాదారుడు భారత్‌ చైనాలపై చేసిన వ్యాఖ్యలను ఈ దిశలో పరిశీలించాలి

లాభార్జనదుగ్ధతో సంపన్నదేశాలు- ''సమిష్ఠి లక్ష్యం వివిధ దేశాల విభిన్న బాధ్యతలు'' అనే పునాదిపై నిర్మించబడ్డ క్యోటో ఒప్పందం, కొపెన్‌హగన్‌ అంగీకారంలో ఆ పునాది ''సమిష్ఠి లక్ష్యం వివిధ దేశాల విభిన్న స్పందనలు'' గా మారిపోయింది.

కొపెన్‌హగన్‌ సదస్సు సందర్భంగా సంపన్న దేశాల వాయువిడుదలల లక్ష్యాల్ని ప్రభావితం చేయాలనే వ్యూహంతో అభివృద్ధి చెందుతున్న బేసిక్‌ దేశాలు (బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, ఇండియా, చైనా) క్యోటో ఒప్పందం ప్రకారం తమకు బాధ్యత లేకున్నా ఐచ్ఛికంగా వాయువిడుదలల తగ్గింపు లక్ష్యాన్ని ప్రకటించినప్పటికి, సంపన్న దేశాలు తాము ప్రకటించిన లక్ష్యాల్ని ఇసుమంతకూడా మార్పుచేయకుండా మొండిగా వ్యవహరించాయి. రెండు సంవత్సరాల క్రితం బాలీ కార్యాచరణ ప్రణాళికను ఒప్పుకున్న సంపన్న దేశాలు దాని స్పూర్తిని తుంగలో తొక్కాయి. సంపన్నదేశాలు ప్రకటించిన గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల తగ్గింపులతో, గరిష్ఠ వాయువిడుదలల సంవత్సరం 2015 నాటికిగాని అమలుకాదని, అలా జరిగితే 2020 నాటికి వాతావరణ ఉష్ణోగ్రత 3డిగ్రీలు దాటి ప్రమాద ఘంటికల్ని మోగిస్తుందని సమావేశ సందర్భంగా ఐక్యరాజ్య సమితి రహస్య నివేదిక అభిప్రాయపడింది.

అంతేకాకుండా సదస్సు సందర్భంగా ప్రకటించిన వర్థమాన దేశాల వాయువిడుదలల తగ్గింపు పరిమాణం 5.2 బిలియన్‌ టన్నలుండగా సంపన్నదేశాల ప్రకటనల ప్రకారం వాయువిడుదలల తగ్గింపు పరిమాణం 2.1 నుండి 3.4 బిలియన్‌ టన్నులు మాత్రమే ఉన్నట్లు ఆ రహస్య నివేదిక భావించింది. గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల ప్రభావం మానవాళిపై ఎంతో తీవ్రంగా ఉందని శాస్త్రవేత్తలు ఘోషించినా, సంపన్న దేశాలు లాభార్జనదుగ్ధతో అనుసరిస్తున్న నిర్లక్ష్య, బాధ్యతారహిత వైఖరిని ప్రపంచ ప్రజానికం ముందు ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వంచనను ప్రతిఘటించాలి- ''కొపెన్‌హగన్‌ అంగీకార పత్రంలో చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకోవటానికి గడువుతేదిగా డిసెంబర్‌ 2010ని ప్రకటించినా తుది పత్రంలో ఈ గడువు తేది తొలగించబడినట్లు తెలుస్తోంది. క్యోటో ఒప్పందంలో ఉన్న 1990 గరిష్ఠ వాయువిడుదలల సంవత్సరాన్ని సంపన్న దేశాలకు అన్వయించగా కొపెన్‌హగన్‌ అంగీకార పత్రంలో గరిష్ఠ వాయువిడుదలల ప్రస్థావన లేదు.ఈ అంశాన్ని సరిజేయటం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం. అదే సందర్భంగా క్యోటో ఒప్పందంలోని వాయువిడుదలల తగ్గింపుపై సంపన్న దేశాలపై ఉన్న జరిమానాలు, చట్టబద్ధ అమలు తప్పనిసరిగా భవిష్యత్‌ ఒప్పందంలో ఉంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. జి 77 దేశాలతోను, చిన్న ద్వీపకల్ప దేశాలతోను కలసి బేసిక్‌ దేశాలు భవిష్యత్‌లో మెక్సికోలో జరిగే ఒప్పంద రూపకల్పనలో ఐక్యంగా పనిచేయాలి. స్థానిక ప్రయోజనాలకు బేసిక్‌ దేశాలు కక్కుర్తి పడితే విశ్వమానవ సంక్షేమానికి తీవ్రవిఘాతం ఏర్పడుతుంది. చరిత్ర క్షమించదు.

Sunday, December 20, 2009

గరిష్ట వాయు విడుదలల సంవత్సరం

త 12రోజులుగా పర్యావరణ మార్పుపై డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హాగన్‌ నగరంలో జరుగుతున్న ప్రపంచదేశాల సమావేశంలో 193దేశాల ప్రతినిధులు, అధినేతలు హాజరైనారు. క్యోటో సదస్సులో గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల తగ్గింపుపై విధిగా కాలుష్యకారకులైన సంపన్నదేశాలు (ఎనేగ్జ్‌-1దేశాలు) అమలు చేయాల్సిన వాయు విడుదలల తగ్గింపు లక్ష్యాలను నిర్దేశించింది. అదే సమయంలో వర్ధమాన దేశాలను ఈ తగ్గింపు బాధ్యతనుండి మినహయించింది. ఈదేశాలు పర్యావరణ కాలూష్యానికి అనాదిగా కారణం కాదన్నది క్యోటో ఒప్పంద అవగాహన. దీనికి భిన్నంగా కోపెన్‌హెగెన్‌ సదస్సులో పరోక్షంగా చర్చించబడ్డ డెన్మార్క్‌ ముసాయిదా వర్ధమాన దేశాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఆ ముసాయిదాలో వర్దమాన దేశాలు కూడా ''గరిష్ట వాయు విడుదల సంవత్సరాన్ని'' పాటించాలనే అంశం వారి నిరసనలకు కారణమై, భారత్‌తో సహా నాన్‌ ఎనెక్స్‌-1 దేశాలు ఈ ముసాయిదాను ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ''గరిష్ట వాయు విడుదలల సంవత్సరం'' అంటే ఏమిటి..., ఇది వివిధ దేశాల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశాన్ని పరిశీలిద్దాం.


గరిష్ట వాయు విడుదలల సంవత్సరం

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధలో దశాబ్ధ కాలం వాయు విడుదల సగటును నిర్ధారణగా గరిష్ఠ వాయు విడుదల ప్రమాణాన్ని గుర్తిస్తారు. ఆలా గుర్తించిన గరిష్ఠ వాయు విడుదల సంవత్సరము నుండి ప్రతి సంవత్సరము ఒక నిర్దిష్ట ప్రమాణంలో వాయు విడుదలలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గ్రీన్‌హౌస్‌ వాయువులు గరిష్ట స్ధాయిలో ఉండే సంవత్సరాన్ని ''గరిష్ట వాయు విడుదలల సంవత్సరం'' లేదా ''పీక్‌ ఇయర్‌ ఆఫ్‌ ఎమిషన్స్‌'' అని అంటారు. అంటే ఆ వాయువులను విడుదల చేసే శిలాజ ఇంధనాల వినియోగాన్ని గరిష్టంగా ఆ నిర్దిష్ట సంవత్సరానికి పరిమితం చేసి, ఆ తర్వాతి కాలంలో వాటి వినియోగాన్ని క్రమపద్ధతిలో తగ్గించడమే గరిష్ట వాయు విడుదలల సంవత్సర సారాంశం.

వర్దమాన దేశాలపై ప్రభావం...

పైన చెప్పుకున్నట్లు నిర్దిష్ట సంవత్సరానికి గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలను తగ్గించడ మంటే శిలాజ ఇందన వినియోగాన్ని తగ్గించడమే గాకుండా వాయు విడుదల తగ్గింపును అంగీకరించడమే. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడమంటే శిలాజ ఇంధనాల ద్వారా జరిగే ఉత్పత్తిని తగ్గించడం గానూ, లేదా ప్రత్యామ్నాయ పునరుద్ధరణ ఇంధనవనరులతో పారిశ్రామికోత్పత్తిని మార్చుకోవడంగా చూడాలి. ఇది చాలా వ్యయపూరితమైనది డెన్మార్క్‌ ముసాయిదా ప్రకారం వర్దమాన దేశాలు గరిష్ట వాయు విడుదలల సంవత్సరాన్ని పాటించాలంటే ఆ దేశాల వాయు విడుదలలపై పరిమితులు పెట్టడమే. ఇది క్యోటో ఒప్పంద స్పూర్తికి భిన్నమైనది.

ఉదాహరణకు భారతదేశంలో 80 శాతం ప్లాంట్‌లోడ్‌ ఫ్యాక్టర్‌ కలిగిన బొగ్గు ఆధారతి విద్యుత్‌ కేంద్ర స్ధాపనలు ఒక మెగావాట్‌కు రూ. 5 కోట్లు సరిపోతే, అదే సౌరశక్తితో కేవలం 25 శాతం ప్లాంట్‌లోడ్‌ ఫ్యాక్టర్‌తో ఒక మెగావాట్‌ విద్యుత్‌ కేంద్రానికి 20-25 కోట్ల రూపాయలు వ్యయం అవుతోంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్ర సామర్థ్యానికి సమానమైన సౌరశక్తి విద్యుత్‌కేంద్ర స్థాపనకు బొగ్గు ఆధారితి కేంద్రం కంటే 12-15 రెట్టు అధికంగా పెట్టుబడి అవసరం అవుతోంది. అందుకనే వర్దమాన దేశాలు పర్యావరణ ముప్పు నుండి తట్టుకుని అభివృద్ధి చెందడానికి భారీస్థాయిలో పరిహారాన్ని, పరిజ్ఞానాన్ని సంపన్న దేశాల నుండి కోరుతున్నాయి. రియో సదస్సు సందర్భంగా క్యూబా మాజీ అధ్యక్షులు ఫైడల్‌ క్యాస్ట్రో ''ఈ పరిహారాన్ని సంపన్నదేశాలు, వర్దమానదేశాలకు చెల్లించాల్సిన బాకీ''గా అభివర్ణించారు.

కోపెన్‌హెగెన్‌ సదస్సులో ఆఫ్రికా దేశాల బృందం ఈ పరిహారం కింద షరతులు లేని 70 వేల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని కోరింది. అమెరికా ప్రతిపాదించిన 10 వేల కోట్లు, యూరోప్‌ ప్రతిపాదించిన వంద కోట్ల డాలర్ల లాంటి సంపన్నదేశాల సహాయం నామమాత్రమే. భారత్‌, చైనాలు 2005 స్థాయికి 2020లోగా వాయువిడుదలను తగ్గించాలనే ప్రతిపాదనలు ఐచ్ఛికంగా గరిష్టవాయు విడుదల సంవత్సరాన్ని అంగీకరించడమే.

సంపన్నదేశాలపై ప్రభావం...

గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలోని కార్బన్‌డయాక్పైడ్‌ 1750 సంవత్సరం నాటికి 280 పిపిఎంలు ఉండగా 2004 నాటికి 387 పిపిఎంలు ఉంది. గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో 75% ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌ ప్రధానంగా భూగోళ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణభూతమవుతోంది. క్యోటో ఒప్పందంలో 1990 నాటి ఉష్ణోగ్రత కన్నా 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రత పెరిగితే మానవాళికి ముప్పుగా భావించారు. ఇందుకోసమే భూగోళ ఉష్ణోగ్రతలు 1990 నాటి ఉష్ణోగ్రతలకు 2 డిగ్రీలు మించకుండా కార్బన్‌ వాయువిడుదల తగ్గించాలని ప్రతిపాదించారు. అందువల్లే క్యోటో ఒప్పందం కాలుష్య వాయు విడుదలలకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు 1990 వాయు విడుదలల స్థాయి నుండి 2012లోగా 5.2 శాతం తగ్గించాలని ఉద్దేశించింది.

అంటే క్యోటో ఒప్పందం ప్రకారం సంపన్నదేశాలు 1990ని గరిష్ట వాయువిడుదల సంవత్సరంగా భావించాయి. కాని కోపెన్‌హెగెన్‌ సదస్సు నాటికి 5.2% వాయు విడుదల తగ్గింపు లక్ష్యం నిర్లక్ష్యం చేయబడింది. వాయువిడుదలలు మరింతగా 10% పెరిగాయి. ప్రస్తుత సదస్సు సందర్భంగా అమెరికా 2005 స్థాయి నుండి 17% వాయు విడుదలలను 2020కు తగ్గిస్తానంది. అంటే క్యోటో ఒప్పందం నిర్దేశించిన గరిష్ట వాయు విడుదలల సంవత్సరాన్ని మార్చడానికి అమెరికా తెగించింది. అదే సందర్భంలో ఈ ప్రతిపాదనను 1990 స్థాయి వాయు విడుదలలలో 3% కంటే లేదు. మిగిలిన సంపన్న దేశాల తీరు కూడా అటుఇటుగా క్యోటో ఒప్పంద లక్ష్యాల్ని నీరు గార్చేటట్టుగా ఉంది. గరిష్ట వాయు విడుదలల సంవత్సరాన్ని క్యోటో ఒప్పందంలోని 1990 నుండి 2005కు మార్చటం సంపన్నదేశాలకు ప్రయోజనకరం.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పర్యవసానంగా 1990 నుండి 2005 మధ్యకాలంలో అనేక సంపన్నదేశాలు వారి పారిశ్రామిక స్థావరాలను తరలించిన కారణంగా చైనా, భారత్‌, బ్రెజిల్‌, సౌత్‌ ఆఫ్రికా వంటి దేశాల కార్బన్‌ వాయు విడుదలల స్థాయి, తీవ్రత పెరిగింది. ఎనెక్స్‌-1 దేశాల సరసన ఈ దేశాలను చేర్చి గ్రీన్‌హౌస్‌ వాయువిడుదల బాధ్యతను దింపుకోవడానికి అమెరికా సారథ్యంలోని అనేక సంపన్న దేశాలు నడుంకట్టాయి.

అందుకనే కోపెన్‌హెగెన్‌ సదస్సులో క్యోటో ఒప్పందాన్ని అటకెక్కించడానికి సంపన్నదేశాలు చేయని ప్రయత్నం లేదు. సంపన్నదేశాలన్నీ కలిసి ఇప్పటివరకూ ప్రతిపాదించిన వాయు విడుదలల తగ్గింపులు భూగోళ వాతావరణ ఉష్ణోగ్రతలను 3డిగ్రీల నుండి 4డిగ్రీల వరకూ పెంచుతాయనే నిపుణుల అంచనా పరిస్థితుల తీవ్రతను తెలుపుతోంది. వాతావరణంలో ఒక డిగ్రీ పెరుగుదల భారతదేశంలో కనీసం 10% గోధుమల ఉత్పత్తితో పాటు ఇతర ఆహార పంటల దిగుబడులను తగ్గిస్తాయని, ఆహార భద్రతకు తీవ్ర విఘాతం తెచ్చిపెడతాయని ప్రముఖ వ్యవయసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌ స్వామినాథన్‌ అభిప్రాయపడుతున్నారు.

ముగింపు:- విశ్వ మానవ సౌభాగ్యానికి దోహదపడాల్సిన అమెరికా రియో సదస్సునుండి ప్రపంచ మానవాళి విధ్వంసానికి కారణమవుతున్న పర్యావరణ మార్పుపై క్రమం తప్పకుండా అనుసరిస్తున్న వైఖరిని కోపెన్‌హెగన్‌లో కూడా ప్రదర్శిస్తుంది. క్యోటో ఒప్పందంలో అమెరికా వైఖరితో నిమిత్తం లేకుండా మిగిలిన సంపన్నదేశాలు ఒప్పంద పరిపూర్తికి సహకరించగా కోపెన్‌హెగెన్‌లో అవి అమెరికాతో అంటకాగడం చూస్తున్నాం. క్యోటో ఒప్పందం అంపశయ్య ఎక్కకుండా వర్ధమానదేశాలన్నీ ఐక్యంగా కదలాలి.

Sunday, December 13, 2009

వాయు విడుదల కొలమానాలు

'పర్యావరణ మార్పు''పై కొపెన్‌హగెన్‌లో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సుకు ముందే వివిధ దేశాలు ఆయా దేశాలలో కార్బన్‌ వాయువులను ఏమేరకు తగ్గించాలనుకుంటున్నాయో ప్రకటించాయి. భారతదేశం కూడా ఇంతవరకు తాను అనుసరిస్తూ సమర్ధిస్తున్న 'తలసరి వాయు విడుదలల'(పర్‌క్యాపిటా ఎమిషన్స్‌) స్థానంలో 'జిడిపి ఆధారిత కార్బన్‌వాయు విడుదలల తీవ్రత' ప్రాతిపదికగా 2005 స్థాయి నుండి 2020 నాటికి కార్బన్‌ వాయు విడుదలలను 20-25 శాతం తగ్గించుకునేందుకు ఐచ్ఛికంగా సంసిద్ధతను ప్రకటించింది. అంతకు ముందు ఇదే పద్ధతిలో చైనా 40-45 శాతానికి, అమెరికా 19 శాతానికి వాయువిడుదలల తగ్గింపుకు సిద్ధమైనట్లు ప్రకటించాయి. సంపన్న దేశాలపై వత్తిడి పెంచటానికే ఈ చర్య అని భారత్‌ వాదిస్తున్నది
అమెరికా వాయు విడుదలల నియంత్రణ దిశగా ముందడుగు ప్రయత్నాలు చేయకుండా వర్దమాన దేశాలన్నీ మరింతగా త్యాగాలు చేయాలని, ఏఏ దేశం ఎంత మేరకు నిర్దిష్టంగా వాయువు విడుదలలను తగ్గిస్తాయో ప్రకటించాలని వత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తలసరి వాయు విడుదలలు(పర్‌క్యాపిటా ఎమిషన్స్‌), జిడిపి ప్రేరిత వాయు విడుదలల తీవ్రత(ఎమిషన్‌ ఇన్‌టెన్సిటీ ఆఫ్‌ జిడిపి) అంశాలని పరిశీలిద్ధాం.

పూర్వరంగం: క్యోటో ఒప్పందం క్రింద ఎనెగ్జ్‌-1గా వర్గీకరించబడ్డ సంపన్న దేశాలు 1990 స్థాయి నుండి 5.2% విధిగా గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల్ని తగ్గించుకోవాలి. కానీ ఈ లక్ష్య సాధనలో ఏ దేశమూ విజయవంతం కాలేకపోగా గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల్ని మరింతగా పెంచి మానవ మనుగడకు ముప్పును తెచ్చాయి. ఎనెగ్జ్‌-1లో లేని దేశాలు ఐచ్ఛికంగా వాయువిడుదలల తగ్గింపు చర్యలు తీసుకోవచ్చు కానీ తగ్గింపు కోటాలు విధిగా పాటించనవసరం లేదు.

ఈ వాయువిడుదలల కోటాలను తలసరి వాయు విడుదలల తగ్గింపు పద్ధతిలోకానీ, జిడిపి ఆధారిత వాయు విడుదలల తీవ్రత తగ్గింపు పద్ధతిలోకానీ వ్యక్తం చేయవచ్చు. గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలలో 75% కార్బన్‌ వాయు విడుదలలు ఉన్నందున వీటిపైనే కేంద్రీకరణ ఎక్కువగా ఉంటున్నది.

తలసరి వాయు విడుదలలు(పర్‌ క్యాపిటా ఎమిషన్స్‌): ఒక దేశం/ప్రాంతంలో విడుదలైన గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల పరిమాణానికి, ఆ దేశ/ప్రాంత జనాభాకు మధ్య ఉన్న నిష్పత్తిని ''తలసరి వాయు విడుదల''లని అంటారు. అంటే ఆ దేశం/ప్రాంతంలో ఒక వ్యక్తిపై ఉన్న సగటు వాయువిడుదలల పరిమాణం ఇది. సాధారణంగా సంపన్న దేశాల వాయువిడుదలల సగటు పరిమాణం వర్ధమాన దేశాల కంటే 4 రెట్లకు మించి అధికంగా ఉంటుంది. ఉదాహరణకు అమెరికా తలసరి వాయు విడుదలలు 20.1 మెట్రిక్‌టన్నులుగా ఉంది. వర్దమాన దేశాల తలసరి వాయువిడుదలలో చైనా మొదటి స్థానంలో ఉంది.
2006లో ఆ దేశంలో 4.6 మెట్రిక్‌టన్నులు ఉన్న తలసరి వాయు విడుదలలు 2030కి 8.0 మెట్రిక్‌ టన్నులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అతి తక్కువ తలసరి వాయు విడుదలల దేశాలలో భారత్‌, ఆఫ్రికాలు ఉన్నాయి. భారత్‌లో 2006లో ఒక్కొక్క వ్యక్తిపై 1.1 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌వాయు పరిమాణం ఉంటే 2030 నాటికి 1.4 మెట్రిక్‌ టన్నులకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఆఫ్రికా దేశాలలో తలసరి వాయు విడుదలల స్థాయిలో 2006 నుండి 2030 వరకు మార్పు ఉండక పోవచ్చు.

డాలర్‌ జిడిపి ఆధారిత వాయు విడుదలల తీవ్రత: ఒక దేశంలో ప్రతి యూనిట్‌ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి డాలర్లలో) సంపదలో విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల పరిమాణాన్ని ''జిడిపి ఆధారిత వాయు విడుదలల తీవ్రత'' అంటారు. స్థూల దేశీయోత్పత్తిలో ప్రారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, సేవా రంగాల భాగస్వామ్యం ఉంటుంది.
వీటిలో సేవారంగ అభివృద్ధి ద్వారా విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలు నామమాత్రమే. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో వినియోగించే శిలాజ ఇంధనాల మూలకంగా ఉత్పన్నమయ్యే గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలే పర్యావరణ మార్పుకు అపాయకరంగా పరిణమిస్తాయి. ఒక అంచనా ప్రకారం 2006లో ఒక మిలియన్‌ డాలరు జిడిపికి సంపన్న దేశాలలో 386 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ వాయు విడుదలల పరిమాణం ఉండగా, 2030 నాటికి 246 మెట్రిక్‌ టన్నులు ఉండవచ్చని లెక్కిస్తున్నారు.2005 నాటికి అమెరికా-475, జర్మనీ-330, జపాన్‌-328, ఫ్రాన్స్‌-214 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ తీవ్రతను కల్గిఉన్నాయి. ఇక్కడ కార్బన్‌ వాయు విడుదలల తగ్గింపు సామర్ధ్యం బాగా ఉన్నట్లు వారి అంచనా. అదే సందర్భంలో వర్ధమాన దేశాలలో 2006లో ఒక మిలియన్‌ డాలర్‌ జిడిపికి 624 మెట్రిక్‌ టన్నులు ఉన్న కార్బన్‌ వాయు విడుదలలు 2030 నాటికి 330 మెట్రిక్‌ టన్నులకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

2005 నాటికి చైనా-1046, భారత్‌-501 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ తీవ్రతను కల్గి ఉన్నాయి.2006లో వర్ధమాన దేశాలలో కార్బన్‌ వాయు విడుదలల పరిమాణం పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. 1) సంపన్న దేశాల పారిశ్రామికోత్పత్తి వర్ధమాన దేశాలకు తరలడం, 2) సంపన్న దేశాలలో ఆర్ధికమాంద్యం పెరగటం, 3) సంపన్న దేశాల వినియోగపు సరుకులన్నీ వర్ధమాన దేశాలలో ఉత్పత్తి కావటం, 4) నయా ఉదారవాద విధానాల నేపధ్యంలో సంపన్న దేశాల జిడిపిలో అత్యధికంగా సేవారంగంపై ఆధారపడి ఉండటం. కానీ 2006వ సంవత్సరం పూర్వం సంపన్న దేశాల విచక్షణారహిత శిలాజ ఇంధనాల వినియోగం, విలాసవంత జీవనం, అడవుల నరికివేత లాంటి చర్యలు భూ ఖండంలో అత్యధిక ఉష్ణానికి కారణమైనాయి. వర్ధమాన దేశాల ప్రజానీకంపై తీవ్రమైన దుష్ప్రభావాల్ని కలిగిస్తున్నాయి.


విశ్లేషణ: పైన పేర్కొన్న వాయువిడుదలల కొలమాన పద్దతులను పరిశీలించినపుడు తలసరి వాయు విడుదలల పద్ధతి సంపన్న దేశాల ప్రయోజనాలకు ఆటంకంగా ఉంటుంది. అందువల్ల మన ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు మాంటెక్‌ సింగ్‌ అహుల్‌వాలియా ఈ అంశంపై మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలు సహజంగా తలసరి వాయు విడుదలల పద్ధతిని వ్యతిరేకిస్తారు కాబట్టి జి.డి.పి ఆధారిత వాయు విడుదలల తీవ్రతా పద్ధతిని అనుసరించడం శ్రేయస్కరమన్నారు. సంపన్న దేశాల కొమ్ముగాసే ఈ వాదనలే భారత్‌ లాంటి దేశాలను సంపన్న దేశాల ఉచ్చులోకి లాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో తలసరి వాయు విడుదలల పద్ధతి వర్దమాన పేద దేశాలు సంపన్న దేశాల నుండి పరిహారాన్ని, పరిజ్ఞానాన్ని రాబట్టుకోవటానికి నైతిక బలాన్ని అందిస్తుంది. భారత్‌ ప్రదర్శిస్తున్న తాజా వైఖరి సామ్రాజ్యవాద దేశాలకు ముందుగానే లొంగిపోవటమే కాకుండా వర్దమాన దేశాల ప్రయోజనాలకు భంగకరంగా కూడా ఉంది. ఈ వైఖరిని భారత్‌ పునరాలోచించుకొవాల్చిన అవసరం ఎంతైనా ఉంది.

Monday, December 7, 2009

డాలర్‌ బదిలీ వాణిజ్యం (డాలర్‌ క్యారీ ట్రేడ్‌)

ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా చలామణి అయి, వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను గత మూడు దశాబ్దాలుగా శాసించిన అమెరికన్‌ డాలర్‌ ఇటివలీ కాలంలో తీవ్రంగా బలహీన పడింది. బలహీన పడ్డ అమెరికన్‌ డాలర్‌ను పెట్టుబడిగా మార్చుకొని విపరీతమైన లాభార్జన నెరుపుతున్న వాణిజ్యమే ''డాలర్‌ బదిలీ వాణిజ్యం'' గా పేరు పొందింది. డాలర్‌ బలహీనపడిన కొద్దీ, బంగారం, ఆయిల్‌, సరుకులు, ఈక్విటీల మార్కెట్లు జోరుగా పెరుగుతున్నాయి. డాలర్‌ పటిష్టంగా వున్న 2008 సం||లో యీ జోరు ఇంతగా లేదు. సాధారణంగా దేశ ఆర్ధికాభివృద్ధితో బాటుగా విదేశీ మారక విలువ పెరుగుదలను మంచి లక్షణంగా చూస్తాము.

ఇటీవలి కాలంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ద్రవ్య సంక్షోభం నుండి కోలుకుంటున్న వేగం కంటే, అమెరికాలోనే కాకుండా, చైనా, భారత్‌, బ్రెజిల్‌ తదితర అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉపందుకున్న ఫైనాన్షియల్‌ మార్కెట్ల వేగం అర్ధశాస్త్ర మౌళిక సూత్రాలకతీతంగా ఉంది. అమెరికా డాలర్‌ బలహీన పడ్డ కొద్దీ, అంతర్జాతీయ పెట్టుబడుల మార్కెట్‌లు శరవేగంతో దూసుకుపోతున్నాయి. ఈ వేగాన్ని సృష్ఠిస్తున్న ప్రక్రియే ''కరెన్సీ బదిలీ వాణిజ్యం''. డాలర్ల ఆధారంగా జరిగేది ''డాలర్‌ బదిలీ వాణిజ్యం''.

కరెన్సీ బదిలీ వాణిజ్యం అంటే

''తక్కువ వడ్డీ రేటుకు లభ్యమయ్యే కరెన్సీ నిధులను అత్యధిక లాభాలనార్జించే విదేశీ కరెన్సీ లోని పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టె వ్యూహాన్ని'' ''కరెన్సీ బదిలీ వాణిజ్యం'' అంటారు. ఉదాహరణకు 1 శాతం వడ్డీ రేటుతో జపాన్‌ బ్యాంకు నుండి యెన్‌ల రూపంలో అప్పు తీసుకొని ఆసొమ్మును 4 శాతం వడ్డీరేటు గల అమెరికన్‌ డాలర్‌ బాండ్లలో పెట్టుబడి పెడితే రెండు దేశాల విదేశీ మారక విలువలలో మార్పు లేనంత కాలం 3 శాతం వడ్డీ లాభంగా మిగులుతుంది. దీనితోపాటే విదేశీ కరెన్సీ మారక విలువలు పెరిగేటట్లయితే లాభాల రేటు ఇంకా పెరుగుతుంది. అదే సందర్భంలో విదేశీ, స్వదేశీ కరెన్సీ మారక విలువలలో ఎగుడుదిగుడులుంటే ఆదాయాలు తారుమారవుతాయి. లాభాలైనా, నష్టాలైనా ఫలితం తీవ్రంగా ఉంటుంది. నయా ఉదారవాద విధానాల సృష్ఠి ''కరెన్సీ బదిలీ వాణిజ్యం''.

వెలిగి పోతున్న అంతర్జాతీయ ఫైనాన్స్‌ మార్కెట్లు

1980, 1995, 2006, 2008 సంవత్సరాలలో జపాన్‌లో సంభవించిన ఆర్ధిక సంక్షోభాల నేపథ్యంలో జపాన్‌ 'ఎన్‌' మారక విలువ క్షీణించిన దశలో జపాన్‌ పెట్టుబడీదారులు అతి తక్కువ వడ్డీకి లభించిన యెన్‌లను అధిక విదేశీ మారక విలువగల విదేశీ ఫైనాన్స్‌ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు గడించారు. ''యెన్‌ బదిలీ వాణిజ్యం'' యింతవరకు పెట్టుబడి మార్కెట్లకు చౌకబారునిధుల వనరుగా వున్నది. దాని స్ధానంలో డాలర్‌ నేడు ఈ దుస్ధితికి దిగజారింది. అమెరిగాలో ఇటీవలి ద్రవ్య సంక్షోభం నుండి బయటపడేందుకు అమలుచేస్తున్న ఉద్దీపన పధకాలతో ద్రవ్య లభ్యత (లిక్విడిటి) విపరీతంగా పెరిగింది. సున్నా కంటే అతి తక్కువ శాతం వడ్డీ రేట్లకు ఫెడరల్‌ రిజర్వ్‌, ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఋణాలను కార్పోరేట్‌ సంస్ధలు తమ దేశంలోనే కాక చైనా, భారత్‌, బ్రెజిల్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఫైనాన్షియల్‌ మార్కెట్లలో అత్యధికంగా పెట్టుబడులుగా పెడుతున్నాయి. దీనితో అంతర్జాతీయ ఫైనాన్స్‌ మార్కెట్‌ వెలిగి పోతున్నట్లు పెట్టుబడిదారులు ప్రచారం చేస్తూ ప్రజలలో భ్రమలు కల్పిస్తున్నారు. నిజ ఆర్ధిక వ్యవస్ధకు మళ్ళుతున్న నిధులు మాత్రం నామమాత్రం గానే ఉన్నాయి.

కరెన్సీ బదిలీ వాణిజ్యం ప్రభావాలు

కరెన్సీ బదిలీ వాణిజ్యం లో పెట్టుబడిగా పెట్టె కరెన్సీ మారక విలువ క్షీణత ఎక్కువ కాలం కొనసాగితే పెట్టుబడిదారుల లాభాలు అమితంగా ఉంటాయి. స్పెక్యులేషన్‌ కూడా అపరిమితంగా ఉంటుంది. అమెరికా అనుసరిస్తున్న ఈ తరహా కరెన్సీ విధానాల్ని (మానిటరీ పాలసీలు) ప్రపంచ దేశాలన్నీ అనుస రించాల్సిన దుస్ధితి ఏర్పడింది. అమె రికాలోని గృహరుణాల సంక్షోభం చేదు అనుభవాలు స్మృతి పథంనుండి తొలగక మునుపే, డాలర్‌ బదిలీ వాణిజ్యం ఆధారంగా ఫైనాన్షియల్‌ మార్కెట్‌ రంగంలోని స్పెక్యులేటర్లు అమితమైన దురాశతో. ''ఫైనాన్షియల్‌ రంగ బుడగ''ను అంతులేకుండా పెంచుతున్నారు. అమెరికన్‌ ఆర్ధిక నిపుణులు ప్రొఫెసర్‌ నౌరియేల్‌ రౌబీనీ యీ పరిమాణాల పట్ల వ్యాఖ్యానిస్తూ, ''సుధీర్ఘకాలం కొనసాగే డాలర్‌ బదిలీ వాణిజ్యంలో వాణిజ్య బుడగ పేలడం అనివార్యమని'' హెచ్చరించారు అమెరికా డాలర్‌ ధర ఏదోసమయానికి పెరగాల్సిందే. ఆ పరిణామమే వాణిజ్య బుడగ పగలటానికి కారణమౌతుందనేది అయన హెచ్చరిక సారాంశం. విధ్వంసాన్ని సృష్టించగలిగే వీటి పర్యవసానాలు. ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి.

డాలర్‌ భయాలు

సబ్‌ ప్రైం సంక్షోభ సూత్రధారులైన మెరిల్‌ లించ్‌, గోల్డ్‌ మాన్‌ సాచ్స్‌ లాంటి కార్పోరేట్‌ సంస్ధలు డాలర్‌ బదిలీ వాణిజ్య రూట్‌లో విదేశీ స్టాక్‌, బాండ్‌ల మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టి 40-60% లాభాలు ప్రకటించుకున్నారు. ఈ పెట్టుబడి ప్రవాహాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను ముంచేస్తున్నాయి. ఆయా దేశాల కరెన్సీ మారక విలువలను ప్రభావితం చేసే పరిస్థితులు ఆయాచితంగా మీద పడుతున్నాయి. రాబోయే పరిణామాలను అధిగమించటానికి బ్రెజిల్‌ స్టాక్‌, బాండ్‌ల మార్కెట్‌లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాలపై 2 శాతం పన్ను విధించింది. ఇటీవల జరిగిన జి-20 దేశాల ప్రధాన మంత్రుల సమావేశంలో బ్రిటన్‌ ప్రధాని గోర్డాన్‌ బ్రౌన్‌ విదేశీ చౌకబారు పెట్టుబడుల లావాదేవీలపై టోబిన్‌ పన్ను విధించాలని ప్రతిపాదించారు భారతదేశంలో దొడ్డిదారిన విదేశీ అనిశ్చితి పెట్టుబడులను ఆకర్షించే పార్టీసిపేటరీనోట్లను నిషేదించాలనే డిమాండ్‌ పార్లమెంట్‌లో లేవనెత్తారు.

కొన్ని ఆసియా దేశాలు డాలర్‌ బదిలీ వాణిజ్య దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు దేశీయ విధానాల మార్పుకు సమాయత్తం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షులు బారక్‌ ఓబామా చైనా పర్యటన సందర్భంగా, ఆదేశ బ్యాంకింగ్‌ రంగ నియంత్రణాధికారి లియు మింకాంగ్‌, చౌక బారు పెట్టుబడుల ప్రోత్సాహంతో అమెరికా అనుసరిస్తున్న అభద్రమైన కరెన్సీ విధానాల్ని తీవ్రంగా విమర్శించారు. జర్మనీ నూతన ఆర్ధిక మంత్రి ఉల్ఫ్‌ గ్యాంగ్‌ షఉబుల్‌, అనారోగ్య స్పెక్యులేటివ్‌ ధోరణలను పెంచే డాలర్‌ బదిలీ వాణిజ్యాన్ని దుయ్యబట్టారు.

ముగింపు

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, పెట్టుబడి అంగ నిర్మాణంలో మార్పులు తేవటమే కాకుండా లాభాల రేటు కాపాడుకోవడానికి పలు నూతన మార్గాలను, రంగాలను ముందుకు తెస్తున్నది. ఇవన్నీ ఉత్పాదక రంగంతో నిమిత్తంలేని స్పెక్యులేటివ్‌ రంగాలే. అటువంటివాటిలో ఒకటి కరెన్సీ క్యారి ట్రేడ్‌. ఈ అంశంపై జరుగుతున్న తాజా చర్చ పెట్టుబడిదారి ఆర్ధిక వ్యవస్ధ ఎంతగా సంక్షుభిత మయ్యిందో నిరూపించే మరో ఉదాహరణ మాత్రమే. నయా వుదారవాద విధానాలు, కరెన్సీ (మానిటరీ) విధానాలతోనే ఆర్ధిక రుగ్మతల్ని నివారించాలనుకుంటే ఫలితం ఇలానే ఉంటుంది. ఒక రోగానికి మందు వేస్తే, మరో రోగం ముదురుతున్నది.

పర్యావరణ ఒప్పందాలు: అమలు తీరు

భూ వాతావరణంలో మితిమీరిన గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలలతో భూగోళం వేడెక్కి (గ్లోబల్‌వార్మింగ్‌) తీవ్ర పరిణామాలకు దారితీస్తు న్నాయి. ఈ సమయంలోనే డిసెంబర్‌ నెలలో డెన్మార్క్‌ దేశంలోని కొపెన్‌హగెన్‌ నగరంలో ''పర్యావరణ మార్పు''పై అంతర్జాతీయ సమావే శం జరుగనున్నది. పర్యావరణ పరిరక్షణపై 1997లో ఏర్పరచుకున్న ''క్యోటో ఒప్పంద'' కాలపరిమితి 2012తో ముగియనుండటంతో, దాని స్థానంలో వివిధ దేశాల మధ్య నూతన ఒప్పందం కుదరాల్సి ఉంది.

పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలు: అభివృద్ధికీ, పర్యావరణానికీ మధ్య ఉన్న సంబం ధం గురించిన అధ్యయనాలు 1960 దశకంలో ప్రారంభమైనాయి. 1964లో స్థాపించిన ''అంతర్జాతీయ జీవసంబంధ కార్యక్రమం (ఇంటర్‌నేషనల్‌ బైలాజికల్‌ ప్రోగ్రామ్‌) పర్యా వరణానికి, అభివృద్ధికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించింది. 1969లో పర్యావరణ సమస్యల శాస్త్రీయ కమిటీ (సైన్టిఫిక్‌ కమిటీ ఆన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రాబ్లమ్స్‌) ఏర్పాటు చేయబడింది. 1971లో 'మానవుడు మరియు జీవావరణ కార్యక్రమం' (మాన్‌ అండ్‌ బయోస్ఫియర్‌ ప్రోగ్రామ్‌) అన్న కార్యక్రమాన్ని 'యునెస్కో' చేపట్టింది. ఈ దశకంలోనే ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సమావేశంలో సమర్పించిన 'ధనిక దేశాల అభివృద్ధి నమూ నా'పై వర్ధమాన దేశాలు తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేశాయి. ఈ నమూనా వర్ధమాన దేశాల ప్రయోజనాలను రక్షించలేవన్న నిర్ధారణకు వచ్చాయి.

ఐక్యరాజ్యసమితి 1972లో స్టాక్‌ హోమ్‌లో నిర్వహించిన మానవ పర్యావరణ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ''మన్నికయ్యే అభివృద్ధి'' (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌) ఎజెండాను రంగం మీదకు తెచ్చింది. పర్యా వరణ పరిరక్షణకు లోబడిన ఆర్థిక, సామాజిక అభివృద్ధే మన్నికయ్యే అభివృద్ధిగా నిర్వచించారు. ''మన్నికయ్యే అభివృద్ధి''పై చర్చల నడుమ ''గ్లోబల్‌ వార్మింగ్‌'' తొలి హెచ్చరికలు మొదలయ్యాయి. వాతావరణ మార్పు మానవ సమాజం మొత్తాన్ని సమిష్టిగా భయాందోళనలకు గురి చేస్తున్న సమస్యగా ఐక్యరాజ్య సమితి 1988లో తీర్మా నించింది. విస్తృత స్థాయిలో వివిధ దేశాలలోని శాస్త్రవేత్తలు, పర్యావరణ వాదులు, విధాన నిపుణులతో ''పర్యావరణ మార్పుపై అంతర్జా తీయ ప్యానల్‌ (ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌)''ను నియమించి ''వాతావరణ మార్పు-ముప్పు''పై నివేదికను సమర్పించమంది.

ఆ ప్యానల్‌ సమర్పించిన మొదటి నివేదికే నవంబర్‌ 1990లో జెనివాలో జరిగిన మొదటి ప్రపంచ పర్యావరణ సమావేశ చర్చలకు ప్రాతి పదిక అయ్యింది. ఈ సమావేశమే 1992లో జరిగిన ధరిత్రి సదస్సులో ''వాతావరణ మార్పు పై అంతర్జాతీయ అవగాహనా ఒప్పందానికి (ఇంటర్‌నేషనల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌)'' భూమికను ఏర్పాటు చేసింది.

ధరిత్రి సదస్సు: 'ఐక్యరాజ్యసమితి పర్యా వరణం, అభివృద్ధి' సమావేశం జూన్‌ 1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగింది. వాతావరణ మార్పు దుష్ప్రభావాలపైన, పర్యా వరణ పరిరక్షణపైన ప్రపంచవ్యాప్త దృష్టిని మళ్ళించిన చారిత్రాత్మక సదస్సు ఇది. ప్రపంచ వ్యాప్తంగా 178 దేశాల నుండి వేలాది మంది అధినేతలు, ప్రభుత్వేతర సంస్థలు, సామాజిక కార్యకర్తలు, పత్రికా ప్రతినిధులు హాజరైన మొట్టమొదటి సదస్సు ఇది. పర్యావరణ పరిరక్షణ ప్రస్థానానికి పునాదిగా నిలిచిన ''ఇంటర్నేషనల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌'' ఈ సదస్సులోనే రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్త పర్యావరణ పరిరక్షణ చర్యల్ని ఈ సంస్థే అజమా యిషీ చేస్తున్నది. ఈ సందర్భంగానే ''గ్లోబల్‌ ఫోరమ్‌'' పేరుమీద వందలాది ప్రభుత్వేతర సంస్థలతో సమాంతర అనధికార సమావేశం కూడా జరిగింది.

ధరిత్రి సదస్సు మూడు విశాల లక్ష్యాలపై కేంద్రీకరించింది. 1) పర్యావరణ అభివృద్ధి, పరిరక్షణ ధ్యేయంగా సూత్రీకరించబడ్డ అధికార పత్రాన్ని తయారు చేయటం. 2) మన్నికయ్యే అభివృద్ధి సాధనకు ప్రపంచవ్యాప్త కార్యాచరణను నిర్ధేశించి ఎజెండా-21ని రూపకల్పన చేయటం. 3) వర్ధమాన దేశాల్లో మన్నికయ్యే అభివృద్ధి సాధించటానికి అభివృద్ధి చెందిన దేశాల నుండి నిధులు, ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించటం. ఈ సదస్సులో అమెరికా తదితర సంపన్న దేశాలు, బహుళజాతి సంస్థలు శిలాజ ఇంధనాల లాబీయిస్టులు, చమురు, ఇంధన కంపెనీల ప్రతినిధులు అనేక అడ్డంకులు, చిక్కుల్ని సృష్టించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాల కర్తవ్యాన్ని నిర్ధేశించే 27 సూత్రాల ''రియో సదస్సు'' ప్రకటనను నీరుకార్చ డానికి అమెరికా శతవిధాలా ప్రయత్నించింది. పర్యావరణ పరిరక్షణకు సదస్సు ప్రతిపాదించిన ''ఎజెండా 21'' పేర కార్యాచరణపై దాదాపు ఏకాభిప్రాయం కుదిరింది.

పర్యవసానంగా మన్నికయ్యే అభివృద్ధి కమీషన్‌, పర్యావరణ మార్పు కమీషన్‌, జీవవైవిధ్య కమీషన్‌లాంటి అంతర్జా తీయ సంస్థలు ఆవిర్భవించాయి. భూగోళ కౌన్సిల్‌, మన్నికయ్యే అభివృద్ధికి సంబంధించిన వాణిజ్య కౌన్సిల్స్‌ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అయితే వాణిజ్య కౌన్సిల్‌లో 48 బహుళజాతి కార్పొరేట్‌ కంపెనీల ముఖ్యనిర్వహణాధికారులు సభ్యులుగా ఉండటంతో ''ఐక్యరాజ్యసమితి పర్యావరణం, అభివృద్ధి సంస్థ''ను కార్పోరేట్‌ శక్తులు హస్తగతం చేసుకున్నట్లయింది.

ఆకట్టుకున్న క్యాస్ట్రో ప్రసంగం: ఈ నేపధ్యం లో క్యూబా అధ్యక్షులైన ఫైడల్‌ క్యాస్ట్రో సదస్సు నుద్ధేశించి చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంది. పర్యావరణ పరి రక్షణలో సంపన్న దేశాలు చేయాల్సిన ఆర్ధిక సహాయాన్ని వర్ధమాన దేశాలకు ''బాకీ పడిన అప్పు''గా అభివర్ణిస్తూ, ''ప్రపంచ జనాభాలో 1/5వ వంతు ఉన్న సంపన్న దేశాలు ప్రపంచ ఖనిజాల్లో 2/3వ వంతు, ఇంథనాల్లో 3/4వ వంతు అనుభవిస్తున్నారు. వాళ్ళు సముద్రాల్ని, నదుల్ని విషమయం చేస్తున్నారు. గాలిని కాలుష్యపరుస్తూ ఓజోన్‌ పొరను బలహీనపర్చి బొక్కలు పొడుస్తున్నారు. వాతావరణాన్ని కలుషిత వాయువులతో నింపి మానవాళిని వాటి దుష్ప్రభావల బారికి నెట్టివేశారు. వాళ్ళ స్వార్ధం, ఆధిపత్యం, బాధ్యతారాహిత్యం, వంచన, మొద్దుబారిన తనం ఇక చాలు. ఎప్పుడో మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని రేపటి నుండి చేయాలనుకోవటమే చాలా ఆలస్యంగా ప్రారం భించిన కార్యాచరణ'' అని వర్ధమాన దేశాలకు తక్షణ కర్తవ్య బోధన చేస్తూ సంపన్న దేశాలను తీవ్రంగా హెచ్చరించారు.

రియో సదస్సు, తదనంతర పరిణామాలు: గ్రీన్‌హౌస్‌ వాయువుల అపాయకర స్థాయి నుండి వాతావరణ వ్యవస్థను రక్షించటమే లక్ష్యమని రియో సదస్సు ప్రకటనలోని ఆర్టికల్‌-2 ఉద్బోదించింది. వాతావరణ కాలుష్య కారకులు సంపన్న, పారిశ్రామిక దేశాలైనందున, 2000 నాటికి ఆ దేశాల కాలుష్య వాయు విడుదలల్ని 1990 స్థాయికి తగ్గించాలని సదస్సు అభిప్రా యపడింది. అభివృద్ధి చెందిన దేశాలకూ, వర్థమాన దేశాలకూ ''ఉమ్మడిగానే అయిన విభిన్న బాధ్యతలు'' ఉన్నాయంటూనే అందులో అభివృద్ధి చెందిన దేశాల బాధ్యత ప్రధానమని, వర్థమాన దేశాలకు సంపన్న దేశాలు ఆర్ధిక పరిహారాన్ని ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేయాలని ఈ సదస్సు నిస్సంకోచంగా స్పష్టపరిచింది. అయితే కాలుష్య కారకులైన సంపన్న దేశాలు ఎంత మోతా దులలో తమ వాయు విడుదలలను తగ్గించు కోవాలి, అందుకు ఏ ఏ పద్ధతులు పాటించాలి అన్న ఆచరణాత్మక అంశాలపై సదస్సులో ఏకాభిప్రాయం కుదరలేదు.

అంతేకాకుండా ఎజెండా 21 అమలుకు కావలసిన నిధుల సేకరణలో సంపన్న దేశాలు సహకరించలేదు. దాంతో రియో సదస్సు పర్యావరణ పరిరక్షణలో విజయం పొందలేకపోయింది. మళ్ళీ 1995లో బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో గ్రీన్‌హౌస్‌ వాయువిడుదల అదుపుకు కట్టుబడి ఉండాలనే తీవ్ర ఆకాంక్షను ''బెర్లిన్‌ మాన్‌డేట్‌''గా వివిధ దేశాలు ప్రకటించాయి. బెర్లిన్‌ సమావేశంలో భారత్‌, చైనా, ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్‌లాంటి దేశాలు కలుషిత వాయు విడుదలల్ని 20శాతం తగ్గించుకో వటానికి అంగీకరించగా అమెరికా తీవ్రమైన సహాయ నిరాకరణ ధోరణిని ప్రదర్శించింది.ఈ కాలంలోనే ''గాట్‌''పై ఉరుగ్వే చర్చలు కొలిక్కి వచ్చాయి. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భవించింది.

క్యోటో ఒప్పందం: రియో సదస్సు అవగా హనలో ఉన్న లోపాలను సవరించి, పర్యావరణ చర్చలను అర్ధవంతంగా మార్చే లక్ష్యంతో తదుపరి చర్చలు జరిగాయి. బెర్లిన్‌ సమావేశం తరువాత 1997 డిసెంబర్‌లో జపాన్‌లోని క్యోటో నగరంలో జరిగిన 'అంతర్జాతీయ పర్యా వరణ, అభివృద్ధి సమావేశం' మరోసారి పర్యా వరణ పరిరక్షణపై కార్యాచరణకు పూనుకుంది. క్యోటో ఒప్పందం ప్రపంచ దేశాల్ని రెండు శ్రేణులుగా విభజించింది. నిర్ధిష్ట కోటా ప్రాతి పదికన గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలను నియం త్రించాల్సిన దేశాలను ఎనెగ్జ్‌ 1 దేశాలుగాను, మిగిలిన దేశాలను ఇతర దేశాలుగాను పరిగణించింది. ఎనెగ్జ్‌1లో 37 సంపన్న దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు 2008 నుండి 2012 మధ్య 1990 నాటి ఆ దేశ గ్రీన్‌హౌస్‌ వాయు విడుదల స్థాయి నుండి 5% తగ్గించాలని సదస్సు నిర్ణయించింది. మిగిలిన దేశాలు కలుషిత వాయువిడుదలపై 2012 వరకు ఏ రకమైన ఆంక్షలు విధించరాదని నిర్ణయించింది.

అదే సందర్భంలో సంపన్న దేశాలు క్యోటో ఒప్పంద బాధ్యతలను నెరవేర్చటానికి రెండు విధాలైన అవకాశాలనిచ్చింది. మొదటిది కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకోగలిగే అడవులను అభివృద్ధి చేయటం, అడవుల నరికివేతను నిరోధించటం. రెండవది - క్యోటో ఒప్పందం క్రింద ప్రత్యేకంగా రూపొం దించిన ''సరళ యంత్రాంగాన్ని'' (ఫ్లెక్స్‌బుల్‌ మెకానిజం) వినియోగించుకోవడం. ఈ సరళ యంత్రాంగంలో భాగంగా కార్బన్‌ వాణిజ్యం అనేది అభివృద్ధి చెందింది.

కార్బన్‌వాయు విడుదలను మారకం చేసుకునే యంత్రాంగానికి 'క్లీన్‌ డెవలప్‌మెంట్‌ మెకానిజం' అని పేరుపెట్టారు. ఈ యంత్రాం గం నిర్వహణకు ఒక ఎగ్జిక్యూటీవ్‌ బోర్డు ఉంటుంది. దీని ప్రకారం కార్బన్‌ వాయువులను అదుపు చేసే సందర్భంలో ప్రతి మెట్రిక్‌టన్ను వాయువుకు ఒక యూనిట్‌ క్రెడిట్‌ ఇస్తారు. కార్బన్‌ వాయువులను అదుపు చేయగలమేరకు క్రెడిట్‌ యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ రకంగా ఆర్జించిన కార్బన్‌ క్రెడిట్‌లను క్యోటో ఒప్పంద పరిధిలోని అభివృద్ధి చెందిన దేశాలకుగానీ, ఆ దేశాల కంపెనీలకుగానీ వర్ధమాన దేశాలు లేదా ఆ దేశాల కంపెనీలు మార్కెట్‌ ధరకు అమ్ము కోవచ్చు. ఈ విధమైన క్రెడిట్‌ యూనిట్ల వాణిజ్యం కార్బన్‌ ట్రేడింగ్‌గా ప్రసిద్ధికెక్కింది. కార్బన్‌ వాణిజ్యంలో కార్బన్‌ క్రెడిట్‌లను అధికంగా కొనగలిగే సంపన్న వర్గాలకు భూ వాతావరణాన్ని కలుషితం చేయడానికి హక్కు సంక్రమిస్తున్నది. అంటే భూపైన గల వాతావరణం కూడా ప్రైవేటీకరించబడుతుంది.

2006లో 3000 కోట్ల డాలర్లున్న కార్బన్‌ వాణిజ్యం ప్రస్తుతం లక్ష కోట్ల డాలర్లకు మించి పోయింది. ఈ వాణిజ్యంలో స్పెక్యులేషన్‌ పెంచే ఫ్యూచర్‌లు, ఆప్షన్‌లులాంటి డెరివేటీవ్‌లు ప్రవేశిం చాయి. ఫైనాన్షియల్‌ రంగంలో డెరివేటీవ్‌లు సృష్టించిన విలయాన్ని భవిష్యత్‌లో కార్బన్‌ వాణిజ్యంలో సృష్టించబోతున్నాయని పర్యావరణ ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మొత్తం మీద చూసినప్పుడు నేడు ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావంతోనూ, నయా ఉదా రవాద విధానాలతోనూ సంపన్న దేశాల ప్రత్యక్ష పెట్టుబడులు, బహుళజాతి సంస్థలు వర్ధమాన దేశాల పారిశ్రామిక వ్యవస్థలలో ప్రవేశిస్తూ ఆయా దేశాల శిలాజ ఇంధన వినియోగాన్ని మరింత పెంచుతున్నాయి. దీనితో చైనా, భారత్‌, బ్రెజిల్‌లాంటి వర్ధమాన దేశాలలో గ్రీన్‌హౌస్‌ వాయు విడుదల కేంద్రీకరణ పెరుగుతోంది. దీని వల్ల వాయువిడుదలను తగ్గించాలనే లక్ష్యం నెరవేరటం లేదు. కార్బన్‌ క్రెడిట్‌ కొనుగోలుతో సంపన్న దేశాలలో తగ్గాల్సిన కార్బన్‌ వాయువుల పరిమాణం అక్కడ తగ్గకుండా వర్ధమాన దేశాల్లో తగ్గుతోంది. సంపన్న దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని పెంచకుండా తగ్గించినప్పుడు మాత్రమే వర్ధమాన దేశాలలోని కార్బన్‌ పరిమాణం తగ్గుదల వాతావరణంపై అనుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది. కానీ కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రక్రియలో తక్కువ వ్యయంతో లభిస్తున్న కార్బన్‌ కొనుగోలుతో సంపన్న దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని మరింత పెంచుతూ వాతావ రణాన్ని కలుషితం చేస్తున్నాయి.

క్యోటో ఒప్పందానికి అడ్డంకులు: 184 దేశాల భాగస్వామ్యం కలిగిన క్యోటో ఒప్పందం 2005 నుండి అమలులోకి వచ్చింది. క్యోటో ఒప్పందపు భాగస్వామ్య దేశాల సమావేశాలు (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌) 1995 నుండి 2008 వరకు 14 సార్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతా ల్లో జరిగాయి. 2009 సమావేశం కొపెన్‌ హగెన్‌లో జరగనున్నది. రియో సదస్సుకు భిన్నంగా గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలపై నిర్ధిష్ట నియంత్రణ ప్రక్రియను రూపొందించి సంపన్న దేశాలను అందుకు బాధ్యుల్నిగా చేయటంలో క్యోటో ఒప్పందం పురోగతిని సాధించింది. అదే సందర్భంలో సంపన్నేతర దేశాలను వాయు విడుదల పరిమితుల నుండి మినహాయించడం లో కూడా ఇది న్యాయంగానే వ్యవహరించింది. రియో ధరిత్రి సదస్సులో అనేక అడ్డంకులను సృష్టించిన అమెరికా క్యోటో సదస్సులోనూ అడ్డంగానే నిలిచింది.

1998నాటి సమావేశం లో అమెరికా అధ్యక్షుడైన బిల్‌క్లింటన్‌ క్యోటో ఒప్పందంపై సంతకం చేయటానికి సిద్ధమైనా, ఆ దేశ సెనెట్‌ అందుకు ఆమోదించలేదు. వర్ధమాన దేశాల వాయువిడుదలలపై ఆంక్ష లుండాలనే సాకుతో 2001లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జార్జ్‌బుష్‌ క్యోటో ఒప్పందం నుండి వైదొలుగుతూ పరిశీలకుడిగా ఉంటామని ప్రకటించాడు. వింతైన విషయ మేమంటే ఇప్పటికీ అమెరికాలోని శాస్త్రవేత్తల, ఆర్ధికవేత్తల లాబీ ఒకటి వాతావరణ మార్పు దుష్ప్రభావాలు సత్య దూరాలని వాదిస్తూనే ఉన్నది.

స్టెర్న్‌ రిపోర్టు: ప్రపంచబ్యాంకు మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్ధికవేత్త లార్డ్‌ నికోలస్‌ స్టెర్న్‌ బ్రిటీష్‌ ప్రభుత్వ ఆదేశాలపై క్యోటో ఒప్పందంపై అక్టోబర్‌ 2006లో నివేదికను సమర్పించాడు. ఆయన కార్బన్‌ ట్రేడింగ్‌తోపాటు కార్బన్‌ టాక్స్‌ విధింపును ప్రతిపాదించాడు. ప్రపంచ దేశాల స్థూల దేశీయోత్పత్తిలో 1% వెచ్చిస్తే వాతావరణ మార్పు దుష్ప్రభావాల నుండి ప్రపంచాన్ని రక్షించవచ్చన్నాడు.

మన్నికయ్యే అభివృద్ధి సాధ్యమేనా?: 2007 నాటికి ఎనెగ్జ్‌-1 దేశాలు వాయు విడుదలల్ని 1990 స్థాయిలో 5% తగ్గించాలనిక్యోటో ఒప్పందం నిర్దేశించింది. కాని ఈ దేశాలు విడుదలను తగ్గించకపోగా 1990 తో పోలిస్తే 10% పెంచాయి. అమెరికాల 17% పెంచింది. ఈ నేపధ్యంలో 2002లో జోహె న్స్‌బర్గ్‌లో 'మన్నికయ్యే అభివృది' (సస్టయినబుల్‌ డెవెలప్‌మెంట్‌)పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సదస్సు, ఎజెండా-21 అమలుకు అంతర్జాతీయ కమీషన్‌కు మార్గదర్శకాలను నిర్ధేశించింది. 2003లో ఈ కమీషన్‌ మార్గదర్శకాల అమలుకు ప్రతి దశకు 2 ఏళ్ల వ్యవధితో ఏడంచెల కార్యాచరణను రూపొందించింది. ఈ కార్యా చరణ 2004-05లో మొదలై 2016-17కు పూర్తి కావాలని నిర్ణయించింది. పేదరిక నిర్మూ లన, స్త్రీ పురుష సమానత్వం, విద్య వైద్య రంగా ల అభివృద్ధి, ప్రకృతి వనరుల సంరక్షణ కేంద్రం గా అమలు కావాల్సిన ఈ పథకాలు ఇంత వరకు సామాన్య ప్రజానీకానికి నిర్ధిష్టమైన ప్రయో జనాల్ని కల్గించలేదు.

2050 నాటికి కనీసం 40% మేరకు (1990 స్థాయి నుండి)విడుదలల్ని తగ్గించగలిగి నప్పుడే మానవ జాతి క్షేమంగా ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సంపన్న దేశాలు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. వ్యవసా యం, ఆహారం, ఇంధన సంక్షోభాలు దగ్గరలోనే పొంచి వున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆచరణలో సంపన్న దేశాలు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవటంతో క్యోటో ప్రొటోకల్‌ లక్ష్యాలు సాధింపబడలేదు. కొపెన్‌హగెన్‌ సదస్సు తేదీలు దగ్గర పడినకొద్దీ వివిధ దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చల తరహాలో గ్రూపులుగా ఏర్పడి తమతమ ప్రయోజనాల్ని ముందుకు తేవ టంతో సన్నాహక సమావేశాలలో ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈ పరిస్థితిని అదునుగా తీసు కొని అమెరికా, వివిధ వర్ధమాన దేశాలతో పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలకు సిద్ధమైంది. వాతావరణ మార్పు ముప్పు ప్రపంచ వ్యాప్తమైంది. విడివిడి ఒప్పందాల్తో ఉమ్మడి కృషిని భగం చేయటమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో ఇంత వరకు సాధిం చిన ప్రయోజనాలు నీరుకారతాయి. కొపెన్‌హగెన్‌ సదస్సు పర్యావరణ పరిరక్షణలో పాత సవాళ్ళనే ఎదుర్కోబోతున్నది

Tuesday, November 24, 2009

చరిత్రలో మానవ వలసలు

ప్రపంచవ్యాపితంగా మానవ వలసల ధోరణులలోని మూడు కీలకాంశాలను మానవాభివృద్ధి నివేదిక 2009 గుర్తించింది. 1) మానవ స్థితిగతుల్ని మెరుగుపర్చుకోవలసిన మానవ అవసరమే మానవ వలసలకు చోదక శక్తిగా ఉంది. 2) మానవ వలసల సమగ్రాభివృద్ధికి ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాల విధానపరమైన అడ్డంకులు, ఆర్థికపరమైన అవాంతరాలు అడ్డుగోడలుగా ఉన్నాయి. ఈ అడ్డుగోడల్ని అధిగమించలేని పేద ప్రజానీకం అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ మానవ వలసల ప్రయోజనాలను పొందలేకున్నారు. 3) భవిష్యత్తులో ఎదురుకానున్న విభిన్న ఆర్థిక, భౌగోళిక పరిణామాలు మానవ వలసల ప్రవాహాన్ని పెంచే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయని నివేదిక అంచనా వేసింది.

19వ శతాబ్ధంలో మానవ వలసల స్వేచ్ఛా సమాజం:

అతి పురాతనమైన మానవ వలసలకు బైబిల్‌(పాతనిబంధనలు), ఖురాన్‌ లాంటి మత గ్రంథాలు గౌరవ స్థానమిచ్చాయని, వలస ప్రజలను మౌళిక వసతులతో ఆదరించాలనే మత ప్రభోధాలను నివేదిక ప్రస్తావించింది. ప్రాచీన కాలంలో నాగరికతలలో ఎన్ని మనస్పర్ధలున్నా వలస ప్రజలతో సహజీవనం చేయటం సమాజ లక్ష్యంగా ఉండేది. ఇబేరియన్‌ పాలనలో అమెరికా ఖండానికి లక్షలాది స్పేనియన్‌లు, ఆంగ్లేయులు వలస పోవటం, 15వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు శ్రమ శక్తి కొరత తీర్చటం కోసం కోటి 20 లక్షల మంది ఆఫ్రికన్లను క్రూరపద్ధతులలో బానిసలుగా తీసుకువెళ్ళటం, 23 లక్షల చైనీయులు, 13 లక్షల మంది ఇండియన్లు ఈశాన్య ఆసియా దేశాలకు కాంట్రాక్టు కార్మికులుగా వెళ్ళటాన్ని నివేదిక పేర్కొన్నది. బ్రిటన్‌లోని పారిశ్రామిక విప్లవం గ్రామ సీమల నుండి పట్టణాలకు వలసల వేగాన్ని పెంచింది. ఇదే కాలంలో బ్రిటన్‌ న్యూయార్క్‌ల మధ్య తగ్గిన రవాణా ఖర్చులు, స్వీడన్‌ ఐరిష్‌ దేశాల నుండి వలస వెళ్ళిన ప్రజల వేతనాలు సంపన్న దేశాల స్థాయిలో ఉండటం మానవ వలసలకు ప్రోత్సాహకర వాతావరణం ఏర్పరచిందని నివేదిక చెప్పింది. అర్జెంటీనా వంటి దేశాలు వలస వెళ్ళే ప్రజలకు కల్పించిన ప్రయాణ సబ్సిడీలు, బ్రెజిల్‌ లాంటి దేశాలు వలస వచ్చిన ప్రజలకు ఉచితంగా అప్పగించిన భూములు, 1924వరకు అమెరికాలో శాశ్వత నివాసమేర్పరచుకోటానికి వలస ప్రజలకు ఆంక్షలు లేని వాతావరణం, 19వ శతాబ్ధంలో చరిత్రలో నిలిచిన మానవ వలసల స్వేచ్ఛా సమాజాన్ని ప్రస్తావిస్తూ, సమకాలీన కాలంలో మానవ వలసలలోని నూతన కోణాల్ని చూడటానికి ఈ చరిత్ర ప్రాతిపదికను అందించిందని నివేదిక చెప్పింది. ఈ నాటికంటే ప్రపంచవ్యాపితంగా 19వ శతాబ్ధంలో మానవ వలసల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనించాల్సిన అంశం.

మానవ వలసలపై ఆంక్షల్ని ప్రారంభించిన 20వ శతాబ్దం:

పారిశ్రామికాభివృద్ధి పెరుగుతూ నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, పౌరపాలనలో సరిహద్దులు, సంరక్షణ అనే భావన పెరిగింది. అభివృద్ధి చెందిన వివిధ దేశాలు శ్రమశక్తి కొరతగా ఉన్నప్పుడు విదేశాల నుండి మానవ వలసల్ని ప్రోత్సహించటం, కరువుకాటకాలు, ఆర్థిక సంక్షోభకాలాల్లో మానవ వలసలపై ఆంక్షలు విధించటం రివాజుగా మారిపోయిందని నివేదిక అభిప్రాయపడింది. మానవ శ్రమశక్తి మారకానికి వివిధ దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 1942లో మెక్సికన్‌ ఫారమ్‌ లేబర్‌(బ్రాసరో) ఒప్పందం క్రింద అమెరికా 22 సం||లపాటు 4.6 మిలియన్ల కాంట్రాక్టు కార్మికులను మెక్సికో నుండి తమ దేశానికి అనుమతించింది. దీనిని 1964లో రద్దు చేసింది. 1947లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఆస్ట్రేలియాల మధ్య కుదిరిన అసిస్టెడ్‌ ప్యాసేజ్‌ అగ్రిమెంట్‌, గెస్ట్‌ వర్కర్‌ ప్రోగ్రామ్‌లాంటి యూరోపియన్‌ యూనియన్‌ కార్మిక సంఘాల ఒప్పందాలు ఈ దిశలో ప్రాచుర్యాన్ని పొందాయి. 1970వ సం||లో ప్రపంచ దేశాలను కుదిపిన ఆయిల్‌షాక్‌తో ఈ ఒప్పందాలు రద్దయ్యాయి. అదే సందర్భంలో గల్ఫ్‌ దేశాలలో ఆయిల్‌ వాణిజ్యం ఆకర్షణీయంగా ఉన్న నేపథ్యంలో ఆ దేశాలకు మానవ వలసలు ఎక్కువయ్యాయి. ఇన్ని ఆంక్షలు ఉన్నా 1960 ప్రపంచ జనాభాలో 2.7శాతం ఉన్న వలస ప్రజలు 2010 నాటికి 2.8శాతం ఉండటం వలస ప్రజల సంఖ్య స్థిరత్వాన్ని తెలియచేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలలో జనాభాలో 5 శాతం నుండి 12 శాతానికి, గల్ఫ్‌ దేశాలలో 5 శాతం నుండి 39 శాతానికి వలస ప్రజలు పెరిగారు. మిగిలిన ప్రపంచంలో వలస ప్రజల శాతం స్థిరంగానూ, కొన్ని దేశాలలో తక్కువగానూ ఉన్నాయి.

పెరుగుతున్న పట్టణీకరణ-సవాళ్ళు:

వివిధ దేశాల్లో అంతర్గత వలసల స్థాయి పెరుగుతుంది. నివేదిక పరిశీలించిన 18 దేశాలలో 11 దేశాలలో ఈ వలసల స్థాయి అధికంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రామాల నుండి పట్టణాలకు వచ్చే వలసలు పెరుగుతున్నాయి. 2050 నాటికి ప్రపంచవ్యాపితంగా ఉండే పట్టణ ప్రజలు ప్రస్తుత పట్టణ జనాభాకు రెట్టింపు ఉంటారని నివేదిక అంచనా వేస్తుంది. ఈ పెరుగుదల ఆఫ్రికా దేశాలలో 40 నుండి 60 శాతం వరకు ఉండవచ్చు. 2030 నాటికి పట్టణ ప్రజలలో 40శాతం(20లక్షలమంది) మురికివాడల్లో నివసిస్తారని, పట్టణీకరణకు నూతన సవాళ్ళు ముందున్నాయిని నివేదిక హెచ్చరిస్తుంది.

వలసలలోని రకాలు:

వలసలలను శాశ్విత వలసలు, తాత్కాలిక వలసలు, అక్రమ వలసలుగా వర్గీకరించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో తాత్కాలిక వలసలు లేదా స్వల్పకాలిక వలసలలో ప్రజల సంఖ్య అధికంగా ఉంది. సంపన్న దేశాలలో 83శాతం విదేశీయులు కనీసం 5 సం||లు నివసిస్తున్నట్లు నివేదిక చెప్తున్నది. వివిధ కారణాల రీత్యా శాశ్వత వలసలు తాత్కాలిక వలసలుగానూ, తాత్కాలిక వలసలు శాశ్వత, అక్రమ వలసలుగానూ, అక్రమ వలసలు శాశ్వత వలసలుగానూ రూపాంతరం చెందటం ప్రపంచవ్యాపితంగా ఉన్న పరిణామం. అమెరికా జనాభాలో 4 శాతం అక్రమ వలస ప్రజలే. ఆ దేశ వలస ప్రజలలో వీరు 30శాతం. శ్రమశక్తి కొరతను అధిగమించటానికి సంపన్న దేశాలు అక్రమ వలసల్ని చూసీచూడనట్లుగా ఉన్నాయి. 2007వ సం||లో జరిపిన సర్వేలో 78శాతం ప్రభుత్వాలు ఆయా దేశాలలో వలసల స్థాయి సంతృప్తికరంగా ఉందని, 17శాతం ప్రభుత్వాలు వలసల స్థాయి ఎక్కువగా ఉన్నాయని, 5శాతం ప్రభుత్వాలు వలసల స్థాయి తక్కువగా ఉన్నాయని తెల్పుతున్నట్లు నివేదిక ప్రస్తావించింది.

కార్బన్‌ ట్రేడింగ్‌పై విమర్శలు

పర్యావరణ కాలుష్యాన్ని పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం సృష్టించిన సామాజిక సంక్షోభంగా చూడాలి. శతాబ్దాలపాటు పారిశ్రామిక ఉత్పత్తిలో లాభార్జనే పరమావధిగా విచక్షణా రహితంగా వినియోగించిన శిలాజ ఇంధనాలు(ఫోసిల్‌ ఫ్యూయల్స్‌), అడవుల నరికివేత కలుషిత వాయువిడుదలలకు ప్రధాన కారణాలు. ప్రస్తుత దశకంలో ప్రపంచవ్యాపిత విద్యుదుత్పత్తిలో 80% శిలాజ ఇంధనాలపై ఆధారపడి ఉంది. వీటిలో చమురు భాగం 34%. ప్రపంచవ్యాపిత పారిశ్రామిక ఉత్పాదకతతో శిలాజ ఇంధనాలు బ్రహ్మముడి వేసుకొని ఉన్నాయి. వీటి వినియోగాల్ని తగ్గించటమంటే పారిశ్రామిక ఉత్పాదకతను, ఆర్ధికాభివృద్ధిని కుదించటంగా ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. అందుకనే క్యోటో ఒప్పందంలో శిలాజ ఇంధనాల వినియోగం తగ్గింపుకంటే కలుషిత వాయువిడుదలల సర్దుబాటుపై ఎక్కువ దృష్టి సారించాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో కార్బన్‌ ట్రేడింగ్‌ మాన్యతపై పర్యావరణవేత్తల కొన్ని విమర్శల్ని పరిశీలిద్దాం.

1. శిలాజ ఇంధనాల వినియోగాన్ని కార్బన్‌ ట్రేడింగ్‌ తగ్గించలేదు: కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రక్రియలో పారిశ్రామిక దేశాలు ఉత్పత్తి స్థానంలో కలుషిత వాయు విడుదలల్ని తగ్గించటం లేదు. వర్ధమాన దేశాలు కార్బన్‌ నిల్వల్ని పెంచటానికి పెట్టుబడులుపెట్టి వారి వాయువిడుదలల్ని సర్ధుబాటు చేసుకుంటున్నారు. ఆర్థిక దృక్కోణంలో కార్బన్‌వాయు విడుదలల సర్దుబాటు కాలుష్యాన్ని నివారించినట్లు కనిపించినా పర్యావరణ దృక్కోణంలో ఉత్పత్తి స్థానంలో శిలాజ ఇంధనాల వినియోగం, కలుషిత వాయు విడుదలల తగ్గింపే శాస్త్రీయమైన కాలుష్యనివారణ అవుతుంది. పర్యావరణ కాలుష్య సమస్యను కార్బన్‌ ట్రేడింగ్‌ పరిష్కరించలేకపోతుంది.

2. కార్బన్‌ ట్రేడింగ్‌ అసమానతల ప్రాతిపదికపై నిర్మించబడింది: పర్యావరణ పరిరక్షణ సూత్రాలననుసరించి పర్యావరణాన్ని ఏమేరకు కలుషితమొనరిస్తున్నారో, ఆ మేరకు కాలుష్యకారకులు సమానత ప్రాతిపదికన నష్టాన్ని భరించాలి. పారిశ్రామిక దేశాలు తాము కలుషితం చేస్తున్న పర్యావరణ విలువ కంటే అతితక్కువ వ్యయంతో కలుషిత వాయు విడుదలల్ని సర్దుబాటు చేసుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం వర్ధమాన దేశాలలో అడవులు, తోటల పెంపకానికి అయ్యే ఖర్చుకంటే 50 నుండి 200 రెట్లు అధికంగా సంపన్న దేశాలలో వారు సృష్టించిన కాలుష్యాన్ని తగ్గించటానికి వ్యయమవుతుంది. లాభాలనార్జిస్తూ పర్యావరణ కాలుష్య హక్కులను పారిశ్రామిక దేశాలు పొందుతుంటే, తాము కారణం కాని వర్ధమాన దేశాల పేద ప్రజానీకం కాలుష్య నష్టాలను అనుభవిస్తూ, కాలుష్య నివారణా బాధ్యతను మోయాల్సివస్తుంది.

3. కాలుష్య నివారణను నీరుకార్చటమే కార్బన్‌ ట్రేడింగ్‌ లక్ష్యం: కాలుష్యరంగంలో మార్కెట్‌ను సృష్టించటం సామాజిక దృక్కోణంలో అనైతిక చర్య. పర్యావరణ పరిరక్షణకు ప్రధానంగా గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల్ని అడ్డుకోవాలి. కాని వాటిని వాణిజ్య సరుకుగా మార్చి, ఆ సరుకు లాభదాయకమైతే పెట్టుబడిదారీ వ్యవస్థలో వాటి ఉత్పత్తి నిరాఘాటంగా కొనసాగింపబడుతుంది. డచ్‌ జాతీయ ప్రజారోగ్యం, పర్యావరణ సంస్థ అంచనాల ప్రకారం కార్బన్‌ ట్రేడింగ్‌ ద్వారా గ్రీన్‌హస్‌ వాయువిడుదలల్ని 2012 నాటికి 0.1% మించి తగ్గించలేరన్నారు. క్యోటో ఒప్పంద లక్ష్యమైన 5.2% గగనకుసుమమైంది. అందువల్ల కార్బన్‌ట్రేడింగ్‌ వల్ల కాలుష్య నివారణను వాయిదావేయటం లేదా నిర్లక్ష్యం చేయటం జరుగుతుంది కాని కాలుష్య నివారణ సాధింపబడదు.

4. వాతావరణ ప్రైవేటీకరణ - కార్బన్‌ ట్రేడింగ్‌ మార్గం: పౌరులకు స్వచ్ఛమైన గాలిని, పర్యావరణ భద్రతను అందిచాల్సిందిపోయి వాతావరణాన్ని కలుషితం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు వాతావరణంపై సర్వహక్కుల్ని కార్బన్‌ట్రేడింగ్‌ ధారాదత్తం చేస్తుంది.

5. నయా ఉదారవాద మానసపుత్రిక కార్బన్‌ట్రేడింగ్‌: కలుషిత వాయు విడుదలల్ని నిర్మూలించాలనే నైతికమైన, పర్యావరణ పరమైన సామాజిక సమస్యను బిలియన్‌ డాలర్ల సంపదను పోగుచేసుకోగలిగే వాణిజ్య వనరుగా కార్బన్‌ట్రేడింగ్‌ మార్చింది. 'అనిశ్చితిని' సరుకుగా మార్చేది నయాఉదారవాద స్ఫూర్తి. కార్బన్‌ నిల్వల గిరాకీ-సరఫరాలలోని అనిశ్చితిని అసరాగా చేసుకొని కార్బన్‌మార్కెట్‌లలోకూడా డెరివేటీవ్‌ల్ని అమలు చేశారు. వాటి ప్రభావంగా మానవాళి మనుగడను సవాలు చేస్తున్న పర్యావరణ కాలుష్యం యొక్క నివారణ ప్రక్రియలలో జూదప్రవృత్తి పెరిగింది. కార్బన్‌ నిల్వలు కార్బన్‌వలయం(కార్బన్‌ సైకిల్‌)లో కాకుండా వాల్‌స్ట్రీట్‌లో పరిభ్రమిస్తున్నాయి.

6. కార్బన్‌ ట్రేడింగ్‌లో దుశ్చర్యలు: శీతలీకరణ వాయుఉత్పత్తిలో విడుదలయ్యే ట్రైక్లోరోమీథేన్‌ను చౌకగా నాశనం చేసి అత్యధిక లాభాలనార్జించటం, అడవులు వనాల పెంపకంలో కార్బన్‌డైయాక్సైడ్‌ను విడుదల చేసే మోనోకల్చర్‌ సాగును ప్రోత్సహించటం, కార్బన్‌ క్రెడిట్‌ లెక్కింపులలో కుంభకోణాలకు పాల్పడటం కార్బన్‌ ట్రేడింగ్‌లో దుశ్చర్యలుగా బహుళ ప్రచారంలో ఉన్నాయి.


కార్బన్‌ ట్రేడింగ్‌ ఎంత ప్రయోజనకరం?

మానవాళి మనుగడకు విఘాతమై, ప్రకృతి వైపరీత్యాలకు కారణభూతమౌతూ, పర్యావరణ కాలుష్యాలైన గ్రీన్‌హౌస్‌ విషవాయువుల నియంత్రణకు భూగోళంలోని ఉత్తర దేశాలు(ధనిక దేశాలు) కార్బన్‌ట్రేడింగ్‌ను ప్రధాన సాధనంగా ఎంచుకున్నాయి. కార్బన్‌ ట్రేడింగ్‌ ద్వారా ఉత్తరదేశాల కాలుష్యవాయు విడుదలల అదుపుకు దక్షిణ దేశాలు (వర్దమాన దేశాలు) కార్బన్‌ నిల్వల స్థావరాలై, కార్బన్‌ మార్కెట్ల విక్రయదారులయ్యాయి. క్యోటో ఒప్పందంలో 170 దేశాల ఆమోదంతో సాధికారత పొందిన కార్బన్‌ ట్రేడింగ్‌ అంతర్జాతీయంగా సామాజిక కార్యకర్తలలోనూ, పర్యావరణ వాదులలోను తీవ్రమైన చర్చనీయాంశమైంది. కార్బన్‌ వాయు విడుదలల అదుపుకు అనువైన మార్గంగా మద్ధతుదార్లు వాదిస్తుంటే, పర్యావరణ కాలుష్యాన్ని మరింతగా కాలుష్య పరచటానికి కాలుష్యదారులకు లైసెన్స్‌ ఇవ్వటంగా పర్యావరణవాదులు విమర్శిస్తున్నారు.

చెప్పబడుతున్న ప్రయోజనాలు: 1) క్యోటో ఒప్పందం ఆమోదించిన వాయువిడుదలల ప్రక్రియలో 'పరిమితి-వాణిజ్యం' (క్యాప్‌ అండ్‌ ట్రేడ్‌) విధానం కీలకమైంది. ఈ విధానానికి లోబడి అభివృద్ధి చెందిన దేశాలు/అందులోని పరిశ్రమలు నిర్ణీత కాలవ్యవధిలో అంగీకరించిన కోటాల మేరకు కాలుష్య విడుదలల్ని అదుపు చేయాల్సి ఉంది. ఈ కార్యసాధనలో కార్బన్‌ ట్రేడింగ్‌ సులభమైన పద్ధతులలో సులువుగా వాయువిడుదలల అదుపుకు తోడ్పడుతుంది.

2) క్యోటో ఒప్పందం ఏర్పరచిన 'కార్బన్‌ డెవలప్‌మెంట్‌ మెకానిజం' కింద అనుబంధం-1 పరిధిలోని అత్యధిక వాయువిడుదల దేశాలు తమ వాయువిడుదలలను సర్దుబాటు చేసుకోవటం కోసం, అనుబంధం-1 కిందకు రాని అత్యల్ప వాయువిడుదలల దేశాల నుండి కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్‌లు కొనుగోలు చేసుకునే వీలుకల్పించింది. తమ దేశాలు వాయువిడుదలల అదుపుకు సంబంధించిన నిర్వాహణ వ్యయం అత్యధికంగా ఉన్న కారణంగాను ప్రకృతి వనరుల లభ్యత కొరత ఉన్న కారణంగాను తక్కువ ఖర్చుతో వర్దమాన దేశాల నుండి కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్లు(సర్టిఫికెట్‌ ఆఫ్‌ కార్బన్‌ రిడక్షన్‌) కొనుక్కోవటం ఉత్తర దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇందుకోసం కార్బన్‌ విడుదలల సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయటం, కార్బన్‌ నిల్వలు పెంచటంలో దక్షిణ దేశాలకు గణనీయమైన నిధులు, పరిజ్ఞానం లభ్యమౌతాయి. వీటితో ఆయా దేశాలు ఆర్ధిక అభివృద్ధికి దోహదపడే పేదరిక నిర్మూలనకు, ఉపాధి అవకాశాల పెంపుకు అవసరమయ్యే నిధుల కొరతను తేలిగ్గా అధిగమించవచ్చును. 3) కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రక్రియలో వర్ధమాన దేశాలలో కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్ల అభివృద్ధికి చేపట్టే ప్రధాన చర్యలైన వన పరిరక్షణ, అడవుల అభివృద్ధి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నిర్వాహణల వల్ల కాలుష్య నియంత్రణ కోసం అంతర్జాతీయంగా వెచ్చించే అధిక వ్యయం ఆదా అవుతుంది.

దీనిని ఆర్ధిక అభివృద్ధిలో మరొక రంగంలో వినియోగించుకోవచ్చును. 4) అడవులు అభివృద్ధితో వన్యప్రాణుల రక్షణ పెరుగుతుంది. 5) కార్బన్‌ ట్రేడింగ్‌లో కార్బన్‌ నిల్వల్ని సరుకుగా పరిగణించిన కారణంగా మార్కెట్‌ శక్తులకు సరుకుల వాణిజ్యంలో ఉన్న అనుభవం దృష్ట్యా కార్బన్‌ వాణిజ్యం తేలికైయ్యింది. కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్లు కార్బన్‌ రిడక్షన్‌ సర్టిఫికెట్‌ల రూపంలో ఉండటం మూలకంగా స్టాక్‌మార్కెట్‌ పద్ధతుల్ని ఈ విక్రయంలో అమలు చేయటం తేలికయ్యింది. వర్ధమాన దేశాలలోని పరిశ్రమలు కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్ల ఆర్జన కోసం తమ పరిశ్రమల్ని అల్పవాయు విడుదలల పరిజ్ఞానానికి మార్చుకోవటం మూలకంగా పర్యావరణంపై మరింత భారం తగ్గుతుంది.

6) కాలుష్య వాయువిడుదలల కంపెనీల ఉత్పత్తులపై వేసే పన్నును కార్బన్‌ టాక్స్‌ అంటారు. కార్బన్‌ టాక్స్‌ ఆర్థిక వ్యవస్థలో పన్ను భారాల్ని పెంచేదృష్ట్యా దీనికంటే కార్బన్‌ క్రెడిట్‌ పద్ధతి మెరుగైనదని అంటున్నారు. తాజాగా చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన కార్బన్‌టాక్స్‌ ఒక ఉదాహరణ.

భారతదేశంలో కార్బన్‌ ట్రేడింగ్‌: ప్రపంచ కార్బన్‌ ట్రేడింగ్‌ మార్కెట్‌లో చైనా 73%, భారత్‌, బ్రెజిల్‌ దేశాలు ఒక్కొక్కటి 8% మార్కెట్‌ షేర్‌ కలిగి ఉన్నాయి. కానీ కార్బన్‌ డెవలప్‌మెంట్‌ మెకానిజం ప్రాజెక్టులలో అత్యధికం మన దేశానివి. 2009 సం||లో ఐరోపాలో కార్బన్‌ ట్రేడింగ్‌ వాణిజ్యం 64 బిలియన్‌ డాలర్లు(కార్బన్‌ ధరలు తగ్గిన కారణంగా) ఉండగా మన దేశం 5 బిలియన్‌ డాలర్ల వాణిజ్యాన్ని చేజిక్కించుకుంది. ప్రపంచ వ్యాపితంగా కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రాజెక్టులలో 72% కార్బన్‌ పీల్చుకునే వనాలు, అడవుల పెంపకం సంబంధించినవి కాగా, 21% బయోమాస్‌, 2% పునరుద్ధరించగలిగే ఇంధన ప్రాజెక్టులు ఉన్నాయి.

లక్ష హెక్టార్లు కొత్త అడవులు 10 లక్షల టన్నుల కార్బన్‌ నిల్వల్ని పెంచుతాయని అంచనా వేస్తున్నారు. ఒక హెక్టార్‌లోని యూకలిప్టస్‌ చెట్లు సాధారణంగా 5 టన్నుల కార్బన్‌ని నిల్వ చేస్తుందంటున్నారు. కార్బన్‌ ట్రేడింగ్‌లో వీటన్నింటికీ టన్నుకు ఒక యూనిట్‌ చొప్పున కార్బన్‌ క్రెడిట్‌లు ఇవ్వబడతాయి. ఈ మధ్య కాలంలో సుబాబుల్‌, యూకిలిప్టస్‌ చెట్ల సాగు భారీగా పెరగటానికి ఈ విధానాలే కారణం. అందుకోసమే ప్రపంచబ్యాంకు విధానాల అమలులో వనసంరక్షణ, చెట్ల పెంపకం ముఖ్య షరతు అయ్యింది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో పర్యావరణ మంత్రిత్వశాఖ ఏర్పడింది. మన దేశంలో ఈ ప్రాజెక్టుల కింద అనేక వనసంరక్షణ, చెట్ల పెంపక పథకాలు వెలిశాయి. ధనిక దేశాలలో కాలుష్య నివారణకు, పెట్టుబడిదారుల అధిక లాభాల పరిరక్షణకు వర్దమాన దేశాల భూమి అడవుల పెంపకంలోనూ, వనసంరక్షణలోనూ ప్రధాన వనరయ్యింది.

ప్రపంచ పర్యావరణ కాలుష్య అదుపుకు స్థావరంగా మారిన భారతదేశంలో కాలుష్య వాయువిడుదలల స్థాయి అంతకంతకు పెరుగుతున్నది. వాయువిడుదలల స్థూలపరిమాణంలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న జపాన్‌ను మన దేశం ఇప్పటికే అధిగమించింది. ప్రపంచ సగటు వాయువిడుదలలో భారతదేశం రెట్టింపయ్యింది. 2005 సం|| గణాంకాల ప్రకారం భారతదేశంలో కాలుష్యవాయువిడుదలలు విద్యుత్‌రంగంలో 55%, ట్రాన్స్‌పోర్టు 9%, పరిశ్రమలలో 31%, ఇతరాలు 5%గా ఉన్నాయి. ప్రైవేటు వాహనాల పెరుగుదలల వల్ల కాలుష్యవాయు విడుదలలు మనదేశంలో 5.6 రెట్లు పెరగగా చైనాలో 3.4 రెట్లు మాత్రమే పెరిగింది.

వాహన కార్బన్‌కాలుష్య అదుపుకు మన కార్లరంగంలో యూరో-1/ఇండియా 2000, యూరో-2/భారత్‌-2, యూరో-3/భారత్‌-3, యూరో-4/భారత్‌-4 ప్రమాణాలు పాటిస్తున్నాము. యూరో ప్రమాణాలు యూరప్‌ దేశానివి. ఐ.ఎస్‌: 1460-2000 మరియు ఐ.ఎస్‌: 2796-2000 డిజిల్‌, పెట్రోల్‌ ఇంధనాల గుణాత్మక విలువలు. ఇది భారత్‌-2కి సమానమైనవి. భారత్‌-3 ప్రమాణాలు 2010లోగా దేశమంతటా అమలు చేయాల్సి ఉండగా భారత్‌-4/యూరో-4 ప్రమాణాల్ని 2010నాటికి 10 మెట్రో నగరాలలో అమలు చేయాల్సి ఉంది. వీటివల్ల చేకూరే కార్బన్‌ వాయు విడుదలల అదుపు ఆ కంపెనీలకు కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్లను సంపాదించి ఇస్తాయి.

ముగింపు: హిల్లరీ క్లింటన్‌ ఇటీవలి భారత్‌ పర్యటనలో వాయువిడుదల కాలుష్యంలో అమెరికా చేసిన తప్పును భారతదేశం చేయవద్దని హితవు పలికింది. ఇంతవరకు కాలుష్యవాయు విడుదలలపై ఏ రకమైన పరిమితులు వర్తించని భారతదేశం ఇక నుండి పరిమితుల్ని అంగీకరంచాలనేదే ఆవిడ అంతరంగం. అందుకోసంగా మన ఆర్థిక అభివృద్ధిని ఫణంగా పెట్టాల్సిఉంది.

కార్బన్‌ ట్రేడింగ్‌ పరిచయం

సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో త్వరితమైన పారిశ్రామికీకరణ కీలకమైంది. విద్యుత్‌, స్టీల్‌, జౌళీ, ఎరువులు తదితర పరిశ్రమలలో వాడుతున్న బొగ్గు, సహజవాయువు, పెట్రోలియంలాంటి శిలాజ ఇంధనాలు, పెరిగిన వినిమయ సంస్కృతి, అడవుల నరికివేత కారణంగా భూ వాతావరణంలో కార్బన్‌డైఆక్సైడ్‌(బొగ్గుపులుసు వాయువు), మీథేన్‌, నైట్రస్‌ఆక్సైడ్‌, హైడ్రో, ఫ్లోరో కార్బన్‌లాంటి గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల(గ్యాస్‌ ఎమిషన్స్‌) మితిమీరింది. వీటి కారణంగా భూగోళం వేడెక్కి(గ్లోబల్‌ వార్మింగ్‌) మానవాళికి ముప్పు కలిగిస్తున్న ఎల్‌నినో, అకాల వర్షాలు, ఆమ్లవర్షాలు, దీర్ఘకాలిక కరువులు, భూగర్భ నీటి మట్టాలు తగ్గిపోవటం, మంచుకొండలు కరగటం, నదులు, సముద్రాలు పొంగటం లాంటివి సంభవిస్తున్నాయి.

గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలను అదుపు చేయటానికి 1990 మొదటి భాగంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ సదస్సులో అంతర్జాతీయ ప్రయత్నాలు మొదలయ్యాయి. 1997లో 170 దేశాలు ఆమోదించిన క్యోటో ఒప్పందం(అమెరికా సంతకం చేయలేదు) గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల్ని తగ్గించటానికి వివిధ దేశాలకు కోటాలు(క్యాప్స్‌) నిర్ణయించింది. 2008 నుండి 2012 సం||లలో 1990సం||లోని కార్బన్‌ వాయువుల స్థాయి నుండి 5.2% తగ్గించాలని నిర్ణయించారు.

తాజాగా 2009 జూలై 17న ఇటలీలో జరిగిన 17 దేశాల సదస్సు పార్రిశ్రామికీకరణకు ముందుగా వున్న ఉష్ణోగ్రత కంటే 2 సెల్సియస్‌ డిగ్రీలు మించి ఉష్ణోగ్రత ఉండరాదని నిర్ణయించాయి. 2050 నాటికి గణనీయంగా కార్బన్‌ వాయువిడుదలను నియంత్రించాలన్నాయి. క్యోటో ఒప్పందం చట్టబద్ధమైంది. ఈ ఒప్పందంలో భాగంగా కార్బన్‌ వాయువుల అదుపుకు వివిధ దేశాలకు విధించిన కోటాలను సాధించటం కోసం కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రక్రియను క్యోటో ఒప్పందం ఆమోదించింది.

కార్బన్‌ ట్రేడింగ్‌ అంటే : భూ వాతావరణంలో అత్యధిక స్థాయిలో కార్బన్‌ వాయువిడుదలలో అభివృద్ధి చెందిన దేశాల పాత్ర ప్రధానమైంది. ప్రపంచజనాభాలో అయిదుశాతంగా ఉన్న అమెరికా ప్రపంచ కాలుష్యంలో 26శాతానికి కారణ భూతమైంది. అంతర్జాతీయ ప్యానల్‌ లెక్కల ప్రకారం గ్రీన్‌హౌస్‌ వాయువులు విడిచిపెట్టే దేశాలలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా చైనా 91వ స్థానంలోనూ, భారత్‌ 124వ స్థానంలోనూ ఉన్నాయి. ఉత్తర అమెరికా ఖండం తరువాత యూరప్‌ దేశాలు ప్రపంచ కాలుష్య స్థావరాల్లో ప్రసిద్ధికెక్కాయి.

క్యోటో ఒప్పందం ప్రకారం ఒక అభివృద్ధి చెందిన దేశంకానీ, దానిలోని పరిశ్రమకానీ(అధిక కార్బన్‌ వాయు విడుదలలు కలిగిన దేశం), తక్కువ కార్బన్‌ వాయు విడుదలలు కలిగిన దేశంతో కానీ దానిలోని పరిశ్రమలతోకానీ కార్బన్‌ వాయు విడుదలల మారక ఒప్పందం చేసుకోవచ్చు.

తక్కువ కార్బన్‌ వాయు విడుదలలను ''దృవీకరించబడ్డ కార్బన్‌వాయు విడుదలలు తగ్గింపు'' యూనిట్లు(సర్టిఫైడ్‌ ఎమిషన్‌ రిడక్షన్‌) అంటారు. అంటే ఈ యూనిట్లలో అధిక కార్బన్‌ వాయువిడుదల దేశాలు/కంపెనీలు పెట్టుబడులను పెట్టవచ్చు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే ఒప్పందంలోని రెండు దేశాలు క్యోటో ఒప్పందం అంగీకరించిన దేశాలై ఉండాలి. క్యోటో ఒప్పందం కింద పై ప్రక్రియలో కార్బన్‌ వాయువుల నిల్వలను, తగ్గింపును ''క్లీన్‌ డెవలప్‌మెంట్‌ మెకానిజం'' ద్వారా నిర్వహింపబడుతుంది. ఈ యంత్రాంగం నిర్వహణకు ఒక ఎగ్జిక్యూటీవ్‌ బోర్డు ఏర్పాటు చేయబడింది. తక్కువ ఖరీదులో కార్బన్‌వాయువు అదుపు, కార్బన్‌ నిల్వలు పెంచటమే ఈ మెకానిజం ప్రధాన లక్ష్యం. ఈ మెకానిజం కింద కార్బన్‌వాయువు అదుపు చేసే సందర్భంలో ప్రతి ఒక్క మెట్రిక్‌టన్ను వాయువుకు ఒక యూనిట్‌ క్రెడిట్‌ ఇస్తారు. కార్బన్‌వాయువును ఏమేరకు అదుపుచేసి/నిల్వ చేయగలరో ఆ మేరకు క్రెడిట్‌ యూనిట్ల సంఖ్య పెరుగుతుంది.(చెట్లు ఆక్సిజన్‌ను వదిలి కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకోవటమే కార్బన్‌ నిల్వలు పెరగటం)

కార్బన్‌ క్రెడిట్స్‌ : ఇవి రెండు రకాలు కార్బన్‌ ఆఫ్‌సెట్‌ క్రెడిట్‌, కార్బన్‌ రిడక్షన్‌ క్రెడిట్‌. సంప్రదాయ ఇంధన ఉత్పత్తి పద్ధతులైన వాయు(విండ్‌), సూర్యరశ్మి(సోలార్‌), జల(హైడ్రో) మరియు బయోఇంధనాల ద్వారా అదుపు చేయబడ్డ కార్బన్‌ను కార్బన్‌ ఆఫ్‌సెట్‌ క్రెడిట్‌ కింద, అడవుల పరిరక్షణ, అడవుల పెంపకం, మహా సముద్రాలలోనూ, భూగర్భంలోనూ కార్బన్‌ నిల్వలు పాతిపెట్టే పద్ధతులతో కార్బన్‌ను అదుపు చేయటం కార్బన్‌ రిడక్షన్‌ క్రెడిట్‌ క్రింద పరిగణిస్తారు. ఈ పద్ధతులలో ఆర్జించిన కార్బన్‌ క్రెడిట్లను క్యోటో ఒప్పంద పరిధిలో అభివృద్ధి చెందిన దేశాలతోకానీ లేదా ఆయా దేశాలలోని పారిశ్రామిక కంపెనీలతోకానీ మార్కెట్‌ ధరకు అమ్ముకోవచ్చు. లేదా పెట్టుబడులను స్వీకరించవచ్చు. ప్రపంచవ్యాపితంగా అత్యధిక కార్బన్‌ వాయువిడుదలల దేశాలు/కంపెనీలు ఈ మార్కెట్‌లో కార్బన్‌ విక్రయాలతో తమ కార్బన్‌ వాయువిడుదల రేటును తగ్గించుకుంటున్నాయి. ఈ విధమైన కార్బన్‌ క్రెడిట్‌ యూనిట్ల వ్యాపారాన్ని కార్బన్‌ ట్రేడింగ్‌ అంటున్నారు. అత్యధిక కాలుష్యకారకులైన ధనికదేశాలు అత్యధిక లాభాలు పొందుతూ, కాలుష్యానికి కారణం కాని వర్ధమాన దేశాలతో కార్బన్‌ విడుదల అదుపు చేయించటమే కార్బన్‌ ట్రేడింగ్‌ సారాంశం.

కార్బన్‌ మార్కెట్‌ : కార్బన్‌ట్రేడింగ్‌ అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన వాణిజ్యంగా రూపుదిద్దుకుంది. 2006వ సం||లో ప్రపంచవ్యాపితంగా 30బిలియన్‌ డాలర్లు ఉన్న కార్బన్‌ మార్కెట్‌ ప్రస్తుతానికి 1 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌గా పరిణామం చెందింది. చైనా, భారతదేశం ఈ మార్కెట్‌లలోని కార్బన్‌ విక్రయాలలో ప్రముఖంగా ఉన్నాయి. యూరప్‌ దేశాలతో కార్బన్‌ ట్రేడింగ్‌ ఎక్కువగా నిర్వహింపబడుతున్నది. కార్బన్‌ మార్కెట్‌లో స్పాట్‌ మార్కెట్‌లు, డెరివెటీవ్‌ మార్కెట్‌లు అమలులో ఉన్నాయి. డెరివెటీవ్‌లలో ప్యూచర్‌లు, ఆక్షన్‌లు ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రపంచబ్యాంక్‌తో సంయుక్తంగా పనిచేసిన ప్రైస్‌వాటర్‌కూపర్‌ అభిప్రాయంలో కార్బన్‌ ట్రేడ్‌ - కాపీరైట్‌, పేటెంట్‌, లైసెన్సింగ్‌ మరియు వాణిజ్య పారిశ్రామిక ట్రేడ్‌మార్క్‌ హక్కులతో సమానమైందన్నారు. నయాఉదారవాద విధానాలలో కార్బన్‌ ట్రేడింగ్‌ ద్వారా భూవాతావరణం కూడా ప్రైవేటీకరించబడుతుందని పర్యావరణవాదులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఫైనాన్షియల్‌ రంగంలో డెరివెటీవ్‌లు సృష్టించిన విలయాన్ని భవిష్యత్‌లో పర్యావరణ రంగంలో కార్బన్‌ ట్రేడింగ్‌ సృష్టిస్తుందని ప్రముఖ పర్యావరణవేత్త లారీలోV్‌ామన్‌ హెచ్చరిస్తున్నారు.

Sunday, November 8, 2009

ఆర్ధిక జీవనం

తాత్విక బోధనలేన్ని చెప్పినా నిత్య జీవితం లో" ఆర్ధిక జీవనం" విడతీయలేని అంతర్భాగం అయింది .. దీనికి పునాది జీవనోపాధి.' కోటి విద్యలు కూటికొరకే ' అనే సామెత అనాదినుండి ప్రాచుర్యం లో వున్న లోకోక్తి. ఈ జీవనోపాధి ప్రస్తుతం మార్కెట్ లో సరుకు గా మారింది .యువత వుపాది కోసం వెంపరలాడు తున్నారు. ఈ వుపాది కల్పన పై అనేక బాహ్య ప్రభావాలు పడుతున్నాయి .ప్రపంచం లో సంభవిస్తున్న అనేక ఆర్ధిక .సామాజిక .రాజకీయ పరిణామాలు మానవ జీవన సరళి ని మార్చుతున్నాయి . వాటిపై నా లో కల్గిన స్పందనలు .చెప్పాలనుకున్న విశ్లేషణ లే ఈ బ్లాగ్గ్ ప్రతి రూపం . స్వీకరించండి ;స్పందించండి .ధన్యవాదాలు

మన్నికయ్యే అభివృద్ధి

పెట్టుబడిదారీ ప్రపం చీ కరణ సృష్టించిన ఆర్థిక, సామాజిక అసమాన తలకు తోడుగా, పర్యావరణ మార్పు దుష్ప్రభావాలు ప్రపంచ మానవ జాతిని వణికిస్తున్న నేపథ్యంలో ''వివిధ అభివృద్ధి నమూనాల'' చర్చలు తెరపైకి వస్తున్నాయి. యుయన్‌డిపి నేతృత్వం లోని ''మానవాభివృద్ధి భావన''(హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌), యూరప్‌ నమూనాగా ప్రాచుర్యం పొందిన ''ఇముడ్చు కోగలిగే అభివృ ద్ధి''(ఇన్‌క్లూసివ్‌ డెవలప్‌మెంట్‌), విశ్వమానవ సిద్ధాంతంగా పిలవబడుతున్న ''సమానత్వ అభివృద్ధి''(ఇక్విటబుల్‌ డెవలప్‌మెంట్‌) సరసన, కొపెన్‌హగెన్‌ ''పర్యావరణ పరిరక్షణ'' చర్చల ప్రభావంతో ''మన్నికయ్యే అభివృద్ధి''(సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌) ప్రాధాన్యతను సంతరించుకున్నది.

చారిత్రక నేపథ్యం: ఐక్యరాజ్య సమితి నియమించిన ''పర్యావరణ మరియు అభివృద్ధి'' ప్రపంచ కమీషన్‌ బ్రన్డ్‌ట్లాన్డ్‌ కమీషన్‌గా 1987లో ''మన సమిష్టి భవిష్యత్‌''పేర ''అభివృద్ధిపై పర్యావరణ ప్రభావాలను'' విశ్లేషిస్తూ నివేదికను సమర్పించింది. అంతర్జాతీయ అసమానతలు, పేదరిక మూలాల్ని స్పృశించకుండా పర్యావరణ దుష్ప్రభావాలను నివారించే ప్రయత్నాలు వ్యర్ధమని చెప్తూ, నివేదిక ''మన్నికయ్యే అభివృద్ధి'' భావనను మొదటిసారిగా పరిచయం చేసింది. 1992లో నిర్వహించబడ్డ ''రియో భూగోళ సదస్సు''లో, పర్యావరణ మార్పు ముప్పుతో అభివృద్ధిపై వ్యక్తమవుతున్న వివిధ దేశాల భయాందోళనలను నివారించే ప్రయత్నంలో భాగంగా ''మన్నికయ్యే అభివృద్ధి'' సాధనకు ఒక కమీషన్‌ నియమింపబడింది. అప్పటి నుండి పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలు అంతర్జాతీయ పర్యావరణ చట్టాల్లో చోటు చేసుకోవటంతోపాటు, 2002లో జొహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన ప్రపంచ భూగోళ సదస్సు ''మన్నికైన అభివృద్ధి''పై ప్రత్యేకంగా చర్చించి, కార్యాచరణల్ని రూపొందించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ''మన్నికయ్యే అభివృద్ధి ప్రపంచ కమీషన్‌'' ఈ కార్యాచరణల్ని వార్షికంగా సమీక్షిస్తుంది. ఈ కమీషన్‌ 17వ సమావేశం మే 2009లో న్యూయార్క్‌లో జరిగింది.

మన్నికైన అభివృద్ధి అంటే?: పైన పేర్కొన్న వివిధ సదస్సుల్లో రూపొందిన భావనను బట్టి సారాంశంగా ''భవిష్యత్తరాల అవసరాలు తీర్చగలిగే సామర్ధ్యాలపై ఎటువంటి రాజీ లేకుండా, ప్రస్తుత తరాల అవసరాల్ని తీర్చగలిగే అభివృద్ధే'' మన్నికైన అభివృద్ధిగా నిర్వచిస్తున్నారు. మన్నికను విస్తృతార్ధంలో భరించగల సామర్ధ్యంగా చెప్పుకుంటాం. అందువలన పర్యావరణ పరిరక్షణ, సామాజిక, ఆర్ధికాభివృద్ధులు ''మన్నికయ్యే అభివృద్ధి''కి మూడు మూలస్థంభాలుగా ఉన్నాయి. ఇవి పరస్పరాధారితాలై, వాటి సమన్వయ సాధనే మానవ మనుగడ లక్ష్యాలుగా మారుతున్నాయి. మన్నికయ్యే వ్యవసాయం, మన్నికయ్యే పరిశ్రమలు, మన్నికయ్యే ఆర్ధికాభివృద్ధులు, పర్యావరణ పరిరక్షణకు లోబడి జరిపే సమిష్టి సాధనే ''మన్నికైన అభివృద్ధి'' అవుతుంది.

అవాంతరాలు: మన్నికయ్యే అభివృద్ధి కార్యాచరణ రూపొందినా పెట్టుబడిదారీ విధాన చట్రంలో ఆచరణలో అది సఫలీకృతమవటం లేదు. ఒక వైపు ద్రవ్యపెట్టుబడి ఆధిపత్యంలోని నయా ఉదారవాద విధానాలు సామాజిక, ఆర్ధిక అంతరాల్ని తీవ్రంగా పెంచుతుండగా, మరోవైపు శిలాజ ఇంధనాల విచక్షణా రహిత వినియోగం పర్యావరణ ముప్పుకు కారణమవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల్ని పెంచుతున్నది. లాభార్జనే ధ్యేయంగా సంపన్న దేశాలు, సంపన్న వర్గాలు బాహాటంగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియల మూలకంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం, ఇంధన సంక్షోభం, ద్రవ్య సంక్షోభం, ఆర్ధిక మాంద్యం, పర్యావరణ సంక్షోభాలు విలయతాండవం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 9 కోట్ల జనాభా పెరుగుతూ, 96.3 కోట్ల మంది ఆకలితో, పౌష్టికాహార లేమితో అలమటిస్తున్నారు. మన్నికయ్యే అభివృద్ధిలో వ్యవసాయాభివృద్ధికి, గ్రామీణాభివృద్ధికి సముచిత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం అనివార్యమయింది.

Thursday, November 5, 2009

MIGRATION & INDIA

మానవ వలసల తీరుతెన్నులు

ప్రపంచవ్యాప్తంగా మానవ వలసలపై ఉండే ఆంక్షల్ని, అవరోధాల్ని సడలించాలనే ప్రతిపాదనను సమర్థించే దిశలో మానవాభివృద్ధి నివేదిక 2009 మరో రెండు కారణాలని ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్త జనాభా విస్తరణ, పర్యావరణ మార్పుల ప్రభావాలు మానవ వలసల అనివార్యతను నొక్కిచెప్తున్నాయి.

1) జనాభా విస్తరణ: 2050లోగా ప్రపంచ జనాభా ఇప్పటికంటే 1/3వ వంతు పెరిగే అవకాశాలున్నాయి. ఈ పెరుగుదల అభివృద్ధి చెందిన దేశాలలో 2020 నాటికి గరిష్ట స్థాయికి చేరి, ఆతరువాత కాలంలో 7% పతనమయ్యే ప్రమాదమున్నదని నివేదిక చెప్తున్నది. ప్రపంచ జనాభాలో ఆఫ్రికా దేశాల్ని మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా 15 సం||ల లోపు పిల్లల కంటే, 60 సం||లు పైబడ్డ వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2050 నాటికి ప్రపంచంలో పని చేయగలిగే వారి సంఖ్య 1.1 బిలియన్‌లు పెరగవచ్చు. ప్రస్తుత వలసల స్థాయి కొనసాగితే 2050 నాటికి అభివృద్ధి చెందిన దేశాలలో పని చేయలేని వారు 71% ఉండవచ్చునని, వలసలను నిరోధిస్తే ఈ శాతం 78కి పెరగవచ్చునని నివేదిక అంచనా వేస్తున్నది. దీన్ని అధిగమించటానికి ఎంత శాస్త్ర,సాంకేతికాభివృద్ధి సాధించినా, మానవ శ్రమశక్తి డిమాండ్‌ అనివార్యంగా పెరిగి, 19వ శతాబ్ధంలోలాగా వలసలకు ప్రోత్సాహకాలనివ్వాల్సిన అగత్యం ఏర్పడుతుందని నివేదిక హెచ్చరిస్తున్నది.

2) పర్యావరణ మార్పు: గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలలు సృష్టించే సవాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా రానున్న కాలంలో 200 మిలియన్‌ల నుండి 1 బిలియన్‌ వరకు ప్రజానీకం సమస్యాత్మక ప్రాంతాల నుండి రక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపధ్యంలో మానవ వలసలపై అంతర్జాతీయ సడలింపులు తప్పనిసరి అవుతాయని నివేదిక అభిప్రాయపడుతుంది.

వలసల వల్ల ప్రయోజనాలు పొందుతున్న వలస ప్రజలు, వారి దేశాలు: మానవాభివృద్ధి పరిశోధనల్లో సంపన్న దేశాలలోని వలస ప్రజల మానవాభివృద్ధి, వారి సొంత దేశాలలో మానవాభివృద్ధికంటే 24% ఉంది. వలస ప్రజలలో మహిళలు అత్యధిక నిధుల్ని స్వంత దేశాలకు పంపుతున్నారు. వలస ప్రజల వల్ల వర్ధమాన దేశాలకు అభివృద్ధి చెందిన దేశాల నుండి 2008లో 308 బిలియన్‌ డాలర్ల నిధి బదిలీ అయ్యింది.

ఆర్ధికమాంధ్యం కారణంగా 2009లో ఈ నిధులు 293 బిలియన్‌ డాలర్లకు పడిపోవచ్చు. అభివృద్ధి దేశాలకు తరలి వస్తున్న వలస ప్రజల విదేశీ మారక ద్రవ్యం ఆయా దేశాల 'అధికారిక అభివృద్ధి సహాయనిధి'కి 4 రెట్లు ఉంది. వలస ప్రజల కుటుంబాలలో బాల కార్మికుల సంఖ్య తగ్గటంతోపాటు శిశు మరణాల శాతం, స్కూళ్ళకు వెళ్ళే పిల్లలలో డ్రాపౌట్‌ల శాతం తగ్గాయి. వలస ప్రజల కుటుంబాలు ప్రత్యేకించి మహిళలు స్థానిక సంస్థలలోను, రాజకీయ, సామాజిక రంగాలలోనూ భాగస్వామ్యం కావటం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో అంతర్గత వలసల వల్ల గృహసంబంధ పేదరిక రేటు 2001-02 నుండి 2006-07కు 50శాతంకు తగ్గింది. ఇండోనేషియాలో 50శాతం గృహాల్లో వలస ప్రజలు ఉన్నారు. వారిలో పేదరిక రేటు 34 నుండి 19 శాతానికి తగ్గింది. పై విధంగా వలస ప్రజలు కొన్ని కోణాల్లోనైనా అవకాశాల్ని పెంచుకొని ప్రయోజనాల్ని పొందుతున్నారు.

ఈ ప్రయోజనాలు అందరిలో సమానస్థాయిలో లేవు. వ్యక్తులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులు, స్వదేశీ, ఆతిధ్య దేశాల్లోని ప్రభుత్వాల విధానాలు ఈ ప్రయోజనాల్ని తగ్గించేస్తున్నాయి. అసమానతలు పెరుగుతున్నాయి. ఘర్షణ, అక్రమ మానవ రవాణాల్లోని ప్రజలు ప్రపంచ వలస ప్రజల్లో అతిస్వల్ప సంఖ్యగా ఉన్నా ప్రపంచ సభ్యతకు ఈ పరిణామాలు కళంకంగానే ఉన్నాయి. వలస ప్రజల అభివృద్ధికి అవరోధాల్ని నివారించగలిగితే వలస ప్రజల మానవాభివృద్ధిలో గణనీయమైన ప్రగతిని సాధించగలమని మానవాభివృద్ధి నివేదిక 2009 గట్టిగా నమ్ముతున్నది.

వలసల వల్ల ఆతిధ్యదేశాలు పొందుతున్న ప్రయోజనాలు: గత 50 సం||లుగా అభివృద్ధి చెందిన దేశాలలో వలస ప్రజల సంఖ్య పెరుగుతూనే ఉంది. అతిథ్య దేశాల అభివృద్ధిలో వలస ప్రజల పాత్ర అనేక దశల్లో కీలకంగా మారింది.

వలస ప్రజల్లో 1 శాతం పెరిగితే, ఆ దేశ స్థూలదేశీయోత్పత్తి 1 శాతం పెరుగుతుందని నివేదిక విశ్లేషిస్తున్నది. పర్షియన్‌ గల్ఫ్‌ దేశాలలో వలస ప్రజలు ఆదేశ స్థూలదేశీయోత్పత్తిని పెంచటంలో ముందున్నారు. ప్రత్యేకించి ఖతర్‌ దేశంలో ప్రతి ఐదుగురిలో నలుగురు వలస ప్రజలే. ఆ దేశాభివృద్ధి వీరిపైనే ఎక్కువ ఆధారపడి ఉంది. 1950 నుండి 2000 వరకు అమెరికా విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న విదేశీయులు స్థానిక ప్రజల సృజనాత్మకతను దెబ్బతీయకుండా తలసరి పేటెంట్ల సాధనలో 15 శాతం అభివృద్ధిని సాధిస్తున్నారు. అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 40 మిలియన్‌ల మంది వలస ప్రజలు నివశిస్తున్నారని నివేదిక చెప్తున్నది.

వలసలపై మానవాభివృద్ధి నివేదిక 2009 ప్రతిపాదించిన కార్యాచరణ-ఎజెండా: ఈ నేపథ్యంలో మానవాభివృద్ధి నివేదిక ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్‌లో కీలకంగా మారనున్న వలస ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చటం కోసం ఈ క్రింది ఎజెండాను ప్రపంచ దేశాల ముందు పరిశీలనకు సమర్పించింది.

అంశాలు:1) నైపుణ్య కార్మికులను తీసుకుంటున్న ప్రస్తుత స్థాయికి మించి అల్ప నైపుణ్య కార్మికుల్ని పనిలోకి వివిధ దేశాలు తీసుకోవాలి. 2) వలస ప్రజలందరికి ప్రతి దేశం విద్య, వైద్యం, ఓటు హక్కులాంటి ప్రాథమిక సేవలను పొందగలిగే ప్రాథమిక మానవహక్కులను కల్పించాలి. 3) వలస ప్రజల రవాణా, లావాదేవీల వ్యయాన్ని తగ్గించాలి. 4) అతిథ్య దేశాలకు, వలస ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పరిష్కార మార్గాలు వెతకాలి. 5) అంతర్గత వలసల ద్వారా పొందుతున్న ప్రయోజనాల్ని విస్తృత పర్చాలి. 6) వలసలు ఆయా సొంత దేశాల అభివృద్ధి వ్యూహాలలో ఒకటిగా చేర్చాలి.

వలసలు-భారతదేశం: మన దేశంలో 42 మిలియన్‌ల అంతర్గత వలస ప్రజలు ఉన్నారని నివేదిక చెప్తున్నది. వీరిలో 21 మిలియన్‌లు అభివృద్ధి పేర నిర్వాశితులైన ప్రజలే. మన దేశంలో విదేశీ వలస ప్రజలు మన జనాభాలో 0.5శాతమే. వీరిలో 48.6 శాతం మహిళలు. విదేశాలలో ఉన్న మన దేశ వలస ప్రజలు మన జనాభాలో 0.8 శాతం(2000-02). అంతర్జాతీయ మానవ చలనాలు 1.4 శాతం(2000-02)గా ఉన్నాయి. మన దేశం నుండి వెళ్ళిన వలస ప్రజలలో అత్యధిక మానవాభివృద్ధి దేశాల్లో 47.9శాతం, అధిక మానవాభివృద్ధి దేశాల్లో 20.4శాతం, మధ్యస్థాయి మానవాభివృద్ధి దేశాల్లో 30.7శాతం, అత్యల్ప మానవాభివృద్ధి దేశాల్లో 1శాతం ఉన్నారు.మన దేశం నుండి సంపన్న దేశాలకు వలస వెళ్ళిన వారిలో అధిక విద్యార్హతలు కలిగిన వారు 51.2 శాతం ఉన్నారు.

భారతదేశానికి వలస ప్రజల నుండి వస్తున్న ఆదాయం 35, 262 మిలియన్‌ డాలర్లు. ఇది స్థూలదేశీయోత్పత్తిలో 3.1శాతం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిష్పత్తిలో 1.5 ఉంది. ఈ నిధుల్లో 58.26శాతం ఆసియా నుండి, 26.9 శాతం ఉత్తర అమెరికా నుండి, 12.8 శాతం యూరప్‌ దేశాల నుండి వస్తున్నాయి.

ముగింపు: ప్రపంచ జనాభాలో అంతర్జాతీయ వలస ప్రజలు 3 శాతం ఉంటే మన దేశంలో 0.5శాతం ఉన్నారు. దీన్ని బట్టి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, విదేశీయులను ఆకర్షించగల స్థాయిలో మన దేశాభివృద్ధి లేదని విదితమవుతుంది. అదే సమయంలో మన దేశం నుండి విదేశాలకు వలస వెళ్ళే ప్రజల శాతం కూడా ప్రపంచ సగటు కంటే(3శాతం) తక్కువగా ఉంది. భారతదేశంలోని పేద ప్రజానీకం అంతర్జాతీయ వలస ప్రయోజనాల్ని పొందలేకపోవటంగా ఈ పరిణామం తెలియచెప్తుంది. అత్యధిక విద్యార్హతలు కలిగిన వారికి స్వదేశంలో అవకాశాల్లేక విదేశాలకు వెళ్ళటంగా పై గణాంకాలు తెలియచేస్తున్నాయి.